చెంచల్ గూడ చెరశాలలో గాలి

కర్ణాటక మాజీమంత్రి,  ఎమ్మెల్యే గాలి జనార్థన్‌ రెడ్డిని పోలీసులు చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ఓబులాపురం  మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం (మే7) గాలి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం గాలి జనార్ధనరెడ్డి సహా ఐదుగురినీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్ గుడా జైలుకు తరలించారు. అంతకు ముందు తుది తీర్పునకు ముందు.. తాను ఇప్పటికే నాలుగేళ్ల జైలు జీవితం అనుభవించాననీ, దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలనీ కోరారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. మీ నేరాలకు యావజ్జీవ శిక్షకు అర్హులు అని వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్ కేసులో పదేళ్ల జైలు ఎందుకు విధించకూడదో చెప్పండంటూ ప్రశ్నించింది. అనంతరం ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.   గతంలో ఇదే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు కోసం ఏకంగా న్యాయమూర్తికే ముడుపులు ఇచ్చారు. అప్పట్లో కూడా చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు వచ్చేలా సమీపబంధువు మధ్యవర్తిత్వంతో న్యాయమూర్తికి  వంద కోట్టు ముడుపులు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ మేరకే గాలి జనార్దన్ రెడ్డికి అప్పట్లో బెయిలు లభించింది. అయితే ఈ కేసులో అప్పటి న్యాయమూర్తి పట్టాభిరామారావు కూడా అరెస్టయ్యారు. 

ఆప‌రేష‌న్ సింధూర్.. పీవోకేలోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు

భారత్ అన్నంత ప‌నీ జ‌రిగింది. పహల్గాం ఉగ్రదాడికి త‌ప్ప‌క బ‌దులు తీర్చుకుంటాని ప్ర‌క‌టించిన భార‌త సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది.  మంగ‌ళ‌వారం (మే6)  అర్ధ‌రాత్రి దాటిన తరువాత ఒంటిగంట న‌ల‌భై నాలుగు నిమిషాల స‌మ‌యంలో ఒక్క‌సారిగా పీవోజేకేలోని ఉగ్ర శిబిరాల‌పై బాంబుల వర్షం కురిపించింది.   ఇప్ప‌టికే బిక్కు బిక్కుమ‌ని బ‌తుకుతున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త వైమానిక ద‌ళాల దాడుల‌తో  దిమ్మ తిరిగిపోయింది. పాక్ లోని ఉగ్ర వాదులుండే స్థావ‌రాల‌ను   ఖ‌చ్చితంగా టార్గెట్ చేసిన భార‌త సైన్యం.. దుమ్ము రేపింది. మొత్తం 9 ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త ఆర్మీ మెరుపు దాడులకు పాల్ప‌డింది.  ఈ దాడి ఉగ్రస్థావరాలపైనే కానీ పాకిస్థాన్ సైనిక స్థావ‌రాల‌పై కాదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.    ముఖ్యంగా ల‌ష్క‌రే తోయిబా హెడ్ క్వార్ట‌ర్ మురిడ్కే, జైష్ ఏ మ‌హ‌మ‌ద్ కేంద్ర స్థానం బ‌హ‌వ‌ల్పూర్ లో ఈ దాడులు జ‌రిపింది. పాక్ ఆర్మీ సైతం ఈ దాడులు జ‌రిగిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ దాడులలో పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరింత మంది గాయపడ్డారు. అయితే పాక్ ఆర్మీ మాత్రం ముగ్గరు మృతి చెందగా, 12 మంది క్షతగాత్రులయ్యారని ప్రకటించింది. ఇదిలా ఉంటే బుధవారం (మే 7)  దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ న‌డుపుతున్న వేళ‌.. పాకిస్థాన్ ఆక్ర‌మిత జ‌మ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావ‌రాల‌పై భార‌త్ మెరుపు దాడి చేయ‌డం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేసిన ఈ దాడులపై  ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్   భార‌త్ మాతాకీ జై అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భార‌త సైన్యం   న్యాయం జ‌రిగింది. జైహింద్ అని ట్వీట్ చేసింది.   అయితే ఇదే దాడి అంశంపై పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్‌.. సైతం స్పందించారు. మోస‌పూరితంగా శ‌తృవు త‌మ‌పై దాడి జ‌రిపింద‌నీ.. ఈ దాడికి బ‌దులు చెబుతామ‌ని ప్ర‌క‌టించారు.  ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌రిహ‌ద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జ‌రిపింది. దీన్ని స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పి కొట్టారు భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారు. 

పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలు లక్ష్యంగా మెరుపు దాడులకు దిగింది. బుధవారం (మే7)   పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సేనలు మిస్సైల్ దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ సర్జికల్ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల అనంతరం న్యాయం జరిగింది. జై హింద్ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్ప్ వేదికగా పోస్టు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ లో పీవోకే లోని కొట్టి, ముజఫరాబాద్, బహవల్ పూర్ సహా మరికొన్ని ప్రదేశాలపై భారత్ సేనలు క్షిపణి దాడులు జరిపాయి. ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించాయ. పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్‌పూర్‌తో పాటు లాహోర్‌ లోని ఒక ప్రదేశంపై భారత్‌ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా 'ఎయిర్‌ టు సర్ఫేస్‌' మిసైళ్లను ప్రయోగించారు.   పహల్గాం దాడిలో అమానుషంగా అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరుల అంతమే లక్ష్యంగా జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ లో మొత్తం 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆర్మీ పేర్కొంది. ఈ సర్జికల్ స్ట్రైక్ లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.    

మిస్ వరల్డ్ పోటీలకు ఉచిత ఎంట్రీ పాసులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

  హైదరాబాద్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే  72వ మిస్ వరల్డ్-2025 పోటీలకు  కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించింది. టూరిజం శాఖ అధికారిక అధికారిక వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని అధికారులు తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అందాల పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 దేశాలకు చెందిన సుందరీమణులు తరలిరానున్నారు. పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ పేర్కొంది చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో 'మిస్ వరల్డ్-2025' పోటీలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న అన్నిరకాల తోపుడుబండ్ల దుకాణాలను తొలగిస్తున్నారు. రెండు రోజుల క్రితం చిరు వ్యాపారులతో సమావేశమైన పోలీసు అధికారులు, పోటీలు ముగిసే వరకు దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో చార్మినార్ వద్ద వ్యాపారులు ఈ రోజు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో కూడా పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్

  ఏపీలో రేషన్ కార్డులు లేని వారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  రేపటి (మే 7) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీంతో పాటు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునేందుకు కూడా వీలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో సభ్యుల చేరిక, తొలగింపు, చిరునామా మార్పులు, కార్డుల విభజన వంటి సవరణలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులలో మార్పుల నిమిత్తం ఇప్పటికే 3.28 లక్షల దరఖాస్తులు అందాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన మార్పులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.   క్యూఆర్ కోడ్‌తో  స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గత ఆరు నెలల రేషన్ తీసుకున్న వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల తెలియజేశారు. అర్హులైన పౌరులు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూన్ నెల నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 95 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న వారు కార్డుల్లో మార్పుల కోసం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

12 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. కోర్టు తీర్పుపై సబితా ఇంద్రారెడ్డి ఎమోషనల్

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన  ఓబులాపురం మైనింగ్‌ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై  మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, పన్నెండున్నరేళ్ల క్రితం ఈ కేసు విషయంలో కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను. ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను ఈ కేసులో చేర్చడం తీవ్రంగా బాధించిందన్నారు. అయితే, న్యాయవ్యవస్థ ద్వారా నాకు తప్పక న్యాయం జరుగుతుందని మొదటి నుంచి నమ్మాను. ఈ రోజు ఆ నమ్మకమే నిజమైంది" అని సబితా ఇంద్రారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు.  ఇన్నేళ్లుగా నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలిగా చిత్రీకరించారు. జైలుకు వెళతానని దుష్ప్రచారం చేశారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. అయినప్పటికీ, నా జిల్లా ప్రజలు, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నా వెన్నంటే నిలిచారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా వాటిని నమ్మకుండా నాకు మద్దతుగా నిలిచి నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఈ కష్టకాలంలో నాతో పాటు ఉండి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్‌ కృపానందంలకు కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

హైదరాబాద్‌లో రేపు మాక్‌డ్రిల్ ..సైరన్‌ మోగితే సమప్తం బంద్‌

    హైదరాబాద్ నగరంలో రేపు సాయంత్రం  4 గంటలకు ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్, కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీ‌లలో ఈ భద్రతా విన్యాసాలు ఏకకాలంలో జరగనున్నాయని రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగ్రదాడులు జరిగినప్పుడు పౌరుల ఆత్మరక్షణకు ఎలా చేసుకోవాలని అనేది కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.మొత్తం 259 సున్నిత ప్రదేశాలలో ఈ మెగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది.  ఈ మాక్ డ్రిల్స్ నిర్వహణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు కేటగిరీ-2లో ఉన్నాయి. దేశంలో నెలకొన్న భద్రత పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో రేపు కీలక భద్రతా విన్యాసాలు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు.     

ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో అబ్దుల్ కలాం విగ్రహాలు

  వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ  ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ...పదేళ్లుగా దేశ వ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.  అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ‘గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్’ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం అని, రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారని కొనియాడారు. అబ్దుల్ కలాంతో తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, సంస్థ సభ్యులు శివ, భాస్కర్, శ్రీను, రంజిత్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.  

మైనింగ్ మాఫియా డాన్ గాలికి ఏడేళ్ల జైలు

ఎట్టకేలకు మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్థనరెడ్డి పాపం పండింది. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ( మే 6) తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం దాదాపు 15ఏళ్ల తర్వాత ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.  ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డి,  బీవీ శ్రీనివాసరెడ్డి,  మెఫజ్‌ అలీఖాన్‌, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురికి ఏడుళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం లభించింది. ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్‌తో రూ.వేల కోట్లు సంపాదించి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిన గాలి జనార్దన్‌రెడ్డికి చివరకు ఇదే ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఉచ్చు బిగుసుకుంది.  ఓబులాపురంలో సాగించిన  అక్రమాలు నిజమేనని సీబీఐ కోర్టు తేల్చింది. ఈ కేసులో ఏ1 బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్‌, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 కె.మెఫజ్‌ అలీఖాన్‌లను దోఖషులుగా తేల్చి కోర్టు.. ఏ8 కృపానందం, ఏ9 సబితా ఇంద్రారెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది.  ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. ఏ6గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని 2022లో కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జి చేసింది.  దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కుంభకోణాల్లో ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ఒకటి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇనుప ఖనిజ తవ్వకాలలో జరిగిన అక్రమాలకు సంబంధించింది. ఈ స్కామ్ ప్రధానంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీతో ముడిపడి ఉంది. దీనిని రెడ్డి సోదరులు.. గాలి జనార్థన రెడ్డి, గాలి కరుణాకర రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి నడిపించి మైనింగ్ డాన్లుగా ప్రసిద్ధి చెందారు. వీరు కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. ఈ కుంభకోణంలో బళ్లారి , అనంతపురం ప్రాంతాలలో అక్రమ ఖనిజ తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అటవీ భూములలో అనుమతి లేకుండా ఇనుప ఖనిజాన్ని తవ్వినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతించిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి 29.30 లక్షల టన్నుల ఇనుము ఖనిజాన్ని ఓఎంసీ సంస్థ అక్రమంగా తవ్వినట్లు సీబీఐ ఆరోపించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ.. 2007-2010 మధ్య దాదాపు 60 లక్షల టన్నుల ఇనుము ఖనిజం అక్రమంగా తవ్విందని సీబీఐ అభియోగాలు మోపింది. దీని విలువ దాదాపు రూ. 42,000 కోట్లు ఉంటుందని చార్జిషీట్ లో పేర్కొంది. కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే 2011లో సమర్పించిన నివేదిక ప్రకారం.. ఖనిజ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. జీరో రిస్క్ సిస్టమ్అనే రక్షణ, దోపిడీ వ్యవస్థను సృష్టించి గాలి జనార్థన రెడ్డి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు పేర్కొంది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుబంధంగా ఉన్న జీఎల్ఏ ట్రేడింగ్  జీజేఆర్ హోల్డింగ్స్ వంటి గాలి జనార్థన్ రెడ్డి సోదరుల సంస్థలు.. అక్రమ తవ్వకాల ద్వారా వచ్చిన సొమ్మును విదేశీ కంపెనీలకు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎగవేయడంతో పాటు ఆదాయాన్ని దాచిపెట్టి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గాలి జనార్థన్ రెడ్డి సోదరులపై అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సిఫార్సు మేరకు 2009లో సీబీఐ ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభించింది. రెండేళ్ల విచారణ అనంతరం 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్థన రెడ్డి, అతని బావ బీ.వీ. శ్రీనివాస రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అలాగే ఈ కుంభకోణం కేసులోమాజీ ఐఏఎస్ అధికారి వీ.డీ. రాజగోపాల్,  ఏపీ ఇండస్ట్రీస్ మాజీ కార్యదర్శి వై. శ్రీలక్ష్మిని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఓబులాపురం కంపెనీకి ప్రాధాన్యత ఇచ్చి ఇతర దరఖాస్తుదారులకు లైసెన్సులు నిరాకరించినట్లు రాజగోపాల్ ,  శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఓబులాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి 2015లో జనార్థన రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు పూర్తయ్యాయి.

ఏపీలో బేబీ కిట్ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించిన కూటమి ప్రభుత్వం

  వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్లు పథకాన్ని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11 వస్తువులతో దోమ తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాష్ బుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్, బేబీ రాటిల్ టాయ్ కూడిన ప్రతి కిట్ కు రూ.1,410లు ఖర్చు అవుతుంది. గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ కింద కొంత మేర‌కు కేంద్ర సాయం అందేది.  ఈ సాయాన్ని ఇప్పుడు ఎన్డీయే సర్కార్ నిలిపివేసింది.  మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్ల సరఫరాకు కేంద్ర ప్ర‌భుత్వ సాయం ల‌భించే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఈ ప‌థ‌కానికి అవ‌స‌ర‌మైన నిధుల్ని కూటమి సర్కార్ నిధుల‌నుంచే అంద‌జేయాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌లో జ‌రిగి ప్ర‌స‌వాల్లో స‌గానికి పైగా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయి. 

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి దోషి.. సీబీఐ కోర్టు తీర్పు

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా  తేల్చింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఎఎస్ కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో మంగళవారం ( మే6)న సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో   గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బంధువు బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెఫజ్ అలీఖాన్,  గనుల శాఖ అప్పటి  డైరెక్టర్ వి.డి. రాజగోపాల్  సహా ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా నిర్ధారించింది.   ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో   మొత్తం తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. వారిలో లింగయ్య అనే వ్యక్తి మరణించగా, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని   హైకోర్టు 2022లోనే నిర్దోషిగా ప్రకటించింది.  మిగిలిన ఏడుగురిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ అధికారి కృపానందంలను సీబీఐ కోర్టు నిర్దోషులుగా చేర్చింది. కాగా దోషులుగా తేల్చిన వారికి కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.  దాదాపు   884 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారంటూ ఓఎంసీపై ఆ చార్జిషీట్ లో సీబీఐ పేర్కొంది. అప్పటి నుంచీ ఈ కేసు సాగుతూనే ఉంది. మొత్తం 219 మంది  సాక్షులను విచారించిన సీబీఐ 3,400 డాక్యుమెంట్లలతో  సీబీఐ 2011లో చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

  రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసి సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌లో ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కమిటీ చర్చలు జరిపి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.   

హీటెక్కిస్తున్న కులగణన రాజకీయం!

కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చుట్టూ రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుండగా, దీనిని ఎన్నికల్లో ఎలా ప్లస్ పాయింట్ గా మార్చుకోవాలన్న విషయంపై రెండు పార్టీలూ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.  నిజానికి నార్త్ ఇండియా దగ్గర్నుంచి సౌత్ ఇండియా వరకూ కులాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతుంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్ గెలుపోటములపై ఎఫెక్ట్ చూపుతుంటాయి. ఇప్పుడు ఈ కులగణన మైలేజ్   తమ ఘనతే అని చెప్పుకునేందుకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి.  కులగణనకు తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. సీడబ్ల్యూసీలోనూ తెలంగాణ మోడల్ నే కేంద్రం పరిగణలోకి తీసుకుని జనాభా లెక్కల సమయంలో ఉపయోగించాలని తీర్మానించింది.  అయితే ఇది బీజేపీకి ఏమాత్రం రుచించడం లేదు. అసలు రాష్ట్రాలకు కులగణన చేసే హక్కే లేనప్పుడు, అది చట్టబద్ధమే కానప్పుడు.. దాన్నెలా రోల్ మోడల్ గా తీసుకోవాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తేగానీ, ఇన్నాళ్లూ కులగణనపై నిర్ణయం తీసుకోని బీజేపీ ఇప్పుడు నిర్ణయం తీసుకుని రాజకీయం చేయడమేంటని కాంగ్రెస్ గరమవుతోంది.  కులగణన, సర్వేకు మధ్య తేడా ఏంటో అందరికీ వివరించాలని, ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని తెలంగాణ బీజేపీ ప్రచారం చేసేందుకు డిసైడ్ అయింది. కులగణన క్రెడిట్ ఏ మాత్రం  హస్తం పార్టీకి వెళ్లకుండా ఇప్పటి నుంచే బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. అసలు ఉన్నట్లుండి కేంద్రమంత్రి వర్గం కులగణన చేయాలని నిర్ణయించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ కూడా పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. నిజానికి అక్కడ కుల రాజకీయాల జోరు చాలా ఎక్కువగా ఉంటుంది. 2023లో కుల గణన జరిపి, దాని ఆధారంగా రిజర్వేషన్ కోటాను పెంచే ప్రయత్నం చేసినా కోర్టుల్లో అడ్డుకట్ట పడింది. దీంతో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న తమ నినాదానికి కులగణనతో పరిపూర్ణత చేకూరుతుందని బీజేపీ  లెక్కలు వేసుకుంటోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పై పై చేయిసాధించాలంటే ఇంతకు మించి ప్లాన్ చేయాల్సిన పరిస్థితి.  బిహార్‌లో 36% అత్యంత వెనుకబడిన వర్గాలు , 27.1% మంది BCలు ఉన్నారని,  2023 కులగణన వెల్లడించింది. అటు 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కులగణన చుట్టూ గేమ్ నడిపేలా పొలిటికల్ పార్టీల వ్యవహారం నడుస్తోందంటున్నారు. సో క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా బీజేపీ ఎన్ని ప్లాన్లు వేసినా.. తెలంగాణలో కులగణన చేసి నిజాయితీ, చిత్తశుద్ధి నిరూపించుకున్నామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో తామే నిజాయితీతో ఉన్నామంటున్నారు. సో కులగణన అజెండా కులమే బలంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్ ఇంపాక్ట్ చూపేందుకు రెడీ అవుతోంది. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నదే ఇప్పుడు హాట్ డిబేట్. కులగణన విషయంలో ఏ పార్టీని ఎక్కువగా నమ్ముతారన్న విషయంపైనే విజయావకాశాలు ఆధారప డ బోతున్నాయ్.

అంగన్ వాడీలకు తీపికబురు.. జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

  అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి వేతలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ అనే తేడా ఉండదు. కాగా, గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది.  పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది.  అయితే, శాలరీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్‌వాడీ టీచర్లు  హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్నికి వారు కృతజ్ఙతలు తెలిపారు.

అందాల పోటీలతో గ్లోబల్ అటెన్షన్ .. తెలంగాణ లక్ష్యం ఇదే!

సింగిల్ ఈవెంట్... 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్.. ఇదే తెలంగాణ సర్కార్ ప్లానింగ్. అవును 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేందుకు సిద్ధమైంది. సిటీలో సందడి షురు అయిపోయింది. విదేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించడం కాదు. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు.. వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలెట్ చేయడం,  ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉండేలా చేయడం కీలకం.  అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తొలిసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేలా రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసేసింది.   హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు కనీవినీ ఎరుగని విధంగా జరిపేలా డిజైన్ చేసింది.  ఈనెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉండబోతోంది. అటు అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.  ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ విమా నాశ్రయం వస్తున్న సుందరీమణులకు టూరిజంశాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సెలబ్రిటీల సందడితో శంషాబాద్ పరిసరాల్లో జోష్ పెరిగింది. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్, 3 స్టార్‌ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్‌ చేశారు. అంతే కాదు.. టూరిజం శాఖ తరఫున పోటీదారులకు అందించేందుకు ఫుల్ డిటైల్స్ ఉన్న బుక్‌లెట్‌ను రెడీ చేస్తున్నారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాల్లో బ్యూటిఫికేషన్   ఫైనల్ స్టేజ్ కు వచ్చింది.   మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి.. దగ్గరుండి పర్యవే క్షిస్తున్నారు. ఏప్రిల్ 29న సీఎం సమీక్ష   నిర్వహించారు. అక్కడితో ఆగకుండా.. నిరంతరం పనులు సాగుతున్న తీరును, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  మే 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలూ, సలహాలూ ఇస్తున్నారు.   మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లు కేవలం  కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు పరిమతమయ్యేలా కాకుండా,  షెడ్యూల్ ప్రకారం వారిని తెలంగాణలోని అన్ని టూరిజం స్పాట్లకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.    మే 12న హైదరాబాద్ చారిత్రక, వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ప్రాంతంలో  హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అదే రోజు నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలిపేలా ఆధ్యాత్మిక పర్యటనకు తీసుకెళ్తారు. ఈనెల 13న హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ తీసుకెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంది.  ఇక మే 14న వరంగల్ లోని థౌజండ్ పిల్లర్ టెంపుల్, వరంగల్ పోర్ట్ కు తీసుకెళ్తారు. అదే రోజు రామప్ప ఆలయ సందర్శన కు కూడా తీసుకువెడతారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రత్యేకతలను వివరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన అరుదైన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న యాదగిరి గుట్ట ఆలయ సందర్శన ఉండనుంది. డివోషనల్ టూరిజంలో భాగంగా ఈ చోట్లకు తీసుకెళ్తారు. అదే రోజు గ్రూప్ 2లోని కంటెస్టెంట్లను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడ చేనేత తయారీ విధానాన్ని చూపుతారు. అలాగే  చేనేత వస్త్రాలతో వారు ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ  షో ఏర్పాటు చేశారు.  మే 16న వివిధ దేశాల నుండి చికిత్సల కోసం వచ్చే వారిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం ప్రోగ్రామ్ రెడీ చేశారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు హాజరవుతారు. తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే పరిస్థితిని వివరిస్తారు. 16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన, 17న రామోజీ ఫిలిం సిటీ సందర్శన, 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సేఫ్టీ టూరిజంపై డెమో ఇస్తారు. జ అదే రోజు సచివాలయం తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ చరిత్ర గురించి వివరించనున్నారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు తీసుకువెడతారు.  చివరగా ఈనెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించడంతో ఈ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా ముగిస్తారు. తద్వారా తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తెలంగాణ సర్కార్ చేసింది.

ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లాగనే చూస్తారు...కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి రాష్ట్ర పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్నికి అణా పైసా అప్పు పుట్టడం లేదని.. అప్పుల కోసం బ్యాంకుల వద్దకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇలా చెబితే ఎవరూ నమ్మడం లేదు.. కానీ పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉందని అన్నారు. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి సరైన పరిష్కారం అని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.   ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావుని కేటీఆర్ అన్నారు. నేను ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటుండు దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారని ఆయన విమర్శించారు.  రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని అన్నాడు.. నిన్న రూ.8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడు.పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని కేటీఆర్ క్లారీటీ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క..మీ లాగా కాకి లెక్క కాదని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని   కేటీఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు చివరిసారిగా చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

పొన్నవోలు అనుచరుడికి నామినేటెడ్ పోస్టు!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియమకాలు ఎలా జరుగుతున్నాయన్న అయోమయం నెలకొని ఉంది. వైసీపీ సానుభూతిపరులకు పదవులు కట్టబెట్టడం, ఆ తరువాత తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకుని ఆ పదవి నుంచి సదరు సానుభూతి పరుడిని పీకేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే ఒక న్యాయ వాదికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. అలా కట్టబెట్టిన ఒక రోజులోనే ఆ పదవి నుంచి ఆ న్యాయవాదిని పీకేసింది. ఎందుకయ్యా అంటే ఆ న్యాయవాది వైసీపీయుడు కావడమే. అసలు ఏదీ చూసుకోకుండా, ఎవరికి ఏ పదవి కట్టబెడుతున్నామన్నది తెలియకుండానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నియామకాలు జరుగుతున్నాయా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక ప్రహసనంగా మారిందా అంటే తాజా పరిణామాన్ని గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం, మిత్రపక్షాల నేతల కంటే వైసీపీ సానుభూతి పరులకే పెద్ద పీట వేస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. తాజాగా  ఒక న్యాయవాదిని ప్రభుత్వం కీలక నామినేటెడ్ పోస్టులో నియమించింది.  ఆ తరువాత  ఆ న్యాయవాది వైసీపీ సానుభూతిపరుడని పేర్కొంటూ కేటాయించిన నామినేటెడ్ పదవిని రద్దు చేసింది.   విషయంలోకి వెళితే.. వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన న్యాయవాది జి. దినేశ్ కుమార్ రెడ్డిని ఎస్‌పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఆపరేషన్ సర్కిల్ బోర్డు లీగల్ కౌన్సిల్ (బీఎల్‌సీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకంపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సదరు న్యాయవాది జగన్ హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పని చేసిన పొన్నవోలు అసిస్టెంట్ కావడమే. పొన్నవోలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆయన వైసీపీ నేతల కేసుల తరఫున వకాల్తా పుచ్చుకుని వాదిస్తుంటారు. అటువంటి పొన్నవోలు అసిస్టెంట్ దినేశ్ కుమార్ రెడ్డికి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడమేంటి? అంటే తెలుగుదేశం శ్రేణులు ఓ రేంజ్ లో ఫైరయ్యాయి.   వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి పేరిట అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం, వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ ఘటనలో చంద్రబాబు సహా వందలాది మంది టీడీపీ శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనల విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, దినేశ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అసలే పొన్నవోలు అసిస్టెంట్, ఆపై చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వాదించిన వ్యక్తికి ముందు వెనుకలు చూసుకోకుండా నామినేటెడ్ పోస్టు ఎలా కట్టబెట్టారన్న ఆగ్రహం, అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అయ్యింది.  దీనిపై తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. దీంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పార్టీ పరిశీలకులు శివరాం ప్రతాప్ ఈ వ్యవహారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన దీనిని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో దినేష్ కుమార్ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దినేష్ కుమార్ నియామకం రద్దును స్వాగతిస్తూనే తెలుగుదేశం శ్రేణులు అసలా నియామకానికి సిఫారసు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పారు్టీ అధిష్ఠానం కూడా ఇదే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.   

మోదీ సర్కార్ కొత్త యుద్ధం!

అవును. ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అన్నట్లు, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే వుంది. ఏప్రిల్ 22 న 26 మంది హిందువులను పొట్టన పెట్టుకున్న ఉగ్రదాడి కూడా నడుస్తున్న యుద్ధంలో  భాగమే. నిజానికి  పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాల్లో కంటే.. గత 30 – 40 ఏళ్లకు పైగా పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం, ఉగ్ర దాడుల వలన ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త యుద్దానికి తెరతీశారు. కొత్త  యుద్ద తంత్రాన్ని తెర మీదకు తెచ్చారు. అందుకే  సరిహద్దుల అవతలి శత్రువులకే కాదు, అంతర్గత శత్రువులకు కూడా కంటి మీద కునుకు ఉండడం లేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో అటు నుంచే కాదు ఇటు నుంచి  కూడా  సింధు జలాలను ఎలా ఆపుతారు? ఇప్పటికిప్పుడు డ్యాములు ఎక్కడ కడతారు? అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం  చేయడం ఏమిటి ? ఇది జల తీవ్ర వాదం కాదా? యుద్ధం ప్రభుత్వాలతో చేయాలి, సేనలు చేయాలి అంతే కానీ సామాన్య  ప్రజలను నీరు లేకుండా చేయడం ఏమిటి? ఇది మానవత్వం అనిపించుకుంతుందా? అంటూ  నిలదీసే వారు,  ప్రశ్నించే వారు ఆ  పని చేస్తూనే ఉన్నారు.  అయితే.. ప్రధాని మోదీ  వెయ్యేళ్ళ యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలనే దృఢ సంకల్పంతో, అడుగులు వేస్తున్నారు. దాయాది దేశం పేరున దశాబ్దాలుగా శత్రు దేశం పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్చన్న యుద్దాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు  వ్యూహాత్మక యుద్దాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగ ఇప్పటికే పలు  కీలక  నిర్ణయాలు తీసుకున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. మోడీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో యుద్ధం వస్తే దేశం వదిలి పారిపోతానని పాక్ మంత్రి బహిరంగంగా భయాన్ని వ్యక్త పరిచే స్థితికి తెసుకొచ్చిన మోదీ ప్రభుత్వం  శత్రు దేశం బలహీనతలు లక్ష్యంగా దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. అందులో భాగంగానే, జల యుద్ధానికి శ్రీకారం చుట్టింది.  ఉభయ తారకంగా  చీనాబ్ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది.  దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఇది  కీలక ముందడుగు అంటున్నారు పరిశీలకులు. ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్‌లో తన నదులపై హక్కులను బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి.. బర్సర్ డ్యామ్, కిరు డ్యామ్, కిర్థాయ్ డ్యామ్,   రాట్లే డ్యామ్,   పాకల్ దుల్ డ్యామ్, సావల్కోట్ డ్యామ్  ఉన్నాయి. ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌కు 10,000 మెగావాట్ల విద్యుత్తు అందనుంది. అంతేకాకుండా.. మైదాన ప్రాంతాలలో నీటిపారుదలతో పాటు గృహ వినియోగానికి సంబంధించి అధిక నీరు అందుబాటులోకి రానుంది. ఈ ఆరు ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సమావేశమై చర్చించిన విషయం విదితమే. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గతంలో పాకిస్థాన్‌తో జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని ఏప్రిల్ 24న నిలిపివేసింది. ఒక్క చుక్క నీరు సైతం దేశ సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించడానికి వీలు లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నదితో పాటు దాని ఉప నదుల ద్వారా పాకిస్థాన్‌లోని 80 శాతం వ్యవసాయానికి నీరందుతోన్న సంగతి తెలిసిందే. నిజానికి యుద్ధం అంటే తుపాకులు, ఫిరగులే కాదు  యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు మాత్రమే కాదు, శత్రువును అష్ట దిగ్బంధనం చేసి పలాయనం చిత్త గించేలా చేయడమే ఆధునిక యుద్ధ నీతి, ఆధునిక యుద్ద తంత్రం. మోదీ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ముందస్తు వ్యూహాలతో యుద్ద సన్నాహాలు సాగిస్తోందనీ, విశ్వాసంతో ముందుకు సాగుతోందని  యుద్ధరంగ నిపుణులు అంటున్నారు.