అవమానాల మధ్య వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు కరోనా పరీక్ష..

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బస్తాను ప్రచారం కోసం వాలంటీర్ల చేతుల మీదుగా అందుకుని ఫొటోలు దిగిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే ఈయన. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మన ప్రభుత్వమే ఉంది ఎవరేమనుకుంటారని భావించారో ఏమో అప్పలరాజు నిబంధనలు ఉల్లంఘించి ఎంచక్కా విజయవాడ వెళ్లి కొద్ది రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి తిరిగొచ్చారు. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మన జనాన్ని రాష్ట్రంలోకి అనుమతించకుండా క్వారంటైన్ కు పంపుతామని బెదిరిస్తున్న వైసీపీ సర్కారు.. ఈయన్ను మాత్రం ఏమీ అడగలేదు. విజయవాడ వెళ్లొచ్చిన పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి ఆటంకాలు చెప్పకుండా పలాసకు పంపించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కరోనా వ్యాప్తిస్తున్న వేళ వైరస్ ప్రభావం లేని తమ జిల్లాలోకి ఎంటరైన ఈయన గారిని సొంత నియోజకవర్గంలోని విపక్ష నేతలు, అధికారులు, స్ధానిక ప్రజలు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కరోనా పేరుతో ఇళ్లకే పరిమితం చేస్తున్న మీరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడ ఎలా వెళ్లొచ్చారని ఎమ్మెల్యే అప్పలరాజును ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధికారిక కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోనూ అవమానాలు, ప్రశ్నలు తప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి జనంలో రోజురోజుకూ పలుచన కావాల్సిన పరిస్ధితి ఎదురైంది.  చివరకు ఏడాది క్రితం తనకు ఓట్లేసిన సొంత నియోజకవర్గం ఓటర్లతో పాటు తాను రోజు కలిసి పనిచేయాల్సిన అధికారులు సైతం తనను అనుమానపు చూపులు చూస్తుండే సరికి ఈయన తట్టుకోలేకపోయారు. వారం రోజులుగా అవమానాలను భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అప్పలరాజు చివరికి ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీటి ఫలితాలు వచ్చే వరకూ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అధికారులు, స్ధానిక ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితి. అసలే ఇప్పటివరకూ కరోనా ప్రభావం లేని శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు నెగెటివ్ వస్తే సరేసరి.. కానీ పాజిటివ్ వస్తే పరిస్ధితి ఏంటన్న భయాందోళనలు స్ధానికంగా నెలకొంటున్నాయి.

వెల్త్ ట్యాక్స్ ను తిరిగి ప్రారంభించాలని ప్రధాని మోడీకి ఐ ఆర్ ఎస్ అధికారుల సూచన

భారత దేశం లో వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజానా నిండుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ఎలా పట్టాలేక్కించాలనే దానిపై ఐఆర్ఎస్ అధికారులు ప్రధానీ మోదీకి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఫిస్కల్ ఆప్షన్స్ అండ్ రెస్పాన్స్ టూ కోవిడ్-19 ఎపిడమిక్(ఫోర్స్) పేరిట రూపొందించిన సవివరమైన ప్రతిపాదనలను 50 మంది ఐఆర్‌ఎస్ అధికారులు ప్రధాని కార్యాలయానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. కేంద్ర పత్యక్ష పన్నుల బోర్డు వద్దకు కూడా ఈ ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిపై 40 శాతం పన్ను విధించడం, వెల్త్‌ ట్యాక్స్‌ను పునఃప్రారంభించడం, 10 లక్షల ఆదాయం ఉన్న వారిపై 4 శాతం వన్ టైమ్ కొవిడ్-19 సెస్ విధించటం వంటి ప్రతిపాదనలు ఈ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి నేలా వారికి నేరుగా రూ. 5000 చెల్లించాలని కూడా అధికారులు ప్రతిపాదించారట. ఆరోగ్య రంగంలోని కార్పొరేట్లకు, చిన్న వ్యాపారాలకు ట్యాక్స్ హాలిడే కూడా ఇవ్వాలని కూడా వారు సూచించారట. ‘ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించాలి. అదే సమయంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య పౌరుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి’ అని అధికారులు ఆ నివేదికలో అభిప్రాయపడ్డారని సమాచారం.

ఏపీ లో మొత్తం 1,097 పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6,768 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 1,097 కు చేరింది. కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్‌ కడప జిల్లాలో 58,  ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం జిల్లాలో 53, పశ్చిమ గోదావరి జిల్లాలో 51, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో 29 మంది చొప్పున, వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 23 మంది చొప్పున, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 14 మంది, చిత్తూరు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది.. మొత్తం 231 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

స్ధానిక పోరులో గెలుపు కోసం సొంత ఎమ్మెల్యేల ప్రాణాలతో జగన్ చెలగాటం?

ఏపీలో కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్ డౌన్ లోనూ రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది. జగన్ విధించిన టార్గెట్ ను అందుకోవాలంటే కరోనా వైరస్ వ్యాప్తిని కూడా పట్టించుకోకుండా జనంలో తిరగక తప్పని  పరిస్ధితి. దీంతో ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పరిస్ధితి చూస్తుంటే అతి త్వరలో జగన్ మినహా 150 మంది ఎమ్మెల్యేలు త్వరలో జనంలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఇప్పటికే జనంలో తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల కారణంగా కర్నూలు, శ్రీకాళహస్తి, గుంటూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు వీరి ప్రచార యావ కరోనాను మరింత వ్యాప్తి చేసేలా ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి. కరోనాతో స్ధానిక ఎన్నికలు వాయిదా పడకముందే జగన్ తన ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చేశారు. స్ధానిక ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని, మంత్రులైతే తమ పదవులు రాజీనామా చేయక తప్పదని జగన్ తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా స్ధానిక పోరులో ముందుండాలన్న తపనతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులకు బెదిరిపోయి టీడీపీతో పాటు విపక్షానికి చెందిన ఏ ఒక్క అభ్యర్దీ నామినేషన్లు వేసేందుకు సైతం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే వారికి సంఘీభావంగా పల్నాడు వెళుతున్న టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కారుపై వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి భీకరంగా దాడి చేశాడు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న టీడీపీ నేతలను ఆ తర్వాత కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.  ఆ లోపే కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడిపోవడంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడిపోయారు. కరోనా భయంతో ఓ వారం పాటు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత నిత్యావసరాల పంపిణీ పేరుతో జనంలోకి రావడం మొదలుపెట్టారు. శ్రీకాళహస్తిలో మధుసూధన్ రెడ్డి, కర్నూల్లో హఫీజ్ ఖాన్, నగరిలో రోజా, చిలకలూరిపేటలో విడదల రజనీ, విశాఖలో విజయసాయిరెడ్డి, సూళ్లూరుపేటలో సంజీవయ్య ఇప్పటికీ జనాల్లో హల్ చల్ చేస్తూ కరోనా  వ్యాప్తికి కారణమవుతున్నారు. వీరి కారణంగా స్ధానికంగా కేసులు పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేయలేక అధికార యంత్రాంగం సైతం చేతులెత్తేస్తున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. అయినా స్ధానిక పోరు గెలవాలన్న పట్టుదలతో వీరు ఎవరినీ లెక్క చేయకుండా రోడ్లపైనే ఉంటున్నారు. స్వయంగా జగన్ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసే క్రమంలో వీరు జనంలో తిరుగుతూ ఉండటంతో అధికారులు కూడా వీరిని అడ్డుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై  పూర్తి నిషేధం

* అత్యవసర సేవలైనా సరే అనుమతించేది లేదు...  * ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకూ 'నో పర్మిషన్'  రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్టు రెండు జిల్లాల పోలీసులు ప్రకటించారు. పులిగడ్డ పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్న అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె  (గుంటూరు జిల్లా) పోలీసులు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను బంద్ చేసిన అధికారులు, ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య రాకపోకలపై నిషేధం విధించారు.  రెండు జిల్లాల గుండా రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్న అధికారులు.

అక్టోబర్ నాటికి మూడు కోట్ల వాక్సిన్లతో మనమే ముందుకు...

కోవిడ్ 19 వాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొన్న హ్యూమన్ ట్రయల్ ప్రారంభించిన వాక్సిన్ను అక్టోబర్ నాటికి కనీసం మూడు కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(sii)  అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ వాక్సిన్ అన్ని పరీక్షలను దాటుకుని సెప్టెంబర్ నాటికి ప్రజా వినియోగానికి ఆమోదం పొందితే అప్పటికి ఇంగ్లాండ్ లో కేవలం పది లక్షల డోస్ లు మాత్రమే అక్కడ ఆందుబాటులోకి వస్తాయి.ఈ నేపథ్యంలో భారతీయ సంస్థ ఆనాటికి మూడు కోట్ల డోసులతో సిద్ధంగా ఉంటుంది.ఈ విషయంలో ఆక్స్ఫర్డ్ కంటే భారత్ ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయం తీసుకుంది.ఒకసారి వాక్సిన్ ఆమోదం పొందితే కొరత ఉండకూడదనే లక్ష్యంతో అక్టోబర్ నాటికి నెలకు యాభై లక్షల డోస్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు SII CEO అదర్ పూనావాలా చెబుతున్నారు.ఒకసారి మొదలు పెట్టాక ఆ సామర్ధ్యాన్ని నెలకు కోటి డోసుల వరకు పెంచగలమని అంటున్నారు. ఇదిలా ఉండగా లెప్రసీ వాక్సిన్ mycobacterium w ను covid రోగుల చికిత్స కోసం ప్రయోగించి చూసేందుకు PGI చండీఘర్ కు ఆమోదం లభించింది.ఈ వాక్సిన్ను ఇప్పటికే నలుగురు రోగులకు ఇవ్వగా ప్రతికూలతలు లేవని తెలుస్తోంది.ఈ వాక్సిన్ కూడా నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాగా బెంగలూరుకు చెందిన BIOCON సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ కిరణ్ మజుందార్ షా తాము ఏడాదిలోపుగానే వాక్సిన్ సిద్ధం చేయగలమని చెప్పారు.ఈలోగా ప్లాస్మా ట్రీట్మెంట్ చక్కని ప్రత్యామ్నాయమని ఆమె చెబుతున్నారు.గత కొద్ది వారాలలో భారత్ కరోనా దుష్పరిణామాలపై మంచి అవగాహన ఏర్పరచుకుందని,అందుకే ఇప్పుడు ఈ మహమ్మారిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య మాత్రమే కాక వెంటిలేటర్ చికిత్స వరకు వస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.ఈ నేపథ్యంలో మే 3 నాటికి లాక్ డౌన్ సడలిస్తే జూన్ చివరి నాటికి ఆర్థిక పునర్ నిర్మాణంలో మనం గాడిలో పడగలుగుతామని ఆమె అభిప్రాయపడ్డారు.

24 గంటల్లో అమెరికాలో 36,000 కొత్త కేసులు

అగ్రరాజ్యం లో మొత్తం మృతుల సంఖ్య 53,928 కాగా, మొత్తం కేసుల సంఖ్య 9,56,375 కు చేరుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో అమెరికాలో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 53,928గా ఉంది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 9,56,375కి చేరిందని జాన్స్‌ హోప్కిన్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. కరోనా కేసులు, మృతుల సంఖ్య ఏ దేశంలో లేనంత అత్యధికంగా అమెరికాలో ఉంది. శుక్రవారం అమెరికాలో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు వారాల్లో అత్యల్ప మరణాల సంఖ్య ఇదే. ఇంతలోనే మృతుల సంఖ్య భారీగా పెరిగింది.  24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

రంజాన్ మాసంలో ముస్లింలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలి 

* కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్న ప్రతీ భారతీయుడు ఒక సైనికుడే * మన్ కి బాత్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.  పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. 64 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, మనం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.  కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాలూ కొత్త మార్గాల గురించి అన్వేషిస్తున్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని తెలిపారు.మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలతో తన మనోభావాలను పంచుకున్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ గారు అన్నారు.లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరూ విజయం సాధించలేరని అన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి భారతీయులంతా కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని భావి తరాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్ లో జరుగుతున్న విషయాలు చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్న గొప్ప సందర్భం ఇక్కడ ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. '' ప్రజలే ముందుండి నడిపిస్తున్న ఈ యుద్ధంలో.. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్లను అనుసరిస్తున్నారంతే..'' అని తెలిపారు. ''దేశం నుంచి పేదరికాన్ని తరిమేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చిపడింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మనకు.. లాక్ డౌన్ విధించడం తప్ప మనకు వేరే మార్గం లేనేలేదు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సిపాయిలా మారి పోరాడుతున్నారు. ఈ 'పీపుల్ డ్రివెన్ వార్'పై ప్రపంచమంతటా చర్చ జరిగితీరుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ ప్రజలు ఒక్కటయ్యారు. పేదలకు అన్నం పెట్టడం దగ్గర్నుంచి రేషన్ సరుకుల పంపకం దాకా అన్ని చోట్లా లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. యావత్ దేశం ఒకే దశలో, ఒకే లక్ష్యంతో ముందుకు వెళుతున్న సందర్భమిది. చప్పట్లు, దీపకాంతులు మనకు స్ఫూర్తి, ప్రేరణ ఇస్తున్నాయని మోదీ గారు తెలిపారు. ప్రపంచ దేశాల పట్ల భారత్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందన్నారు.రోజువారీ ఆదాయంతో పూట గడిపే ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారిందన్న సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకొంటామని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్ర  ప్రభుత్వాలూ సమర్థవంతంగా పోరాడుతున్నాయని మోదీ కితాబిచ్చారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.స్వచ్ఛ భారత్‌, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు సహకరించారని.. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు.కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అన్నదాతలు పంటపొలాల్లో పనిచేస్తున్నారు.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే గొప్ప మనసు మారిది. ఇంకొందరేమో కిరాయిలు మాఫీ చేస్తున్నారు, మరికొందరు తమ పెన్షన్ డబ్బుల్ని పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తున్నారు. కూరగాయల్ని పంచేవాళ్లు కోకొల్లలైతే.. మాస్కుల తయారు చేస్తున్నవాళ్లూ కోకొల్లలు ఉన్నారు.. ఓ స్కూల్ బిల్డింగ్ లో క్వారంటైన్ లో ఉన్న వలస కూలీలు.. ఆ బడికి రంగులు వేసి అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనందరం చూశాం. ఎలాగైనాసరే పొరుగువాళ్లకు సాయపడాలన్న మంచి తలంపు ఉందే.. కరోనాపై యుద్ధంలో ఇదే మన ఆయుధమని ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు.కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు.

తిరుమల లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అనుకోలేదు

భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందనీ, ప్రతి నెలా వచ్చే ఆదాయం సుమారు రూ.150- రూ.175 కోట్లు కాగా, ప్రస్తుత పరిస్థితులతో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని,  గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రాలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  ‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందని అన్నారు. ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, రూమ్ రెంట్స్.. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్ గా తాను జీతాలు తీసుకోలేదని గుర్తుచేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

* కోస్తాంధ్ర లో పిడుగులతో కూడిన వర్షాలు  ఆగ్నేయ బంగాళాఖాతంలో  మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, కోస్తాంధ్ర లో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. ప్రజలు అప్రమత్తంగా  ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. రాగల 48 గంటలు రాయలసీమలో 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున పసిపిల్లలు, వృద్దులు జాగ్రత్తలు  తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు  సూచించారు.

కరోనా కేసులు దాచవద్దు: రాజీవ్ గౌబ 

కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన చర్యలతో కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనపడుతోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని అన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించడం వంటి కారణాలు వల్ల ఎక్కువ కేసులు నమోదు అవుతాయని చెప్పారు. హాట్ స్పాట్ ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంతవరకూ కేసులు నమోదు కాకపోయినా ఇటీవల ఆయా జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ఐజి వినీత్ బ్రిజ్లాల్,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి వడగండ్ల వర్ష సూచన

విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడ మరియు ఇంటీరియర్  కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణంగా, తెలంగాణాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది.ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి  అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీ పెన్షనర్లకు హ్యాపీ న్యూస్ 

* పూర్తి పెన్షన్ చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం  ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేస్తూ - ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ జి.ఓ. నెంబర్ 37 విడుదల చేసింది. పెన్షనర్లకు 100% పెన్షన్, మిగతా ఉద్యోగులకు గత నెల జారీ చేసిన ఉత్తర్వులు 26(50% & 90%) & 27 (100% అత్యవసర సేవలందిస్తున్న ఉద్యోగులకు) మేరకు జీతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ స్థాయిలకు అనుగుణంగా జీతాల్లో కోతలు చేస్తూ నిర్ణయించింది. కరోనాపై పోరులో ఆర్థిక భారం ప్రభుత్వంపై పడటంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించక తప్పడం లేదని ప్రభుత్వం అంటోంది.

సతీష్ చంద్రకే 'సౌత్ బ్లాక్' ఆశీస్సులు

* ఏపీ తదుపరి చీఫ్ సెక్రెటరీ దాదాపుగా ఆయనే  * నెలాఖరుకు రిటైర్ అవుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  * వచ్చే నెలాఖరుకు నీలం సాహ్నీ పదవీ విరమణ   ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర పేరు చీఫ్ సెక్రెటరీ పదవికి దాదాపుగా ఖరారైంది. ఉత్తరాదిలో సీనియర్ బ్యూరోక్రాట్లతో, ఢిల్లీ సౌత్ బ్లాక్ తో సన్నిహిత సంబంధాలున్న సతీష్ చంద్ర, అధికారం లో ఏ పార్టీ ఉన్నా సరే, చీఫ్ మినిష్టర్ కు దగ్గరగా ఉండడం గడిచిన పదేళ్లలో మనం చూస్తూ వస్తున్న విషయమే. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీలం సహానీ’ మే నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతుండడంతో, కొత్త సిఎస్‌గా  రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐఎఎస్‌ అధికారుల్లో అందరికన్నా సీనియర్‌ ‘ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం’. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలాఖరుకు  ముగియనుంది. ‘నీలం సహానీ’ కన్నా ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో విభేదాలు రావడంతో ఆయనను పదవి నుంచి తప్పించి, బాపట్ల హెచ్ ఆర్ డీ కి డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అప్పటి నుంచి ఆయన సెలవులో ఉన్నారు. ఆయన తరువాత సీనియర్లు అయిన ‘ప్రీతీసూడాన్‌,ఎ.పి.సహానీ, డాక్టర్‌ సమీర్‌శర్మ,ఆర్‌.సుబ్రహ్మణ్యం, అభయత్రిపాఠీలు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో తరువాత సీనియర్లుగా ఉన్న ‘సతీష్‌చంద్ర,జె.ఎస్సీ ప్రసాద్‌, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌దాస్‌’లు రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఈ పదవి దక్కుతుందా..? దక్కితే ఎవరికి దక్కుతుందనే దానిపై పలు రకాలైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.  వీరందరిలోనూ  ‘సతీష్‌చంద్ర’ మాత్రమే  సీనియర్‌.  ఆయనకు, ఇంకా ఏడాది ఎనిమిది నెలల సర్వీసు ఉంది. ఆయనను కనుక ‘సిఎస్‌’గా నియమించుకుంటే దాదాపు రెండు సంవత్సరా పాటు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయన ‘చంద్రబాబు’ కార్యాల‌యంలో పనిచేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఇటీవల‌ వరకు ఆయనకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అయితే రెండు మాసాల‌ క్రితం ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యాశాఖను అప్పగించి ప్రయారిటీ ఇచ్చింది. విద్యాశాఖను ప్రభుత్వం అప్పచెప్పిన తరువాత ‘సతీష్‌చంద్ర’ అధికారపార్టీ పెద్దల‌కు దగ్గరయ్యారని అంటున్నారు. గతంలో వారితో ఉన్న స్పర్థల‌ను ఆయన తొల‌గించుకున్నారని, దీంతో ఆయనను సిఎస్‌గా నియమిస్తారనే భావన అధికారవర్గాల్లో, మీడియా వర్గాల్లో నెల‌కొని ఉంది. ఎల్ వీ నిష్క్రమణ తర్వాత, ప్రభుత్వం లో తన ప్రాధాన్యాన్ని గణనీయంగా పెంచుకున్న సతీష్ చంద్ర, ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లోని పెద్దల ద్వారా నడిపిస్తున్న బలమైన లాబీ కారణంగా ఆయన పేరే తదుపరి చీఫ్ సెక్రెటరీ గా ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అనంతపురం లో ఏరో స్పేస్ డిఫెన్స్ పార్క్ 

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద మెస్సర్స్ ఏపీ ఏరో స్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటుకు 246 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీతో కలిసి ఏరో స్సేస్ , డిఫెన్స్ వాటర్ ఇన్నోవేషన్ ఎలక్ట్రానికి సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల ప్రత్యేక వాహక సంస్థగా ఏపీ-ఏడీఈ ఏర్పాటు.కియామోటార్స్ ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో కాలుష్య కారక పరిశ్రమలను అనుమతించబోమన్న ప్రభుత్వ నిబంధనల నుంచి ఈ సంస్థకు కూడా మినహాయింపు  ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కియా మోటార్స్ ప్రాజెక్టు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కియాకు చెందిన మరో అనుబంధ సంస్థ ఈ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్నందున ఈ మినహాయింపు ఇస్తూ ఆదేశాలు  జారీ చేసింది.

సోనియా పెళ్ళికి ముందు జీవితంమీద చర్చ అవసరమా!

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ పుట్టుకను జాతీయ సమస్యగా దేశం ముందుకు తెచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని చేతకానితనం నుండి ఇలాంటి సమస్యలు సృష్టించి, ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బంగడిపేసుకుంటారు. ఆ ట్రాప్ లో పడితే వాళ్ళు విజయం సాధించినట్టే. అసలు సమస్య వదిలేసి కొసరు సమస్య జాతీయ సమస్య అవుతుంది. సోనియా ఎక్కడ పుట్టినా, ఆమెది ఏ మతం అయినా, ఏ పేరు అయినా, ఆమె ఈ దేశపు కోడలు. ఈ దేశ పౌరురాలు. ఇక్కడి ఆచారాల ప్రకారం పెళ్ళి తర్వాత అత్తవారింటికి రావడం, అవసరమైతే ఇంటిపేరుతో సహా మార్చుకోవడం మన సృప్రదాయం. అలా వచ్చిన కోడలిని ప్రశ్నించడం అంటే ఈదేశ ఆచారాల పట్ల, వివాహ వ్యవస్థ పట్ల వీళ్ళకు ఏమాత్రం గౌరవం ఉందో ఆలోచించాలి. కాసేపు సోనియా వ్యవహారం పక్కన పెట్టి మన ఇళ్ళల్లో పెళ్ళి తర్వాత అత్తవారింటికి వచ్చిన వారిని, మన ఇంట్లో నుండి పెళ్ళి తర్వాత అత్తవారింటికి వెళ్ళిన వారిని అడిగి చూడండి... ఇలాంటి ప్రస్థావనలు, ఆ ప్రస్థావనతో వివక్ష అంగీకరిస్తారేమో ! విధానపరంగా ప్రత్యర్ధిని ఎదుర్కోలేక, పాలనా పరంగా ప్రజల అవసరాలు తీర్చి వారిని సంతృప్తి పరచలేక మాత్రమే ఇలాంటి వివాదాలు సృష్టించి ప్రజల దృష్టిని మరలిస్తారు.సోనియా పెళ్ళికిముందు జీవితాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేయడాన్ని-- పెళ్ళిపేరుతో మన ఇంటికి వచ్చిన అమ్మను, భార్యను, పెళ్ళిపేరుతో వేరే ఇంటికి వెళ్ళిన తోబుట్టువును అడగండి సమర్ధిస్తారేమో...