ధోని కూతురితో సెల్ఫీ.. డిస్టర్బ్ చేయొద్దంటున్న కోహ్లీ..

టీమిండియా  స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఆయన పోస్ట్ చేసిన ఫోటో మాత్రం అందరికి తెగ నచ్చేసింది. ఇంతకీ ఏం ఫోటో అంటున్నారా..? మన కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతరు జివాతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఫొటో పోస్ట్ చేస్తూ.. ధోని కూతురు చాలా క్యూట్ గా ఉందని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ సెల్ఫీలో జివా చూడ ముచ్చటగా మాట్లాడుతుంటే, చిన్నారిని డిస్టర్బ్ చేయొద్దన్న ఎక్స్‌ప్రెషన్‌ను విరాట్ కోహ్లీ ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అద్భుతమైన ఆట కనబరిచిన విరాట్ కోహ్లీ నెంబర్‌ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.  

అనుష్క శర్మ లవ్లీ గార్ల్.. సిగ్గుచేటంటున్న కోహ్లీ..

  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు ఉంది ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మ పరిస్థితి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట సరిగా ఆడినా.. ఆడకపోయినా విమర్శలు మాత్రం తనకే వస్తున్నాయి. అసలు సంగతేంటంటే.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన తీరుపై పలువురు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అతనిపై ప్రశంసలు సంగతేమోకానీ అనుష్క శర్మ పై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు విసురుతున్నారు. కోహ్లీ అనుష్కకు దూరమైన తర్వాతే అతడి ఆటతీరు మెరుగుపడిందంటూ పలువురు పోస్ట్‌లు చేశారు. దీనిపై విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుష్కపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించాడు.   ఇక ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా రంగంలోకి దిగి అనుష్క శర్మకు మద్దతు తెలిపారు. కోహ్లీ, అనుష్కల మధ్య సంబంధం గురించి తనకు పెద్దగా తెలియదని, అయితే అనుష్క మాత్రం లవ్లీ గర్ల్ అని చెప్పారు. అంతేకాదు వారిద్దరూ చూడ్డానికి బాగుంటారని.. కోహ్లీ క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎదగడంలో ఆమె అతడిపై సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. మరి దీనిపై విమర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

వైసీపీకి జ్యోతుల రాజీనామా.. మరి పయనమెటో..?

  వైసీపీ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుండి ఎనిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా..ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఎప్పటినుండో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జ్యోతుల నెహ్రూ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్ పంపిచినట్టు తెలుస్తోంది. కాగా జగన్ ను ఉద్దేశించి.. మీ మనసుకు నచ్చినట్లు నడుచుకోలేకపోతున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు నెహ్రూ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావాలని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసిన నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ రాకపోవడంతో అప్పుడే ఆయన జగన్ కు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు అనుమానాలు కలిగాయి. అనుకున్నట్టుగానే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మరి పార్టీకి రాజీనామా చేసిన జ్యోతుల పయనమెటో చూడాలి.

తలాక్ కు చెక్ పెట్టే ప్రయత్నంలో సుప్రీంకోర్టు..

  ఒక్కో మతానికి ఒక్కో రకమైన కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. అయితే  వాటివల్ల లాభం జరగకపోయినా పర్వాలేదు కాని.. నష్టం జరుగుతుంటే మాత్రం ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ముస్లింల విషయంలో అదే ఆలోచనలో ఉంది. ముస్లింలలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. అది ఏంటంటే.. వాళ్లు తలాక్ అని మూడుసార్లు అంటే చాలు ఆ భార్య భర్తలకి విడాకులు మంజూరైనట్లే. అయితే దీనిపై గతం నుండే ముస్లిం స్త్రీల నుండి వ్యతిరేకత ఉంది. తలాక్ అనే ఒక్క పదం వల్ల ముస్లిం మహిళలు చాలా నష్టపోతున్నారని..  మహిళలను చరాస్థులుగా భావించే వారి ఆటలకు ఈ తలాక్ మరింత ఊపునిస్తుందని మహిళా సంఘాలు ఎప్పటినుండో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ముస్లిం మహిళ తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు.. అసలు తలాక్ విడాకుల విధానానికి చట్టబద్దత ఉందోలేదో విచారించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. దేశంలోని ముస్లిం, ముస్లిమేతర మేధావుల అభిప్రాయాలు, మత పెద్దలు, ముస్లిం మహిళళ సూచనలు, సలహాలు తీసుకోవాలని భావిస్తోంది.

2019 నాటికి పోలవరం పూర్తి చేస్తాం.. జగన్ కు అవగాహన లేదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరంపై అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2019 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేశాం అలాగే ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న సమయానికే పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి.. రాష్ట్రంలో కరువును సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు తరలించామని తెలిపారు. నదుల అనుసంధానంపై చాలా మంది విమర్శించారని అయినప్పటికీ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. కృష్ణా డెల్టా అవసరాలు తీరాక మిగిలిన నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు తరలిస్తామని పేర్కొన్నారు.   ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతకు ప్రాజెక్టులపై అవగాహన లేదు.. గోదావరి నుండి జూన్ నాటికి 8,500 క్యూసెక్కుల నీటిని తీసుకువస్తాం.. సముద్రంలోకి పోయే నీటిని కృష్ణకు తీసుకొస్తున్నాం .. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా నష్టపోయామని అన్నారు.

ఈజిప్ట్ విమానం హైజాక్.. భార్య వదిలేసిందనా..?

కొంత మంది కొన్నిసార్లు చేసే పనులు చాలా విచిత్రంగా అనిపిస్త్తాయి. అంతేకాదు వాళ్లు చేసే పనులు వాళ్లకి తప్పుగా అనిపించకపోయినా.. పక్కని వాళ్లని మాత్రం భయాందోళనకు గురిచేస్తుంటాయి. అలాంటిదే ఈరోజు జరిగిన ఘటన. ఈజిప్ట్ లో ఈజిప్షియన్ ఎయిర్‌ విమానాన్ని దుండగులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఉగ్రవాదుల పనే అని అందరూ అనుకుంటుండగా.. అది వారి పని కాదని తెలసింది. అయితే అసలు హైజాక్ చేసింది ఎవరని తెలిస్తే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే. అసలు సంగతేంటంటే.. అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి విమానాన్ని హైజాక్ చేశాడు. అయితే అతడిని తన భార్య వదిలేసింది. దీంతో అతను.. తన భార్యను చూపించాలని డిమాండ్ చేస్తూ హైజాక్ చేశాడు. దీంతో అసలు కథ బయటపడింది. ఈ హైజాకింగ్ కి ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది.   కాగా హైజాక్ అయిన విమానాన్ని సైప్రస్‌లోని లార్నాక విమానాశ్రయంలో దించారు. హైజాకర్ తో చర్చించిన తరువాత అతను అందరిని వదిలిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

చంద్రబాబును కలవాల్సిన అవసరం లేదు.. భూమా

  కర్నూలు జిల్లాలో శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు తులసి రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈదాడి భూమా వర్గీయులు చేశారని శిల్పా మోహన్ రెడ్డి అనుచరలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. మరోవైపు భూమా మాత్రం తనకు ఈదాడికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. తులసిరెడ్డి పంచాయితీలు చేస్తుంటారు.. ఆయనపై దాడికి గ్రామ కక్ష్యలే కారణం కావచ్చని చెప్పారు. ఇక ఈ విషయంపై నేను చంద్రబాబును కలవను.. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కలవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చడానికి టీడీపీలోకి చేరాను.. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది.. అందుకే పార్టీలోని అందరితో కలిసిపోయేందుకే ప్రయత్నిస్తున్నా.. అంతేకాని గొడవలకు రాలేదు అని అన్నారు. శిల్పా తన మనస్సాక్షిని పరిశీలించుకోవాలన్నారు.

హైవేల మీద చెట్లు నాటేందుకు వెయ్యి కోట్లు

  ఇక మీదట జాతీయ రహదారుల మీద ఎంత వేగంగా ప్రయాణించినా అలసట తెలియకపోవచ్చు. కారణం! త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో పదివేల కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను నాటించనుంది కేంద్రం. ఈ పనిని 200 స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పనుందట. అంతేకాదు, చెట్లని నాటించే కార్యక్రమం సక్రమంగా అమలవుతోందా లేదా అని పర్యవేక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన కొందరు అధికారులను కూడా నియమించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం క్రితం ఏడు ప్రతిపాదించిన హరిత విధానం ప్రకారం ఈ నిధులను వెచ్చించనున్నారు.   ఈ హరిత విధానం ప్రకారం జాతీయ రహదారులను నిర్మించేటప్పుడు, అందులో 1 శాతం ఖర్చుని రహదారులకు ఇరుప్రక్కలా చెట్లను నాటించేందుకు కేటాయించాలి. సామాన్యంగా ప్రభుత్వం ఇలా చెట్లని నాటి వెళ్లగానే అవి అలా వడిలిపోతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా చెట్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు ‘ఆడిట్’ చేయించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ భారీ పథకంలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, అటవీ శాఖ అధికారులు... ఇలా పలువురి సహాయాన్ని తీసుకోనుంది ప్రభుత్వం.

టీడీపీ పై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. 20 కోట్లు ఇస్తామన్నారు

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలోకి చేరిన సంగతి తెలసిందే. దీనిపై వైసీపీ పార్టీ నేతలు టీడీపీ పై దుమ్మెత్తిపోశారు కూడా. అయితే ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. పార్టీ మారితే రూ. 20 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. దానికి ఆమె ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను అంతేకానీ డబ్బుకోసం కాదు.. డబ్బుకు లొంగే మనిషిని కాదని చెప్పానని ఆమె అన్నారు. అంతేకాదు జగన్ మోహన్ రెడ్డి వల్లే నేను ఎమ్మెల్యేను అయ్యాను.. జగనన్న తోడు ఉంటాను.. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారే ప్రసక్తే లేదు అని ఆమె అన్నారు. నేను పార్టీ మారతానంటూ కొన్ని పత్రికలు, వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తనను అడగకుండా ఎలా రాస్తారని ఆమె ప్రశ్నించారు.

ఈజిప్ట్ విమానం హైజాక్.. హైజాకర్ల నుంచి ఆఫర్

ఈజిప్ట్ విమానం హైజాక్ కు గురైంది. అలెగ్జాండ్రియా నుంచి కైరో వ‌స్తున్న ఈజిప్టు ఎయిర్ ప్లైట్ 181 విమానాన్ని దుండ‌గులు హైజాక్ చేశారు. విమానంలో 90మంది ప్ర‌యాణికులు ఉండగా ఎక్కువ మంది ఈజిప్ట్ వాసులేనని తెలుస్తోంది. దీంతో సిప్రస్ విమానాశ్రయాన్ని సాయుధులైన భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఇదిలా ఉంటే, విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యమంతా వెనక్కు వెళ్లితే, మహిళలు, పిల్లలను విడిచిపెడతామని హైజాకర్ల నుంచి ఆఫర్ రావడంతో చుట్టుముట్టిన భద్రతా దళాలు వెనక్కు మళ్లాయని.. అనంతరం మహిళలు, చిన్నారులను వదిలేశారు యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఆండ్రువోలా వసిలియోవ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

రెండు రాష్ట్రాలు రెండు కళ్లు.. పాదాభివందనం చేస్తున్నా.. చంద్రబాబు

  నేడు టీడీపీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంకా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివంగత ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లని, ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ తాను కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని పార్టీ నిలబడిందంటే, అందుకు కార్యకర్తల కృషే కారణమని అన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.   ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసమే తెలుగు దేశం పార్టీ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. విభజన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తుంటే ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

రోజా గారు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా లాగేశారు..

వైసీపీ ఎమ్మెల్యే రోజా అప్పుడప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వివాదాల్లోకి లాగుతుంటారు. అది తెలిసిన విషయమే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ టీడీపీపై దుమ్మెత్తిపోశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో తూట్లు పొడిచిందన్నారు. ఎన్టీఆర్ పేరుతో తెచ్చిన పథకాలను సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. అంతేకాదు ఎన్టీఆర్ వారసులను ఎన్నికల సమయంలో కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని వదిలేస్తున్నారని.. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అడ్డుపడుతున్నారన్నారని అన్నారు.   కాగా ఎమ్మెల్యే రోజా సస్పెండ్ పై హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లగా ఆమెకు అక్కడ చుక్కెదురైంది. అంతేకాదు స్పీకర్ సస్పెన్షన్ పై డివిజన్ బెంచ్‌ మద్దతు కూడా పలికింది. దీంతో ఆమె తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వచ్చే శుక్రవారంపై ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. విప్ జారీ చేసినా అసెంబ్లీకి డుమ్మా..

  వైఎస్ జగన్ వేసిన ఎత్తు ఈసారి కూడా పారేలా కనిపించడంలేదు. ఇప్పటి వరకూ రెండుసార్లు తప్పించుకున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను.. మూడోసారి ఎలాగైనా అసెంబ్లీకి రప్పించాలని జగన్ చూశారు. దీనిలో భాగంగానే.. ఎమ్మెల్యేల‌ను ఇరుకున పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ మంగళ, బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పార్టీ సభ్యులకు విప్‌ జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరుకావాలని.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ అంతగా హెచ్చరించినా కూడా పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి రాలేదు.. సరికదా వారితో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు కూడా హాజరుకాలేదు. మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

అసదుద్దీన్‌ నోటి వెంట... హిందుస్తాన్ జిందాబాద్‌!

  పీక మీద కత్తి పెట్టినా, తనతో భారత్‌మాతాకీ జై అన్న నినాదాన్ని పలికించలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ మెత్తబడ్డట్లే కనిపించారు. తన మాటలకు సాటి ముస్లిం మేధావుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఇప్పుడు కాస్త రూటు మార్చారు. నిన్న లక్నోలో జరిగిన ఓ సమావేశంలో ‘హిందుస్తాన్‌ జిందాబాద్‌’, ‘జైహింద్‌’ అంటూ దేశభక్తి నినాదాలు చేశారు. పైగా తాము దేశభక్తులమంటూ ఎవరి సర్టిఫికెట్టూ అవసరం లేదని, 1857 మొదల్కొని స్వాతంత్ర్యం వరకూ దేశం కోసం ప్రాణాలర్పించిన వర్గం తమదనీ చెప్పుకొచ్చారు.   తమ రక్తంతో ఈ దేశాన్ని పెంచిపోషించామని పేర్కొన్నారు. పనిలో పనిగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీని కూడా దుయ్యపట్టారు అసదుద్దీన్‌. రాష్ట్రంలో ముస్లింలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారనీ, ప్రభుత్వం ఏనాడూ వారి బాగోగులను పట్టించుకోలేదని విమర్శించారు. 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసదుద్దీన్‌ తన మజ్లిస్ పార్టీని అక్కడ బలపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దళితులను, ముస్లింలను కలుపుకొని పోవాలని చూస్తున్నారు. మరి అసదుద్దీన్‌ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో!

హెచ్‌సీయూ విధ్యార్ధులకు బెయిల్ మంజూరు.. వీసీని తొలగించాలి

  హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ వీసీ అప్పారావు యూనివర్శిటీకి రావడంతో విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీసీ అప్పారావు ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు విద్యార్ధులపై లాఠీచార్జీ చేసి 27మంది విద్యార్ధులను అరెస్ట్ చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు అరెస్టయిన విద్యార్ధులకు రంగారెడ్డి జిల్లా 27వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వరూధిని బెయిల్ మంజూరు చేశారు. రూ. 5వేల రూపాయలు పూచీకత్తు విధించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. వీసీ అప్పారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ అప్పారావును వెంటనే వైస్ చాన్సలర్ పదవి నుంచి తొలగించాలని, అంతేకాదు  క్యాంపస్‌లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై నిజానిజాలను తేల్చేందుకు, విద్యార్థుల డిమాండ్లను పరిశీలించేందుకు వర్సిటీ రిజిస్ట్రార్ ఏడుగురు ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు.

ఫలించిన హర్యానా జాట్ల ఉద్యమం.. జాట్ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం..

  తమకు రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్లు గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో హింసాత్మక ఘటనలకు కూడా పాల్పడ్డారు. అంతేకాదు వచ్చే నెల అంటే ఏప్రిల్ 3 తేదీలోగా జాట్ కోటాపై చట్టం చేయకుంటే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు కూడా. దీంతో ఇప్పుడు ఎట్టకేలకు హర్యానా ప్రభుత్వం జాట్ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్  అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31 తేదీన బడ్జెట్ సమావేశాలు ముగిసే లోగానే జాట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని.. జాట్‌లతోపాటు మరో నాలుగుకులాలు.. జాట్ సిక్కు, బిష్ణోయి, రోర్లు, త్యాగి కులాలను బీసీల్లో చేర్చి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో 6 నుంచి 10 శాతం ఆరుశాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పఠాన్‌కోట్‌కు పాకిస్థాన్‌ జిట్ బృందం

  పంజాబ్ పఠాన్‌కోట్ విమానస్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ దాడికి సంబంధించి విచారణ నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన జిట్ బృంద సభ్యులు పఠాన్ కోట్  రానున్నారు. ఇప్పటికే ఈ బృందం అమృత్‌సర్‌కు చేరుకోగా అక్కడినుండి బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనంలో పఠాన్‌కోట్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎయిర్‌బేస్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఆ దాడుల్లో పాక్ ఉగ్రవాదుల పాత్ర ఉందని భారత్ ఆ దేశానికి ఆధారాలను సమర్పించగా.. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.