టీఆర్ఎస్ ఎమ్మెల్యే కబ్జా నేలమట్టం! సీఎం సొంత జిల్లాలో సంచలనం
posted on Dec 12, 2020 @ 1:20PM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యా మార్పులు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలకు విపక్షాల నుంచే కాక జనాల నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. జనగామ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్దచెరువుకు చెందిన 21గుంటలు కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి చెరువు వద్ద స్థలం చుట్టూ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి నిర్మించిన ప్రహరీ గోడను మూకుమ్మడిగా కూల్చివేశారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఏఐఎఫ్బీ, ఎమ్మార్పీఎస్ నాయకులంతా ఏకమై ఈ కూల్చివేతలో పాల్గొన్నారు.
చేర్యాల పెద్ద చెరువు కింద 1402 సర్వే నెంబర్లో 21గుంటల భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవానిరెడ్డితో పేరిట 2018లో కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరిలో రిజిస్ట్రేషన్ చేశాడు. అ స్థలం బఫర్ జోన్ కావడంతో మునగకుండా కాంక్రీట్తో కాలువ నిర్మించాడు. 2012లో జీవో నెంబర్ 168 ప్రకారం 25ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి కంటే ఎక్కువ ఉన్నచో కట్ట కింద100 ఫీట్ల వరకు ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, భూ లావాదేవీలు జరుపకూడదు. సర్కార్ ఉత్తర్వులను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే తన కూతురు పేరిట కొనుగోలు చేసి ఆ భూమి ముంపునకు గురికాకుండా పక్కా ప్లాన్తో కాలువ నిర్మాణం చేపట్టారు. దశాబ్దాలుగా ఆ స్థలం పశువుల సంత కొనసాగుతుండటంతో పాటు ఇతర ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టనీయొద్దని గతంలో స్థానికులు కూడా తీర్మానం చేశారు. అయినా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాంక్రీట్ కాలువ నిర్మించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముత్తిరెడ్డి తన కూతురు పేరు మీద కొన్న భూమి రిజిస్ట్రేషన్ వివాదంగానే ఉంది. ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కన్నా ముందే ఎలాంటి టైటిల్ లేకుండా 2018లో ఎమ్మెల్యే కూతురి పేరిట చేర్యాల గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. చేర్యాల 2018లో మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ ఏర్పడక ముందే ఆగమేగాల మీద గ్రామపంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూమి కొనుగోలు అంశం వివాదాస్పదంగా మారడంతో ఫైలును మాయం చేశారని చేర్యాల పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ పర్మిషన్ మీద చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కొంత మంది కోర్టును కూడా ఆశ్రయించారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు చేర్యాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా నిరసన తెలుపుతున్నారు. పట్టణ వాసులు శుక్రవారం చేర్యాల బంద్ నిర్వహించారు. తాజాగా స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతల అంతా ఒక్కటై ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు. రూ.10కోట్ల విలువైన భూమిని ఆక్రమించడమేగాక అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ .. ఈ భూమి చుట్టూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కట్టిన ప్రహారి గోడను కూల్చేశారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.