ఏపీలో ఎల్‌జీకి స్వాగతం..శ్రీసిటీలో రూ.5,800 కోట్ల పెట్టుబడులపై చంద్రబాబు హర్షం

  ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌జీ  ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీసిటీలో రూ.5,800కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500పైగా ఉద్యోగాలతో ఈ సంస్థ ఏపీని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ కింద ఈ సంస్థ 100శాతం ప్రోత్సాహకాలు పొందిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది ఏపీలో పారిశ్రామిక వృద్ధికి ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొంటూ శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు మంత్రి నారా లోకేశ్‌ నేడు శంకుస్థాపన చేసిన అనంతరం దిగిన ఫొటోను ముఖ్యమంత్రి షేర్‌ చేశారు.  తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్‌జీ  ఎలక్ట్రానిక్స్ కంపెనీ కొత్త యూనిట్‌కు  నేడు ఆయన​భూమి పూజ నిర్వహించారు. ఈ యూనిట్​ఏర్పాటు ద్వారా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్​మాట్లాడుతూ దేశానికి 70 శాతం ఏసీలు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఎల్జీ యూనిట్​కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి కల్పన చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. 

కొండంత దేశం ఆస్ట్రేలియా... అయినా అధికభాగం ఖాళీ.. ఎందుకంటే?

ఇదొక చిత్రమైన వాస్తవం. అవును ఆస్ట్రేలియా భౌగోళికంగా చాలా పెద్ద దేశం. ప్రపంచంలోనే ఆరవ అతి పెద్ద పెద్ద దేశం. నిజానికి ఆస్ట్రేలియా భారత దేశం సహా అనేక పెద్ద దేశాలకంటే చాలా పెద్ద దేశం. మన దేశం వంటి రెండు సువిశాల దేశాల భౌగోళిక విస్తీర్ణంతో సమానమైన భౌగోళిక విస్తీర్ణం ఉన్న దేశం ఆస్ట్రేలియా.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మొత్తం యూరప్  దేశాలను కలిపి చుట్టినా..  ఆస్ట్రేలియా  విస్తీర్ణంతో సరి తూగదు.  అయితే..  విస్తీర్ణంలో పే.. ద్ద  దేశమే అయినా.. ఆస్ట్రేలియాలో వినియోగంలో ఉన్న భూమి మాత్రం అత్యల్పం.  అవును. కేవలం ఐదు శాతం భూమి మాత్రమే వినియోగంలో వుంది. మిగిలిన 95 శాతం భూమి ఖాళీ.  చెట్టూ, పుట్టా ఏదీ లేని నిర్జన,  నిర్జీవ ప్రదేశం. అందుకే దేశం పెద్దదే అయినా, జనాభా లెక్కలలోకి వస్తే మాత్రం చాలా చిన్నదేశాల కంటే  చాలా తక్కువ జనాభా ఉన్న దేశం ఆస్ట్రేలియా.  అవును..  ఆ దేశ మొత్తం జనాబా, మన దేశ రాజధాని ఢిల్లీ జనాభా (34,666,000) కంటే తక్కువ.  విశేషం చూడండి. ఆస్ట్రేలియా భౌగోళికంగా మన దేశం కంటే రెండు రెట్లు పెద్ద దేశం.  కానీ ఆ దేశ ప్రస్తుత జనాభా 26, 933,653 మాత్రమే. అంటే, మన దేశ జనాభాలో ఆరోవంతు మాత్రమే.  అదలా ఉంటే..  ఆస్ట్రేలియా చిత్రాల్లో ఇంకో విచిత్రం కూడా వుంది. ఆ దేశ భూభాగంలో 95 శాతం కంటే ఎక్కువ  భూభాగం ఖాళీగా ఉంటుంది. ఆస్ట్రేలియా మొత్తం భూభాగంలో కేవలం జనజీవనానికి అనుకూలమైన భూభాగం అతి తక్కువ. దేశ జనాభాలో 95 శాతం మంది ప్రజలు కేవలం 0.22 శాతం భూభాగంలో జీవిస్తున్నారు. అవును. అంత పెద్ద దేశంలో కేవలం ఐదు నగరాలు.. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్ లలో మాత్రమే జన జీవనం కనిపిస్తుంది.  మిగిలిన భూభాగం జన జీవనానికి ఎంత మాత్రం అనుకూలం కాదు. అంటే.. ఆస్ట్రేలియా ప్రజలు జీవిస్తున్న భూభాగం ఆ దేశ భౌగోలిక స్వరూపంలో ఒక శాతం కంటే తక్కువ. దేశం నలు దిక్కులలో ఏ దిక్కు నుంచి లోపలకు వెళ్ళినా..  లోపలకు వెళ్ళే కొద్దీ మనిషి బతికే అవకాశాలు సన్నగిల్లుతాయి. ముందుకు వేసే ప్రతి అడుగూ  మృత్యువుకు మరింత  దగ్గర చేస్తుంది. అలాగే..  గీత దాటితే  ఇక తిరిగి రావడం ఉండదు. అందుకే..  ఆస్టేలియా భూభాగంలో 95 శాతం భూభాగం ఈరోజుకూ  కూడా నిర్జన, నిర్జీవ ప్రాంతంగా ఖాళీగా ఉంటుంది.  అయితే  ఆస్ట్రేలియా ఇప్పటికీ  ఎందుకు ఖాళీగా వుంది? అంటే అందుకో  పెద్ద కథే వుంది. ఆ వివరాలోకి వెళితే.. నిజానికి ఆస్ట్రేలియా అబోరిజినల్ (Abor Ginel)దేశం. ఆస్ట్రేలియా మూలవాసులు, ఈ అబోరిజినల్స్.    మన దేశం ఎలాగైతే  హిందు దేశం అయిందో, అలాగే  ఆస్ట్రేలియా అబోరిజినల్స్ దేశం.  వాస్తవంగా ఆస్ట్రేలియా మూలవాసులైన ఆదివాసుల సొంతం. ఆదివాసుల స్వదేశం. అయితే  ఈ రోజున ఆస్ట్రేలియాలో ఆ దేశ మూలవాసులైన ఆదివాసుల కంటే  శ్వేత జాతీయులే ఎక్కువ కనిపిస్తారు. మరి మూలవాసులు అబోరిజినల్స్ ఏమై పోయినట్టు..  ఎలా అంతరించి పోయారు అంటే  మళ్ళీ అది మరో పెద్ద కథ.   భారత దేశంలో అక్రమంగా ప్రవేశించి  రెండు వందల ఏళ్లకు పైగా పాలించిన బ్రిటిష్ వలస పాలకులే  ఆస్ట్రేలియాలోనూ వలస పాలన సాగించారు. మన దేశంలో ఎలాగైతే లక్షలమందిని పొట్టనపెట్టుకున్నారో అలాగే ఆస్ట్రేలియాలోనూ   బ్రిటిష్ పాలకులు ఆస్ట్రేలియాలో  అనేక రూపాల్లో మారణ హోమాన్ని సాగించారు. దుర్మార్గంగా భూములను దోచుకున్నారు. స్థానికులను బానిసలు చేశారు. అమాయక అబోరిజినల్స్ ను  అనేక రూపాల్లో వేధింపులకు గురి చేశారు. చిత్ర హింసలు పెట్టారు. అణచి వేశారు. చివరకు  మారణ  హోమం సృష్టించారు. సాముహిక హత్యా కాండను సృష్టించారు. అబోరిజినల్స్ జాతిని నామరూపాలు లేకుండా చేశారు.  ఇలా ఒక జాతిని మొత్తాన్ని   లేకుండా చేసేందుకు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో వింటేనే గుండెలు తరుక్కు పోతాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట వ్యాపారం ముసుగులో  భారత దేశంలోకి ప్రవేశించిన విధంగానే  బ్రిటిష్ పాలకులు 1606 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కాలు పెట్టారు. అంతవరకూ అబోరిజినల్స్ ఇతర స్థానిక జాతుల ప్రజలు ఆహరం, ఔషధం, ఆయుధం అన్నిటికీ అడవి తల్లినే నమ్ముకున్నారు. అడవి తల్లి బిడ్డలుగానే జీవితం సాగించారు. అంతేకాదు.. ఆస్ట్రేలియా మూలవాసులకు భూమి క్రయ విక్రయాలు తెలియవు.  కంచెలు కట్టుకుని భూమిని సొంతం చేసుకోవడం అసలే తెలియదు. అయితే..  బ్రిటిష్ వారు అడుగు పెడుతూనే   తమ వ్యాపార సంస్కృతిని వెంట పెట్టు కొచ్చారు. అలాగే..  వ్యాపార సంస్కృతితో పాటుగా మశూచి వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా తీసుకువచ్చారు. ఈ వ్యాధులు ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో లేవు.  కాబట్టి స్థానిక ప్రజలకు రోగనిరోధక శక్తి లేదు. ఫలితంగా.. కొవిడ్ వంటి ఆరోగ్య విపత్తు తలెత్తింది. ఒక సంవత్సర కాలంలో, ఒక్క మశూచి వ్యాధి ఒక్కటే ఒక్క సిడ్నీలోనే  50 శాతం జనాభాను తుడిచిపెట్టింది. పోర్ట్ ఫిలిప్ ప్రాంతంలో కూడా ఇలాంటి వినాశనమే సంభవించింది. ఇందులో విశేషం విషాదం ఏమంటే, ఈ వ్యాధులకు ఎలా చికిత్స చేయాలో బ్రిటిషర్స్ కు తెలుసు. అయినా వ్యాధి సోకిన స్వదేశీ సమాజాలకు చికిత్సను అందించలేదు. చనిపోయేలా చేశారు. చనిపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. 1900లలో దేశంలో కలరా, మశూచి, మలేరియా వంటి వ్యాధులు సోకినప్పుడు భారత దేశంలో ఏమి జరిగిందో..  అదే ఆస్ట్రేలియాలో అదే జరిగింది. వ్యాధి నివారణ టీకాలు, చికిత్సా సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులో ఉన్నా, బ్రిటిషర్స్ ఉద్దేశపూర్వకంగానే  దుర్మార్గానికి ఒడి కట్టారు. లక్షలాది మంది భారతీయుల మరణాలకు కారకులయ్యారు.ఆస్ట్రేలియన్ల విషయంలోనూ అదే జరిగింది.  ఇంతకు ముందే అనుకున్నట్లుగా బ్రిటిషర్స్  వస్తూ వస్తూ పట్టుకొచ్చిన వ్యాపార సంస్కృతీని మెల్ల మెల్లగా అమలు చేయడం ప్రారంభించారు.  భూమిని ఆక్రమించుకోవడం, ఆక్రమించు కున్న భూమికి  కంచె వేయడం ప్రారంభించారు.  స్థానిక ఆదివాసీల జీవనాధారమైన వేట పై వేటు వేశారు. స్థానికులకు స్వచ్ఛమైన నీరు అందకుండా చేశారు. ఆహార  సేకరణను నిరోధించారు. ఆ విధంగా బ్రిటిషర్స్  స్థానిక జాతుల ప్రజలను వారి స్వంత భూములలోనే  కూలీలను చేశారు. అదే క్రమమంలో వారి ఆధిపత్యాన్నినిలుపుకునేందుకు బ్రిటిషర్స్ స్థానిక స్త్రీలను, పిల్లలను భయంకరమైన వేధింపులకు గురిచేశారు. గర్భిణీ స్త్రీలతో బలవంతంగా పని చేయించారు. తల్లీ, తల్లి గర్భంలోని పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి  ముత్యాలను సేకరించడానికి ప్రమాదకరమైన జలాల్లోకి పంపారు. ఆ విధంగా  అనేక మంది తల్లీ పిల్లల ప్రాణాలను బలితీసుకున్నారు.  ఈ దుర్మార్గాలను భరిస్తూ వచ్చిన స్వదేశీ ఆస్ట్రేలియన్లు  కొంత కాలానికి విసిగి పోయారు. 1795లో ఇక భరించలేమన్న నిర్ణయానికి వచ్చారు. తిరుగుబాటుకు దిగారు.  ఇది వందేళ్ళ యుద్ధాలకు దారితీసింది. ఈ ఘర్షణలు, వ్యాధులు, భరించరాని శారీరక శ్రమ కారణంగా స్వదేశీ జనాభా క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది. 1900 సంవత్సరం నాటికి, 3 నుండి 7.5 మిలియన్ల నుండి కేవలం30,000 నుండి 75,000 కు పడిపోయింది. అంటే.. 90శాతం స్థానిక సమూహాలు అంతరించి పోయాయి.  కానీ బ్రిటిష్ వారు అక్కడితో ఆగలేదు. స్వదేశీ జనాభాను మరింత తగ్గించడానికి మరొక దుర్మార్గ మార్గాన్ని తెరిచారు. ప్రథమ ప్రపంచ యుద్ధ సమయంలో పెద్ద సంఖ్యలో పురుషులను యూరప్‌కు పంపారు. వారిలో 40శాతం మంది తిరిగి రాలేదు. అంటే యుద్ధంలో చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం మరింత విధ్వంసం సృష్టించింది.  వైమానిక దాడులు, సైనిక ప్రమేయం జనాభాను మరింత నాశనం చేసింది. దీనికి తోడు  శ్వేతజాతీయులు కాని వారిని దేశం వెలుపల ఉంచే లక్ష్యంతో 1901 చేసిన  వలస నియంత్రణ చట్టం..  వైట్ ఆస్ట్రేలియా పాలసీ, స్వదేశీ ఆస్ట్రేలియన్లకు స్వదేశంలోనే చోటు లేకుండా చేసింది. ఈ విధానం స్వదేశీ జనాభాను కోతలకు గురిచేసింది. చివరకు..  ఆస్ట్రేలియాలో  శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. అయితే, ఇందులో కేవలం 3.8 శాతం మంది.. అంటే దాదాపు 10 లక్షల  మంది  మాత్రమే స్థానికులు. ఇది మన దేశంలో ఓ చిన్న  పట్టణం జనాభా కంటే తక్కువ. మరో వంక ఆస్ట్రేలియా భూభాగంలో ఎక్కువ భాగం నిర్జీవంగా, నిర్జనంగా వుంది. దేశ జనభాలో ఎక్కువ శాతం సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, అడిలైడ్, పెర్త్, నగరాల్లోనే కేద్రీకృతమై వుంది.   ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుతోంది. అయినా  ఇప్పటికీ 95 శాతం ఖాళీగా ఎందుకు ఉందంటే, అందుకు  భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణం ప్రధాన కాణంగా పేర్కొనవచ్చును. ఆస్ట్రేలి యాలో విస్తారమైన ఎడారులు, ఉప్పునీటి నదులు, తుఫానులకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువ. దేశంలోని  దక్షిణ భాగం చల్లగా ఉంటుంది. పచ్చని ప్రాంతాలు,పర్వతాలు లేకపోవడం వల్ల, ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీని వలన ఆస్ట్రేలియాలో 70 శాతం భూభాగం  ఎడారిగా, మానవ నివాసానికి పనికిరాని ప్రదేశంగా ఖాళీగా వుంది.  మరోంక మధ్య లోతట్టు ప్రాంతాలలో, భూమి, కొండులు గుట్ట్టలు రాళ్ళలో లవణీయత అంటే ఉప్పు శాతం ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతంలో నీరు ఉప్పగా ఉంటుంది. తాగేందుకు కాదు, కనీసం వ్యవసాయానికీ పనికి రాదు. తూర్పు ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలు, జన జీవనానికి  అనుకూలంగా ఉన్నప్పటికీ, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఆ ప్రాంతం నిలయం. ఈ పరిస్థితి  అక్కడ కూడా మనుగడ కష్టతరం చేస్తున్నది. ఇలా, వలస పాలకుల దుర్మార్గ చరిత్ర, జనజీవనానికి అనుకూలించని వాతావరణ, పర్యావరణ పరిస్థితులు..భౌగోళిక ప్రతికూల పరిస్థితులు  వెరసి ఆస్ట్రేలియా ప్రపంచ పటంలో జనజీవనానికి అంతగా పనికిరాని భూభాగం అధికంగా గల  దేశంగా మిగిలింది. అందుకే..  నేటికీ, జనాభాలో ఎక్కువ భాగం ఆ ఐదు నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంది, మిగిలిన విశాల భూభాగం .. నిర్జీవంగా, నిర్జనంగా మిగిలింది.

ఆపరేషన్ సిందూర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబ్దుల్ రవూఫ్ హతం

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ ఆర్మీ బహవల్ పూర్ లోని ఉగ్ర స్థావరంపై జరిపిన దాడిలో జైషే ఆ మహ్మద్ సంస్థకు చెందిన కరుడుగట్టన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ మరణించాడు. ఈ దాడిలో జైషే కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాాడిలో మరణించిన అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరుడే. అబ్దుల్ రవూఫ్ కందహార్‌   విమానం హైజాక్ లో కీలక పాత్ర పోషించాడు. ఆ విమానం హైజాక్ ద్వారానే అప్పటికి భారత్ లో ఖైదులో ఉణ్న మసూద్ అజార్ ను పాక్ ఉగ్రవాదులు విడిపించుకుపోయారు.  జమ్మూకాశ్మీర్‌ ఉగ్రవాద కార్యకలాపాల్లో రవూఫ్ కీలక పాత్ర పోషించాడు. మోస్ట్ వాంటెడ్  ఉగ్రవాదిగా ఉన్న రవూఫ్ ఆపరేషన్ సింధూరలో భాగంగా భారత్ సైన్యం జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (మే 7) మరణించాడు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీతో పాటు.. పాకిస్థాన్ కూడా ధృవీకరించింది.  కాగా అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలు బహవల్పూర్ లో జరిగాయి. ఈ అంత్యక్రియలు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఐఎస్ఐ అధికారులు హాజరయ్యారు. ఇలా ఉండగా.. అబ్దుల్ రవూఫ్ అజార్  మరణం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్‌వర్క్‌కు, ముఖ్యంగా జైషే మహమ్మద్ సంస్థకు కోలుకోలేని దెబ్బ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 

ధర్మశాల నుండి అహ్మదాబాద్‌కు ఐపీఎల్ మ్యాచ్ మార్పు

    ఐపీఎల్ -2025లో ఈ నెల 11న ధర్మశాలలో జరిగే ముంబై ఇండియన్స్- పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో వేదికను ధర్మశాల  నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు. విషయాన్ని గుజరాత్ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అనిల్‌ పటేల్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌ ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. మేం అంగీకరించాం. ఈ రోజు ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు నగరానికి చేరుకుంటారు.  పంజాబ్‌ జట్టు ప్రయాణ ప్రణాళికలు ఇంకా తెలియరాలేదు’’ అని పటేల్‌ వెల్లడించారు. ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగానే ముంబయి జట్టు అక్కడకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇక, ధర్మశాల వేదికగా నేడు పంజాబ్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ యధావిధిగా జరగనుందని ఐపీఎల్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే రెండు జట్లు అక్కడకు చేరుకోవడంతో ప్రయాణ సమస్య తలెత్తలేదు. కానీ, సాయంత్రం సమయంలో మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్ల వినియోగం భద్రతాపరంగా సమస్యగా మారింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొనగా.. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది.

పాక్ సైనికులపై బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడి.. 14 మంది మృతి

పాకిస్థాన్ పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ, కాలిదగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పబ్బం గడుపుకుంటున్న పాకిస్థాన్ కు ఇప్పుడు అదే ఉగ్రవాదం చుక్కలు చూపిస్తోంది. దేశంలోని అవ్యవస్థ, ఆర్థిక సంక్షోభం నుంచి తమ దేశ ప్రజల దృష్టి మరల్చడానికి భారత్ బూచి చూపిస్తూ, భారత్ లో ఉగ్రదాడులకు తన వంతు ప్రోత్సాహం, సహాయం, సహకారం అందిస్తూ వస్తున్న పాకిస్థాన్ కు భారత్ ఆపరేషన్ సిందూర్ పేర దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ దేశ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపి ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, పాక్ సేనలు లక్ష్యంగా దాడులు ముమ్మరం చేసింది. గురువారం (మే 8) ఒక్క రోజే  బలూలచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన రెండు వేర్వేరు దాడులలో 14 మంది పాక్ సైనికులు హతమయ్యారు.  బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్  పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ బాంబు పేల్చింది. బలూచిస్థాన్ లోని ముచ్కుంద్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 12 మంది పాక్ సైనికులు మరణించారు. అలాగే బలూచిస్థాన్ లోనే జరిగిన మరో దాడిలో ఇద్దరు పాక్ సైనికులు చనిపోయారు. ఇక పాకిస్థాన్ లోని కీలక నగరమైన లాహోర్ వరుస బాంబులతో దద్దరిల్లిపోయింది. లాహోర్ లోని సైనిక విమానాశ్రయానికి అతి సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ఈ బాంబుదాడులకు పాల్పడినట్లు భావిస్తున్నాయి. ఈ వరుస పేలుళ్లతో అప్పమత్తమైన భద్రతా బలగాలు లాహోర్ విమానాశ్రయాన్ని మూసివేసి, నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.   

ఏపీ లిక్కర్ స్కాం..రంగంలోకి ఈడీ?

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ దర్యాప్తునకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. ఈ కుంభకోణం నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు వివరాలు కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏపీ పోలీసులకు లేఖ రాసింది. ఈ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ సహా కేసు వివరాలన్నీ సమర్పించాల్సిందిగా ఈ లేఖలో ఈడీ ఏపీ పోలీసులను కోరింది. ఈ మేరకు ఈడీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు, విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖలు రాసింది.   ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ఈ ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తునకు ఈడీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఎఫ్ఐఆర్ తో పాటుగా ఈ కేసులో ఇంత వరకూ జరిగిన దర్యాప్తు వివరాలు, సీజ్ చేసిన అక్కంట్ల వివరాలు, అలాగే ఈ  నగదు లావాదేవీల వివరాలు,  ఇంత వరకూ జరిగిన అరెస్టులు తదితర సమాచారాన్ని అందించాలని ఈడీ సిట్ చీఫ్, బెజవాడ పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో కోరింది.  ఈ కేసు దర్యాప్తు ఈడీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వా చాలా కాలంగా కోరుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు సందర్భాలలో ఈ కేసును ఈడీకి రిఫర్ చేస్తామని ెప్పారు. అవినీతి వ్యవహారంలో సిట్ చర్యలు తీసుకుంటుంది, కానీ మనీల్యాండరింగ్, అక్రమ నగదు లావాదేవీలు తదితర అంశాలు కూడా ఈ కేసులో బయటపడటంతో ఈడీ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

అమరావతి చట్టబద్దతపై ఏపీ మంత్రివర్గ తీర్మానం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత  కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపారు.  భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్ చేశారంటూ మంత్రి‌వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్ల కాల పరిమితి ముగియడంతో అమరావతి పేరిట గెజిట్‌పై కేంద్రాలని కోరాలని కేబినెట్ నిర్ణయించారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం పెంపు,  రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్‌ నిర్వహించే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. మున్సిపల్‌ శాఖ 281 పనులను హైబ్రిడ్‌ యాన్యూటీ విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 3 బిల్లులను వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు అంగీకరించింది.  47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించింది.

ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కోసం సిట్ వేట

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కోసం సిట్ వేట ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, అతడి సహాయకుడు దిలీప్ లు ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉండగా, జగన్ హయంలో కీలకంగా వ్యవహరించిన మరో ముగ్గురి కోసం సిట్ ఇప్పుడు గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ ముగ్గురూ ఎవరంటే... మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పలు. వీరు ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో వారు యాంటిసిపేటరీ బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా వారికి అరెస్టు నుంచి ఎలాంటి రక్షణా కల్పించడానికి నిరాకరించడంతో ఇక వారి అరెస్టు లాంఛనమే అన్నట్లు మారింది. ఈ దశలో ఈ ముగ్గురి కోసం సిట్ వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీ లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పీఏ కృష్ణమోహన్ రెడ్డి , భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లను సెట్ అధికారులు నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.  అయితే ముగ్గురు నిందితులు తమతమ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకు పోయినట్టు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో ముగ్గురి నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అక్కడ తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో  సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు,  హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు?!

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కి పెద్ద చరిత్రే ఉందని చెప్పక తప్పదు. వైసీపీ ఏర్పాటు నుంచి జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో  చక్రం తిప్పే పరిస్థితి ఉండేది.  కాని ఇప్పుడు  ఆ పరిస్థితి ఇసుమంతైనా ఎక్కడా కానరావడం లేదు.   కేవలం ఒక్కరు, ఇద్దరు మినహా  అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి, చక్రం తిప్పిన నేతలెవరూ ఇప్పుడు ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు.  ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో తిరుపతి, కుప్పం మినహా అన్నింటిలో వైసీపీ బలం స్పష్టంగా కనిపించేది.  2019 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది.  వైసీపీ అధినేత జగన్   ప్రభావం ఆ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపిందించి. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనతో ఆ పార్టీని జిల్లా జనం పూర్తిగా తిరస్కరించారు. అందుకే 2024 ఎన్నికలలో వైసీపీ  పరిస్థితి తలకిందులై పోయింది.  ఎ  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం విజయబావుటా ఎగుర వేసింది.   చంద్రగిరి, పూతల పట్టు నియోజకవర్గాలలో  చాల సంవత్సరాల తరవైక టీడీపీ జెండా ఎగురేసింది.  ఇక కూటమి ప్రభుత్వం  ఏర్పడిన తరువాత  జిల్లాలో వైసీనీ నేతల అడ్రస్ ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది.  అధికారం ఉందని ఇష్టారాజ్యంగా  ఇసుక  దందా నుంచి భూముల కబ్జాల వరకూ చెలరేగిపోయిన నేతలు ఇప్పుడు వారి నియోజకవర్గాలవైపు కూడా చడటం లేదు.  అది పక్కన పెడితే ఇంకా ఉన్నాం అని చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు నేతలు సైతం ఇంటి గడపదాటి ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వీరిలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఒకరు. ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు జగన్.  దీంతో ఆ హోదాలో భూమన  తన ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప..  ఎక్కడా ప్రజలతో కలిసి లేదా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవని సొంత పార్టీ  శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గ నాయకులతో అడపా దడపా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇదివరకటిలా యాక్టివ్ గా లేరు.  పెద్దిరెడ్డి కుటుంబం అయితే నియోజకవర్గంలోని తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి ఉంది. వీరు తప్ప ఇక జిల్లాలో ఎక్కడా మరో వైసీపీ నేత కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  

హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం ఎంపీ సోదరి మృతి

    ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్టు గుర్తించారు. మరణించిన వారిలో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వేదవతి భర్త భాస్కర్‌కు ప్రమాదంలో గాయాలయ్యాయి.   అతడిని రుషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. 

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : రాజ్‌నాథ్

    పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌ వివరాలను గురువారం ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించేందుకు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మాట్లాడుతూ.. తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.  దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమన్నారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం తమకు లేదని, కానీ, పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతుందని వెల్లడించారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు మీడియాతో మాట్లాడారు. పరేషన్‌ సిందూర్‌ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఇది కొనసాగుతున్న ఆపరేషన్‌ గనుక.. సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదని రిజిజు వెల్లడించారు.  

ఆపరేషన్ సిందూర్.. అసలు సినిమా ముందుంది!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం, బుధవారం (మే 7) తెల్లవారు జామున మెరుపుదాడి చేసింది. ఏక కాలంలో తొమ్మది ఉగ్ర  స్థావరాలపై జరిపిన ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఆరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌ భారతీయులలో ఆనందాన్ని నింపింది. ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.ఇంత కాలానికి పాకిస్థాన్  పెంచి పోషిస్తున్నఉగ్రవాదానికి శాశ్వత సమాధి కట్టే దిశగా స్థిరమైన అడుగు పడినందుకు సర్వత్రా సంతోషం వ్యకమవుతోంది.   అయితే..  ఇక్కడితో కథ ముగిసినట్లేనా అంటే కాదు. నిజానికి అసలు కథ ఇప్పుడే  మొదలైంది. అవును.. సినిమా ఇంకా అయిపోలేదు. నిజానికి అసలు సినిమా ఇంకా మొదలే కాలేదు. ఇంతవరకు చూసింది  ట్రైలర్ మాత్రమే. అసలు కథ ముందుంది. అయితే.. ఇంతలోనే పాకిస్థాన్  చేతిలేత్తేస్తే  ఎత్తేసి ఉండవచ్చును. కానీ..  ఏప్రిల్ 22 న  భారత మాత నుదుటి సిందురాన్ని చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన పహల్గాం ఉగ్రదాడికి  ప్రతీకారం ఇంతటితో తీరేది కాదు. పసుపు పారాణి అయినా ఆరని నవవధువు, నేవీ అధికారి వినయ్ నర్వాల్  భార్య హిమాన్షి  సహా 26 మంది హిందూ మహిళల నుదుటి తిలకాన్ని చెరిపేసిన ఉగ్రదాడికి, ఓ వంద మంది ఉగ్రవాదులను హత మార్చడం ముగింపు కాదు.  ఉగ్రవాదాన్ని,ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ ను శిక్షించే వరకు ఆపరేషన్ సిందూర్  ఆగదు.ఆగకూడదు.   ఇదే విషయాన్ని..  భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే తమదైన సైనిక భాషలో చక్కగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు. సినిమా అప్పుడే అయిపోలేదు..ఇంకా ఉంది' (పిక్చర్ అభీ బాకీ హై) అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని ఇటు నెటిజన్లు, అటు నిపుణులు ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి, భారత విదేశాంగ మంత్రి  జై శంకర్  కొద్ది రోజుల క్రితం  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆ దేశ చెర నుంచి విడిపించడం ఒక్కటే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు.  సో.. తాజా పరిణామాలను గమనిస్తే, భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే చెప్పినట్లుగా పిక్చర్ అభీ బాకీ హై .. సినిమా ఇంకా వుంది. కాదు కాదు అసలు సినిమా ముందుంది. 

ఈ ఆలయాల్లో ఇక అపరిమిత అన్న ప్రసాద పంపిణీ!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 16 ప్రముఖ దేవాలయాలలో అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.    సెక్రటేరియట్లో దేవాదాయ శాఖపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు.   ప్రస్తుతం  విజయవాడలోని కనకదుర్గా దేవాలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి   దేవాలయాలలో మాత్రమే ఈ పథకం అమలులో ఉంది. ఇప్పుడు మరో 16 దేవాలయాలలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   ఆ నిర్ణయం మేరకు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యభగవానుడి ఆలయం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం,  కాకినాడ జిల్లా తుని పమీపంలోని   తలుపులమ్మ అమ్మవారి ఆలయాలలో నిరంతర అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే  కోనసీమ జిల్లాలో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు   తిరుప తమ్మ అమ్మవారి ఆల యం,  కృష్ణాజిల్లా మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయం,  గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయాల్లోనూ,  నెల్లూరు జిల్లా పెంచలకోన లక్ష్మీనరసిం హస్వామి, మాలకొండ మా ల్యాద్రి లక్ష్మీనరసిం హస్వామి,  కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయాలలోనూ కూడా అపరిమిత అన్న ప్రసాద పంపిణీ జరగనుంది. నంద్యాల జిల్లా  మహానందీశ్వరస్వామి, రంగాపురం మద్దిలేటి నరసింహస్వామి ఆలయాల్లోనూ, అలాగే అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనే యస్వామి,  శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఖాద్రి లక్ష్మీనర సింహస్వామి,  చిత్తూరు జిల్లాలో బోయకొండ గంగమ్మ ఆలయాలలో కూడా అపరిమిత అన్నదాన వితరణ కార్యక్రమాన్ని అములు చేయనున్నారు.  

సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పులు.. దేశ వ్యాప్తంగా హై అలర్ట్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మది ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయ్యింది. భారత్ నిర్వహించిన మెరుపుదాడులలో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ  నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత భూభాగంపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులకు భారత్ సేనలు దీటుగా బదులిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం (మే7) పాకిస్థాన్ విచక్షణా రహితంగా, ఏకపక్షంగా భారత భూభాగంపైకి జనావాసాలు లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో పది మంది సాధారణ పౌరులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు ఏకపక్షంగా, విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోంది.   పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది.  యూరీ, కుప్వారా, రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో పాక్ సేనల కాల్పులకు భారత్ సైన్యం దీటుగా బదులిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధమౌతోంది. కాగా ఇప్పటి వరకూ పాక్ జరిపిన కాల్పులలో నలుగురు చిన్నారులు సహా పదిహేను మంది మరణించారు. భారత్ దీటుగా జరిపిన కాల్పులలో పలువురు పాకిస్థాన్ సౌనికులు మరణించినట్లు సమాచారం. 

చరిత్రను తిరగరాసిన సిందూర విజయం!

ఆపరేషన్ సిందూర్   కొద్ది నిముషాల వ్యధిలో విజయవంతంగా పూర్తయిన  సైనిక చర్య. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన అద్వితీయ, అత్యద్భుత సైనిక చర్య.  కేవలం 25 నిముషాల వ్యవధిలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించడాన్ని దేశమే కాదు, ప్రపంచం మొత్తం హర్షిస్తోంది. ఎక్కడా, వీసమెత్తు అపశ్రుతి లేకుండా..  భారత సైన్యం, సంపూర్ణం చేసిన ఆపరేషన్ సిందూర్  చరిత్రలో సిందూరం శక్తికి, పవిత్రకు ప్రతీకగా నిలిచి పోతుంది.   నిజానికి  ఈ ఆపరేషన్ మొత్తం ఒకెత్తు అయితే, ఈ  పవిత్ర  ప్రతీకార చర్యకు పెట్టిన  ఆపరేషన్ సిందూర్  పేరు ఒక్కటీ ఒకెత్తుగా పేర్కొంటున్నారు. ఆపరేషన్ సిందూర్      ప్రతి భారతీయుడి గుండెను తట్టి లేపిందని అంటున్నారు పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు 26 మంది మాతృ మూర్తుల నుదుటి సిందూరాన్నిచెరిపేసిన  పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన  ఆపరేషన్ సిందూర్  పేరు భారతీయుల గుండెలను తట్టి లేపడమే కాదు, పాకిస్థాన్ కు బలమైన సందేశాన్ని కూడా పంపింది. నిజానికి  ప్రతీకార చర్యకు ఇలాంటి పేరు పెడతారని ఎవరూ ఉహించి ఉండక పోవచ్చును. అయితే, మంగవారం (మే 6) రాత్రంతా  సైనిక దాడులను పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా  ఆపరేషన్ సిందూర్  పేరును సూచించారని, అధికార వర్గాలు పేర్కొన్నాయి.  ఏప్రిల్ 22 న  పహల్గాం లోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్ర వాదులు 26 మంది పురుషులను అత్యంత దుర్మార్గంగా హత మార్చారు. పుణ్య స్త్రీల నుదుటి సిందూరాన్ని కర్కశ మూకలు చెరిపేశాయి. ఉగ్ర పాపానికి మించిన మహా పాతకానికి,  ఘోర తప్పిదానికి ఉగ్రమూకలు పాల్పడ్డాయి. హిందూ సప్రదాయంలో వివాహిత మహిళలు నుదుటన ధరించే సిందూరానికి ఉన్న విలువేమిటో  ముష్కర మూకలకు తెలియక పోవచ్చును కానీ.. భారతీయులకు తెలియంది కాదు. ఆ సిందూరాన్ని దూరం చేసిన మహా పాతకానికి పాల్పడిన ముష్కర మూకలను భారత దేశం ఎట్టి  పరిస్థితిలోనూ వదిలి పెట్టదనే సందేశం  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకే కాదు, పాక్ పాలకులకు చేరాలని ప్రధాని మోదీ అధికారాలకు స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రధాని మోదీ  ప్రతీకార ఆపరేషన్ విషయంలో సైన్యానికి  సంపూర్ణ స్వేచ్చను ఇచ్చినట్లు చెపుతున్నారు.ఇప్పడు విజయవంతమైనఆపరేషన్ కు ప్రధాని మోదీనే  నామకరణం చేశారు. ఇప్పడు  ఆపేరే  ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతి ధ్వనిస్తోంది. మహిళల్లో  విశ్వాసాన్ని నిపింది. భారతీయ సమాజానికి స్పూర్తిగా నిపిచింది. భారతీయ విలువలకు. భారతీయ మహిళల శక్తికి ప్రతీకగా నిలిచింది. ఒక విధంగా స్వాతంత్ర్య సంగ్రామంలో  వందే మాతరం  నినాదం ఎలాగైతే భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతను తట్టిలేపిందో.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతా స్పూర్తిని మరోమారు తట్టి లేపింది.  ఇక్కడ  ఇంకొక్క విషయం కూడా చెప్పుకోవాలి.. భారతీయ హైందవ సంప్రదాయంలో  వివాహిత మహిళల నుదుటి సిందూరం ఒక అలంకారం కాదు  మహిళా శక్తికి ప్రతి రూపం.  అనే విషయాన్ని కూడా  భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియచేసిందని అంటున్నారు. అవును. ఇంతవరకు భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్దాలు జరిగాయి, యుద్ధంతో సమానమైన సర్జికల్ స్ట్రైక్స్  జరిగాయి. పరస్పర దాడులు జరిగాయి కానీ, ఏ సందర్భంలోనూ మహిళలు ముందుండి సైనిక చర్యను నడిపించింది లేదు. ఇప్పుడు  ఆపరేషన్ సిందూర్ పేరిట జరిగిన సైనిక చర్యను ఇద్దరు మహిళలు.. కల్నల్ సోఫియా, కంమాండర్  వోమిక ముందుండి నడిపించారు. అంతే కాదు, ఆ ఇద్దరే, సైనిక చర్య వివరాలను మీడియాకు వివరించారు. అందుకే  ఆపరేషన్ సిందూర్ కేవలం మరో ప్రతీకార సైనిక చర్య కాదు.. సిందూరశక్తిని, సిందూర పవిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన సిందూర విజయం. 

హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

  ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.  రాష్ట్రంలో భద్రత కట్టదిట్టం చేయాలని అధికారులను సూచించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఎలా స్పందించాలనే దానిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అత్యవసర సేవలు నిరవధికంగా అందుబాటులో ఉండేలా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సీఎం సూచించారు.హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను అమలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక, శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ వద్ద భద్రతను మరింత బలపర్చాలన్న ఆదేశాలు జారీ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు. భద్రతా సమాచార వ్యవస్థను సమర్ధవంతంగా సమన్వయం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భాగ్య నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. 

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో అతుల్ జైన్‌తో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత కలిగిన మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. నీటిపారుదల శాఖ అధికారుల బృందం కూడా ఈ సమావేశానికి హాజరైంది. నేషనల్ డ్యామ్ సంరక్షణ సంస్థ సమర్పించిన నివేదికలో మేడిగడ్డ డ్యామ్ డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లో భారీ లోపాలు ఉన్నాయని స్పష్టం చేయడంతో, దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు మేము పునరుద్ధరణ మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.  డీపీఆర్‌లో చూపిన ప్రదేశానికి భిన్నంగా వేరే ప్రాంతంలో నిర్మాణం జరగడం తగదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పలు ప్రతిపాదనలను ఆయన కేంద్రం ముందుంచారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అంశం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. బ్యారేజీ మరమ్మతులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలసంఘం ఛైర్మన్‌కు వివరించారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికలో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, డిజైన్‌లో స్పష్టమైన లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి విడతకు 45 టీఎంసీల నీటిని, అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీకి 44 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.