కూల్ డ్రింక్స్ బ్యాన్ చేయటం కూల్ ఐడియా కాదు...

ఈ మధ్య తమిళనాడు చిత్ర, విచిత్ర, విషాద కారణాలతో వార్తల్లో వుంటోంది. జయలలిత ఆరోగ్యం నుంచీ జల్లికట్టు ఆరాటం వరకూ రకరకాల అంశాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇక మొన్నటికి మొన్న పన్నీర్, శశికళ రాజకీయ యుద్ధమైతే మరీ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది! ఇప్పుడిప్పుడే చల్లబడుతోందని భావించిన తమిళనాడు కూల్ డ్రింక్స్ నిషేధంతో మరోసారి టాకింగ్ టాపిక్ అయిపోయింది..    తమిళనాడులో పెప్సీ, కోక్ లను నిషేధించారు. ఇది చాలా మంచి విషయమని జనం కూడా మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమిళుల సత్తా గురించి పొగడ్తలు కురుస్తున్నాయి. కొందరైతే పెప్సీ, కోక్ లను దేశమంతా నిషేధించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెప్సీ, కోక్ లు ఆరోగ్యానికి చేసే చేటు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ కూల్ డ్రింక్స్ బ్యాన్ చేయటమంత గొప్ప పని మరొకటి వుండదు. కాని, తమిళనాడులో జరిగింది వేరు!    తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా పెప్సీ, కోక్ లను నిషేధించలేదు. అక్కడి ఒక వాణిజ్య సంఘం ఈ చర్యకు పూనుకుంది. పెప్సీ, కోక్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల శీతల పానీయాలు తమ లోకల్ బ్రాండ్ కూల్ డ్రింక్స్ కొంప ముంచుతున్నాయని వారి ఆందోళన. అందుకు బ్యాన్ చేసేశారు. అయితే, ఇక్కడ మనం గుర్తించాల్సిన పెద్ద కిటుకు ఒకటి వుంది. కూల్ డ్రింక్స్ మొత్తానికి మొత్తంగా బ్యాన్ చేస్తే జనం కొబ్బరి బోండాలు తాగి ఆరోగ్యం కాపాడుకుంటారు. కేవలం పెప్సీ, కోక్ లను లేకుండా చేస్తే లాభం ఏంటి? లోకల్ కూల్ డ్రింక్స్ అమ్మకాలు పెరుగుతాయి. వాట్ని తయారు చేస్తూ బతుకుతోన్న వ్యాపారులు, ఉద్యోగులు వగైరా వగైరా బాగుపడతారు. ఇది మంచిదే. కాని, జనానికి వచ్చిన లాభం ఏం లేదనేది స్పష్టం. పెప్సీ, కోక్ కాకుండా లోకల్ బ్రాండ్ పానీయాలు తాగి హెల్త్ పాడుచేసుకోవటమే!   జనం, వారి ఆరోగ్యం సంగతి సరే... మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ శకంలో వున్నాం. ఈ మధ్యే మన ఇండియన్ ఉద్యోగులకు అమెరికాలో భద్రత కరువైందని గగ్గోలు పెడుతున్నాం. మా దేశంలోని ఉద్యోగాలు మాకే ముందు కావాలి అంటోన్న ట్రంప్ ను తిట్టిపోస్తున్నాం. టాలెంట్ వున్న ఇండియన్స్ ని అమెరికాలో ఎలా జాబ్ చేసుకోనీయరని ప్రశ్నిస్తున్నాం! మరి అమెరికన్ కంపెనీలైన పెప్సీ, కోక్ లు మన దగ్గర బిజినెస్ చేసుకుంటే తప్పేంటి? మనం అమెరికాలో డాలర్లు సంపాదించుకోవచ్చు కాని.. ఆమెరికన్ కంపెనీలు ఇక్కడ తమ ప్రాడక్ట్స్ అమ్మకూడదా? పైగా పెప్సీ, కోక్ లు విదేశీ బ్రాండ్సే కావొచ్చు. కాని, వాటి తయారీ యూనిట్లు ఇక్కడే వుంటాయి. వాటిల్లో లోకల్ తమిళులే ఉద్యోగాలు చేస్తుంటారు. ఇప్పుడు పెప్సీ, కోక్ ల పై బ్యాన్ విధించటం ద్వారా వారి ఉద్యోగాలకు ప్రమాదం తీసుకొచ్చారు వ్యాపారుల సంఘం వారు! లోకల్ బ్రాండ్ కూల్ డ్రింక్స్ వారి కోసం లోకల్ పెప్సీ, కోక్ ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు!   తమిళనాడులో పెప్సీ, కోక్ బ్యాన్ నేపథ్యంలో మనం గ్రహించాల్సిన సత్యం ఒక్కటి వుంది. ప్రపంచీకరణ కాలంలో మనం విదేశాల్లో వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అదే మాదిరిగా విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ తమ వస్తువులు అమ్ముకుంటాయి. మన వారికి కొంత వరకూ ఉపాధి కూడా కల్పిస్తాయి. కాబట్టి లోకల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు వాటికి ప్రత్యేక రాయితీలు, ప్రొత్సాహకాలు ఇవ్వాలి. అంతేగాని, పెప్సీ, కోక్ లను నిషేదించినట్టు ఒక్కోటి హిట్ లిస్ట్ లో చేరుస్తూ పోతే దీర్ఘకాలంలో మనకే నష్టం ఎక్కువ... 

కేరళలో ఏం జరుగుతోంది..?

కేరళ అంటే ప్రకృతి అందాలకు నెలవు..పడవ ప్రయాణాలు, కొబ్బరి తోటలు, పర్యాటక ప్రాంతాలతో నిత్యం కళకళలాడే ఆ గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు హత్యలు, దాడులతో అల్లాడుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు కేరళలలో నిప్పు రాజేశాయి. అప్పటికే ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులకు సీపీఎం శ్రేణులతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండటంతో చంద్రావత్ వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్లైంది.     ఆయన ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే నిన్న రాత్రి కోజికోడ్ జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా అదే కోజికోడ్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కార్యాలయాన్ని తగులబెట్టారు. ఈ వివాదం ఏకంగా హత్యలకు దారి తీసింది. పాలక్కాడ్ జిల్లాలోని ఎలప్పులిలో సీపీఎం అనుబంధ విభాగం డీవైఎఫ్ఐకు చెందిన ఇద్దరు కార్యకర్తలను హత్య చేశారు. దీంతో సీపీఎం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి విజయన్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.

ఆ కాలేజీల్లోకి.. పెళ్లైన అమ్మాయిలకు నో ఎంట్రీ!

  మీరు తెలంగాణలోని మహిళా విద్యార్థా? ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో చదువుకోవాలని భావిస్తున్నారా? అయితే, మీకు వుండాల్సిన ప్రధాన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? పెళ్లి కాకుండా సింగిల్ గా వుండటం! అవును, తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలల్లో సీటు సంపాదించాలంటే అమ్మాయిలకు మూడు ముళ్లు పడకూడదు! సీటు సంపాదించేంత తెలివితేటలు వున్నా అవన్నీ ఎందుకు పనికిరావు. పెళ్లైతే నో ఛాన్స్ .... అంతే!   తెలంగాణలో మొత్తం 23 రెసిడెన్షియల్ కాలేజీలు వున్నాయి. వీటిల్లో అర్హత సంపాదించిన వారికి ప్రభుత్వమే ఆహారం, ఆవాసం కల్పించి డిగ్రీ పూర్తి చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇలా ఏటా వందల మంది తమ ప్రతిభతో సీటు సంపాదించి గ్రాడ్యుయేట్స్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా, ఇప్పటికీ ఆడపిల్లల చదువుపై డబ్బులు ఖర్చు చేయటానికి ఇష్టపడని మన సమాజంలో తెలివైన పేద అమ్మాయిలు ఈ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకుంటూ వుంటారు. అయితే, ప్రభుత్వ అధికారులు పెట్టిన విచిత్ర నిబంధన చాలా మందిని కాలేజ్ వైపు కన్నెత్తి చూడకుండా చేసేస్తోంది!   రెసిడెన్షియల్ కాలేజీలో డిగ్రీ చదవటానికి చాలా వరకూ పెళ్లైన అమ్మాయిలు వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే, కొందరైనా మారుమూల పల్లెల్లోంచి వచ్చి చదువుకోరని అనలేం కదా. కాని, విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ సంక్షేమ కళాశాలల్లో పెళ్లైన స్త్రీలు చేరటానికి అనర్హలు అని చెప్పేశారు. కారణం ఏంటని ఆరా తీసిన వారికి వినిపిస్తోన్న జవాబు... పెళ్లైన ఆడవాళ్లు కళాశాలలో వుంటే వారి భర్తలు, బంధువులు పదే పదే వచ్చి వెళుతుంటారట! అది మొత్తం వ్యవస్థకే డిస్టబెన్స్ అట! ఇందులో ఏమంత లాజిక్ వుందో రూల్ పెట్టిన వారికే తెలియాలి! రెసిడెన్షియల్ కళాశాలలో వున్న విద్యార్థుల కోసం బంధువులు ఎలాగూ వస్తారు. పెళ్లైన స్త్రీ చదువుకుంటూ వుంటే... ఆమె భర్త వస్తాడు. దాని వల్ల జరిగే నష్టం, కలిగే ఉపద్రవం ఏంటో అధికారులకే తెలియాలి!   డిగ్రీ స్థాయి రెసిడెన్షియల్ కళాశాలలో పెళ్లైన అమ్మాయిలకు నో ఎంట్రీ అనటం పెద్ద దుమారం ఏం అవ్వకపోవచ్చు. ఎందుకంటే, వివాహితలు కుటుంబ బాధ్యతలకు దూరంగా వుంటూ హాస్టల్స్ లో డిగ్రీ చదవటం అరుదు. కాని, ఏ ఒక్కరో , ఇద్దరో చదవాలనీ అనుకున్నా... వాళ్ల అర్హతలు, తెలివితేటలు పట్టించుకోకుండా... అధికారులు కేవలం వారి మ్యారిటల్ స్టేటస్ చూసి రిజెక్ట్ చేయటం విషాదం! అసంబద్ధం! దీని పై ప్రభుత్వం పునరాలోచించాలి...

బ్యాంకుకి వెళ్తే 150 కట్టాల్సిందే

  పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రైవేటు బ్యాంకుల పనితీరు మీద తీవ్ర దుమారం రేగింది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేటు బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాయనీ, నల్లధనాన్ని కొత్త నోట్ల కిందకి మార్చుకునే అవకాశాన్ని కల్పించాయనీ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి బ్యాంకులను చూసీచూడనట్లు వదిలేస్తూ, వారి అవసరాలకి తగినన్ని కొత్త నోట్లను అందిస్తూ రిజర్వ బ్యాంక్ కూడా అనుమానాస్పదంగా ప్రవర్తించిందన్నది బహిరంగ రహస్యం.   నోట్ల రద్దు నేపథ్యంలో అయినకాడికి డిపాజిట్లను దండుకున్న ప్రైవేటు బ్యాంకులు ఇప్పుడు దుడ్డుకర్రలను చేతపట్టాయి. నాలుగు సార్లకు మించి నగదు లావాదేవీలను కనుక నిర్వహిస్తే ప్రతి లావాదేవీకి కనీసం 150 రూపాయల రుసుము చెల్లించాలంటూ సర్క్యులర్లు జారీచేశాయి. నగదు లావాదేవీలని నిరుత్సాహపరిచేందుకే ఈ నిబంధన అని సదరు బ్యాంకులు పైకి చెప్పుకొంటున్నాయి. కానీ ఇది సామాన్యుల నోటి దగ్గర కూడు లాక్కొనే ప్రయత్నమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ 150 రూపాయల నిబంధనను శాలరీ ఖాతాల మీదే కాకుండా సేవింగ్స్ ఖాతాల మీద కూడా విధించారు. ఎక్కువగా దిగువ మధ్యతరగతి ప్రజలే ఈ సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉంటారు. వారికి ఆనలైన్ లావాదేవీల మీద అంత పట్టు ఉండదు. కాబట్టి తమ నగదు లావాదేవీలను నిర్వహించాలంటే... దఫాకు 150 రూపాయల రుసుముని బ్యాంకుకి కట్టాల్సిందే! ఒక రకంగా చెప్పాలంటే మనం నిజాయితీగా దాచుకున్న సొమ్ముని వాడుకునేందుకు బ్యాంకుకి 150 రూపాయల లంచం ఇవ్వాలన్నమాట.   ఈ 150 రూపాయల నిబంధన ఇంతకుముందు ICICI బ్యాంకుకి మాత్రమే ఉండేది. కానీ సందట్లో సడేమియాగా HDFC, AXIS వంటి బ్యాంకులు కూడా ఈ నిబంధనను నెత్తికెత్తుకుంటున్నాయి. కేవలం లావాదేవీల మీదే కాదు... మన ఖాతాలో ఇతరులు జమ చేసే సొమ్ము మీదా, సొంత బ్రాంచ్ కాకుండా ఇతర బ్రాంచ్లో జరిపే లావాదేవీల మీద కూడా ఈ బ్యాంకులు అనేక నిబంధనలను రుద్దాయి. మరికొన్ని రోజులు పోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.   నల్లధనాన్ని రూపుమాపుతామనీ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెగ ఊదరగొడుతోంది. ఆ ఆశయాలను సావకాశంగా తీసుకున్న ప్రైవేటుబ్యాంకులు... పేదల కడుపు కొట్టైనా సరే, తమ ఖజానాను నింపుకోవాలని చూస్తున్నాయి. మరి మోదీగారు ఇదంగా గమనిస్తున్నారో లేదో! - నిర్జర.

ఒక అమరావతి : 6 ప్రపంచ మహానగరాల సమాహారం!

  మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా మ్యాప్ కి సరికొత్త హైలైట్ యాడ్ అవ్వబోతోందా? ఖఛ్చితంగా అవుననే చెప్పుకోవాలి! ఎందుకంటే, ఆంధ్రుల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎన్నో విశేషణాలతో తయారవుతోంది! ఇప్పటిదాకా ఇండియన్ సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైద్రాబాద్... ఇవే చెప్పుకునే వారు! వీటి తరువాత అనేక చిన్న నగరాలు, పట్టణాలు మన దేశంలో వు్న్నాయి. కాని, ఇప్పుడు తెలుగు వారి అమరావతి అద్భుతమే సృష్టించబోతోంది! జరుగుతోన్న ప్రక్రియ గమనిస్తే ప్రపంచ పటంలో భారత్ కు మరో గుర్తింపు చిహ్నం రావటం గ్యారెంటీగా కనిపిస్తోంది....   హైద్రాబాద్ నుంచి అసెంబ్లీ, సచివాలయం మొత్తానికి మొత్తంగా తరలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి ఆవిష్కరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అత్యాధునిక హంగులతో తయారైన ఏపీ అంసెబ్లీ ఆల్రెడీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాగా త్వరలో రాజధాని అమరావతిని అలంకరించనున్న భారీ నిర్మాణాలు ఆంధ్రుల ఖ్యాతి మరింత పెంచనున్నాయి. ఇందుకోసం అమరావతి నిర్మాణాల్ని డిజైన్ చేయాల్సిందిగా ఆంధ్ర సర్కార్ ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్ నర్స్ ను కోరిన విషయం తెలిసిందే. అందులోని ఆర్కిటెక్ట్స్ ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు సీఎం ముందుకు చేరాయి. క్యాబినేట్ లో మంత్రులు కూడా ఆమోదించాక నిర్మాణాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అమరావతి నిర్మాణాలు ప్రపంచపు అత్యుత్తమ నగరాల్లోని అతి శ్రేష్ఠమైన అంశాలు పుణికిపుచ్చుకోవటమే!   అమరావతిలో నిర్మించబోయే వాల్డ్ క్లాస్ స్ట్రక్చర్స్ కజక్ స్థాన్ లోని ఆస్తానా నగరంలో వున్న నిర్మాణాల్ని పోలి వుంటాయి. అంతే కాదు, మలేషియాలోని పుత్రజయ నగరం, బ్రెజిల్ లోని బ్రసిలియా నగరం, అమెరికాలోని వాషింగ్టన్ నగరం, బ్రిటన్లోని లండన్, మన న్యూ ఢిల్లీ నగరం... వీటన్నిటిలోని విశేషాలు కూడా అమరావతిలో తొణికిసలాడనున్నాయి! ఇలా ప్రపంచపు అత్యుత్తమ ఆరు నగరాల లక్షణాలు అమరావతిలో అలరించనున్నాయి!   ఇండియాలోని ఆధునిక నగరాలు చాలా తక్కువ. మన మహానగరాలన్నీ వందల ఏళ్ల పురాతనమైనవీ. కొన్నైతే వేల ఏళ్ల చరిత్ర కలిగినవి. కాని, అమరావతి మోడ్రన్ ఇండియాకు సంకేతంగా మోడ్రన్ మెట్రోపోలిస్ గా నిలవనుంది!

మిసెస్ శ్రీనివాస్ కూచిభోట్ల ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

  శ్రీనివాస్ కూచిభోట్ల... కొన్ని రోజుల క్రితం అమాంతం టీవీ తెరల మీద బ్రేకింగ్ న్యూస్ గా కనిపించిన పేరు! నిజానికి అమెరికాలోని లక్షలాది మంది ఇండియన్స్ లో ఆయనొకరు. మనకు తెలిసే అవకాశమే వుండేది కాదు. కాని, విషాదంగా ఆయనొక ఉన్మాది బుల్లెట్ కి బలై అందరి నోళ్లలో నానారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా ఫస్ట్ అన్న నినాదం మార్మోగింది. ఒక విధంగా అది కూడా శ్రీనివాస్ అర్ధాంతర నిష్క్రమణకి కారణం. కాకపోతే, ఇప్పుడాయన అంత్యక్రియలు పూర్తైపోయాయి. ఇక మిగిలింది బతుకును భారంగా మోయాల్సిన ఆయన భార్య జీవితం! ఆమె ఏం చేయబోతున్నారు?   శ్రీనివాస్ కూచిభోట్ల లాగే ఆయన భార్య సునయన కూడా టెక్కీ. సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం వున్న ఆమె అమెరికాలోనే ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరారు. కాని, దురదృష్టవశాత్తూ కాన్సాస్ లో జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఆయన చనిపోయిన అనంతరం తాను ఇండియాకి వచ్చేస్తానని అమెరికాలో చెప్పిన సునయన తాజాగా తన ఫేస్బుక్ పోస్ట్ లో అంతరంగం బయటపెట్టారు. తన కలల్ని ఛిద్రం చేసిన అమెరికాకి ఆమె తిరిగి వెళతానని చెప్పారు!   శ్రీనివాస్ భార్య సునయన తాను మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం కొనసాగిస్తాననీ, తన భర్త ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన ఇయాన్ అనే అమెరికన్ను కలిసి కృతజ్ఞతలు చెబుతానని అన్నారు. అంతే కాదు, శ్రీనివాస్ మృత్యు వాత పడిన ఆ చివరి రోజు తామిద్దరు డాక్టర్ వద్దకి వెళ్లి ప్రెగ్నెన్సీ గురించి సలహాలు తీసుకున్నామని, తనకి భర్త వల్ల ఒక సంతానం కలిగి వుంటే బావుండేదని ఆమె బాధగా, భారంగా తన భావాల్ని పంచుకున్నారు!   ప్రస్తుతం ఏ విధంగానూ పూడ్చలేని నష్టాన్ని అనుభవిస్తోన్న మిసెస్ శ్రీనివాస్ కూచిభోట్ల తిరిగి అమెరికా వెళ్లి జీవన పోరాటం ధైర్యంగా సాగించాలనుకోవటం నిజంగా గొప్ప విషయం. ఆమెని తప్పకుండా అభినందించాల్సిందే! ఏం జరిగినా, ఎలా జరిగినా జీవితపు క్రీడ సాగిపోతూనే వుండాలి కదా....

ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తం కాకపోతే... ప్రై'వేటు' తప్పదు!

మరో ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. మరోసారి ప్రాణాలు గాల్లో కలిశాయి. అయితే, దివాకర్ ట్రావెల్స్ టీడీపీ నేతలు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులది కావటంతో చర్చంతా రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ఎంట్రీతో వ్వవహారం మరింత హీటెక్కింది. అయితే, చనిపోయిన వారి కుటుంబాలకి ఎవరు నష్టం పూడుస్తారు? అది పూడ్చలేనిది. ఎక్స్ గ్రేషియాలు సరిపెట్టలేనిది. వాళ్ల కుటుంబాలు శాశ్వతంగా మనో వేదనకు గురవుతూనే వుంటాయి. అందుకే, ఇప్పుడు జరగాల్సింది రాజకీయ చర్చ కాదు అర్థవంతమైన చర్చ జరగాలి...    మనం సరిగ్గా గమనిస్తే విదేశాల్లో కన్నా మన దగ్గర యాక్సిడెంట్లు ఇబ్బడి ముబ్బడిగా అవుతుంటాయి. అందుకే, ప్రభుత్వాల అలసత్వం ఒక కారణమైతే, వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం మరో కారణం. అంతే కాదు, హైవేలపై జరిగే దారుణమైన యాక్సిడెంట్లలో చాలా వరకూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే మృత్యు శకటాలుగా మారుతుంటాయి. ఆర్టీసీ బస్సులు తక్కువగా ప్రాణాలు తీస్తుంటాయి. ఇక్కడే చాలా సందేశం వుంది. అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఇద్దరూ చాలా గ్రహించాలి.    గవర్నమెంట్ ప్రైవేట్ బస్సుల మీద ఎలాంటి నియంత్రణ వుంచదనేది మన దగ్గర అందరూ అంగీకరించే నిత్య సత్యం. అధికారంలో వున్నది ఎవరైనా ప్రవేట్ బస్సుల వ్యవహారంలో అందరూ చూసి చూడనట్టే వ్యవహరిస్తారు. అందువల్లే ప్రవేట్ ట్రావెల్స్ తమ ఇష్టానుసారం జనం ప్రాణాలతో ఆటలాడుకుంటాయి. వాటిలో ఎంత ఎక్కుతున్నారు, ఎంత రేటుకు టికెట్స్ అమ్ముకుంటున్నారు, అసలు ఒకే నెంబర్ ప్లేట్ పై ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయా... ఇలాంటి బోలెడు ప్రశ్నలు సమాధానాలు లేకుండానే వుండిపోతుంటాయి. ఇప్పటిలా యాక్సిడెంట్స్ జరగగానే ఆర్టీఏ వారి దాడులు కొన్నాళ్లు న్యూస్ పేపర్ల మెయిన్ ఎడిషన్స్ లో, తరువాత జిల్లా ఎడిషన్స్ లో కనిపిస్తాయి. క్రమంగా దాడులన్నీ ఆగిపోతాయి. మళ్లీ ఏదో ఒక బస్సు మరికొన్ని ప్రాణాలు గాల్లో కలిపిస్తేగాని హడావిడి మొదలవదు. దీనికంతటికీ కారణం ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారాలపై, బస్సులు, డ్రైవర్లపై ఏ గవర్నమెంటూ నిరంతర శ్రద్ధ పెట్టకపోవటం! ఒక నియంత్రణ , నిఘా వ్యవస్థ లేకపోవటం!   ప్రభుత్వాలు చాలా అంశాల్ని పట్టించుకోకపోవటం మన దేశంలో సర్వ సాధారణం. కాని, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులన్నా తమ భద్రతని పట్టించుకోవటం... కనీస ధర్మం. కాని, అలా జరుగుతున్న దాఖలాలు లేవు. శని, ఆదివారాలు వస్తే చాలు ఆర్టీస్ బస్సుల కొరత, సీట్ల లేమి వల్ల చాలా మంది ప్రైవేట్ బస్సులు ఎక్కేస్తుంటారు. అవ్వి తళతళ మెరిసిపోతూ కనిపిస్తున్నాయన్నదే చూస్తారు తప్పా... మిగతా భద్రతా అంశాల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇద్దరు డ్రైవర్స్ వున్నారా లేదా? సదరు ట్రావెల్స్ వాహనాలు గతంలో ఏమైనా యాక్సిడెంట్లకు గురయ్యాయా? ఇలాంటివి ఆలోచించుకునే ఓపికా, తీరికా ఎవ్వరికీ లేదు. అక్కడే ప్రైవేట్ ట్రావెల్స్ వారి ఆటలు హాయిగా నడిచిపోతున్నాయి. ప్రజలు, ప్రభుత్వం రెండు వైపుల నుంచి స్వేచ్ఛగా వదిలేయటంతో హైవేలపై కక్కుర్తి సంపాదన చేస్తున్నారు. అందరూ అలాంటి వారే కాదని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్ బోలెడు వున్నాయి. వాటి కంటే అధికంగా జనాల ప్రాణాల్ని పణంగా పెట్టి డబ్బులు సంపాదించే ట్రావెల్స్ లు ఎక్కువైపోవటం ఆందోళనకరం!    ఆ మధ్య పాలెంలో తగలబడ్డ బస్సు. ఇప్పుడు వంతెన మీద నుంచి బోల్తా కొట్టిన బస్సు. రేపు మరొకటి. తరువాత ఇంకొకటి. పాలకులు, ప్రయాణికులు ఇద్దరూ అప్రమత్తమైతే తప్ప వీటికి అంతం లేదు. 

జగన్ ఎప్పటికీ నెక్స్ట్ సీఎం గానే మిగిలిపోతాడా

  ప్రజాస్వామ్యంలో పాలక పక్షం వుంటుంది. ప్రతిపక్షం కూడా వుంటుంది. పాలకపక్షం బలంగా లేకుంటే అభివృద్ధి వుండదు. కాని, ప్రతిపక్షం బలంగా లేకుంటే అవినీతి, అరాచకం పెరిగిపోతాయి. అందుకే, ఒక్కోసారి పాలకపక్షం కంటే ప్రతిపక్షం చాలా ముఖ్యం. కాని, నవ్యాంధ్రలో బలమైన పాలకపక్షం దిశ, దశాలేని ప్రతిపక్షంతో హాయిగా రాష్ట్రాన్ని ఏలుకుంటోంది. తాజాగా ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వాసుపత్రిలో చేసిన హంగామా ఇందుకు మంచి ఉదాహరణ! ఆయన గంభీరంగా వ్యవహరించి వుంటే ఇరుకున పడాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు రివర్స్ ఎటాక్ చేసి తన పని తాను చేసుకుపోతోంది...   దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడం, కొందరి ప్రాణాలు పోవటం, చాలా మంది గాయపడటం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయితే, దీని తరువాత జరగాల్సిన సరైన చర్చ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, నిఘా, ఇలాంటివన్నీ లేవనెత్తబడాలి. అప్పుడు కనీసం మరోసారి మరో ప్రైవేట్ బస్సన్నా ఇప్పటిదానిలా నరకానికి దారి చూపకుండా వుంటుంది. కాని, జగన్ ఈ మధ్య సరికొత్తగా మొదలు పెట్టిన యాక్షన్ హీరో పర్ఫామెన్స్ పుణ్యమాని... మొత్తం అంతా అదుపు తప్పింది. జరిగిన తప్పు ఎక్కడో పోయింది. పనికి రాని రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు జనానికి మిగిలాయి...   జగన్ ఒక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడ గవర్నెమంట్ డాక్టర్ని, కలెక్టర్ని ఇబ్బంది పెట్టడం ఎవ్వరూ ఒప్పుకోని విషయం. ఆయన చెప్పినట్లు నిజంగా కూడా అధికారులు పాలక పక్షం వైపు వుండి వచ్చు! అది మన దేశంలో చాలా సార్లు జరిగే విషయమే. జగన్ తండ్రి వైఎస్ సీఎంగా వున్నప్పుడు అన్ని శాఖల్లో, దాదాపు అందరు ఉన్నతాధికారులు ఆయనకు అనుంగు విధేయులుగా వున్నవారే కనిపించే వారు. తరువాత వారిలో కొంత మంది జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చిందంటే అప్పటి విధేయత ఎంతగా వుండేదో మనం అర్థం చేసుకోవచ్చు!   నిజంగా గవర్నమెంట్ డాక్టర్ , కలెక్టర్ మృతుల పోస్ట్ మార్టమ్ విషయంలో తప్పుగా ప్రవర్తించి వుంటారా? వారి మీద ఆరోపణలు చేసే హక్కు జగన్ కు వుంటుంది. పైగా తన సాక్షి మీడియాతో సహా బోలెడు తెలుగు మీడియా ప్రచారం కల్పించటానికి వుండనే వుంది కూడా. అయినా, కూడా జగన్ డాక్టర్ని, కలెక్టర్ని నేరుగా బెదిరించి, మరో రెండేళ్లలో నేనే సీఎం అంటూ పాత డైలాడ్ వదలటం అస్సలు బాలేదు. దీని వల్ల గవర్నమెంట్ అధికారుల్లో , ఉద్యోగుల్లో యువనేత పట్ల వ్యతిరేక భావం కలగటమే కాక శవ రాజకీయాలు చేస్తున్నాడని జనం ఫీలయ్యే ఛాన్స్ వుంది. ఎందుకంటే, మొన్నటికి మొన్న విశాఖ విమానాశ్రయంలో కూడా అధికారులకి చుక్కలు చూపించాడు జగన్. అక్కడి దాకా వెళ్లి ప్రత్యేక హోదా డిమాండ్ కి మద్దతు పలకటం తప్పు కాకపోయినా ఆఫీసర్లని తిట్టిపోసి , బెదిరించి, నేనే నెక్స్ట్ సీఎం అంటూ వారెంట్ ఇవ్వటం ఒక విధమైన రౌడీయిజం అనిపించుకుంటుంది. దాని వల్లే స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో జగన్ కు దక్కాల్సిన క్రెడిట్ కన్నా తక్కువ మైలేజే దక్కింది.   ప్రతిపక్షంలో వున్నప్పుడు అసహనం ఎంత మాత్రం పనికి రాదు. ఓపిగ్గా జనం వైపు నుంచి ఆలోచిస్తూ పాలకుల్ని ఇరుకున పెట్టాలి. ఇప్పటి బస్సు దుర్ఘటనే తీసుకుంటే ఆ బస్సు టీడీపీ నేతది. కాబట్టి మరింత తీవ్రంగా ఒత్తిడి చేయోచ్చు అధికార పక్షంపై. కాని, జగన్ తన విపరీత దూకుడుతో ఇటు ప్రజలకీ మంచి చేయక, అటు తనకి మేలు చేసుకోక.... అవకాశం జారవిడుచుకున్నాడు. ఇలా చేస్తే నెక్స్ట్ సీఎం డైలాగ్ ఇంకా చాలా ఏళ్లు చెబుతూనే వుండాల్సి రావచ్చు! ఒక సారి ఆలోచించుకుంటే మంచిది!

బ్రిటన్ మహారాణికి దాకా పాకిన బాహుబలి క్రేజ్

  బాహుబలి ది కన్ క్లూజన్ వచ్చేస్తోంది! తెలుగు వారందరికీ ఎగ్జైటింగ్ గానే వుంది. ఇన్ ఫ్యాక్ట్ ఇండియన్స్ అందరికీ కూడా ఆసక్తిగానే వుంది. అందుక్కారణం, బాహుబలి టూ రిలీజైతే కట్టప్ప ఎందుకలా పొడిచేశాడో తెలిసిపోతుంది కాబట్టి! కాని, ఏప్రెల్ లో రాబోతోన్న మన రాజమౌళి మాస్టర్ పీస్ కేవలం కట్టప్ప వల్లే వార్తల్లో నిలవటం లేదు. ఇంకా చాలా విషయాల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది! అయితే, తాజాగా వినిపిస్తోన్న బాహుబలి న్యూస్ అయితే మీరు అస్సలు నమ్మలేరు! బాహుబలి మనకంటే ఒక్కరోజు ముందే... బ్రిటన్ మహారాణి చూసే అవకాశం వుందట!   బాహుబలి అంటే మాహిష్మతి రాజ్యపు కథ. ఆ రాజ్యాన్ని రక్షించిన బాహుబలి కథ! అయితే, బాహుబలిలో ప్రభాస్, రానా లాంటి రాజులే కాదు అనుష్క, తమన్నా లాంటి అందాల రాణులు కూడా వున్నారు. నిజానికి బాహుబలి సెకండ్ ఇన్ స్టాల్మెంట్ లో దేవసేనగా అనుష్కా ఎలా మెస్మరైజ్ చేస్తుందనేదే ఇప్పుడు అందరి ఆలోచన కూడా! కాకపోతే, ఇప్పుడు తాజా సంచలనం ఏంటంటే, మన మాహిష్మతి రాజుల్ని, రాణుల్ని మనకంటే ముందుగా బ్రిటన్ రాణి చూడబోతోందట. ఇంకా ఈ న్యూస్ కన్ ఫర్మ్ కాలేదు కాని... పరిస్థితి చూస్తుంట బాహుబలి టూ ప్రీమియర్ క్వీన్ ఎలిజబెత్ టూ సమక్షంలో జరిగేలా వుంది!   బాహుబలి పార్ట్ టూని జక్కన్న ఏప్రెల్ 28న ప్లాన్ చేశాడు. అయితే, అంతకు ఒక్క రోజు ముందు బాహుబలి బ్రిటన్ ప్రీమియర్ వుంటుందట. మామూలుగా అయితే, దీనికి తెలుగు ఆడియన్స్, ఇండియన్ ఆడియన్స్ ఎగబడతారు. కాని, ఏప్రెల్ 27న బాహుబలి ప్రీమియర్ ఊరికే వేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు అవుతోన్న సందర్భంగా బ్రిటన్ లో భారతీయ సంబరాలు జరగబోతు్న్నాయి. ఏప్రెల్ నుంచీ డిసెంబర్ దాకా మన సినిమాలు ప్రదర్శిస్తారు. అందులో మొదటి రోజే బాహుబలి ప్రదర్శన వుండనుందట! సో... బ్రిటన్, ఇండియా సంయుక్త సంబరాల తొలి రోజు కాబట్టి బకింగ్ హామ్ ప్యాలెస్ మహారాణి హాజరైతీరతారు. బాహుబలి కూడా తిలకించే ఛాన్స్ వుంది!   వందేళ్లు పూర్తి చేసుకున్న భారతీయ సినిమా బ్రిటన్ బానిసత్వం నుంచి బయటపడ్డాక బోలెడంత ఎదిగింది. ఈ డెబ్బై ఏళ్లలో మనం సాధించిన వెండితెర వేగం... బాహుబలి రూపంలో బ్రిటన్ రాణికి అర్థమైతే... మనకు అంతకన్నా గర్వకారణం ఏం వుంటుంది!

రెండేళ్లలో నేనే సీఎం..మీరు ఇంటికే..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన సహజ లక్షణాన్ని మరోసారి ప్రదర్శించారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఈ ఉదయం దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికై గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలవ్వగా..25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సహాయక బృందాలు నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నాయి. క్షతగాత్రులను పరామర్శించేందుకు, అలాగే మృతుల బంధువులను ఓదార్చేందుకు జగన్ నందిగామ చేరుకున్నారు. బాధితులను పరామర్శించి..వారికి ధైర్యం చెప్పారు.     అయితే బస్సు డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయకుండానే పంపించేశారని ఆరోపించిన ఆయన డాక్టర్ వద్ద ఉన్న డ్రైవర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ బాబు జగన్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ సహా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందిస్థాయి నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల వరకు అవినీతిలో కూరుకుపోయారని.. రెండేళ్లలో నేనే రాబోతున్నాను...వచ్చిన మరుక్షణం మీరంతా ఇంటికేనని తీవ్రంగా హెచ్చరించారు.     జగన్ అఖిల భారత స్థాయి అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి..గతంలో ఏపీ ప్రత్యేక హోదాకు నిరసన తెలిపేందుకు విశాఖ వెళ్లిన జగన్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంతో..అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీస్ కమిషనర్‌ యోగానంద్‌ను కూడా ఇలాగే మీ పేరుతో సహా గుర్తుపెట్టుకుంటా..ముఖ్యమంత్రిని అయిన వెంటనే మీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. తాజాగా మరోసారి కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సివిల్ సర్వీస్ ఉద్యోగులు ప్రతిపక్షనేత ప్రవర్తనపై త్వరలోనే నిరసన చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇండియాలో... ఎక్కువ డబ్బున్నోళ్లు ఎక్కువ మంది ఎక్కుడున్నారో తెలుసా?

ఊళ్లలో వుండే వారికి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. శుద్ధమైన నీరు వుంటుంది. కలుషితం కాని ఆహారం దొరుకుతుంది. మనిషి బతకటానికి ఇవి మూడు కాకుండా ఇంకేం కావాలి? నిజానికి ఏమీ అక్కర్లేదు! కాని, ఈ ఆదునిక కాలంలో డబ్బు అన్నిటికంటే ప్రముఖంగా కావాలి. ఆ డబ్బు ఎక్కువగా దొరికేది నగరాల్లోనే. ఇంకా సమృద్దిగా దొరికేది మహానగరాల్లోనే. అందుకే, రోజూ కొన్ని లక్షల మంది ప్రశాంతమైన గ్రామాల్ని వదిలి సిటీల బాట పడుతుంటారు. వలస కూలీల వద్ద నుంచీ కోటీశ్వరుల దాకా అందరిదీ ఇదే అవస్థ...    నగరాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దేశంలోని సంపదంతా నగరాలు, మహానగరాల్లోనే పోగైపోతుందా అనేలా కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి ఒక సర్వేలో! నేషనల్ వెల్త్ వాల్డ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక్కో నగరంలో ఎంత మంది బలియనీర్లు, ఎంత మంది మిలియనీర్లు వుంటున్నది బయటపడింది. ఆ లెక్కలు చూస్తే సిటీల్లో సంపద ఎంతగా పెరిగిపోతోందో మనకు ఇట్టే అర్థమైపోతుంది! ఇండియా మొత్తంలో అత్యధిక సంపద పోగై వున్న నగరం ముంబై! లక్ష్మీ దేవీ ధనాగారంలో వెలిగిపోతోంది మన ఆర్దిక రాజధాని. ఇక్కడ 28బిలియనీర్లు, 46వేల మంది మిలియనీర్లు వున్నారట! తరువాతి స్థానంలో 18మంది బిలియనీర్లు, 23వేల మంది మిలియనీర్లతో ఢిల్లీ రెండో ర్యాంక్ లో వుంది! ఇక మూడో స్థానం చెన్నై, కోల్ కతాలది కాదు. వాటి తరువాత అభివృద్ధి అయిన బెంగుళూరుది! అక్కడ 8మంది బిలియనీర్లు, 7వేల 700మంది మిలియనీర్లు వున్నారట!   బిలియనీర్లు, మిలియనీర్ల సంఖ్యలో వేలాది కోట్ల సంపదతో... అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో వున్నాయి కోల్ కతా, చెన్నై, పూణే, గుర్గ్రామ్ నగరాలు! మన భాగ్య నగరం భాగ్యవంతుల లిస్ట్ లో నాలుగో స్థానం ఆక్రమించింది. మన దగ్గర 6 మంది బిలియనర్లు వుంటే, 9 వేల మంది మిలియనీర్లు వున్నారట! ఇన్ని వేల మంది కోటీశ్వరులు కోట్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు కాబట్టే హైద్రాబాద్ కార్లతో కళకళలాడిపోతోంది! షాపింగ్స్ మాల్స్ కౌంటర్లతో వెలిగిపోతున్నాయి!    నగరాల్లో వేలాది కోట్లున్న కుబేరులు నివాసం వుండటం అత్యంత సహజం. కాని, రోజు రోజుకీ నగరాలు ధనికంగానూ, దేశానికి వెన్నెముక లాంటి గ్రామాలు పేదగానూ మారిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. గ్రామాల నుంచి జనం వలస రాకుండా, నగరాల్లో మాదిరిగానే అక్కడా కోటీశ్వరులు, లక్షాధికారుల సంఖ్య పెరిగేలా చేయగలిగితే... భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది! లేదంటే తలనొప్పితో బాధపడుతోన్న రాజు నెత్తిన బంగారు కిరీటం పెట్టుకున్నట్టు... బరువు తప్ప సుఖం ఎంత మాత్రం మిగలదు! 

స్టేట్ ఆఫ్ ద ఇయర్... మన తెలుగు రాష్ట్రమేనట!

  ఈ సంవత్సరానికిగానూ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ గెలుచుకున్న రాష్ట్రం ఏదో తెలుసా? మరేదో అయితే మనమెందుకు మాట్లాడుకుంటాం? మన ఆంధ్ర రాష్ట్రమే ఆ ఘనతను సాధించింది. స్టేట్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ప్రతీ యేటా సీఎన్ బీసీ టీవీ 18 ఛానల్ అందిస్తుంది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ కూడా అందిస్తారు. అయితే, 2017కి గానూ నూతన రాష్ట్రం ఏపీ అవార్డ్ స్వంతం చేసుకుంది!   ఇంకా శాశ్వత రాజధాని కూడా లేని మన రాష్ట్రం అమరావతి కేంద్రంగా అద్బుత అభివృద్ధి సాధిస్తోందని జ్యూరీ సభ్యులు అభిప్రాయపడ్డారు. హెచ్ డీఎఫ్ సీ సీఎండీ, ఎస్బీఐ సీఎండీ లాంటి ప్రుముఖులు జడ్జ్ లు గా వ్యవహరించిన పోటీలో ఆంద్రా మిగతా రాష్ట్రాల్ని వెనక్కి నెట్టి పురస్కారం సాధించింది. దీనికి కారణం అభివృద్ధి రేటే. పోయిన యేడు చంద్రబాబు సారథ్యంలోని నవ్యాంధ్ర 10.99శాతం అభివృద్ధి సాధించగా... ఈ యేడు అప్పుడే 12.44శాతం సాధించింది. సంవత్సరం పూర్తయ్యే సరికి మన రాష్ట్రం 13శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని న్యాయనిర్ణేతల కమిటీ అభిప్రాయపడ్డింది!   తెలంగాణ, ఆంధ్రాలుగా సమైక్యాంధ్ర విడిపోయిన తరువాత ఏపీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే అమరావతి నుంచి పూర్తి స్థాయి అసెంబ్లీ, సెక్రటేరియట్ కార్యకలాపాలు మొదలు పెడుతన్న కొత్త రాష్ట్రానికి స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గొప్ప ప్రొత్సాహం అనే చెప్పుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఇస్తోన్న పారిశ్రామిక ప్రొత్సాహమే అవార్డ్ ఎంపికకు కారణంగా తెలుస్తోంది!  

ఆ ఉగ్రవాదులకి మనిషి మాంసం తినే పర్మిషన్ వుండేదట!

  చాలా సార్లు చాలా మంది అభ్యుదయవాదులు, ఉదారవాదులు ఉగ్రవాదానికి మతం లేదు అంటుంటారు.వారి ఉద్దేశం కేవలం ఒక మతం వారు మాత్రమే ఉగ్రవాదులు కాదని! అయితే, వారికి వ్యతిరేకంగా మాట్లాడే సంప్రదాయవాదులు, ఛాందసులు ఉగ్రవాదానికి మతం వుందనీ, అది ఇస్లామని అంటుంటారు. అంటే, వారి ఉద్దేశంలో అత్యధిక శాతం టెర్రరిస్టులు ముస్లిమ్ లేనని! ఈ వాదనల మాటెలా వున్నా.... ఉగ్రవాదానికి మతం వున్నా లేకపోయినా... ఉగ్రవాదులకి ఖచ్చితంగా మతం వుంటుంది. వారు ఏ పని చేసినా మతంతోనే ముడిపెట్టుకుంటారు. దీనికి కేవలం ముస్లిమ్ ఉగ్రవాదులే పరిమితం కాదు. అన్ని మతాల్లోని ఉగ్రవాదులు అంతే. మతం ఆధారంగా అరాచకం సృష్టించటానికి పూనుకున్న వాడు అదే మతాన్ని అన్నిటితో ముడిపెడతాడు. ఇక మత ఛాందసానికి, క్రూరత్వానికి పెట్టింది పేరైన ఐసిస్ సంగతి చెప్పేదేముంది...   ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు నర రూపరాక్షసులు. ఇదేదో పోలిక కోసం అంటాం అనుకోకండి. వాళ్లు కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో చేసిన అరాచకాలు అటువంటివి. సిరియా, లిబియా, ఇరాక్ లాంటి చోట్ల తమ స్వాధీనంలో వున్న ప్రాంతాల్లో ఐసిస్ రాక్షసులు చెలరేగిపోయారు. ఎంతగా అంటే, ఇప్పుడు వారి చెర నుంచి విముక్తం అయిన చోట్లలో అప్పటి దుర్మార్గపు సత్యాలు బయటపడుతున్నాయి. లండన్ లోని ఒక సంస్థ వారి చేతికి చిక్కిన ఐసిస్ డాక్యుమెంట్స్ ప్రకారం... అవసరమైతే ముస్లిమేతరుల మంసం కూడా వండుకుని తినొచ్చని వాటిల్లో వుందట. ఇలాంటి దారుణమైన పద్దతుల్లో ఐసిస్ తన జిహాదీలకు శిక్షణ ఇచ్చేదట. అసలు మనిషి మాంసం తినమని చెప్పటమే గగుర్పొడిచే విషయమైతే... వారు ముస్లిమ్ లు కాకూడదని చెప్పటం... మతోన్మాదానికి పరాకాష్ఠ! అణువణువునా ఇతర మతాల పట్ల ఐసిస్ ఉగ్రవాదులకి పేరుకుపోయిన ద్వేషానికి సంకేతం!   ఇతర మతాల మనుషుల్ని చంపి వండుకుని తినమని చెప్పిన ఇస్లామిక్ స్టేట్ తమ మతంలోని వార్ని కూడా వదల్లేదు. అతి వాద ఇస్లామ్ ని తిరస్కరించే సాధారణ ముస్లిమ్ లని కూడా చంపొచ్చట. తినొచ్చట. ఇక ఐసిస్ పిల్లల్ని, స్త్రీలని పెట్టిన హింసల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏముంది? ఆ ఒక్క సంస్థ మతోన్మాదం మధ్య ఆసియాలో అనేక ప్రాంతాల్ని వేల ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఐసిస్ కుప్పకూలినా ఆయా దేశాలు, ప్రాంతాలు బాగుపడే అవకాశం కనుచూపు మేరలో , వందల సంవత్సరాల్లో కనిపించటం లేదు!  

ట్రంప్ కాదు.. శ్రీనివాస్ హత్యకి అసలు కారణం ఇదీ!

అమెరికాలో తెలుగు యువకుడి హత్య.... ఈ వార్త మనల్ని కొన్ని రోజులుగా ఎంత కలచి వేసిందో చెప్పక్కర్లేదు. ఒక వైట్ అమెరికన్ ఉన్మాదం, ఆవేశం, అరాచకం ఒక తెలుగు తేజాన్ని ఆర్పేసింది. ఒక కుటుంబం మొత్తాన్నీ ఛిద్రం చేసింది. యావత్ భారతీయుల్ని ఆక్రోశానికి గురి చేసింది. ఎవ్వరూ వేలెత్తి చూపలేని టాలెంట్ తో ఇండియన్స్ అమెరికాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. పూర్తిగా అర్హత మీదే ఆధారపడి అందలాన్ని అందుకుంటున్నారు. అయినా ట్రంప్ ప్రభావంలోని అమెరికాలో అసూయ అక్కడి వారి చేత ట్రిగ్గర్లు నొక్కిం చేస్తోంది. ఎన్నో ఆనందాల్ని అమెరికాలోనూ, ఇండియాలోనూ చిదిమేస్తోంది...      శ్రీనివాస్ కూచిభోట్ల అనే మన సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అగ్రరాజ్యంలో అక్కడి ఒక ఉన్మాది ఉగ్రహానికి బలయ్యాడు. కాని, అంతకంటే ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మనకు బోలెడంత విషాదం కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది డొనాల్డ్ ట్రంప్ ను తిట్టిపోసి కోపం చల్లార్చుకుంటున్నారు. కాని, నిజంగా తిట్టాల్సింది ట్రంప్ ను మాత్రమేనా? అంతకు మించి విలన్లు ఎవ్వరూ భారతీయుల ఈ దుస్థితికి కారణం కాదా? ఒక్కసారి ఈ ప్రశ్నలు వేసుకుంటే మనకు దొరికే జవాబులు ట్రంప్ పాత్ర ఎంత చిన్నదో తేల్చేస్తాయి!     డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని ఒక వర్గానికి... విదేశీయులపై , ముఖ్యంగా ఆసియా నుంచి వచ్చి స్థిరపడ్డ వలస ఉద్యోగులపై ద్వేషం నూరిపోస్తున్నాడని అందరి కంప్లైంట్. అది నిజమే కావచ్చు. కాని, ట్రంప్ ను సమర్థించే వారి వద్ద వెయ్యి కారణాలున్నాయి. ట్రంప్ చేసేది, చెప్పేది ఎందుకు కరెక్టో బల్లగుద్ది వాదించే వారున్నారు. కాని, అసలు ట్రంప్ వ్యవహార తీరు కాదు. అసలు సమస్య అమెరికన్ కల్చర్. అక్కడి గన్ కల్చర్. అమెరికాలోని చాలా మంది తెల్లవారికి ఇప్పటికీ తాము ఆఫ్రికా, ఆసియా వాసుల కంటే గొప్ప వారమనే అహంకారం వుంటుంది.     ఈ జాతి వివక్ష ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అందరికీ తెలిసిందే! అందుకే, ట్రంప్ తో ఏ సంబంధం లేని ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం ఎంత మంది భారతీయులు హత్యకి గురయ్యారో గుర్తు చేసుకోండి? జాతి వివక్ష చాలా తెల్ల దేశాల్లో వుంటుంది. అంతే కాదు, దానికి తోడు ఆయా దేశాల్లో గన్ కల్చర్ విచ్చలవిడిగా వుండటంతో క్షణాల్లో ప్రాణాల్ని బలి తీసేసుకుంటారు ఉన్మాదులు. ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటే అతడికి ఓట్లు గెలిపించిన అమెరికన్స్ కంటే ఈ ఉన్మాదులే చాలా డేంజర్. అమెరికాలోని ఒక వర్గం వలస వచ్చిన వారు తమ అవకాశాలు తన్నుకుపోతున్నారని భావించటం కేవలం రాజకీయ కోణమే. అందులో హింస లేదు. హింస వున్నదంతా వైట్ అమెరికన్స్ అహంకారంలో. వారి చేతుల్లో గన్స్ లో!     శ్రీనివాస్ కూచిభోట్ల మర్డర్ మరో సత్యాన్ని కూడా మన ముందుంచుతుంది. అసలు ట్రంప్ వద్దు పొమ్మంటే కూడా మన ఇండియన్స్ ఎందుకు అమెరికాను పట్టుకుని వేలాడుతున్నారు? ఇండియాలో తగిన అవకాశాలు లేక. అమెరికాలో వచ్చేంత ఆదాయం ఇక్కడ రాక. ఉద్యోగాలు కల్పించాల్సిన పాలకులు, పార్టీలు, ప్రభుత్వాలు మాటలు చెప్పటం తప్ప నిజంగా చేసింది ఏమీ లేదు! దేశాన్ని పాలించిన కాంగ్రెస్, రాష్ట్రాల్ని పాలించిన ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు అధికారం చెలాయిస్తోన్న బీజేపి... అందరూ అభివృద్ది చేశామనే అంటారు కాని.. ఏటా అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించుకునే వారి సంఖ్య మాత్రం తగ్గటం లేదు! ఇంకా విషాదం ఏంటంటే... అమెరికాకు వెళ్లి యాతన పడుతోన్న చదువుకున్న వారికన్నా దుబాయ్ కి వెళ్లి నరకయాతన అనుభవిస్తోన్న చదువుకోని వారి సంఖ్య మరింత ఎక్కువ! చమురు దేశాల్లో మసిబారిపోయిన భారతీయుల జీవితాలు ఎన్నో! వారి గురించి ఒక అమెరికన్ ఎన్నారై చనిపోతే మాట్లాడినంతగా మీడియా కూడా మాట్లాడదు!      చదవుకుంటే అమెరికాకు, చదువు లేకపోతే దుబాయ్ కి వెళ్లాల్సి రావటం నిజంగా భారతీయుల విషాదం. ఆ తరువాతే ట్రంప్ తెంపరితనం అయినా, ఏదైనా. మన మీడియా, మేధావులు అంతా, అందరూ టార్గెట్ చేయాల్సింది మన దేశంలోని వ్యవస్థని. ఇక్కడి పాలకుల్ని. అంతే కాని, ట్రంప్ ని ఉక్రోశంతో తిట్టిపోస్తే ఇప్పుడే కాదు... దీర్ఘకాలంలోనూ ఏ లాభం వుండదు. ఏనాటికైనా భారత్ శ్రీనివాస్ కూచిభోట్ల లాంటి నిపుణుల్ని గడప దాటనీయకుండా చూసుకుంటేనే వ్యవస్థకి, వ్యక్తులకి రెంటికీ లాభం.... 

గుర్ మెహర్ ... గురి తప్పిన అభ్యుదయవాద బాణం!

  ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్... ఇప్పుడు ఇది మన దేశ రాజకీయాల్లో మీడియా, మేధావులు, విద్యార్థులు ప్రయోగించే అణుబాంబులా మారిపోయింది! వున్నట్టుండీ జాతీయ రాజకీయాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ బాంబు పేలుతుంది. అంతే కొన్నాళ్ల పాటూ మిగతా విషయాలన్నీ మర్చిపోయి ఇంగ్లీషు మీడియా భావప్రకటనా స్వేచ్ఛ అనే పూనకంతో ఊగిపోతుంది! మరో కొత్త మసాలా ఐటెం దొరకగానే దాని వెంట పడి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ను వదిలేస్తుంది! మోదీ ప్రధాని అయినప్పట్నుంచీ ఇదే తంతూ!   నమో ప్రధాని కావటం చాలా మందికి ఇష్టం లేదన్నది మనకు తెలిసిందే. కాని, ఆయన సామాన్యుల మద్దతుతో పీఎం అయ్యారు. బీజేపి పాలక పక్షం అయింది. ఇది ఎందుకోగాని ఇప్పటికీ కొన్ని సంస్థలు, సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కొందరు మోదీ, కాషాయ వ్యతిరేకులు తమ అసహనంలో భాగంగా ఎంతకైనా తెగిస్తున్నారు. అలాంటి ఒక ఆవేశపూరిత యువతే... గుర్ మెహర్ కౌర్! ఎవరీమే అంటారేమో... ఇంగ్లీషు మీడియాలో ఈమె పేరు మీద నానా రచ్చ జరిగిపోయింది గత కొన్ని రోజుల్లో!   '' మా నాన్నని పాకిస్తాన్ చంపలేదు. యుద్ధం బలితీసుకుంది! '' ఇదీ తనని తాను అమర సైనికుడి కూతురుగా ప్రకటించుకున్న ఇరవై ఏళ్ల గుర్ మెహర్ కౌర్ ఇంటర్నెట్ లో చేసిన వ్యాఖ్య! అసలు కార్గిల్ యుద్ధంలో పాకీల చేతిలో చనిపోయిన ఒక అమరుడి కూతురు మాట్లాడాల్సిన మాటలేనా అవి? కార్గిల్ అమర వీరుల్ని పాకిస్తాన్ కాకుంటే ఎవరు చంపినట్టు? యుద్ధం పాకిస్తాన్ కాక ఇండియా మొదలు పెట్టిందా? పిచ్చెక్కిన మాటలు కాకపోతే గుర్ మెహర్ కౌర్ స్టేట్టెంట్స్ కి అర్థం ఏంటి? చాలా మందికి వచ్చినట్టే పిచ్చి కోపం వీరేంద్ర సెహ్వాగ్ కి కూడా వచ్చింది. కాబట్టే, ఆయన కూడా ఆన్ లైన్లో గుర్ మెహర్ కౌర్ ని ఘాటుగా విమర్శించాడు. '' నేను ట్రిపుల్ సెంచరీ చేయలేదు. నా బ్యాట్ చేసింది '' అంటూ వెటకారం చేశాడు! సెహ్వాగ్ కి సపోర్ట్ గా నిలిచిన బాలీవుడ్ హీరో రణదీప్ హూడా మరింత ప్రచారం కల్పించాడు! అంతే, కొన్ని గంటల్లో పాకిస్తాన్ ను సమర్థించిన గుర్ మెహర్ కౌర్ దారుణంగా ట్రాల్ అయిపోయింది సోషల్ మీడియాలో!   ఇంతకీ, ఒక అమర సైనికుడి కూతురైన గుర్ మెహర్ ఎందుకు రచ్చలోకి దిగింది? ఆ మధ్య ఢిల్లీలోని జేఎన్ యూలో జాతి వ్యతిరేక నినాదాలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఉమర్ ఖలీద్ గుర్తున్నాడా? కన్నయ్యాతో పాటూ దేశ ద్రోహం కేసు ఎదుర్కొన్న ఆయన పార్లమెంట్ పై దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు వీరాభిమాని. ఆయనగార్ని ఢిల్లీలోని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధిపత్యం వున్న మరో కాలేజీకి ఆహ్వానించారు. అక్కడ స్పీచ్ ఇవ్వమని కోరారు. ఇది తెలుసుకున్న ఏబీవీపి సహజంగానే రంగంలోకి దిగి తడాఖా చూపింది. అయితే, బీజేపి అనుబంధ విద్యార్థి సంఘం భౌతిక దాడులు కూడా చేయటం చాలా దారుణం. కాని, అంతే దుర్మార్గం ఉమర్ ఖలీద్ ను సభలు, సమావేశాలకు ఆహ్వానించి ఉపన్యసించమనటం! ఆతను ఇంకా నిర్దోషి అని కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అటువంటి దేశ ద్రోహ కేసులు ఎదుర్కొంటోన్న వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలవటం.... నిజంగా సమంజసం కాదు.   ఉమర్ ఖలీద్ ను మాట్లాడనివ్వకపోటంతో గుర్ మెహర్ కౌర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ బాంబు పేల్చింది. వెంటనే ఎన్డీటీవీ లాంటి మోదీ వ్యతిరేక మీడియా ఆమెను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. ఇరవై ఏళ్ల ఆమె తెలిసో తెలియకో వివాదంలో కాలుపెడితే దాన్ని భూతద్దంలో చూపటమే కాకుండా... పదే పదే అమర సైనికుడి కూతురంటూ కలరింగ్ ఇచ్చేశారు సో కాల్డ్ జర్నలిస్టులు. ఆమె మాట్లాడిన ట్రాష్ కన్నా ఆమె జవాను కూతురన్న విషయమే హైలైట్ అయింది! అందుకే, ఆమె తన తండ్రి పాకిస్తాన్ చంపలేదంటే చాలా మంది కడుపు మండిపోయింది! పైగా ఉమర్ ఖలీద్ లాంటి కేసులు ఎదుర్కొంటోన్న వ్యక్తికి భావప్రకటనా స్వాతంత్ర్యం వుంటుందని చెబుతోన్న గుర్ మెహర్ సెహ్వాగ్, రణదీప్ హూడా లాంటి వారు తన గురించి జోక్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోయింది. వారు సోషల్ మీడియాలో ట్రాల్ చేయటం వల్ల తనకు రేప్, మర్డర్ థ్రెట్స్ వస్తున్నాయని మీడియా ముందుకొచ్చింది. నిజంగా అలాంటివి వస్తే నేరుగా ఆధారాలతో సహా ఢిల్లీ పోలీసుల వద్దకి ప్రొటెక్షన్ కోసం వెళ్లాలి! కాని, అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో వుండే ఢిల్లీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లింది! దీంట్లో మతలబు ఏంటి? ఏమీ లేదు... గుర్ మెహర్ కౌర్ ఆప్ అభిమాని, కార్యకర్త! అసలు ట్విస్ట్ అంతా ఈ ఒక్క రహస్యంలో వుంది!   ఒక సైనికుడు దేశం కోసం అమరుడు అవ్వటం అత్యంత గొప్ప విషయం. కాని, అతని కూతురు ఆ త్యాగన్ని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ ను వెనకేసుకురావటం పరమ దారుణమైన అంశం. మామూలు వారు పాక్ కు అనుకూలంగా మాట్లాడితేనే రియాక్షన్ సీరియస్ గా వుంటుంది. అటువంటిది ఒక అమరుడి వారసురాలు తన ఇష్టానుసారం మాట్లాడితే... ఫలితం రెట్టింపు వుంటుంది. ఆఫ్ట్రాల్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గుర్ మెహర్ కౌర్, ఆమెను సమర్థించే వారికే కాదు... వ్యతిరేకించే వారికి కూడా వుంటుంది కదా!  

ఆ సీఎంకు గాడిదలంటే భయం

గుజరాత్ గాడిదలంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలను ఉద్దేశించే అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎంకు కౌంటర్ ఇచ్చారు ప్రధాని. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.     ఈ సందర్భంగా కాంగ్రెస్-ఎస్పీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాడిదలంటే అఖిలేష్‌కు భయమెందుకని ప్రశ్నించారు.. అయినా తిడితే నన్ను గాని బీజేపీని గాని తిట్టాలి గాని పాపం గాడిదలు ఏం చేశాయన్నారు. గాడిదలు తమ యజమానులకు విధేయంగా ఉంటాయని..మానవాళికి ప్రేరణనిస్తాయన్నారు. వాటికి తిండి పెట్టకపోయినా..ఎన్ని కష్టాలు పెట్టినా యజమాని చెప్పిన పనిని చెప్పినట్లుగా చేసే మనస్తత్వం గాడిదకు ఉంటుందని స్పష్టం చేశారు.     జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్ దీన్ దయాళ్ వంటి మహనీయులు గుజరాత్‌లోనే జన్మించారన్న సంగతిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని..అది తనతో పాటు ఎస్పీని కూడా ముంచేస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. 

వర్మ తరువాత పవన్ ను టార్గెట్ చేసిన మరో దర్శకుడు!

  పవన్ కళ్యాణ్ , ప్రత్యేక హోదా ... ఈ రెండూ ఇప్పుడు జంట పదాలైపోయాయి! పవర్ స్టార్ ఎక్కడికి వెళ్లినా స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తున్నాడు.ఇక పవన్ పోరాటానికి, ఆరాటానికి ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎవ్వరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతా ఆయనకు మద్దతు తెలిపిన వారే. అప్పుడప్పడూ వర్మ వేసే సెటైర్లు తప్ప పవన్ కి ఇంత కాలం వ్యతిరేకత ఎదురు కాలేదు. కాని, తాజాగా ఇండస్ట్రీలోని ఓ సీనియర్ పవర్ స్టార్ పై విమర్శలు గుప్పించారు. మాటలు కాదు పోరాటాలు చేయమంటూ డైరెక్టగానే చురకలు వేశారు!   తమ్మారెడ్డి భరద్వాజా సినిమా పరిశ్రమలో రాజకీయ వ్యాఖ్యలకి ఫేమస్. ఆయన సినీ కార్మికుల బాగోగులు మొదలు రాష్ట్ర, దేశ సమస్యల గురించి స్పష్టంగా స్పందిస్తుంటారు. ఆయనలాగా సూటిగా విమర్శలు చేసే సినిమా సెలబ్రిటీలు అరుదు. కాని, ఈసారి పవన్ ని టార్గెట్ చేసిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో మాటలు సరిపోవని అన్నారు. పవన్ జనవరి 26న వైజాగ్ కు రానేలేదని అన్నారు. సంపూర్ణేష్ బాబు సైతం అక్కడికి వచ్చి అరెస్ట్ అయ్యాడని... కాని, పవన్ మాత్రం యూత్ కు పిలుపునిచ్చి మిన్నకుండిపోయాడని విమర్శించారు.   హోదా సాధ్యం కాదని ఇప్పటికే కేంద్రం మంత్రులు, వెంకయ్య నాయుడు, చంద్రబాబు లాంటి వారంతా చెప్పేశారనీ... అయినా పదే పదే పవన్ హోదా ఎందుకివ్వరని ప్రశ్నించటంలో అర్థం లేదని కూడా తమ్మారెడ్డి అన్నారు. పవన్ ఇప్పటికైనా హోదా కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగాలని ఆయన సూచించారు. అయితే, నిన్న మొన్నటి వరకూ వర్మ ఒక్కడే పవన్ పైన ట్వీట్ లు చేస్తూ విమర్శలు చేసేవాడు. కాని, ఇప్పుడు తమ్మారెడ్డి కూడా తోడవటం పవన్ దృష్టి పెట్టాల్సిన విషయమే. 2019లోపు మరిన్ని గళాలు సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ కు వ్యతిరేకంగా వినిపించవచ్చు!  

కేసీఆర్ మొక్కు చెల్లించారు! డబ్బులెవరు చెల్లించారు?

  భయం వల్లో, భక్తి వల్లో, భయంతో కలిగిన భక్తి వల్లో తెలియదుగాని... తెలుగు మీడియా కేసీఆర్ వెంకన్న కానుకల గురించి మాట్లాడాల్సినంత మాట్లాడటం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 5కోట్ల విలువైన ఆభరణాలు తెలంగాణ ముఖ్యమంత్రి తిరుమలేశుడికి సమర్పించారు. ఇలా సమర్పించటం తప్పు కాదు. అదీ తెలంగాణ రాష్ట్ర సాధన అనే సమున్నతమైన కోరిక తీరినందకు సమర్పించటం మరింత సంతోషకరం! కాని, బంగారం, వజ్రాలు, ఆభరణాల తయారీ ... వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి? అసలు ఈ ప్రశ్న వేసే ధైర్యం కూడా తెలుగు మీడియాలో ఎవ్వరూ చేయలేదు. ఇంగ్లీష్ లో మాత్రం కొన్ని వెబ్ సైట్స్ కేసీఆర్ కానుకల సమర్పణ గురించి నర్మగర్భంగా విమర్శలు చేశాయి. ప్రజా ధనంతో ముఖ్యమంత్రి మొక్కులు చెల్లించుకోవచ్చా... అన్నాయి!   అసలు విషయం ఏంటంటే, 5 కోట్లు విలువైన స్వామి వారి కానుకలు తెలంగాణ ఎండౌమెంట్స్ డిపార్ట్ మెంట్ వారి సొమ్ముతో చేయించారని చెబుతున్నారు. అదే నిజమైతే వివిధ ఆలయాల్లో వసూలైన ఆ సొమ్ము వాడాల్సింది తెలంగాణ ఆలయాలకి. మరీ ముఖ్యంగా, ధూప, దీప, నైవేద్యాలు కూడా లేని గుళ్లకి ఖర్చు చేయాలి. కాని, ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలోని తిరుమల వంటి మహా సంపన్నమైన క్షేత్రంలో కానుకలు సమర్పించటం తప్పంటున్నారు కొందరు. అంతే కాక సెక్యులర్ దేశం అని చెప్పుకునే మన వ్యవస్థలో అసలు స్వయంగా సీఎం ప్రజా ధనంతో మొక్కులు చెల్లించటం ఏంటని కూడా అంటున్నారు! కేసీఆర్ కోనేటిరాయుడికి కోట్ల రూపాయల విలువైన కానుకలు సమర్పించటం తప్పా ఒప్పా పక్కన పెడితే ... ఆయన చేసిన నిర్ణయం ప్రజల్లో మాత్రం పెద్దగా వ్యతిరేకత పుట్టించలేదు.   అది జరగనంత వరకూ రాజకీయ నాయకులకి వచ్చిన నష్టమేం లేదు. కాని ఇప్పటికైనా తక్షణం రావాల్సిన మార్పు ఏంటంటే... వేలాది ఆలయాలు కనీస ఆలనా, పాలనా లేకుండా వుండిపోతున్నాయి. దేవాలయాల ఉద్యోగులు పూట గడవటం కష్టంగా జీవితాలు నెట్టుకొస్తున్నారు. పురాతన ,చారిత్రక ఆలయ సంపద శిథిలం అయిపోతోంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎండౌమెంట్ సొమ్ము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్ఛానుసారం ఖర్చు చేస్తున్నాయి. వీఐపీల స్వాగత, సత్కారాలు మొదలు హజ్ సబ్సిడీ వరకూ ఎన్నో విధాలుగా దేవాదాయ శాఖ ఆదాయం వృథా అవుతోంది. అటు వక్ఫ్ బోర్డ్ ఆస్తులు, ఆదాయాలు కూడా చాలా చోట్ల అక్రమ మార్గాల్లో జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. మత సంస్థలపై సెక్యులర్ ప్రభుత్వాల పెత్తనం ఎంత తగ్గితే అంత మేలు...

కోదండరామ్‌ని కేసీఆర్ లైట్ తీసుకున్నారా?

  తెలంగాణ జేఏసీ... ఒకప్పుడు ఈ పేరు చెప్పగానే ముఖ్యమంత్రి నుంచీ డీజీపీ దాకా అందరూ అలెర్ట్ అయ్యేవారు. ఉద్యమ సమయంలో జేఏసీ కలకలం అంతా ఇంతా కాదు. ప్రత్యేక తెలంగాణ సాధనలో తెలంగాణ జాక్ పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. సమైక్యాంధ్ర వున్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కోదండరామ్ నేతృత్వంలోని ఐకాస! మరి ఇప్పుడు?   బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమ మూల కారణాల్లో ఒకటైన నిరుద్యోగ సమస్యను పట్టించుకోవటం లేదని జేఏసీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రిని ఎదుర్కోవటం ప్రతిపక్ష నేతలకే సవాల్ గా మారిన తరుణంలో కోదండరామ్ కొదమ సింహంలా బరిలోకి దూకారు. సమైక్య పాలకులపై ప్రయోగించిన ప్రజా ఉద్యమాల అస్త్రమే స్వంత సీఎం పై కూడా ప్రయోగించారు. ఒకప్పుడు కుతకుత ఉడికిపోయిన ఉస్మానియాను మరోసారి వేడెక్కించి విద్యార్థుల్ని వీధుల్లోకి తీసుకొచ్చారు. ఉద్యోగాలు కావాలంటూ ధర్నాలకు పిలుపునిచ్చారు. కాని, ఉద్యమ సమయంలో ఇదే కోదండరామ్ తో భుజం భుజం కలిపిన కేసీఆర్ ఇప్పుడు ఆయన్ని అసలు పట్టించుకుంటున్నారా? పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సీఎం లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది...   బంగారు తెలంగాణ సాధన ఎంత వరకూ వచ్చిందో మనకు తెలియదుగాని... కేసీఆర్ మాత్రం కోదండరామ్ అండ్ కో పిలుపునిచ్చిన నిరసనల్ని పట్టించుకోకుండా బంగారు కానుకలు తీసుకుని తిరుమల వెళ్లిపోయారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే మొక్కలు చెల్లిస్తానని ఆయన గతంలోనే మొక్కారు. అదే ఉద్ధేశంతో తొలి సారి తిరుమల వెళ్లారు. ఘన స్వాగతం లబించింది.కాని, విచిత్రంగా తెలంగాణ సాధనకు సహకరించిన పోరాట యోధులు మాత్రం మొక్కులు చెల్లిస్తున్న వేళ మళ్లీ రోడ్లపైనే వున్నారు. ఉద్యోగాలు కావాలంటూ ఉద్యమాలు మొదలు పెట్టారు!   తెలంగాణ రాక ముందు తిరుపతిలో చాలా సార్లు కేసీఆర్ కి వ్యతిరేకంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు అక్కడ ఘన స్వాగతాలు లభించాయి. కాని, కట్టలు తెంచుకున్న మద్దతు లభించిన ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ వ్యతిరేక నినాదాలు మిన్నుముట్టాయి! కాని, స్వరాష్ట్రంలో జరుగుతోన్న గొడవనంతా రావుగారు లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది! చూడాలి మరి... ముందు ముందు కోదండరామ్ కోపానికి గులాబీ వాడిపోతుందా... లేక తనకు కానుకలు సమర్పించిన కేసీఆర్ పక్షానే వెంకన్న నిలుస్తాడా?