3 రోజులు నడిచి ప్రాణాలు కోల్పోయిన బాలిక!
posted on Apr 21, 2020 @ 3:54PM
తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కు 3 రోజుల పాటు నడిచి ప్రాణాలు కోల్పోయింది 12 ఏళ్ల బాలిక. 150 కిలోమీటర్లు నడిచింది. కేవలం ఇంటికి 14 కిలోమీటర్ల దూరంలో మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురిని తల్లిదండ్రులు కోల్పోయారు. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు చెప్పారు.
లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ బంద్ అయింది. లాక్డౌన్ను పొడిగించడంతో కూలీలు తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో తొందరగా ఇంటికి వెళ్లాలని అటవీ మార్గాన కూడా నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.
అండొరం మక్డం (32), సుకమతి (30) కి జామ్లో మక్డం(12) అనే ఒక్కగానొక్క కూతురు ఉంది. తెలంగాణలోని ఓ గ్రామానికి రెండు నెలల క్రితం ఆ కుటుంబంతో పాటు మరి కొంత మంది మిర్చి ఏరవేత కూలీ పనులకు వచ్చారు. లాక్డౌన్తో 13 మంది ఛత్తీస్గఢ్లోని సొంత గ్రామానికి కాలి నడకన వెళ్లాలని ప్రయాణం ప్రారంభించారు.
బీజాపూర్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జామ్లోకు కడుపునొప్పి వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. దీంతో భండర్పాల్ గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు జామ్లో ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులకు తెలిపారు.
ఘటనా స్థలికి చేరుకున్న బీజాపూర్కు చెందిన వైద్యులు వారిని క్వారంటైన్ కు తరలించారు. ఆమె పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కాగా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.