నేను నెంబర్ వన్ యాక్టర్‌ని కాదు..కానీ : పవన్ కళ్యాణ్

 

తాను నెంబర్ వన్  యాక్టర్‌ను కాకపోయిన తన సినిమా ప్లాప్ అయిన డబ్బు సంపాదించగలిగే కెపాసిటీ తనకు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.  ప్రజల మద్దతు, ప్రేక్షకులకు మద్దతునే ఇది తనకు సాధ్యమైందని పవన్ తెలిపారు. అయిన సరే తాను రాజకీయాల్లోకి ఎందుకువచ్చానంటే...ప్రజాసేవను తాను బాధ్యతగా భావించానని చెప్పారు.  

పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా బిగ్ న్యూస్ అయిపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు. పిఠాపురంలో తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి మానవ సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారన్నారు. తాను  పిఠాపురం శాసన సభ్యుడిగా గెలిచిన కేవలం ఏడాదిలోనే రూ.308 కోట్లను నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించానని తెలిపారు. మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేస్తామన్నారు.

పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థలా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. ఫంక్షన్లకు హాజరు కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పవన్ తెలిపారు. తాను ఎక్కడా ఉన్నా తన గుండెల్లో పిఠాపురం ఉంటుందనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోవాలని విన్నవించారు.తాను నల్గొండ ఫ్లోరోసిస్ లాంటి ఎన్నో సమస్యలు చూసి ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని అని డిప్యూటీ సీఎం తెలిపారు. 


 

అగ్నిప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించండి : సీఎం చంద్రబాబు

  కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 26 గిరిజన గుడిసెలు పూర్తిగా కాలి బూడిద కాగా, 33 కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులయ్యాయి. అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు ఒక్కసారిగా సర్వం కోల్పోయి తీవ్ర ఆందోళనలో మిగిలిపోయాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అధికారులతో మాట్లాడి బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.25,000 చొప్పున నగదు అందించడంతో పాటు ఇల్లు కోల్పోయిన వారికి పక్కా గృహాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన సాయాన్ని కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ప్రభుత్వపు పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎస్.వి. నరేశ్ మాట్లాడుతూ, 33 కుటుంబాలకు రూ.25 వేల చొప్పున నగదు సహాయం పంపిణీ చేసినట్టు తెలిపారు. బాధితులందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారికి ఆహారం, నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

గ్రీన్‌లాండ్ విలీనానికి అమెరికా సెనెట్‌లో బిల్లు

  డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లు ప్రవేశపెట్డాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డాడు.  అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమ్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వ్యాఖ్యానించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరకా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్ నుంచి దూరం చేయడానికి అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది.   అయితే యూఎస్ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్  స్పష్టం చేశారు. నాటో దేశాలు సైతం యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా వెనకడుగు వేయని ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనానికి పావులు కదుపుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.  

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది : ఆర్మీ చీఫ్ ద్వివేది

  పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా గత ఏడాది చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'  కొనసాగుతోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతామని హెచ్చరించారు. 2026లో తొలిసారి ద్వివేది మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ ఎలాంటి పొరపాట్లు చేసిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ ఆర్మీ మోహరించిన బలగాలు భూతల దాడులు చేసేందుకు కూడా సన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు.  జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా-రాజౌరి సెక్టార్‌లో తాజాగా పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సంచారాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ, ఈ అంశం మంగళవారం నాడు పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయిలో ప్రస్తావనకు వచ్చిందని, పాక్‌ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పామని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందన్నారు.  జమ్మూకశ్మీర్‌లో జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11,12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని చెప్పారు. అవి చాలా చిన్న డ్రోన్‌లని, లైట్లు వెలుగుతూ తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయని, డిఫెన్సివ్ డ్రోన్‌లు కావచ్చని అన్నారు. పాక్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని,  వీటిలో రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా, ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయని ద్వివేదీ పేర్కొన్నారు.  ఎలాంటి కదలికలు కానీ శిక్షణా కార్యకలాపాలు కానీ ఉన్నట్టు గుర్తించినట్లయితే అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంమని స్పష్టం చేశారు. కవ్వింపు చర్చలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పాక్‌ను హెచ్చరించారు.

ఏపీలో బార్లు, వైన్ షాపుల్లో ఇకపై ఒకే ధరకు మద్యం

  ఏపీ ఎక్సైజ్ పాలసీలోరాష్ట్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు,  బార్ల వినియోగదారులకు ఊరటనిచ్చేలా బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. 2019 నవంబర్ నుంచి బార్లపై ఉన్న ప్రత్యేక అలర్ట్‌నీ తొలగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం.. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.. జీఓ ఎంఎస్ నంబర్ 24ను జారీ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో ధరల కంటే బార్లలో ప్రతి క్వార్టర్ మందుపై రూ.50 నుంచి రూ.60 వరకు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశారు. ఇకపై రిటైల్ షాపులు, బార్ల మధ్య ఒకే మద్యానికి రెండు ధరలు ఉండవు. వైన్‌షాపుల్లో, బార్లలో ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్‌పై అదనపు పన్ను విధింపు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు.   ఎక్సైజ్ చట్టాల ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తూ, 2025 బార్ లైసెన్స్ నిబంధనల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు, బారులకు వెళ్లే మందుబాబులకు పెద్ద ఊరటగా మారనుంది. ఇలాంటి మార్పులతో బార్ల వ్యాపారులకు గణనీయంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.  డైరెక్టర్ ఆఫ్ ఎక్సైజ్, డిస్టిలరీస్ కమిషనర్, APSBCL అధికారులు ఈ మార్పుల అమలుకు బాధ్యత వహించనున్నారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచి (2026 జనవరి 13) నుంచి అమలులోకి వస్తాయి. గతంలో బార్లకు రిటైల్ షాపుల కంటే ఎక్కువ ధరకు మద్యం సరఫరా అవుతుండటం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి తలెత్తేది. ఇప్పుడు ధరల సమానత్వంతో బార్లకు బిగ్ రిలీఫ్‌ అనే చెప్పుకోవచ్చు.

మహిళా ఐఏఎస్ అధికారి లక్ష్యంగా అనుచిత పోస్టుల కేసు దర్యాప్తునకు సజ్జనార్ నాయకత్వంలో సిట్

మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొన్ని న్యూస్ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా అవమానకరమైన, అసభ్యకరమైన కంటెంట్ పోస్ట్ చేడయం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడాయాలో పోస్టు చేసిన కేసుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ రెండు కేసులనూ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో లోతైన దర్యాప్తునకు  డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన  సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహిస్తారు.   సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన  కావలి వెంకటేశ్‌ అనే వ్యక్తిపై కాంగ్రెస్ నేత గుళ్ల నరసింహ ఫిర్యాదు మేరకు  నారాయణపేట జిల్లాలో కేసు నమోదైంది.   మరోవైపు, ఓ మంత్రికి, మహిళా ఐఏఎస్ అధికారిణికి సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ  రెండు న్యూస్‌ చానళ్లతో పాటు పలు యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో  ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.   ఈ రెండు కేసులనూ సిట్ దర్యాప్తు చేయనుంది. 

కాంగ్రెస్‌లో కల్వకుంట్ల కవితకు నో ఎంట్రీ : టీ పీసీసీ చీఫ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ తేల్చిచెప్పారు.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్ మాట్లాడుతూ..తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప.. భవిష్యత్తు లేదంటూ వ్యాఖ్యానించారు.  మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి కవిత నిజాలు చెప్తున్నారన్నారు. తాము చేసిన ఆరోపణలపై కవిత సమాధానం రూపంలో రుజువైందని చెప్పారు. కవిత మాటలతో కేసీఆర్ అవినీతి నిజమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్.. కుమారుడికి ఒక జిల్లా, కూతురికి ఒక జిల్లా, అల్లుడికి ఒక జిల్లా ఇచ్చారని పీసీసీ చీఫ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారని మండిపడ్డారు.  శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేయాలని కమిటీ వేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌ను ఎవరు ముట్టుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాబరాపడుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. మహిళా అధికారులపై ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఎంత ఇబ్బంది పడతారో అర్థం చేసుకోవాలన్నారు. సోషల్ మీడియాను కట్టడి చేయాలన్నారు. పదేళ్లలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? రెండేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.  

జోహో వ్యవస్థాపకుడి అత్యంత ఖరీదైన విడాకులు

  టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన భార్య ప్రమీలా నాయర్‌తో విడిపోతున్న సందర్భంగా సెటిల్‌మెంట్ కింద ఆయన దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలవడమే కాకుండా.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత భారీ సెటిల్‌మెంట్‌గా రికార్డులకెక్కింది.  బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ వేంబు పేరు చేరింది. శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 15,000 కోట్లుల విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.  ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది.ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లుగా అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్‌తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లారు. మరి ఈ బిలియన్ డాలర్ల వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.  

డెలివరీ బాయ్ అవతారమెత్తిన ఎంపీ

  గిగ్ వర్కర్ల (డెలివరీ బాయిస్)  సమస్యలను పార్లమెంటులో ఇటీవల లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ  రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా  తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశారు. 'బోర్డు రూములకు దూరంగా అట్టడుగు స్థాయిలో.. ఐ లివ్డ్ దైర్ డే..' అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.  ఈ వీడియోలో బ్లింకిట్ యూనిఫారం వేసుకున్న చద్దా డెలివరీ బ్యాగ్‌ తగిలించుకుని రైడర్‌తో కలిసి ప్రయాణం సాగించారు. స్టోర్‌లో వస్తువులు కలెక్ట్ చేసుకుని డెలివరీ లొకేషన్‌కు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే లిఫ్ట్‌ ఎక్కి రైడర్‌ను చద్దా అనుసరించారు. 'స్టే ట్యూన్డ్' అంటూ ఆ వీడియో ముగుస్తుంది. చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు.  పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు. ఇలాంటి డెడ్‌లైన్‌ల వల్ల రైడర్లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది రాజ్యసభ జీరో అవర్‌లో చద్దా ప్రస్తావించారు.  జనం రోబోలు కాదని, వాళ్లలోనూ తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు ఉన్నారని అన్నారు. వారి గురించి సభ ఆలోచించాలని కోరారు. 10 నిమిషాల్లో డెలివరీ అనే క్రూర నిబంధనకు తెరపడాలని అన్నారు. తాజాగా, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుకునేందుకు డెలివరీ బాయ్‌గా ఆయన అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఏపీలో పోటా పోటీ విగ్ర‌హాలు..?

  ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది. కూట‌మి స‌ర్కార్ క‌మ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండ‌పై రూ. 1750 కోట్ల‌తో ఎన్టీఆర్  విగ్ర‌హం పెడతామ‌న్న ప్ర‌క‌ట‌న  చేసింది. దీంతో వైయ‌స్, రంగా  విగ్ర‌హాల  ప్ర‌స్తావ‌న సైతం విన‌ వ‌స్తోంది. క‌మ్మ‌ల‌ను చూసిన రెడ్లు.. తాము ఎక్కువ‌గా ఉండే పెనుమాక గ్రామం కొండ‌పై వైయ‌స్ విగ్ర‌హం అంత‌కన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్య‌యం చేస్తూ.. విగ్ర‌హం పెట్ట‌డం ఖాయంగా తెలుస్తోంది.ఇక క‌మ్మ, రెడ్ల‌ను చూసి కాపులు తామేమీ త‌క్కువ కాదంటున్నార‌ట‌. కాపులు ఎక్కువ‌గా ఉండే ఉండ‌వ‌ల్లి గ్రామం కొండ‌ లేదా ఎర్రుపాలెం కొండ‌పై వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హం పెడ‌తార‌ట‌. దీంతో ఏపీలో ప్ర‌స్తుతం పోటా పోటీ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఒకింత జోరుగానే  సాగుతోంది. కొంద‌రు క‌మ్మ వారైతే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వ‌ద్ద‌నే అంటున్నార‌ట‌. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెడితే.. వ‌చ్చే రోజుల్లో అవి వైయ‌స్, రంగా విగ్ర‌హాలుగా ఒక‌టికి మూడ‌వుతాయని వీరు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు వైసీపీ ఇదే విగ్ర‌హ వ్య‌వ‌హారంపై కొత్త రాగం అందుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌కు ఏడాదికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌లేని కూట‌మి స‌ర్కార్.. సుమారు రెండు వేల కోట్ల‌తో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని రివ‌ర్స్ లో వ‌స్తోంది. దీంతో పాటు ద‌ళితుల‌ను కూడా ఎగ‌దోసి.. మా సొమ్ముతో క‌మ్మ వారి కుల ప్ర‌తీక అయిన ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని ఒక ర‌క‌మైన ప్ర‌చారం చేయిస్తోంది. కొంద‌రైతే క‌మ్మ‌వారికి ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇదంతా ఇలా ఉంటే గ‌తంలో గుంటూరు ఎంపీ  గా ప‌ని చేసిన జ‌య‌దేవ్ గ‌ల్లా పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ వేల కోట్ల‌తో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్, శివాజీ విగ్ర‌హాల వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.  వీట‌న్నిటి  న‌డుమ ఈ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో తేలాల్సి ఉంది.

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీం కు డాక్టర్ సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత మళ్లీ సుప్రీం మెట్లెక్కారు.  తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షిక అనుమతి మాత్రమే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని  సీబీఐ ప్రత్యేక కోర్టు ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.   దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని  ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ప్రస్తుత అప్లికేషన్తో పాటు పెండింగ్ లో  ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి  వాయిదా వేసింది.