ఏపీలో పోటా పోటీ విగ్ర‌హాలు..?

  ఏపీలో కొండ‌ల‌పై పోటా పోటీ విగ్ర‌హాల గురించి ప్ర‌ముఖంగా చ‌ర్చ న‌డుస్తోంది. కూట‌మి స‌ర్కార్ క‌మ్మ వారు అధికంగా ఉండే నీరుకొండ గ్రామం కొండ‌పై రూ. 1750 కోట్ల‌తో ఎన్టీఆర్  విగ్ర‌హం పెడతామ‌న్న ప్ర‌క‌ట‌న  చేసింది. దీంతో వైయ‌స్, రంగా  విగ్ర‌హాల  ప్ర‌స్తావ‌న సైతం విన‌ వ‌స్తోంది. క‌మ్మ‌ల‌ను చూసిన రెడ్లు.. తాము ఎక్కువ‌గా ఉండే పెనుమాక గ్రామం కొండ‌పై వైయ‌స్ విగ్ర‌హం అంత‌కన్నా మించిన ఎత్తుతో,, సుమారు మూడు వేల కోట్ల వ్య‌యం చేస్తూ.. విగ్ర‌హం పెట్ట‌డం ఖాయంగా తెలుస్తోంది.ఇక క‌మ్మ, రెడ్ల‌ను చూసి కాపులు తామేమీ త‌క్కువ కాదంటున్నార‌ట‌. కాపులు ఎక్కువ‌గా ఉండే ఉండ‌వ‌ల్లి గ్రామం కొండ‌ లేదా ఎర్రుపాలెం కొండ‌పై వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హం పెడ‌తార‌ట‌. దీంతో ఏపీలో ప్ర‌స్తుతం పోటా పోటీ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఒకింత జోరుగానే  సాగుతోంది. కొంద‌రు క‌మ్మ వారైతే ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని వ‌ద్ద‌నే అంటున్నార‌ట‌. కారణం ఇదిగో ఇదేనంటున్నారు. ఇప్పుడు మీరు రెచ్చిపోయి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పెడితే.. వ‌చ్చే రోజుల్లో అవి వైయ‌స్, రంగా విగ్ర‌హాలుగా ఒక‌టికి మూడ‌వుతాయని వీరు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు వైసీపీ ఇదే విగ్ర‌హ వ్య‌వ‌హారంపై కొత్త రాగం అందుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌కు ఏడాదికి వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేయ‌లేని కూట‌మి స‌ర్కార్.. సుమారు రెండు వేల కోట్ల‌తో ఈ ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని రివ‌ర్స్ లో వ‌స్తోంది. దీంతో పాటు ద‌ళితుల‌ను కూడా ఎగ‌దోసి.. మా సొమ్ముతో క‌మ్మ వారి కుల ప్ర‌తీక అయిన ఎన్టీఆర్ విగ్ర‌హం పెట్ట‌డ‌మేంట‌ని ఒక ర‌క‌మైన ప్ర‌చారం చేయిస్తోంది. కొంద‌రైతే క‌మ్మ‌వారికి ఎన్టీఆర్ విగ్ర‌హాలు పెట్టుకునేంత సొమ్ములు కూడా లేవా? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇదంతా ఇలా ఉంటే గ‌తంలో గుంటూరు ఎంపీ  గా ప‌ని చేసిన జ‌య‌దేవ్ గ‌ల్లా పార్ల‌మెంటులో బీజేపీ స‌ర్కార్ వేల కోట్ల‌తో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్, శివాజీ విగ్ర‌హాల వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.  వీట‌న్నిటి  న‌డుమ ఈ విగ్ర‌హాల వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్తుందో తేలాల్సి ఉంది.

వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీం కు డాక్టర్ సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసు లో ఆయన కుమార్తె సునీత మళ్లీ సుప్రీం మెట్లెక్కారు.  తన తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షిక అనుమతి మాత్రమే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సీబీఐ విచారణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నాంపల్లిలోని  సీబీఐ ప్రత్యేక కోర్టు ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.   దీనిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేవలం ఇద్దరి పాత్రపై మాత్రమే విచారణ జరపాలని  ఆదేశాలు ఇచ్చింది. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక విచారణకు ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చిందనీ, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదని సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ప్రస్తుత అప్లికేషన్తో పాటు పెండింగ్ లో  ఉన్న అన్ని పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వచ్చే మంగళవారానికి  వాయిదా వేసింది.

కెనడాలో భారీ చోరీ కేసు...ఇండియన్‌లో నిందితుడు

  400 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని విమానాశ్రయం నుంచే మాయం చేసిన హైటెక్ దోపిడీ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముఖ్యంగా కెనడా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన రూ. 160 కోట్లకు పైగా విలువైన గోల్డ్ హీస్ట్‌ కేసులో పోలీసులు మరో కీలక నిందితుడిని వేటాడి పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వెళ్తూ టొరంటో ఎయిర్‌పోర్టులో దిగగానే అరెసలాన్ చౌదరిని బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి, ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు వెల్లడవ్వడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.  కెనడా నేర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన సుమారు 20 మిలియన్ డాలర్ల విలువైన బంగారు దోపిడీ కేసులో కెనడా పోలీసులు మరో కీలక విజయాన్ని అందుకున్నారు. 'ప్రాజెక్ట్ 24K' పేరుతో జరుగుతున్న ఈ భారీ దర్యాప్తులో భాగంగా.. తాజాగా 43 ఏళ్ల వయసు కల్గిన అరెసలాన్ చౌదరి అనే వ్యక్తిని పీల్ రీజినల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి వస్తున్న ఇతడు.. టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  2023 ఏప్రిల్ 17వ తేదీన స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ నుంచి ఒక కార్గో విమానం టొరంటో విమానాశ్రయానికి చేరుకుంది. అందులో సుమారు 400 కిలోల స్వచ్ఛమైన బంగారం,  2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నాయి. అయితే విమానాశ్రయ ప్రాంగణంలోని ఒక సురక్షిత ప్రాంతానికి ఈ రవాణాను తరలించిన కొద్ది సేపటికే అది అదృశ్యం అయింది. ఎయిర్ కెనడా వ్యవస్థలను మోసం చేసి, నకిలీ పత్రాల ద్వారా పలువురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ (33) ప్రస్తుతం భారత్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన పనేసర్.. ఎయిర్‌లైన్ సిస్టమ్స్‌ను మార్చడం ద్వారా ఈ కార్గో షిప్‌మెంట్‌ను పక్కదారి పట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఇతడిని చండీగఢ్ శివార్లలోని ఒక అద్దె ఫ్లాట్‌లో గుర్తించినప్పటికీ.. అతడు తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పనేసర్ కోసం కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు.  ఈ భారీ దోపిడీకి సంబంధించి ఇప్పటి వరకు పది మందిపై ఆరోపణలు వచ్చాయి. వారిలో ఎక్కువ మంది భారత సంతతి వ్యక్తులే కావడం గమనార్హం. ముఖ్యంగా తాజాగా అరెస్టయిన అరెసలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర వంటి కేసులు నమోదు చేశారు. 2024 మేలో భారత్ నుంచి కెనడాకు వస్తుండగా అర్చిత్ గ్రోవర్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి పరంపాల్ సిద్ధూ, అమిత్ జలోటా, ప్రసాత్ పరమలింగం, అలీ రజా తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. మరో నిందితుడు దురాంటే కింగ్-మెక్లీన్ ప్రస్తుతం ఆయుధాల అక్రమ రవాణా కేసులో అమెరికా కస్టడీలో ఉన్నాడు.

వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్

  అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది.  పెదకూరపాటు సెగ్మెంట్ అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పుకొచ్చారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం (13-1-26) రోడ్డు పనులకు మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు.   ల్యాండ్ పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు కోరారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయించి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.  ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని తెలిపారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.

10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్

  దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది.  డెలివరీ బాయ్స్ డిమాండ్ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ ప్రకటనలు ఇవ్వొద్దని బ్లింకిట్ సహా అన్ని క్విక్ కామర్స్ సంస్ధలకు కేంద్రం సూచించింది.  కాగా  10 నిమిషాల నిబంధనను ఎత్తివేయాలంటూ కొత్త ఏడాదికి ముందు గిగ్ వర్కర్లు నిరసన చేపట్టారు.డెలివరీ బాయ్స్ తమ ప్రాణాలను పణంగా  ఆన్లైన్ డెలివరీ చేస్తున్నామని కానీ దానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని యూనియన్లు గతంలో ఆందోళన నిర్వహించాయి. 10 నిమిషాల్లో డెలివరీ చేయమని కోరడం అన్యాయం. ఇది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది" అని ఐఎఫ్ఏటి ప్రతినిధులు పేర్కొన్నారు. రైడ్-హెయిలింగ్ డ్రైవర్లకు కిలోమీటరుకు కనీసం రూ. 20 చెల్లించాలని రోజుకు 8 గంటల పనివేళలు ఉండాలి. అదనపు సమయం పనిచేస్తే 'ఓవర్‌టైమ్' కింద అదనపు వేతనం ఇవ్వాలని గిగ్ వర్కర్ల డిమాండ్ చేశాయి. ప్రమాదాలు, అనారోగ్యం సంభవించినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి.తమ కష్టానికి తగిన విలువ ఇవ్వాలని, రోడ్లపై ప్రాణాలకు భరోసా కల్పించాలని గిగ్ వర్కర్లు గట్టిగా కోరుతున్నారు.   

ఉత్తర భారతాన్ని గజగజలాడిస్తున్న చలి పులి... మైనస్ డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ఉత్తర భారతాన్ని చలి పులి గజగజలాడిస్తోంది. పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు తక్కువగా  ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఢిల్లీలో మంగళవారం (జనవరి 13) అత్యల్పంగా 2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఈ శీతాకాలంలో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత.  ఇక గాలిలో తేమ శాతం వంద శాతానికి చేరింది. ఇక పంజాబ్, హర్యానాలు కూడా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగ మంచుతో అల్లల్లాడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ఉత్తరాదిలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి.  పంజాబ్‌లోని భటిండాలో 0.6 డిగ్రీలు, అమృత్‌సర్, ఫరీద్‌కోట్‌లలో ఒక డిగ్రీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. అయితే గురుగ్రామ్ శివారు ప్రాంతాలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ పేర్కొంది.  కాగా  రాజస్థాన్‌లోని  ఫతేపూర్ శేఖావతిలో  మైనస్ 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి స్వగ్రామం  నారావారిపల్లెలో  మంగళవారం (జనవరి 13) సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సంబరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణి, ఇంకా నందమూరి కుటుంబ సభ్యులు గ్రామం అంతా కలియదిరుగుతూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు.   నారావారి పల్లెలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు.  ముగ్గులు పోటీలు, క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. అలాగే  ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని  సన్మానించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి  భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. 

గాదె ఇన్నయ్య నివాసం, ఆశ్రమంలో ఎన్ఐఏ సోదాలు

మావోయిస్టులతో సంబంధాలు, వారికి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల అరెస్టు చేసిన సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, ఆయన నిర్వహిస్తున్న మా ఇల్లు ఆశ్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మంగళవారం (జనవరి 13) సోదాలు నిర్వహించారు.  కుషాయిగూడ పరిధిలోని చక్రిపురంలోని  సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య నివాసం, జనగామలో ఆయన నిర్వహి స్తున్న అనాథాశ్రమంలో నిర్వహించిన తనిఖీలలో కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  మావోయిస్టులకు నిధుల సేకరణ, మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ మెంట్లు చేయడంతో పాటుగా ,  సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో గాదె ఇన్నయ్యను కొంత కాలం కిందట ఎన్ఐఏ అరెస్టు చేసింది.  ఇప్పుడు తాజాగా ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించింది.  మంగళవారం (జనవరి 13) తెల్లవారు జామునే గాదె ఇన్నయ్య ఇంటిని చుట్టుముట్టి ఆయన  డైరీలు, ఫోన్ కాల్ డేటా, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు. ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ ఎవరెవరు ఉంటున్నారు? ఆశ్రమానికి వస్తున్న నిధుల మూలాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు ఆరా తీశారు.  సోదాల అనంతరం కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.    ఇలా ఉండగా గాదె ఇన్నయ్యను ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది.  కోర్టు తీర్పు వెలువడక ముందే అధికారులు  సోదాలు నిర్వహించడం స్థానికంగా కలకలం రేపింది.

గోదావరి జిల్లాల్లో విహంగ వీక్షణం.. సంక్రాంతి స్పెషల్ హెలికాప్టర్ రైడ్

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అసలు సంక్రాంతి సంబరాలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు భావిస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో  ఈ సారి సంక్రాంతి సందడి మరో లెవెల్ కు చేరేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. గోదావరి అందాలను, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది సంగమ స్థలిలి, అలాగే కోనసీమ కొబ్బరి చెట్ల సోయగాలను విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తున్నది.  హైదరాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్‌   ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పండుగ కోసం తరలివచ్చే ప్రయాణీకులకు హెలికాప్టర్ రైడ్ ద్వారా గోదావరి అందాలు వీక్షించే అవకాశం కల్పిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా పండుగ  మూడు రోజులూ ఈ హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుంది. పాతిక నిముషాల సేపు సాగే ఈ రెడ్ కోసం మనిషికి ఐదు వేల రూపాయలుగా ధర నిర్ణయించారు.  పశ్చిమగోదావరి జిల్లా న  సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుండి హెలికాప్టర్ రైడ్‌ ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పాతిక నిముషాల పాటు ఉండే ఈ హెలికాప్టర్ రైడ్ లో అంతర్వేది ఆలయం, సముద్రం, గోదావరి కలిసే సంగమ స్థలం, అలాగే గోదావరి పాయలు కలిసే అన్నా చెళ్లెల్ల గట్టు, కోనసీమ కొబ్బరి తోటల అందాలు వీక్షించవచ్చు.  

ఉద్యోగులు, పెన్షనర్లకు బాబు సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ బహుమతి ప్రకటించింది. దీర్ఘ కాలంగా ఉన్న బకాయిలను చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి పడిన 2, 653 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధుల విడుదల కు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ ఉత్తర్వులతో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు   మౌలిక సదుపాయాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు  కూడా ఉపశమనం లభిస్తుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులు , పెన్షనర్లకు   లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేయడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజేంద్రనగర్ గ్రీన్ సిటీ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గౌడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ లో భారీగా ప్లాస్టిక్ నిల్వలు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువైంది. ప్లాస్టిక్ కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్లాస్టిక్ కాలి పొగ వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.   సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  ప్రమాద కారణాలు వెంటనే తెలియరాక పోయినప్పటికీ,  షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు.  ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించిందని తెలుస్తోంది. 

సామ్రాజ్యవాద విస్తరణ.. అమెరికా పెడధోరణులపై ప్రపంచ దేశాల ఆగ్రహం

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విపరీత పోకడలు పోతున్నారు. తాను ఒక్క అమెరికాకే కాదనీ, ప్రపంచదేశాలకూ అధినేతనేనన్న అహంకారంతో విర్రవీగుతున్నట్లు కనిపిస్తున్నది. సామ్రాజ్యవాద, ఆక్రమణ  ధోరణులను  ఇష్టారీతిగా ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇప్పుడాయన చూపు గ్రీన్ ల్యాండ్ పై పడింది. ఇప్పటికే వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనని తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్  ఇక గ్రీన్ ల్యాండ్ కు కూడా తానే అధిపతిని అని ప్రకటించడానికి రెడీ అయిపోతున్నారు.   ఇది మన్రో సిద్ధాంతానికి అనుగుణంగా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం  రెండు అమెరికా ఖండాల పై ఏ దేశం కూడా తమ వలసలను విస్తరించడానికి అనుమతించబోదు. ఈ సిద్ధాంతాన్ని  1823లో అప్పటి అమెరికా అధ్యక్షుడు మన్రో ప్రకటించి అమలు చేశారు. కాలం చెల్లిన ఆ సిద్ధాంతాన్నే ఇప్పుడు ట్రంప్ మన్రో సిద్దాంతం కాదు.. టన్రో  సిద్దాంతం అంటూ ఆక్రమణ కు తెరతీశారు.  గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించి తీరుతామని ట్రంప్ చేసిన ప్రకటనపై  డెన్మార్క్,గ్రీన్ ల్యాండ్ లు రగిలిపోతున్నాయి. డెన్మార్క్ ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ఇప్పుడు డెన్మార్ పాక్షిక ఏలుబడిలో ఉంది.   ఇలా ఉండగా అమెరికా తాటాకు చప్పుళ్లకు బెదరమని, పోరాటానికి సిద్ధమని గ్రీన్ లాండ్ తెగేసి చెప్పింది.  తాముగ్రీన్ లాండర్లు..డానిష్ పౌరులుగా నే  కొనసాగుతామని కుండబద్దలు కొట్టేసింది.   అది పక్కన పెడితే నాటో కూటమి లో భాగమైన డెన్మార్క్ అమెరికా దాడిచేస్తే నాటో నాశనం ఖాయమని తేల్చిచెప్పింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన రక్షణ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని హెచ్చరించింది. 500 ఏళ్లుగా డెన్మార్క్ గ్రీన్ లాండ్ లు కలిసి ఉంటున్నాయి. అయితే అంత మాత్రాన గ్రీన్ లాండ్ డెన్మార్క్ భూ భాగం ఎలా అవుతుందని ట్రంప్ అంటున్నారు.   అమెరికా రక్షణ కోసం తమకు గ్రీన్ ల్యాండ్ అవసరమని ట్రంప్ చెబుతున్నారు.  ట్రంప్ ఏం చెప్పినా ఆయా దేశాలలోని సహజ వనరులపై గుత్తాధిపత్యం కోసమే అమెరికా తన సామ్రాజ్య విస్తరణకు మన్రో, టన్రో అంటూ కొత్త కొత్త పేర్లు, ఎత్తుగడలతో సాగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు.  ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ పతనంతో అమెరికా ఏకైక అగ్రరాజ్యం గా ఆవిర్భవించింది. ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు  పుతిన్ వ్యూహాత్మక అడుగుల కారణంగా రష్యా కూడా శక్తిమంతమైన దేశంగా ఏర్పడింది. అలాగే బలీయమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఇప్పుడు రష్యా, చైనాలు కలిస్తే.. తన ఆధిపత్యానికి గండి పడటం ఖాయమన్న భయంతోనే అమెరికా అడ్డగోలుగా దేశాలలో అశాంతిని రగిల్చి ఆక్రమణల బాట పట్టిందంటున్నారు.  అత్యధిక వనరులున్న ప్రాంతాలను, దేశాలను  కైవసం చేసుకుని తిరుగులేని శక్తి అమెరికా అని చాటాలని చూస్తోంది. అయితే అమెరికా, ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ధోరణులను ప్రపంచదేశాలు గర్హిస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే అమెరికాకు పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో పలు జిల్లాలకు కొత్త జేసీలు.. ఐఏఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు  కొత్త జాయింట్ కలెక్టర్లను  నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా కొత్త జేసీలు నియమితులైన జిల్లాలలో  ఇటీవలే కొత్తగా ఏర్పాటైన   మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులును మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. అలాగే  చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిళ్ల విధ్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గానూ, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రన్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్న గోవిందరావును  టుడా  వైస్ చైర్మన్‌గా నియమించింది. ఆయనకు తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోణంకిని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు.   పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వి. సంజన సింహాను ప్రభుత్వం నియమించింది.   రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్‌కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. 

లక్ష వీసాలు రద్దు.. అమెరికా సంచలన నిర్ణయం

దేశ భద్రతకు ప్రథమ తాంబూలం అన్న విధానంలో భాగంగానే ట్రంప్ సర్కార్ కఠినాతి కఠినమైన వలస విధానాలను అనుసరిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.   అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది.  జాతీయ,   ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ.. రద్దు చేసిన వీసాలలో 8 వేలవిద్యార్థి వీసాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్పెషల్ టాలెంట్ వీసాలు పాతిక వందలు ఉన్నాయని వివరించింది.   వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడటం వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.  అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండేలా  కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.  

పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు సైతం ఈ డీఏను వర్తింప చేయనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఈ డీఏ కింద నిధులు చెల్లించనున్నారు. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి ఈ డీఏను ప్రభుత్వం సవరించిన విషయం విదితమే. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు భారాన్ని మాపై మోపి వెళ్లినా, ఉద్యోగులకు మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోంది. సంక్రాంతి కానుకగా డీఎ ఫైల్ పై సంతకం చేసి డైరీ ఆవిష్కరణకు వచ్చామని  తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్‌ను ఆవిష్కరణ సందర్బంగా  సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ప్రతి ప్రభుత్వం ఉద్యోగీ ఇందులో భాగస్వామ సీఎం స్ఫష్టం చేశారు. మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్  సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

టీడీపీ నేత అప్పల సూర్యనారాయణ మృతి పట్ల లోకేష్ సంతాపం

   శ్రీకాకుళం టీడీపీ సీనియర్ నేత గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియశారు. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిదని. ముక్కుసూటి, నిజాయితీకి మారుపేరైన గుండ అప్పల సూర్యనారాయణ గారు నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. గుండ అప్పల సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాని లోకేష్ పేర్కొన్నారు.  అప్పల సూర్యనారాయణ  ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. దీంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు. నాలుగు సార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా సూర్యనారాయణ సేవలు అందించారు. టీడీపీ నుంచి 1985 నుంచి 2004 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో మంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన భార్య గుండ లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

చలాన్లు పడ్డ వెంటనే అకౌంట్ నుండి డబ్బులు కట్ కావాలి : సీఎం రేవంత్‌

  ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోలీసులకు కీలక సూచన చేశారు. వాహన చలానా పడితే ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీ వాడండి అని ముఖ్యమంత్రి తెలిపారు.హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని తెలిపారు. చలాన్లు విధించడం కాదు, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించాలని ముఖ్యమంత్రి వెల్లడించారు.  చలాన్లు విధిస్తే డిస్కౌంట్ ఇవ్వవద్దని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారణకు అవసరమైన ప్రణాళికను చేపట్టిన పోలీస్ శాఖను అభినందిస్తున్నాని తెలిపారు.   దేశంలో ప్రతీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతోంది. విద్యార్థి దశలోనే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో నేరాల విషయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నామని... ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. అందుకే సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది.. యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.  రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు కూడా బిడ్డలను కోల్పోయి దుఃఖంలో మునిగిపోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని..సైబర్ క్రైమ్, డ్రగ్స్, హత్యల కంటే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అతి పెద్ద సమస్యగా మారాయిని తెలిపారు.  సిగ్నల్, ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన కల్పించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్ఫష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణను టాప్ ప్రయారిటీగా తీసుకుని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

నారావారిపల్లె‌కు చేరుకున్నా సీఎం చంద్రబాబు

  సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. రంగంపేట వద్ద చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు  గ్రామస్తులు పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఘనస్వాగతం పలికికారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు...ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకున్నారు.  సోమవారం మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మంగళవారం నారావారిపల్లెతో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.  ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు...శంకుస్థాపనలు మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.  నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌ స్టేషన్‌, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్‌, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.    మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్‌కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.  నాగాలమ్మకు ప్రత్యేక పూజలు 15వ తేదీన తమ గ్రామ దేవతైన నాగాలమ్మ గుడికి కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున నారావారిపల్లె నుంచి అమరావతికి చేరుకుంటారు.    

వచ్చే నెలలో పెళ్లి...యూఎస్ అదుపులో భారత్ నేవీ ఆఫీసర్

  వెనిజులాపై దాడి నేపధ్యంలో యూఎస్ ప్రభుతం ఆ దేశానికి రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా నౌకతో పాటు మరో దాన్ని సీజ్ చేసింది. మ్యారినెరా నౌకా సిబ్బందిలో ముగ్గురు ఇండియన్స్ ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. వారు హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవాకు చెందిన వారు కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రక్షిత్ చౌహాన్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్‌కు వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది.  చౌహాన్‌ను రష్యా సంస్థ తొలిసారి సముద్రం విధులకు.. అది కూడా వెనిజులాకు పంపింది. ఆ క్రమంలో జనవరి 7న చివరిసారి చౌహాన్‌తో మాట్లాడామని ఆయన కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను అదుపులోకి తీసుకున్నాయి. అది తెలిసి రక్షిత్ చౌహాన్ తల్లి రీతాదేవి తన కొడుకు వివాహాన్ని ఫిబ్రవరి 19న నిశ్చయించామని, అతను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండని ప్రధాని మోడీని అభ్యర్ధించింది. ఈ పరిణామాలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పందించి చర్యలు చేపడుతోంది.