సీఎం కేసీఆర్ హరీష్ రావుకు షాక్ ఇవ్వబోతున్నారా..?
posted on Nov 2, 2020 @ 11:33AM
దుబ్బాక ఉపఎన్నిక అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ కు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర మంత్రి హరీష్రావుకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తాజాగా పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నిక తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్కు సీఎం పీఠం అప్పగించేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పేర్కొన్నారు. ‘‘దుబ్బాక ఉప ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, సీఎం కేసీఆర్ గారు తన కుమారుడు కేటీఆర్ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా... మొదటిసారిగా సీఎం కేసీఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి... తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కేసీఆర్, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుబట్టలేదు. అంతేకాకుండా తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కేసీఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే వాటిపై విరుచుకుపడే కేసీఆర్ గారు, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక వైపు హరీష్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని కూడా డామినేట్ చేసే విధంగా సీఎం కేసీఆర్ గారు బీజేపీ నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన అటు బీజేపీ నేతలకే కాదు.. ఇటు హరీష్ రావు గారికి కూడా పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ ఐన కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏంటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ గారు అనుసరించే స్టైలే వేరు’’ అని విజయశాంతి తన పోస్ట్లో పేర్కొన్నారు.