ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు పిడుగు హెచ్చరిక 

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదముందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం,తర్లుపాడు,అర్ధవీడు,కొనకనమిట్ల, అలాగే  నెల్లూరు జిల్లా నెల్లూరు, పొదలకూరు, చేజర్ల, కలువాయ, రాపూర్, బలయపల్లి, వెంకటగిరి, కలువాయి,ఓజిలి,గూడూరు,చిత్తమూరు,సైదాపురం,దక్కలి,  చిత్తూరు జిల్లాచిత్తూరు ,శ్రీకాళహస్తీ, తోట్టంబేడు, పాలసముద్రం, గంగాధరనెల్లూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

ఆంధ్ర లో మరణాల శాతం 2.83 మాత్రమే : ముఖ్యమంత్రి 

రాష్ట్రంలో చనిపోయిన వారి శాతం 2.83 మాత్రమేనని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీడియా సమావేశంలో ఈ రోజు మాట్లాడిన ఆయన, కరోనా సోకితే జీవితం నాశనం అవుతుందనే భావన వద్దని, గ్రీన్ జోన్ లో కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయని భరోసా ఇచ్చారు. ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలిరాష్ట్రంలో అందరికి మాస్క్ లు అందజేస్తున్నాం. స్వయం సహాయక గ్రూప్ సభ్యులు మాస్క్ లు తయారు చేస్తున్నారు. బయటకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి. ప్రతి రోజు పండ్లు,కూరగాయలు తీసుకోవాలి అని సి ఎం సూచించారు.  రవాణా వాహనాలు ఇప్పుడు తిరిగే అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్ లో రక్షణ చర్యలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపొద్దు, మనం వివక్ష చూపిస్తే తరువాత ఆ ప్రభావం మనపై పడుతుందని గ్రహించాలి, వృద్దులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలి, అవసరమైన వారికి ఇంటి వద్దకే మందులు అందజేస్తామన్నారు. రంజాన్ నెల ప్రారంభమైంది. ప్రార్ధనలు ఇళ్లలోనే చేసుకుంటున్న విషయం మంచిదే. రాష్ట్రానికి మంచి జరగాలని ముస్లింలు, క్రిస్టియన్స్,హిందువులు ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నాను. కరోనా నియంత్రణ కు గ్రామ వాలంటీర్లు, ఆశ వర్కర్స్,ఎ ఎన్ ఎమ్ లు,వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి కి రాష్ట్ర ప్రజలు తరపున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా మన జీవితం లో అంతర్భాగం అవుతుంది: జగన్

రాష్ట్రంలో అన్ని ఇళ్లను జల్లెడ పడుతున్నామని, ప్రతి హాస్పటల్ లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు 3 సార్లు రేషన్ ఇస్తోంది. రాష్ట్రంలో అనేక కష్టాలు ఉన్నా కూడా పేదలకు1000 రూపాయల ఆర్థిక సహాయం అందించాం, పెన్షన్స్ ఇంటికే వెళ్లి అందజేసాం, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ,  పూర్తిగా కట్టడి చేయలేమన్నారు. రాబోయే రోజుల్లో కరోనా తో జీవించాల్సిన పరిస్థితి నెలకొందని, రాబోయే కాలంలో కరోనా మన జీవనంలో అంతర్భాగం అవుతుందని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  కరోనా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది, కరోనా వైరస్ వచ్చి నట్లు అనుమానం వస్తే వెంటనే 104 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. కరోనా అంటరాని వ్యాధి కాదు, కరోనా వైరస్ వచ్చిన వారి పట్ల ప్రజలు కూడా మానవత్వం గా వ్యవహరించాలి, ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం!

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ చేసిన  కామెంట్స్ ఇవి. కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగమిదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృధ్వీ. మన అనే ఎవరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండన్నా అంటూ హితవుపలికారు. ఆయన మాట్లల్లో.. ''మన అనే ఎవరినీ నమ్మవద్దు.. ఎందుకంటే ఇది తాతలనాటి యుగంకాదు. కల్తీ నాకొడుకులు ఏలుతున్న కలియుగం. మనముందు మన మాట.. వాళ్ల ముందు వాళ్ల మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండన్నా'' అంటూ వ్యాఖ్యానించారు. పృధ్వీ ఏ సందర్భాల్లో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. పృధ్వీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.

ఐటీ కంపెనీల్లో జులై వరకు ఇంటినుంచే ప‌ని!

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని ఐటీరంగ సంస్థలు జులై చివరి వారం వరకు ఇంటినుంచే పనిచేయాలస్సి ఉంటుందని హ‌ర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు అనుమతించాల్సిందిగా హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి విఎస్ కుందూ ప్రకటించారు.  డీఎల్ఎఫ్ సహా పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కొన్ని నిబంధనలతో తాము అనుమతించామని తెలిపారు. కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మిలినీయం సిటీగా పిలిచే గురుగ్రామ్‌లో ఇన్ఫోసిస్, జెన్‌పాక్ట్, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సహా అనేక బిపిఓలు, ఎంఎన్‌సిలు లాంటి అనేక దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి.  కరోనా నియంత్రణలో భాగంగా మార్చి నెలలో పలు కంపెనీలు ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించాయి. అయితే దీన్ని జులై నెలాఖరు వరకు పొడిగించాల్సిందిగా తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్‌డౌన్ సందర్భంగా రేషన్‌లేని పేద కుటుంబాలకు మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ అందిస్తామని సీఎస్ కందూ పేర్కొన్నారు.  రెండు దుస్తుల పరిశ్రమలకు పీపీఈ కిట్లను తయారుచేయడానికి అనుమతించినట్లు తెలిపారు.  ప్రస్తుతం గురుగ్రామ్‌లో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రెడ్ జోన్‌గా ప్రకటించారు. మొత్తంగా రాష్ర్టంలో 298 కోవిడ్ కేసులు నమోదుకాగా, ముగ్గరు చనిపోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.  లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ సంస్థలు, తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని ఆయా సంస్థల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

మే 3 తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం!

ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. ముఖ్యమంత్రులతో లక్‌డౌన్‌పై ప్రధాని మాట్లాడుతూ  మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు స‌త్‌ఫ‌లితాలు చూపిస్తున్నాయ‌న్నారు. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించగ‌లిగాం.  దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం. అయితే లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు.  లాక్‌డౌన్‌ విధించిన తర్వాత నాలుగోసారి జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు, ఆంక్షలపై చర్చించారు. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధాని సీఎంలతో చర్చించారు. అయితే, మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్న వేళ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.   దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలతో మోదీ పేర్కొన్నారు.

మే 16 నుంచి భారత్‌లో కరోనా నిష్క్రమణ మొదలు

మే 16 నాటికి కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావు జులై 25 నాటికి కరోనా పూర్తిగా విముక్తి స్పష్టం చేసిన భారత సాధికార కమిటీ, సింగపూర్‌ వర్సిటీ భారత్‌లో వైద్య నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలో నియమించిన సాధికార కమిటీ పలు ఆసక్తికర విషయాలను తెలుపుతూ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మే 16 నాటికి దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవచ్చని తేల్చి చెప్పింది. ఆ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం... మే  3వ తేదీ వరకు దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరిగి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అనంతరం క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. వచ్చేనెల మే 3 నుంచి 12 మధ్యలో రోజుకు సగటున వెయ్యికి పైగా కేసులు నమోదవుతాయి. అనంతరం పూర్తిగా తగ్గిపోయాయి. మే 16 నాటికి 35,000 కంటే ఎక్కువగా కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయం 10 రోజులకు పెరిగింది. అయితే, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లో కేసులు క్రమంగా పెరుగుతుండడం పట్ల కొందరు నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడి, తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వైరస్‌ వ్యాప్తి తక్కువుంటుందని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, భారత్‌లోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరోనా తగ్గే అవకాశం ఉండొచ్చని కొందరు అంచనాలు వేస్తున్నారు. అలాగే, భారతీయుల జీన్స్‌ కరోనా నుంచి కాపాడగలవని ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సింగపూర్‌ వర్సిటీ మరోవైపు, కేంద్ర సాధికార కమిటీ నివేదికలో స్పష్టమైన అంశాలు నిజమయ్యే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సింగపూర్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి. భారత్‌లో కేసుల నమోదు, మరణాలు, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్యతో పాటు వైరస్‌ వ్యాప్తి రేటు తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సింగపూర్‌ వర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ డిజైన్‌ పరిశోధకులు పలు అంచనాలు వేశారు. వారు వెల్లడించిన అధ్యయనంలో భారత్‌ జులై 25 నాటికి కరోనా నుంచి పూర్తిగా బయటపడుతుందని తేలింది. మే 21 నాటికి భారత్‌లో కరోనా తీవ్రత 97 శాతం తగ్గుతుది.

హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై పిటీషన్ దాఖలు 

ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ సి ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.  ఈసీ కౌంటర్ రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ తెలిపిన కీలకవిషయాలు వెల్లడించారు.  సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ పనుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితమని, ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన  నిర్ణయమని ఆయన వివరించారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత నే తాను సంతకం చేసినట్టు చెప్పారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదు, అనే మూడు అంశాలను రమేష్ కుమార్ రిప్లై పిటీషన్ లో పేర్కొన్నారు.

పొగ‌రాయుళ్ల‌కే 'పొగ' పెడుతున్న వ్యాపారులు

* ఆంధ్ర లో 150 శాతం పెరిగిన సిగరెట్ ఉత్పత్తుల ధరలు  * వాణిజ్య పన్నుల శాఖ ఉదాసీనతపై భగ్గుమంటున్న సిగరెట్ గిరీశాలు! ఓ పక్క కరోనా దెబ్బకి అన్ని వస్తువుల వినిమయం పెరుగుతుంటే, మరో పక్క విజయవాడ లో మాత్రం సిగరెట్ తాగే గిరీశాలకు స్థానిక వ్యాపారాలు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు. పొగాకు ఉత్ప‌త్తులు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం తో , పొగాకు ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి.  ఇత‌ర ప్రాంతాల నుంచి ర‌వాణా వాహ‌నాల నిషేదం కార‌ణాన్ని చూపుతు వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్‌ మొదలెట్టారు. 150 శాతానికిపైగా ధరలు పెంచేసి, దోచేసుకుంటున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెంచితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న అధికారులు ఈ విష‌యంలో మాత్రం వ్యాపారుల‌కు కొమ్ము కాస్తున్నార‌ని పొగబాబులు ఆక్షేపిస్తున్నారు.  క‌రోనా వ్యాపిస్తున్న నేప‌ధ్యంలో నిరోధించేందుకు అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో కొంద‌రు వ్యాపారుల పంట పండింది‌. ఈ లాభాల్లో ఎక్కువ భాగం ప్ర‌భుత్వ అధికారుల‌కే పోతోందని వ్యాపారులు బ‌హిరంగంగానే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.  పొగాకు ఉత్పత్తుల రవాణా ఆగిపోవడంతో గోడౌన్లలో ఉన్న సరుకు ధర అమాంతం పెరిగిపోయింది. సాధారణంగా ఉండే 2 శాతం మార్జిన్ 20 శాతానికి పెరిగింది. పొగాకు ఉత్పత్తులు నిత్యావసరాలు కాకపోవడంతో వాణిజ్య శాఖ అధికారులు వీరిపై ఎటువంటి దాడులు నిర్వహించరు. వాస్తవంగా ఈ బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు ఈ శాఖ అధికారులకు అవకాశం ఉంది. కానీ వ్యాపారులు ఇస్తున్న ముడుపుల కు ఈ అధికారులు లొంగి పోయారని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం కూడా వ్యాపారుల వ్యవహార శైలి కూడా ఓ ప్రధాన కారణం. ధరలు పెంచి అమ్ముతున్న పొగాకు ఉత్పత్తులపై వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగిన సమయంలో వారే ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా పొగతాగే అలవాటు ఉన్నవారు దానిని మానుకోలేరు. ఒకవేళ మానేందుకు ప్రయత్నిస్తే మానసిక రోగిగా తయారవుతారు. ఈ బలహీనత అడ్డం పెట్టుకొని వ్యాపారులు చేస్తున్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు కోరుకుంటున్నారు.

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

  టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పులా మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలకు మాత్రమే తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. ఈ కార్యక్రమానికి కేకే, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, మేయర్, డిప్యూటీ మేయర్, చిప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ సుమన్, విప్ కర్నె ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు తమ ప్రాంతాల్లోనే అంత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఏపీలో గద్వాల్ మోడల్ అమ‌లు చేస్తారా?

  కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వ‌స్తునే వున్నాయి. మందు లేని కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కఠినమైన విధానాల్ని అమలు చేయటానికి మినహా మరో మార్గం లేదు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం కోసం వినూత్న విధానాన్ని అమలు చేశారు. వైరస్ కు పుట్టిల్లు అయిన వూహాన్ లో అక్కడి అధికారులు అమలు చేసిన విధానాల్ని గద్వాల్ లోనూ చేపట్టారు. దీని కారణంగా వైరస్ వ్యాప్తి కంట్రోల్ కి వచ్చింది. ఇంతకీ ఈ విధానాన్ని ఎలా అమ‌లు చేస్తారు? గద్వాల్ పట్టణం లోని పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయటం.. రహదారుల్ని మూసి వేయటంతో పాటు.. ప్రతి ఇంటికి అధికారులు తాళాలు వేసేస్తారు.దీంతో.. ఇంట్లోని వారుఇంట్లోనే ఉండిపోవాలే తప్పించి..కనీసం బయటకు కూడా వచ్చే వీలుండదు. దీంతో.. ప్రమాదకర వైరస్ వ్యాప్తి ఎక్కడికక్కడ.. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే ఆగిపోతుంది. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికి చాలాచోట్ల ఒక ఇంట్లో వారు మరో ఇంట్లోకి రాకపోకలు సాగించటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఎవరింట్లో వారిని లాక్ చేసే పద్దతి గద్వాల్ లోని కంటైన్ మెంట్ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేశారు. సరిగ్గా ఇదే విధానాన్ని ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో గద్వాల్ మోడల్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కవ ఎక్కువగా వున్న నేప‌థ్యంలో ఆ ప్రాంతాల్ని పూర్తిగా మూసివేయటమే కాదు. ఇళ్లకు తాళాలు వేసేయాలి. అయితే.. ఇలా ఇళ్లకు తాళాలు వేసిన ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యవసరాల్ని.. ఇతర వస్తువుల్ని అధికారులే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు.

విలయతాండవం చేస్తున్న క‌రోనా వైర‌స్‌!

కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 27,892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 872 మంది కరోనాతో మరణించారు. ఇక 6,185 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 19,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్‌ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 3 సార్లు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈసారి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారా అని దేశమంతా ఎదురు చూస్తోంది. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారించారు అధికారులు. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా నిర్దారణ జరిగింది. దీనితో అప్రమత్తమైన అధికార యంత్రాంగం గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించింది. విజయవాడలో ఆదివారం మొత్తం సుమారు 30 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. దేశంలో కరోనా కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన 9వ రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దాదాపు 30 లక్షల మందికి సోకింది. ఇక అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. మొత్తం మరణాల సంఖ్య 206894కి చేరింది. ప్రతీ రోజు కూడా 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బార్బర్ షాపుకు వెళ్ళి క‌రోనాతో వచ్చాడు!

బార్బర్ షాపులకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే కటింగ్ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఒక సారి ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒకే టవల్ వాడి 12 మందికి కటింగ్ చేశాడట‌. అయితే అందులో ఆరుగురికి పాజిటివ్ తేలింది. మధ్యప్రదేశ్ లోని ఖర్ గావ్ జిల్లాలోని బార్ గావ్ గ్రామంలో ఓ వ్యక్తి బార్బర్ షాప్ కు వెళ్లి కటింగ్,షేవింగ్ చేయించుకున్నాడు. అతనికి వాడిన టవల్ తోనే మరో 12 మందికి కటింగ్ షేవింగ్ చేశాడు. అయితే, మొదట కటింగ్ చేయించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని గురించి ఆరాతీయగా, బార్బర్ షాప్ కు వెళ్లిన విషయం చెప్పాడు. కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకున్న 12 మందికి టెస్టులు చేస్తే అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ 12 మందికి ఒకే టవల్ ను ఉపయోగించి కటింగ్ చేసినట్టు బార్బర్ షాప్ అతను చెప్పాడు. గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి సరిహద్దులు మూసేశారు. ఇంటి నుంచి ఎవర్ని బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. క‌రోనా వ్యాప్తికి కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తి అదే... కటింగ్ చేసిన వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్నే గ్రామ‌స్థులు వింత‌గా చెప్పుకుంటున్నార‌ట‌. ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడితే ఎలా వుంటోందో క‌టింగ్ షాప్ అద్దం ప‌డుతోంది.

రోడ్డుపై గోడ నిర్మాణం! ఏపీ-చెన్నై సరిహద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌!

లాక్‌డౌన్ సంద‌ర్భంగాఏపీ, చెన్నై ఆయా రాష్ట్రాలు.. సరిహద్దులను మూసివేశాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే, తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. కరోనా కట్టడికి ఏపీ సరిహద్దుల దగ్గర గోడలను నిర్మించారు అధికారులు. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడను నిర్మించారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు త‌మిళ తంబీలు. అయితే ఇలా గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు బంద్ కావ‌డంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదే విధంగా, అత్యవసర సేవలు, నిత్యవసర సరకుల రవాణా కూడా లేకుండా పోయింది.

వైరస్‌ ఎలా సోకింది? తేలని లింకులు!

జిహెచ్ ఎంసి ప‌రిధిలోని నేరేడ్‌మెట్‌, హెచ్‌బీకాలనీ, అమీర్‌పేట, యాచారం, నల్లకుంట ప్రాంతాల్లో క‌రోనా ఎలా పాకింది. దీనికి సంబంధించిన లింకులు ఇంకా అంతు ప‌ట్ట‌లేదు. తాజాగా కేసుల లింకులు గుర్తించేందుకు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది శ్రమిస్తున్నారు. కొన్ని కేసుల్లో వైరస్‌ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. మరోవైపు ఆదివారం ఛాతీ ఆసుపత్రిలో 9 మంది, ఫీవరాసుపత్రిలో ఇద్దరు అనుమానిత లక్షణాలతో చేరారు. గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా.. కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో లింకులు తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో ఓ వ్యక్తి(32)కి ఆదివారం కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని కుటుంబంలోని తల్లి, భార్య, కుమారుడు(19నెలలు), ఒక అక్క..మొత్తం ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. కూకట్‌పల్లిలోని ఓ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి జలుబు, దగ్గుతో 24న కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంటికే పరిమితమైన అతనికి వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు. మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌ పరిధిలోని వ్యక్తి(46) మృతి చెందగా ఆ కుటుంబంలోని అయిదుగురికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు. వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిధిలో ఆదివారం కొత్త‌గా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. జిహెచ్ ఎంసి ప‌రిధిలో మొత్తం 691 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇందులో 151 డిశ్ఛార్జి అయ్యారు. 18 మంది మృతువాత ప‌డ్డారు.

కరోనాను జయించి అధికారిక విధుల్లో బోరిస్!

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయ్యానికి వచ్చారు. ఆసుపత్రి నుంచి డాశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత తిరిగి తన అధికారిక విధుల్లో బోరిస్ పాల్గొన్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో మార్చి 26 నుంచి స్వీయనిర్భంధంలోనే ఉన్న ఆయన ఇంటి నుంచే పనులు కొనసాగించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఏప్రిల్ 12న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రధాని బోరిస్ నేరుగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యూకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. లండన్ పర్యావరణ కార్యదర్శి జార్జ్ యూస్టిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రస్తుతం కరోనా మరణాల రేటు తగ్గుతుందని, రాబోయే రోజుల్లో దీని సంఖ్య మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరం పాటించాలని అదే మన ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,52,000 కు పైగానే కోవిడ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ధాటికి దాదాపు 20,732 మంది ప్రాణాలు కోల్పోయారు.

సుర‌క్షితంగా త‌ల్లితో పాటు బ‌య‌ట‌ప‌డిన చిన్నారి!

పాజిటివ్ రాక‌పోయినా ఆ చిన్నారి త‌ల్లితో పాటు ఉండాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తల్లి, పెద్దమ్మకు కరోనా పాజిటివ్‌ రావడంతో 18 రోజుల పాటు ఐసోలేషన్‌ గదిలో ఉండాల్సి వచ్చింది ఆ చిన్నారికి. వైద్యులు తీసుకున్న జాగ్రత్తలతో పాటు శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి కారణంగా ఆ చిన్నారిని కరోనా వైరస్‌ ఏమీ చేయలేకపోయింది. చిత్తూర్ జిల్లా నగరికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనాలకు వెళ్లి వచ్చాడు. అధికారులు అతన్ని పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. ఏప్రిల్‌ 5న తిరుపతిలోని కోవిడ్‌-19 ఆస్పత్రికి పంపించారు. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఏప్రిల్‌ 6వ తేదీన 20 మంది సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్‌ 7న అక్కడి వారిని పరీక్షించగా ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చింది. వారిని ఏప్రిల్‌ 8న చిత్తూరు కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకామెకు ఏడాదిన్నర వయస్సు బాబు ఉన్నాడు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండడంతో చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు బంధువులు ముందుకు రాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబు సంరక్షణ బాధ్యతలు అప్పగిద్దామంటే ఆమె ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి, పెద్దమ్మతో పాటు ఆ బాలుడు 18 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. బాలుడి సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారికి న్యూట్రీషియన్‌ బిస్కెట్లు ఇవ్వడం, బయటి నుంచి ఆవుపాలు తెచ్చివ్వడం వంటివి చేశారు. ఐసోలేష‌న్‌లో చేరిన మొదటి రోజు ఒకసారి, డిశ్చార్జి అయ్యే నాలుగు రోజుల ముందు పరీక్షలు చేయగా బాలుడికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. చిన్నారి ముందు కరోనా త‌ల‌వంచింది. పూర్తిగా కోలుకోవ‌డంతో వీరిని ఏప్రిల్‌ 25న చిత్తూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వీరు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటారు.

రంజాన్ నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపునకే కేసీఆర్ మొగ్గు!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్ జిహెచ్ ఎంసి ప‌రిధిలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ నగరంపై మరింత దృష్టిని సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని సూచించారు.