ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వైఐఐఆర్‌ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేన‌న్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు స్కూల్స్ కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాల‌న్నారు.  విద్యా శాఖ‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో  ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేప‌ట్టే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు.  త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు సీఎంకు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు  తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు ముఖ్య‌మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  బాచుప‌ల్లి పాఠ‌శాల స్థ‌లం కేవ‌లం అర ఎక‌రం మాత్ర‌మే ఉండ‌డంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎక్క‌డైనా పాఠ‌శాల‌కు క‌నీసం ఎక‌రంన్న‌ర స్థ‌లం ఉండాల‌ని, బాచుపల్లి ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లం స‌మీపంలో ఎక‌రంన్న‌ర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయన సూచించారు.  పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాల‌ని  ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న ఉండాల‌ని సీఎం అన్నారు.  ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్‌ మొలుగారం కుమార్‌, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌.సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.     

సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు  దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు.  అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్నా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ 13 లక్షలమంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం.  2024-25లో డ్వాక్రా సంఘాలు రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అభినందిస్తున్నాను. ఈ ఎక్స్‌పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.  సరస్ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు మార్కెట్ లింకేజీ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.  ఆడబిడ్డలతో ప్రత్యేక అనుబంధం ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్నా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు.  2024-25లో రూ. 46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.  నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్ ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు.  డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు.  ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు. ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం.  ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.  సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా రూ.1,375 కోట్ల చెక్కును సీఎం అందించారు. సెర్ప్ నుంచి రూ.2171 కోట్లను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీరను కొనుగోలు చేశారు.  భర్తకు ఆరోగ్యం బాగోలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.     

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో ఆశోక్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  అభ్యర్థులను చెదరగొట్టిన పోలీసులు.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే వారందరినీ విడుదల చేసి, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని   తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా  నిరుద్యోగులకు కవిత సంఘీభావం తెలిపారు

కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు...ఎందుకంటే?

  మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు మంత్రులు ఆయన నివాసాన్ని సందర్శించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆకాంక్షరెడ్డి కలిసి కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానాలు అందజేసినప్పటికీ కేసీఆర్‌ను ఎదురుగా కలుసుకునే అవకాశం రాలేదని మంత్రి సీతక్క అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయన వద్దకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం ఇచ్చామని తెలిపారు. ఆదివాసుల గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అయిన మేడారం మహాజాతరకు తప్పకుండా రావాలంటూ కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మకు ఆహ్వానం అందజేశారు. తల్లుల బంగారం, వస్త్రాలను అందించి గౌరవించారు. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించడంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజకీయాలకది సమయం కాదని, రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతరకు ప్రతి ఒక్కరూ రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా మేడారం మహాజాతరకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు.  

పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

  తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని పేర్కొంది. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.   అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికపోయారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే  టీటీడీ విజిలన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేసుకోవడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది

దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్రం నోటిఫికేషన్

  దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం(8-1-26) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు.  దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తుస్తారు. కానీ కొవిడ్ కారణంగా.. ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనన గణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  అందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనుంది. ఈ జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం

  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం ఊరటనిస్తూ బెయిల్  మంజూరు చేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా ప్రధాన నిందితులతో పాటు శ్రవణ్ కుమార్‌కు కూడా నల్లగొండ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం.. శ్రవణ్ కుమార్ వయసును, ఆయన ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. వేర్వేరు కులాలకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణిలు పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన కుమార్తె తక్కువ కులస్తుడిని పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించిన అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ను అంతం చేయడానికి కోటి రూపాయల సుపారీతో కిరాయి హంతకులను నియమించాడు. 2018 సెప్టెంబర్ 14న, గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె కళ్ల ముందే కిరాయి హంతకుడు ప్రణయ్ మెడపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. సిసిటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ కేసులో మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హంతకుడు సుభాష్ శర్మతో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ దశలో ఉండగానే, 2020 మార్చిలో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులకు నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది

రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

  సంక్రాంతి పండుగ వేళ ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను పోలీసులు సీజ్ చేయగా, ఈ వ్యవహారంలో 143 మందిని అరెస్టు చేసి 103 కేసులు నమోదు చేశారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, ఆనందోత్సాహాల వేళ. అయితే ఈ సంబరాలు మరొకరి ప్రాణాలకు ముప్పుగా మారకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిషేధించిన నైలాన్, సింథటిక్, మెటాలిక్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాపై నగర పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్ని జోన్లలో ఒకేసారి దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన, విక్రయానికి సిద్ధంగా ఉన్న మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ప్రెస్ మీట్‌లో సీపీ సజ్జనర్ హెచ్చరిక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక హెచ్చరికలు జారీ చేశారు.“సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ. కానీ మన ఆనందం మరొకరి ప్రాణాలకు ప్రమాదంగా మారకూడదు. చైనీస్ మాంజా వల్ల పిల్లలు, వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అందుకే ప్రభుత్వం చైనీస్ మాంజాపై సంపూర్ణ నిషేధం విధించింది.  నిషేధాజ్ఞలు ఉన్నా కొందరు అక్రమంగా వీటి విక్రయాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఎక్కడైనా చైనా మాంజాను విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం,” అని స్పష్టం చేశారు. దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయడంతో కొందరు వ్యాపారులు ఆన్‌లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అక్రమ విక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  ఆన్‌లైన్‌లో చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉన్న మాంజా వల్ల విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలతో తయారైన మాంజాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా మాంజా విక్రయిస్తే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555కి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నగరవ్యాప్తంగా  దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు కాగా, 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేశారు. సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు చేసి, 35 మందిని అరెస్టు చేసి రూ.37.22 లక్షల విలువైన 1,861 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌లో 18 కేసులు నమోదు కాగా, 29 మంది అరెస్టు, రూ.6.02 లక్షల విలువైన 301 బాబిన్లు సీజ్ చేశారు.సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు, 10 అరెస్టులు, రూ.4.42 లక్షల విలువైన 221 బాబిన్లు స్వాధీనం అయ్యాయి. సెంట్రల్ జోన్‌లో 6 కేసులు, నార్త్ జోన్‌లో 5 కేసులు, వెస్ట్ జోన్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి.ఈ మొత్తం ఆపరేషన్‌లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. మొత్తం నమోదైన కేసుల్లో 67 కేసులు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే నమోదు కాగా, 87 మందిని అరెస్టు చేసి రూ.68.78 లక్షల విలువైన నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనర్  అధికారులను, సిబ్బందిని అభినందించి నగదు బహుమతులు అందజేశారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలు నగరవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అవసరమైతే సంక్రాంతి ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ

పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.  ఈ ఫెస్టివల్ నిర్వహణ తొలి సారిగా గత ఏడాది నిర్వహించినట్లు తెలిపిన ఆయన ఈ ఏడాది జనవరి 10, 11 తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు వివరించారు.   పులికాట్ సరస్సు వద్ద సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. పర్యాటక   అభివృద్ధి  లక్ష్యంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్–2026 పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురువారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. తిరుపతి  తారకరామ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని పలు ప్రధాన రహదారుల గుండా సాగింది.ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఫ్లెమింగో పక్షుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.

అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు

  అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్‌లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు.  బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై దృష్టి సారించిన సిట్, కీలక నేతలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు నేతలను ప్రశ్నించిన సిట్, తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను విచారణ కు పిలిచింది. నోటిసీలకు స్పందించిన జైపాల్ యాదవ్ సిట్ ఎదుట హాజరై వివరాలు వెల్లడించారు.గత ఏడాది నవంబర్ 17న కూడా జైపాల్ యాదవ్ సిట్ విచారణకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.  అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తాజా విచారణలో వెల్లడైన అంశాలను సిట్ సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుప తన్నతో జైపాల్ యాదవ్‌కు ఎన్నికల సమయంలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. ఆ కాల్స్  ఉద్దేశం, పరిస్థితులపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఒక కేసుకు సంబంధించి భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యపై తిరుపతన్నతో జైపాల్ యాదవ్ మాట్లాడి నట్లు సిట్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంభాషణలు వ్యక్తిగత అంశాలకే పరిమితమా? లేక అధికార దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి, కాల్ డేటా రికార్డులు, టైమింగ్, కాల్ వ్యవధి వంటి అంశాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ జరుగు తున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో సిట్ అధికా రులు జైపాల్ యాదవ్ నుంచి విస్తృతంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.  కేసుకు సంబంధించిన అన్ని కోణాలను స్పష్టంగా తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.ఇదే సమయంలో బీఆర్‌ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా పలువురు నేతలు, అధికారులు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.

అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు యువకుడు హల్‌చల్

  హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం ముందు ఓ యువకుడు నానా రచ్చ రచ్చ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు భారీ కేట్లను ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో తర్బీజ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోడ్డు బ్లాక్ కావడంతో ఆగ్రహా నికి గురైన యువకుడు తర్బీజ్, మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి గేటును కొడుతూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వికేసింగ్ గేటు ముందు హల్చల్ సృష్టిస్తున్న యువకుడిని భద్రతా సిబ్బంది గమనించారు. యువకుడు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.  ఈ సమయంలో తర్బీజ్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే యువకుడు తర్బీజ్, “500 మందితో నీ ఇంటిపైకి వస్తా” అంటూ మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్‌ను బెదిరించాడు.  అర్ధరాత్రి సమయంలో హడావుడి సృష్టించిన యువకుడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ పర్సనల్ సెక్రటరీ జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. యువకుడి ప్రవర్తన, నేపథ్యం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.  

ఆస్తులు పెరుగుదల అంటే వైసీపీ ఎంపీలదే!

  టీడీపీ ఎంపీల పనితీరు శాతంలో ఎంత పెరుగుదల ఉందో తెలీదు. కానీ, వారి వారి ఆస్తుల్లో మాత్రం భారీ పెరుగుదల ఉన్నట్టు కనిపించింది. వీరిలో టాప్ ఎవరు? బాటమ్ లో ఎవరున్నారని చూస్తే.. వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 మధ్య కాలం వరకూ తన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. వాటి ప్రకారం చూస్తే 2014లో ఆయన పోటీ చేసినపుడు ఆస్తుల విలువ రూ. 22. 59 కోట్లు కాగా.. 2024 ఎన్నికల నాటికి వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. రూ. 146. 85 కోట్లకు చేరుకుంది. అంటే ఈ పదేళ్ల కాలంలో మిథున్ రెడ్డి ఆస్తి రూ. 124. 25 కోట్ల వరకూ పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్ దేశంలోనే థార్డ్ ప్లేస్ లో నిలిచారు. 2014 నుంచి 19 వరకూ మిథున్ ఆస్తుల విలువ రూ. 44 కోట్లు పెరగగా.. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో రూ. 80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రూ. 47. 54 కోట్ల చరాస్తులు రూ. 99. 30 కోట్లు స్థిరాస్తులున్నాయి. అదే సమయంలో 56. 09 కోట్ల వరకూ అప్పులు కూడా ఉన్నట్టు అఫిడవిట్ లో సమర్పించారు. మొత్తానికి ఈ పదేళ్లలో మిథున్ రెడ్డి ఆస్తులు సుమారు 550 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2014 నుంచి 2024 వరకూ లోక్ సభ ఎన్నికల మధ్య తిరిగి ఎంపికైన ఎంపీల ఆస్తుల వివరాల విశ్లేషణ చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. దీని ప్రకారం చూస్తే.. అత్యధికంగా ఆస్తులు పెరిగిన సిట్టింగ్ ఎంపీల్లో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఒకరు. అవినాష్ ఆస్తులు 2014లో రూ. 7 కోట్ల మేర ఉండేవి. అదే 2019 నాటికి రూ. 18 కోట్లకు పెరిగాయి. ఇక 2024 నాటికి ఈ ఆస్తుల విలువ రూ. 40 కోట్లకు చేరాయి. ఆస్తుల వృద్ధి పరంగా చూస్తే ఈయన 15వ స్థానంలో ఉన్నారు. ఇక అవినాష్‌రెడ్డి ఆస్తుల పెరుగుదల శాతం 474గా ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలోనే ఎంపీల ఆస్తుల శాతంలో టాప్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా 804 శాతంతో టాప్ లో ఉండగా.. 532 శాతంతో రెండో స్థానంలో ఉన్న పార్టీ వైసీపీ.  ఎంఐఎం పార్టీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు ఈ పదేళ్లలో 488 శాతం పెరిగింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల ప్రకారం- 24వ స్థానంలో నిలిచారు అసద్. టీడీపీ తరఫున గత మూడు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి ఆస్తుల పెరుగుదల ఎలా ఉందో చూస్తే- 177 శాతం మేర పెరిగాయి. ఆస్తుల పెరుగుదల జాబితాలో రామ్మోహన్ 28వ స్థానంలో ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలిచిన 102 మంది ఎంపీల ఆస్తుల విలువ పదేళ్లలో సగటున 110 శాతం పెరగ్గా, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆస్తి మాత్రం తగ్గిపోయింది. గుజరాత్ లోని నవ్ సారీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడో సారి దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వచ్చిన ఆయన ఆస్తి 2014లో 74. 47 కోట్లుండగా 2019 నాటికది రూ. 44. 06 కోట్లకు, 2024 నాటికి రూ. 39. 49 కోట్లకు పడిపోయింది. పదేళ్లలో ఆయన ఆస్తి 47 శాతం మేర తగ్గినట్టు గుర్తించారు. ADR రిపోర్ట్ ప్రకారం గత మూడు ఎన్నికల్లో బీజేపీ నుంచి వరుసగా గెలిచిన 65 మంది ఎంపీల ఆస్తులు సగటున 108 శాతం పెరగ్గా.. కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎంపీల ఆస్తులు 135 శాతం వృద్ధి చెందాయి. రాహుల్ ఆస్తుల విషయం చూస్తే.. రూ. 10. 99 కోట్ల పెరుగుదల నమోదైంది. 2014లో రూ. 9. 40 కోట్ల మేర ఉన్న ఆస్తులు 2019 నాటికి రూ. 15. 88 కోట్లు పెరిగాయి. ఇవే ఆస్తులు 2024 నాటికి రూ. 20. 39 కోట్లకు చేరాయి. ఈ మొత్తం శాతంలో చూస్తే 117 పర్సెంట్ హైక్ కనిపించింది. ఆస్తులు పెరిగిన ఎంపీల లిస్టులో రాహుల్ 38వ స్థానంలో నిలిచారు. ఇక ప్రధాని మోడీ ఆస్తులు 82 శాతం మేర పెరిగినట్టు కనిపించింది. 2019లో రూ. 1. 65 కోట్లున్న మోడీ ఆస్తుల విలువ 2019నాటికది రూ. 2. 15 కోట్లకు, 2024నాటికది రూ. 3. 02 కోట్లకు పెరిగాయి. ఆస్తులు పెరిగిన ఎంపీల్లో మోడీ 94 వ స్థానంలో నిలిచారు. అత్యధిక ఆస్తుల విలువ పెరిగిన టాప్ టెన్ ఎంపీల్లో ఐదుగురు బీజేపీ వారే ఉండటం గమనార్హం.  

భరతమాత కాళ్ల వద్దకు తీసుకొచ్చి పడేస్తా… యూట్యూబర్ అన్వేష్ పై ఉక్రెయిన్ మహిళ ఆగ్రహం

భారత సంప్రదాయాలు, సనాతన ధర్మంపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారు తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల యూట్యూబర్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విదాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళ మండి పడ్డారు.  తనకు అనుమతిస్తే యూట్యూబర్ అన్వేష్ ను  భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడేస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఉక్రెయిన్ మహిళ భారత సంప్రదాయాలు, సనాతన ధర్మానికి మద్దతుగా నిలబడటం విశేషం.  ఉక్రెయిన్‌లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడిన లిడియా లక్ష్మి   ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేశారు.   హిందూ ధర్మం, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ తనను ఎంతో ప్రభావితం చేశాయని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు.భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ, సనాతన ధర్మంపై అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేకుండా, కేవలం వ్యూస్ కోసం చేసే వ్యాఖ్యలు భారతదేశ సంస్కృతిని కించపరు స్తున్నాయంటూ  అంటూ లిడియా లక్ష్మి యూట్యూబర్ అన్వేష్ పై మండిపడ్డారు. యూట్యూబ్ వేదికగా భారతీయ సంప్రదాయాలు, సనాతన ధర్మంపై అన్వేష్ చేసిన వ్యాఖ్యల పట్ల  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిడియా లక్ష్మి.. “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రస్తుతం థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న లిడియా లక్ష్మి, అన్వేష్ మరో దేశానికి పారిపోయే అవకాశం ఉందనీ, అతడిపై సరైన సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు.  లిడియా లక్ష్మి  యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విడుదల చేసిన చేసిన వీడియో   సోషల్ మీడియాలో వైరల్  అయ్యింది. నెటిజనులు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు.  విదేశీ మహిళ అయినప్పటికీ భారతీయ సంస్కృతి పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతకు ఫిదా అవుతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ  డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై పెద్ద చర్చ మొదలైంది. విదేశీయులే సనాతన ధర్మ విలువలను గౌరవిస్తుంటే, దేశంలోనే కొందరు వాటిని కించప రచడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినీనటి కరాటే కళ్యాణి నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?..

తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలొ ఓ  గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని బుధవారం (జనవరి 7) మీడియా ముందు ప్రవేశ పెట్టారు.   ఈ నెల 4న సామాజిక మాధ్యమంలో తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం సీసాలు అంటూ, ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖాళీ మద్యం సీసాలను  వైసీపీ నేతలు,  ఆ పార్టీకి చెందిన   మీడియా వ్యక్తులు  కుట్రపూరితంగా తిరుపతి నుంచి తీసుకువచ్చి కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పొదల్లో పడేశారని తేల్చారు.   వైసీపీ   మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు   కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు. అలాగే    ఎక్సైజ్ డిపార్టుమెంటు  సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా,  వాటిని కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు.  తిరుమల పవిత్రతను దెబ్బతీసి.. తద్వారా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే  వైసీపీ నేతలు ఈ పని చేశారని నిర్ధారించారు.  సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ నివేదిక, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్‌ సహా ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రను ఛేదించినట్లు తిరుపతి పోలీసులు మీడియాకు వివరించారు.  ఈ కేసుకు సంబంధించి    వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా   కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నామనీ తెలిపారు. ఇలా ఉండగా అరెస్టు చేసిన ఇద్దరినీ,  కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. 

స్టీల్ ప్లాంట్ భూములపై లోకేష్ క్లారిటీ

  విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని  మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు.  బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు.  భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు

ఆహార కల్తీకి పాల్పడితే కేసులే : సీపీ సజ్జనార్

  హైదరాబాద్‌లో జరుగుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కల్తీ ఆహారాన్ని తయారుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కల్తీ నిరోధానికి పోలీస్‌ శాఖ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠినంగా ఎస్‌వోపీ అమలు చేస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి కల్తీకి పాల్పడే వ్యాపారులపై లైసెన్సులు రద్దు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు.