కరోనా మెడిసిన్ పై మంచి నిర్ణయం తీసుకున్న హెటిరో.. కరోనా బాధితులకు ఊరట 

కరోనా వైరస్ సోకి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రోగులకు డాక్టర్లు రెమ్‌డెసివిర్ మెడిసిన్ వాడాలని ప్రిస్క్రిప్షన్ లో రాస్తున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ మందును కొంత మంది బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. దీంతో ఒక ఇంజెక్షన్ ధర రూ 5400 ఐతే బ్లాక్ మార్కెట్ లో మాత్రం రూ 30 వేలకు పైగా ధరతో అమ్ముతున్నారు. ఒక్కో పేషేంట్ కు డాక్టర్లు జనరల్ గా దాదాపుగా ఆరు ఇంజెక్షన్లు డోస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంజెక్షన్ల ఖర్చే లక్షలలోకి వెళుతోంది. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ రెమ్‌డెసివిర్ మెడిసిన్ ను ఇంజెక్షన్ రూపంలో హైదరాబాద్ లోని హెటిరో సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హెటిరో కంపెనీ మాత్రం తాము బాగానే సప్లై చేస్తున్నామని చెబుతోంది. కానీ ఆస్పత్రుల్లోని ఫార్మసీల్లో మాత్రం ఈ మందు దొరకడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో హెటిరో సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని Y జంక్షన్ దగ్గర ఆ సంస్థ ఒక ప్రత్యేక కౌంటర్ తెరిచింది. అక్కడ తాను తయారుచేస్తున్న కోవిఫర్‌ మందును అసలు ధరకే కొనుక్కోవచ్చని ఆ సంస్థ తెలిపింది. అయితే ఈ మందు కావాలంటే మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి.

యూటర్న్ లు ఇంకెన్నాళ్లు

ప్రభుత్వ చర్యలతో వాహనదారులకు ఇబ్బందులు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిన్ ను తగ్గించాలన్న ఆలోచనతో కోట్లాది రూపాయల ఖర్చుతో మెట్రోరైలు నిర్మాణం ప్రారంభించారు. ఏండ్ల తరబడి మహానగరం రోడ్డల్నీ ఖరాబు చేసి మరీ మెట్రో పిలర్ల కోసం గుంతలు తవ్వారు. ఈ సందర్భంగా అనేక చోట్ల ముందస్తు జాగ్రత్తల కోసం, ట్రాఫిక్ జామ్ లు కాకుండా, ప్రమాదాలు జరగకుండా యూటర్న్ లు ఏర్పాటు చేశారు. అసలే పెట్రోలు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో సగటు వాహనదారులు మెట్రో వస్తే ట్రాఫిక్ జామ్ లు తగ్గతాయన్న ఆశతో కిలోమీటర్ల దూరం యూటర్న్ లను ఫాలో అయ్యారు. లీటర్ల కొద్ది పెట్రోల్ ను మెట్రో పుణ్యామా అని ఖర్చు చేసి జేబులకు చిల్లులు పెట్టుకున్నారు. మెట్రో వచ్చింది. అయినా ట్రాఫిక్ తగ్గలే.. యూటర్న్ ల గోల తప్పలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద, రాచకొండ కమిషనరేట్లలో దాదాపు 325 చౌరస్తాలు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా యూటర్న్ ల ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. దాంతో రోజుకు సగటున 70కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఫర్లాంగ్ దూరం వెళ్లడానికి కిలోమీటర్ల మేరకు యూటర్న్ తీసుకోవల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ యూ టర్న్ ల కారణంగా అదనంగా ఇంధనం ఖర్చు అవుతుంది. కాలుష్యం పెరగడంతో పాటు వాహనదారుడిపై అదనపు భారం పడుతుంది.  కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో రోడ్డన్నీ నిర్మనుష్యంగా ఉన్నా అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవారికి ఈ యూటర్న్ లు తిరగక తప్పలేదు. ఇప్పడు పబ్లిక్ ట్రాన్ ఫోర్ట్ అంతా బంద్ చేసినా  యూటర్న్ లను మాత్రం ఓపెన్ చేయలేదు. దాంతో కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణం చేస్తూ లీటర్ల కొద్ది పెట్రోల్ కు డబ్బులు ఖర్చు చేస్తూ సగటు వాహనదారులు బావురు మంటున్నారు.  ఐదు కిలోమీటర్లు అదనంగా.. సచివాలయం కూల్చివేత కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి అంటూ అదనంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో తల చుట్టూ రోకలి పొటు అన్న విధంగా హైదరాబాద్లో వాహనదారుల పరిస్థితి తయారైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లను కలిపే ట్యాంక్ బండ్ రోడ్డును మూసేశారు. లిబర్టి వద్ద రాకపోకలు నిషేధించారు.  ఖైరతాబాద్, బషీర్ బాగ్, నెక్లస్ రోడ్డులు బంద్ చేయడంతో ఉద్యోగస్తులు, ఉపాధి కార్మికులు అదనంగా రోజూ కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రజల తిప్పలు పట్టని ప్రభుత్వం మాత్రం యధేచ్ఛగా  తన పని తాను చేసుకుంటూ పోతుంది.  మౌనంగా భరించడం తప్ప.. ట్రాఫిక్ లేకపోయినా యూటర్న్ ను మాత్రం తొలిగిస్తరేరు. ప్రశ్నించే గొంతకలు మౌనంగా ఉంటే మనం యూటర్న్ ల చుట్టూ తిరగాల్సిందే తప్ప ప్రజాస్వామ్య విలువల మరిచిపోయి అవినీతిలో కూరుకుపోయినా ఈ ప్రభుత్వాలు మాత్రం యూటర్న్ తీసుకోవు. ప్రజలను పట్టించుకోవు అంటూ సగటు పౌరులు తనలో తాను గొణుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. కోర్టులు చెప్పినా వినని ఈ ప్రభుత్వాలు మనం చెబితే వింటాయా అంటూ నిట్టూరుస్తున్నారు.

శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే

కరోనా నివారణలో శానిటైజర్లు, మాస్కులు కీలకంగా పనిచేస్తాయని తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను అతిగా వాడినా ప్రమాదమేనంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. "ఇదొక అసాధారణ స్థితి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు వాడండి. తరచు వేడినీళ్లు తాగుతుండండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి. అయితే శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ తెలిపారు. కాగా, ఇంతకుముందు కూడా శానిటైజర్లపై ఆరోగ్య నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. అతిగా హ్యాండ్ శానిటైజర్లు వాడటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా సైతం చనిపోతుందని తెలిపారు. సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్లకు బదులుగా వాటిని ఉపయోగించి చేతులు శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ వైద్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

ప్రముఖ డాక్టర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరిస్థితులు, వైరస్ నివారణకు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై చర్చించారు. కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫ్రంట్‌లైన్ వారియర్ల త్యాగాలు, సేవలు వెలకట్టలేనివని చెప్పారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్టు 15న చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు ఘనంగా నివాళులర్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. మారణాల్లోనూ రెండవ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయటం తప్ప.. ప్రస్తుతానికి మందులు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. అంబులెన్స్‌ లు, ఆస్పత్రుల్లో శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. ఎక్కువ మంది రోగులను ఒకే అంబులెన్స్‌లో తీసుకురావటమూ వ్యాధి వ్యాప్తికి మరింత  కారణం అవుతోందని తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని పేర్కొన్నారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా, కరోనా పరీక్ష చేసి ఫలితాలు వచ్చేవరకు వైద్యం అందించడంలేదని చంద్రబాబు ఆరోపించారు.

సచివాలయం కూల్చివేతపై మీడియా అనుమతికి ససేమీరా

హైకోర్టు సూచనలు కూడా ఖాతరు చేయని వైనం విచారణ సోమవారానికి వాయిదా తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. మీడియా ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీ ఉద్యోగులు వేసిన పిటిషన్ చెల్లదని ఆయన అభ్యంతరం చెప్పారు. అయితే కంపెనీ భాగస్వాములతో ఇంప్లీడ్ పిటిషన్ వేయిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వలేరు అన్న విషయంపై కౌంటర్ అఫిడవిట్ సోమవారం లోగా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు ఏ చట్టం ప్రకారం పోలీసులను కాపలా పెట్టారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. సచివాలయం చుట్టూ ట్రాఫిక్ మళ్ళిస్తున్న ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం ప్రజల కదలికలను నియంత్రిస్తుందో చెప్పాలన్నారు. ప్రభుత్వం మీడియాకు  అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట: లోకేష్

నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశంపై స్థానిక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అన్నగారి మనవడు ఇస్తున్నా.. తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటవుతుంది అని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం, ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వైకాపా నాయకులు తొలగిస్తుండగా అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడాను. ఐదుగురు టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటా అని హామీ ఇచ్చాను." అని లోకేష్ తెలిపారు. "తీసిన చోటే ఆ తారకరాముడి విగ్రహం మళ్లీ ఏర్పాటు అవుతుంది. ఇది అన్నగారి మనవడు ఇస్తున్న మాట." అని లోకేష్ చెప్పారు.

నలంద కిషోర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

నలంద కిషోర్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నానన్న చంద్రబాబు.. వైసీపీ తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో మృతి చెందడం బాధాకరం అన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో నలంద కిషోర్ పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. వృద్దాప్యంలో ఆయనను అరెస్ట్ చేసి, కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ నుంచి రోడ్డుమార్గంలో అనేక జిల్లాలు దాటించి కర్నూలు తరలించడం హేయమైన చర్య అన్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, నానారకాలుగా శారీరక, మానసిక హింస పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. నలంద కిషోర్ మరణానికి వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

నలంద కిషోర్ మృతి.. పోలీసులు చేసిన హత్యగానే భావించాలి

వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మృతి చెందడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. కిషోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా కిషోర్‌ ను విశాఖపట్నం నుంచి కర్నూలుకు తీసుకెళ్లారని.. కిషోర్‌ ను తరలించిన సమయంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కిషోర్‌ కరోనాతో చనిపోయారని తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్యగానే భావించాలని విమర్శించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారు. ఆయన పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే కాబట్టి, బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. "చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పొలిటికల్ పంచ్‌ అంటూ వైసీపీ సభ్యుడు ఒకరు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే తప్పేంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. మనం కూడా ఇలాగే చేస్తే ఎలా? ఇంతకు ముందు రంగనాయకమ్మ విషయంలోనూ పోలీసుల తీరు బాగోలేదు. రోజురోజుకీ ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. పోలీసుల తీరును సీఎం జగన్‌ నిరసించాలి" అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న దొంగ బాబా అరెస్ట్

కరోనా వ్యాక్సిన్ తయారుచేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కృషి చేస్తుంటే.. మరోవైపు తాయత్తు తో కరోనాని ఖతం చేస్తామంటూ కొందరు దొంగ బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ లోని మియాపూర్‌ లో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న ఓ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్మాయిల్‌ బాబా అనే వ్యక్తి సమస్యలు తీర్చుతానంటూ తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునేవాడు. అయితే, ప్రజల్లో కరోనా భయం ఎక్కువైపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు. కరోనా రాకుండా చేస్తానని, కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్‌ బాబాను అదుపులోకి తీసుకున్నారు.

అరనిమిషంలో పరీక్ష ఫలితాలు

ఏఐ టెక్నాలజీ ద్వారా టెస్టింగ్ కంటికి కనిపించని కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని మేధావులంతా కృషి చేస్తున్నారు. మానవ మేధస్సుకు పదును పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న పరిశోధన ఫలితాలు తుది దశకు వచ్చాయి. ఈ ఆధునాతన పరీక్ష విధానం అందుబాటులోకి వస్తే అరనిమిషంలోనే కోవిద్ 19 వైరస్ ఉనికిని కనిపెట్టేయవచ్చు. అతి త్వరలోనే ఈ కొత్త టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రానున్నాయి. శ్వాసే శాంపిల్ ఈ కొత్త పరీక్ష విధానంలో మన మాట, శ్వాసే శాంపిల్. కోవిద్ వైరస్ గొంతు, ముక్కు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. మాట తీరు, శ్వాస తీసుకోవడంతో తేడాలను గుర్తించే సెన్సార్ల ద్వారా వైరస్ ఉనికిని కనిపెడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నిం గ్ టెక్నాలజీతో శరీరంలో ఉన్న వైరస్ మూలాలను ఈ కొత్త కిట్ చెప్పేస్తుంది. పరీక్ష ఫలితాలు 85 శాతం కచ్చితంగా వైరస్ ఉనికిని నిర్దారిస్తాయి. ఈ కిట్ ధర కేవలం 750రూపాయలు మాత్రమే. సెన్సార్ ద్వారా.. మానవ మేధస్సుకు పదను పెట్టి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో అనేక అంశాలు యంత్రాలతోనే పూర్తి అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో సెన్సార్ తో  హ్యాండ్ శానిటైజర్లు, మన టెంపరేచర్ చెక్ చేసే థర్మోమీటర్ లో ఏఐ వాడుతున్నారు. ఈ కొత్త విధానంలో ముక్కుతో గాలిని ఒక కవర్ బ్యాగ్ లోకి వదలాలి. ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’అనే ఓ మెషీన్ లోకి పంపిస్తారు. అది టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్ ) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్, ఐసోథెర్మల్,  పాలి అమైనో యాసిడ్ టెస్ట్ చేస్తారు. ఇజ్రాయెల్ డైరక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్ డీ) తయారు చేసిన ఈ కొత్త టెస్ట్ను కిట్ లను ఆ దేశంలో ఇప్పటి కే  వెయ్యి మంది పేషెంట్లపై ట్రయల్ నిర్వహించారు. బ్రెతలైజర్ పద్ధతిలో చేసిన ఈ టెస్ట్ ద్వారా 85 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వచ్చాయని ఆ కిట్ ను తయారుచేస్తున్న నానోసెంట్ కంపెనీ సీఈవో ఒరెన్ గావ్రియెలీ ప్రకటించారు. మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెం ట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తో కలిసి ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ చేస్తారు.  రెండు వారాల పాటు జరిగే ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే  వాటిని పెద్ద సంఖ్యలో ఇక్కడ తయారు చేస్తారు. మన దేశ అవసరాలకు పోనూ మిగతా వాటిని ప్రపంచ దేశాలకు పంపిస్తారు.

నలంద కిషోర్ మృతి.. బాధ్యులెవరు?

విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఇటీవల కిషోర్‌ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చారు. స్టేషన్ బెయిల్‌ పై కిషోర్ విడుదలై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కరోనా పాజిటివ్ అని అనుమానంతో ఆస్పత్రి సిబ్బంది శాంపిల్స్ సేకరించింది. ఇదిలా ఉంటే, నలంద కిషోర్ మృతికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, సీఐడీ పోలిసుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పరీక్షల పేరుతో ఆయనను కర్నూల్ లో కరోనా పాజిటివ్ పేషంట్ల వార్డ్ లో ఉంచారని, అక్కడే ఆయనకు కరోనా సోకిందని, అందుకే మరణించారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నరంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా కట్టడికి వినూత్న పంథాలు

బెదిరించో.. బుజ్జగించో వ్యాప్తిని నివారించే ప్రయత్నం ఒక్కరితో మొదలై కోట్లాది మందికి సోకిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో వైరస్ వ్యాప్తిని నివారించే అవకాశం ఉండటంతో ప్రజల్లో అవగాహన కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రజలకు నచ్చచెప్పడానికి కొన్నిచోట్ల ప్రభుత్వాలు భారీ ఫైన్లు, జైలు శిక్షలతో బెదిరిస్తుంటే మరికొన్నిచోట్ల బహుమతులు ఇస్తామంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జివ్వకో రుచి అన్నట్టు.. ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. చివరి అందరి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే సామబేధదానదండోపాయలను ప్రయోగించైనా సరే కరోనాను కట్టడి చేయడం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ప్రభుత్వం మాస్క్ లేకుండా బయటకు వస్తే లక్ష రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష అంటూ కీలక ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్ఫెక్షియస్ డిసీస్ ఆర్డినెన్స్ -2020’ని తీసుకొచ్చింది. వైద్య పరీక్షలతో కరోనా వ్యాప్తిని నివారించాలన్న ఆలోచనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. క‌రోనా వైర‌స్ టెస్ట్ లు చేయించుకున్నవారికి 300 డాలర్లు మన క‌రెన్సీ ప్ర‌కారం రూ.25వేలు, పాజిటీవ్ వ‌చ్చిన‌వారికి 1500 డాలర్లు (లక్షా 11వేల రూపాయాలు)  చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆస్టేలియా విక్టోరియా రాష్ట్రంలో రెండు వారాల వ్యవధిలోనే 3,800 మందికి పైగా క‌రోనా వైర‌స్ సోకింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు విక్టోరియా సీఎం డేనియ‌ల్ ఆండ్రూస్ ఈ ప్రకటన చేశారు. ఈ బహుమతి పొందడానికి కొన్ని ష‌ర‌తులు కూడా విధించారు. ఉద్యోగస్తులకు మాత్రమే ఈ అవకాశం. అంతేకాదు గ‌తంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఉద్యోగుల‌ు ఇందుకు అర్హులు.

ఇంటినుంచే ఆర్టీఏ సేవలు

కొత్త బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా, పాత లైసెన్స్ రెన్యూవల్ చేయాలన్నా ఇకపై ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతేకాదు లెర్నర్ లైసెన్స్ కోసం కూడా ఇంటినుంచే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే 59 సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా వరకు ఆన్ లైన్ లోనే సేవలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంట్లో నుంచే కంప్యూటర్‌‌, ఫోన్‌ ‌ద్వారా వాహన్‌‌ వెబ్‌సైట్‌‌లో కావలసిన సేవల కోసం అప్లై చేసుకోవచ్చు. డూప్లికేట్ ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌ (లెర్నర్‌‌ లైసెన్స్‌‌), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఆర్టీఏలో 59 సేవలను ఆన్‌‌లైన్‌‌ ద్వారా పొందే వీలుంది. ఇందులో 31 అంశాల్లో దరఖాస్తు దారులు నేరుగా ఆఫీస్ కు వెళ్ళాల్సి ఉంటుంది. వీటిలో ప్రస్తుతం 5 సేవలను పూర్తిగా ఆన్ లైన్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఆన్ లైన్ లో పంపించాలి. మరో 6 సర్వీసులను అతి త్వరలోనే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి  తీసుకొచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ చివరికి మన దేశంలో కోటి కేసులు.. అంచనాలకు తగ్గట్టుగానే వైరస్ వ్యాప్తి 

చైనాలో కరోనా వైరస్ మొదలైన కొత్తలో.. ఈ వైరస్ భారత్ లోకి ఎంటర్ ఐతే వ్యాప్తిని నిరోధిందడం కష్టమనే అభిప్రాయం అటు దేశంలోను ఇటు ప్రపంచ దేశాల నుండి వినిపించింది. ఐతే ఫిబ్రవరిలో ఇండియాలో వైరస్ ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు మొదట్లో దాని తీవ్రత అంతగా లేకపోవడంతో భారత్‌కి కరోనా ముప్పు తక్కువే అని అందరు భావించారు. ఐతే అధ్యయన సంస్థలు మాత్రం ఇండియాలో కరోనా వైరస్ ఎంటర్ ఐతే అది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో కొన్ని అంచనాలు వేశాయి. ఐతే లాక్‌డౌన్ ఎత్తివేశాక కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. మే, జూన్ నెలల ‌లో కేసుల సంఖ్య పెరుగుతూ పోయాయి. ఇక జులైలో అది మరింత ఎక్కువై ప్రతి రోజూ 50 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. మన దేశం లో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 నుంచి లక్షకు చేరడానికి 51 రోజుల సమయం పట్టింది. అదే ఒక లక్ష నుంచి 10 లక్షలు చేరడానికి 59 రోజుల సమయమే తీసుకుంది. ఇక ముందు పెరిగే కేసుల సంఖ్య కు పట్టే సమయము తగ్గుతూ పోతోంది. దీంతో వచ్చే ఆగస్ట్‌లో మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెపుతున్నారు. చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌పరిశోధకులు జూన్‌‌లో వేసిన అంచనాల ప్రకారం జులై చివరికి 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఐతే జూలై 16 నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అంతే కాకుండా వ్యాక్సిన్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత అంచనా ప్రకారం 2021 నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కొత్త కేసులు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం సెప్టెంబరు 22 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ఒక కోటి దాటుతుంది. దీనిని బట్టి 60 రోజుల తర్వాత కేసుల సంఖ్య కోటి కి చేరుతుందంటే వచ్చే రెండు నెలల్లో కొత్తగా వచ్చే కేసులు 89 లక్షలు. ప్రస్తుతం మన దేశంలో కరోనా రికవరీ రేటు 63.5 శాతంగా ఉంది. అంతే కాకుండా కరోనా వచ్చిన వారిలో 90 శాతానికి పైగా కోలుకుంటున్నారు. అదే విధంగా ప్రపంచ దేశాల తో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు తక్కువగా 2.4 శాతంగా ఉంది. ఐతే మనం అన్ని జాగ్రత్తలూ పాటిస్తే.. చుట్టూ ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నా వైరస్ దరిచేరకుడా చేసుకోవచ్చు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. వైరస్ కబళించే ప్రమాదం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్న పేషెంట్లను గుర్తించి వెంటనే వారికి అత్యవసర చికిత్స అందించాలని నిపుణులు కోరుతున్నారు.

అడవుల పరిశోధనల్లో అమ్మాయిలు

అబర్న్ యూనివర్సిటీ సీటు సాధించిన తెలంగాణ ఆడబిడ్డలు అమ్మాయిలు అనగానే టీచర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఉద్యోగం, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా కొన్నిరకాల ఉద్యోగులకు పనికివచ్చే కోర్సులు చదవమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తరు. కానీ, వారికి ఇష్టమైన కోర్సులు చదివే స్వేచ్ఛను ఇచ్చే తల్లిదండ్రులు కొందరే ఉంటారు. వారి ప్రోత్సాహంతో తాము ఎంచుకున్న అంశంలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు సిద్ధమవుతున్నారు నేటి అమ్మాయిలు. ఫారెస్ట్ కోర్సు చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో సీటు సాధించారు. అది కూడా ఉచితంగా. వారి ప్రతిభ, ఆసక్తిలను గమనించిన యూనివర్సిటీ కోర్సు ఫీజు మొత్తం రద్దు చేయడంతో పాటు అదనంగా రెండేళ్లకు 25లక్షల స్కాలర్ షిప్ ఇస్తుంది.  అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సులో తెలంగాణ అమ్మాయిలు సీటు దక్కించుకున్నారు. గత మేనెలలో సూర్య దీపిక ఎంఎస్ సీటు సాధించగా.. ఇప్పుడు సుహర్ష సీటు దక్కించుకుంది. హైదరాబాద్‌ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఎంఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో,  మంచిర్యాలకు చెందిన సుహర్ష ఎంఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీటు సాధించింది. వీరిద్దరూ ఫైనల్‌ పూర్తి కాకముందే పిజీలో సీటు సాధించారు. నాలుగేళ్ల ఫారెస్ట్రీ కోర్సులో వారికి వచ్చిన మార్కుల ఆధారంగా వారిద్దరికీ ఫ్రీ సీటు ఇవ్వడంతోపాటు స్కాలర్ షిప్ కూడా అబర్న్ యూనివర్సిటీ ఇస్తుంది.   రెండేళ్ల ఈ ఎమ్మెస్‌ కోర్సు ఫీజు మొత్తం 30వేల డాలర్లు అంతే మన కరెన్సీలో దాదాపు 25లక్షలు. ఈ ఫీజు మొత్తాన్ని మాఫీ చేశారు. అంతేకాదు వారికి నెలకు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా మంజూరు చేసింది. వారిద్దరూ తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులకు అర్హత సాధించారు. అబర్న్‌ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్‌ జన్నా విల్లోగ్‌ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్‌ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. ములుగులో నెలకొల్పిన ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును 2016లో ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో ఫైనల్ కు చెరిన ఫస్ట్ బ్యాచ్ లో 49మంది విద్యార్థులు ఉంటే అందులో 31మంది అమ్మాయిలే. వీరిలో సుమారు 20 మంది సివిల్‌ సర్వీసులకు కూడా ప్రిపేర్‌ అవుతున్నారు. డెహ్రాడూన్ లోని  ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీలో వుడ్ టెక్నాలజీలో ఆరుగురు అమ్మాయిలకు సీటు వచ్చింది. మరో ముగ్గురు విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యావకాశాలు వచ్చే అవకాశం ఉందని డీన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్ గా ఉన్న జానకిరాం రెడ్డి అవలపాటి తెలంగాణ విద్యార్థులకు ఉన్నతవిద్య అందించేందుకు సహకారం అందిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అందించే లక్ష్యంగా అబర్న్‌ యూనివర్సిటీ, కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్నికుదుర్చుకున్నారు.

మీడియాని అడ్డుకోవద్దు.. అనేక అనుమానాలకు దారి తీస్తుంది

సచివాలయం కూల్చివేతల వద్దకు మీడియాకు అనుమతి ఇవ్వలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేతపై కవరేజ్‌ కు మీడియాను అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ పై హైకోర్టు ఈరోజు విచారించింది. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే, తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిష‌నర్ కోరారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని పిటిష‌నర్ అన్నారు.  నిర్ధిష్ట స‌మ‌యంలో క‌నీసం అర‌గంట అయినా మీడియాను అనుమ‌తించ లేరా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంద‌రూ ఒకేసారి రావ‌టంతో క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తార‌ని, జ‌ర్న‌లిస్టుల‌ను అనుమ‌తిస్తే వారికి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం వాదించింది. క‌నీసం సచివాలయ చుట్టు ప్ర‌క్క‌ల ప్రాంతాల నుండి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్నా అడ్డుకున్నారని పిటిష‌నర్ కోర్టు దృష్టికి తీసుక‌రాగా.. ప్రైవేటు ప్రాంతాల్లో వెళ్లి కవరేజ్ చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియా అడ్డుకోవద్దని ఆదేశించింది. నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో ప్రసారం అయిందని, అది నిజమో కాదో తెలియాల్సిన అవసరం ఉందని పిటిష‌నర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి కోట్ల రూపాయల సంపదను లైవ్‌లో చూపించిన మీడియాను, ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం మీడియాకు అనుమతిస్తుందని అనుకున్నామని, అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రేపు పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

భారత్ లోని ఆ నగరాల్లో కరోనా తగ్గుముఖం.. ఎయిమ్స్ డైరెక్టర్

మన దేశం లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే కొన్ని నగారాలలో మాత్రం కరోనా వ్యాప్తి ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకొని ఇపుడు తగ్గు ముఖం పడుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలతో పాటు దక్షిణ భరత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పీక్ స్టేజ్ పూర్తయి, అక్కడ కేసుల గ్రాఫ్ క్రమంగా కిందికి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. ఐతే ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం కఠినమైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే, భారత్ లోని అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని, దీంతో భౌతికదూరం పాటించడంలేదని, మాస్కులు కూడా ధరించకుండా బయటికి వస్తున్నారని, దీంతో మరోసారి కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన హెచ్చరించారు.

కరోనా చికిత్స కోసం అదనంగా రూ. 1000 కోట్లు: సీఎం జగన్‌

కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా 2380 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్‌ చెప్పారు. వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు.

వ్యాక్సిన్ పేరుతొ మేము ప్రజలను చంపేస్తామా.. కుట్ర సిద్ధాంతాల పై బిల్ గేట్స్  

ప్రపంచ వ్యాప్తంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నసంగతి అందరికి తెలిసిందే. తాజాగా అయన కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల కోసం 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే, ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని పై స్పందిస్తూ కరోనా వైరస్ పుట్టుకకు తానే కారణం అన్న కుట్ర సిద్ధాంతాన్ని బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. ఈ దుష్ప్రచారం పై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా దీనిని నిరూపించగలరా అంటూ అయన సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం తాము ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అంతే కాకుండా అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట కూడా వాస్తవమేనని అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని తాము ఎప్పుడూ అనుకోలేదని అయన స్పష్టం చేశారు. ఐతే 2015 లో జికా వైరస్ వ్యాప్తి జరిగినపుడు కూడా బిల్ గేట్స్ పై ఇటువంటి కుట్ర సిద్ధాంత ఆరోపణలే రావడం గమనార్హం.