హస్తినలో పీవీ కాంస్య విగ్రహం

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహరావు కాంస్య విగ్రహం త్వరలో హస్తినలో ఏర్పాటు కానుంది. జీవిత కాలం కాంగ్రస్ తోనే పయనించి, ఈ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎదిగి.. దేశానికి ఎనలేని సేవలందించిన పీవీ నరసింహరావుకు ఎట్టకేలకు దేశ రాజధాని హస్తినలో ఒకింత చోటు, గుర్తింపు లభించనుంది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఈ మహా మేధావి.. కాంగ్రెస్ పార్టీకే ప్రత్యేకమైన రాజకీయాలు, అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీలో కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు. చివరాఖరికి ఆయన మరణించినప్పుడు, ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి హస్తినలో అంత్యక్రియలు కూడా జగరలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ కు ఆయన పార్ధివదేహాన్ని తరలించి.. అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ఇందుకు ఆయన విధానాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా విభేదించడమే కారణం. అంతెందుకు ప్రధానిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన ఆయనకు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇన్నేళ్లకు హస్తినలోని బీజేపీ ప్రభుత్వం ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.   పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పీవీ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్   ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్   ఆమోదం తెలిపింది. దీంతో అతి త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకొంచం వెనక్కు వెడితే.. గత ఏడాది ఏప్రిల్ లో పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్   పీవీ విగ్రహాన్ని హస్తినలోని ఆంధ్రా భవన్ లేదా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ కు లేఖ రాసింది.    ఈ లేఖపై ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్  ఈ ఏడాది మార్చి 27న జరిగిన సమావేశంలో చర్చించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కు పంపింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో త్వరలో పీవీ కాంస్య విగ్రహం హస్తినలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నది. .

రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌ భేటీ

  రాజ్ భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా భేటీ అయ్యారు. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌తో  సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.  ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో చర్చించిన సీఎం.. మిస్ వరల్డ్ 2025 వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం. దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల మధ్య హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తుండగా.. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా  జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు గవర్నర్‌‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.  

రాఫెల్ ఫెయిల్?.. పీఎల్ 15 హిట్?

పాకిస్థాన్ కి చైనా నిశ్శ‌బ్ధ సాయం ఎలా చేసింది? మ‌న  రాఫెల్ చైనా సాయంతో పాక్ కూల్చేసిందా? అస‌లు ఈ యుద్ధంలో చైనా దాని ఆయుధ పాత్ర ఏంటి? రాఫెల్ పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? టెలిగ్రాఫ్ క‌థ‌న  సారాంశ‌మేంటి? ఈ వ్యాసంపై వ‌స్తున్న అభ్యంత‌రాలు ఎలాంటివి? పాకిస్థాన్ భార‌త యుద్ధ విమానాలు కూల్చ‌డంలో చైనా పాత్ర ఎలాంటిద‌న్న‌దొక చ‌ర్చ‌. అయితే చైనా చాప కింద నీరులా పాకిస్థాన్ కి అందించాల్సిన సాయ‌మంతా అందిస్తోన్న‌ట్టు పెద్ద పెద్ద అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు, వాటిలోని రాత‌గాళ్ళ క‌థ‌నాల ద్వారా తెలుస్తోంది. మ‌న‌మెంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే రాఫెల్ యుద్ధ విమానాల‌ను చైనా సాయంతో పాక్ పేల్చేసిన ఘ‌ట‌న తాలూకూ క‌థ‌నాలు.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్త‌ంగా ర‌క్ష‌ణ వ‌ర్గాల వారిని అట్టుడికిస్తోంది. టెలిగ్రాఫ్ లో వ‌చ్చిన ఓ క‌థ‌నం మేరకు.. ఆ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కు ఒక అసాధార‌ణ ఘ‌ట‌న న‌మోద‌య్యింది. అది యుద్ధ భూమిలో కాదు.. దౌత్య ప‌ర‌మైన విష‌యంలో.  పాక్ లోని చైనా రాయ‌బారి రావ‌ల్పిండికి అత్య‌వ‌స‌రంగా ఫోన్ చేశారు. త‌ర్వాత కొన్ని గంట‌ల్లోనే భ‌రత వైమానిక బ‌లాన్నది బ‌ద్ధ‌లు కొట్టేసింది. భార‌త వైమానిక ద‌ళం రోజుల త‌ర‌బ‌డి స‌మావేశ‌మ‌వుతోంది. దాదాపు 180 విమానాలు ప‌శ్చిమ స‌రిహ‌ద్దులో కేంద్రీకృత‌మై ఉన్నాయి. ల‌క్ష్యం ఎంతో స్ప‌ష్టంగా ఉంది. బాలాకోట్ ను పున‌రావృతం చేయ‌డ‌మే టార్గెట్. పాకిస్థాన్ ర‌క్ష‌ణ గోడ‌ల‌ను విచ్చిన్నం చేయ‌డం.. వ్యూహాత్మాక ఆధిప‌త్యాన్ని పున‌రుద్ద‌రించ‌డం. కానీ యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. యుద్ధ విమానాలు ఎగిరే ఆకాశాలు కూడా ఎప్పుడూ నీలిరంగులోనే ఉండ‌వు. అప్పుడ‌ప్పుడూ త‌న రూపును షేపును.. మార్చుకుంటూ ఉంటుందా వార్ స్కై. భార‌త వైమానిక ద‌ళం ఎప్పుడూ ప్ర‌వేశ ద్వారాలు దాట లేదు. దాని అవ‌త‌ల ఏముందో వారికి ఎంతో స్ప‌ష్టంగా  తెలుసు.  చైనా J-10C ఫైటర్లు, అధునాత‌న PL-15 క్షిపణులు, 300 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగిన మాక్ 5 హంట‌ర్స్, షూట‌ర్ ఎవ‌రైనా త‌మ ప‌రిధిలోకి తేగ‌లిగే.. ఏరియల్ రాడార్లు.. బేసిగ్గా భార‌త్ కేవ‌లం పాకిస్థాన్ పైలెట్ల‌ను మాత్ర‌మే చూడ‌దు. ఇది స్కార్దు నుంచి ప‌స్నీ వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న చైనా వైమానిక సామ‌ర్ధ్యాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక త‌ప్ప‌దు.   అయితే చైనా ఇచ్చిన ఈ స‌పోర్టుతో సుమారు 250 మిలియ‌న్ల‌కు పైగా విలువైన ఒక రాఫెల్ ని గాల్లోనే కూల్చి వేసిన‌ట్టు స‌మాచారం. మ‌రొక‌టి అతి త్వ‌ర‌గా తిరిగి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. దీన్ని కాపాడ్డానికి ఉప‌యోగించే  స్పెక్ట్రా EW వ్యవస్థ సైతం నిర్వీర్య‌మైంది. PL-15 రాడార్‌తో రాలేదు. ఇది AI- గైడెడ్ సైలెన్స్ ద్వారా వచ్చిన‌ట్టు స‌మాచారం.  చైనా వార్ ఫేర్ కేవ‌లం స్కై, స‌ర్ఫేస్ ద్వారా మాత్ర‌మే సాగేది కాదు. దాని రేంజే వేరు. అది ఏకంగా స్పేస్ ద్వారా వార్ ని ఆప‌రేట్ చేయ‌గ‌ల‌దు. ఆ స్థాయికి ఎప్పుడో త‌న యుద్ధ విన్యాసాన్ని సిద్ధం చేసి ఉంచింది డ్రాగ‌న్ కంట్రీ. అందులో భాగంగా చైనా  ఉపగ్రహాలు, AWACS సహాయంతో పాకిస్తాన్ వైమానిక దళం సెన్సార్- ఫ్యూజన్ కిల్‌ను అమలు చేసింది. రాఫెల్స్‌కు ఎప్పుడూ ఈ దిశ‌గా సిగ్న‌ల్స్ రాలేదు, వారి ప్రత్యర్థిని కూడా అవి చూడ‌లేక పోయాయి. క్షిపణులు ఢీకొడుతున్న విష‌యం తెలిసే లోప‌లే క‌థ ముగిసిపోయింది. భార‌త్ కు ఒక విష‌యం స్ప‌ష్టంగా తెలుసు. ఒక రాఫెల్ ని ప‌డ‌గొట్ట‌గ‌లిగితే ఐదింటినీ కూడా ప‌డగొట్టొచ్చు. అందుకే వారు స‌రిహ‌ద్దుల‌కు మూడు వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్నారు. వారికి ధైర్యం లేక పోవ‌డం వ‌ల్ల కాదు.. అక్క‌డున్న స్థితిగ‌తుల మీదున్న అవ‌గాహ‌న వ‌ల్ల‌.   దీని ప్ర‌భావం ఏమంత త‌క్కువైన‌ది కాదు. ఇది భార‌త‌దేశ ప్ర‌తిష్టాత్మ‌క రాఫెల్, పాకిస్థాన్ జెట్ ప్ర‌యోగించిన ఒక చైనా క్షిప‌ణి దెబ్బ‌కు ప‌డిపోయిందంటే.. కేవ‌లం యుద్ధ వ్యూహం మాత్ర‌మే కాదిది.. ఒక భౌగోళిక రాజ‌కీయ సందేశం కూడా. బ్లూమ్‌బెర్గ్ వంటి కొంద‌రు నిపుణులు చెప్పేదాన్ని బ‌ట్టిచూస్తే ఇది చైనా పాక్ స‌మ‌గ్ర యుద్ధానికి ప్ర‌త్య‌క్ష ప్ర‌ద‌ర్శ‌న‌. ఈ చైనా మార్క్ వార్ స్ట్రాట‌జీకి పెద్ద పెద్ద పాశ్చాత్య యుద్ధ విశ్లేష‌కులు కూడా ఆశ్చ‌ర్య పోయారు. ఫ్రెంచ్ ర‌క్ష‌ణ ఒప్పందాలు ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డాయి. స‌రిగ్గా అదే స‌మ‌యంలో  చైనా చిరున‌గ‌వులు చిందిస్తోంది. మేమంతా నిశ్శ‌బ్ధంగానే చేస్తాం. మీలా సౌండ్ చేయం. అది మేమైనా మా పీఎల్ ఫిఫ్టీన్ త‌ర‌హా క్షిప‌ణులైనా.. అంతా సౌండ్ లెస్ అన్న మెసేజ్ పాస్ చేస్తోంది చైనా. వార్ గేమ్ మొత్తం మారిపోయేలాంటి సీన్. ఇది 2019 కాదు.. బాలాకోట్ దాడి స‌మ‌యం అంత‌క‌న్నా  కాదు. యుద్ధ వ్యూహం ఎంతో ముదిరిపోయిన 2025లో ఉన్నాం. నాటి నుంచి నేటి వ‌ర‌కూ మారిన ప్ర‌పంచ యుద్ధ నీతి అసాధార‌ణ‌మైన‌ది. ఇప్పుడు మ‌నం.. ఆయుధం క‌నిపిస్తుంది- కానీ శ‌తృవు క‌నిపించ‌ని మాయా యుద్ధాన్ని చూస్తున్నాం. వ‌చ్చే రోజుల్లో చైనా బేస్ చేసుకుని మ‌ల‌చ‌బ‌డుతోన్న వ్యూహంలో.. ఆయుధం, శ‌తృవు రెండు క‌నిపించ‌ని మ‌రింత మాయామేయ యుద్ధాన్ని చూడ‌బోతున్నాం.. అది వేరే సంగ‌తి. చైనీకృత‌మైన పాక్ వైమానిక స్థ‌లంలోకి ప్ర‌వేశించే సాహసం చేస్తే..  J-10Cలు, PL-15లు వేసే డెడ్లీ స్కెచ్ లోకి కోరి వెళ్ల‌డ‌మే అవుతుంది. ఈ విష‌యం భార‌త్ కి బాగానే తెలుసు.  కాబ‌ట్టి భార‌త్ త‌ప్ప‌క వెన‌క్కి త‌గ్గి తీరాల్సిందే అన్న సిట్యువేష‌న్. మా ఆయుధం అక్క‌ర్లేదు- భ‌యం చాలు అన్న‌ట్టుగా అటు వైపు ఆట  మొద‌లై పోయింది. రాడార్ అంధ‌త్వం, నిశ్శ‌బ్ధ వ్యూహం ద్వారా భార‌త్ ని క‌ట్టి  ప‌డేసింది చైనా అధీకృత పాక్ వార్ ఫీల్డ్.   ఇది భార‌త పైలెట్ల నైపుణ్య లేమికి సంబంధించిన ప‌రాజ‌యం కాదు. ఆ పైలెట్ యుద్ధ భూమిలో చూడ‌లేని ఒక గాడాంధ‌కారం కార‌ణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఇది ఉప‌గ్ర‌హ నిర్మిత యుద్ధం. సెన్సార్ల ద్వారా అనుసంధానించ‌బ‌డిన  యుద్ధం. అక్క‌డెక్క‌డో చైనాలో కూర్చుని ఆప‌రేట్ చేస్తే ఆ సిగ్న‌ల్ చైనా శాటిలైట్లు అందుకుని.. ఇక్క‌డి యుద్ధ‌ యంత్రాల‌కు ప‌ని చెబుతాయి. ఆ యంత్రాలు కంటికి  క‌నిపించ‌కుండా వ‌చ్చి.. ఢీ కొట్టేస్తాయి. ఇదీ ఇక్క‌డ అమ‌లు చేస్తోన్న అస‌లు సిస‌లైన యుద్ధ వ్యూహం.   2025 మేలో భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ యుద్ధంలో వార్ గేమ్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. 36 జెట్ ఫైట‌ర్ల కొనుగోలు ద్వారా భార‌త్ నిర్మించుకున్న వైమానిక ఆధిప‌త్య‌పు క‌ల ఒక్క‌సారిగా కాశ్మీర్ కొండ‌ల్లో ద‌భేల్మ‌ని కూలిపోయిందని అంటుంది మెంఫిస్ బార్క‌ర్ రాసిన క‌థ‌న సారాంశం. ఇది వ్యూహాత్మ‌క యుద్ధం, న్యాయ‌పోరాటానికి సంబంధించిన యుద్ధం కాదు. ఒక సైద్ధాంతిక స‌మ‌రం. దానిక తాలూకూ ప‌త‌నం. ఇక్క‌డ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ  ఆధిప‌త్య పోరు.. అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ అమ‌లుకు సంబంధించిన అంశం. ఈ విష‌యాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ ఆయుధ మేథావులంతా క‌ల‌సి.. రియ‌ల్ టైమ్ లో అస‌లు విష‌య‌మేంటో ప‌రిగ్ర‌హిస్తున్నారు. ప‌రిశీలిస్తున్నారు. రాఫెల్ ఒక అన్ ట‌చ‌బుల్. దాని రేంజ్ నెక్స్ట్ లెవ‌ల్. దాని టెక్నాల‌జీ తిరుగులేనిది. దాని పైలెట్లు వ‌ర‌ల్డ్స్ బెస్ట్. వారి రేంజే వేరు అనే బిరుదులు, విశేష‌ణాలెన్నో. అలాంటి రాఫెల్ ప్ర‌స్తుతం చైనా వేసిన ఉచ్చులో చిక్కింది. ఇక అది త‌ప్పించుకోలేదు. దాని టైం బ్యాడ్ డే రోజున.. ఖ‌చ్చితంగా ఫాల్ డౌన్ కావ‌ల్సిందే అన్న థియ‌రీకి సంబ‌ధించిన వ్య‌వ‌హార‌మిది. అంద‌రూ అనుకున్న‌ట్టు చైనా ఏం చూస్తూ ఊరుకోవ‌డం లేదు. ఈ యుద్ధంలోకి నిశ్శ‌బ్ధంగానే అడుగు పెట్టింది. కొంద‌రు పాశ్చాత్య విశ్లేష‌కులు త‌మ‌కు అనువుగా మార్చి రాసుకున్న యుద్ధ వ్యూహాలు సిద్దాంతాల‌కిక్క‌డ తావు లేదు. ఇక్క‌డొక వార్ ఆల్రెడీ జ‌రుగుతోంది. చైనా అపార‌మైన సైనిక శ‌క్తికి దీటుగా ఇప్ప‌టికే ఏఐ బేస్డ్ స్మార్ట్ వార్ గేమ్ త‌యారు చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో పాశ్చాత్య దేశాలుండ‌గా.. వాటికి పాక్ వంటి  యుద్ధ  క్షేత్రం వేదిక‌గా గ‌ట్టి బ‌దులు ఇవ్వాల‌న్న ఆలోచ‌నతో చైనా వార్ మైండ్ లో.. బ్లైండ్ గా ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది.   నిశ్శబ్దంగా గస్తీ తిరుగుతున్న సబ్ ఎరియ‌ల్ AWACS, నిష్క్రియాత్మక రీతిలో ఎగురుతున్న J-10C యుద్ధ విమానాలు, PL-15E క్షిపణులు 300 కి.మీ కంటే ఎక్కువ దూరంలోని  మాక్ 5 వేగంతో దేశీయ వేరియంట్లు లాక్ చేసి ఉంచారు. అందులో భాగంగా రాఫెల్ ఒక‌టి చిక్కి శ‌ల్య‌మైందని అంటున్నారు.   ఒక క్షిప‌ణి త‌న‌కు 50 కిలోమీట‌ర్ల దూరంలోకి వ‌చ్చే వ‌ర‌కూ.. తానే దాని టార్గెట్ అని ఆ రాఫెల్ కి తెలియ‌దు. ఆ వేగంతో పోటీ ప‌డ్డానికి భార‌త పైలెట్ కి కేవ‌లం 9 సెక‌న్లు మాత్ర‌మే ఉన్నాయ్. స్పందించ‌డానిక‌ది స‌రిపోలేదు. దీంతో రాఫెల్ నేల‌మ‌ట్టం కాక త‌ప్ప‌లేద‌ని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం. ఇక‌పై కాశ్మీర్ లోని భార‌త వైమానిక ద‌ళాన్ని ర‌క్షించుకోవ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ఫైట‌ర్ జెట్ ఎగిరిన  ప్ర‌తిసారీ పాకిస్థాన్ రాడార్లు దాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్టేస్తాయి. పీఎల్ ఫిఫ్టీన్ ద్వారా దాన్ని సౌండ్ లెస్ గానే ఢీకొట్టేస్తుందని హెచ్చ‌రిస్తోందీ క‌థ‌నం. ప్ర‌స్తుతం ప్రపంచం ఈ యుద్ధ  ప‌త‌నాన్ని ఆయుధ విన్యాసాన్ని త‌న రెండు క‌ళ్లతో చూస్తోంది. డ‌స్సాల్ట్ ఏవియేష‌న్ షేర్ ధ‌ర  స్థ‌బ్ధుగా ఉండ‌గా.. చైనా డిఫెన్స్ స్టాక్స్ అయిన  AVIC, ALD చెంగ్డు ధ‌ర‌లు  పెరుగుతున్నాయనీ తెలుస్తోంది. ఎందుకంటే C4ISR ఆధిపత్యం - కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా ద్వారా ఇదంతా నిర్ణయించబడిన‌ట్టు అభిప్రాయ ప‌డుతున్నారు నిపుణులు. ఇప్పుడు భార‌త్ పాక్ కంటే ముందుకు వెళ్ల‌లేదు. అది భార‌త్ ని ఎప్పుడో మించి పోయింది. భార‌త్ ఆశ్చ‌ర్య‌పోయేలోప‌ల‌.. దాని వార్ బ‌ర్డ్స్ ని అదెప్పుడో నేల మ‌ట్టం చేసేసింది. భార‌త్ కి క‌లిగించే ఈ వార్ పెయిన్ పాక్ ఈ ప్ర‌పంచానిక తెలియ చేస్తోన్న చైనా సైనిక సామ‌ర్ధ్య సందేశంగా భావించాల్సి ఉంటుందని చెబుతోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం.   ఈ వార్ క‌మ్ మైండ్ గేమ్ లో ఇప్పుడు భార‌త్ పాక్ కేవ‌లం నిమిత్త మాత్రం. మిగిలిన‌దంతా చైనా వ‌ర్సెస్ యూఎస్, యూకే వంటి పాశ్చాత్య దేశాల మ‌ధ్య జ‌రిగే సంకుల స‌మ‌రం. అందుకే ఈ విష‌యంలోకి అంత తేలిగ్గా అడుగు పెట్ట‌కూడ‌ద‌నుకున్నారు మోడీ. మ‌న ద‌గ్గ‌రున్న ఫ్రెంచ్ రాఫెల్స్, ర‌ష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ కి దీటుగా చైనా త‌న అస్త్ర‌శ‌స్త్ర విన్యాస‌మంతా ముందుకు తెచ్చింది. అది నేరుగా శ‌తృవును ఢీ కొట్ట‌డం లేదు. ఎక్క‌డో అంత‌రిక్ష కేంద్రంగా త‌న  వార్ గేమ్ స్టార్ట్ చేస్తోంది. పాకిస్థాన్ అన్న‌దొక భుజం మాత్ర‌మే. భార‌త్ ఒక ఆబ్జెక్ట్ మాత్ర‌మే. దాని గురి వేరు. దాని ల‌క్ష్యం వేరని అంటోంది టెలిగ్రాఫ్ క‌థ‌నం. ఇపుడే స్పెక్ట్రా వ్య‌వ‌స్థ కూడా దాన్ని గుర్తించ‌లేదు. ఉప‌గ్రహం ద్వారా ఆప‌రేట్ అయ్యే ఆ క్షిప‌ణిని ఏ EW సూట్ కూడా మోసగించ‌లేదు. ఏ ఫైట‌ర్ జెట్ కూడా రాబోయే మ‌ర‌ణ స‌మ‌యాన్ని క‌నీసం ఊహించ‌లేదు. ఆకాశ‌మిప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇది వైమానిక వైమానిక యుద్ధ ముగింపు కాదు. నిశ్శ‌బ్ధ,  అదృశ్య‌, జ‌వాబు చెప్ప‌న‌ల‌వి  కాని వైమానిక ఆధిప‌త్యానికి సంబంధించిన ఘ‌న ప్రారంభంగా అభివ‌ర్ణిస్తున్నారు అంత‌ర్జాతీయ యుద్ధ వ్య‌వ‌హారాల నిపుణులు. ఇది టెలిగ్రాఫ్ క‌థ‌న సారాంశం కాగా. దీనిపై ప్ర‌తిస్పంద‌న‌లు సైతం తీవ్రంగానే వ‌స్తున్నాయి. ఇదొక ఊహాజ‌నిత క‌ల్పిత గాథ అని అభివ‌ర్ణిస్తున్నారు కొంద‌రు యుద్ధ  నిపుణులు. ఇది కేవ‌లం రాఫెల్ పై బుర‌ద‌జ‌ల్లే క్ర‌మ‌మ‌ని. ఈ ఉచ్చులో చిక్క‌రాద‌న్ని వీరి వాద‌న‌. అయితే పీఎల్ 15 క్షిప‌ణుల‌ను చైనా పాక్ కి ఇచ్చిన మాట నిజ‌మే అయినా రాఫెల్ విమానాలు కూల్చిన‌ట్టు ఎక్క‌డా ఆధారాలు లేవ‌న్న మాట వినిపిస్తోంది.

భార‌త్- పాక్ కాల్పుల విర‌మ‌ణ‌లో అమెరికా పాత్ర ఎంత‌?

అణుముప్పు మేట‌రేంటి?  భార‌త్- పాక్ మ‌ధ్య ఆక‌స్మిక కాల్పుల విర‌మ‌ణ  విష‌యంలో అస‌లేం జ‌రిగింది? ఎందుక‌ని ఈ రెండు దేశాలు స‌డెన్ గా  ఈ డెసిష‌న్ తీసుకున్నాయి?  ఇరు దేశాల మధ్యా  ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన కారణంగానే  కాల్పుల విర‌మ‌ణ ప్రకటన చేశాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అయితే ఇక్క‌డే కొన్ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటి సారం ఎలా ఉందో చూస్తే.. 1. ఆక‌స్మికంగా ఉద్రిక్త‌త పెర‌గ‌డం  2. భార‌త ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి ప్ర‌క‌ట‌న వెలువ‌డటం 3. అంత‌ర్జాతీయ ప్ర‌తిచ‌ర్య‌లు, హెచ్చ‌రిక‌లు జారీ కావ‌డం 4. అణ్వాయుధ ముప్పు క‌నిపించ‌డం 5. భౌగోళిక రాజ‌కీయ ఒత్తిడి రావ‌డం 6. యునైటెడ్ స్టేట్స్ పాత్ర పెర‌గ‌డం 7. భ‌ద్ర‌తా స‌మ‌న్వ‌య స‌మావేశం ద్వారా నిర్ణ‌యం ఈ ఏడింటిలో ఏది ఈ కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌ధాన పాత్ర పోషించి ఉంటుంద‌న్న‌ది ఒక చ‌ర్చ కాగా..  మే ప‌దో తేదీన జ‌రిగిన ఆ 90 నిమిషాల దాడి కీల‌కంగా భావిస్తున్నారు. అదే అణు దాడి. ఈ మొత్తం పాయింట్ల‌లో నాలుగో పాయింట్ అణ్వాయుధ ముప్పు, ఆపై ఆరో పాయింట్లోని యునైటెడ్ స్టేట్స్ పాత్ర అత్యంత కీల‌కంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఏంటీ రెండు పాయింట్ల ద్వారా మ‌న‌కు తెలిసే నీతి అని చూస్తే.. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోధ వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేలమ‌ట్ట‌మైంది. అంతే కాదు, సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది.  మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల త‌ర్వాత‌, పాకిస్తాన్ తమ ద‌గ్గ‌ర మందుగుండు సామాగ్రి అయిపోయింద‌నీ.. కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపిన‌ట్టు తెలుస్తోంది. కానీ, భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించిన‌ట్టు చెబుతున్నారు.  ఈ ఆరు సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండవచ్చని భావిస్తున్నారు నిపుణులు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూ కంపం సంభవించిన‌ట్టు కూడా వార్తలు  వ‌చ్చాయి. అంతకుముందు చెఘాయి హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూ కంపం రావడం ప‌లు అనుమానాలకు దారి తీసింది. భారతదేశం చెఘాయి హిల్స్‌పై దాడి చేయడంతో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడి పోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవర‌పాటుకు గురిచేసిన‌ట్టు తెలుస్తోంది.  దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి.. కాల్పులను ఆపడానికి ప్రయత్నించింద‌ని స‌మాచారం. అదే సమయంలో, భారత్ బలూచిస్తాన్‌లోని బోలారి వైమానిక స్థావరంపైనా క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు, కేవలం ఖచ్చితత్వంతో కూడిన‌ క్షిపణి దాడులు మాత్ర‌మే జ‌రిగాయి.  ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన 40 మంది వ‌ర‌కూ సైనికులు మ‌ర‌ణించిన‌ట్టు చెబుతున్నారు మ‌న అధికారులు. పాకిస్తాన్ కూడా స్వయంగా ఈ విష‌యం అంగీకరించింది. అంతే కాదు, పాకిస్తాన్  హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బ తిన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత ప్రశ్నార్థం కావ‌డ‌మే అత్యంత కీలకంగా భావిస్తున్నారు. భారతదేశం ఎవరి సహాయం లేకుండా, కేవలం తన స్వ‌శక్తితో ఈ దాడులను విజయ వంతంగా నిర్వహించడం ద్వారా  ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చిన‌ట్ట‌య్యింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్‌ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్ర‌య‌త్నాలుసాగించిన‌ట్టు తెలుస్తోంది.  ఇందువ‌ల్లే అమెరికా ఈ చ‌ర్చ‌ల కోసం భార‌త్ పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చ‌ని అంటున్నారు. అయితే అమెరికా నేరుగా సంప్ర‌దించ‌క ముందే పాక్ డీజీ, భార‌త్ తో మాట్లాడారు. ఆ త‌ర్వాత భార‌త్ సైతం చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైంది. కానీ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఈ విజ‌యం త‌న  ఖాతాలో వేస్కునే య‌త్నం చేశారు. అయితే మోడీ మాత్రం క‌శ్మీర్ విష‌యంలో ఎవ‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అవ‌స‌రం లేద‌ని.. పీవోకే స్వాధీనం, ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌లో మాత్ర‌మే చ‌ర్చ‌లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఆప‌రేష‌న్ సిందూర్ ఇక్క‌డితో ముగియ‌లేద‌ని కూడా అన్నారు. మ‌రి చూడాలి త‌ద‌నంత‌ర   ప‌రిణామ క్ర‌మాలు ఎలా ఉండ‌నున్నాయో?

కాల్పుల విరమణ.. భారత్ చేసిన చారిత్రక తప్పిదం!?

పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్  ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులలో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు ప్రతిగా పాకిస్థాన్ భారత్ భూభాగం లక్ష్యంగా నిర్వహించిన డ్రోన్ దాడులతో రెండు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో  యుద్ధం తప్పదన్న వాతావరణం ఏర్పడింది. అయితే అదే సమయంలో పాకిస్థాన్ డొల్లతనం కూడా ప్రస్ఫుటంగా ప్రపంచ దేశాలకు అర్ధమైంది. భారత్ తో తలపడే సత్తా కానీ, శక్తి కానీ పాకిస్థాన్ కు లేవన్నది తేటతెల్లమైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సంధి అంటూ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చింది. భారత్ అందుకు సై అంది. అది పక్కన పెడితే ఇరు దేశాల మధ్యా సంధి కుదర్చడం వెనుక తన పెద్దన్న పాత్ర కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకున్నారు. భారత్, పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న విషయం అందరి కంటే ముందే తాను వెల్లడించి క్రెడిట్ కొట్టేయాలని చూశారు. అయితే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర కానీ, ఆ ధేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రకానీ ఇసుమంతైనా లేదని భారత్ కుండబద్దలు కొట్టేసింది. పాకిస్థాన్ కోరిన మీదటే మానవతా దృక్పథంతో అంగీకరించినట్లు స్పష్టంగా చెప్పేసింది.  అయితే పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ బేషరతుగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడాన్ని యుద్ధరంగ నిపుణులు చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందం రైటా, రాంగా అన్న విషయంలో దేశంలో ఎక్కడా భిన్నాభిప్రాయానికి తావే లేకుండా ముక్తకంఠంతో భారత్ నిర్ణయం సరికాదని అంటున్నారు. యుద్ధం వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది, మరణాలు సంభవిస్తాయి కనుక యుద్ధం ఎప్పడూ మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, భారత్ కు వ్యతిరేకంగా ప్రేరిపించి దేశంలో సృష్టిస్తున్న నిత్య మారణహోమానికి ఫుల్ స్టాప్ పడాలంటే.. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం, పాక్  అధినంలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని స్వాధీనం చేసుకోవడమే మార్గమని జనం భావిస్తున్నారు.    ఈ నేపథ్యంలోనే అత్యధికుల నుంచి కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని అంటున్నారు.  ప్రస్తుతం పాకిస్థాన్ అత్యంత దుర్బలంగా ఉందనీ, ఆ దేశం ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదనీ, ఆర్థికంగా, రాజకీయంగా క్లిష్టపరిస్థుతులను ఎదుర్కొంటోందనీ, ఇటువంటి సమయంలో భారత్ మరింత ఒత్తిడి పెంచి.. ఆ దేశంలో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులందరినీ సరండర్ చేయాలన్న షరతు విధించి ఉండాల్సిందనీ అంటున్నారు.  భారత్ ఒత్తిడి పెంచి ఉంటేపాకిస్థాన్ భారత్ కు దాసోహం అని ఉండేదనీ, అలా కాకుండా కాల్పుల విరమణ ఒంప్పదం కుదుర్చుకోవడం ద్వారా  పాకిస్థాన్ కు అనవసరంగా మళ్లీ శక్తియుక్తులను కూడదీసుకోవడానికి సమయం ఇచ్చినట్లైందని అంటున్నారు.  

రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు.. పవన్ కల్యాణ్

భారత రక్షణ దళాల్లో పనిచేసే సిబ్బందికి లబ్ధి చేకూర్చేలా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది  ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ, సీఆర్పీఎఫ్ లలో పని చేసే సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   ఇప్పటి వరకు సరిహద్దుల్లో పనిచేసే వారికి, రిటైర్డ్ ఆర్మీ సిబ్బందికీ మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. ఔను ఇప్పటి వరకూ ఆస్తి పన్ను మినహాయింపు ఉన్న వారిలో మాజీ సైనికులు, వారి జీవిత భాగస్వాములకు మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ దళాలలో పని చేసే ఏపీకి చెందిన వారందరికీ ఈ మినహాయింపు కల్పించింది.  సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ దళాలలో పని చేస్తున్న సిబ్బందికి ఈ మినహాయింపు ఇచ్చింది. పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఏపీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  ఈ నిర్ణయం మేరకు మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది, వారి భార్య లేదా భర్త పేరు మీద ఇల్లు ఉంటే ఆస్తి పన్ను ఉండదు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయం తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  

రణమా.. శరణమా.. సమయం లేదు మిత్రమా!

పాకిస్థాన్ ను ఇండియా అల్టిమేటమ్ యుద్ధ విరమణకు భారత్ షరతులు ఏంటో తెలుసా? భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాక్ దేవులాడుకుని, భారత్ మానవతా  దృక్పథంతో అందుకు అంగీకరించి రువాత పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాక్ కు ఇక అన్ని దారులూ మూసుకుపోయాయి. అలుంగుటయే ఎరుంగని.. అన్నట్లుగా ఇంత కాలం శాంతి మంత్రం జపిస్తూ వచ్చిన వచ్చిన ఇండియా కన్నెర్ర చేసింది. దీంతో పాకిస్థాన్ ను పూర్తిగా కాళ్ల  బేరానికి తెచ్చుకునేందుకు రెడీ అయిపోయింది.  ఈ నేపథ్యంలోనే సోమవారం  (మే11) భారత్, పాకిస్థాన్ డీజీఎంవోల మధ్య హాట్ లైన్ లో జరగనున్న  చర్చల నేపథ్యంలో ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్యా శాంతి, యుద్ధ విరమణ విషయంలో విధించాల్సిన షరతులపై వారికి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఆ షరతులేమిటన్నది తెలియగానే భారత్ అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం  అవుతున్నాయి. అసలు రెండు రోజుల కిందట కాల్పుల విరమణ ఒప్పందం  కోసం పాక్ కాళ్ల బేరానికి వచ్చినప్పుడే ఈ షరతులు విధించి ఉండాల్సిందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్లుగా.. పాక్ కుత్సిత బుద్ధిని తానే బ్లాక్ అండ్ వైట్ లో బయటపెట్టుకునే దాకా ఆగి మోడీ కీలెరిగి వాత పెట్టిన చందంగా ఈ ప్రతిపాదనలను  తీసుకువచ్చారనీ, ఈ షరతులను అంగీకరిస్తేనే పాక్ లో సంధి అన్న  స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా త్రివిధ దళాధిపతులతో సమావేశంలో ఆయన ఆదేశించారు. ఇంతకీ ఆ షరతులేమిటంటే..   పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి పర్యాటకులని హత్య చేసిన ముగ్గురు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నది మొదటి షరతు కాగా,  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ని బేషరతుగా భారత్‌కు  అప్పగించాలన్నది రెండో షరతు. ఇరు దేశాల మధ్యా శాంతి, సంధి  కుదరాలంటే ఈ షరతులకు అంగీకరించడం వినా మరో మార్గం లేదని ఆ  దేశానికి విస్పష్టంగా చెప్పాలని మోడీ త్రివిధ దళాధిపతుల సమావేశంలో చెప్పారు. అయితే ఈ రెండు షరతులకు పాకిస్థాన్ అంగీకరించే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. భారత్ విధించనున్న రెండు షరతులలో మొదటిదైన ఉగ్రవాదుల అప్పగింత విషయానికి వస్తే..  పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, వారిని భారత్  లో ఉగ్రదాడులకు ప్రేరేపిస్తోందన్న భారత్ ఆరోపణలు అక్షర సత్యాలని   స్వయంగా అంగీకరించి, ధృవీకరించినట్లవుతుంది.  ఇక భారత్‌ నుంచి ఎలాగైనా మొత్తం కశ్మీర్‌ను దక్కించుకోవాలన్న దుర్భుద్ధితో దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో వేర్పాటు వాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న   పాకిస్థాన్‌, ఇప్పుడు తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని భారత్‌కి అప్పగించడానికి అంగీకరిస్తే.. ఇన్ని దశాబ్దాలుగా పాక్ వాదన అంతా తప్పుల తడకగా తేలిపోతుంది. అంతర్జాతీయ వేదికలపై తాను చేసిన వాదనలన్నీ తప్పని స్వయంగా  అంగీకరించినట్లు అవుతుంది. అన్నిటికీ మించి సొంత ప్రజలనే మోసం  చేసినట్లు పాక్ పాలకులు,  సైన్యం అంగీకరించినట్లు అవుతుంది. ఆ  కారణంగానే పాకిస్థాన్ అందుకు అంగీకరించే అవకాశాలు ఇసుమంతైనా లేవని  అంటున్నారు. అదే సమయంలో భారత్ తో సై అని యుద్ధానికి దిగే సత్తా  కూడా ఆ దేశానికి లేదు. యుద్ధమే కనుక జరిగితే.. రోజుల వ్యవధిలోనే పాక్  పనైపోతుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కోల్పోవడము కాకుండా, పాకిస్థాన్  అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంది.  ఈ పరిస్థితుల్లో భారత్ పాక్ కు రణమా..  శరణమా.. సమయం లేదు మిత్రమా అంటూ ఇవ్వబోయే అల్టిమేటమ్ కు పాక్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూడాల్సిందే.  

బుల్లెట్ కు క్షిపణితో బదులు.. పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక

భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్రత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పహల్గాం దాడి తరువాత నుంచీ పరిస్థితి తీవ్రంగా మారింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పకిస్థాన్ ను వణికించేసింది. పాక్ దాడులకు తెగబడినా భారత్ వాటిని అత్యంత సమర్దంగా తిప్పి కొట్టడమే కాకుండా ప్రతిదాడులు చేసింది. ఈ ప్రతిదాడులు పాకిస్థాన్ అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేశాయి. ఈ పరిస్థితిలో స్పష్టమైన స్వార్థ పూరిత కారణాలతో ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఏకపక్షంగా పూనుకుని కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను సడలించేందుకు ప్రయత్నించారు. భారత్ మాత్రం కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ ఏమీ లేదనీ, అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమనీ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకే తాము మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామనీ చాటింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పాక్ నుంచి ఉల్లంఘన జరిగింది. దీంతో భారత్ దీటుగా స్పందించింది. ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి బుల్లెట్ వస్తూ మీరు క్షిపణితో సమాధానం ఇవ్వండి అంటూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.      దీంతో పాకిస్థాన్ కు ఇక శరణుజొచ్చడం వినా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటి కంటే పాక్ సరిస్థితి దయనీయతకు  త్రివిధ దళాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన అద్దం పట్టింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తొలుత పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేశామనీ, ఆ తరువాత పాక్ సరిహద్దులలో భారత భూభాగంపై చేసిన దాడులకు ప్రతిగా   పాక్ లోని   ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించాయి. అంతే కాకుండా ఈ దాడుల్లో పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమైన వీడియో క్లిప్పింగ్ లను చూపాయి. పాక్ చేసిన ప్రతి దాడినీ సమర్ధంగా తిప్పికొట్టినట్లు త్రివధ దళాల ప్రతినిథులు తెలిపారు. పాక్ ఏ మాత్రం తోక జాడించినా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.  పాక్ పై చర్యలపై విషయంలోకేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ  ఇచ్చిందని పేర్కొన్నారు.  పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తానే మొదట కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించిందని, దానికి భారత్ అంగీకరించిందని, అయితే ఆ దేశమే ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ, మరోసారి ఆ పని చేస్తే భారత్ నుంచి ఎదురయ్యే దాడుల ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 

ట్రంప్ స‌డెన్ గా యుద్ధం ఎందుకు ఆపాడు?

అమెరికా అస‌లు ఉద్దేశం ఏంటి? భార‌త్ ఇప్ప‌టికే మూడో అతి పెద్ద ఆర్ధిక శ‌క్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనాల‌తో పోటీ ప‌డుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో మ‌రే దేశానికి లేనంత గొప్ప జ‌నాభా శ‌క్తి భార‌త్ సొంతం. ఈ మార్కెట్ ఒక్క‌టి చాలు ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ ని అతి పెద్ద‌ ఆర్దిక శ‌క్తి చేయ‌డానికి. చైనాను కూడా మ‌నం క్రాస్ చేసి అతి పెద్ద జ‌నాభా గ‌ల దేశంగా మార‌డం అత్యంత శ‌క్తిమంత‌మైన దేశంగా ఆవిర్భ‌వింప చేసింది.  అలాంటి భార‌త్ మ‌రింత ఎదిగి అమెరికా, చైనాల‌ను కూడా ఢీ కొడితే ప‌రిస్థితి మ‌రోలా అవుతుంది. ఇప్ప‌టికే కొన్ని దేశాలు అమెరికాను పెద్ద‌న్న పాత్ర నుంచి ప‌క్క‌కు త‌ప్పించి భార‌త్ ను ఆ స్థానంలో చూడాల‌నుకుంటున్నాయ్. మ‌రీ ముఖ్యంగా ఫ్రెంచ్ అధినేత మ‌క్రాన్ భార‌త్ నుంచి మోడీ ఆ పాత్ర పోషించాల‌ని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.  అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద‌న్న పాత్ర‌లో ఉన్నా.. అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగ‌మే. ఏ చిన్న అవ‌కాశం దొరికినా అమెరికాకు లాభం చేకూర్చి పెట్ట‌డం ఎలా అన్న కోణంలోనే ఆ దేశ ప్ర‌తి అధ్య‌క్షుడూ కోరుకుంటారు. అది ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ అయినా,. సిరియా వార్ అయినా., గ‌ల్ఫ్ వార్ అయినా.. దానికి కావాల్సిన వ‌న‌రుల కోస‌మే త‌న ఆరాట‌మంతా చూపిస్తుంది. అందులో భాగంగానే మొన్న ఉక్రెయిన్ తో అతి పెద్ద ఖ‌నిజ వ‌న‌రుల ఒప్పందం చేసుకోవ‌డం చూశాం.  భార‌త్ అలాక్కాదు. దానికలాంటి స‌మ‌స్య‌లు కానీ, ఆలోచ‌న‌లు కానీ లేవు. మ‌న‌మే ప‌ది మందికి అరువు ఇవ్వాలి త‌ప్ప మ‌నమంటూ ఒక‌రి నుంచి ఏదీ ఆశించ‌కూడ‌దు. యుద్ధాన్ని కోరుకోకూడ‌దు. మ‌న‌కంటూ భారంగా ఆయుధాలు వాటిపై పెట్టుబ‌డులు కూడా పెద్ద‌గా లేవు. అదే అమెరికాకి అలాక్కాదు.. ఆ దేశ డాల‌ర్ విలువ ప‌డిపోకూడ‌దు. ఆ దేశ టాప్ పొజిష‌న్ చేజార కూడ‌దు. దానికి తోడు అవ‌స‌ర‌మున్నా లేకున్నా త‌యారు చేసి పెట్టుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయ్. వాటి మీద పెట్టిన పెట్టుబ‌డులు భారీగా ఉన్నాయ్. వీట‌న్నిటి నుంచి రిక‌వ‌రీ కావాలంటే అమెరికా చేయాల్సిన ప‌ని.. ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డ యుద్ధం జ‌రుగుతుందా? ఆ యుద్ధాల‌కు త‌మ ఆయుధాల‌ను ఎలా స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మా? లేకుంటే నిధులను ఎలా స‌మ‌కూర్చ‌డ‌మా? వాటి నుంచి పొందాల్సిన  లాభం పొంద‌డ‌మా? ఇదే అమెరికా చేసే అతి పెద్ద ప‌ని.  మీరు కావాలంటే చూడండి.. ఉక్రెయిన్ ర‌ష్యాతో గొడ‌వ ప‌డి పూర్తిగా నాశ‌న‌మ‌య్యిందా? ఆ దేశ పున‌ర్నిమాణం పేరు చెప్పి.. ఆ దేశ ఖ‌నిజ నిలువ‌లను అపారంగా త‌వ్వేసి... వాటి  సాయంతో దేశాన్ని తిరిగి నిర్మిస్తామ‌ని లింకు పెట్టింది. ఇదే కాదు గ‌ల్ఫ్ కంట్రీస్ నుంచి అంత‌లేసి ఆయిల్ నిల్వ‌ల‌ను పొందినా వెంట‌నే డ‌బ్బులు ఇవ్వ‌దు. ఇవ్వాల్సిన మొత్తాన్ని త‌న ట్రెజ‌రీలోనే దాచుకుని త‌ద్వారా వారి దేశాన్ని మోడ్ర‌నైజ్ చేస్తుంది. ఇటు ఆ నిల్వ‌ల‌ను త‌న వ‌ద్దే దాచుకుంటుంది. ఇప్పుడు భార‌త్ విష‌యానికి వ‌ద్దాం. భార‌త్ కి ఉగ్ర‌వాదం అనే ప‌క్క‌లో బ‌ల్లెం అమెరికాకు అత్యవ‌ర‌సం. ఒక వేళ ఈ యుద్ధం గానీ, కొన్నాళ్ల పాటు జ‌రిగితే అక్క‌డి ఉగ్ర మూక‌లు స‌మూలంగా హ‌త‌మై పోతాయి. వారు గానీ ఖ‌త‌మై పోతే.. ఇటు పాక్ ప‌ని మాత్ర‌మే కాదు.. అమెరికా ఖేల్ కూడా ఖ‌త‌మైపోతుంది. ఎందుకంటే ప్ర‌పంచంలో ఏ స‌మ‌స్యా లేని దేశంగా భార‌త్ మారితే ఇక దాని ఎదుగుద‌ల‌కు  అంతుండ‌దు. వెంట‌నే అంచ‌లంచెలుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే భార‌త్ అలా ఎదుగుతూ పోతుందో.. అప్పుడు..  ఇక భార‌త్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కి వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికి గ‌ణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్ధిక శ‌క్తులుగా పోటీ ప‌డుతున్నాయి  కానీ.. వాటికంటూ ఉండాల్సిన ఎథిక‌ల్ నెంబ‌ర్ వ‌న్ పొజిషన్ లేదు. ఎప్పుడూ పరాయి దేశాల  మీద ప‌డి దోచుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధి. ఈ విష‌యంలో చైనా యూఎస్ ఒక‌దానితో మరొకటి పోటీ ప‌డుతూనే ఉంటాయ్. అదే భార‌త్ అలాక్కాదు.. సీమ్లా ఒప్పంద కాలంలో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల‌ను సైతం తిరిగి పాక్ కి అప్ప‌గించిన ఉదార‌త ఈ దేశం సొంతం. అలాంటి భార‌త్ కి నైతికంగా నెంబ‌ర్ వ‌న్ గా ఉండే అర్హ‌త, హ‌క్కుల‌న్నీ ఉన్నాయి.  భార‌త దేశానికున్న ఒకే ఒక్క ఉగ్ర ముప్పు కూడా తొలిగిపోతే.. పాక్ ప్ర‌స్తుతం ఉన్న స్థితిగ‌తుల నుంచి పూర్తిగా విడుద‌లై పోతే.. మొద‌ట ఈ పాపిష్టి దేశం ప‌ని అయిపోతుంది. త‌ర్వాత భార‌త్ వెలిగిపోతుంది. ఇప్ప‌టికే ఉగ్ర‌వాదుల్లో స‌గం ప్ర‌మాద‌కారులు న‌శించారు. ఆ మిగిలిన వారి చ‌రిత్ర కూడా ముగిసిపోతే.. ఇక భార‌త్ కి తిరుగే ఉండ‌దు. త‌ర్వాతి కాలంలో భార‌త్ కి ప‌ట్ట‌ప‌గ్గాలుండ‌వు. ఇది జ‌ర‌గ‌డానికి వీల్లేద‌న్న భావ‌న‌తోనే హుటాహుటిన ట్రంప్.. భార‌త్ , పాక్ ల‌ను కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఆగ‌మేఘాల మీద‌ ఒప్పించాడు.  అమెరికా ఉద్దేశంలో ఒక‌టి  ఏదైనా దేశం నుంచి వీలైనంత‌గా వ‌న‌రుల దోపిడీ. లేదంటే త‌న టాప్ పొజిష‌న్ కి ఢోకా లేకుండా చూసుకోవ‌డం. ఇది ఆ దేశానికి రెండో ప్ర‌పంచ యుద్ధ‌కాలం  నాటి  నుంచీ పుట్టుకొచ్చిన అల‌వాటు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చింది కాదు. మ‌న దేశానికి స్వాతంత్ర‌కాలం నాటి  నుంచి ఉన్న కాశ్మీర్ టూరిజం కోసం పుట్టిన టెర్ర‌రిజం ఎలాగో అమెరికాకు ఈ ఆధిప‌త్య ధోర‌ణి కూడా స‌రిగ్గా అలాంటిదే. భార‌త్ టెర్ర‌రిజం ఫ్రీ కంట్రీ అయిపోతే.. అమెరికా ప‌ని అయిపోతుంది. అందుకే ఆ దేశం భార‌త్ లో టెర్ర‌రిజం ఎప్ప‌టికీ ఉండాల‌ని కోరుకుంటుంది అందుకు అవ‌స‌ర‌మైన నిధులు ఉగ్ర‌వాద మాతృదేశం పాకిస్తాన్ కి అవ‌స‌ర‌మైనంత మేర‌ ఇస్తూ.. కాపాడుకొస్తున్నద‌ని అంటారు విదేశాంగ‌ నిపుణులు.

ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. ప్లాన్- B ఇదేనా..? ఈ రాత్రి పాక్ కు చుక్కలే..

  భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్ది సేపటికే పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది. పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నమ్మించి మోసం చేసిన పాకిస్థాన్ కు మరోసారి దీటుగా సమాధానం చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది.

కల్లును సేవించిన మిస్ వరల్డ్-2025 పోటీదారులు

  హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు.  ఈ నెలాఖరు వరకు జరిగే అందల పోటీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. అయితే ఈ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు  తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

  శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్థ యాత్రికులతో వెళ్లున్న బస్సు కోట్మలే ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కెపాసిటీ కంటే 20 మందిని అదనంగా తీసుకెళ్లున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ఐదుగురు పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.  

ఆపరేషన్ ఆగదు.. యుద్ధం తప్పదు! .. కాల్పుల విరమణ కాదు.. విరామమే!

అనుకున్నదే  జరిగింది. అసలైన యుద్ధం మొదలయ్యేందుకు ముందే పాకిస్థాన్ చేతులు ఎత్తేస్తుందని, నిపుణులు చేసిన విశ్లేషణలు నిజమయ్యాయి. యుద్ధం వస్తే  పాకిస్థాన్ మూడు నాలుగు రోజులకంటే కంటే నిలబడలేదని చెప్పిన మాటలు నిజమయ్యాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్  ప్రకటించిన మూడు నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్  చేయగల్గినంతా చేసి  శనివారం (మే10)  కాళ్ళ బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో భారత్  తలుపు తట్టింది. ఆ దేశ డీజీఎంవో,మన డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. మన డీజీఎంవో షరతులతో అంగీకారం తెలిపారు.  ఇదే విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్ర మార్గంలో మిలటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు.  అయితే.. అంతలోనే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒప్పందం కుదిరి నాలుగు గంటలు అయినా కాక ముందే  పాక్ మళ్ళీ కుక్క తోక వంకరని అన్నట్లు,ఉల్లంఘనలకు తెర తీసింది. దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్  దాడులకు పాల్పడింది.  షరా మాములుగా మన సేనలు, పాక్  డ్రోన్లను తుక్కును కొట్టి నట్లు కొట్టి పడేశాయి అనుకోండి అది వేరే విషయం.  కానీ, ఇక్కడ కూడా మరో మారు విశ్లేషకుల మాట నిజం అయింది. కాల్పుల విరమణ వార్త వచ్చిన తర్వాత ఏటీవీ చానల్ తెరిచినా  పాక్  కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా.. మళ్ళీ మాములుగా ఉల్లంఘనలకు పాల్పడుతుందా  అన్న అనుమానాలే వినిపించాయి. ఆ దేశ దుర్మార్గ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు, పాక్  ఉల్లంఘనలకు పాల్పడుతుందని అనుమానం లేకుండా స్పష్టంగా చెప్పారు. అయితే.. కొందరు మాత్రం  అనుమనాలు వ్యక్తం చేశారు. అయితే,ఎక్కువ నిరీక్షణ అవసరం లేకుండానే  పాక్  అనుమానాలను నిజం చేసింది. టీవీలలో చర్చ జరుగతున్న సమయంలోనే ఉల్లంఘన  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం సేథీ అవును  పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని, మీడియా సమావేశంలో చెప్పారు.  నిజానికి అందుకు పెద్దగా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. పాక్ ,ఒప్పందానికి కట్టుబడితే ఆశ్చర్య పోవాలే కానీ, ఉల్లంగిస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే  అనేక మార్లు రుజు వైన పాక్  నైజం. అయితే, పాక్  విషయాన్ని పక్కన పెట్టి మన విషయానికి వస్తే..  చాంతాడంత రాగం తీసి ఏదో పాట పాడి నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం  పూర్తి స్థాయి యుద్ధం మొదలవ్వక  ముందే ఓటమి అంచులకు చేరిన పాక్ తో  సంధి కి ఎందుకు అంగీకరించింది? పాకిస్థాన్   కాళ్ళ బేరానికి వచ్చిందంటే  కాల్పుల విరమణ కోసం ఎవరెవరి కాళ్ళో పట్టుకుంది అంటే, అర్థం చేసుకోవచ్చును. కానీ, భారత దేశం, కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఇది ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.  అలాగే  కాల్పుల విరమణ ఒప్పందం  పౌరోహిత్యం తమదే అంటూ జబ్బలు చర్చుకుంటున్న అమెరికా  గోలేంటి? నిన్నటి వరకు భారత్, పాక్ దేశాల మధ్య యుద్దమే వచ్చినా వేలు పెట్టేది లేదని అంటూ వచ్చిన పెద్దన్న ట్రంప్  ఇప్పుడు, ఇలా  నాలుక మడతేసి అంతా  తామే చేశామని చెప్పుకోవడం వెనక ఉన్న మతలబు ఏమిటి? ఇందులో పాక్  కు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించిన,  ఐఎంఎఫ్   పాత్ర ఏమిటి? అంటే.. ప్రస్తుతానికి ఎవరి వద్ద సరైన అమాధానం లేదు.  అయితే..  ట్రంప్ .. క్రెడిట్  తమ ఖాతాలో కలుపుకున్నా, మన దేశం మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మూడో దేశం(అమెరికా) పాత్ర లేదని కుండబద్దలు కొట్టింది.  అలాగే.. కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి? వాటికి కూడా విరమణ షరతు వర్తిస్తుందా?అనే ప్రశ్నకు, అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణ ఒక్కటే షరతులకు లోబడి కుదుర్చుకున్న అంగీకారమని, సింధు జాలల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయం సహా దౌత్యపరమైన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్‌కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేనని ఆ వర్గాలు వివరించాయి.  మిలటరీ యాక్షన్ సీజ్ చేసినప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో స్పష్టం చేశారు. కాల్పులు, మిలటరీ యాక్షన్‌పైనే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్న భారత విధాన నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు. సో.. కాల్పుల విరమణ ఒప్పందం అమలు అయినా కాకున్నా, ఉగ్రవాదాన్ని ఈ భూమి మీద ఎక్కడా లేకుండా చేయడమే లక్ష్యంగా మన దేశం ప్రారంభించిన ఆపరేషన్ సిదూర్  ఆగదు. యుద్ధం తప్పదు. ప్రస్తుత కాల్పుల విరమణ .. విరమణ కాదు, విరామం మాత్రమే.

పీవోకే‌ను భారత్‌కు అప్పగించాల్సిందే..ప్రధాని మోదీ కీలక ప్రకటన

  ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే భారత్ కూడి ప్రతి దాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్‌తో పీవోకే, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశంపై చర్చలు అవసరం లేదని తెలిపారు. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించేది లేదని మోదీ తెలిపారు.ఈ మేరకు మోదీ నివాసంలో జరిగిన భేటీలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత ఆర్మీ చేసిన యుద్దంలో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని అన్నారు. సైనిక బలగాలు చేసిన ప్రతి దాడిలో పాక్ ఓడిపోయిందని తెలిపారు. దాయాది ఎయిర్‌బేస్‌లపై మనం చేసే దాడులతోో  వాళ్లు అసలు యుద్ధంలోనే లేరని విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు.  దాడుల ద్వారా పాక్‌కు గట్టి సందేశం ఇచ్చామని మోదీ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌  అనంతరం పాకిస్థాన్‌ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్థాన్‌ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు (షెల్స్‌)నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.  పాక్‌ దాడుల తీవ్రతకు అధికంగా నష్టపోయే అవకాశం ఉండటంతో బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు చెందిన దాదాపు 1.25లక్షల మందికి పైగా ప్రజలను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడే తమ నివాసాలకు వెళ్లొద్దని కోరుతున్నారు. దాడుల సమయంలో పాక్ ప్రయోగించిన షెల్స్‌ (ఫిరంగి గుండ్లు) చెల్లాచెదురుగా పడి ఉండటం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 

యూపీలో బ్రహ్మోస్ క్షిపణి యూనిట్‌ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్

  పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని  రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్  అన్నారు. ఉగ్రవాద నిర్మూలకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని.. పాకిస్థాన్ ఉగ్రవాద నిర్మూలనకు గట్టి సమాధనం ఇచ్చామని ఆయన అన్నారు. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.300 కోట్లతో 80 హెక్టార్ల స్థలంలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నమని ఆయన అన్నారు. ఉగ్ర శక్తులకు భారత్‌ దీటుగా బదులిస్తుందన్నారు. ఈ ఆపరేషన్‌  ఉగ్రవాదంపై పోరులో దృఢ సంకల్పంతోపాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటిచెప్పిందన్నారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందన్నారు. పాక్‌ ప్రజలపై భారత్‌ దాడి చేయలేదని, కానీ, దాయాది మాత్రం పౌరులే లక్ష్యంగా మన దేశంపై దాడులు చేసిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా బ్రహ్మోస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మూడున్నరేళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

వీర జవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి నారా లోకేష్

  ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రు నివాళులు అర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు.  మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీ నాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను మంత్రి పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీరజవాన్ మురళీ నాయక్ కు జై, భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ ప్రజలు, స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.   వీరజవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి లోకేష్ వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మురళీ నాయక్ పార్థీవదేహాన్ని స్వయంగా మోసారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుముందు ఉదయం నుంచి వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దుగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

  ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నాది. తమకు ఇచ్చిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు ఊహాగానాలను నమ్మొద్దని కోరింది. భారత్‌-పాక్‌ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు ప్రధాని  మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్‌లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు  తెలుస్తోంది. రేపు పాకిస్థాన్‌తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ప్రతి ఇంటికి గుండె చప్పుడు అమ్మ...మదర్స్ డే సందర్బంగా తల్లులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

  అమ్మ తొలి గురువు మాత్రమే కాదని, ప్రతి ఇంటికి గుండె చప్పుడు కూడా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మదర్స్ డే సందర్బంగా తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.కుటుంబంలో శక్తివంతమైన పునాదిలాంటిది అమ్మ భవిషత్తుకు మార్గదర్శి తల్లి పాత్ర అసమానమైనది. తన పిల్లలకు విలువలను నేర్పుతుంది. అమ్మ ప్రేమ, త్యాగం అపరిమితమైంది. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కుటుంబమే అమ్మకు సమాజం, దేశం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఓ అమృతమయి. సృష్టిలో ఉన్న అన్ని సంబంధాలలోనూ నిష్కల్మషమైనది, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచేది తల్లి బిడ్డల బంధమే.    కన్న బిడ్డల కోసం ఎండనక, వాననక కష్టించి పనిచేసే వారి జీవితాలకు పూల బాటలు వేసింది తల్లే. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం వాళ్ళ మీద పరిపూర్ణమైన ప్రేమను చూపించేది తల్లి మాత్రమే. అమ్మ.. పేరులోని ప్రేమని… పిలుపులోని మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ప్రేమను వర్ణించటం సామాన్యం కాదు. ఆమె త్యాగం అనన్యసామాన్యం. అందుకే ‘అమ్మలేకపోతే జననం లేదు.. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు’ కంటిపాపలా కాపాడే ప్రతి బిడ్డకీ జన్మనిచ్చిన అమ్మలకు మదర్స్‌ డే శుభాకాంక్షలు.  

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్‌లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు  తెలుస్తోంది. రేపు పాకిస్థాన్‌తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్‌-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ ప్రెస్‌ బ్రీఫింగ్‌ కూడా ఉంది.