విషవృక్షం కొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్
posted on Apr 18, 2011 @ 3:47PM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహా విషవృక్షమని.. దానికి పుట్టిన కొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంన్నాయుడు ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతిమయమైనవిగా ఆయన అభివర్ణించారు. ఈ అవినీతి పార్టీలను భూస్థాపితం చేసేందుకు ఓటర్లు సిద్ధం కావాలని ఆయన పిలువునిచ్చారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పదవిని అడ్డుపెట్టుకుని వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గజ దొంగలా దోచుకున్నాడన్నారు. 18 నెలలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వైఎస్.జగన్ ఒక్కరోజైనా పార్లమెంట్లో జిల్లా ప్రజల సమస్యల గురించి లేవనెత్తారా అని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవచేయాలని వైఎస్.జగన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారని ఎర్రం గుర్తు చేశారు. అయితే, తన స్వార్థపు అవసరాల కోసం పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నిలకు కారకుడయ్యాడన్నారు. కడప, పులివెందుల ప్రాంతానికి అన్యాయం ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత పులివెందుల్లో రిగ్గింగ్ ఆరంభమైందన్నారు.