బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్
posted on Jul 23, 2020 @ 4:56PM
నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేసి.. కావలిలో విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని సూచించారు. ఈ విషయంపై బాలయ్య స్థానిక నేతలకు నిత్యం టచ్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాలయ్యకు ఫోన్ చేసి విగ్రహం వివాదంపై నిశితంగా చర్చించారు. అసలు ఆ విగ్రహాన్ని స్థానికులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు, తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పిన రామిరెడ్డి.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి విగ్రహం తొలగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.