కారు బీభత్సం... ఇద్దరు మృతి

హైదరాబాద్ శివారులో  బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారు జామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ శివారు  మైలార్ దేవుని పల్లి ప్రాంతంలో ఈ ఉదయం ఐదు గంటల సమయంలో  అతి వేగంగా దూసుకొచ్చిన  కారు అదుపుతప్పి రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించే దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆ దుకాణంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. మరొ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో తండ్రి ప్రభుమహరాజ్, అతని ఇద్దరు కుమారులు దీపక్, సత్తునాథ్ లు నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో దీపక్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తండ్రి ప్రభు మహరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.  ప్రభు మహరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి మైలార్ దేవుపల్లిలో దుప్పట్లు, రగ్గుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.   కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెడుతుండగా అదుపుతప్పిందనీ, సంఘటన జరిగిన తరువాత కారులో ఉన్నవారిలో ముగ్గురు పారిపోగా, మిగిలిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.  

ఐపీఎల్ కు కరీంనగర్ ప్లేయర్ అమన్ రావు

కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చోటు దక్కించుకున్నాడు. మంగళవారం జరిగిన వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రూ. 30 లక్షలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపిక కావడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది.  హైదరాబాద్‌ అండర్‌ 23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో 160 స్ట్రైక్‌ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అమన్‌రావుది క్రీడా, రాజకీయ  నేపథ్యం ఉన్న కుటుంబం. అమన్ రావు తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్‌గా ఆడారు. ఆయన తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.అమన్ రావు  స్వగ్రామం సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి కాగా, కొన్నేళ్లుగా వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో మంచి ప్రతిభ కనబరిచాడు. అయినా దుబాయ్ లో జరిగే వేలంలో పాల్గొనేందుకు అమన్ రావు వద్ద పాస్ పోర్టు కూడా లేకపోవడంతో, విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని తనకు పాస్ పోర్టు జారీ చేయించారు. దీంతో అమన్ రావు ఐపీఎల్ వేలంలో పాల్గొనగలిగారు.  

చలిపులి పంజా.. తెలంగాణ గజగజ

తెలంగాణ ను చలిపులి గజగజలాడిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో  జనం చలికి వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో మంగళవారం (డిసెంబర్ 16) అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి ప్రభావం జనజీవనంపై పడుతోంది. ఉదయం 9 గంటలు దాటినా ఇళ్ల లోంచి బయటకు రావడానికే జంకే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది.  ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు  శేరిలింగంపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.    ఉదయం 9 గంటల వరకు కూడా చలి తగ్గకపోవడం, సాయంత్రం 5 గంటల నుంచే  చల్ల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ రహదారులను దట్టమైన పొగ మంచు కమ్మేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా గురువారం (డిసెంబర్ 18)  నుంచి రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదౌతాయని పేర్కొంది. చలి నుంచి రక్షణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

మా ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి...వైసీపీ వస్తే ఉద్యోగాలు పోతాయి : చంద్రబాబు

  మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోం మంత్రి అనిత నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై వేసిన కేసులను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి. వేరేవాళ్లు వస్తే.. ఉద్యోగాలు పోతాయిని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని  చంద్రబాబు స్పష్టంచేశారు.  కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లు నిజాయితీతో మరియు నిబద్ధతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు   పోలీసు వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మరియు త్యాగాలను గుర్తు చేసుకున్నారు  శిక్షణ కాలంలో కానిస్టేబుళ్లకు స్టైఫండ్‌ను ₹4,500 నుంచి ₹12,500 వరకు  పెంచినట్లు  సీఎం తెలిపారు. 2022 లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపట్టినా, గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అనిశ్చితి తర్వాత ఇప్పుడు ఉద్యోగాలు సాధించడం  ఆనందంగా ఉందని   కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.  నా హయాంలో 23 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇచ్చినా, మేం కానిస్టేబుల్‌ నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాం. శాంతి భద్రతల విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడను’’ అని సీఎం స్పష్టం చేశారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాలు, ముఠా రాజకీయాలు ఉండేవని, చంపుకోవడమే పరిపాటిగా ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు. ‘‘తీవ్రవాదాన్ని నేను ఎప్పుడూ ఉపేక్షించలేదు. తీవ్రవాదాన్ని అణిచివేసినందుకు నాపై క్లైమోర్‌ మైన్స్‌తో దాడులు కూడా జరిగాయి’’ అని తెలిపారు.‘ రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారు. పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కానిస్టేబుల్‌ బాబురావు తమ గ్రామానికి రోడ్డు లేదని సభలో తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. తిమ్మలబండ–వెలుగురాతిబండ మధ్య రహదారి నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు విషయం తెలియజేశానని తెలిపారు. ‘‘ఆ రోడ్డు నిర్మాణానికి పవన్‌ కల్యాణ్ రూ.3.90 కోట్లు మంజూరు చేశారు’’ అని సీఎం వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ నెల 22 నుంచి కొత్త కానిస్టేబుళ్లకు 9 నెలల శిక్షణ ప్రారంభం కానుంది.

ఐ బొమ్మ రవికి... 12 రోజుల కస్టడీ

  ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఐ బొమ్మ రవిని12 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇప్పటికే రవిని రెండు దఫాలుగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒకవైపు రవి పై నమోదైన నాలుగు కేసుల విషయంలో కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. రవికి బెయిల్ ఇవ్వకూడదని అతనిపై నమోదైన నాలుగు కేసుల్లో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకా శాలు ఉన్నాయని కస్టడీ కి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు నాంపల్లికోర్టు విచారణ జరిపి ఐ బొమ్మ రవిని మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీ కి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది..  ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఈనెల 18వ తేదీ నుండి ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. హాయ్ బొమ్మ వెబ్సైట్ నిర్వహణ పైరసీ ఆరోపణలు ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టనున్నట్లు గా సమాచారం ... ఏది ఏమైనప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు మరో పన్నెండు రోజులు రవిని కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేయనున్నారు...

గీతం యూనివర్సిటీ కరెంటు బకాయిలు రూ.118 కోట్లు...హైకోర్టు సీరియస్

  సామాన్య ప్రజలు ఒక నెల కరెంట్ బిల్లు కట్టకపోతే మరుసటి నెల అధికారులు ఏకంగా ఇంటికి వచ్చి   కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. అదే ఓ యూనివర్సిటీ ఏళ్ల తరబడి కరెంటు బిల్లు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల బకాయి పడ్డారు. అయినా కూడా అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు కూర్చున్నారు. కొన్ని కోట్ల రూపా యల బకాయి పడడంతో చివరకు అధికారులు తెరుకొని ఆ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేశారు...  అయ్య బాబోయ్ అన్ని కోట్లు మేము కట్టలేమంటూ ఆ యూని వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. అదే మన గీతం యూనివర్సిటీ....ఏండ్ల తరబడి కరెంటు బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్పిడిసిఎల్  నోటీసులు జారీ చేసింది... ఇప్పటివరకు అయినా కరెంట్ బిల్లు బకాయి మొత్తం చెల్లించా లంటూ నోటీసులో పేర్కొన్నారు... నోటీసులను చూసిన గీతం యూనివర్సిటీ యజమాన్యం ఒకేసారి అంత కరెంటు బకాయి చెల్లించ లేమంటూ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసును విచారించిన జస్టిస్ నాగేష్, భీమపాక 2008 నుండి గీతం యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. ఇంత మొత్తం బిల్లులు ఇప్పటివరకు చెల్లించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించక పోయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.. గీతం యూనివర్సిటీ పై 118 కోట్ల కరెంటు బకాయిలు ఉండడాన్ని చూసి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు వెయ్యి రూపాయలు కూడా చెల్లించకపోతే వెంటనే విద్యుత్ కనెక్షన్ తొలగి స్తున్నామని వారిని హెచ్చరిస్తారు..  మరి ఇన్ని కోట్ల కరెంటు బకాయిలు ఉన్నా కూడా మీరెందుకు  యూనివర్సిటీ కి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని హైకోర్టు ఆగ్రహించింది... చట్టం అందరికీ సమాన మేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో హాజరై వివరణ ఇవ్వాలని ఎస్ పి డి సి ఎల్ సూపరింటిండింగ్ ఇంజనీర్ ను హైకోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై ఏమన్నారంటే?

  ఇటీవల బిజినెస్ టుడే అవార్డునందుకుని వార్తల్లో నిలిచిన నారా బ్రాహ్మణికి సంబంధించి కొత్త అప్ డేట్ డెలివరీ అయ్యింది. ఆమె తాను రాజకీయాల్లోకి రమ్మంటే వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కారణం తనకది అంత ప్రాధాన్యతాంశం కాదని కూడా చెప్పుకొచ్చారు బ్రాహ్మణి. మరి చంద్రబాబు అడిగినా మీరు రాజకీయాల్లోకి రారా అంటే ఏమంత ఇంట్రస్ట్ లేదని అన్నారు బ్రాహ్మణి. ఇలాంటి అనాసక్తి కలిగి ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే వారిలో జయలలిత, సోనియాగాంధీ, ఆ మాటకొస్తే భారతీరెడ్డి వంటి వారెవరికీ పొలిటిక్స్ అంటే ఏమంత ఇంట్రస్ట్ కానే కాదు. జయలలితకు ఆ మాటకొస్తే సినిమాలే ఇంట్రస్టింగ్ టాపిక్ కాదు. కానీ తన తల్లి కోరిక మేరకు ఆమె బలవంతానా సినిమాల్లోకి వచ్చి ఆ కాలపు అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగారు. అటు పిమ్మట ఎంజీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆమె, ప్రచార కార్యదర్శిగా నియమితులవడం. ఆపై ఆయన మరణించాక యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగు పెట్టడంతో సీఎం స్థాయికి చేరి.. డీఎంకేతో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు. ఇక సోనియాగాంధీకి కూడా రాజకీయ రంగం ప్రాధాన్యతాంశం ఏమీ కాదు. ఆమె రాజీవ్ గాంధీ అనే రాజకీయ కుటుంబంలోని వ్యక్తి ప్రేమలో ఉన్నానన్న విషయం ఆలస్యంగా గ్రహించారు. అప్పటికీ తన భర్తతో కలసి ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఫైనల్ గా ఇందిర మరణం తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాజీవ్ ప్రధాని కావడం.. ఆపై ఆయన మరణం తర్వాత ఒక గ్యాప్ ఏర్పడ్డం. కాంగ్రెస్ పార్టీ పతనావస్త మొదలవుతుందనగా.. సోనియా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఎంట్రీ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఇటు యూపీఏ చైర్ పర్సన్ గా చక్రం తిప్పడం మాత్రమే కాకుండా.. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఎదిగారామె. వైసీపీ అధినేత జగన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి కూడా ఏమంత రాజకీయాసక్తులు లేవు. ఇక్కడుంటే జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఏ విదేశాలకో వెళ్లి సెటిలవుతామని తాను తన భర్తను కోరినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారామె. ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి సతీమణిగా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నపుడు అత్త భువనేశ్వరితో కలసి ఎన్నో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బ్రాహ్మణి. ఆ తర్వాత ఆమె రాజకీయ అరంగేట్రంపై కూడా పలు కామెంట్లు వినవచ్చాయి. ఈలోగా చంద్రబాబు రిలీజ్ కావడం. కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడం. తన భర్త లోకేష్ కూడా మంత్రిగా బిజీ కావడంతో ప్రస్తుతం బ్రాహ్మణి ఫుల్ హ్యాపీ.  ఈ లీజర్ లో ఆమె హెరిటేజ్ వ్యవహారాలు పట్టించుకుంటున్నారు. పాడి రైతుల కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ తృప్తి తనకు చాలంటున్నారామె. అయితే రాజకీయ అవసరాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలీదు. కాబట్టి ఒక వేళ ఆమె ఇంట్రస్ట్ లేదన్నా.. సరే ఫ్యూచర్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటారు పలువురు.

సిడ్నీ ఉగ్ర దాడి నిందితుడు హైదరాబాద్ వాడే : డీజీపీ

  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది. సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. యూరప్‌కు చెందిన వెనెరా గ్రోసో అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. సాజిద్‌కి కుమారుడు నవీద్, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగి ఉన్నారు. ఆసీస్‌కు వలస వెళ్లినప్పటికీ, సాజిద్ ఇప్పటికీ హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు గుర్తించారు.  ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కుటుంబ, ఆస్తి వ్యవహారాల నిమిత్తం సాజిద్ ఆరుసార్లు భారత్‌కు వచ్చినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. 2017లో తండ్రి చనిపోతే హైదరాబాద్‌కు సాజిద్ వచ్చినట్లు పేర్కొన్నారు. 2022లో టోలీచౌక్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకున్నారు. సాజిద్‌ కుమారుడు పాకిస్తాన్‌లో జన్మించినట్లు గుర్తించారు. ఇటీవల సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో యూదులు హనుక్కా ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24) విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవగా, అతని కుమారుడు నవీద్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రేరేపిత దాడి అని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు.

యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి

  అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద భారతీయుల సమూహానికి వచ్చే ఏడాదికి గానూ తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. గత 50 ఏళ్లుగా ఎఫ్ఐఏ అమెరికాలోని భారతీయులకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు అమెరికన్ కాంగ్రెస్‌లో గుర్తింపుతోపాటు.. పలు అవార్డులు కూడా ఉన్నాయి.  2026 ఏడాదికి సంబంధించి ఎఫ్ఐఏ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎఫ్ఐఏ స్వతంత్రంగా నియమించిన అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్‌లతో కూడిన ఎన్నికల కమిషన్ 2026 నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. కమిషన్ సిఫార్సులకు ఎఫ్ఐఏ బోర్డు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 2026 కార్యనిర్వాహక బృందం.. 2026 జనవరి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ ఏడాది ఎఫ్ఐఏ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఎన్నికల కమిషన్, ఎఫ్ఐఏ బోర్డు కలిసి కార్యనిర్వాహక బృందాన్ని క్రమబద్ధీకరించాలని.. ఈ కౌన్సిల్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ప్రస్తుత ఎఫ్ఐఏ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తర్వాత శ్రీకాంత్ అక్కపల్లి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి రే పటేల్.. జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి పలు రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీకాంత్ అక్కపల్లి.. ఎఫ్ఐఏ సంస్థ ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.  50 ఏళ్లకు పైగా అమెరికాలో సేవలు అందిస్తున్న ఈ ఎఫ్ఐఏ స్వచ్ఛంద సంస్థకు కాంగ్రెషనల్ రికార్డ్‌లో గుర్తింపుతోపాటు.. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు కూడా ఉండటం విశేషం. ఇక ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి.. ఒక బిజినెస్‌మెన్. ఆయన బిజినెస్‌లు అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ విస్తరించి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, మీడియా, ప్రవాస భారతీయ భాగస్వామ్యం వంటి రంగాల్లో ఆయన వ్యాపారాలను విస్తరించారు.  మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో ఉన్నాయి. ఇక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన శ్రీకాంత్ అక్కపల్లి.. తనకు మద్దతు తెలిపిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ధన్యవాదాలు తెలిపారు.  ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న 8 రాష్ట్రాల్లో భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తూ.. 1970లో లాభాపేక్ష లేకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్‌ఏను ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికాలో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

రుషికొండ్ ప్యాలెస్ కోసం ముందుకొచ్చిన టాటా గ్రూప్

  రుషి కొండ గత ముఖ్యమంత్రి తన నివాసం కోసం ఏర్పాటు చేసుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రిషికొండ ప్యాలెస్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యింది. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్ మెయింటెనెన్స్‌ కోసం ప్రతి నెల రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని మంత్రి పయ్యావుల అన్నారు. ఇప్పటికే టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని.. వాళ్లకు ఎలా వినియోగంలోకి వస్తుంది అన్న దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. హోటల్ కోసం కొందరు ముందుకు వచ్చారన్నారు. రుషికొండ పేరుతో ఎంత ప్రజా ధనం వృథా చేశారో.. దానిపై ప్రజల నిరసన ఎలా వచ్చిందో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. టూరిజంకు ఆదాయం వచ్చేలా చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  ఇప్పటికే కొందరు ముందుకు వచ్చారన్నారు. వాళ్లకు ఎలా వయబుల్ అవుతాయో చూడాలని తెలిపారు. మరోసారి చర్చించి రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ముందుకు వెళతామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ, ఏపీ టీఏ సీఈఓ ఆమ్రపాలి కాట, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.  

ఐపీఎల్ 2026 వేలం.. కామెరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు

  ఐపీఎల్ 2026 మినీ వేలం సంచలనాలతో మొదలైంది. అందరూ భావించినట్లుగా అస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు. కనీస్ ధర రూ.2 కోట్లు ఉన్న అతడ్ని దక్కించుకోవడం కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయ. మధ్యలో సీఎస్కే కూడా రేసులోకి వచ్చింది. చివరకు కోల్‌కతా రూ.25.20 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసింది.  దాంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన వీదేశీ ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2024లో మిచెల్ స్టార్క్‌ను  కేకేఆర్ రూ.24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పుడా రికార్డును గ్రీన్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో కామెరూన్ గ్రీన్‌ది మూడో అత్యధిక ధర. రిషబ్‌పంత్ (రూ,27 కోట్లు),  శ్రేయస్ అయ్యర్ (రూ,26.75 కోట్లు), పంజాబ్ కింగ్స్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  ప్రస్తుత వేలంలో సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. భారత్ క్రికెటర్ వెంకటేష్ అయ్యార్ కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడగా.. రూ.7 కోట్లకు వెంకటేష్‌ను బెంగళూరు సొంతం చేసుకుంది.  సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్‌ను రూ.కోటికి ముంబాయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెటన్ ఢిల్లి రూ.కోట్లకు దక్కించుకుంది. కివీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ను రూ.2 కోట్లకు కేకేఆర్ తీసుకుంది.  

మహాత్మా గాంధీ అంటే మోదీకి నచ్చదు...అందుకే పేరు మార్పు : రాహుల్

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చాంది. డిసెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా చేపట్టాలని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యకర్తలు ప్రతి మండలం, గ్రామంలో గాంధీజీ చిత్రపటాలను పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.  మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు మార్చడంపై   కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రధాని  మోదీకి గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండు నచ్చవని అందుకే ఈ పేరు మార్పు కార్యక్రమం అని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై  పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2005లో పథకాన్ని ప్రవేశపెట్టినపుడు అది కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రమే. 2009లో కాంగ్రెస్‌ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఆ సందర్భంగానే మహాత్మాగాంధీ పేరును పథకానికి చేర్చారు.   

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ : టీటీడీ

  టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయంచారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు,  అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని 20 ఎక‌రాల‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొర‌కు, ఆర్కిటిక్ట్ నియామ‌కానికి ఆమోదించారు.  దాత‌ల కాటేజీల నిర్వ‌హ‌ణ‌, నిర్మాణాల‌పై నూత‌న స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని నిర్ణ‌యంచారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ ప‌నుల‌లో భాగంగా రెండ‌వ ద‌శ‌లో రూ.14.10 కోట్లు మంజూరు చేశారు. తిరుపతిలోని  పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్‌ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్‌ సీట్లు పెంచాలని నిర్ణయంచారు. టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయంచారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ప‌ని చేస్తున్న‌ 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/- పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/- పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/- ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు జీతాలు పెంచారు  

ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడి వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్‌

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ కాల్పులకు తెగబడి నరమేథం సృష్టించిన నిందితుడి వద్ద ఇండియన్ పాస్ పోర్టు లభించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచస్తున్నాయి.  ఈ ఘటనలో నిందితుడైన   సాజిత్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు  హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఈ ప్రయాణాల వెనుక ఉద్దేశాలు ఏమిటన్న కోణంలో  దర్యాప్తు కొనసాగుతోంది. ఇలా సాజిత్ వద్ద లభించిన పాస్‌పోర్ట్ వివరాలు హైదరాబాద్ చిరునామాతో ఉండటంతో భారత కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యుల వివరాలు, నేపథ్యం తదితర  అంశాలపై నిఘావర్గాలు కూపీలాగుతున్నాయి.  ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకోవడంతో, భారతదేశం– ఆస్ట్రేలియా అధికారుల మధ్య సమన్వయంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 

కన్నకూతురిని కడతేర్చిన తల్లి!

కడుపు చించుకు పుట్టిన కుమార్తెనే కడతేర్చిన ఒక తల్లి ఉదంతమిది. తన కుమార్తెను దేవుడు మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకంతోనే చంపేసినట్లు చెబుతున్న ఆ తల్లిది ఉన్మాదమా, మూఢనమ్మకమా, పిచ్చా అని స్థానికులు దుయ్యబడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.  మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో వసంతపురి కాలనీలో నివాసముంటున్న మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె  షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్  మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసివేసింది‌. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది.  వెంటనే చిన్నారిని గాంధీ ఆస్పత్రికి తర లించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై సమా చారం అందుకున్న మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. తల్లి మోనాలిసాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకం తో తన పాపను చంపానని తల్లి చెప్పడంతో  ఆమెది మూఢ విశ్వాసమా, మానసిక స్థితి సరిగా లేదా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

కోఠి మహిళా వర్సిటీ మెస్ ఇంఛార్జ్ సస్పెండ్

  కోఠి వీరనారి చాకలి ఐలమ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ మెస్ ఇంఛార్జ్ వినోద్‌ను  ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థనులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థినులే షీ టీమ్‌కు ఫోన్ చేసి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యాజమాన్యం కూడా అతడికే మద్దతుగా ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని విద్యర్థులు షీ టీమ్‌తో వాపోయారు.  తమను పర్సనల్ గా టార్గెట్ చేస్తారనే కారణం కంప్లైంట్ చేయలేకపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  రంగలోకి దిగిన షీ టీమ్ ప్రిన్సిపాల్‌ను ఘటనపై ఆరా తీసింది. అయితే మొదట ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ తమకు వినోద్ పై విద్యార్థినుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు యూనివ‌ర్సిటీలో పీజీ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న షూటింగ్స్ కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు ఆరోపించారు.  ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతిస్తే సెక్యూరిటీ గార్డులు వేధింపులకు గురిచేస్తు న్నారని వారు వాపోయారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ షూటింగ్ సమయంలో క్యారీ వాన్‌లో విద్యార్థినులను నిర్బంధించారని ఆరోపిస్తూ విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షూటింగ్స్ వల్ల చదువుకు ఆటంకం కలుగుతోందని, భద్రతా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారు తెలిపారు.  ఈ క్రమంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వకూడదని, అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చినా శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థిను లను వేధింపులకు గురిచేస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్ స్పందించారు.  ఇకపై షూటింగ్స్‌కు శని, ఆదివారాల్లో మాత్రమే అనుమతి ఇస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. వర్కింగ్ డేస్‌లో షూటింగ్స్‌కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీసీని కలిసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు సైతం తరలి వచ్చారు. మరోవైపు యూనివర్సిటీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా  విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బ్రెజిల్‌లో నేలకొరిగిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం

దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో తుఫాను బీభత్సానికి  స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది. 79 అడుగుల ఎత్తు ఉన్న ఈ  విగ్రహం తుపాను ధాటికి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు కుప్పకూలింది.  ఇలా ఉండగా బ్రెజిల్ ను తుపాను అతలాకుతలం చేసింది.  రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గుయైబా నగరంలో సంభవించిన తీవ్ర తుఫాను ధాటికి  స్థానిక రిటైల్ స్టోర్ హవాన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన  79 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  విగ్రహం నెమ్మదిగా ముందుకు వంగి చూస్తుండగానే ఖాళీ పార్కింగ్ స్థలంలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన  ప్రభుత్వం  ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, అక్కడి నుంచి వాహనాలను తరలించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.   విగ్రహం కూలిపోయిన ఘటనను గుయైబా మేయర్ మార్సెలో మరానటా సోషల్ మీడియాలో ధృవీకరించారు. హవాన్ సిబ్బంది తక్షణమే ఆ ప్రాంతంలో అందర్నీ ఖాళీ చేయించడం వల్ల ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు.   ఇక హవాన్ మెగాస్టోర్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండానే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విగ్రహాలు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని సదరు కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ తుఫాను హెచ్చరికలను ముందస్తుగానే ప్రజలకు తెలియజేయడానికి మొబైల్ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపించింది. తుఫాను, బలమైన గాలులు, కూలిపోయే ప్రమాదం ఉన్న నిర్మాణాల గురించి హెచ్చరించింది. తీవ్రమైన వేడి, శీతల గాలి కలయికతో ఏర్పడిన ఈ అల్పపీడన వ్యవస్థ కారణంగా రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో ఈ తుఫాను సంభవించింది. గతంలో 2021లో కాపావో డా కానోవాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు, తుఫాను సమయంలో మరో హవాన్ విగ్రహం కూలిపోయింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఒక్కరోజులో రూ.15 లక్షల కోట్లు పెరిగిన మస్క్ సంపద

ప్రపంచ  కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఆయన నికర సంపద ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 600 బిలియన్ డాలర్లు దాటేసింది. ఐపీఓకు రాబోతున్న స్పేస్ ఎక్స్ విలువ అమాంతం పెరగడంతో దాంట్లో మెజార్టీ వాటా ఉన్న మస్క్ సంపద విపరీతంగా పెరిగింది. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 15 లక్షల కోట్లకుపైగా సంపద పెరగడంతో ప్రస్తుతం మస్క్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. దిగ్గజ పారిశ్రామిక వేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ (x) సంస్థల యజమాని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్  నికర సంపద సోమవారం (డిసెంబర్ 16)  రికార్డు స్థాయిలో 600 బిలియన్ డాలర్లు దాటేసింది. మస్క్‌కు మెజార్టీ వాటా ఉన్న స్పేస్ ఎక్స్.. ఐపీఓకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో దాని విలువ భారీగా పెరగడంతో మస్క్ సంపద కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. స్పేస్ ఎక్స్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లు అంటూ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 72 లక్షల కోట్లుగా  లెక్కగట్టారు. దీంతో ఇందులో సుమారు 42 శాతం వాటా ఉన్న మస్క్ సంపద  ఒక్కరోజులోనే గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం చూస్తే మస్క్ సంపద డిసెంబర్ 15-16 మధ్య ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 168 బిలియన్ డాలర్లు (రూ. 15.26 లక్షల కోట్లు) పెరిగి.. 677 బిలియన్ డాలర్లకు (రూ. 61 లక్షల కోట్లకు) చేరిందని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల సంపద దాటిన తొలి వ్యక్తిగా మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో ఈవీ కార్ మేకర్ టెస్లా షేర్లు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో మస్క్ సంపద విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఇందులో కూడా మస్క్‌కు 12 శాతం వాటా ఉంది. టెస్లా షేరు   సోమవారం (డిసెంబర్ 15)సెషన్‌లోనూ 4 శాతం పెరిగి 475.31 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ ధర ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు  25 శాతానికిపైగా పెరిగింది. 6 నెలల్లో 44 శాతం పుంజుకుంది. మరోవైపు.. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్స్ లేకుండానే ఉండే రోబోటాక్సీల్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు మస్క్ ప్రకటించడం కూడా టెస్లా షేరు పెరిగేందుకు కారణమైంది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద ఒక్కరోజులో 167 బిలియన్ డాలర్లు (రూ. 15.16 లక్షల కోట్లు) పెరగ్గా.. 638 బి. డాలర్లుగా ఉందని తెలిసింది. ఇది భారత కరెన్సీలో రూ. 58 లక్షల కోట్లకు సమానం. ఏదేమైనా మొత్తంగా 600 బిలియన్ డాలర్ల సంపద దాటేశారు. స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. సుమారు 30 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమకూర్చాలని చూస్తోంది. ఇది భారత కరెన్సీలో రూ. 2.75 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అంతకుముందు ఈ ఏడాది నవంబరులో మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ. 90 లక్షల కోట్లు) పే ప్యాకేజీకి టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పే ప్యాకేజీ కావడం విశేషం. ఇక్కడ టెస్లా నిర్దేశించిన లక్ష్యాల్ని మస్క్ చేరుకుంటే.. దశల వారీగా ఇది మస్క్‌కు అందుతుంది. దీంతో మస్క్ ట్రిలియనీర్‌గా అవతరిస్తారు.

నోట్లో పడ్డ ఆకు ఉమ్మినందుకు రూ.30 వేల జరిమానా

బ్రిటన్‌లో చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని అధికారులు చెప్పుకుంటుంటే.. తాజాగా బ్రిటన్‌లో చట్టాల అమలు తీరుపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా నివసించే 86 ఏళ్ల రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వచ్చి పడిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకంగా  30,337 రూపాయలు జరిమానా విధించడం సంచలనం సృష్టించింది.  గ్రేట్ బ్రిటన్‌లో ఆస్థమాతో బాధపడుతున్న వృద్ధుడిని ఏమాత్రం కనికరం చూపకుండా వేధించారని ఆయన కూతురు సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ పోరాటం తర్వాత ఫైన్ తగ్గించినా, ఇటువంటి చిన్న చర్యలకు భారీ జరిమానాలు విధిస్తున్న లింకన్‌షైర్ కౌన్సిల్‌పై ప్రజలు మండిపడుతున్నారు. సాధారణంగా ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గాలికి కొట్టుకొస్తూ.. ఒంటిపై, ముఖంపై దుమ్మూ ధూళి పడుతుంటాయి. ఒక్కోసారి చెత్తాచెదారం కూడా కొట్టుకొస్తూ నోట్లోనూ పడుతుంటుంది. అలా ఎండిపోయిన ఆకులో, కాగితాలో వచ్చి నోట్లో చేరితే వెంటనే మనం ఉమ్మేస్తుంటాం. ఇదంతా అందరూ చేసేదే. దీంట్లో పెద్ద తప్పేమీ లేదు. కానీ ఇదే పని చేసినందుకు ఓ 86 ఏళ్ల వృద్ధుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.36 వేల జరిమానా విధించారు బ్రిటన్ అధికారులు.  గాలికొచ్చిన ఆకు నోట్ల పడ్డందుకు ఉమ్మినందుకే ఇంత జరిమానా వేయడం తీవ్ర విమర్శల పాలవుతోంది. బ్రిటన్‌లో చట్టాన్ని అతిగా అమలు చేసిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 86 ఏళ్ల వృద్ధుడు రాయ్ మార్ష్.. తన నోట్లోకి గాలికి వెళ్లిన ఒక ఆకును ఉమ్మేసినందుకు గానూ స్థానిక అధికారులు ఏకంగా 250 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.30,337) జరిమానా విధించారు. న్యాయ పోరాటం తర్వాత జరిమానా 150 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.18,202) తగ్గించినప్పటికీ.. ఈ  నిర్దోషి చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.