కోర్టు మెట్లు ఎక్కుతానంటున్న చెన్నై డాక్టర్ భార్య 

ఇటీవల చెన్నైలో సైమన్ హెర్క్యులస్ అనే డాక్టర్ కరోనాతో మృతి చెందడం తెలిసిందే. అతడి మృతదేహాన్ని అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య మరో డాక్టర్ ఖననం చేయాల్సి వచ్చింది. దీనిపై సైమన్ హెర్క్యులస్ అర్ధాంగి ఆనంది హెర్క్యులస్ తీవ్రస్థాయిలో స్పందించారు. అత్యుత్తమ సేవలు అందించిన తన భర్తకు ఆ స్థాయిలోనే అంతిమ సంస్కారాలు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ఎడప్పాడి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. దీనిపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. కరోనాతో మృతి చెందిన డాక్టర్ అవశేషాలను ఇప్పుడు మళ్లీ వెలికితీయడం ఏమంత సురక్షితం కాదని స్పష్టం చేశారు. అయితే తాను ఈ విషయాన్ని వదిలిపెట్టనని, కోర్టుకైనా వెళతానని ఆనంది తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం మృతశరీరంలో వైరస్ జీవించేది మూడు గంటలేనని, దీని ప్రకారం  వేలంగాడు శ్మశానవాటికలో ఖననం చేసిన తన భర్త మృతదేహాన్ని వెలికి తీసి కీల్పాక్ శ్మశానవాటికలో గౌరవప్రదంగా ఖననం చేయాలని ఆనంది కోరారు.

కరోనా రక్షణ వ్యవస్థపై డబ్ల్యూహెచ్ఓ సందేహాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ వ్యాప్తిపై సభ్య దేశాలను హెచ్చరించింది. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకదని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని, కరోనా తగ్గిన వ్యక్తుల్లో యాంటీబాడీలు పెంపొంది రెండో పర్యాయం ఇన్ఫెక్షన్ కు తగిన రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పలేమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ఇమ్యూనిటీ పాస్ పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడం వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి హెల్త్ పాస్ పోర్టులు ఇస్తున్నట్టు చిలీ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా నయమైన వ్యక్తుల్లో యాంటీబాడీలు ఏర్పడినా, అవి తాత్కాలికమేనని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. ఇలాంటి ఇమ్యూనిటీ నెలకు మించి ఉండదని, దాంతో మరోసారి వైరస్ బారిన పడేందుకు అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఆయనకి నెగిటివ్, కానీ ఆ ముగ్గురికీ మాత్రం పాజిటివ్

* శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన  *  ఒకే కుటుంబం లో 'కరోనా' వైచిత్రి ! ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో పనిచేసేవాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి పాతపట్నం వచ్చాడు. జిల్లాలో అడుగుపెట్టిన సమయంలో పరీక్ష చేస్తే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాజాగా పీసీఆర్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ గానే వచ్చింది కానీ, ఆశ్చర్యకరంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.

కడప జిల్లాలో 55కు చేరిన కేసులు

* గుంటూరు జిల్లాలో ఎనిమిది మంది డిశ్చార్జ్  కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన నాలుగు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇవాళ్టి నాలుగు కేసుల్లో ప్రొద్దుటూరులో మూడు, ఎర్రగుంట్లలో ఒక కేసు నమోదైంది. కాగా ఇవాళ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,820 శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ : రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 61 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1016. ఇప్పటి వరకూ 171 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 814 అని వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  వ్యక్తులకు  నిర్వహించిన పరీక్షలో  రెండు సార్లు  నెగిటివ్ రావడంతో ఆరుగురిని శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.  వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారు 3, మంగళగిరికి చెందిన ఒకరిని,  వేజండ్లకు చెందిన ఒకరిని, అచ్చంపేటకు చెందిన  ఒకరిని  ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.

సోషల్ మీడియా ని దుర్వినియోగం చేస్తే, దండన తప్పదు

లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌  కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్‌ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్‌ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.

పాజిటివ్ ముస్లిం పేషెంట్లకు తెలంగాణ సర్కార్ స్పెషల్ మెనూ

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ మెనూ అమల్లోకి రానుంది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలు తెల్లవారుజామున ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అల్పాహారంగా ఖర్జూరం పండ్లు, అరటి పండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. రోజు విడిచి రోజు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అందిస్తారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్లిమేతరులను మరొక గదిలోకి తరలించనున్నట్టు సమాచారం. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏపీ లో అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి

రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. ► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. ► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. ► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.  ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S S.No Unit Name WHATSAPP  Mobile Number e-mail ID's 1 SRIKAKULAM   6309990933 dail100srikakulam@gmail.com 2 VIZIANAGARAM 9989207326 spofvzm@gmail.com 3 VISAKHAPATNAM RURAL 9440904229 vizagsp@gmail.com 4 VISAKHAPATNAM CITY 9493336633 cpvspc@gmail.com 5 EAST GODAVAI (KAKINADA) 9494933233 sp@eg.appolice.gov.in 6 RAJAHMUNDRY URBAN 9490760794 sp@rjyu.appolice.gov.in 7 WEST GODAVARI 8332959175 policecontrolroomeluruwg@gmail.com 8 KRISHNA (MACHILIPATNAM) 9182990135 sp@kri.appolice.gov.in 9 VIJAYAWADA CITY 7328909090 cp@vza.appolice.gov.in 10 GUNTUR RURAL 9440796184 Dail100gunturrural@gmail.com 11 GUNTUR URBAN 8688831568 guntururbansp@gmail.com 12 PRAKASHAM 9121102109 spongole@gmail.com 13 NELLORE 9440796383 nelloresp@gmail.com 14 CHITTOOR 9440900005 spchittoor@gmail.com 15 TIRUPATHI URBAN 9491074537 sptpturban@gmail.com 16 ANANTHAPURAM 9989819191 spatp1@gmail.com 17 KADAPA 9121100531 spkadapa2014@gmail.com 18 KURNOOL 7777877722 spkurnool.kur@gmail.com                                    అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై ముమ్మర ప్రయత్నాలు

* కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ. కరోనా వైరస్ వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటీకీ.  ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ పై శనివారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ గత నెలరోజులకు పైగా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ కరోనా వైరస్ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నందుకు అన్ని రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు.లాక్ డౌన్ తో కరోనా నివారణలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని మే3 వరకూ ఈ పరిస్థితి ఇలాగే కోనసాగించాలని కోరారు. అయితే లాక్ డౌన్ వల్ల ఎదురయ్యే సమస్యలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఈనెల 20 గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరుకూ లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, ఉపాధి హామీ పనులు పూర్తిగా జరిగేలా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.అలాగే గ్రామీణ ప్రాంత గ్రీన్ జోన్ల పరిథిలోని పరిశ్రమలు,తయారీ యూనిట్లు, ఎస్ఇజడ్లు, ఎక్స్ పోర్ట్ జోన్లు వంటివి పనిచేసేలా వాటిలో పనిచేసే కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసుకునేలా చూడాలని అన్నారు.అంతేగాక నిత్యావసర, నిత్యావసరేతర సరుకు అంతరాష్ట్ర రవాణాకు కూడా పూర్తిగా అనుమతించామని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలన్నీ యధావిధిగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్ లలో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు అవకాశం కల్పించడం ద్వారా లాక్ డౌన్ కష్టాల నుండి గ్రామీణులకు కొంత ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కోరారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలకు తగిన సౌకర్యాలు కల్పించి ఆదుకోవడమేగాక కేంద్ర హోంశాఖ ఆదేశాలకు లోబడి సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి వారిని స్వంత రాష్ట్రాలకు ఏవిధంగా చేర్చాలో పరస్పరం చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.అదే విధంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.ఏమైనప్పటికీ మే 3 వరకూ లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కోరారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ లాక్ డౌన్ తో  ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని కావున వారి ఇబ్బందులను అధిగమించేలా చూడాల్సిన అవసరం ఉంది అన్నారు.ప్రస్తుతం గ్రీన్ జోన్ ప్రాంతాలైన గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు.దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు మూసి ఉన్నందున తగిన ఎగుమతులకు అవకాశం లేక ఉద్యానవన, ఆక్వా తదితర రైతులు ఇబ్బంది పడుతున్నారని సిఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృష్టికి తెచ్చారు.

ఏపీ లో ఒక్క రోజులో 61 పాజిటివ్ కేసులు: జవహర్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 6,928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 61, 216 టెస్టులు చేశామని, మిలియన్ మందికి 1147 టెస్టులు చేసి దేశంలో నే అగ్రస్థానంలో ఉన్నామని, రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.66 ఉందని, మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆయన వివరించారు.  శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు తేలాయని, పాత పట్నం మండలానికి చెందిన వీరిని ఆస్పత్రికి తరలించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో క్లస్టర్లు 196 కి పెరిగాయి.122 పట్టణ ప్రాంతాల్లో 74 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం సహజం ఇందుకోసం 1900 పల్స్ ఆక్సీ మీటర్లు తెప్పించామని జవహర్ రెడ్డి చెప్పారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్  సాచురేషన్ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశామన్నారు.

ఎల్వీ కి తప్పిపోయిన సీవీసీ ఛాన్స్!

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా సంజయ్‌ కొఠారీ ఈ రోజు  బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఇప్పటివరకూ, ఏపీ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యానికే ఆ పోస్టు దక్కుతుందన్న ప్రచారానికి తేరా పడినట్లయింది. ఇప్పటి వరకు ఆయన రాష్ట్రపతికి కార్యదర్శిగా వ్యవహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమక్షంలో కొఠారీ నేడు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) చీఫ్‌ పదవి గత జూన్‌ నుంచి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఓ ఉన్నతస్థాయి కమిటీ కొఠారీని సీవీసీ చీఫ్‌గా గత ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది. కానీ, ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాప్యం జరిగింది. కొఠారీ 1978 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. హరియాణా కేడర్‌లో పనిచేసిన ఆయన 2016లో పదవి విరమణ పొందారు. అనంతరం పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(పీఈఎస్‌బీ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కార్యదర్శిగా వెళ్లారు.

గోదావరి పుష్కరాల్లో ఎంతమందికి మరణానికి మీరు కారణమయ్యారు?

* చంద్రబాబుకు అంబటి రాంబాబు ప్రశ్న  నెలరోజుల లాక్ డౌన్ కాలంలో ఒక్క మంచి సలహా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదని, బురదచల్లే కార్యక్రమాన్ని కూడా హైద్రాబాద్ లో ఉండి చేస్తున్నారనీ, అపుడప్పుడు స్కైప్ లో వస్తారనీ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు విమర్శించారు. సుధీర్ఘమైన ఉపన్యాసాలు చెబుతారు.మొన్న  టిడిపి ఎన్ ఆర్ ఐ మీటింగ్ లో చూశాను.వారంతా భజన చేస్తూ.... ఇప్పుడు మీరు ఉండి ఉంటే అద్భుతంగా,చాలా గొప్పగా ఉండేదంటూ మాట్లాడుతున్నారు.  ఏం అద్భుతంగా ఉండేదండి...సొల్లు చెప్పే కార్యక్రమం...గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చి మీడియా స్పేస్ నంతా ఆక్రమించుకోవాలనే తాపత్రయం తప్ప మరోటి కనిపించడం లేదంటూ అంబటి రాంబాబు సెటైర్ విసిరారు. గోదావరి పుష్కరాలలో ఎంతమంది మరణానికి మీరు కారణమయ్యారు.అయితే మీకు,మాకు తేడా ఉంది.జగన్ గారికి గంటలతరబడి ఉపన్యాసాలు చెప్పేటందుకు ప్రావీణ్యత లేదు.పనిచేయడంలో మాత్రమే ఆయనకు ప్రావీణ్యత ఉంది. ఈరోజు రాష్ట్రంలో  ఐఏఎస్,ఐపిఎస్ అధికారులందరితోను కలసికట్టుగా టీమ్ వర్క్ చేస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. అందరితో రివ్యూలు చేస్తూ,చర్చిస్తున్నారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వేరే రాష్ట్రంలో  ఉన్నారు.ఆ రాష్ర్టానికి,ఏపికి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి చెరి 30 లక్షల రూపాయలు చందా ఇచ్చారు.మీరు పర్సనల్ గా పదిలక్షలు ఇచ్చారు.రెండు రాష్ట్రాలు నాకు సమానమే అన్నారు.మంచిదే డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం.కాని సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి.....అని అడుగుతున్నాను. ఆ రాష్ట్రంలో వారికి సలహాలు ఇవ్వరు.అక్కడ ఏమీ డిమాండ్ చేయరు.ఇస్తే కేసిఆర్ గారు దరువు వేస్తారనే భయం.ప్రధానమంత్రి నరేంద్రమోది,అమిత్ షా కాళ్లు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారు.వాళ్లు మీకు కాళ్లు దొరకనివ్వరు, అంటూ రాంబాబు విమర్శించారు. అక్కడొక(తెలంగాణ) రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడొక రకంగా వ్యవహరిస్తారు.ఇక్కడ రాళ్లు వేయడం ధర్మం కాదని చెబుతున్నాను. అదేమంటే చంద్రబాబు అంటున్నారు.ఏపి ప్రభుత్వం వాస్తవాలు దాస్తోంది.కరోనా రోగులు ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట.వాస్తవాలు దాయాల్సిన అవసరం ఎందుకుంటుంది.ఎందుకు ఆ విధంగా బురదచల్లే కార్యక్రమం చేస్తారు.విమర్శలు చేస్తారు. మీతోపాటు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇదే విధంగా అన్నారు.హైకమాండ్ మొట్టికాయలు మొట్టినట్లు ఉంది.ఆయన సర్దుకున్నాడు.చంద్రబాబుతో ప్రయాణం చేయకండి దూరంగా ఉండండి.బాబుగారితో కలసి భజన చేయకండని బిజేపి జాతీయ అధ్యక్షుడు చెబితే ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకుండా దాయడం అనేది ఈ ప్రభుత్వానికే కాదు ఏ ప్రభుత్వానికి కూడా ఉండటానికే వీల్లేదు.ఉన్న వాస్తవాలు స్పష్టంగా చెబుతున్నా కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు.ఇది దుర్మార్గమైన ఆలోచన.ఈ  సమయాన్ని మీరు ఎంచుకుని జగన్ గారి ప్రభుత్వంపై రాళ్లు వేసే ప్రయత్నం చేయడం ధర్మం కాదు. మీరు హైద్రాబాద్ లో ఉన్నారు.ఈ రాష్ట్రంలో మీకు ఇల్లుందన్నారు కదా.....పరిపాలన చేశారు.ఎందుకు ఈ రాష్ట్రానికి రారు.ఇక్కడ ఉండకండా అక్కడ దాక్కోవాల్సిన ఖర్మ ఏం పట్టింది.ఇది నైతికతేనా, అంటూ రాంబాబు ప్రశ్నించారు.  నేను ఉన్నాను ఈరోజున....గుంటూరులో ఉంటున్నాను...సత్తెనపల్లిలో నన్ను ఎన్నుకున్నారు.రెండురోజులకైనా సత్తెనపల్లి వెళ్లి అధికారులతో మాట్లాడకపోతే నాకు నిద్రపట్టదు.ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలా  సహాయం చేయాలనే తాపత్రయం.ఆ తాపత్రయం మీ దగ్గర ఏది. పోనీ మీకు లేదు....మీకు 70  ఏళ్లు వచ్చాయి. మా లాగానే వృధ్ధులు ...కరోనా సోకితే ప్రమాదం.మీరు రావడం లేదు సరే మంచిదే.మీ అబ్బాయి,యువకుడు, ఆరోగ్యవంతుడు...మీ వారసుడు...మంగళగిరిలో పోటీచేసి దురదృష్టంకొద్ది ఓడిపోయాడు.ఆయన ఎందుకు ఈ రాష్ట్రానికి రాడు.ఆయన ఎందుకు సలహాలు ఇవ్వడు? మీకు సంబంధించిన ఎంఎల్ఏ ఒక్కరైనా సహాయకార్యక్రమాలలో పాల్గొన్నారా....సహాయం చేయాలనే ప్రయత్నం చేశారా.ఇళ్లకే పరిమితం అయి ఇళ్లల్లో కూర్చున్నారు.అదేమంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు,మంత్రులు లాక్ డౌన్ లో బయటకువస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారూ అంటూ విమర్శలు చేస్తున్నారు. అలా చేస్తూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. అందరికి మనవి చేస్తున్నాను.రాబోయే కాలం కరోనాతోనే మనం జీవించాలి.సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలి.ఈరోజు మా ఎంఎల్ ఏలు నియోజకవర్గాలలోని పేదవారిని ఎలా ఆదుకోవాలి....రెక్కాడితే గాని డొక్కాడని వారికి నాలుగువేళ్లు లోపలికి వెళ్లేలా ఏం చేయాలి....మనం సహాయం చేయాలా...ఎన్ జి ఓల ద్వారా సహాయం చేయించాలా అనే తాపత్రయంతో ఎంఎల్ ఏలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్తుంటే వారిపై కూడా బురదచల్లుతున్నారు. గుంటూరులో ఎక్కువ కేసులు ఉంటే గుంటూరు ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...నరసరావుపేటలో ఎక్కువ కేసులు ఉంటే నరసరావుపేట ఎంఎల్ ఏ గారిది బాధ్యతా...మా సత్తెనపల్లిలో ఒకే ఒక్క కేసు ఉంది.నేను గొప్పవాడినా కాదు.... కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వలన....విదేశాలనుంచి వచ్చిన వారి వల్లనో.నిజాముద్ధీన్ కు వెళ్లి వచ్చినవారి వల్లనో కొన్ని ప్రాంతాలలో కరోనా వ్యాప్తి జరుగుతోంది.దానిని అరికట్టే విధంగా వ్యవహరించాలి తప్ప సందు దొరికింది కదా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఎంఎల్ ఏ నియోజకవర్గ ప్రజలపై ప్రేమాభిమానాలతో ఉండాల్సిన సమయం ఇది.వారికి సహాయం అందిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్దితి ఉంటుంది. ఈరోజు అనేక సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి.కూరగాయలు,మాస్కులు,శానిటైజర్లు ఇస్తున్నారు.ఈ మధ్య చంద్రబాబు అంటున్నారు....సేవాకార్యక్రమాలు చేయాలంటే వారు స్వయంగా చేయకూడదంట...తహసిల్దార్ కు చెప్పాలంట అని మాట్లాడుతున్నారు.నిజమే కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు సిస్టమాటిక్ గా చేయాలని ప్రభుత్వం వ్యవహరిస్తుంటే దానిని సైతం విమర్సించే విధంగా చంద్రబాబు ఆయన తాబేదార్లు పనిచేస్తున్నారు.ఇది సరైన విధానం కాదు. మీరు హైద్రాబాద్ లో కూర్చోండి...సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండండి...ఆ బంగ్లాలోనే ఉండండి....కాని ఈ విధంగా ప్రభుత్వాన్ని,వైద్యులను,ఐపిఎస్,ఐఏఎస్ అధికారులను డిమోరలైజ్ చేయాలనే విధంగా మీరు చూడటం సరైనవిధానం కాదు. చంద్రబాబుగారు మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకండి...బాధ్యతతో వ్యవహరించండి.సద్విమర్శలు చేయండి.మంచి సలహాలు స్వీకరించేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుధ్దితో ఉందంటూ రాంబాబు చెప్పారు.

నిమ్మగడ్డ నిజంగా హోమ్ శాఖకు లెటర్ రాయలేదా? 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చ్ 18 వ తేదీన  సెంట్రల్ హోం డిపార్ట్ మెంట్ కు నిజంగా ఉత్తరం రాయలేదా? ఇది ఎవరో రాస్తే ఆయన సంతకం పెట్టి పంపించారనే భావన సర్వత్రా వ్యాపించింది. ఉత్తరం చదివిన ప్రతివారికి ఆ భావన కలుగుతోంది.దానిపై విచారణ చేయాల్సిందిగా కోరడం,విచారణ ప్రారంభం కావడం కూడా మనం చూశాం.విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే కొంత ఆశ్చర్యం కలుగుతోంది.ఆయన,  పర్సనల్ సెక్రటరిగా ఉన్న సాంబమూర్తిగారిని సిఐడివారు విచారణ చేస్తే అది డెస్క్ టాప్ ముందు తయారుచేయడం,తర్వాత లాప్ టాప్ కు పంపడం,తర్వాత పెన్ డ్రైవ్ ద్వారా రమేష్ కుమార్ కు  పంపిితే ఆయన హోంశాఖకు పంపించినట్లుగా చెపుతున్నారు.  ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చూస్తే డెస్క్ టాప్,లాప్ టాప్ లలో ఫార్మాట్ చేశారు.పెన్ డ్రైవ్ లో అయినా ఉందా అంటే దానిని ధ్వంసం చేశారు.ఏంటిది....ఇది దేనికి సంకేతం.ఇంతకుముందు వ్యక్తమైన అనుమానాలను బలపరుస్తున్నాయా ....లేదా....ఎస్....నిజంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నప్పుడు అధికారికంగా లెటర్ రాస్తే దాని ఆధారాలను లేకుండా చేయాల్సిన పరిస్ధితి ఎందుకు వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న." అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్వతంత్రంగా వ్యవహరించలేదు...ఆయన ఒకరి చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరించారు.చంద్రబాబుగారు ఏమీ చెబితే అది చేశారు.ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు..టిడిపి కార్యాలయంలో తయారుచేసిన ఉత్తరం మీద మాత్రమే రమేష్ కుమార్ గారు సంతకం పెట్టారు తప్ప ఆయన ప్రిపేర్ చేసిన లెటర్ కాదు అనేటువంటి అనుమానాలు బలపడుతున్న సందర్భం," అంటూ వై ఎస్ ఆర్ సి పీ ఎం ఎల్ ఏ అంబటి రాంబాబు లేవనెత్తిన ప్రశ్న, కొత్త సందేహాలకు తావిస్తోంది.  221 దీనికి రిఫరెన్స్ నెంబర్ ఇస్తే, ఆ నెంబర్ ఏమిటని అడిగితే టిడిపి ఎంఎల్సి అశోక్ బాబు రాసిన లెటర్ కిచ్చిన నెంబర్ ను దీనికి ఇచ్చారు.  అంటే తప్పుచేసేటప్పుడు కచ్చితంగా ఆధారాలు వదిలిపెట్టి వెళ్తారనేది ఇక్కడ నిజమయిందన్న మాట అంటూ కూడా రాంబాబు విశ్లేషించారు.

దుకాణాలకు తెలంగాణాలో మాత్రం మే 7 వరకూ అనుమతి లేదు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తుండటంతో కేంద్ర హోంశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని షాపులు ఇకమీదట తెరచుకోవచ్చని తెలిపింది. ఐతే... కొన్ని కండీషన్లు పెట్టింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని కేంద్రం తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలకుల అనుమతి తప్పనిసరి మార్గదర్శనం చేసింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది కాబట్టి... తెలంగాణలో కేంద్రం రూల్ వర్తించదు. అదే ఏపీలో కేంద్ర వెసులుబాట్లు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏపీలో అన్ని షాపులూ తెరచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... కేంద్రం  చెప్పిన కండీషన్ల ప్రకారం షాపులు తెరచుకోవచ్చు.  దేశవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరో ముఖ్య విషయమేంటంటే, హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి వీల్లేదు.  ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిరాణా షాపులు, నిత్యవసర, అత్యవసర, మందులు, ఫార్మసీ షాపులు మాత్రమే తెరవొచ్చని కండీషన్ పెట్టింది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల షాపులూ తెరచుకోవచ్చునని వెసులుబాటు కల్పించింది. ప్రజలు సామాజిక దూరంపాటిస్తూ,మాస్క్, శానిటేజర్లు వాడుతూ, కేంద్రం, వివిధప్రభుత్వాలు ఇచ్చిన ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి. లేకపోతే కరోనావైరస్ సామాజిక వ్యాప్తికి దోహదం అవుతుందని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కో‌రుతున్నారు. అంటే స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. ఐతే... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉండాలి. అలాగే... ఇదివరకట్లా అందరు ఉద్యోగులూ ఆ షాపుల్లో ఉండకూడదు. సగం(50%) మంది ఉద్యోగులతోనే నడపాలి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చెయ్యాలి, అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

ఏపీలో 1,016కు చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో కొత్తగా 61 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదనుకున్న శ్రీకాకుళం లో మూడు కేసులు నమోదు కావటంతో, ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని, ఇది పోలీసు వారి అవసరం కాదని, ప్రజలు వారంతట వారే స్వీయ నిర్బంధం ఏర్పాటు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన లను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని కూడా అధికారులు చెప్పారు.  ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా బాపట్లలో క్వారంటైన్ నుంచి 30మందిని డిస్చార్జ్ చేసిన అధికారులు. వీరంతా 28రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని రెండు సార్లు నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు. మరో14రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని వీరికి సూచనలు జారీ చేశారు.

కర్నూలు జిల్లాలో 24 మందికి కరోనా నుంచి విముక్తి

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 24 మందిని విశ్వభారతి  కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 31 మంది కరోనా నుంచి విముక్తి పొందినట్టు చెప్పారు.  ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 24 మందిలో కర్నూలు నగరం 7 మంది;  నంద్యాల పట్టణం 7 మంది;  పాణ్యం - ఇద్దరు;  సిరివేళ్ళ-ఇద్దరు;  గడివేముల -ఒక్కరు; రుద్రవరం -ఒక్కరు; నందికొట్కూరు- ఇద్దరు; ఆత్మకూరు- ఒక్కరు; డోన్ - ఒక్కరు. వీరందరూ కూడా పురుషులే. కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రికి వెళ్లి కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి... డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదు, ఫ్రూట్స్ కిట్స్ ను స్టేట్ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అందించారు, తర్వాత ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపించారు.  ఈ నెల 6న జిల్లా కోవిడ్ ఆస్పత్రి విశ్వభారతి ఐసోలేషన్ వార్డులలో ఆ 24 మందికి నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసినట్టు విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి డాక్టర్లు వివరించారు.

పనిలేని హీరోలు.. పనికిమాలిన ఛాలెంజ్ లు

రాజుగారు ఆయన వీపు ఆయన గోక్కున్నా భటులకు గొప్పే అన్నట్టుంది ప్రస్తుతం మన సెలెబ్రిటీల 'Be the real man' ఛాలెంజ్. 'మా హీరో అంట్లు తోమాడు, అసలు మా వాడు రియల్ హీరో అంటే' అని కొందరు తెగ మురిసిపోతున్నారు. అబ్బబ్బ ఆ డైరెక్టర్ ఇల్లు ఊడ్చాడు, అబ్బబ్బ ఆ హీరో దోసె వేశాడు, అబ్బబ్బ ఆ హీరో మొక్కలకు నీళ్లు పోశాడు. వీళ్ళు రియల్ హీరోస్ అంటే అని కొందరు ఓ భజన చేసేస్తున్నారు. ఏ? ఇలా ఇంట్లో పనులు ఎవరూ చేసుకోవట్లేదా?.. సెలబ్రిటీలు ఏమన్నా స్వర్గం నుండి ఊడిపడ్డారా ఏంటి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా మనకి వింతేనా?.. కొన్నిరోజులైతే మా హీరోకి తుమ్మొస్తే ఆయన చేతిని ఆయనే అడ్డుపెట్టుకున్నాడు అని కూడా మురిసిపోయేలా ఉన్నారు. అసలిలా సెలబ్రిటీలు వాళ్ళింట్లో పని వాళ్ళు చేస్తూ వీడియోలు పెట్టడం వలన సమాజానికి ఒరిగేదేంటి? పైసా కూడా ఉపయోగం లేదు. షూటింగ్ లు లేక ఇంట్లో ఖాళీగా ఉన్న సెలబ్రిటీలు.. ఇలా ఛాలెంజ్ లు, చీపురుకట్టలు అంటూ మనల్ని పిచ్చోళ్లను చేసి సొమ్ము చేసుకుంటున్నారు అంతే. ఈ రోజుల్లో దాదాపు సెలబ్రిటీలు అందరూ ఫేస్ బుక్ అని, ఇంస్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. వాటికితోడు సొంతంగా యూట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. ఇంకేముంది తుమ్మినా దగ్గినా వీడియో చేస్తున్నారు. మనం ఎగబడి వీడియోలు చూస్తూ వాళ్ళ జేబులు నింపుతున్నాం. సెలబ్రిటీ లు ఏం చేసినా పబ్లిసిటీనే, ఏం చేసినా పైసలే. వీళ్ళు చేసే ఈ ఛాలెంజ్ ల వల్ల సమాజానికి పైసా కూడా ఉపయోగం లేదు. లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీల నుంచి రైతుల వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వారికి ఎంతమంది సెలెబ్రిటీలు అండగా నిలబడ్డారు?. ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ కాసులు సంపాదించడమే తప్ప.. వారిని కోటీశ్వరులను చేసిన సమాజం కోసం ఏం చేస్తున్నారు?. హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి కోట్లు సంపాదిస్తున్నారు. యంగ్ హీరోలు, డైరెక్టర్లు ఒక్కో సినిమాకి 10-15 కోట్లు పైనే తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అయితే ఒక్కో సినిమాకి 20-30 కోట్లు పైనే తీసుకుంటున్నారు. మా సినిమా అంత కలెక్ట్ చేసింది, ఇంత కలెక్ట్ చేసిందని గొప్పలు చెప్పుకుంటారు. అదంతా ఎవరి సొమ్ము?. సామాన్యులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో సినిమాలు చూసి.. వాళ్ళని ఇంతటి వారిని చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఉండేవారు అప్పట్లో సీడీలు, ఇప్పుడు ఒటిటి ప్లాట్ ఫార్మ్ లలో సినిమాలు చూస్తున్నారు. కానీ, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ థియేటర్స్ లో సినిమాలు చూసి కలెక్షన్ల వర్షం కురిపించేది మాత్రం సామాన్యులే. రిక్షా తొక్కేవారు, ఆటో నడిపేవారు, కూరగాయలు అమ్మేవారు, రోజువారీ కూలీలు.. వారు కష్టపడి సంపాదించిన సొమ్ముతో థియేటర్ కెళ్ళి సినిమా చూస్తారు. మా హీరో అంటూ ఎక్కువసార్లు చూసి కలెక్షన్లు పెంచుతారు. అలా కలెక్షన్లు పెరగడం వల్లనే.. హీరోలకు, డైరెక్టర్లకు రెమ్యూనరేషన్స్ పెరిగి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి వారిని ఇంతటివారిని చేసిన సామాన్యుల కోసం ఏం చేస్తున్నారు ఈ సెలబ్రిటీస్?. రోజువారీ కూలి లేక, కూలీలు కడుపు మాడ్చుకుంటున్నారు. పంట సరిగా పండక, పండిన పంటని కొనేవారు లేక, గిట్టుబాటు ధర లేక.. రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి బాధలు సెలెబ్రిటీలకి పట్టవా?.  ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసి, ఏదో ఘనకార్యం చేసినట్టు ఓ నిమిషం వీడియో రిలీజ్ చేసి 'Be the real man' అంటే సమాజానికి ఒరిగేది ఏముండదు. సాటి మనిషికి సాయం చేసేవాడే నిజమైన మనిషి అని తెలుసుకొని.. సామాన్యులకు సాయం చేయండి. అంతేకాని ఇలా కాసుల కోసం ఛాలెంజ్ ల పేరిట ముడ్డి మూతి కడుక్కున్న వీడియోలు పెట్టకండి. మీకు ఇప్పటికే సమాజం చాలా ఇచ్చింది. ఇలాంటి సమయంలో ఎంతో కొంత తిరిగిఛ్చి రియల్ హీరోస్ అనిపించుకోండి. లేదంటే డమ్మీ హీరోలుగా మిగిలిపోతారు. ఇప్పటి నుంచి మనం కూడా కష్టకాలంలో సామాన్యులకు అండగా నిలిచిన సెలెబ్రిటీలనే ఆదరిద్దాం. ఇలా పైసల కోసం పబ్లిసిటీ చేసుకునే డమ్మీ హీరోలను పక్కన పెడదాం.

జగన్ ప్రయత్నాలకు సుప్రీంలో బ్రేక్ పడనుందా?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోగానే మధ్యలోనే ఆగిపోయిన స్ధానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేయబోతోందా అంటే తాజా పరిణామాలు అవుననేలా ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గకముందే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టులో నరేంద్రరెడ్డి అనే లాయర్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై రేపో మాపో విచారణ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో స్దానిక ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలను సైతం నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిల్ లో కోరారు.  ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు స్ధానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నికల కమిషనర్ ను మార్చి కొత్త కమిషనర్ ను నియమించిన ప్రభుత్వం.. స్ధానిక ఎన్నికలకు తమ పార్టీ నేతలను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కరోనా తర్వాత సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకూ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని నరేంద్రరెడ్డి అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. కరోనా తగ్గకుండా ఎక్కడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో అభ్యర్ధించారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఓటర్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లేనని పిటిషనర్ తన పిల్ లో అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు.  సుప్రీంకోర్టులో దాఖలైన తాజా ప్రజా ప్రయోజన వాజ్యం ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కరోనా ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.... మరోసారి ఈ పిల్ తో ఏకీభవిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. కరోనా ప్రభావం తగ్గగానే స్ధానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏపీలో ఎన్నికల కమిషనర్ తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా సన్నద్దవుతున్న తరుణంలో ఈ పిల్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.

వస్తే ఉద్యోగులతో.. లేదంటే ఒంటరిగా.. రాజధాని తరలింపుపై జగన్ ప్లాన్ ఇదేనా?

ఏపీ రాజధాని అమరావతి తరలింపు విషయంలో కోర్టు మొట్టికాయలు వేస్తున్నా జగన్ ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు రంగం సిద్దం చేస్తోంది. వచ్చే నెలలో కరోనా వైరస్ లాక్ డౌన్, ఇతరత్రా వ్యవహారాలతో సంబంధం లేకుండా రాజధాని తరలింపు కోసం ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీలో రాజధాని బిల్లులు ఆమోదం పొందకుండా ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసే పనిలో ఏపీ  సీఎంవో బిజీగా ఉంది. నెల రోజుల వ్యవధిలో విశాఖకు తరలి వెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.  రాజధాని తరలింపు కోసం జగన్ సర్కారు ఈ ఏడాది జనవరిలోనే రంగం సిద్దం చేసింది. రాజధాని తరలింపు కోసం కీలకమైన రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదించినా... మండలి అడ్డుకోవడంతో అవి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకుతో బిల్లులు ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లే అనే వాదనను హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే జరిగితే మరోసారి రాజ్యాంగ పరమైన చర్చకు తెరలేవక తప్పదు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ ఆలస్యం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అవి కాలాతీతం అయ్యాయన్న సాకును తెరపైకి తీసుకొచ్చేలా ప్రణాళిక రచిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై రాజధాని తరలింపు ఆధారపడి ఉంటుందని  చెప్తున్నారు. ఒక వేళ హైకోర్టులో ప్రభుత్వ వాదన నెగ్గితే ఉద్యోగులతో కలిసి మే నెలలోనే విశాఖ తరలి వెళ్లేందుకు సీఎం జగన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. అలా కుదరక హైకోర్టు అభ్యంతరాలు చెప్పే పక్షంలో తాను ఒంటరిగానైనా వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదికారులకు ముందస్తు సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఏదేమైనా వెళ్లడం ఖాయమన్న సంకేతాలను ప్రభుత్వ పెద్దలు అధికారులకు పంపుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.

తిరుపతిలో చికెన్, మటన్ దుకాణాలు బంద్!

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్  లాక్ డౌన్ అమల్లో ఉంది మరియు రెడ్ జోన్లు నమోదు కావడం, నగరంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండుటకు ఆదివారం నాడు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో చికెను, చేపలు, మటను దుకాణాలు తెరువరాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  లాక్ డౌన్ ముగిసేవరకు ప్రతి ఆదివారం తిరుప‌తి నగరంలో చేపలు, చికెన్ మరియు మటన్ దుకాణాలు తెరవకూడదు. ఈ చర్య ప్రజాఆరోగ్యమును  దృష్టిలో వుంచుకొని తీసుకున్న ముందు జాగ్రత్త చర్య అట్లు సూచనలు పాటించక దుకాణములు తెరిచిన యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. ఈ నిబంధనలు ఉల్లంఘించిన యెడల దుకాణం సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామ‌ని మున్సిప‌ల్ క‌మీష‌న్ హెచ్చ‌రిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తిరుప‌తి నగరపాలక సంస్థ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు తెరిచినచో కాల్ సెంటర్ 0877-2256766 కి స‌మాచారం ఇవ్వాల‌ని క‌మీష‌న‌ర్ కోరారు.