అడ్డే వుండదనుకుంటే... అడ్డంగా బుక్కయ్యారు!

  రాజకీయాలంటే పెద్దగా ఇంట్రస్ట్ లేని వారికి కూడా ఎన్నికలంటే ఆసక్తే! ఎందుకంటే, ఎన్నికల్లో అప్పటికప్పుడు తేలిపోయే గెలుపోటములు వుంటాయి. తమ నేత గెలిచాడా లేదా? లేదంటే తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నెగ్గాడా లేదా? ఇది అందరికీ కావాల్సిన అంశం! ఎలక్షన్స్ రిజల్స్ట్ డే రోజైతే అందరి చర్చా ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్నదాని చుట్టూనే నడుస్తుంటుంది!   2017 సంవత్సరానికే హైలైట్ గా సాగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అన్న చర్చ ఇప్పుడు విపరీతంగా నడుస్తోంది! ఇన్ ఫ్యాక్ట్ ఈ మొత్తం ఎన్నికల్లో ఎవరైనా తిరుగు లేకుండా గెలిచారంటే అది మోదీనే! కాని, ఆయన అసలు పోటీనే చేయలేదు! మరి ఆయా రాష్ట్ర అసెంబ్లీలకి పోటీ చేసి ఓడిపోయి ఆశ్చర్యపరిచిన ప్రముఖులు ఎవరు?   అందరి దృష్టినీ ఆకర్షించిన అతి పెద్ద రాష్ట్రం యూపీలో ములాయం కోడలు ఓడిపోవటం అందర్నీ ఆశ్చర్యపరిచింది! ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది ఓడిపోయినా స్వయాన పార్టీ మహా నాయకుడు ములాయం చిన్న కోడలు అయ్యి వుండీ అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత రీటా బహుగుణా జోషీ చేతిలో ఖంగుతిన్నారు! ఇక ఉత్తర్ ప్రదేశ్ పక్కనున్న ఉత్తరాఖండ్ లో ని్న్నటి దాకా సీఎంగా వున్న హరీష్ రావత్ ఓడిపోయారు! అదీ ఒక్క చోట కాదు.. రెండు చోట్ల నుంచీ పోటీ చేసి రెండు స్థానాల్లో తూర్పుకి తిరిగి దండం పెట్టేశారు!   మణిపూర్ కూడా జనాలకి మంచి షాకింగ్ ఓటమిని అందించింది! చాలా ఏళ్లు నిరాహార దీక్ష చేసి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇరోమ్ షర్మిలా ఎన్నికల బరిలో ఏ మాత్రం సత్తా చూపలేదు. 90 ఓట్లు మాత్రమే సాధించి దారుణ ఓటమి పాలైంది. ఆమె ఓడుతుందని మీడియా, మేధావులు ఎంత మాత్రం ఊహించలేదు!   పంజాబ్ లో కాంగ్రెస్ అద్భు విజయం దక్కించుకుంది. సీఎం అవ్వబోయేది కెప్టెన్ అమరీందర్ సింగ్. అయితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన ఈయన ఎమ్మెల్యేగా మాత్రం ఓటమి పాలయ్యారు! అదృష్టవశాత్తూ రెండు స్థానాల్లో పోటీ చేయటంతో ఒక చోట గెలిచి, మరో చోటా బొక్కా బోర్లా పడ్డారు! ఎలాగైతేనేం, కెప్టెన్ గారికి పెద్ద ప్రమాదమైతే తప్పింది!   ఎన్నికలు జరిగిన మరో రాష్ట్రం గోవా కూడా ఓ నాయకుడికి మంచి షాకిచ్చింది. మోదీ ఛరిష్మాతో ఎంతో మంది బీజేపీ నేతలు గట్టేక్కేస్తుంటే గోవా సీఎంగా చేసిన లక్ష్మీకాంత్ పర్సేకర్ మాత్రం ఢమాల్ మనిపించారు బ్యాలెట్ వార్లో! కొంచెం ముందంజలో వున్న కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తోన్న గోవా బీజేపి లక్ష్మీకాంత్ ని మాత్రం కాపాడుకోలేకపోయింది!    

గోవాకి మరో పారికర్, గుజరాత్ కి మరో మోదీ అవసరమా?

  అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం మీద పై చేయి బీజేపీదే అయింది! ఎందుకని? సూటిగా మాట్లాడుకుంటే , బీజేపీకి మోదీ వున్నాడు. మిగతా పార్టీలకు అలాంటి నాయకుడు లేడు! అక్కడే వచ్చింది వున్న తంటా అంతా! పంజాబ్ లో గెలిచిన కాంగ్రెస్ కి కారణం రాహుల్ గాంధీ నేతృత్వం అనలేం. అలాగే, ఎస్పీకి, బీఎస్పీకి కూడా అఖిలేష్, మాయావతి మోదీని ఢీకొట్టే స్థాయిలో నాయకత్వం అందించలేకపోయారు! అందుకే, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో స్పష్టమైన విజయం, గోవా, మణిపూర్ లలో గట్టి పోరాటం మోదీ నేతృత్వంలోని బీజేపి సుసాధ్యం చేయగలిగింది. అకాళీ దళ్ వల్ల పంజాబ్ లో మాత్రం ఓటమి అంగీకరించింది.   మిగతా పార్టీలతో పోల్చితే బీజేపికి మోదీ రూపంలో బలమైన నాయకత్వం, అమిత్ షా రూపంలో తెలివైన వ్యూహం వున్నప్పటికీ... కమలనాథులు కూడా గుర్తించాల్సిన ఒక సత్యం ఈ ఎన్నికల్లో బయటపడింది. అది వారు గోవా నుంచి గ్రహించాలి. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ బీజేపి గోవాలో పాగా వేయటం కీలకమైన పరిణామం. అక్కడ క్యాథలిక్స్ ఓటర్లని కూడా మెప్పించి, విశ్వసింపజేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు మనోహర్ పారికర్. ఆయన్ని ఒక్కసారిగా ఢిల్లీకి పిలిపించటంతో గోవాలో నాయకత్వం లోపం బయలుదేరింది. అదే గోవాలో బీజేపి ఇబ్బందులన్నిటికి మూలమైంది. పారికర్ తరువాత సీఎం గా వున్న లక్ష్మీకాంత్ పర్సేకర్ ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయారంటే ఎంత బలహీనమైన నాయకత్వం గోవాలో పార్టీని నడుపుతోంది అర్థమవుతుంది! పారికర్ లాంటి మరి కొంత మంది నేతల్ని గోవా బీజేపి రెడీ చేసుకోవాల్సింది. లేదంటే బీజేపి హైకమాండ్, ఆరెస్సెస్ లు ఆ దిశగా ఆలోచించాల్సింది. ఇకనైనా ఆ పని చేయకపోతే గోవాలో వెంట వెంటనే కోలుకోవటం కష్టమైపోతుంది!   గోవాలో మాదిరిగానే బలమైన నాయకత్వ లేమీ అనే లోపంతో బాధపడుతోన్న మరో కాషాయ రాష్ట్రం గుజరాత్. మోదీ, అమిత్ షాల స్వంత రాష్ట్రమైన గుజరాత్ బీజేపి కంచుకోటగా మారిపోయింది. వరుసగా అక్కడ కమలం వికసిస్తూనే వుంది. కాని, వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రంలో నమో పీఎం అయ్యేందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కగానే గందరగోళం నెలకొంది. ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు తెర మీదకి. అయినా కూడా పటేళ్ల ఉద్యమం లాంటివి సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. ముందు ముందు ఇది కూడా గుజరాత్ బీజేపికి కష్ట కాలం తెచ్చి పెట్టే అవకాశం వుంది.   గుజరాత్, గోవా లాంటి రాష్ట్రాల్లో స్థానిక నేతల్లోంచి బలమైన నాయకుల్ని బీజేపి హైకమాండ్ తయారు చేసుకోవాలి. లేదంటే రాష్ట్ర స్థాయిలో గుమాస్తాల మాదిరి నేతల్ని సీఎంలను చేస్తూ కాంగ్రెస్ వ్యూహం పాటిస్తే కొన్నాళ్లకి పతనం తప్పదు!

కౌన్‌ బనేగా యూపీ సీఎం?

  ఉత్తరప్రదేశ్ ‌లో బీజేపీ భారీ విజయం సాధించడంతో... ఇప్పుడు అందరి మెదళ్లను ఒక్కటే ప్రశ్న తొలుస్తోంది. యూపీ నెక్ట్స్ సీఎం ఎవరూ అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు.... సీఎంను నిర్ణయించనుండటంతో ఎవరిని లక్కీ ఛాన్స్ వరిస్తుందని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పదిహేనేళ్ల తర్వాత అధికారం దక్కడంతో ఎవరిని సీఎంగా నియమించాలనే దానిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు చర్చిస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ భారీ మెజార్జీ సాధించడంలో మౌర్య కీలక పాత్ర పోషించారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచారం వరకు మౌర్య చక్కగా లీడ్ చేయడంతో పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడ్డాయి. అయితే అతను ఈమధ్యే బీఎస్పీ నుంచి వచ్చి చేరడంతో పార్టీలో కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌర్యతో పాటు...పార్టీ సీనియర్ నేత, ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎం రేసులో పోటీ పడుతున్నారు. గోరఖ్ పూర్ నుంచి పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. హిందూ యువ వాహిని  సంస్థను కూడా రన్ చేస్తున్నారు. గోరఖ్ నాథ్ మఠానికి మహంత్‌గా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సిద్ధార్థ్ నాథ్ సింగ్.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు కావడం విశేషం. వీరితోపాటు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు కూడా నానుతోంది. యూపీకే చెందిన రాజ్ నాథ్.. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మరి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎవరిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తుందో త్వరలో తేలిపోనుంది.

టీవీ స్టూడియోల్లో గెలిచి ఎన్నికల్లో ఓడిన ఆప్!

  మన దేశంలో రాజకీయ పార్టీలు రెండు రకాలుగా వుంటాయి! మొదటి రకం ... జనం మెచ్చినవి! రెండో రకం... మెయిన్ స్ట్రీమ్ మీడియా నచ్చినవి! ఇందుకు మంచి ఉదాహరణ, ఆమ్ ఆద్మీ పార్టీ! అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నడిచే ఈ ఢిల్లీ పార్టీ అంటే జాతీయ ఇంగ్లీష్ , హిందీ మీడియాకి ఎక్కడలేని ఆసక్తి! అన్నా హజారేతో విడిపోయి కేజ్రీవాల్ స్వంత దుకాణం తెరిచినప్పటి నుంచీ ఇంగ్లీష్, హిందీ పేపర్లు, ఛానల్స్ దాదాపుగా ఆప్ కు మద్దతు ప్రకటిస్తూనే వచ్చాయి. కొత్త రకం రాజకీయం అంటూ కొంత కాలం భ్రమ ఏర్పడినా రాను రాను ఆప్ ఎదుర్కొంటోన్న విమర్శలు చాలా మందిని పునరాలోచనలో పడేశాయి. అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తో సహా చాలా మంది ఆప్ పైన అసంతృప్తి వెళ్లగక్కారు! అయినా మన మీడియా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కట్టా పాత పార్టీల్ని ఊడ్చేస్తుందంటూ అవసరానికి మించి హైప్ క్రియేట్ చేస్తూనే వచ్చాయి!   ఈ సారి జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు నుంచీ కూడా ఆప్ ఎప్పటిలానే మీడియా ప్రొత్సాహాన్ని బోలెడంత పొందింది! పార్లమెంట్లో ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన కేజ్రీవాల్ ఈసారి తెలివిగా యూపీ జోలికి వెళ్లలేదు. గోవా, పంజాబ్ లలో పాగా వేద్దామని తలిచాడు. రాజకీయ నేతగా ఆయనకు ఆ హక్కు వున్నా... జనానికి వాస్తవాలు చెప్పాల్సిన మీడియా ఆయన పార్టీని ఆకాశానికి ఎత్తేసింది!   గోవాలో , పంజాబ్ లో బీజపి పాలనని అంతం చేసేస్తుందంటూ ఆప్ పై అపోహలు కల్పించాయి. ప్రీ పోల్స్ లో, ఒపీనియన్ పోల్స్ లో, ఎగ్జిట్ పోల్స్ లో వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తూ వచ్చాయి! కాని, చివరకు ఫలితాలు వచ్చాక ఆప్ ప్రభావం మీడియా చెప్పినదాంట్లో వందో వంతు కూడా కాదని తేలిపోయింది! పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లొచ్చినా.. గెలిచిన కాంగ్రెస్ సాధించిన సీట్లలో సగం కూడా ఆప్ కు రాలేదు. ఇక గోవాలో అయితే ఖాతా తెరిచే సూచనలు కనిపించటం లేదు! ఇలాంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఆప్ కు వుందని మీడియాకు, సీనియర్ జర్నలిస్టులకి తెలియదా? తెలియదనుకోవటం మన అమాయకత్వమే అవుతుంది!

మోదీ కొత్త నోట్లు.. బీజేపికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయా?

  నోట్ల రద్దు... ఇక మీదట ఈ విషయం రద్దైపోయినట్టేనా? యూపీలో ఫలితాలు చూశాక అలాగే అనిపిస్తోంది! నవంబర్ లో మొదలైన నోట్ల రద్దు గోల డిసెంబర్, జనవరిల్లో ఉధృతంగా నడిచింది. ఫిబ్రవరీలో తగ్గు ముఖం పట్టింది. అయినా ఇటు మీడియా, అటు అరవింద్ కేజ్రీవాల్, మమతా, కాంగ్రెస్ నేతలు అందరూ ఇంకా వీలైనప్పుడల్లా రభస చేస్తూనే వున్నారు! కాని, ఎన్నికల తరువాత ఎన్నికలు మోదీ నోట్ల రద్దు విషయాన్ని ప్రజలు కోపగించుకోలేదని నిరూపిస్తున్నాయి!   యూపీలో గెలుపు లోకల్ అంశాల మీదే తప్ప డీమానిటైజేషన్ గురించి కాదని కొందరు వాదించవచ్చు. అది కరెక్టే! కాని, నవంబర్ లో పెద్ద నోట్లు రద్దైన వెంటనే రెండు మూడు చోట్ల పార్టమెంట్ కు ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడెక్కడా బీజేపి తన పాత స్థానాల్ని కోల్పోలేదు! ఇక ఆ తరువాత వరుసగా మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చాయి. ముంబై లాంటి అతి సంపన్నమైన మున్సిపాలిటి కూడా బీజేపి వశమైంది! ఇవే కాకుండా ఎప్పుడూ లేనిది ఒరిస్పా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో కమల వికాసం జరిగింది! వందల సంఖ్యలో గ్రామ పంచాయితీలు కొన్నాళ్ల క్రితమే బీజేపి ఖాతాలో పడ్డాయి!   నవంబర్ నుంచి ఇప్పటి దాకా , అంటే, గత అయిదు నెలల్లో గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా అన్ని ఎలక్షన్సూ జరిగాయి! ప్రతీ స్థాయి ఓట్ల యుద్ధంలో కూడా మోదీ, బీజేపి విజయఢంకాని ఎవ్వరూ నిరోధించలేకపోతున్నారు! మరీ ముఖ్యంగా, నోట్లు రద్దై ఇక్కట్లు పడ్డ జనం మోదీకి బుద్ది చెబుతారని ఆశించిన ప్రతి పక్ష నేతలు ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు! సో... ఇక డీమానిటైజేషన్ కథ కంచికే అనుకోవాలి!

రేప్ చేసినాయనకి గెలుపు! నిరాహార దీక్ష చేసినామెకి ఓటమి!

  ఇండియాలో ఎన్నికల్ని, ఎన్నికల ఫలితాల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం!  దాదాపు అసాధ్యం కూడా! తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సత్యం మరోసారి స్పష్టమైంది! అతి చిన్న రాష్ట్రం మణిపూర్ మొదలు అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ వరకూ ఈ సారి ఎన్నికలకు వెళ్లాయి. అయితే, యూపీలో ఎక్కడా లేనంత మంది కోటీశ్వరులు, క్రిమినల్స్ ఓట్ల యుద్ధంలో పోటీ పడ్డారు! అటు కాంగ్రెస్ కంచుకోట లాంటి మణిపూర్ లో కూడా ఈసారి బీజేపి బలంగా రంగంలోకి దిగింది! అంతే కాదు, ఏళ్లుగా నిరాహార దీక్ష చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా ఏకంగా ముఖ్యమంత్రి పైనే పోటీ చేశారు!   మణిపూర్ లో సైన్యానికి విపరీత హక్కులు వుండద్దంటూ షర్మిలా ఎన్నో ఏళ్లు ఆహార, పానీయాలు ముట్టకుండా దీక్ష చేసింది. అయినా ఏం లాభం లేకపోవటంతో ఈ సారి ఆమె ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని భావించారు. అయితే, డైరెక్ట్ గా సీఎం అభ్యర్థి ఒక్రామ్ ఐబోబిపై పోటీ చేశారు. దారుణంగా... 90ఓట్లు మాత్రమే సాధించి పరాజయం పాలయ్యారు!   జనం కోసం క్రుంగి కృశించిన షర్మిలా దారుణ ఓటమి చవిచూస్తే ఉత్తర్ ప్రదేశ్ లో ఒక ప్రబుధ్దుడు మాంచి లీడ్ లో వున్నాడు! ఆయన గెలవటం లాంఛనమే అంటున్నారు! అతనే ప్రస్తుతం పోలీస్ ల నుంచి తప్పించుకుని పరారీలో వున్న బడా క్రిమినల్ గాయత్రి ప్రజాపతి! ఎస్పీ అభ్యర్థిగా బరిలో వున్న ఆయన రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయినా ఆయన నియజకవర్గంలో జనం ఆయనకి భారీగా ఓట్లు వేసి అసెంబ్లీకి పంపే ఆలోచనలో వున్నారు! తమ నేత రేప్ చేశాడని ఆరోపణలు వచ్చిన లైట్ తీసుకునే జనం బహుశా మన దేశంలో తప్ప ఎక్కడా వుండరనుకుంటా! మరో వైపు జనం కోసం దీక్ష అంటూ పోరాటం చేసిన వ్యక్తికి మాత్రం మణిపూర్ ఓటర్లు 90 ఓట్లు మాత్రమే విదిల్చారు! ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా!

ఎగ్జిట్ పోల్స్ ను వమ్ము చేసి ఎగ్జాక్ట్ పోల్స్ లో దుమ్మురేపుతున్న కాషాయ దళం!

ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి చాలా తేడా వుంటుందని మరోసారి నిరూపించింది యూపీ! నిన్నటి దాకా అందరూ ఉత్తర్ ప్రదేశ్ బీజేపీదే అంటే ... ఇవాళ్ల ఉదయం నుంచీ అదే నిజమవుతోంది. కాని, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన రాజకీయ జ్యోతిష్యుల అంచనాల ప్రకారం మాత్రం ట్రెండ్స్ కనిపించటం లేదు! దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించటమే కాదు... కమలం స్వంత మెజార్జీ కూడా సంపాదించే దిశగా సాగుతోంది! కేవలం రెండు సర్వేలు మాత్రమే ఇలాంటి భారీ విజయం మోదీ సేనకు లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో చెప్పాయి. ఇప్పుడు వాటి అంచనాలే నిజం అవుతున్నాయి! ఉత్తర్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ 202 అయితే ఆల్రెడీ బీజేపి 275స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది!   ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల క్రిందులు చేయకున్నా సస్పెన్స్ సినిమాలా సాగుతోన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్! రెండూ చిన్న రాష్ట్రాలే అయినప్పటికీ ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ చేతిలో వున్నాయి. రెండు చోట్లా అధికార పక్షాలు మళ్లీ పవర్ నిలుపుకుంటాయా అన్నది అనుమానంగా వుంది. అలాగని అధికారం చేజారే స్థితిలో కూడా స్పష్టంగా లేవు! గోవాలో బీజేపి, కాంగ్రెస్ 7, 9 సీట్లలో ఆధిక్యంలో వుంటూ హోరాహోరిగా పోరాడుతుంటే మణిపూర్ లో కాంగ్రెస్ 14, బీజేపి 6 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి. మణిపూర్ లో ఆ మాత్రం విజయం కూడా బీజేపికి ప్లస్సే! అక్కడ గతంలో కమలం పర్ఫామెన్స్ కొంచెం కూడా ఆశాజనకంగా వుండేది కాదు!   ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ఊపులో వున్న మోదీ దళానికి ఏకైకా డిజపాయింట్ మెంట్ పంజాబ్! అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ సృష్టించినంత దారుణమైన స్థితిలో అకాళీ, బీజేపీ కూటమి లేకున్నా అధికారం మాత్రం నో ఛాన్స్! కాంగ్రెస్ 63స్థానాల్లో ఆధిక్యంతో ఆల్రెడీ సీఎం కూర్చీపై కర్చీఫ్ వేసేసింది! కాగా పంజాబ్ లో ఆప్ అల్లాడిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అంత సీన్ కనిపించటం లేదు. ఓడిపోతున్న బీజేపి, అకాళీ దళ్ కూటమి కంటే వెనుకబడి వుంటూ కేజ్రీవాల్ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యం చూపుతోంది. జేబీపీ, అకాళీ 26 స్థానాల్లో ముందున్నాయి. పంజాబ్ లో ఎదురైన చేతు ఉత్తరాఖండ్ లో తీపిగా మారింది బీజేపికి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కమలానిదే విజయమని ముందు నుంచే చెప్పాయి. కాని, ఇక్కడ కూడా జనం 56 సీట్లలో ఆధిక్యాన్నిచ్చి స్పష్టమైన భారీ విజయం ఇచ్చేశారు. కాంగ్రెస్ కేవలం 15 చోట్ల మాత్రమే పట్టు చూపిస్తోంది. ఇంతటి సక్సెస్ పోల్స్ పసిగట్టలేకపోయాయి!   ఏది ఏమైనా యూపీ విజయంతో బీజేపి ఇక దేశంలో అతి పెద్ద, అతి బలమైన జాతీయ పార్టీగా అవతరించబోతందని చెప్పొచ్చు!

వర్మ గురించి నోరు తెరిచిన సన్నీ లియోన్!

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ కామెంట్లపై సన్నీ లియోన్ స్పందించింది. సాధారణంగా ఇప్పటి వరకూ ట్విట్టర్ లో తనకు తోచిందల్లా రాసి సేఫ్ గానే తప్పించుకుంటున్న రామూ ఈసారి బుక్కైనట్టే కనిపిస్తోంది. ఇంతకీ సన్నీ ఏమన్నదంటే, '' మార్పు రావాలంటే మనం ఒకే మాటపై వుండాలి. అందుకే, మనం ఏం మాట్లాడతామో ... అ మాటలు తెలివిగా ఎంచుకోవాలి'' అందామె! ఇందులో సన్నీ లియోన్ ఎక్కడా వర్మ పేరు చెప్పకున్నా ఆమె అతడ్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు నెటిజన్స్. నిజంగా కూడా... రాము ముందు ముందు తాను ఏం మాట్లాడుతున్నాడో తెలివిగా ఎంచుకుని మాట్లాడితే బెటర్. లేదంటే మరిన్ని కేసులు, హెచ్చరికలు, దాడులు సైతం తప్పకపోవచ్చు!   మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వర్మ ట్వీట్ల కలకలం రేపాడు. వినాయకుడు మొదలు పవన్ కళ్యాణ్ వరకూ ఎవ్వర్నీ వదిలిపెట్టని ఆర్జీవీ ఆడవాళ్లని కూడా వదిలిపెట్టలేదు. ప్రపంచంలోని ఆడాళ్లందరూ సన్నీ లియోన్ లా మగవాళ్లకు ఆనందాన్ని పంచాలని ఆయన ట్వీట్ చేశాడు. అందులో వున్న అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలి. ఆడ వాళ్లు మగవాళ్లకి సెక్స్ సమకూర్చటం తప్ప మరేం చేయనక్కర్లేదని ఆయన ఉద్దేశమో ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని,గోవాలో తిక్కరేగిన ఒక సామాజిక కార్యకర్త మాత్రం నేరుగా స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అంతే కాదు, బాలీవుడ్ కార్మిక సంఘం కూడా ఆయన్ని ముంబైలో సినిమాలు చేయనీయమని హెచ్చరించింది! ఇదేదో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపించే సరికి ... పైగా హిందూ దేవుళ్ల పై నోరు పారేసుకుని తప్పించుకున్నట్టు ఇప్పుడు సాధ్యం కాదనిపించటంతో వర్మ సారీ చెప్పేశాడు! ఈ మాత్రం సారీ చెప్పే దానికి అసలు ట్వీటడం ఎందుకనే ఉద్దేశంతోనే సన్నీ లియోన్ మాట మీద నిలబడాలి, మాటలు తెలివిగా మాట్లాడాలి అని వర్మకి సెలవిచ్చింది!   రామ్ గోపాల్ వర్మ సన్నీ లియోన్ మాటలు విని ఇక మీదట బుద్దిగా వుంటాడని ఆశించటం దురాశే! ఆయన బై బర్త్ అలా ఓవర్ స్మార్ట్ గా పుట్టారనే విమర్శకులు అంటుంటారు. అందుకే, హిందూ పండగలు మొదలు పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉద్యమాలు, సినిమాల వరకూ అన్నీ ఆయనకే కావాలి. పైగా ప్రతీ దాంట్లోనూ జనాల్లో హిపోక్రసీ వుందంటూ వాపోతాడు పాపం. అది నిజమే అయినా రాము రిపీటెడ్ కాంట్రవర్సియల్ ట్వీట్స్ జనం సహనాన్ని పరీక్షిస్తున్నాయన్నది కూడా నిజం! తన స్వంత అబిప్రాయం కొంచెం హుందాగా చెప్పకుండా పది మందిని రెచ్చగొట్టేలా చెబుతూ పబ్లిసిటీ దండుకోవటం తప్ప ఆయన సాధిస్తున్నదేం లేదు!    కాలం బాగున్నప్పుడు ఎన్ని ట్వీట్స్ చేసినా ఓకే. కాలం కలిసి రానప్పుడే అడ్డంగా బుక్కయ్యేది. బాలీవుడ్ సినీ కార్మికులు ఎదురు తిరిగితే అది వర్మ కెరీర్ కే పెద్ద నష్టం. ఉబుసుపోని ట్వీట్స్ కోసం బంగారం లాంటి బాలీవుడ్ కెరీర్ ని నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నారు ఆయన సిన్సియర్ అభిమానులు. 

ఆఫీస్ కాదది..రాసలీలకు కేరాఫ్

వృత్తిని దైవంగా..పనిచేసే చోటును దేవాలయంగా భావించే దేశం మనది..ఇలాంటి చోట్ల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అక్కడ పనిచేసే వారిదే. ఉద్యోగులను బట్టే ఇలాంటి ప్రాంతాలకు పవిత్రత చేకూరుతుంది. అలాంటి చోటును బెడ్‌రూంగా మార్చేసి..తమ ఛాంబర్లలో సరసాలు ఆడుతూ కార్యాలయ పవిత్రతను మంట కలుపుతున్నారు కొందరు కామాంధులు. ఇది ఎక్కడో జరిగింది కాదు..పౌరుషాల గడ్డ కడపలో. నగర ప్రజల బాగోగులు చూసే మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలోనే జరుగుతోంది ఈ బూతు పురాణం.     కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెండు ఛాంబర్లలో, రెండవ అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక ఛాంబర్‌లో రాసలీలలు సాగుతున్నట్లు ఇక్కడి ఉద్యోగులు చెవులు కోరుక్కుంటున్నారు. ఇద్దరు అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు మంచి వాతావరణంలో పనిచేయాలనే ఉద్దేశ్యంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి చిన్న చిన్న ఛాంబర్లు ఏర్పాటు చేసి అధికారులకు కేటాయించింది ప్రభుత్వం.       సర్కార్ చేసిన ఆ మంచి పని వీరిని చెడ్డ పనులు చేసేలా ప్రేరేపించింది. ప్రతి ఛాంబర్‌కు ఏసీలు ఉండటంతో తలుపులు తప్పనిసరిగా మూసివేస్తారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అధికారులు ఛాంబర్లలో రాసలీలలు సాగిస్తున్నారు. ఇది తోటి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా పనిమీద కొందరు ఉద్యోగులు ఛాంబర్‌లోకి వెళ్లినప్పుడు అధికారులు "మాంచి పని"లో ఉంటున్నారు. దీనిని చూసిన వారు తలదించుకొని బయటకు వచ్చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితైతే మరీ దారుణం. ఇదంతా పక్కనబెడితే ఏకంగా కమీషనర్‌‌ ఛాంబర్‌నే బెడ్‌రూమ్‌గా మార్చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సమావేశాలనో, రివ్యూ మీటింగ్‌లనో కమీషనర్‌ తరచూ అమరావతి వెళ్తుండటంతో ఉద్యోగులు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లు సాగుతోంది. ఇంత జరుగుతున్నా విషయం కమీషనర్ దృష్టికి వెళ్లకపోవడం ఆలోచించాల్సిన విషయం..దీనిని బట్టి ఆ కామాంధులు ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొందరు ఉద్యోగులు మాత్రం వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బెడ్‌రూంలుగా మారిన ఛాంబర్ల తలుపులు తెరిచిపెట్టాలని వారు కోరుతున్నారు.

మమత మార్క్ సెక్యులరిజమ్... 60 వేల విద్యార్థులు అతలాకుతలం!

  దేశ రాజకీయాలు ఇప్పుడు నిలువునా చీలిపోయాయి. మొత్తం అంతా మెల్ల మెల్లగా మోదీ, మోదీ వ్యతిరేక బ్యాచ్ అన్నట్టు తయారవుతోంది పరిస్థితి! కాంగ్రెస్ లాంటి బీజేపి వ్యతిరేక పార్టీ మొదలు కాషాయదళానికి ఎన్నేళ్లుగానో మిత్ర పక్షం అయిన శివసేన వరకూ అన్ని పార్టీలు మోదీ హీట్ తో సతమతం అవుతున్నాయి. ఈ సీన్ మరింత క్లియర్ గా కనిపించాలంటే మనం బెంగాల్ వెళ్లాలి! అక్కడ విచిత్రంగా అధికార పక్షం తృణమూల్, ప్రతిపక్షం సీపీఎం... రెండూ బీజేపిని టార్గెట్ చేస్తున్నాయి. మోదీనే తిట్టిపోస్తున్నాయి! అసలు కోల్ కతాలో పరిస్థితి ఏంటంటే... పాలక పక్షం, ప్రతి పక్షం మోదీ, బీజేపి భయంతో గజగజ వణుకుతూ ఏకమైపోయాయి!   మమతా బెనర్జీ సీపీఎం మీద ఉధృతంగా దాడి చేసి అధికారంలోకి వచ్చింది. అందుకే, ఆమె అంటే కమ్యూనిస్టులకి కోపం. కాని, దేశ వ్యాప్తంగా సాగుతోన్న మోదీ వేవ్ బెంగాల్ ని కూడా టచ్ చేసింది. దాంతో ఉప్పు, నిప్ప లాంటి మమత, కమ్యూనిస్టులు కలిసి వ్యూహాలు పన్నే స్థితికి వచ్చేశారు. ఆ మధ్య నోట్ల రద్దు సమయంలో కలిసి ఉద్యమం కూడా చేద్దామనుకున్నారు! అయితే, తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీపీఎం, టీఎంసీ చేసిన పని చూస్తే బెంగాల్ లో బీజేపి బెంగా ఎంతగా పెరిగిపోయిందో తెలుస్తుంది!   సీపీఎం ఎమ్మెల్యే ఒకరు సభలో లేచి రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్యాబోధన జరుగుతోందని ఆరోపించారు! మామూలుగా అయితే దీన్ని పాలక పక్షం ఖండించాలి. కాని, అమాంతం లేచి నిలబడ్డ మమత బెనర్జీగారి మంత్రిగారు తన వద్ద 125 స్కూళ్ల లిస్ట్ వుందనీ, వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, సిలబస్ కు వ్యతిరేకంగా విద్యా బోధన జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చాడు. పైగా ఆ లిస్ట్ ఇచ్చింది హోం మంత్రి కూడా అయిన  గౌరవ ముఖ్యమంత్రిగారేనట! మమత ఇచ్చిన ఆ 125 స్కూల్స్ ఏవంటే... ఆరెస్సెస్ కు దగ్గరగా వుండే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు. మొత్తం 60వేల మంది వరకూ పిల్లలు చదువుకుంటోన్న ఈ సేవా దృక్పథంతో నడిచే స్కూల్స్ అన్నీ లక్నోలో వున్న విద్యా భారతీ అఖిల్ భారతీయ శిక్ష సంస్థాన్ కు అనుబంధంగా నడుస్తుంటాయి!   బెంగాల్ దేశంలోని అత్యధిక ముస్లిమ్ జనాభా వున్న రాష్ట్రాల్లో ఒకటి. అంతే కాదు, బంగ్లాదేశ్ నుంచి అడ్డూ అదుపు లేకుండా అక్రమ చొరబాట్లు జరుగుతుంటాయి. ఈ కారణంగా బెంగాల్ లోని చాలా జిల్లాల్లో ముస్లిమ్ ల సంఖ్య పెరిగిపోతోంది. దాని వల్ల గవర్నమెంట్ మైనార్టీల్ని సంతుష్టీకరించి ఓట్లు దండుకునే పనిలో వుంది. దాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు సహజంగానే బీజేపి వైపు చూస్తున్నారు. ఫలితంగా ఆక్రోశం తట్టుకోలేకపోతున్న మమత ఆ మధ్య మోదీ కెరీర్ ని నాశనం చేస్తానని శపథం చేశారు. అంత ఫ్రస్ట్రేషన్లో వుండబట్టే.. నేరుగా ప్రతిపక్ష సీపీఎంతో కలిసి బీజేపికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేయస్తోంది!   బీజేపికి వ్యతిరేకంగా మమత పావులు కదపటం ఎవ్వరూ తప్పు పట్టరు కాని... మరీ దుర్మార్గంగా 60వేల మంది పిల్లల భవిష్యత్ తో ఆటలు ఆడటం అరాచకం అనిపించుకుంటుంది. అందుకు సీపీఎం మద్దతు కూడా తీసుకోవటం మరో విషాదం. అసలు నిజంగా హిందూ ట్రస్టుల ఆధ్వరంలో విద్యా బోధన జరుగుతోన్న స్కూల్స్ లో మత ఛాందసవాదం నేర్పుతున్నట్టయితే... దేశ వ్యాప్తంగా వున్న అనేక మదర్సాల్లో చేస్తున్నదేమిటి? మరీ ముఖ్యంగా ఉగ్రవాదానికి, ఫేక్ కరెన్సీలకి, అక్రమ చొరబాట్లకి, బాంబుల తయారికీ అడ్డగా మారిన బెంగాల్లో మదర్సాల్లో ఏమవుతోంది? మదర్సాలపై కూడా మమత నిఘా పెట్టగలదా? స్కూళ్ల లిస్టు తయారు చేసి నోటీసులు ఇచ్చి గుర్తింపు రద్దు చేస్తామని చెప్పగలదా? ముందు ముందు ఈ హిందూ సంస్థల స్కూళ్లకు నోటీసుల వ్యవహారం పెద్ద గాలివానగా మారే సూచనలే కనిపిస్తున్నాయి!

కేరళలో... కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2 షురు!

కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2! ఇదేంటి అంటారా? మరేం లేదు కేరళలోని కొచ్చి నగరంలో ముద్దుల గోల మొదలు పెట్టాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిసైడ్ అయ్యాయి. అసలే హిందూ సంస్థలు ఏమైనా చేస్తే చెలరేగిపోయే తత్వం సీపీఎం, సీపీఐ పార్టీలది. ఇక వాటి అనుబంధ వి్ద్యార్థి సంఘాల గురించైతే చెప్పేదే లేదు! మరీ ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ప్ యమ ఉత్సాహంతో ముద్దులకు రెడీ అయిపోతాయి!   2014లో కిస్ ఆఫ్ లవ్ అనే ఉద్యమం ఎంత కలకలం రేపిందో గుర్తిందిగా? అప్పట్లో హిందూ సంస్థలు మోరల్ పోలీసింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ లెఫ్ట్ విద్యార్థులు, ఉద్యమకారులు పబ్లిగ్గా చుంబనాలకు తెగబడ్డారు. కొచ్చి నగరంలో ఈ ఎంగిలి ఉద్యమాలు భీకరంగా జరిగాయి. మన దగ్గర హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఓ రేంజ్లో జరిగాయి. ఇక దానికి వ్యతిరేకంగా ఏబీవీపీ మొదలు బీజేపి దాకా రైట్ వింగ్ సంస్థలు కూడా అదే రేంజ్లో విరుచుకుపడ్డాయి. వాళ్లవి ముద్దులైతే, వీళ్లవి గుద్దులన్నట్టు నడిచింది వ్యవహారం!   2014నుంచి కొంత గ్యాప్ ఇచ్చాక కిస్ ఆఫ్ లవ్ సీజన్ 2 ఇప్పుడు మొదలైంది! అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేరళలో కొందరు శివసేన కార్యకర్తలమని చెప్పుకుంటూ మెరైన్ బీచ్ ప్రాంతంలో దాడులు చేశారు. కేవలం ఆరుగురు మాత్రమే వచ్చి అమ్మాయిలు, అబ్బాయిలపై దాడులు చేస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఆ పోలీసులు కేరళను పాలిస్తున్న సీపీఎం పార్టీ ఏలుబడిలోనే వున్నారు. అయినా దాడి చేయనిచ్చారు ఖాకీలు. తరువాత భారీ నిరసనలకు దిగిన కాంగ్రెస్ , దాని అనుబంధ విద్యార్థి సంఘాలు, సీపీఎం, దాని అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి గోల మొదలు పెట్టాయి. మిగతా సంఘాల్ని వెనక్కి తోసి లెఫ్ట్ సంఘాలు ఒక అడుగు ముందుకు వేసి కిస్ ఆఫ్ లవ్ సీజన్ టూ మొదలు పెట్టాయి. అధికారంలో వుంది కూడా సీపీఎం ప్రభుత్వమే కాబట్టి ఈ కిస్ ఆఫ్ లవ్ ఎలా జరుగుతుందని అందరికీ ఆసక్తిగా వుంది! తమ పార్టీ తాలూకూ విద్యార్థి సంఘమే ఇలా అరాచక ఉద్యమానికి పిలుపునివ్వటం కేరళ సీపీఎం ఎలా సమర్థించుకుంటుందో?   శివసైనికులు మెరైన్ బీచ్ లో దాడులు చేయటం నీచమైన పని. ఆ సిగ్గులేని పనికి ఎదురు తిరిగి నిరసన తెలపటం చాలా గొప్ప విషయం. కాని, అతి ఆవేశానికి పోయి అందరి ముందు చులకనగా తయారయేలా పబ్లిక్ కిస్పింగ్ కు తెగబడటం ఎవ్వరూ హర్షించరు! స్వేచ్ఛ అంటే రోడ్డు మీద ఆడ, మగా తేడా మరిచి కిస్ చేసుకోవటమే అయితే... అది ఖచ్చితంగా పాశ్చాత్య ఎంగిలి సంస్కృతే అవుతుంది తప్ప మనది కాదు!

మన స్మార్ట్ ఫోన్స్ , టీవీల్లోకి అమెరికన్ దెయ్యం దూరిందా?

  సీఐఏ ఏజెంట్... ఈ పేరు చెప్పగానే ప్రపంచ నేరస్థుల వెన్నులో వణుకు పుడుతుంది. అలాగే, బ్రిటీష్ నిఘా సంస్థ స్పెషల్ ఏజెంట్ జేమ్స్ బాండ్ గురించైతే చెప్పేదే లేదు! నిజంగా జేమ్స్ బాండ్ అంటూ ఒక గూఢచారి లేనేలేకున్నా జనం మాత్రం బాండ్ నిజమేనని నమ్మే స్థితికి తీసుకొచ్చింది హాలీవుడ్. అయితే, అమెరికా, బ్రిటన్ ల నిఘా సత్తా కూడా అంతటిదే! మరీ ముఖ్యంగా, అమెరికన్ సీఐఏ మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుందని పేరు. ఇప్పుడు విక్ లీక్స్ అదే విషయాన్ని మరో సారి స్పష్టం చేసింది...   ప్రపంచాన్ని భయపెట్టే అమెరికాని... అదే రేంజ్లో భయపెట్టే అసలు సిసలు సంస్థ వికీలీక్స్! మొట్ట మొదటి లీక్ నుంచీ యూఎస్ నే టార్గెట్ చేసిన ఆ సంస్థ తాజాగా మరో సారి వాల్ట్ సెవన్ అంటూ జనం ముందుకొచ్చింది. ఈ వాల్ట్ సెవన్ కోడ్ నేమ్ తో వికీలీక్స్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. అయితే, ఈసారి సీఐఏను టార్గెట్ చేసి అది ఎలా సామాన్య జనం లివింగ్ రూముల్లోకి, జేబుల్లోకి, కార్లలోకి జొరబడుతుందో నిరూపించింది. వికీలీక్స్ లెటెస్ట్ డాక్యుమెంట్స్ ప్రకారం అమెరికన్ నిఘా సంస్థ కొన్ని వేల హ్యాకింగ్ టూల్స్ ను తయారు చేసిందట! వాటిని ప్రపంచ వ్యాప్తంగా వున్న స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ కార్లలో ప్రవేశపెట్టి తనకు కావాల్సిన సమాచారం రాబట్టుకునే కుట్ర చేసిందట. ఇంటర్నెట్ ద్వారా  స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఐప్యాడ్ లు, కార్లలోకి సీఐఏ తాను తయారు చేసిన టూల్స్ పంపించి తరువాత తనకు కావాల్సిన విధంగా ఆయా యంత్రాల్ని వాడుకుందట. అంటే... హ్యాకైన టీవీలు, ఫోన్లు, కార్లు, ఐప్యాడ్ ల వంటి ఆఫ్ చేసినా కూడా సీఐఏ ఎక్కడో కూర్చుని వాట్ని వాడుకుంటుందన్నమాట. మీరు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా అంతా అమెరికాలో తెలిసిపోతుంది!   సామాన్య జనం గురించి అమెరికన్ సీఐఏకు తెలిస్తే పెద్ద సమస్య లేదు. కాని, ఆల్రెడీ జనాల ప్రైవెసీకి భంగం కలిగించిన అమెరికా తాను తయారు చేసిన టూల్స్ పై పట్టు కోల్పోయిందట! అంటే, అవ్వి కరుడుగట్టిన సైబర్ నేరగాళ్ల వద్దకి వచ్చేశాట! ఒకవేళ వాళ్లు తమకు లభించిన వేలాది టూల్స్ ఆధారంగా కొత్త హ్యాకింగ్ టూల్స్ తయారు చేసి పంజా విసిరితే జనం నానా తంటాలు పడాల్సిందే! ఫోన్ లలోంచి అత్యంత సున్నితమైన సమాచారం, పాస్ వర్డ్ లు అన్నీ క్షణాల్లో మాయం అయిపోతాయి. టీవీల ద్వారా ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నదీ ఉగ్రవాదులు కూడా వినేస్తారు. ఇలా ఏదైనా జరగొచ్చు!   హ్యాకింగ్ టూల్స్ కారణంగా మొత్తం ప్రపంచమంతా సైబర్ నేరగాళ్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతుంది అనేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఇప్పుడు ప్రచారం జరుగుతోన్నంత స్మార్ట్ ప్రళయం రాకపోవచ్చు. కాని, అసలు అనైతికంగా హ్యాకింగ్ టూల్స్ తయారు చేసిన సీఐఏ కనీసం వాటి భద్రత విషయంలో కూడా జాగ్రత్తగా వుండకపోవటం, నిర్లక్ష్యంగా ప్రవర్తించటం... దుర్మార్గం. ఇలాంటి దుష్ట పన్నాగాలు అగ్రరాజ్యం మానుకోకపోతే.. అందరికంటే ఎక్కువ నష్టం దానికే కలిగే అవకాశం లేకపోలేదు...

లక్నో ఎన్ కౌంటర్ వెనుక హైద్రాబాద్ లింక్!

  లక్నో ఎన్ కౌంటర్... ఉగ్రవాది సైఫుల్లా... ఒక దేశ ద్రోహి శవాన్నీ తాను స్వీకరించనని అతడి తండ్రి స్టేట్మెంట్... అయినా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోన్న పార్టీలు... ఎలాగైనా క్రెడిట్ కొట్టేయాలని చూస్తోన్న బీజేపి... ఆ క్రెడిట్ దక్కకుండా అడ్డుపడదామనుకుంటున్న కాంగ్రెస్ , ఇతర సెక్యులర్ పార్టీలు.... ఇదీ కొన్ని గంటలుగా నడుస్తోన్న హై ఓల్టేజ్ డ్రామా! కాని, పైకి జరుగుతోన్న పొలిటికల్ సర్కస్ వెనుక టెర్రరిజానికి చెక్ పెట్టే కట్టుదిట్టమైన వ్యవస్థ ఒకటి వుందని మీకు తెలుసా? అదీ ఎక్కడో లక్నోలో నక్కిన ఒక ఐసిస్ ఉన్మాది బండారం ఇక్కడ మన హైద్రాబాద్ లోని కొందరు యాంటీ టెర్రర్ ఎక్స్ పర్ట్స్ బయటపెట్టారని మీకు తెలుసా? లక్నో ఎన్ కౌంటర్ వెనుక వున్న హైద్రాబాద్ లింక్ చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది...   సాధారణంగా దేశంలో ఎక్కడ బాంబులు పేలినా, ఆ ఉగ్రవాది మూలలు హైద్రాబాద్ నుంచే వుంటాయి. మన పాతబస్తీ అంతలా లోకల్ , బంగ్లాదేశీ ఉగ్రవాదుల అడ్డగా మారిపోయింది. కాని, ఈసారి జరిగిన లక్నోలోని సైఫుల్లా ఎన్ కౌంటర్ కి మరో రకంగా హైద్రాబాద్ కనెక్ట్ అయింది. ఇక్కడ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ పై పని చేస్తోన్న స్పెషల్ ఇంటలిజెన్స్ గ్రూప్ ఒకటి మధ్యప్రదేశ్, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు బోలెడంత సహకారం అందించింది. దాని వల్లే కరుడుగట్టిన ఐసిస్ సానుభూతిపరుడు సైఫుల్లా హతమయ్యాడు.   సైఫుల్లా ఐసిస్ మతోన్మాద సిద్ధాంతాలకి ఆకర్షితుడై భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే హింసకు వ్యూహం పన్నాడు. ఉజ్జయినీ ట్రైన్ బ్లాస్ట్ తో తాను అనుకున్నది అమలు చేశాడు. ఇలా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో రైళ్లలో బాంబులు పెట్టాలని కొంత కాలంగా ఐసిస్ ఉగ్రవాదులు ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. కాని, వారికి తెలియని విషయం ఏంటంటే, మన హైద్రాబాద్ లో వార్ని అనుక్షణం డేగ కళ్లతో వెంటాడుతోన్న ఒక ఇంటలిజెన్స్ బృందం వుందని!   హైద్రాబాద్ లో సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోయే ఒక ఇంటలిజెన్స్ అధికారుల బృందం కొందరు ఇస్లామిక్ యువకులు ఐసిస్ పట్ల ఆకర్షితులవుతున్నారని ఎప్పుడో గుర్తించింది. అయితే, వారి మాటల్ని, కదలికల్ని గమనిస్తూనే వున్నా వారు ఫలాన ట్రైన్ లో బాంబ్ బ్లాస్ట్ చేస్తారని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయింది. అంతలోనే సైఫుల్లా లాంటి వారు దారుణానికి పాల్పడ్డారు. కాని, ఆ వెంటనే సైఫుల్లాను నీడలా వెంటాడుతోన్న హైద్రాబాద్ ఇంటలిజెన్స్ మధ్యప్రదేశ్, ఢిల్లీ నిఘా విభాగాలకు సమాచారం చేరవేసింది. లక్నోలో ఉన్మాది నక్కాడని తెలిసిన ఎంపీ పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ దాడి చేసి మట్టు పెట్టాయి! ఇలాంటి ఐసిస్, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుల్ని, ఆన్ లైన్లో మతోన్మాదానికి లోనై ఉగ్రవాదులుగా మారుతున్న వార్ని కనిపెడుతూ వుండడానికి ప్రత్యేక బృందం మన నగరం నుంచీ సంవత్సరం పొడవునా పని చేస్తోంది. ఇది నిజంగా మెచ్చుకోవల్సిన కృషి...

నోట్ల రద్దు లేదు..అయినా "నో" క్యాష్

బ్యాంకుల ముందు చాంతాడంత క్యూలు...ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు..పనులు పక్కనపెట్టి డబ్బు కోసం తంటాలు. ఇవన్నీ పెద్దనోట్ల రద్దు జరిగినప్పుడు దేశప్రజల కళ్లకు కనిపించిన దృశ్యాలు. ఆర్‌బీఐ వేగంగా స్పందించడంతో నోట్ల కష్టాలు కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి. ఇక ఫిబ్రవరి తర్వాత ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాని గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలు పనిచేయడం లేదు..దీంతో జనం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు..డిపాజిట్లు పడిపోయి, విత్‌డ్రాలు పెరిగిపోయాయి.     నెల మొదలు కావడంతో సాధారణంగా నగదు ఉపసంహరణకు డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ బ్యాంకర్లు ఏటీఎం మిషన్లలో నగదును అందుబాటులో ఉంచకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణాలు అనేకం..పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులంతా పెద్ద ఎత్తున మొత్తాలను బ్యాంకుల్లో వేశారు. ఇప్పుడు ఆ నగదుని పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన డిపాజిట్లలో 60 శాతం వివిధ రూపాల్లో బయటకు వెళ్లిపోయాయి.     అలాగే బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయిన 2000 నోటు తిరిగి రావడం లేదు. ఇంతకీ, మార్కెట్‌లోకి వస్తున్న 2 వేల రూపాయల నోటు ఏమవుతోంది. బ్లాక్ మనీగా మారి, పెద్దల గోదాముల్లో మగ్గుతున్నాయనుకోవాలా..ఏదీ ఏమైనా దేశంలో మళ్లీ కరెన్సీ సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కష్టాలు తీరాలంటే కొత్త నోట్లు పూర్తి స్థాయిలో బ్యాంకుల్లో అందుబాటులోకి రావాలి. నగదు ఉపసంహరణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అదే స్థాయిలో డిపాజిట్లు వచ్చేలా చూడాలి. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి..అప్పటిదాకా జనానికి తిప్పలు తప్పవు.

విరాటే కోహ్లి కాదు కాని, సూపర్ ఛాంపియన్

విరాట్ అనగానే మనకు విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు! కాని, ఇండియా గర్వంగా ఫీలయ్యేందుకు మరో ఛాంపియన్ విరాట్ వుంది! అదే, ఇండియన్ నేవీ గ్రాండ్ సింబల్ ... ఐఎన్ఎస్ విరాట్! ఈ జల యుద్ధ నౌక ఎట్టకేలకు రిటైర్మెంట్ తీసుకుంది. రెండు దేశాలకి సేవలందించిన ఈ విశిష్ట జల అద్భుతం ఇక ముందు లగ్జరీ హోటల్ గా తన సత్తా చాటే అవకాశాలు కూడా వున్నాయి. అయితే, ఇండియన్ నేవీలోకి విరాట్ స్థానంలో త్వరలో విక్రాంత్ రానుంది. అది ప్రపంచపు నేవీ అద్బుతాల్లో ఒకటిగా వుండనుంది. విరాట్, విక్రాంత్ జల యుద్ధ నౌకల ఘనత ఏంటో చూసేద్దామా...    ఐఎన్ఎస్ విరాట్ మొదట బ్రిటన్ రాయల్ నేవీలో వుండేది. అక్కడ 27 ఏళ్లు సేవలందించిన ఈ గ్రాండ్ ఓల్డ్ లేడీ... 1987లో భారత నేవీలో చేరింది. అప్పట్నుంచీ మూడు దశాబ్దాలుగా భారతీయ సముద్ర జలాలకి అలంకరమైంది. బ్రిటన్లో వుండగా విరాట్ ని హెఎమ్ఎస్ హెర్మెస్ అనేవారు. ఇండియన్స్ కోసం ఐఎన్ఎస్ విరాట్ గా మారిన జల యుద్ధ నౌకని ఇండియన్ నేవీ, అంతర్జాతీయ నేవీ సమాజం... మదర్ అంటుంది గౌరవంగా!   పోయిన సంవత్సరం జూలై 23న ఐఎన్ఎస్ విరాట్ తన ఫైనల్ జర్నీ చేసింది ముంబై నుంచి కొచ్చి వరకూ. తిరిగి దాన్ని ముంబై తీసుకొచ్చిన నేవీ అధికారులు ఫెయిర్ వెల్ పార్టీకి సిద్ధం చేసి అలా వుంచేశారు! పూర్తి స్థాయిలో పని చేసినప్పుడు ఐఎన్ఎస్ విరాట్ ఒకేసాఇర 15వందల మందిని తీసుకు వెళ్లేది!    విరాట్ తన కెరీర్లో మొత్తంలో 2250 రోజులు సముద్రంపై గడిపింది. దాదాపు 11 లక్షల కిలోమీటర్లు చక్కర్లు కొట్టింది. అంటే, 27సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చిందన్నమాట! విరాట్ వీపుపై బయలుదేరిన విమానాలు గాల్లోకి ఎగిరి గంటలు ఆకాశాన్ని చుట్టేశాయో తెలుసా? 22వేల 34గంటలు!   ఇండియన్ నేవీకి మన ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. దేశం కోసం సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ ను స్టార్ హోటల్ గా మార్చే ప్రపోజల్ పెట్టింది. దీనికి ఇంకా నేవీ నుంచి అనుమతి లభించలేదు. అదే జరిగితే విశాఖ తీరంలో విరాట్ హోటల్ అండ్ మ్యూజియంగా వెలిగిపోతుంది! సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతంది!   విరాట్ స్థానంలో ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానున్న విక్రాంత్ కూడా ప్రపంచ రికార్డులతోనే రంగంలోకి దిగబోతోంది. సీ ట్రయల్స్ అన్నీ పూర్తయ్యాక విక్రాంత్ 2018లో భారత నేవీ అమ్ముల పొదిలో చేరుతుంది. 37వేల 500టన్నుల బరువుండే విక్రాంత్ ప్రపపంచంలోనే అరుదైంది. ఇంత భారీ జల యుద్ధ నౌకలు కేవలం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాల వద్ద మాత్రమే వున్నాయి. విక్రాంత్ చేరికతో అయిదో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించనుంది!

యూపీ ఎలక్షన్స్... బీజేపి చెలగాటం! ఇతర పార్టీల ప్రాణ సంకటం!

ఉత్తర్ ప్రదేశ్ ... దేశంలో అతి పెద్ద రాష్ట్రం. అతి పెద్ద ఓటర్ల సముదాయం వున్న రాష్ట్రం. అతి పెద్ద ఎమ్మెల్యేల సంఖ్య వున్న రాష్ట్రం! అందుకే, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు రాజకీయ పరిజ్ఞానం వున్న వారికి అత్యంత ఆసక్తికరం. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపి స్వంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అందుక్కారణం... ఏ విధంగా చూసుకున్నా ఉత్తర్ ప్రదేశ్ లో సాధించిన డెబ్బై పైచిలుకు ఎంపీ స్థానాలే! అవ్వే మోదీని మీడియా, మేధావులు ఎంతగా వ్యతిరేకించినా పీఎంని చేశాయి! ఇప్పుడు మరోసారి రేస్ అలాగే నడుస్తోంది. బీజేపికి లక్నో అంసెబ్లీని తన వశం చేసుకోటం ప్రతిష్ఠాత్మకం అయిపోయింది! అదే సమయంలో ఎస్పీకి పరువు నిలుపుకోవాల్సిన గండంలా మారిపోయింది. ఇక బీఎస్పీ, కాంగ్రెస్ ఆటలో అరటిపళ్లు అవ్వకుండా వుండేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి!   యూపీలో మార్చి పదకొండున స్వీట్లు పంచుకునేది ఏ పార్టీ? టపాసులు కాల్చే కార్యకర్తలు ఎవరు? ఈ ప్రశ్నలకి దాదాపుగా ఏ మీడియా సంస్థ వద్ద కూడా సమాధానాలు లేవు! కాని, తమని నడిపించే లెఫ్టు, రైటు సిద్ధాంతాలకు అనుకూలంగా ఫలితాలు చెప్పేస్తున్నాయి! మోదీ వ్యతిరేక బ్యాచి అఖిలేష్ ని మళ్లీ సీఎంని చేసే పనిలో వుంటే నమో బృందం అప్పుడే అయోధ్యలో రామ మందిరం ఖాయం అంటూ ప్రచారం మొదలెట్టేసింది! కాని, మార్చ్ 11లోపు ఎట్టి పరిస్థితుల్లో ఒక క్లియర్ పిక్చర్ వచ్చే ఛాన్స్ లేదు. అంత టైట్ గా సాగింది యూపీ ఎన్నికల బరి! ఒక్క శాతం, రెండు శాతం ఓట్ల తేడా కూడా పార్టీల ఆశల్ని గల్లంతు చేసే ఛాన్స్ వుంది. ఇప్పుడు అందరి టెన్షన్ అదే!   ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి గెలుస్తుందని చెప్పేవారిది అనవసర ఉన్మాదం అనటానికి వీల్లేదు. ఎందుకంటే, గత ఎన్నికల్లో తొంభై అయిదు శాతం వరకూ ఎంపీ స్థానాలు కమలం కాజేసింది. రాష్ట్రంలో అధికారంలో వున్న ఎస్పీ మోదీ మాయాజాలాన్ని చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. బీఎస్పీ అయితే ఇంచుమించూ కొట్టుకుపోయింది. కాంగ్రెస్ తనకు వారసత్వంగా వస్తోన్న రెండు, మూడు ఎంపీ సీట్లు తప్ప మరెవీ గెలవలేకపోయింది. ఇదే ఇప్పుడు అసెంబ్లీ పోటీలో కూడా బీజేపిని మెయిన్ టార్గెట్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ దుమ్మెత్తి పోసుకున్నాయి.     కాని, ఈసారి అఖిలేష్ , మాయవతి ఇద్దరూ మోదీ, అమితా షా జపమే చేస్తున్నారు! స్వయంగా వారే ప్రచారంలో తమ ప్రధాన శత్రువు బీజేపి అన్నాక ఉత్తర్ ప్రదేశ్ లోని క్షేత్ర స్థాయి పరిస్థితి అంచన వేయవచ్చు! బీజేపి ఈ సారి సీఎం పదవి చేపట్టినా చేపట్టకపోయినా గొప్ప సక్సెస్ మాత్రం సాధించినట్టే! కాంగ్రెస్ లాంటి పార్టీ వంద సీట్లకు పరిమితమైతే బీజేపి తన పునర్వవైభవం దిశగా ఎస్పీ, బీఎస్పీలకు ప్రధాన పోటీదారు కాగలిగింది. అయితే, బీజేపి అసెంబ్లీని సాధించలేదని కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కొందరైతే మూడు వందల వరకూ ఎమ్మెల్యే సీట్లు సాధించి కమలం అద్బుతంగా వికసిస్తుందని కూడా జోస్యం చెబుతున్నారు!   ప్రస్తుతం ఏడు దశల యూపీ పోరు చివరి దశకు చేరుకుంది. ఇక కొన్ని గంటల్లో అంతిమ ఫలితాలు మాత్రమే మిగిలి వుంటాయి.అవ్వి వస్తే విజేత ఎవరో తేలుతుంది. కాని, అంత వరకూ గెస్సింగ్, బెట్టింగ్ అన్నీ నడుస్తూనే వుంటాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల్నే నమ్ముకున్న ఉత్తర్ ప్రదేశ్ వాసులు ఈసారి తిరిగి జాతీయ పార్టీకి, అభివృద్ధి అంటూ కొత్త ఆశలు రేపుతోన్న బీజేపికి పట్టం కట్టవచ్చు. అందుకే, ఎక్కువ అవకాశాలున్నాయి. కారణం... ఎస్పీకి విపరీతమైన యాంటీ ఇన్ కంబెన్సీ వుంది. అయిదేళ్లుగా అధికారంలో వున్నప్పటి రేపులు, మర్డర్ ల  పాపమంతా వెంటాడుతోంది. దానికి తోడైన కాంగ్రెస్ ని ఎవరూ నమ్మే స్థితిలో లేరు.     స్వయంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్సే మూడు వందల సీట్లు వదులుకుని ఎస్పీ పంచన చేరిందంటే... అక్కడ రాహుల్ సేనకి ఎంత బలహీనమైన సంకేతాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అధికారంలో వున్నప్పుడు తన విగ్రహాలు తానే ప్రతిష్ఠించుకుని ప్రజల ఆగ్రహానికి గురైన బెహన్ జీ కూడా అన్ని వర్గాల మద్దతు పొందలేకపోయే అవకాశాలు ఎక్కువ. అగ్రవర్ణాలు ఆమె కంటే ఎక్కువగా మోదీని ఆశ్రయించారని టాక్. పైగా దళితుల్లో కూడా కొన్ని వర్గాల్లో మోదీ అభివృద్ధి నినాదాలకి స్పందించారంటున్నారు. అదే సమయంలో భారీగా ముస్లిమ్ నేతలకు సీట్లిచ్చిన మాయావతి ఎస్పీ ఓట్లకి గండికొట్టారని మరికొందరి వాదన!    బీజేపి అధికారంలోకి రావద్దనే బలమైన కోరికని పక్కన పెట్టి నిష్పాక్షపాతంగా యూపీ ఎన్నికల సరళి చూస్తే... కమల వికాసానికే ఎక్కువ ఆస్కారం వుంది. అయినా సస్పెన్స్ సినిమాలాగా మార్చి పదకొండు దాకా అందరూ ఊపిరి బిగ్గబట్టాల్సిందే. కాని, ఎంతో అవసరమైన ఈ గెలుపు బీజేపికి చెలగాటం! ఇతర పార్టీలకు ప్రాణ సంకటం! ఏం జరుగుతుందో చూద్దాం... 

రచ్చ రచ్చైన... రేఖ, సంజయ్ దత్ ల రహస్య వివాహం!

  మందు తాగితే మత్తొస్తుంది. కాని, మర్నాడు హ్యాంగోవర్ కూడా వస్తుంది! సినిమా వాళ్ల పరిస్థితి కూడా అంతే! వాళ్లకు గ్లామర్ తో పాటూ బోలెడంత పేరొస్తుంది! కాని, అదే గ్లామర్ దెబ్బకు గాసిప్స్ కూడా పుట్టుకొస్తాయి! హ్యాంగోవర్ లాగే గాసిప్స్ కూడా రాత్రి పడుకుని పొ్ద్దున్నలేవగానే మైండ్ దిమ్మతిరిగిపోయేలా చేస్తుంటాయి! ఇక సదరు సినిమా సెలబ్రిటీలు రేఖా, సంజయ్ దత్ లాంటి లెజెండ్రీ కాంట్రవర్సియల్ వ్యక్తులైతే చెప్పేదేముంది? వాళ్ల మీదొచ్చిన గాసిప్స్ మంటల్లా పాకేస్తాయి... రేఖ బాలీవుడ్లో ఇప్పుడున్న వారిలో అత్యంత సీనియర్. కాని, ఆమె చుట్టూ గాసిప్స్ ఎప్పుడూ వుంటూనే వుంటాయి. ఆమె యంగ్ డేస్ లో అమితాబ్ తో  ఎఫైర్ అంటూ పేజీలకు పేజీలు రాశారు పేపర్ల వారు. ఇప్పటికీ వారిద్దరూ ఒకచోటికి వస్తే కెమెరాలు అస్సలు ఊరుకోవు. కాకపోతే, పాపం రేఖాని ఇంత లేటు వయస్సులో కూడా రూమర్లు వదిలిపెట్టడం లేదు. ఆమెను మరో హీరోతో లింక్ చేసేశాయి రీసెంట్ గా! అతను మరెవరో కాదు వివాదాస్పద మున్నాభాయ్ సంజయ్ దత్! రేఖ, సంజయ్ దత్ లకు రహస్యంగా పెళ్లైందనీ, అందుకే, ఆమె ఇప్పటికీ పాపిట్లో కుంకుమ ధరిస్తుందనీ పుకార్లు పుట్టాయి వున్నట్టుండీ! దీనికి ఆధారంగా గాసిప్ గాళ్లు ఒక పుస్తకం పేరు చెప్పారు. రేఖ ది అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ ని పోయిన సంవత్సరం రాశాడు యాసిర్ ఉస్మాన్. దాంట్లో ఈ విషయం వుందని ప్రచారం చేశారు! కాని, అందరికీ అనుమానం కలిగించిన విషయం ఎప్పుడో లాస్ట్ ఇయర్ విడుదలైన బుక్ లోని విషయం ఇప్పుడెందుకు బయటకొచ్చిందని! అయినా కూడా రేఖ, సంజయ్ దత్ సీక్రెట్ మ్యారేజ్ గోల పెద్దగా రచ్చగా మారిపోయింది! ఊరికే గాలికి పుట్టిన గాసిప్ బాధ భరించలేక రేఖ ది అన్టోల్డ్ స్టోరి పుస్తకం రాసిన యాసిర్ ఉస్మానే అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తన పుస్తకంలో తాను రేఖ, సంజయ్ దత్ పెళ్లి చేసుకున్నారని రాయలేదని ఆయన అన్నాడు. కాకపోతే, వారిద్దరూ 1984లో కలిసి ఒక  సినిమా చేశారు. అప్పుడు ఇద్దరికీ ఎఫైర్ వుందని ఘాటు గాసిప్స్ వచ్చాయి. అవ్వి ఎంతగా ముదిరిపోయాయంటే రేఖ సంజయ్ ని సీక్రెట్ గా పెళ్లాడిందనే దాకా వెళ్లాయి. ఇక చేసేది లేక మున్నాభాయ్ తనకి , రేఖకి పెళ్లి కాలేదు, పాడు కాలేదని అఫీషియల్ గా గాసిప్స్ అన్నీ ఖండించాల్సి వచ్చింది. ఇదంతా బుక్ లో చెప్పాడట రైటర్!   ఎప్పుడో సంవత్సరం కింద తన బుక్ లో రేఖా, సంజయ్ లకు పెళ్లి కాలేదని ఒక రైటర్ రాస్తే... ఇప్పుడు దాన్ని తిరగదోడి పెళ్లైందంటూ ప్రచారం చేయటం... నిజంగా అరాచకం! కానీ, సినిమా సెలబ్రిటీలకు ఈ సైడ్ ఎఫ్టెక్స్ తప్పువు! కాకపోతే, యాభై ఏళ్ల వయస్సు దాటిపోయిన ఈ తరుణంలో సంజు బాబా, రేఖ లాంటి వారు సీక్రెట్ మ్యారేజ్ పుకార్లు ఎదుర్కోవటం... కొంచెం ఇబ్బందికరమే!

బాంబుందని జోకులు..జైల్లో పెట్టిన అధికారులు

మీకు చిన్నప్పుడు పెద్దలు చెప్పిన "నాన్నా పులి" కథ బాగా గుర్తుండే ఉంటుంది? అందులో పులి రాకపోయినా వచ్చిందని ఆబద్ధం ఆడతాడు ఒక పిల్లవాడు. రెండు సార్లు పిల్లాడి అరుపులు విన్న తండ్రి కంగారుగా వచ్చి చూస్తే...అబ్బే ఏం లేదు వూరికే సరదాగా అన్నా అంటూ చెబుతాడు..కాని ఈ సారి నిజంగా పులి వస్తుంది..అప్పుడు నాన్నా పులి..నాన్నా పులి అంటూ అరుస్తాడు...పిల్లాడు ఈసారి కూడా సరదాగా అంటున్నాడేమోనని అనుకున్న తండ్రి ఆ మాటలు పట్టించుకోడు..చివరికి పులి మేకను చంపి తీసుకెళ్లిపోతుంది..అదే ముందు ఆబద్ధం చెప్పకుండా ఉండి ఉంటే మేక బతికుండేది..     ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది ముంబైకి చెందిన ఓ మోడల్. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన కాంచన్ ఠాకూర్ మోడలింగ్ చేస్తోంది. ఆమె గత గురువారం రాత్రి స్నేహితురాలితో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కుతుండగా సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న గార్డుతో తన వెనుక ఉన్న మహిళ బ్యాగులో బాంబు ఉందనీ, జాగ్రత్తగా తనిఖీ చేయాలని చెప్పింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం అందించి విమానాన్ని నిలిపివేశారు.     ఆమెతో పాటు విమానం ఎక్కిన ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు లగేజీని కూడా కిందకి దించేశారు. ఈ హడావిడిలో తీరిగ్గా అసలు విషయాన్ని చెప్పింది కాంచన్..బాంబు అన్న మాట ఒట్టిదేననీ, సరదాగా అలా అన్నాననీ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్క క్షణం షాక్‌కు గురైన అధికారులు వెంటనే తేరుకుని మోడల్ చేతికి సంకెళ్లు వేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 505 (1)(బి) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఫేక్ కాల్స్‌తో సతమతమవుతున్న భద్రతా సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. ప్రయాణికులు ఇటువంటి సీరియస్ విషయాలపై కూడా జోకులు వేస్తూ పోతే ..ఒకవేళ నిజంగా బాంబు ఉండి భద్రతా సిబ్బంది పట్టించుకోకపోతే జరిగే నష్టం ఊహకు కూడా అందదు.

తాత పాకిస్తానీ గులామ్... మనవడికి కాశ్మీర్ సర్కార్ సలామ్!

అరాచకానికి పరాకాష్ఠ ఎలా వుంటుందో మీకు తెలియాలంటే కాశ్మీర్ కు వెళ్లాల్సిందే. పోయిన సంవత్సరం దాదాపు అరు నెలలు అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే! ప్రతీ రోజూ కర్ఫ్యూలే. ప్రతీ రోజు పాకిస్తాన్ అనుకూల అల్లరి మూకల రాళ్ల దాడులే. అందుకు ప్రతిగా భారత సైనికుల కాల్పులు. ఫలితంగా పెల్లెట్స్ తగిలి కొందరు యువకుల మరణం. ఇలా నెలల పాటూ సాగింది. ఎందరో కాశ్మీరీ తల్లులు వేర్పాటువాదుల కుట్రలకు బలైన తమ కొడుకుల్ని చూసి కడుపుకోతకు గురయ్యారు. కాని, అదే సమయంలో కాశ్మీర్ వేర్పాటువాదాన్ని పొడిచి పొడిచి రాజేసే సయ్యద్ అలీ షా గిలానీ ఏం చేస్తున్నాడో తెలుసా?    సయ్యద్ అలీ షా గిలానీ కాశ్మీర్ వేర్పాటువాదుల నేత. పాకిస్తాన్ కోసం పని చేసే నక్క. ఇప్పటి వరకూ ఎందరో కాశ్మీరీ యువతను బంద్ లు, నిరసనలు, ఉద్యమాలు అంటూ పొట్టన పెట్టుకున్నాడు. పత్యేక కాశ్మీర్ అంటూ యువకుల్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ కు సాయపడటమే గిలానీ బిజినెస్. అలా ఆయన కోట్లు సంపాదించాడు. ఇక ఇప్పుడు ఈ వేర్పాటువాద రాక్షసుడి అరాచకం మరింత పెరిగిపోయింది. తాజా సమాచారం ప్రకారం 2016లో కాశ్మీర్ లోయ అల్లర్లతో అట్టుడుకుతుంటే గిలానీ మనవడు ఏం చేశాడో తెలుసా? చడీ చప్పుడు కాకుండా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టూరిజమ్ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు! అసలు తాత కాశ్మీర్ ని భారత్ నుంచి విడదీయాలనుకుంటుంటే... అతనికి వంత పాడే ఈ మనవడు, అప్లై చేయటమే దుర్మార్గం. పైగా ఆ అప్లికేషన్ కి మెహబూబా ముఫ్తీ సర్కార్ రూల్స్ అన్నీ తుంగలో తొక్కి ప్రాధానత్యనిచ్చిందట.    నేరుగా ముఖ్యమంత్రి మెహబూబా పర్యవేక్షణలో వుండే టూరిజమ్ శాఖలో గిలానీ మనవడు అనీస్ కి సంవత్సరానికి 12లక్షలు ఆదాయం వచ్చే ఉద్యోగం ఇచ్చేశారు. ఎలాంటి దర్యాప్తులు, విచారణలు ఏమీ లేకుండానే! అతనికి గతంలోనే యూకే వెళ్లేందుకు అనుమతించవద్దని జమ్మూ, కాశ్మీర్ సీఐడీ నివేదిక ఇచ్చింది. అటువంటి చరిత్ర వున్న అనీస్ కి మెహబూబా ప్రభుత్వం భారీ ఆదాయం వుండే ప్రభుత్వ ఉద్యోగం కట్టబెట్టింది. పైగా అప్పుడు అతగాడి తాత, అరాచకవాది గిలానీ చేస్తోంది ఏంటి? ఇక్కడ మనవడు ఉద్యోగం రూపంలో భారత దేశ వనరులు మెక్కేస్తుంటే... తాత అమాయక, పేద కాశ్మీరీలను రాళ్లు చేతిలో పెట్టి సైన్యం మీదకి ఉసిగొల్పాడు. వందల మంది నిరపరాధుల ప్రాణాలు, చదువులు, జీవితాలతో ఆడుకున్నాడు!   బీజేపి కూడా మద్దతిస్తోన్న మెహబూబా ప్రభుత్వం ఇలా వేర్పాటు వాదులకి భారతదేశ జనాల ట్యాక్స్ లను సమర్పించుకోవటం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వటం, అందుకోసం రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కటం, నిజమైన అర్హులైన యువకుల బతుకులు నాశనం చేయటం... అంగీకరించరాని దాష్టీకం! ఈ తప్పుని, ఇలాంటి తప్పులు బోలెడన్నిటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే కాశ్మీర్ చేజారిపోయినా ఆశ్చర్యం లేదు!