లోక్‌సభలో ఏ పార్టీకి మెజారిటీ రాదు: ప్రియాంక

      నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ వస్తుందని డాంబికాలు పలికిన ప్రియాంకా గాంధీకి హఠాత్తుగా జ్ఞానోదయం కలిగినట్టుంది. అందుకే తన తమ్ముడి నియోజకవర్గం అమేథి సాక్షిగా మనసులోని మాటను బయటపెట్టారు. ఈ ఎన్నికలలో కేంద్రంలో ఏ పార్టీకీ అధికారం రాదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్‌కి మెజారిటీ రాదన్న విషయం ఏనాడో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయం ప్రియాంకకి కొత్తగా అర్థమైనట్టుంది. అయితే ప్రియాంక వ్యాఖ్య వెనుక అసలు ఉద్దేశం మరోటి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. దీనిని తట్టుకోలేని ప్రియాంక కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి కూడా పూర్తి మెజారిటీ రాదని చెప్పడం కోసమే ఇలా వ్యాఖ్యానించి వుంటారని పరిశీలకులు అంటున్నారు.

నన్ను చంపాలనుకున్నోళ్ళే చచ్చారు: పాల్

      ఎప్పుడూ కామెడీ స్టేట్‌మెంట్లు ఇచ్చే మత ప్రచారకుడు కేఏ పాల్ తాజాగా చాలా సీరియస్‌గా మాట్లాడాడు. తనను గతంలో చాలామంది చంపాలని అనుకున్నారని, తనను చంపాలని అనుకున్నవాళ్ళే చచ్చారని కేఏ పాల్ చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ విన్నాక, పాల్‌ని చంపాలనుకున్నవాళ్ళు.. ఆ తర్వాత చచ్చిపోయినవాళ్ళు ఎవరబ్బా అనే ఆలోచన రాష్ట్రంలో మొదలైంది. చాలామంది మనసులలో ఒక పేరు స్ఫురించినప్పటికీ, పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులూ అనే పాట గుర్తొచ్చి సైలెంట్‌గా వుండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకూ స్ఫురించింది కదూ.. అయితే మనసులోనే పెట్టేసుకోండి. అన్నట్టు కేఏ పాల్‌కి వైసీపీ అధినేత జగన్ మీద పీకలదాకా కోపం వున్నట్టుంది. జగన్ పేరు చెబితేనే పాల్ పాలు మరిగినట్టు మరిగిపోతున్నాడు. జగన్ ఈ ఎన్నికలలో పొరపాటున కూడా గెలవడని ప్రార్థనల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు. ఒకప్పుడు బిజీ మత ప్రచారకుడిగా వున్న కేఏ పాల్‌ని అణగదొక్కేసి, బ్రదర్ అనిల్‌కుమార్ని మత ప్రచారకుడిగా పైకి తేవడానికి కుట్ర జరిగిందన్న అభిప్రాయాలు జనంలో వున్నాయి. ఈ కుట్రలో భాగంగానే కేఏ పాల్ మీద ఏవేవో కేసులు పెట్టి జైల్లో వేయించారన్న అభిప్రాయలు కూడా వున్నాయి. అందుకే కేఏ పాల్ ఇప్పుడు జగన్ మీద విరుచుకుపడుతున్నాడు.

రాష్ట్ర విభజనపై స్టే‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

      రాష్ట్ర విభజన విషయంలో సుప్రీంకోర్టు మీద ఆశలు పెట్టుకున్న సీమాంధ్రులకు తీవ్ర నిరాశ కలిగింది. రాష్ట్ర విభజన మీద సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల మీద సుప్రీం కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర విభజన మీద సుప్రీం కోర్టు స్టే విధించే అవకాశం వుందన్న ఊహాగానాలకు సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర విభజన మీద ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను ఆగస్టు 20వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జూన్ 2న వున్న అపాయింటెడ్ డేని రద్దు చేయాలని పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, సీమాంధ్ర ఎంపీలను గెంటివేసి, పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని విభజించారని అంటూ ఈ కేసును వాదిస్తున్న లాయర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పట్టించుకోలేదు.

జగన్ పార్టీ మందు, డబ్బు బోగస్సే..

      జగన్ పార్టీ సీమాంధ్రలో గెలిచి తీరాలనే ఉద్దేశంతో డబ్బు, మద్యం కుమ్మరిస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా చెల్లని నోట్లని, కల్తీ మద్యాన్ని కూడా పంచేస్తోంది. జగన్ పార్టీ నుంచి డబ్బు తీసుకున్న చాలామంది అవి చెల్లని నోట్లని తెలుసుకుని లబోదిబో అంటున్నారు. కొంతమంది అయితే తాము డబ్బు తీసుకోవడం పెద్ద తప్పు అనే విషయాన్ని మరచిపోయి, తమకు జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇచ్చిందంటూ పోలీస్ స్టేషన్లని కూడా ఆశ్చయించిన సందర్భాలు వున్నాయి. జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇస్తే ఇచ్చింది. వాటివల్ల పెద్ద ప్రమాదం లేదు. కల్తీ మద్యం సరఫరా చేస్తోంది. అదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు జగన్ పార్టీ నాయకులు పోయించిన కల్తీ మద్యం కారణంగా ఇప్పటికే సీమాంధ్రలో ముగ్గురు చనిపోయారు. ఎన్నికల లోపు ఎంతమంది చనిపోతారో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

‘పవన్ కళ్యాణ్ హఠావో’ పుస్తకం వెనుక వున్నదెవరు?

      పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టిన వెంటనే చేసిన నినాదం ‘కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో’. ఈ నినాదం ఆయన్ని మోడీకి చేరువ చేసింది. తెలుగుదేశం పార్టీకి చేరువ చేసింది. ఈ నినాదాన్ని పవన్ కళ్యాణ్ రకరకాలుగా మారుస్తూ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్‌ని పవన్ కళ్యాణ్ మీదే రాజకీయ ప్రత్యర్థులు ప్రయోగించారు. ‘పవన్ హఠావో.. సీమాంధ్ర బచావో’ అనే పుస్తకం ఒకటి విడుదల చేశారు. ఆ పుస్తకం కూడా ఎవరో దారిన పోయే దానయ్య రాయలేదు.. పవన్ కళ్యాణ్ అభిమానే రాశాడట. ఈ పుస్తకం వెనుక జగన్ పార్టీయే వుండొచ్చన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సీమాంధ్రలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ జగన్ మీద విమర్శులు గుప్పిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే సీమాంధ్ర సర్వనాశనం కావడం ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు. అందుకే ఆయనను డ్యామేజ్ చేయడానికే ఓ ‘అభిమాని’ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా పుస్తకం రాయించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబుకి జైరాం రమేష్ ప్రచారం?

      కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజన సూత్రధారి జైరాం రమేష్ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచారం చేయడమేంటి? ఆశ్చర్యంగా వుంది కదూ? ఇది పాక్షికంగా నిజం. అదెలాగంటే, ప్రస్తుతం సీమాంధ్రలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు, మరొకరు వైసీపీ నేత జగన్.   ఈ ఎన్నికల తర్వాత జగన్ సీఎం కావడం కాదు.. చంచల్‌గూడాలో పర్మినెంట్‌గా సెటిల్ కావడం ఖాయమని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమైపోతోంది.  అందువల్ల ఈసారి చంద్రబాబుకే ముఖ్యమంత్రి పట్టం కట్టాలని సీమాంధ్ర ప్రజలు డిసైడ్ అయ్యారు. జగన్‌ పార్టీకి ఓటు వేయొద్దని కనిపించినవాళ్ళందరికీ చెబుతున్నారు. ఇప్పుడు జైరాం రమేష్ కూడా చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. జైల్లో వుండి బయటకి వచ్చిన జగన్‌కి ఓటేయొద్దు అని గత వారం పదిరోజులుగా అయన అనేకసార్లు చెబుతూ వస్తున్నారు. జగన్‌కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఆయన చెబుతున్నారు తప్ప.. కాంగ్రెస్‌లో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత వుందో ఆయన చెప్పలేకపోతున్నారు. జైరాం రమేష్ తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారోగానీ ఆయన  పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

మా అల్లుడు వెరీగుడ్డు: సూపర్‌స్టార్ కృష్ణ

      అల్లుడు గారు ఎన్నికలలో పోటీ చేస్తుంటే మామగారు అల్లుడి గెలుపు కోరుకోవడం మామూలే. మన సూపర్‌స్టార్ కృష్ణ కూడా తన మామగారి మనసును బయటపెట్టారు. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. చాలా మంచోడు, నలుగురికీ ఉపయోగపడేవాడైన మా అల్లుడికి ఓటేసి గెలిపించండి అని మామగారి హోదాలో కృష్ణ ఓటర్లను రిక్వెస్ట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్‌ను గెలిపించాలని కృష్ణ తన అభిమానులను, గుంటూరు లోక్‌సభ ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలో ఓ మంచి పారిశ్రామికవేత్తగా జయదేవ్ ఎంతో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అమర్‌రాజా గ్రూపు అధినేతగా పరిశ్రమలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని సూపర్‌స్టార్ కృష్ణ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలో రైలు ప్రమాదం: 21మంది మృతి

      మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో దివా-సావంత్‌వాడి పాసింజర్ రైలు ఇంజన్‌సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో 21మంది ప్రయాణికులు మరణించగా, 145 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు నాగోధానే, రోహాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి 10వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సునీల్ తత్కరే ఆదివారం సాయంత్రం ప్రమాదస్థలి వద్దకు చేరుకుని సహాయచర్యలను సమీక్షించారు. Maharashtra Train Accident Photos

పవన్ కళ్యాణ్ తో షర్మిల ఢీ..!

  పవన్ కళ్యాణ్ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలతో ఊక్కిరిబిక్కిరి అవుతున్న వైకాపాను ఆదుకోవడానికి మళ్ళీ షర్మిలే ముందుకు వచ్చారు. ఆమె కూడా పవన్ కళ్యాణ్ కు అంతే ధీటుగా బదులిస్తూ, ఆయన ఆలోచనలకి,మాటలకి, చేతలకి ఎక్కడా పొంతన ఉండదని విమర్శించారు. పార్టీ పెట్టినప్పుడు మీకు నచ్చిన వారికే ఓట్లు వేసుకోమని ప్రజలకు ప్రభోదించిన ఆయన, ఆ తరువాత మోడీకి, ఇప్పుడు చంద్రబాబుకి ఓట్లు వేయమని అడగడమే అందుకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుని తీవ్రంగా వ్యతితిరేఖించిన ఆయన ఈసారి ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేయమని ఏ మొహం పెట్టుకొని ప్రజలను అడుగుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక పిచ్చివాడిలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ, ఊగిపోతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, అటువంటి పిచ్చోడు చెప్పిన మాటలు విని, ఆయన చెప్పిన అభ్యర్ధులకు మీరు ఓట్లు వేస్తారా? అని ప్రజలను అడిగారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొత్తగా పెళ్ళయిన జంటలా రాసుకుపూసుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు.   చంద్రబాబు ఎన్నికలలో గెలిచేందుకు మోడీని, వెంకయ్య నాయుడిని వెంటతెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించక పోయినా, ఆయన వెళ్లి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందని షర్మిల అన్నారు. హిందూపురం నుండి పోటీ చేస్తున్న బాలకృష్ణకు ఏవిధంగా మతిస్థిమితం లేదో అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా మతి స్థిమితం లేదని ఆమె ఎద్దేవా చేసారు. అటువంటి మతిస్థిమితం లేని వ్యక్తులు చెపుతున్న మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఆనక వారే తీవ్రంగా నష్టపోతారని ఆమె హెచ్చరించారు.

నేటితో ఎన్నికల ప్రచారం సమాప్తం

  ఈరోజుతో సాయంత్రం 4గంటలకి సీమాంద్రాలో ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. అందువల్ల అమూల్యమయిన ఈ చివరి కొద్ది గంటలలో వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలలో పర్యటించి ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవాలని అన్ని పార్టీల నేతలు తెల్లవారుజాము నుండే తమ ప్రచారం మొదలు పెట్టేసారు. మార్నింగ్ వాక్కి బయలుదేరినవారిని, కూరగాయలు కొనుకోనేందుకు బజారుకు బయలుదేరుతున్న వారి వెంటపడుతూ తమకే ఓటువేయాలని కొందరు అభ్యర్ధులు బ్రతిమాలడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. నవ్వితే నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనుకొంటూ అభ్యర్ధులు మాత్రం తమపని తాము చేసుకుపోతున్నారు.   ఇక ఈరోజే ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఇంతకాలం సీమాంధ్ర అంతటా ప్రచారంలో పాల్గొన్న ప్రధాన అభ్యర్ధులు అందరూ, తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న విజయమ్మ, హిందూపురం నుండి శాసనసభకు పోటీ చేస్తున్న బాలకృష్ణ తదితరులు ఈరోజు పూర్తిగా తమ నియోజకవర్గాలలో ప్రచారానికే పరిమితం కానున్నారు.   ఎల్లుండి అంటే మే 7న 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు జరుగబోయే ఎన్నికలలో మొత్తం 3, 67,62975 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 23 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయబడ్డాయి. అరకు, పాడేరు వంటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలయిన 10 నియోజక వర్గాలలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మిగిలిన 165 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

పవన్ కల్యాణ్ పై ఈసీకి పిర్యాదు

  జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ముద్దురూ కలిసి గత ఐదేళ్ళుగా ఎంతో శ్రమించి ఓదార్పు యాత్రలు, దీక్షాలు, ధర్నాలు, ఉద్యమాలు చేసి ఇప్పుడు తమ ఆ కష్టాన్ని ఓట్లుగా మలుచుకొనేందుకు సిద్దపడుతుంటే, అకస్మాత్తుగా రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తెదేపా-బీజేపీకి మద్దతు తెలపడమే కాకుండా, వైకాపాను, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయడం వారికి చాలా ఆగ్రహం కలిగించడం సహజమే. సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ నేరుగా జగన్, రాజశేఖర్ రెడ్డిలపై చేస్తున్న పలు ఆరోపణలు, ప్రజలను ఆలోచింపజేసేవిగా ఉండటంతో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయన విమర్శలను వారు ముగ్గురు బలంగా త్రిప్పికొడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారానికి మాత్రం బ్రేకులు వేయలేకపోయారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు నేరుగా సమాధానం చెప్పలేకపోతున్నారు.   ఇటువంటి తరుణంలో ఆయన నిన్న ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైకాపా డబ్బులు ఇస్తే తీసుకొని ఓటు మాత్రం టీడీపీ, బీజేపీ కూటమికి వేయాలంటూ’ అన్న మాటలను పట్టుకొని వైకాపా నేతలు ఆయనపై ఈసీకి పిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ డబ్బు తీసుకోమని ఓటర్లను ప్రోత్సహించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని, అందువల్ల వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈఓ దేవసేనకు వైకాపా నేతలు నిన్న విజ్ఞప్తి చేసారు.   పవన్ కళ్యాణ్ ఆవిధంగా ఓటర్లకు చెప్పడం తప్పే. కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటర్లకు డబ్బు, మద్యం, వెండిసామాను, చీరలు, క్రికెట్ కిట్స్ వంటివి స్వయంగా పంచి పెడుతూ వారిని ప్రలోభపెడుతూ, ఒక్క పవన్ కళ్యాణ్ ఓటర్లను ప్రలోభాపెడుతున్నాడని పిర్యాదు చేయడం ఇంట్లో మొగుడ్ని చావగొట్టి వీదికెక్కి లబోదిబోమని ఏడ్చినట్లుంది వైకాపా పని. అంతకంటే ఆయన చేస్తున్న ప్రతీ ఆరోపణకు వారు నిర్దిష్టంగా సమాధానం చెప్పుకొని ప్రజలను మెప్పించగలిగి ఉంటే బాగుండేది. కానీ అది సాధ్యం కాదని గ్రహించినందునే తమకు దొరికిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్ర విభజన గురించి నాకు ముందే తెలుసు: జేడీ శీలం

  రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానానికి కడదాకా అండగా నిలిచిన జేడీ శీలం సీమాంద్ర ప్రజల అభీష్టాన్ని మాత్రం ఎన్నడూ పట్టించుకోలేదు. కారణం కాంగ్రెస్ అధిష్టానం తనని పిలిచి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టడమే. తనను ఓటేసి ఎన్నుకొన్న ప్రజల అభీష్టం కంటే మంత్రి పదవి, అదిచ్చిన కాంగ్రెస్ అధిష్టానమే తనకు ముఖ్యమని ఆయన ఋజువు చేసారు. నేటికీ ఆయన వంటి వారు కొంత మంది కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉన్నారు. అటువంటి మరో కేంద్రమంత్రి చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన వల్ల నష్టం జరుగుతుందని ప్రజలు అపోహ పడుతున్నారని, వారి అపోహలు దూరం చేసి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని అడిగేందుకే ప్రజల మధ్యకు వెళుతున్నామని” తెలిపారు.   జేడీ శీలం ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా మీడియా వాళ్ళు “రాష్ట్ర విభజన అంతా మీ చేతుల మీదుగానే జరిగిందని ప్రతిపక్షాల వారు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏమిటి?” అని జేడీ శీలాన్ని ప్రశ్నించినపుడు, “ఈ ఆరోపణలను నేను ఒక కాంప్లిమెంటుగా భావిస్తున్నాను. నిజానికి రాష్ట్ర విభజన జరుగబోతోందని నాకు చాలా ముందే తెలుసు. గత ఏడాది జూన్ 17నే నేను ఆ మాట తెలంగాణా నేతలకి చెప్పాను. కానీ అప్పుడు ఎవరూ నామాట నమ్మలేదు,” అని జవాబిచ్చారు.   ఆయన ఈరోజు బయటపెట్టిన ఈ రహస్యం బహుశః సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా అప్పుడే తెలిసి ఉంటుందని భావించవచ్చును. కానీ అందరూ కూడా రాజీనామాల డ్రామాలు ఆడుతూ ఎలాగో రోజులు దొర్లించేయగలిగారు. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నంత కాలం హైదరాబాదు, డిల్లీలో పిల్లుల్లా దాకొన్న అటువంటి నేతలే నేడు మళ్ళీ నిసిగ్గుగా తమకు, తమ పార్టీకి ఓటేయమని అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారు. సీమాంద్రా ప్రజలందరూ రాష్ట్ర విభజనకు బాధపడుతుంటే అది తనకు 'మంచి కాంప్లిమెంటు' ఒక మంత్రి గారు అంటుంటే, విభజన వల్ల నష్టం జరిగిందని ప్రజలు అపోహ పడుతుంటే వారికి జ్ఞానబిక్ష పెట్టేందుకే తాను తరలి వస్తున్నానని మరొక మంత్రిగారు శలవిస్తున్నారు. 

జగన్, రాజశేఖర్ వలననే తెలంగాణా డిమాండ్: పవన్ కళ్యాణ్

  ఈరోజు కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్డీయే అభ్యర్ధుల తరపున ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ “మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, దోపిడీ, భూకబ్జాల కారణంగానే తెలంగాణా ప్రజలలో సీమాంద్రా పాలకుల పట్ల, ప్రజల పట్ల కూడా తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. వైయస్స్ హయాంలో జరిగిన దోపిడీ మరువక ముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించడంతో తెలంగాణా ప్రజలలో రాష్ట్రం నుండి విడిపోవాలనే కోరిక బలపడిందని ఆరోపించారు. నాయకుడు అనేవాడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మెలగాలని, కానీ రాజశేఖర్ రెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి కోసం అవినీతికి గేట్లు తెరిచి, ప్రజలను దోచుకొన్నందునే తెలంగాణా ప్రజలలో సీమాంద్ర నేతల పాలన పట్ల, ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి చివరికి రాష్ట్ర విభజనకు దారి తీసిందని, అందుకు జగన్, అతని తండ్రి రాజశేఖర్ రెడ్డే కారకులని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అదే చంద్రబాబు 9 సం.ల పాలనలో తెలంగాణా ప్రజలలో వేరు పడాలనే ఆలోచన కూడా కలగకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తుకు చేసారు. అధికారంలో లేనప్పుడే లక్షల కోట్ల ప్రజాధనం దోచుకొన్న జగన్మోహన్ రెడ్డి భూ, ధన, అధికార దాహానికి అంతే లేదా? అని ఆవేశంగా ప్రశ్నించారు. తెలంగాణా ప్రజల దృష్టిలో సీమాంద్రా ప్రజలను దుష్టులు, దుర్మార్గులు అనే భావం ఏర్పడేలా చేసిన జగన్మోహన్ రెడ్డి, చివరికి కేసీఆర్ సీమాంధ్రులను నోటికి వచ్చినట్లు తిడుతుంటే వారి తరపున నిలబడి వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయారు. అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

కేసీఆర్ పోలవరాన్ని ఆపలేరు: జైరామ్

  రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలాది సీమాంద్ర ప్రజలు రెండున్నర నెలల పాటు రోడ్ల మీదకు వచ్చి ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తుంటే, డిల్లీ ఏసీ గదుల్లో కూర్చొని కులాసాగా నవ్వుకొంటూ, కబుర్లు చెప్పుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేసేసి చేతులు దులుపుకొన్న కేంద్రమంత్రి జైరామ్ రమేష్, ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలను ఓదార్చే పనిలో తలమునకలయ్యి ఉన్నారు. తెలంగాణా ఇచ్చిన ఘనత తమదేనని తెలంగాణాలో ఉండగా బల్ల గుద్ది వాదించిన ఆయన, సీమాంద్రాలో అడుగుపెట్టగానే రాష్ట్ర విభజన నిర్ణయం (పాపం) కేవలం తమ ఒక్కరిదే కాదని, అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తరువాతనే విభజించామని చెపుతూ, అదొక పాపమన్నట్లు అందులో అందరికీ సమానంగా ఉదారంగా వాటాలు పంచిపెడుతున్నారు.   అయినప్పటికీ సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోరే తాము చాలా ఉదారంగా ఐటీఐ మొదలు ఐఐటీల వరకు అన్నీ సమకూర్చబోతున్నామని హామీ ఇస్తున్నారు. వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వగైరా వగైరాలు గత 60 ఏళ్ళల్లో చేయలేని అనేక అద్భుతాలు తమకి మళ్ళీ ఓటేసి గెలిపిస్తే జస్ట్ ఐదేళ్ళలో పూర్తి చేసేస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు ఇస్తున్న’వరం’ పోలవరం అని ప్రకటించారు. సీమాంద్రాకి పారే కృష్ణానది నీళ్ళని ఆపడం కేసీఆర్, తెలంగాణా ప్రభుత్వాల తరంకాదని, దాని మీట తమ చేతిలో ఉందని గంభీరంగా గర్జిస్తున్నారు. అయితే ఇంతా చెప్పిన తరువాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరి కొంచెం సమయం (?) పడుతుందని, ఎందుకంటే 50వేలమంది గిరిజనులకు పునరావాసం కల్పించవలసి ఉందని ముగించారు.

జగన్, కేసీఆర్ లతో జైరామ్ యుద్ధం దేనికి?

  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజల వద్దకు విభజనలో ప్రముఖ పాత్ర పోషించిన జైరామ్ రమేష్ ను ప్రచారానికి పంపడం ఆత్మహత్యతో సమానమని కాంగ్రెస్ తెలియదనుకోలేము. రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితుడు, మంచి ప్రజాకర్షణ గల చిరంజీవి వంటి వ్యక్తికే రాష్ట్ర ప్రజల నుండి తిరస్కారం ఎదురవుతుంటే, దగ్గరుండి రాష్ట్ర విభజన చేసిన జైరామ్ రమేష్ ని చూస్తే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో, దానివలన కాంగ్రెస్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో ఎవరయినా ఊహించవచ్చును.   కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏరికోరి ఆయననే ఎందుకు పంపింది? కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగి, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నారు? బెయిలుపై బయటకు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవడం తాను జీర్ణించుకోలేకపోతున్నాని, జగన్ తిరిగి జైలుకు వెళ్ళక తప్పదని ఆయన ఎందుకు పదేపదే చెపుతున్నారు? అని ప్రశ్నించుకొంటే, ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రజలతో ఆడుతున్న ‘మైండ్ గేమ్’ లేదా ‘డబుల్ గేమ్’ అని చెప్పుకోవచ్చు.   అదెలాగ అంటే, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో 17యంపీ సీట్లు సాధించుకొనేందుకే, సీమాంద్రాలో పార్టీని, తమ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టిందని కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలే చెప్పారు. సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని కూడా వారే చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలంగాణాలో తెరాస, సీమాంద్రాలో వైకాపా గెలవడం చాలా అవసరం. కాంగ్రెస్ తొలి ప్రాధాన్యత తను తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడమే కానీ ఆంధ్రా, తెలంగాణాలలో అధికారం చెప్పడం కాదు. ఈసారి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో ఆహికారం హస్తగతం చేసుకోలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ అంధకారం అవుతుందని అందరికీ తెలుసు. అందుకే, దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వ్యూహాలు అమలుచేస్తోంది. సీమాంద్రాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా సిద్దం చేసిన వ్యూహం గురించి ఇప్పటికే ప్రజలందరికీ బాగా తెలుసు.   కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేఖత ఉందనే సంగతి ప్రజలకే కాదు, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆ వ్యతిరేఖతను మరింత పెంచుకోగలిగితేనే, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి బదిలీ అవుతాయి. అందుకు నోటి దురద ఉన్న జైరామ్ రమేష్ వంటి వ్యక్తికంటే అర్హుడు, సమర్ధుడు మరొకరు ఉండబోరు.   ఆయన తెలంగాణాలో మంచి ప్రజాధారణ ఉన్నకేసీఆర్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతూ పరోక్షంగా తెరాసకు ఏవిధంగా మేలు చేకూర్చేడో అందరికీ తెలుసు. ఇప్పుడు అదేవిధంగా సీమాంద్రాలో కూడా ప్రజాధారణ ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా అవాకులు చవాకులు వాగుతూ ప్రజల దృష్టిలో తాను, తన కాంగ్రెస్ పార్టీని విలన్లుగా మార్చి, జగన్మోహన్ రెడ్డిని హీరో చేసే పనిలోపడ్డారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటే, వారు ప్రత్యర్ధులు గనుక అది సహజమేనని ఎవరయినా భావిస్తారు. కానీ ఎన్నికల తరువాత తమ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోయే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను జైరామ్ రమేష్ వంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నేతే స్వయంగా తిట్టడం, విమర్శించడం కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న అతితెలివికి అద్దం పడుతోంది.   సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎవరయినా విమర్శిస్తే, అటువంటి వారిపట్ల వ్యతిరేఖత కనబరుస్తూ తమకు నచ్చిన వారివైపు మరింత బలంగా ఆకర్షితులవుతారు. గత ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి విషయంలో ఇది రుజువు అయ్యింది కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా అటువంటి వ్యూహమే అమలు చేస్తోంది. అందుకే, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా పక్కనబెట్టి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా పంపింది. ప్రస్తుతం ఆయన తనకు అప్పజెప్పిన పనిలో చాల వరకు సవ్యంగానే పూర్తి చేసారనే చెప్పవచ్చును. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహాన్ని ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధంతో చేధించుకొని బయటపడగలరో లేదో త్వరలోనే తేలుతుంది.

ప్రతిపక్ష బెంచీల్లో కూర్చోడానికి రెడీ: రాహుల్

  ఎన్నికల చివరిదశకు చేరుకొంటున్న కొద్దీ రాన్రాను కాంగ్రెస్ పార్టీలో గెలుస్తామనే ఆశ, నమ్మకం సన్నగిల్లిపోతున్నట్లు కనిపిస్తోంది. మోడీ ప్రధాని కాకుండా అడ్డుకొనేందుకు అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా తాము సిద్దమని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటన మొదటి సారిగా తన ఓటమిని అంగీకరిస్తూచేసిన ప్రకటనగా చెప్పుకోవచ్చును. కానీ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ యువరాజవారు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఎన్నడూ అనలేదని, అదంతా గాలివార్తలని కొట్టి పడేసారు. తాము ఈ ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని, ఒకవేళ గెలవకుంటే ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు కూడా సిద్దపడతాము తప్ప థర్డ్ ఫ్రంట్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఈయబోమని ప్రకటించారు.   మళ్ళీ ఇప్పుడు హటాత్తుగా ఎందుకు మనసు మార్చుకోన్నారనే విషయం పక్కన బెడితే, ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని ఆయన చేసిన ప్రకటన కాంగ్రెస్ పూర్తిగా తన పరాజయం అంగీకరించినట్లయింది. ఈ మాటల ప్రభావం వలన త్వరలో జరుగబోయే మిగిలిన రెండు దశల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్న రాహుల్ గాంధీయే స్వయంగా ఇంకా ఎన్నికలు పూర్తికాక మునుపే తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనేందుకు సిద్దమని చెపుతున్నపుడు, ప్రజలు కూడా అటువంటి ఓడిపోయే పార్టీకి ఓటు వేసి అమూల్యమయిన తమ ఓటును ఎందుకు వృధా చేసుకోవాలని భావించి, 300 సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ/ఎన్డీయే కూటమికే ఓట్లు వేసే అవకాశం ఉంది. రాజకీయ పరిణతి ఉన్న ఏ రాజకీయ నాయకుడు, పార్టీ కూడా ఇటువంటి కీలకమయిన తరుణంలో ఈవిధంగా మాట్లాడి తమకు పడబోయే ఓట్లను ప్రత్యర్ధుల ఖాతాలోకి మళ్ళించరు. కానీ విశాల హృదయం కల యువరాజవారు చాల ఉదారంగా తమ ప్రత్యర్ధ బీజేపీకి ఆ అవకాశం కల్పిస్తున్నారు.

సీమాంద్రాలో కూడా బాబు బీసీ మంత్రం పనిచేస్తుందా?

  ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా, కాంగ్రెస్, తెరాసల విజయవకాశాలకు గండికొట్టే స్థాయికి పార్టీని చేర్చారు. అయితే సీమాంద్రాలో తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నందున, ఆ మంత్రాన్ని యధాతధంగా జపించడం సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అవుతుంది గనుక దానిని కొద్దిగా మార్పు చేసి, సీమాంద్రాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికేనని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.   సీమాంద్రాలో తెదేపా-బీజేపీ తరపున చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ సీమంద్రాలో జగన్ ప్రభావం కూడా చాలా బలంగా ఉంది. జగన్, షర్మిల చేస్తున్న ప్రచారానికి ప్రజలలో విశేష స్పందన కనబడుతోంది. వైకాపా నుండి తెదేపా చాలా గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో, హామీలు గుప్పించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మిగిలిన ఈ మూడు రోజుల్లో ప్రజలను ఎలాగయినా తమవైపు తిప్పుకోవాలని రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈరోజు ఈ సరికొత్త తాయిలం ప్రకటించి ఉండవచ్చును.   అయితే ఈ సరి కొత్త తాయిలం ప్రకటించడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చును. బీజేపీతో తెదేపా అంటుకట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తెదేపాకు కూడా మతతత్వ రంగు పులిమెందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. దానివలన తెదేపాకు ముస్లిం మరియు క్రీస్టియన్ ప్రజల ఓట్లు కొంతమేర నష్టపోయే అవకాశం కూడా ఉంది. బహుశః ఆ లోటుని భర్తీ చేసుకోనేందుకే చంద్రబాబు మళ్ళీ బీసీ మంత్రం పటిస్తున్నట్లున్నారు. అయితే అన్నిసమస్యలకు ‘సర్వరోగ నివారిణి’లా ఒకటే మంత్రం పనిచేస్తుందా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.

కాపులు, బీసీలకు చంద్రబాబు బంపర్ ఆఫర్

      తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బీసీకే ఇస్తామని చెప్పి, ఆర్.కృష్ణయ్య పేరును ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రలోని బీసీలు, కాపులకు ఒక బంపర్ ఆఫర్ని ప్రకటించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను సృష్టిస్తామని, వాటిలో ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ద్వారా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ బీసీలు, కాపులకు మరింత చేరువు అయ్యే అవకాశం వుందని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.

వెబ్‌సైట్లలో డిగ్గీ, అమృత ఫొటోలు తీసేయండి

      తన కంప్యూటర్, ఈ మెయిల్ హ్యాక్ అయ్యాయని, వాటిలో వున్న తన, దిగ్విజయ్ పర్సనల్ ఫొటోలు లీక్ అయ్యాయని, అమృతారాయ్ చేసిన ఫిర్యాదుకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఐపీసీ సెక్షన్ 66ఎ, ఐటీ యాక్షన్ సెక్షన్ 509 కింద కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మొదటగా వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్న దిగ్విజయ్ సింగ్, అమృత రాసలీలల ఫొటోలను తొలగించాలని ఢిల్లీ పోలీసులు వెబ్ సైట్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఫొటోలను ఉపయోగించడం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అలాగే అమృతా రాయ్ పేరు మీద నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు చలామణిలో వున్నాయని, వాటిని కూడా తొలగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.