"రాజాసాబ్" సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటీషన్లపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్  విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటీషనర్ తరఫున వాదించిన న్యాయవాది విజయ్ గోపాల్, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ ధరల పెంపుపై మెమో జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, హైదరాబాద్ పరిధిలో సీపీ మాత్రమే టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారిపై రూ.5 లక్షల జరిమానా విధించాలని కూడా కోర్టును కోరారు. అంతేకాకుండా గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి తనకు తెలియకుండానే టికెట్ రేట్ మెమోలు జారీ అయ్యాయని చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టు ముందు ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, సినిమా టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంతటా ఒకే రకమైన టికెట్ ధర ఉండేది. మేము కూడా సినిమాలకు వెళ్లాం, మాకు టికెట్ ధరలు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. నిబంధనలు ఏమిటో మెమో జారీ చేసే అధికారికి తెలియదా అని కోర్టు నిలదీసింది. టికెట్ రేట్లకు సంబంధించిన మెమోలపై విచారణ జరగడం ఇదే మొదటిసారి కాదని, ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ ఆలోచనా విధానం ఎందుకు మారడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ, టికెట్ ధరల పెంపు వల్ల ఇబ్బందిపడేది ప్రైవేట్ వ్యక్తులే తప్ప, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు. ఇది కేవలం ఒక రిట్ పిటిషన్ మాత్రమేనని పేర్కొన్నారు.  సినిమా యూనిట్ కోరిన అన్ని సడలింపులకు ప్రభుత్వం అంగీకరించలేదని, కొన్నింటికే మాత్రమే అనుమతి ఇచ్చామని వివరించారు. అలాగే టికెట్ ధరల పెంపులో భాగంగా 20 శాతం లాభాలను సినీ కార్మికులకు ఇవ్వాలనే షరతు విధించినట్లు తెలిపారు. దీనివల్ల సినీ కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే సినీ కార్మికుల అసోసియేషన్‌ను పార్టీగా చేర్చకుండా వారి వాదనలు వినకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ అవసరమని భావించిన హైకోర్టు, తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది.  

పది నెలల కొడుకుకు విషమిచ్చి తల్లి సూసైడ్

    హైదరాబాద్‌ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక తల్లి తన పది నెలల పసికందుకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. మీర్‌పేట్‌కు చెందిన సుస్మితకు యశ్వంత్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు పది నెలల వయసున్న కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు. యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తు న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత తన కుమారుడికి విషమిచ్చి అనంతరం తానూ ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, కూతురు సుస్మితతో పాటు పసికందు యశ్వవర్ధన్ మృతదేహాలను చూసి అమ్మమ్మ తీవ్రంగా కలత చెందింది. ఈ షాక్‌ను తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటనతో మీర్‌పేట్ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ విధంగా ఒక కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నం కావడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా...ఎందుకంటే?

  టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుకు పంపారు. తనపై ఓ ప్రముఖ పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాల వల్ల మనస్తాపంతో రిజైన్ చేస్తున్నానని లేఖలో జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అయితే జంగాకు టీటీడీ కేటాయించిన భూమిని కేబినెట్ రద్దు చేయడమే కారణమని తెలుస్తోంది. ఈ కారణంతోనే ఆయన మనస్థాపం చెందారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం జంగా రాజీనామా చర్చనీయాంశంగా మారింది.  అయితే గతంలో తిరుమల బాలాజీనగర్‌లో ప్లాట్ నెంబర్ 2ను జంగాకు కేటాయించారు. ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉండటంతో మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని తీర్మానించారు. గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్‌గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్‌కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరానంటూ జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇది ఎలా తప్పు అవుతుందంటూ జంగా ప్రశ్నించారు . తాను ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఇబ్బంది వస్తుందనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి తిరుమల శ్రీవారి సేవ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని  కృష్ణమూర్తి తెలిపారు.  

తెలుగు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించుకుందాం : సీఎం రేవంత్‌

  పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం అవసరం అని ముఖ్యమంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కంటే పరిష్కారానికే తాను మొగ్గు చూపుతానని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని తెలిపారు. దేశంలో పోర్టు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని...అందుకే మచిలీపట్నం పోర్టు నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి 12 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం అనుమతులు అడిగామని ముఖ్యమంత్రి అన్నారు.  పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు వస్తాయిని సీఎం తెలిపారు. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం ఉండాలని తెలిపారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు తెలిపారు. రాష్ట్రంపై ఆర్ధిక భారం కూడా పడుతోందని పేర్కొన్నారు. మేం వివాదం కోరుకోవడంలేదు, పరిష్కారం కోరుకుంటున్నామని  రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.   మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అనవసరంగా తెలుగు రాష్ట్రాలమధ్య గొడవలు వద్దు. మాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే కొంతమంది నీళ్లొద్దు గొడవలే కావాలంటున్నారని చంద్రబాబు అన్నారు. అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు వద్దని చంద్రబాబు హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడని అని ఆయన తెలిపారు. 

హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డికి ఊరట

  తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు డీజీపీగా శివధర్‌రెడ్డి కొనసాగడంపై తాత్కాలిక అడ్డంకులు తొలగినట్ల య్యాయి.ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యంగా యూపీఎస్సీ  ద్వారా జరగాల్సిన నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. నియామకంలో విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా పాటించాలన్న అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. డీజీపీ నియామక వ్యవహారంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి, డీజీపీ శివధర్‌రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ, తుది నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ కేసుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

నేను నెంబర్ వన్ యాక్టర్‌ని కాదు..కానీ : పవన్ కళ్యాణ్

  తాను నెంబర్ వన్  యాక్టర్‌ను కాకపోయిన తన సినిమా ప్లాప్ అయిన డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ తనకు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.  ప్రజల మద్దతు, ప్రేక్షకులకు మద్దతునే ఇది తనకు సాధ్యమైందని పవన్ తెలిపారు. అయిన సరే తాను రాజకీయాల్లోకి ఎందుకువచ్చానంటే...ప్రజాసేవను తాను బాధ్యతగా భావించానని చెప్పారు.   పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా బిగ్ న్యూస్ అయిపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. తాను  పిఠాపురం శాసన సభ్యుడిగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఫంక్షన్లకు హాజరు కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ తెలిపారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు.   

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు బాంబు బెదరింపు!

పశ్చిమ బెంగాల్  గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టింది. గవర్నర్ ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ వార్నింగ్ తో  గురువారం (జనవరి 8) అర్ధరాత్రి అప్పటికప్పుడు లోక్ భవన్  వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో  తాజా బెదరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.

హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు.. కొట్టేసిన హైకోర్టు

టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  నవదీప్‌పై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు   కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. గుడిమల్కాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు..  నవదీప్ వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చడమే తప్ప, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలూ లేవని పేర్కొంటూ కేసు కొట్టివేసింది.   నవదీప్ వద్ద డ్రగ్స్ లభించకపోవ డంతో పాటు, అతడిపై నమోదైన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు పేర్కొంది.  ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన క్రిమినల్ కేసును కొనసాగించడం చట్టబద్ధం కాదనీ, అందుకే నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టేస్తున్నట్లు వెల్లడించింది. నవదీప్ తరఫున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ తన వాదనలు వినిపించారు. నవదీప్‌పై ఉద్దేశపూర్వకంగా కేసు బనాయించారని, ఎలాంటి  ఆధారాలు లేకుండానే అతడిని నిందితుడిగా చేర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదన లను పరిగణనలోకి తీసు కున్న హైకోర్టు కేసును కొట్టివేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హీరో నవదీప్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసును కొర్టు కొట్టివేయడంతో ఆయన నిర్దోషిగా నిరూపితుడయ్యారని నవదీప్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

  టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన  నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. ఆయనపై గతంలో నమోదైన డ్రగ్స్‌ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్‌ వద్ద డ్రగ్స్‌ దొరకలేదని న్యాయవాది సిద్ధార్థ్‌ వాదించారు.  నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో కేసు ఉంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. గుడిమల్కాపూర్‌లో   నమోదైన కేసులో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నవదీప్ పేరు పెట్టారని హై కోర్టు పేర్కొన్నాది.  

బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏకంగా జిల్లా ఎస్పీ పేరుతోనే మోసాలు

ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్ లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది. ఫర్నిచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని  పలువురికి  జిల్లా ఎస్పీ పేరుతో గురువారం జనవరి 8) మెస్సేజ్ లు అందాయి. ఈ విషయం  పోలీసుల దృష్టికి రావడంతో వారు వెంటనే అప్రమత్తమై ఆ ఫేక్ వాట్సాప్ నెంబర్ ను బ్లాక్ చేశారు. సైబర్ మోసాలు వివిధ రూపాల్లో  పెచ్చుమీరుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సంద ర్భంగా  ఎస్పీ సంకీర్త్ ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.  

డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ.కోటి.. కుమారుడికి ప్రమోషన్!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అత్యంత అమానవీయంగా వేధింపులకు గురై  ఆ మానసిక క్షోభతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.   ప్రభుత్వ డాక్టర్ అయిన  సుధాకర్ కు జగన్ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుమారుడిని పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.   జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది.  ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా..  విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనపై  పిచ్చివాడు అన్న ముద్రవేసి,  ఆసుపత్రికి పంపడం వంటి  అత్యంత అమానవీయ చర్యలకు అప్పటి జగన్ ప్రభుత్వం పాల్పడింది. ఆ  మానసిక వేదన, ఆ అవమానంతోనే  ఆయన కన్నుమూశారు.   నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత  ప్రభుత్వ పరంగా డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సహకారం అందించాలని నిర్ణయించారు.   ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని  గురువారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు.  అలాగే ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.   

పశ్చిమ బెంగాల్ లో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు.. బయటపడ్డ వైసీపీ ఆర్థిక లోసుగులు

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక నేరం జరిగినా దానితో వైసీపీకి ఉన్న లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు నిర్వహించింది.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు ఐ ప్యాక్ సంస్థ ఎన్నికల వ్యూహాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ తో తృణమూల్ అనుబంధం 2021 ఎన్నికలకు ముందు నుంచీ ఉంది. అలాగే ఇదే ఐ ప్యాక్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  రెడ్డికి కూడా 2024 ఎన్నికలలో  ఇటువంటి సహకారమే అందించింది. అది పక్కన పెడితే  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో..  గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోల్ కతా ఈడీ సోదాల్లో..  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన రాజ్‌ కసిరెడ్డికి చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఈడీకి లభించినట్టు తెలుస్తోంది. ఈ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కోల్ కతాలో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ జరిపిన సోదాలలో లభ్యం కావడంతో, ఈడీ రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తునకు సమాయత్తమౌతున్నట్లు తెలుస్తోంది.  

సంక్రాంతికి నో టోల్ ఫ్రీ

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతికి నగరాలు, పట్టణాలలో ఉండే ప్రజలు స్వంత ఊళ్లకు వెళ్లడం ఆనవాయితీ. ఇలా  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు తరలి వెళ్లే ప్రజలకు టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ను ఇబ్బందులకు గురి చేస్తుండటం, గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుని అగచాట్లు పడటం సాధారణంగా మారిపోయింది. ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకూ టోల్ ఫ్రీకా ప్రకటించాలని తెలంగాణ పర్యాటక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే తెలంగాణ విజ్ణప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ తిరస్కరించారు. జాతీయ రహదారులపై ఉచిత టోల్ కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు.  ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.  

టూరిజం డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం డెస్టినేషన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని క్రియోటివ్ అకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు.   విజయవాడ పున్నమీ ఘాట్ లో   అవకాయ్- అమరావతి ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరైన  ఆయన తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడటమే బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. ఈ   కార్యక్రమానికి హాజరైన  యూరోపియన్ యూనియన్ రాయబారి (ఈయూ) రాయబారి హెర్వే డెల్ఫీతో కలిసి  ఇరువురూ కలిసి కృష్ణాహారతిని తిలకించారు. అంతకుముందు కృష్ణా నదిలో హౌస్ బోట్ ను ప్రారంభించారు.  తెలుగు సంస్కృతికి, ఆతిథ్యానికి ఆవకాయ ప్రతిరూపమన్న చంద్రబాబు ఆవకాయ్ అనగానే ప్రపంచంలో ఎవరికైనా సరే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు. ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం  సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు.  ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు. ఇక ఈ ఆవకాయ ఫెస్టివల్ ను తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించుకుంటున్నామన్న చంద్రబాబు తెలుగు వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత పాలనలో పండుగలు లేవు ఉత్సవాలు లేవు.  కూటమి వచ్చాకే విజయవాడ దసరా ఉత్సవాలు జరిగాయి.  మైసూర్, కలకత్తాలకు దీటుగా  విజయవాడ పేరు కూడా గుర్తొచ్చేలా ఆ ఉత్సవాలను జరుపుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.  

పదేళ్లలో పర్యాటకంలో ఏపీ నంబర్ వన్.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోంది.  రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే  విజయవాడలో మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్  ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. గురువారం (జనవరి 9)న ప్రారంభమైన అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ లో  సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయన్నారు.   పర్యాటక రంగాన్ని  ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో  పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.   సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ,  పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఇక అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందనీ, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నచంద్రబాబు, దేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ కే దక్కాయనీ, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తేటతెల్లం చేసిందని అన్నారు.   పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయన్న ఆయన. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందడంలో భద్రత, శుభ్రత కీలకపాత్ర వహిస్తాయన్నారు.  ఇక రాష్ట్ర పర్యాటకంలో తెలుగు సినీమా కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  క్రియేటివిటీకి తెలుగు సినిమా చిరునామా అన్న విషయాన్ని   భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే  నిదర్శమన్నారు.   ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.    గత ప్రభుత్వం సాంస్కృతిక ,  వినోద కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేయడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.    విజయవాడ ఉత్సవ్ మరియు కనక దుర్గ ఉత్సవ్‌లను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.     అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూరోపియన్ యూనియన్  రాయబారి హెర్వే డెల్ఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్  వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో  ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు. సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ   నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్ధిక వృద్దిలో పెట్టుబడులతో ఏపీని లీడింగ్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన, ఈ డైనమిజమే యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోందని అన్నారు.  

కోడి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం.. తిరుపతిలో ఇద్దరు అరెస్టు

తిరుపతిలో  ఇద్దరు వైసీపీ కార్యకర్తలనుపోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అధినేత జన్మదినం సందర్భంగా వారు చేసిన చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకీ వారేం చేశారంటే.. మాజీ  సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేట్ ఉద్యోగి భువనకుమార్ రెడ్డి  గత డిసెంబర్ 21న కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ   దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత ఈ విషయంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో  పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గురువారం (జనవరి 8) వారిరువురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.   నిందితుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు.  నిందితులు కోర్టుకు వచ్చిన సమయంలో వారిని పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కోర్టుకు వచ్చి వారికి సంఘీభావం ప్రకటించారు. కాగా కోర్టు వారిరువురికీ బెయిలు మంజూరు చేసింది.

షూటింగ్ జాతీయ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

  కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ స్థాయి షూటర్‌ అయిన 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో ఆయనపై ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో అంకుశ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. హోటల్ గదిలో జరిగిన సంఘటనల గురించి సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ఆటతీరు సమీక్షించాలనే సాకుతో ఫరీదాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని తెలిపింది. హోటల్ నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా షూటర్‌పై ఈ లైంగిక దాడి జరిగింది. అంకుశ్‌ భరద్వాజ్‌పై పోక్సోసహా పలు సెక్షన్ల కింద ఫరీదాబాద్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలను ధృవీకరించడానికి సంఘటన జరిగిన రోజు హోటల్‌లోని అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను వెంటనే భద్రపరిచి తమకు అందజేయాలని నిర్వాహకులను కోరామని పోలీసులు తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 13మంది జాతీయ షూటింగ్ కోచ్‌ల్లో అంకుశ్‌ ఒకరు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ అంకుశ్ భరద్వాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు.     

ప్రపంచ కుబేరుడు థాయ్‌లాండ్ రాజు... రూ.4.5 లక్ష కోట్ల ఆస్తులు

  ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ.. ఏ వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం లేకుండా.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తులు, వాటిని తెలివిగా పెట్టుబడులు పెట్టి ఒక రాజు ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయనే థాయ్‌లాండ్ రాజు మహా వజ్రాలాంగ్‌కోర్న్ ( కింగ్ రామ 10). ఆయన తన తండ్రి కింగ్ భూమిబోల్ అదుల్యాడేజ్ (కింగ్ రామ 11) మరణం తరువాత 2016లో సింహాసనాన్ని అధిష్టించారు. 2019లో అధికారికంగా పట్టాభిషేకం జరిగింది.  ఆయనకు ఉన్న ఇళ్లల్లో రోజుకో ఇంటికి వెళ్లి బస చేసినా.. తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట.  థాయ్‌లాండ్ రాజు సంపద అక్షరాలా 50 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆయన విలాసవంతమైన లైఫ్‌స్టైల్ చూస్తే ప్రపంచంలో ఉన్న కుబేరులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు పేరు మీద థాయ్‌లాండ్‌లో వేల సంఖ్యలో భవనాలు, రాజప్రాసాదాలు ఉన్నాయి.   ఇక థాయ్‌లాండ్ రాజు వద్ద 38 ప్రైవేట్ జెట్‌లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అయిన రోల్స్ రాయిస్, బెంట్లీ వంటివి ఉన్నాయి. ఆయన వద్ద పడవలు కూడా ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పూసిన పడవలు ఉన్నాయంటే ఆయన సంపద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వద్దే ఉండటం విశేషం. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు ఆదాయానికి ప్రధాన వనరు థాయ్‌లాండ్ దేశంలోని భూములేనని సంబంధిత వర్గాలు చెబుతాయి.  థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఆయన ఆధీనంలో సుమారు 16 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్‌ నగరంలోనే 17 వేలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన సంపదలోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా థాయిలాండ్ రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని అతిపెద్ద బ్యాంక్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వాటాలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ సియామ్ సిమెంట్‌లో కూడా 33 శాతం వాటాలు ఈయనకే ఉన్నాయి.     

టీ20 వరల్డ్ ముందు భారత్‌కు షాక్...కీలక ప్లేయర్ దూరం

  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  జట్టులో మంచి ఫాంలో ఉన్న యువ బ్యాట్స్‌మన్ తిలక్‌వర్మకు పొట్ట కింద భాగంలో గాయమవ్వడంతో అతనికి ఆపరేషన్ చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు.   ఆ క్రమంలో ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌‌కు ఆ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్  హజారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింద భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే స్కానింగ్ చేయించారు. డాక్టర్ల సూచన మేరకు తిలక్‌కు తక్షణం సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే 3, 4 వారాలు ఆటకు దూరమవ్వనున్నాడు. ఫలితంగా కివీస్‌తో సిరీస్‌కు ఆ యువ బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ఇప్పటివరకు మరొకరికి జట్టులోకి తీసుకోలేదు. ఏదేమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ. అతడు వరల్డ్ కప్‌లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.