సూరత్ ఎయిర్‌పోర్టులో బిగ్ బికి తప్పిన పెద్ద ప్రమాదం

  సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సూరత్ విమానాశ్రయానికి అమితా బచ్చన్ చేరుకున్నప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఆయన తన కారు వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సెల్ఫీల కోసం ముందుకు దూసుకురావడంతో అక్కడ తోపులాట జరిగింది.  జనాల ఒత్తిడితో ఎయిర్ పోర్ట్‌లోని ఒక భారీ అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగే సమయానికి అమితా బచ్చన్ అద్దానికి సమీపంలో ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను అప్రమత్తం చేసి సురక్షితంగా కారులోకి తరలించడంతో ప్రమాదం తప్పింది.  ఒకవేళ ఆ అద్దం ఆయనపై పడి ఉంటే తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. అమితా బచ్చన్, తన స్నేహితుడు సునీల్ షాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తిగా ఆరిపోయిన బ్లో అవుట్ మంటలు

  డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో  ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పారు. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో ఈనెల 5న ఓఎన్జీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.  దాదాపు 20 మీటర్ల ఎత్తు భారీ అగ్నికీలలు ఎగిసి పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500- 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు.  ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోఔట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ

  ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్‌పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతు న్నట్టు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.  ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్‌  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరా లకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు ప్రకటించింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, రియల్ ఎస్టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి.  గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రయత్నాలు కొనసాగడంతో తాజా ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.హైడ్రా అధికారులు తాజా విచారణలో, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 44లోని దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్‌ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్‌ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అక్రమ ఆక్రమణలపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.  

చెంగాలమ్మ సేవలో ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం వేద పండితులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు.  ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు.  ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో   ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి. నారాయణన్  రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 12.19 గంటలకు ప్రారంభమౌతుందన్నారు.  ఆ మరుసటి రోజు అంటే సోమవారం (జనవరి 12 )ఉదయం  10.19 గంటలకు పీఎస్‌ఎల్‌వి -సి62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌ -ఎన్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.  

జైలు నుంచి ఆస్పత్రికి రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జైలు అధికారులు ఈ రోజు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలతో వారు బాధపడుతుండటంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి  ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. జగన్ హయాంలో ఏపీలో  జరిగిన 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో వీరిరువురూ అరెస్టైన సంగతి తెలసిందే. రాజ్ కసిరెడ్డిని గత ఏడాది  ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గత ఏడాది జూన్ 17 బెంగళూరు విమానాశ్రయంలో  సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచీ చెవిరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా విజయవాడ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వీరిరువురూ పలుమార్ల దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఇప్పుడు తాజాగా ఇరువురూ  కూడా అనారోగ్య సమస్యలతో  బాధపడుతుండటంతో జైలు అధికారులు వారిని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు.  

భూభారతిలో భారీ అక్రమాలు.. రంగంలోకి లోకాయుక్త

భూభారతి రిజిస్ట్రేషన్ లలో భారీ అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. భూ భారతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టా లని అధికారులను ఆదేశించింది. భూభారతి పేరుతో జరుగుతున్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. సమగ్ర నివేదిక సమర్పిం చాలని సంబంధిత   శాఖలను లోకాయుక్త ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్లకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే జనగామ జిల్లాలో కేవలం ఒక్కరోజే 10 చలా న్లకు సంబంధించిన రూ.8,55,577ను దుండగులు కాజేసి నట్లు  విచారణ లో తేలింది.  ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో వెంటనే చలాన్లపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో జనగామ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కుంభకోణంలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్లు చేసినట్లు గుర్తించారు. అతని పాత్రపై పోలీసులు  విచారణ చేపట్టారు.భూభారతి కుంభకోణానికి సీసీఎల్ఏ సాంకేతిక సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పుడు లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో  మరిన్ని   విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని  అంటున్నారు. 

విషమిచ్చి చంపేయండి...తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

  ఓ మహిళా  ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని అన్ని మీడియా వాళ్లని అభ్యర్థిస్తున్నాని మంత్రి తెలిపారు.  మీకు కుటుంబాలు ఉంటాయి కదా? ఆఫీసర్లను బదిలీ చేసే హక్కు సీఎంకే ఉంటుందని కోమటిరెడ్డి అన్నారు. ఈ తప్పుడు రాతల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తరుపున సమగ్ర దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాని తెలిపారు. నాకు ఉన్న ఒక్కగానొక కుమారుడిని కోల్పోయి ఫౌండేషన్ పేరుతొ ప్రజాసేవ చేస్తున్నాని తెలిపారు. నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదని వాపోయారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదు. రేటింగ్‌లు, వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. ఎందుకంటే?

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ నెల 19 నుంచి మహాపాదయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్ షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల వరకూ ఆయనీ మహాపాదయాత్ర చేపట్టనున్నారు. ఇంతకీ ఆయనీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో చంద్రబాబునాయుడు స్కిల్ కేసు పేర అక్రమంగా అరెస్టైన సందర్భంలో ఆయన తిరుమల దేవుడికి మొక్కుకున్నారు. చంద్రబాబు ఆయన ఇమేజ్ కు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడాలని  కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లే చంద్రబాబు స్కిల్ కేసులో నిర్దోషిగా తేల డంతో తన మొక్కు తీర్చుకోవడానికి షాద్ నగర్ నుంచి తిరుమలకు కాలినడకన ప్రయాణించనున్నారు. నవంబర్ 19న ఈ పాదయాత్రను బండ్ల గణేష్ ఘనంగా ప్రారంభించనున్నారు. అటు ఆధ్మాత్మికంగానూ, ఇటు రాజకీయంగానూ కూడా అందరి దృష్టినీ ఈ పాదయాత్ర ఆకర్షించే అవకాశం ఉంది.  

పట్టాలెక్కిన జ్ణాన బుద్ధ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పురోగతి శరవేగంగా సాగుతోంది. గతంలో అంటే జగన్ హయాంలో ఆగిపోయిన కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగానే జ్ణాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేయడంతో జ్ణానబుద్ధ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి.    2014 నుంచి 2019 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించే అవకాశాలుంటాయని భావించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదెకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న నూటపాతిక అడుగుల ఎత్తైన  బుద్ధుని విగ్రహ నిర్మాణం కూడా ఇందులో భాగమే.  అయితే ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానుల విధానమంటూ.. ఈ ప్రాజెక్టును కూడా మూలన పడేసింది.   ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించి విధివిధానాలను పర్యటక శాఖ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు కేటాయిం చింది.  ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి జ్ణాన బుద్ధను   పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారన్నది అంచనా. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.  

మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత

నోబెల్ శాంతి పురస్కారానికి తనను మించిన అర్హులెవరున్నారంటూ అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన భుజాలను తానే చరుచుకుని స్వోత్కర్షలో తనకు తానే సాటి అని చాటుకున్నారు. వైట్‌హౌస్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆయన తన హయాంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. అంతే కాదు.. భారత్ పదేపదే ఖండిస్తున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించానని పునరుద్ఘాటించారు.  గత ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య  తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తి యుద్ధం అనివార్యం అన్న పరిస్థితులు నెలకొన్న సమయంలో  తాను జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్యా యుద్ధం జరగకుండా  అడ్డుకున్నానని  చెప్పుకున్నారు. తాను జోక్యం చేసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు. తన చొరవ వల్లే  కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని అప్పట్లో చేసిన బహిరంగ ప్రకటనను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.  ఇన్ని యుద్ధాలను ఆపిన తన కంటే నోబెల్ శాంతి పురస్కారం పొందేందుకు ఎవరికి అర్హత ఉందని చెప్పుకున్నారు. అయితే తనకు శాంతి పురస్కారాల కంటే.. జనం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకున్నారు.  

జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్రపండుగ హోదా

కోనసీమలో ఏటా కనుమ పండుగ రోజున జరనిగే జగన్నతోట ప్రభల తీర్ధానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపును ఇచ్చింది. కొనసీమ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఈ ప్రభల తీర్ధం ఇక నుంచి అధికారికంగా రాష్ట్రపండుగగా జరగనుంది. ఈ ప్రభల తీర్ధానికి దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.  ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  జగన్నతోట ప్రభల తీర్థానికి  రాష్ట్ర పండుగ హోదా కల్పించడం తెలుగువారి ఆచారాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన అత్యున్నత  గౌరవంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు   దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున   జగన్నతోట ప్రభల తీర్థం జరుగుతుంది.   అమలాపురం పరిసర గ్రామాల నుంచి  ఏకాదశ రుద్రులు ప్రభల రూపంలో ఒకేచోట కొలువుదీరడం ఈ జగ్నన్నతోట ప్రభత తీర్థం ప్రత్యేకత.  ఎత్తైన ప్రభలను భుజాలపై మోస్తూ కౌశికా నదిని దాటించే దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభ కౌశికను దాటి వచ్చే దృశ్యం ఒళ్లుగొగుర్పొడిచేలా ఉంటుంది. ఈ ప్రభల తీర్థానికి  ఏటా సుమారు ఆరు లక్షల మందికి పైగా తరలివస్తారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రభల తీర్థ విశిష్ఠతను గతంలో కొనియాడారు. అదలా ఉంచితే ప్రభల తీర్థానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా  కల్పించడంతో ఈ ఉత్సవాల నిర్వహణకు   ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో ఈ ఏడాది ప్రభల తీర్థం మరింత వైభవంగా నిర్వహిస్తామని  మంత్రి కందుల రమేష్ తెలిపారు. 

మలేసియా ఓపెన్..సెమీస్ లో పీవీ సింధు ఓటమి

ప్రంపంచ  బాడ్మింటన్​ సీజన్​ ఆరంభ టోర్నీ.. మలేషియా ఓపెన్లో భారత స్టార్​ షట్లర్ ​ పీవీ సింధూ పోరాటం ముగిసింది. శనివారం (జనవరి 10) ఇక్కడ జరిగిన సెమీఫైనల్ లో ఆమె పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.    సెమీ ఫైనల్ ​ లో  సింధు    డ్రాగన్​ షట్లర్  వాంగ్ జియి చేతిలో   16- 21, 15-21 తేడాతో వరుస సెట్లలో  పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.  గాయం కారణంగా సుదీర్ఘ కాలం  విరామం తీసుకున్న సింధూ  మలేషియా  టోర్నీలో పునరాగమనం చేసింది. ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. పూర్వపు ఫామ్ అంది పుచ్చుకున్నట్లుగా సింధు కనిపించడంతో సంక్రాంతి కానుకగా ఆమె మలేషియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగివస్తుందని అంతా ఆశించారు. అయితే ఆమె సెమీఫైనల్ లో ఓడిపోవడంతో నిరాశ చెందారు. ఇలా ఉండగా   మలేషియా ఓపెన్‌లో  8 ఏళ్ల తర్వాత తొలిసారిగా సింధు సెమీఫైనల్ కు చేరుకుంది.   ఇక  లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్ లో సత్తా చాటి మరో ఒలింపిక్ మెడల్ ను తన ఖాతాలో వేసుకోవాలని సింధు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటి వరకూ సింధు ఖాతాలో రెండు ఒలింపిక్ మెడల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

అయోధ్యలో మాంసాహార ఫుడ్ డెలివరీపై నిషేధం

అయోధ్యలో ఆన్ లైన్ లో మాంసాహార ఫుడ్ డెలివరిపై అధికారులు నిషేధం విధించారు. అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో  మాసాహార ఫుడ్ డెలివరీని పూర్తిగా నిషేధించామనీ, ఆ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందనీ  అధికారులు తెలిపారు.  పవిత్ర పుణ్యక్షేత్రం పంచకోశి పరిక్రమ పరిధిలోని ప్రాంతాల్లోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య లోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాటి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. అయితే నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ల  ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్‌లైన్ నాన్-వెజ్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా ఈ నిబంధనలు పాటించాలని  నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు హెచ్చరించారు.  

సంక్రాంతి ప్రయాణాల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఆరంభమైపోయింది. పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.  రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో  తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా అన్ని నగరాలలోనూ  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.    రద్దీ కారణంగా తోపులాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా అవసరాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.  అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణీకులకు బస్సు సర్వీసుల విషయంలో సమాచారం అందించేందుకు అదనపు సిబ్బందిని కూడా నియమించాయి.  ఈ రద్దీ సంక్రాంతి సెలవులు ముగిసే వరకూ అంటే ఈ నెల  18 వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఆరంభమైపోయాయి. 

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్... 24 మంది అరెస్ట్

  తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన సంచలన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పిల్లలపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఒక్కరోజు వ్యవధిలోనే 18 ప్రత్యేక బృందాలతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన అధికారులు, చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అత్యధికంగా హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం సంచలనంగా మారింది. నిందితుల వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండగా, వారంతా మధ్యతరగతి వర్గానికి చెందినవారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, వీరి వద్ద భారీగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలు ప్రధానంగా విదేశాలకు చెందిన 4 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల మైనర్ బాలికలవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా యాప్‌లు, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మాట్లాడుతూ, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ఏమాత్రం ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.  ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాల్లో పాల్గొన్నవారిని గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో మరింత నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూడడం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం కూడా నేరమేనని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇటువంటి కంటెంట్‌పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సంచలన ఆపరేషన్‌తో తెలంగాణలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమైందని, పిల్లల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలన విషయాలు

  తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు లంచాలు తీసుకున్నట్టు టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆయనను A-34గా పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ  కోర్టులో విజయ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా వాటిని సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. సిట్ వివరాల ప్రకారం 2023లో భోలే బాబా కంపెనీ నుంచి రూ.75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారం లంచంగా స్వీకరించినట్టు బయటపడింది. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు.  ఇవన్నీ హవాలా మార్గంలో స్వీకరించినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 వరకు సంబంధిత కంపెనీల పనితీరు సరైన విధంగా లేకపోయినా, నెయ్యి క్వాలిటీ బాగుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా టిటిడికి సుమారు రూ.118 కోట్ల మేర నష్టం జరిగినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే విజయ భాస్కర్ రెడ్డి నుండి సిట్ రూ.34 లక్షలను సీజ్ చేసింది. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది. 

పాలసీల స్థిరత్వమే పెట్టుబడుల ప్రవాహానికి బలం : మంత్రి లోకేష్

  మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలకోపన్యాసం చేశారు. గతంలో ఏపీలో పీపీఏలను రద్దుచేయడంతో 2019–24 మధ్య అనేక కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన అన్నారు. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు, పాలసీల స్థిరత్వం అత్యంత కీలకమని ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పరిపాలనలో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెనెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యికి పైగా సేవలను ప్రజలకు సులభంగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారంగా స్కిల్ సెన్సస్, ల్యాండ్ రికార్డులను బ్లాక్‌చైన్‌పైకి తీసుకురావడం వంటి విప్లవాత్మక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీపై చూపుతున్న నమ్మకానికి మూడు కారణాలున్నాయని చెప్పారు—నిరూపితమైన నాయకత్వం, వేగవంతమైన అనుమతి విధానం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో పనిచేసే “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం. పరిశ్రమలకోసం “లిఫ్ట్ పాలసీ” అమలు చేస్తున్నామని, టాలెంట్, నీరు, విద్యుత్ వంటి వనరులతో పాటు వేగవంతమైన అనుమతులు అందించడం వల్లే పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన రంగాల్లో పెద్ద ఎత్తున ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోందని లోకేష్ తెలిపారు. రాజకీయ సంకల్పంతో, పారదర్శక విధానాలతో భారీ ఎఫ్‌డీఐలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుందనీ, ఇందుకోసం పాలసీల స్థిరత్వమే ప్రధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.