కేసీఆర్ సవాలుకి మోడీ లొంగుతారా?
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ తెరాస ఇచ్చిన తెలంగాణా బంద్ పిలుపుకు ఊహించినట్లే మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు డిపోల నుండి బయటకు రాలేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ స్వయంగా బందుకు పిలుపీయడంతో ప్రభుత్వోద్యోగులు కూడా విధులను బహిష్కరించి బందులో పాల్గొంటున్నారు. తెరాస కార్యకర్తలు మళ్ళీ జెండాలు పట్టుకొని రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అందువల్ల తెలంగాణా దాదాపు స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న ఒక వ్యక్తి, అధికార పార్టీ స్వయంగా బందులకు పిలుపీయడం, వ్యాపార సంస్థలకు, పారిశ్రామిక వేత్తలకు ఏ విధమయిన సంకేతాలు పంపుతుందనే ప్రశ్నకు, మాటల మాంత్రికులయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా ధీటయిన సమాధానమే చెప్పవచ్చును. కానీ, కేసీఆర్ ఈ విధంగా బంద్ కు పిలుపివ్వడం ద్వారా, కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీకి కూడా సవాలు విసిరినట్లయింది.
మోడీ ప్రభుత్వం తీసుకొన్న మొట్ట మొదటి నిర్ణయాన్నే కేసీఆర్ ఈవిధంగా బహిరంగంగా సవాలు చేస్తుంటే, ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ కూడా వెనక్కి తగ్గకపోవచ్చును. ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయితే, మోడీ ప్రభుత్వం తెలంగాణాపట్ల సవతిప్రేమ చూపించే అవకాశం ఉంది. పోలవరం ముంపు గ్రామాల గురించి యూపీఏ హయంలో నోరు మెదపని కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను ఆమోదించిన తరువాత వ్యతిరేఖించడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బందులకు పిలుపీయడం, ప్రభుత్వోద్యోగులను అందులో పాల్గొనమని ప్రోత్సహించడం, ఇరుగు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో, చివరికి ప్రధానమంత్రితో, కేంద్రప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వడంవల్ల తెలంగాణాకు ప్రతికూలాంశాలుగా మారే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే ప్రాధాన్యం ఇవ్వడం మేలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.