తెలంగాణ‌లో క‌రోనా క‌మ్యూనిటి స్ప్రెడ్ మొద‌లైంది

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటి స్ప్రెడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగైదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. హైదరాబాదులో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో వైరస్ విస్తరిస్తోందని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని, ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రూ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని కోరారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్నవారు ఆల‌స్యం చేస్తే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. కరోనా విషయంలో వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందిస్తే.. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అని శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు.  ఇక‌, కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింద‌న్న హెల్త్ డైరెక్టర్.. ప్రతీ రోజూ 15 వేల టెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప‌రిస్థితులు చాలా బెటర్‌గా ఉన్నాయ‌ని, కరోనా బారిన‌ ప‌డిన‌వాళ్ల‌లో రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య పెరిగింద‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8399 పడకలు ఉన్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి, ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు.

బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్

నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేసి.. కావలిలో విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని సూచించారు. ఈ విషయంపై బాలయ్య స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాలయ్యకు ఫోన్ చేసి విగ్రహం వివాదంపై నిశితంగా చర్చించారు. అసలు ఆ విగ్రహాన్ని స్థానికులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు, తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పిన రామిరెడ్డి.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి విగ్రహం తొలగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.

ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మందిర నిర్మాణానికి అయోధ్యలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దశాబ్దాల కాలం పాటు కోర్డులో ఉన్న రామమందిర అంశం ఒక కొలిక్కిరావడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ చేయడానికి ముహుర్తం నిర్ణయించారు. మూడు అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో అయోధ్య రామ మందిరం డిజైన్ రూపొందించారు. ఆగ‌స్టు 5వ తేదీన ఆల‌య నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారు. దాదాపు 250 మంది ముఖ్య‌మైన నేత‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు త‌మ ఇంటి ముందు దీపాల‌ను వెలిగించాల‌ని ఇప్ప‌టికే విశ్వ హిందూ ప‌రిష‌త్ పిలుపునిచ్చింది. ఆలయ నిర్మాణ స్థలం మొత్తం 67ఎకరాలు కాగా అందులో పది ఎకరాల విస్తీర్ణంలో మూడంతస్తులో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మిగతా 57 ఎకరాల స్థలంలో ఆలయ కాంప్లెక్స్ నిర్మిస్తామని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్రకటించింది. శ్రీ‌రాముడి జీవితంలోని ప‌లు ముఖ్య‌మైన ఘ‌ట్టాల థీమ్‌తో  పార్కును నిర్మిస్తారు. ఆలయ స్థ‌లం తవ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన ప‌లు వ‌స్తువుల‌ను సందర్శనకు ఉంచేలా మ్యూజియం నిర్మిస్తారు. గోశాల‌, ధ‌ర్మ‌శాల, ఇత‌ర చిన్న చిన్న ఆల‌యాల‌ను కూడా ఆల‌య ప్రాంగ‌ణంలో నిర్మించ‌నున్నారు. వీటిలో పాటు 27 న‌క్ష‌త్ర వృక్షాల‌తో, అరుదైన మొక్కలతో వాల్మికీ వనం పెంచుతారు. ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌స్తుతం రామ మందిర నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30 సీసీ కెమెరాలు

నిఘానేత్రంలో హైదరాబాద్ కు 15వ స్థానం ప్రతి వెయ్యిమందికి 30 సీసీకెమెరాలు ప్రపంచంలోని పెద్దనగరాల్లో తీసుకుంటున్న భద్రత చర్యల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కవి గాంచని చోటు రవిగాంచును అన్న విధంగా పోలీసు తెలుసుకోలేని ఎన్నో విషయాలు సీసీ కెమెరాలు పట్టిస్తాయి. నేరాల విచారణలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలు భద్రత కోసం సీసీకెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించి, భద్రత సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లండన్ కు చెందిన కంపారిటెక్ అనే కంపెనీ  నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అత్యదిక సీసీటీవిలు కలిగిన  20 నగరాల జాబితాలో లండన్, హైదరాబాద్ మినహా మిగిలిన 18 నగరాలు చైనాలోనే ఉన్నాయి. మొదటి స్థానంలో ఉన్న చైనాలోని తైయువాన్ సిటీలో ప్రతి వెయ్యిమందికి 119 సీసీకెమెరాలు ఉన్నాయి. ఈ నగరం మొత్తంలో 4.65 లక్షల సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. బీజింగ్ నగరంలో 11.50 లక్షల సీసీకెమెరాలను ఏర్పాటుచేశారు. 15వ స్థానంలో ఉన్న హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30సీసీకెమెరాల ఉండగా నగరం మొత్తంలో దాదాపు 3లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేశారు. 21స్థానంలో ఉన్న చెన్నైలో ప్రతి వెయ్యిమందికి 25 సీసీకెమెరాలున్నాయి. 33వ స్థానంలో ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతివెయ్యిమందికి 14 సీసీకెమెరాలున్నాయి.

సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజీ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.  రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉందాలన్నారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి అని అధికారులను ఆదేశించారు.

బాలికను దత్తత తీసుకుంటాం: చంద్రబాబు

రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. ఘటన గురించి తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు.. వెంటనే బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలకు ఆదేశించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  జరిగిన ఘోరాన్ని తెలుసుకునేందుకు చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. విచారణ అనంతరం టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చంద్రబాబుకు నివేదిక అందజేసింది. బాధిత బాలిక పదో తరగతి వరకు చదువుకుందని పార్టీ నాయకులు చెప్పారు. దీంతో బాలికను దత్తత తీసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని, టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఏపీ మూడు రాజధానుల పై ఆరా తీసిన ప్రధాని కార్యాలయం..

ఏపీ ప్రభత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం కోసం వెళ్లడంతో మూడు రాజధానుల అంశం మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఈ బిల్లు పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి వివరాలు కోరిందట. గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ నేత జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం. దీని పై జివిఆర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలోనిదని, హైకోర్టు నోటిఫికేషన్‌ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగిందని, ఇపుడు రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తాను ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాసినట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎందుకు సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించినట్లుగా అయన తెలిపారు. అంతే కాకుండా దీనిపై అటార్నీ జనరల్‌ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తో ఈ విషయం పై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడగగా ఆ వివరాలు కూడా సమర్పించినట్లు డాక్టర్ శాస్త్రి తెలిపారు.

వైసీపీలో చేరనున్న గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్!!

టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గంటా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు కూడా చెపుతున్నారు. ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అదే రోజున గంటా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై.. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని, అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉండటంతో.. గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ కొత్త ఎత్తుగడ.. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ!!

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ను పలు రకాలుగా దెబ్బకొట్టిన టీఆర్ఎస్.. ఇప్పుడు మరో గట్టి దెబ్బ కొట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేసే ఎత్తుగడ వేస్తుందని సమాచారం. పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసింది, ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టింది, ఇలా ఎన్నో పదవులు కట్టబెట్టింది. కానీ చివరిరోజుల్లో పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో, అభిమానుల్లో ఉంది. దానికితోడు, ఇప్పుడు ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించి.. పీవీని గౌరవించడంలో టీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్.. పార్టీ తరఫున ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పినా ఆదరణ కరువైంది. ఓ రకంగా పీవీ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పీవీ కుటుంబీకులకి, అభిమానులకి దగ్గరైంది. ఇప్పుడు మరో ఎత్తుగడతో పీవీని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేయడానికి టీఆర్ఎస్ సిద్దమైందని తెలుస్తోంది. పీవీ కుమార్తె సురభి వాణిదేవికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌  స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్‌ కోటాలోవే. నాయిని నర్సింహా రెడ్డి, కర్నె ప్రభాకర్‌లను రెన్యువల్‌ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. అయితే, మూడో సీటుకు అనూహ్యంగా పీవీ కుమార్తె పేరును పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా, పీవీ సెంటిమెంటుతో కాంగ్రెస్ ను మరింత దెబ్బ కొట్టొచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ 'కోవిషీల్డ్' వ్యాక్సిన్

ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఒక శుభవార్త తెలిపింది. ఈ సంవత్సరం అక్టోబరు నాటికి అంటే మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. మన దేశంలో కూడా వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ఫోటోను అయన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఐతే అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందన్న ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, రెండు, మూడో దశ ప్రయోగాలు ఆస్ట్రియాలో కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌ లో కనీసం వందకోట్ల డోసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తాము నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు.

రాజధాని ఏర్పాటులో ఊహించని ట్విస్ట్.. విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులు 200 రోజుల నుంచి పైగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌ లో ఉంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. రాజధానిని విశాఖకు కాకుండా విజయనగరం జిల్లా భోగాపురంకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  భోగాపురంలో ఏపీ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాలను రాజధాని కొరకు ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. 500 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఖరారు చేసింది. ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దక్కించుకున్న, గుజరాత్‌ కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు ప్రణాళికల కాంట్రాక్ట్‌ ను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుస్తోంది. హెచ్‌సీపీ సంస్థకు మూడు వారాల క్రితం రహస్యంగా కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించిన స్థలంలో 500 ఎకరాలను ప్రభుత్వం తమ వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థలాన్నే హెచ్‌సీపీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. అయితే, జగన్ సర్కార్ విశాఖపై వెనకడుగు వేయడానికి.. విశాఖలో ఇటీవల చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనలు, వరుస అగ్నిప్రమాదాలు కారణమా? లేక మరేదైనా కారణముందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

భారత్ లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 1129 మంది మృతి

భారత్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. గత 24 గంటలలో దేశం మొత్తం కలిపి 45,720 కొత్త కేసులు నమోదు కాగా 1129 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఐతే నిన్ననే 29,557 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో ఒక్క రోజులోనే ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటి సారి. ఇది ఇలా ఉండగా తమిళనాడులో కరోనా మరణాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం గతంలో చనిపోయిన వారిని కూడా కలిపి చెన్నైలో 444 మరణాలను నమోదు చేశారు. వీరి మరణాలను ప్రభుత్వ రికార్డుల్లో ఇంతకు ముందు నమోదు చేయకపోవడంతో ఇపుడు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం కోవిడ్ మృతుల జాబితాలో చేర్చడంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్నటివరకు భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఇందులో 7,82,606 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్ లో 29,861 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 4,26,167 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

అలస్కా ద్వీపకల్పంలో భూకంపం, సునామీ హెచ్చరికలు

అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో తీవ్రవైన భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ భూకంపం సంభవించడం, సుమామీ వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మాస్కులు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అలస్కాలోని పెర్రివిల్లెకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ఈ భూపంక తీవ్రత ఎక్కువ ఉండే దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంతో పాటు అలూటియన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ  ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

అమర్ నాథ్ యాత్ర రద్దు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాదికి రద్దు అయ్యింది. ఈనెల 21 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను రద్దు చేసినట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్టు స్పష్టం చేసింది. కరోనా ప్రభావం, దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం నేపధ్యంలో ఈ ఏడాదికి అమర్ నాథ్ యాత్రను రద్దు చేసి భక్తులకు లైవ్ టెలీకాస్ట్ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అమర్‌నాథ్ యాత్రకు అనుమతించే అంశంపై అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. చివరికి యాత్రను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు వరకు ఈ విషయం వెళ్ళింది. 15 రోజులకు యాత్రను కుదించారు. ఈ నెల 21 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. చివరికి భక్తులను ఊరిస్తూ వచ్చిన అమర్‌నాథుడి దర్శనం  వచ్చే ఏడాదికి వాయిదా పడింది. గత సంవత్సరం కూడా అమర్ నాథ్ యాత్ర మధ్యలోనే రద్దు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో  జమ్ములో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల కారణంగా రద్దు చేశారు.

ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో అన్ని బెడ్స్ కరోనా రోగులకే

కరోనా చికిత్సకు పూర్తి స్థాయి లో మరో రెండు దవాఖానాలు కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు దవాఖానాలను పూర్తి స్థాయి కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు గాంధీ దవాఖానా మాత్రమే పూర్తిస్థాయి కరోనా దవాఖానాగా చికిత్స అందిస్తోంది. ఇప్పుడు ఫీవర్ హస్పిటల్, కింగ్ కోఠి హస్పిటల్ కూడా కరోనా సెంటర్స్ గా మార్చుతారు. ఐసీయూ బెడ్స్ పెంపు ప్రస్తుతం గాంధీ దవాఖానాలో 800మంది రోగులు ఉన్నారు. వీరిలో చాలామంది పరిస్థితి ప్రమాదం గా ఉంది. ఇంకా ఎక్కువ మందిని చేర్చుకోవడానికి సరైన సదుపాయాలు, వైద్యసిబ్బంది లేరు. దాంతో ఇటీవల ఇక్కడ వైద్యసిబ్బంది నిరసన కూడా తెలియచేశారు. గాంధీ దవాఖానాపై పెరుగుతున్న వత్తిడిని తగ్గించేలా ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో ఐసీయూ వార్డులను ఏర్పాటు చేస్తారు. ఫీవర్ హస్పిటల్ లో 340బెడ్స్ ఉంటే వాటిలో 200బెడ్స్ వరకు కరోనా రోగులకు కేటాయించారు. మిగతా బెడ్స్ ను కూడా కరోనా రోగులకే కేటాయిస్తూ పూర్తిస్థాయి ఐసీయూ వార్డులను ఏర్పాటుచేస్తారు. కింగ్ కోఠిలో ప్రస్తుతం ఉన్న 350 బెడ్స్ లో 200 బెడ్స్ కరోనా రోగుల కోసం కేటాయించారు. అయితే పూర్తిస్థాయిలో ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటుచేసి 350 బెడ్స్ కరోనా రోగులకే కేటాయిస్తారు.

సరిహద్దులో భారీగా చైనా బలగాలు

ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న భారత్ సైన్యం లద్ధాఖ్ ఎల్ఎసీ వద్ద చొరబాట్లపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకముందే డ్రాగన్ కంట్రీ భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ  కుతంత్రాలు పన్నుతోంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూస్తామంటూనే డ్రాగన్ కంట్రీ మరోవైపు తన కుటిల బుద్ధిని చూపిస్తోంది. భారత్ సరిహద్దు దేశాలను తన వైపు తిప్పుకుంటూ యుద్దానికి సిద్ధం అంటూ పరోక్షంగా సంకేతాలను అందిస్తోంది. వెనుకడుగు వేసినట్టే వేసి భారీగా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మెహన్ రేఖ (ఎంఎల్) సమీపంలోకి దాదాపు 40 వేలమంది సైనికులను చేరవేస్తుంది. . భారత సైన్యం కూడా డ్రాగన్ కంట్రీకి ధీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. యుద్ధ సామాగ్రిని, సైన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు పంపిస్తోంది. వైమానిక దళం సిద్దంగా ఉండాలి.. దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండమని సైన్యాన్ని ఆదేశించారు. భారత వాయుసేన అగ్ర కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలు మోహరించడం మంచి చర్య అన్నారు. సరిహద్దుల వెంట శత్రుదేశానికి గట్టి బుద్ధి చెప్పడానికి వైమానిక దళం సిద్దంగా ఉండాలని ఆదేశించారు. సరిహద్దుల్లో యుద్ధవిమానాలు.. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆర్మీ అమ్ముల పొదిలో కొత్త చేరిన అస్త్రాలను సరిహద్దుల వెంట సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంలో తయారుచేసిన డ్రోన్ కెమెరాలతో డ్రాగన్ కంట్రీ చర్యలపై నిఘా పెంచింది. మిగ్ 29కె సూపర్ సోనిక్ ఫైటర్స్, లాంగ్ రెంజ్ ఎయిర్ క్రాఫ్ట్ పి 8లను తూర్పు లద్దాఖ్ సరహిద్దుల్లో సిద్ధంగా ఉంచింది. భారత్ చైనా సరిహద్దులోని ప్రధాన ఎయిర్ బేస్ ల్లో ఐఏఎఫ్ ఫైటర్ జెట్లతో పాటు మిగ్ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. సుఖోయ్ 30 ఎంకేఐఎస్, చినూక్ హవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా సన్నద్దం చేశారు.

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో పిటిషన్

విచారణ ఆగస్టు 5కు వాయిదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్ పై విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. ఈ విషయంలో అవసరమైన పాలనాపరమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ ను న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని చెన్నై ద్విసభ్య  గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ కోరింది.   కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేముల ఘాట్ రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ పై చెన్నై బెంచ్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండానే 21వేల కోట్ల రూపాయల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పిటషన్ తరపు న్యాయవాది బెంచ్ ముందు వివరించారు. అనుమతులు తీసుకునే వరకు విస్తరణ పనులు ఆపాలని కోరారు. అయితే ఇదే అంశంపై ఢిల్లీలోని ఎన్జీటీ ప్రధాన బెంచ్ లోనూ విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. ఆమె సౌలభ్యం మేరకు హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు మృతికి తీవ్ర సంతాపం తెలపడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఐదుకోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి కెసీఆర్ సూర్యాపేటలోని ఆయన ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఆయన భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంతోషి ప్రగతి భవన్ లో సిఎంను కలిశారు. ఆమెను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందించారు. ఉద్యోగ నిర్వహణకు అవసరమైన సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మద్యాహ్న భోజనం చేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.

కరోనా తాకిడికి విలవిలలాడుతున్న ఏపీ.. విశాఖ సరి కొత్త రికార్డ్

కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ విలవిలలాడుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,045 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విశాఖ జిల్లా లోనే ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఏకంగా 1049 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,713కి చేరింది. గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది.  కొత్తగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, పశ్చిమగోదావరి జిల్లాలో 672, గుంటూరు 842, కర్నూలు 678, కడప 229, కృష్ణా 151, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107 కేసులు నమోదయ్యాయి.