శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు

- అద్భుతమైన జ్ఞానమూర్తి ఆదిశంకరులన్న స్వరూపానంద - ట్విట్టర్ ద్వారా స్వాత్మానంద సందేశం విశాఖ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో సాగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో నిర్వహించారు. వేకువ జామున గణపతి పూజతో శంకర జయంత్యుత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలుత కలశారాధన, మండపారాధన చేశారు. ఆ తర్వాత శంకరాచార్యుని దివ్య ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పూలతో విశేష అర్చన చేశారు. లోక కల్యాణార్ధం శాంతి హోమాన్ని నిర్వహించారు. శంకర జయంతి వేడుకలను రోజంతా నిర్వహించేందుకు వీలుగా పీఠం ప్రతినిధులు ఏర్పాట్లు చేసారు. పీఠంలో పనిచేసే అతి కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఈ జయంత్యుత్సవాలకు హాజరయ్యారు.  విజ్ఞాన రాశుల్ని అందించిన జ్ఞాన మూర్తి ఆదిశంకరులు సర్వ మానవాళికి విజ్ఞాన రాశులను అందించిన అద్భుతమైన జ్ఞాన మూర్తిగా ఆదిశంకరాచార్యుడిని అభివర్ణించారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. ఆది శంకరులు బోధించిన అద్వైత జ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి మానవాళి ప్రయత్నిస్తుండటం శుభ పరిణామం అన్నారు. భగవదారాధన గురించి ఆదిశంకరులు కన్నా గొప్పగా బోధించిన వారు మరొకరు లేరన్నారు. మానవులంతా శంకరాచార్యుడిని నిత్యం స్మరించుకునే రోజు రావాలన్నదే తన ఆశయంగా చెప్పుకొచ్చారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర.  ట్విట్టర్ ద్వారా సంస్కృతంలో సందేశం పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర శంకర జయంతి సందేశాన్ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందేశం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది. మన ఆత్మనే పరబ్రహ్మ స్వరూపంగా భావించాలని శంకరాచార్యులు ప్రబోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. కరోనా గండం నుంచి గట్టెక్కడానికి పూర్వీకుల విధానాలను పాటించాలని, ప్రభుత్వ నియమాలను అనుసరించాలని సూచించారు స్వామి స్వాత్మానందేంద్ర మూడు రోజులుగా భాష్య పారాయణ శంకర జయంతిని పురస్కరించుకుని మూడు రోజులుగా పీఠం ప్రాంగణంలో భాష్య పారాయణ నిర్వహించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు శంకరాచార్యులు ప్రత్యేకంగా భాష్యం చెప్పారు. దీనినే ప్రస్థాన త్రయం, శంకర భాష్యం అని కూడా అంటారు. జగద్గురువు జయంతి సందర్భంగా పీఠంలో శంకర భాష్య పారాయణ చేసారు. ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర స్వయంగా ఈ పారాయణలో పాల్గొన్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, అద్వైత సిద్ధాంతాన్ని  ప్రచారం చేయడంలో భాగంగా పారాయణ చేపట్టినట్లు స్వామి స్వాత్మానందేంద్ర తెలిపారు.

ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి

ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 1,177 కి చేరాయి. నిన్న ఒక్కరోజులో 80 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 7జిల్లాల్లో కొత్త కేసులు లేవు. రాష్ట్రం లో ఇప్పటికి 31 మంది మృతి చెందారు. కృష్ణా లో కోవిడ్ ఆసుపత్రి డాక్టర్ కరోన పాజిటివ్ సోకింది.  ఇప్పటివరకూ రాష్ట్రం లో 74,551 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఏ.పి.లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గగా, రికవరీ శాతం పెరుగుతోంది.  రెడ్ జోన్ ప్రాంతాల్లో అకారణంగా రోడ్డుపైకినవస్తే, పోలీసులు క్వారంటైన్ కి పంపుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూల్ లో 292, గుంటూరు 237, కృష్ణా210, నెల్లూరు79, చిత్తూరు73, కడప58, ప్రకాశం56, ప. గో.54, అనంతపురం53, తూ. గో.39, విశాఖ22, శ్రీకాకుళం లో 4 కేసులు నమోదయ్యాయి.

అన్న‌దాత‌ల్ని ఆదుకోండి

ఏపీ సి.ఎంకు టిడిపి నేత లోకేష్ లేఖ‌ కరోనా లాక్డౌన్ కారణంగా పంట దిగుబడులను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి టిడిపి నేత లోకేష్ ఒక లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే ప‌ట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా మొద్దు నిద్ర నటిస్తున్నారా? అని నిలదీశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో.. అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.  రైతులకు భరోసా ఇవ్వడంలో ప్ర‌భుత్వం విఫల‌మైందని విమర్శించారు. రబీ సీజన్లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా అందులో అరటిని నామ్ కే వాస్తేగా కేవలం 7వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ప్రకటనలకు, కొనుగోలుకు ఎంత అగాధం ఉందో అర‌టిధ‌ర చూస్తే అర్థమ‌వుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రూ.30వేల కోట్ల రూపాయలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? అని లోకేష్ ప్రశ్నించారు. అరటి టన్ను లాక్ డౌన్ కు ముందు రూ.15,000 వరకు ఉండగా ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1500 కు కొనుగోలు చేస్తున్నారని, కర్భూజ టన్ను రూ.3 వేలకు, టమోట కేజీ రూ.2కు, కొబ్బరికాయ రూ.7కు కొంటున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రబీ సీజన్లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయని, ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొగాకు, పసుపు, శనగ, మిర్చి, కంది ఇలా అనేక పంటలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారని, ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటికీ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లే పూర్తి కాలేదని, రూ.300 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రబీ సీజన్లో పంట కోతకు వచ్చిందని, మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉందని, వీటిని కొనే నాథుడే లేడని వాపోయారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామి మాటలకే పరిమితమయిందని విమర్శించారు. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయని, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరితో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న, నువ్వు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయని, సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్సారం చేయకుండా రైతులను ఆదుకోవాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిగా మీపై ఉందని జగన్మోహనరెడ్డికి లోకేష్ స్పష్టం చేశారు.

టీకా వచ్చే వరకు జాగ్రత్తలు పాఠించాల్సిందే!

దేశాన్ని కాపాడటంలో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యులు కావాలని మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయ‌న అన్నారు. మెదక్ టౌన్ లోని  ఓ ఫంక్షన్ హాలులో నాయినీ బ్రాహ్మణులకు, పాస్టర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సరుకుల్ని పంపిణీ చేశారు.  కరోనా విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బులు వేస్తోంది. బ్యాంకులో ప్రభుత్వం వేసిన డబ్బులు ఎక్కడికీ పోవు.  డబ్బులు తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయని దుష్ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు.  డబ్బులు అవసరం ఉన్న వారు మాత్రమే బ్యాంకుల వద్దకు వెళ్లండి. అందరూ వెళ్లి గందరగోళం సృష్టించవద్దని హ‌రీష్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. నాయినీ బ్రాహ్మణులకు షాపులు తెరవకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. కరోనా లాక్ డౌన్ నుండి రిలాక్సేషన్ కొంత ఇవ్వడానికి సీఎం గారు ఆలోచిస్తున్నారు.  ఇప్పటికిప్పుడే కరోనా పోదని...నిపుణులు చెబుతున్నారు. సీఎం గారు అంతా ఆలోచన చేస్తున్నారు.   నాయినీ బ్రాహ్మణులు లాక్ డౌన్ ముగిసాక తమ షాపులు తెరిచినా... తప్పకుండా మాస్క్ లు ధరించాలి. ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం తప్పనిసరిగా పాఠించాలని హ‌రీష్‌రావు సూచించారు. వేడి ఆహరం, వేడి నీళ్లు తాగండి, ఫ్రిజ్ లో పెట్టి తినకండి. చల్లటి వస్తువులు తినవద్దు. పసుపును వేడి నీళ్లలో వేసి ఆవిరిపట్టండి.  శానిటైజర్స్ ను వాడండి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోండి. ప్రొటీన్ ఆహార పదార్థాలు, తాజా పండు తినండి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనాకు టీకా వచ్చే వరకు మనం జాగ్రత్తలు పాఠించాలని మంత్రి సూచించారు.

దివిసీమకు  అక్రమ మార్గంలో చేరుకున్న ఉత్తరకోస్తా మత్స్యకారులు

కృష్ణ జిల్లా దివిసీమవాసులకు కొత్త ఆందోళన మొదలైంది. తమిళనాడు నుంచి నాలుగు బోట్లలో 90మందికి పైగా అక్రమ మార్గంలో నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులకు చెఱుకున్నారని, వీరంతా శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలని చెపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎదురుమొండి దీవి వాసులు ఆందోళనలో పడ్డారు. వారిని నిలిపేవేసి అధికారులకు సమాచారం అందించిన ఆపదమిత్రలు, గ్రామస్తులు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన  మత్స్య కారులు వేటకోసం సముద్రంలోకి వెళ్ళగా లాక్ డౌన్ ప్రభావంతో చెన్నెలో ఉండిపోయారని, త్రాగునీరు సౌకర్యం లేదని అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని, తినడానికి తిండి దొరకని పరిస్థితి లో  తమ జిల్లాలకు తిరిగి వెళ్లేందుకు సముద్ర మార్గం ద్వారా బయలుదేరారని తెలుపుతున్నారు. సముద్రంలో తుపాను, వర్షం ప్రభావంతో అల్లకల్లోలంగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవటంతో  కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఎదురుమొండి దగ్గర కృష్ణానదిలోకి బయటకు వచ్చామని తెలిపారు.  5 బోట్లలో సుమారు 92 మంది మత్య్సకారులు  ఎదురుమొండి చేరారు. ఈ విషయమై, మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి మాట్లాడుతూ, కొంతమంది మత్స్యకారులు  సముద్ర మార్గంలో ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారన్న సమాచారంతో అధికారులు విచారించగా వారందరూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మత్స్యకారులుగా  తెలిసింది. వీరందరూ చెన్నై నుండి వారి జిల్లాలకు సముద్ర మార్గంలో తిరుగు ప్రయాణంలో ఉండగా సముద్రంలో వాతావరణం సరిగాలేక నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారు. 92 మందికి ఉండేందుకు అన్ని సదుపాయాలూ సమకూర్చామని, వాతావరణం అనుకూలించాక పై అధికారుల ఆదేశాలనుసారం వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేస్తామని ఆర్ డి ఓ చెప్పారు.

హైద‌రాబాద్‌లో ప్లాస్మా దానానికి 32 మంది రెడీ! ఓవైసీ 

కరోనా వైరస్‌కి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, లాక్‌డౌన్, ఇమ్యునిటీ శక్తిని పెంచుకోవడమే ఆ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి మన దగ్గరున్న మార్గం. అయితే ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని పలువురు వైద్యులు నిరూపిస్తున్నారు. ఈ తరుణంలో కరోనాను జయించిన వాళ్ల ప్లాస్మా.. కరోనా పేషంట్లకు ఇస్తే.. కోవిడ్ నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వీరిలో కొంతమంది ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలుగజేసుకున్నారు. తానే దగ్గరుండి కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడి ప్లాస్మా దానానికి ఒప్పించారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు ఎంపీ అసదుద్దీన్. అంతే కాదు కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీకి చెందిన 200 మంది తబ్లీగీలు ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థులుగా ఉన్న రోగులకు ఆ ప్లాస్మాతో చికిత్స జరుపుతారు. ఇఫ్తార్‌ ముగిశాక తబ్లీగీలు తమ ప్లాస్మాను దానం చేశారని, ఈ సేకరణకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ షోయిబ్‌ వెల్లడించారు.

న‌ర్సుగా మారిన మేయ‌ర్‌ కిశోరీ పెడ్నేకర్! 

క‌రోనా మ‌హ‌మ్మారి వికృత‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. డెడ్లీ వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు ప్ర‌త్యేకంగా, ప‌రోక్షం తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటి ఆప‌ద స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు, క‌రోనా బాధితుల‌కు  అండ‌గా వుండాల్సిన స‌మ‌యంలో రాజ‌కీయ నేత‌లు, సెలెబ్రిటీలు త‌మ త‌మ నైజాన్ని బ‌ట్టి స్పందిస్తున్నారు. కొంత మంది నేత‌లు చిత్త‌కార్తె కుక్క‌ల్లా ప‌ర‌స్ప‌రం స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం నిందించుకుంటుంటే మ‌రి కొంద‌రేమో ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నింపుతూ అండ‌గా నిల‌బ‌డుతున్నారు.  ముంబయి మేయర్‌ కిశోరీ పెడ్నేకర్ న‌ర్సు డ్రెస్ వేసుకొని ఓ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. నాలుగు మంచి మాట‌లు మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో అందరం ఐక్యంగా ఉండి కరోనాపై పోరాడాలి' అని ఆమె పిలుపునిచ్చారు. ముంబయి పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. కరోనా వైర‌స్‌తో ముందు వ‌రుస‌లో వుండి యుద్ధం చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి దేశవ్యాప్తంగా మద్దతు ల‌భిస్తోంది.  ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నర్సింగ్‌ స్టాఫ్‌ను ప్రోత్సహించేందుకు అక్కడి మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ నర్స్‌ దుస్తుల్లో బీవైఎల్‌ నాయర్‌ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అక్కడి నర్సింగ్‌ సిబ్బందితో ఆస్పత్రి కలియదిరుగుతూ. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఎదురవుతోన్న ఇబ్బందులపై అడిగి తెలుసుకున్నారు.   ఆస్పత్రిలో అందరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'నేను గతంలో నర్సుగా పని చేశాను. ఈ విధుల్లో ఉండే సవాళ్లపై అవగాహన ఉంది. నర్సింగ్‌ సిబ్బందికి  నేనూ వారిలో ఒకరినే అన్న భావన కల్పించేందుకు ఇలా వచ్చానని కిశోరీ పెడ్నేకర్ తెలిపారు. ఇదీ సేవ అంటే .. అంట్లు తోముతూ .. టాయిలెట్లు కడుగుతూ వీడియోలు పంపుతున్న మన సెలెబ్రిటీలు, రాజ‌కీయ‌నాయ‌కులు ఈమెని చూసి సిగ్గుపడాలి. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం దేశంలో మ‌రెక్క‌డా లేనివిధంగా మ‌న లీడర్లు కోడిగుడ్డు మీద ఈక‌లు ఏరుతూ నీచాతి నీచ‌మైన ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ప్ర‌చారం చేసుకోవ‌డాన్ని చూసి తెలుగు ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో ఇంట్లో కూర్చోని నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌కుండా క‌నీసం పదిమందికి సహాయం చేయాలనే తలంపుతూ పదిమందికి ఉప‌యోగ‌ప‌డేలా ఏదైనా చేయాల‌నే బుద్ధి రాక‌పోతే జ‌నం ఛీ కొడ‌తారు.

విజయవాడ మరో ఉహాన్ కాకముందే మేల్కోండి!

సీఎం నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభిస్తోందని జ‌న‌సేన ఆరోపించింది. ముఖ్యమంత్రి నివాసానికి స‌మీపంలో ఉన్న కృష్ణలంక కరోనాకు కేరాఫ్ అడ్రస్‌‌‌గా మారింది. రెడ్‌జోన్‌లను కనీసం సందర్శించని మీరు సమర్థ వంత‌మైన ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నిస్తూ సీఎం జగన్‌కు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. గవర్నర్ బంగ్లాను కరోనా తాకినా.. విజయవాడ నగరంపై సీఎం జగన్ దృష్టిసారించరా? అని ప్రశ్నించారు.  ఎంపీ విజయసాయి రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతూ వైరస్ సాయిరెడ్డిగా మారిపోయారని ప్రజలు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విజయవాడ మరో ఉహాన్ కాకముందే మేల్కోవాలన్నారు. రాజకీయ చదరంగంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల బంగారు భవిష్యత్తు ఆగమైపోతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్ల ఈ రెండు జిల్లాల ప్రజలు తమ ఆస్తులను కోల్పోవడంతో పాటు ప్రాణాలను సైతం పోగొట్టుకునేలా ఉందన్నారు. ఇప్ప‌ట్టికైనా  ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ చూపి ప్రజల ప్రాణాలను కాపాడాలని మహేష్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి పట్టిన డేంజరస్‌ వైరస్‌ వైసీపీః కొల్లు రవీంద్ర 

విజయవాడ సెంటర్‌లో జబ్బలు చరుచుకొని చాలెంజ్‌లు విసురుకునే సమయం కాదు. పింఛను, రేషను కావాలంటే ‘మా పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం కావాలి’ అంటూ సంతకాలు చేయండంటూ వలంటీర్లు బలవంతంగా సేకరిస్తున్నారంటే ప్రభుత్వ పైశాచికత్వం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ‘‘రాజ్‌భవన్‌లో కరోనా పాజిటివ్‌ రావడం రాష్ట్రానికే సిగ్గుచేటు.. ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా చూడలేదు. ‘‘విపత్తుల్లోనూ రాజకీయాలే వైసీపీ అజెండా. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం. రాష్ట్రానికి పట్టిన డేంజరస్‌ వైరస్‌ వైసీపీ. ప్రచారం కోసం వైసీపీ నేతలే వైర్‌సని వ్యాప్తి చేశారు’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

36 ఏళ్ల వయస్సులోనే కిమ్ చనిపోయాడా?

హంగ్‌కాంగ్‌కు చెందిన HKSTV చానెల్ వైస్ డైరెక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చనిపోయారని వెల్లడించారు. ఇది తమకు నమ్మకమైన సోర్స్ ద్వారా తెలిసిందని స్పష్టం చేశారు. దీంతో అంతా కిమ్ చనిపోయాడనే అనుకుంటున్నారు. కానీ, 36 ఏళ్ల వయస్సులోనే కిమ్ చనిపోయివుంటారా? అయితే కిమ్ వార‌సుల్ని ఎలా నియ‌మిస్తారు? ఉత్తర కొరియా 1948లో ఏర్పడింది. అప్పటి నుంచీ దేశాన్ని కిమ్ కుటుంబమే పాలిస్తోంది.  తదుపరి దేశాన్ని పాలించే నేత ఎవరన్నదానికి ఆమోదం తెలిపాల్సింది సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. కానీ, ఇది నిజానికి ఓ రబ్బర్ స్టాంపు పార్లమెంటు లాంటిది. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, దాని పరోక్ష వ్యక్తులే అందులో కీలకంగా ఉంటారు. సాధారణంగా దేశాన్ని తదుపరి పాలించేది ఎవరన్నది కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ముందుగానే నిర్ణయమవుతుంది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించిన తర్వాత ఆయన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్ పాలక పదవిని చేపట్టారు. ఇల్ సంగ్ తన కుటుంబానికి అధికార కేంద్రంలో సుస్థిర స్థానం సిద్ధం చేసే కాలం చేశారు. కొరియన్ నాగరికతలో పవిత్రంగా భావించే బయెకదూ పర్వతం నుంచి తమ వంశం దిగివచ్చినట్లుగా ప్రజల్లో భ్రమను నింపారు. ఇల్ సంగ్ తన కుమారుడు కిమ్ జాంగ్ ఇల్‌ను వారసుడిగా నిర్ణయించారు. అనంతరం జాంగ్ ఇల్ తన కుమారుడు కిమ్ జోంగ్ ఉన్‌ను వారసుడిగా నిర్ణయించారు. కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఇంకా చిన్న పిల్లలు. వాళ్లెవరూ బయటకు కనిపించరు. అసలు ఉత్తర కొరియా ప్రజలకే వాళ్ల పేర్లు ఏంటో తెలియదు అధికారం కోసం ఇప్పుడే వారిని సిద్ధం చేసే అవకాశాలు చాలా తక్కువ. కిమ్ జోంగ్ ఉన్ అకస్మాత్తుగా మరణించి, ఆయన స్థానంలోకి ఎవరూ రాకపోతే, దేశంలో అధికార శూన్యత ఏర్పడే అవకాశం ఉంది.   ఉత్తరకొరియాను కర్కశంగా పాలిస్తున్న నియంత కిమ్ జాంగ్ ఉన్ చ‌నిపోయారా? ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అమెరికా - దక్షిణ కొరియా దేశాలు మాత్రం బతికే ఉన్నాడని చెబుతున్నాయి. అయితే సీఎన్ఎన్ సహా అమెరికా ఇంటెలిజెన్స్ మాత్రం చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నియంత‌గా మారాడు. 2011లో ఉత్తరకొరియా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనకు పోటీగా ఉన్న బంధువులు - కుటుంబ సభ్యులందరినీ చంపించేసి వారి ఆచూకీ సైతం దొరకకుండా చేశాడు. అంతే కాదు కిమ్ అణ్వాయుధాలు తయారు చేసి అమెరికాకు పక్కలో బల్లెంలా మారి అమెరికాను బెదిరించాడు. పక్కనున్న దక్షిణ కొరియా - జపాన్ ను భయపెట్టాడు. చైనా అండతో చెలగేరిగిపోయాడు. ‘ద స్టార్’ పత్రిక కథనం ప్ర‌కారం కిమ్ అధికారులను శిక్షించ‌డానికి బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా ఫిరాన్హా అనే రాకాసి చేపలను వందల సంఖ్యలో దిగుమతి చేసుకున్నాడు. వాటిని ప్రత్యేక ట్యాంకుల్లో పెంచుతున్నాడు. అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ తన ముఖ్య అనుచరులు, జనరల్ స్థాయి అధికారుల చేతులను నరికించాడు. అనంతరం బతికుండగానే వారిని ఫిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు. ఉత్తర కొరియాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు రహస్యంగా చేరవేసిన కారణంగానే ఆ అధికారులను కిమ్ అలా శిక్షించాడు. ‘ద స్పై హు లవ్స్ మీ’ 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమాలో విల‌న్ కర్ల్ స్ట్రామ్‌బర్గ్ తన శత్రువులను షార్కు చేపలతో నిండివున్న ఆక్వారియంలో పడేసి చంపుతాడు. ఆ సీన్ కిమ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. అందుకే ఫిరాన్హా చేపలకు ఆహారంగా అధికారుల్ని వేశాడు. అంతే కాదు త‌న శ‌త్రువుల తలలు నరికించడం, సజీవంగా దహనం చేయడం, పులుల‌కు ఆహారంగా ప‌డేసి వికృతానందం పొందుతాడ‌ని ‘ద స్టార్’ ప‌త్రిక రాసింది. 2017 అక్టోబ‌ర్‌లో అమెరికా వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికాను ఈ భూమండలంపై అసలు ఉనికి అనేదే లేకుండా చేయడమే తమ లక్ష్యమని కిమ్ బహిరంగ హెచ్చరికను జారీ చేశారు. ఈ సందర్భంగా తన సైనికులతో ఒక ప్రతిజ్ఞ చేయించారు. మన లక్ష్యం ఒక్కటే... అమెరికాలోని ప్రధాన నగరాలపై విరుచుకుపడడం అని ఆయన తెలియజేశారు. తమతో కలిసి పని చేసేందుకు దాదాపు 47 వేల మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా సిద్ధంగా ఉన్నారని ఉత్తరకొరియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కిమ్ పాలనతో ఆదేశం 100 ఏళ్లు వెనుకబడిపోయింది. ఇప్పటికీ ఉత్తరకొరియాలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదంటే అక్కడి జనాలు ఎంత అనాగరికంగా బతుకుతున్నారో అర్థం అవుతుంది. ప‌క్క‌నున్న‌ దక్షిణ కొరియా ప్రపంచానికే టెక్నాలజీ అందిచే దేశంగా ఎదిగితే ఉత్తరకొరియా మాత్రం ఆకలిచావులతో అల్లాడుతోంది. అంత దుర్మార్గంగా పాలిస్తున్న కిమ్ చ‌నిపోయాడా? బ‌్ర‌తికున్నాడా అనే వార్త‌ల‌పై ప్ర‌పంచం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భార్య రి సోల్‌ జు ను ప్ర‌జ‌లు చూసి ఏడు నెలలు అవుతోంది. గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్‌తో కలిసి ప్యాంగ్యాంగ్‌లో ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. కిమ్‌ సోదరితో విభేదాల కారణంగానే సోల్‌ జు అదృశ్యమైందని కొందరు చెప్తుండగా.. స్వయంగా కిమ్‌ భార్యను చంపి ఉంటాడని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిమ్‌ జాంగ్ విపరీతంగా పొగతాగేవాడు. భారీ శరీరం కావడం వల్ల 'కార్డియో వాస్కులర్'కు గురయ్యాడు. ఇటీవల సర్జరీ జ‌రిగింది. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నాడు. పరిస్థితి సీరియస్ గానే ఉంది. గుండె సర్జరీ ఫెయిల్ కావ‌డంతో ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడ‌ని ‌అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఏప్రిల్‌ 12న దక్షిణకొరియా వార్త సంస్థలు కూడా కిమ్ జాంగ్ గుండె శస్త్ర చికిత్స ఫెయిల్ అయ్యిందని సీరియస్ గా ఉన్నాడని కథనాలు రాశాయి. ముగ్గురు సభ్యుల ప్రముఖ వైద్యుల బృందాన్ని చైనా ఉత్తరకొరియాకు పంపింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన లైనిస్ డిపార్ట్ మెంట్ నేతృత్వంలో ముగ్గురు వైద్యులు ఉత్తరకొరియాకు వెళ్లారు. ఏదో జరిగిందన్న అనుమానాలకు చైనా వైద్యబృందం వెళ్ళ‌డం బలాన్ని చేకూరుస్తోంది. ఏప్రిల్ 15న ఉత్తర కొరియా జాతి పిత కిమ్ 2 సంగ్ జయంతి వేడుకలు జరిగాయి. ఉత్తరకొరియా ఆవిర్భావానికి ఆయనే ఆద్యుడు. ప్రస్తుతం నియంత కిమ్ జాంగ్ కు తాత. ఈయన జయంతిని ఉత్తరకొరియా అంతటా పండుగలా స్వాతంత్ర‌ దినోత్సవంగా జరుపుతారు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా హాజరయ్యే కిమ్ జాంగ్ ఈ ఏడు జయంతిలో పాల్గొన లేదు. ఏప్రిల్ 11 నుంచి కిమ్ జాంగ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్ప‌ట్టి నుంచి క‌నిపించ‌లేదు. ఎలాంటి అధికారిక సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కి చెందిన రైలుగా చెప్పుకునే ఓ ట్రైన్... ఉత్తర కొరియాలోని రిసార్ట్ టౌన్‌లో వాన్సాన్ ఎలైట్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించింది. శాటిలైట్ ఫొటోల ద్వారా అది ఆ ట్రైనే కావచ్చని చెబుతోంది అమెరికా. సాధారణంగా కిమ్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ట్రైన్‌ని ఉపయోగిస్తారు. ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఈ వాన్సాన్ ఉంది. ఇక్కడ కిమ్‌కి అత్యంత ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుంది. అందువల్ల ఆయన ఇక్కడే ఉండి ఉంటాడనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ కిమ్ జాంగ్ మరణిస్తే వారసురాలు ఎవరని ప్రపంచం ఆసక్తిగా గ‌మ‌నిస్తోంది. అయితే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి 'కిమ్-యే-జాంగ్' అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలనే చిన్నప్పటి నుంచి ఆయన సోదరి కిమ్ యే జాంగ్ వంటపట్టించుకున్నారట.. వాళ్ల కుటుంబంలో అన్నకు తోడు సర్వాధికారాలు కలిగి ఉంటే దేశంలో పాలనలో తనదైన ముద్ర వేస్తుందట. అధ్యక్షుడు కిమ్ జాంగ్ పాలన వ్యవహరాల్లో ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యే జాంగ్ నే నమ్ముతారు. విదేశీ నాయకులతో దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో చెల్లెలు చెప్పినట్టు కిమ్ చేస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కిమ్ మరణిస్తే నెక్ట్స్ వారసురాలు ఆమే కానుంది. కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత కఠినాత్మురాలని, డేంజర్ అని ఉత్త‌ర‌కొరియా ప్ర‌జ‌ల అభిప్రాయం. అప్ప‌ట్లో దక్షిణ కొరియాను ఈమె కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం దుమారం రేపింది.

భారత్ లోనే మరో రెండు డ్రగ్స్

ప్రపంచంలోని శాస్త్రజ్ఞులంతా కూడగట్టుకుని కరోనా మహమ్మారి పీడ వదిలించేందుకు మందో మాకో కనిపెట్టే మహాయజ్ఞంలో తలమునకలై ఉండగా ఈ రక్కసిపై భారత్ మరో అస్త్రాన్ని సంధించింది.. మరో రెండు మందులు కరోనా ఉద్వాసనకు అమృతంలా పని చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత్ లోని Task force for repurposing drugs(TFORD) వెల్లడించింది. జపాన్ లో ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్న faviparivar తో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే TOZILIZUMAB కూడా covid చికిత్సకు వినియోగించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.faviparivar ను 18 చోట్ల క్లినికల్ ట్రయల్స్ లో వాడగా రెండింటి నుంచి మంచి వార్తలే అందాయని అంటున్నారు.ఇక tocilizumab ను 24 చోట్ల ప్రయత్నించగా అన్ని చోట్ల      అనుకూల సమాచారమే ఉన్నట్టు చెబుతున్నారు. కాగా covid కు చికిత్సగా ప్రపంచవ్యాప్తంగా 60 డ్రగ్స్ వేర్వేరు క్లినికల్ ట్రయల్స్ లో ఉండగా,వాటిలో చాలా వరకు భారత్ లో తయారు చేయగలిగేవే కావడం విశేషం.ఇదిలా ఉండగా hydroxychloroquin ని కూడా నాలుగు కేసులలో ప్రయోగించి చూడగా మూడు ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి.

దమ్ముంటే కర్నూలు వెళ్లండి: జగన్‌కు దేవినేని సవాల్

కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి నెల రోజుల్లోనే రాష్ట్రంలో కేసులు వెయ్యి దాటాయి జగన్ మాత్రం తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దమ్ముంటే కర్నూలు వెళ్లాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 రెడ్‌జోన్‌లో ఉన్నాయన్న ఆయన.. కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో నెల రోజుల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటిందని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లిలోని తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని విమర్శించారు. నిజానికి రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విషయమైనా జగన్‌కు తెలుసా? అని దేవినేని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించాలని, కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను బయటపెట్టాలని ఉమ డిమాండ్ చేశారు.

ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ!

రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు. అప్పుడు ''కరోనా వస్తుంది, పోతుంది... పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు'' అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని...ఇప్పుడు ''కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది'' అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ''పెనం మీదనుంచి పొయ్యిలోకి'' నెట్టిందని విమర్శించారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని...వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు.  కంటైన్మెంట్ జోన్లలో కూడా నిబంధనలు వైసీపీ నేతలు పాటించలేదని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని... అందువల్లే కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృతమైందని తెలిపారు.  హెల్త్ బులెటిన్లను ఫార్స్‌గా మార్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కరోనా కిట్లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కరోనా టెస్టింగ్‌లను నిర్లక్ష్యం చేయడమే రాష్ట్రంలో పెను విషాదంగా మారిందన్నారు. నాసిరకం పీపీఈలతో కరోనా వైద్య సిబ్బందిని వైరస్‌పై యుద్ధానికి వారిని పంపడం ఆత్మహత్యా సదృశమే అని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం, వారిలో నలుగురు డాక్టర్లు కావడం, గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లోనే పలువురికి వైరస్ సోకడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ట అని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులకు రాజకీయ లాభాలపై ఉన్న శ్రద్ద ప్రజారోగ్యంపై లేదన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల ప్రధానాధికారిని తొలగించడం, హుటాహుటిన చెన్నై నుంచి మరో వ్యక్తిని ఆ స్థానంలో నియమించడం, ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునివ్వడం, వైసీపీ నాయకులంతా ర్యాలీలు జరపడం, నగదు పంపిణీ చేస్తూ ఓట్లు వేయాలని కోరడం, గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్ర ప్రజలు ఇన్ని మూల్యాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసే పొరుగు రాష్ట్రాలు సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారన్నారు. వైసీపీ రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా టెస్టింగ్‌లపై లేదన్నారు. 'మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి' అంటూ ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని చంద్రబాబు అన్నారు.  కరోనా కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైసీపీ నేతల ధోరణి ఉంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వేతనాలకు వేల కోట్లు ఖర్చు చేస్తూ, ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చౌకడిపోల వద్ద వందలాది మందిని క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టారని.. కరోనా వైరస్ వ్యాప్తికి ఇది మరో కారణమన్నారు. లాక్‌డౌన్‌లోనూ యధేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు.  తనను నిందించినా, టీడీపీని దూషించినా ప్రజల కోసం భరిస్తామని....కానీ రాష్ట్రానికి తీరని నష్టం చేయడాన్ని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని భరించలేమని స్పష్టం చేశారు. విపత్తులలోనే నాయకత్వ సామర్ధ్యం బైటపడేదన్నారు. బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజలకు టీడీపీ అండగా ఉందని పేర్కొన్నారు.

అద్వైతాన్ని అందించిన వైశాఖ శుద్ధ పంచమి

* నేడు ఆదిశంకరుల జయంతి  ఈ రోజు ఆది శంకరుల జయంతి. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు.  హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు ఇవే-   బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి. గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు. సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.   శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.     మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన     చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన     కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు.

జగన్ సర్కార్ అవినీతిపై విరుచుకుపడ్డ కన్నా

* ఏపి ప్ర‌భుత్వ అవినీతిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి  * భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లేఖ‌లు  ఆంధ్ర‌ప్ర‌దేశ‌లో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనపై గవర్నర్ జోక్యం చేసుకోవాల‌ని,‌ గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పెద్దఎత్తున బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకున్నాయ‌ని అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ఏకగ్రీవం అయ్యాయని, నామినేషన్లు జరిగినవి అన్నీ రద్దు చేసి మొత్తం ప్రక్రియను మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని పేర్కొంటూ ప‌లు అంశాల‌పై భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌‌కి సోమ‌వారం 3 లేఖ‌లు రాశారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...                                   స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌లలో జరిగిన అనేక అవకతవకల వలన ఇప్ప‌టివరకూ జరిగిన నామినేషన్ ప్రక్రియను రద్దు చెయాలి. కరోనా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లు రేటు  విషయంలో అవినీతి పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. విశాఖపట్నంలో తాజాగా జరిగిన భూ కబ్జాపై విచారణ జరిపించాలని, వీటితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రైతులకు ఇవ్వాల్సిన లీజు రెట్టింపు చేయాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన కరోనా పరీక్షల కిట్లు కొనుగోలులో పెద్దయెత్తున జరిగిన అవినీతిపై గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరాలి. విధినిర్వహణలో ముందు వరసలో ఉండి పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా బాధితులు, ఆసుపత్రులు, క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పాత్రికేయులకు బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ముఖ్యమని బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఈ కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి అన్ని ఆదాయ మార్గాలు మూసుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా ప్రభుత్వం ఇవ్వవలసిన లీజును రెట్టింపు చేయాలని, తక్షణం వారికి ఆ మొత్తాన్ని విడుదల చేయాలి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న కర్నూల్, గుంటూరు మరియు విజయవాడలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేయాలి. ఎటువంటి మినహాయింపులు, ఏ వర్గానికి ఇవ్వటం మంచిది కాదు. రెడ్ జోన్ ఏరియాలలో ప్రజలు బయటకు రాకుండా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అవసరమైన మందులు, అన్నీ ఇండ్ల వద్దకే చేర్చే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా ప్రతి వ్యక్తికీ మూడు మాస్కులు  అందజేస్తామని చెప్పిన విషయం మరిచిపోయింది. ఏం ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదు. తక్షణం ఈ మాస్కుల పంపిణీ చేపట్టాలి. వైసీపీ చేసే ప్రతి రాజకీయ ఆరోపణ కు లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధీటుగా సమాధానం చెప్తాం. ప్రస్తుతం రాజకీయ అరోపణల జోలికి వెళ్లకుండా సమస్యలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న బీజేపీపై అసందర్భ ఆరోపణలు చేస్తున్న మంత్రి వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ హెచ్చ‌రించారు.

జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యంపై లోకేష్ మండిపాటు 

కరోనా నేపథ్యంలో సహాయంగా ప్రకాశం జిల్లాలో జర్నలిస్టులకు పురుగు పట్టిన బియ్యం, నాణ్యత లేని వంట నూనె ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిరంతరం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ కరోనా పై జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం అవమానించడం తగదు. ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. జర్నలిస్టులకు వ్యక్తిగత రక్షణ కిట్లు,50 లక్షల భీమా కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఆంధ్ర విద్యార్థులకు తెరాస కలర్ దుస్తులు!

ఏపీ స్టూడెంట్స్ కు వచ్చే ఏడాది  నుంచి గులాబీ రంగు యూనిఫార్మ్  ఏపి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చాలని నిర్ణయించింది.  ఆంధ్రప్రదేశ్ లో పలు విద్యా సంస్కరణల విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంతున్న ఏపీ ప్రభుత్వం, మ‌రో కీల‌క అడుగు వేసింది. గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ లో చ‌దివే స్టూడెంట్స్ యూనిఫాం కలర్ మార్చనున్నట్లు పేర్కొంది.  వచ్చే ఏడాది నుంచి 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థుల యూనిఫాం కలర్ మార్చనున్నట్లు ఏపీ విద్యా శాఖ తెలిపింది.  ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగుల బట్టలు ఇస్తుండగా..వ‌చ్చే ఏడాది నుంచి గులాబీ రంగు దుస్తులు ఇవ్వనున్నట్లు తెలిపింది.  బాలురకు ప్యాంట్, ష‌ర్ట్… బాలిక‌ల‌కు పంజాబీ డ్రెస్ ఇస్తామని, బట్టల‌ను ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని పేర్కొంది.

ఏపీలో రెడ్ జోన్ లో 63 మండలాలు మాత్రమే: ముఖ్యమంత్రి 

లాక్ డౌన్ ప్రారంభమై నెల రోజులు దాటిందని, రాష్ట్రంలో టెస్టింగ్ సామర్జ్యం పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గతంలో వైరస్ వస్తే టెస్ట్ చేయడానికి సౌకర్యాలు కూడా లేవు, రాష్ట్రంలో 9 చోట్ల టెస్టింగ్ సెంటర్స్,ల్యాబ్స్ ఏర్పాటు చేసాం, 6500 టెస్ట్ లు చేసే స్థాయి కి ఎదిగాం అని సి ఎం చెప్పారు.  దేశంలోనే టెస్ట్ లు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 10లక్షల జనాభాకు 1300 టెస్ట్ లు చేస్తున్నామని,  రాష్ట్రంలో ఇప్పటివరకు 74,511 టెస్ట్ లు చేశామని సి ఎం తెలిపారు. రాష్ట్రంలో 676 మండలాలు ఉంటే 63 మండలాలు రెడ్ జోన్స్ లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 80శాతం మండలాల్లో కరోనా కేస్ లు నమోదు కాలేదు అవి గ్రీన్ జోన్స్ లో ఉన్నాయని, రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో కోవిడ్ హాస్పటల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. క్వారయింటెన్ సెంటర్స్ లో అన్ని వసతులు కల్పిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.