పసుపులో కసి.. బాబుదే భవిష్యత్ 

తిరుప‌తి ఎంపీ ఉప‌ ఎన్నిక‌. అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం. తెలుగుదేశం పార్టీకి మ‌రింత‌ ముఖ్యం. లెక్క‌కు ఒక్క సీటే. ఆ స్థానంతో ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వాలేమీ తారుమారు కావు. కానీ, తిరుప‌తి బైపోల్‌తో రాజ‌కీయ లెక్క‌ల‌న్నీ మారిపోయేంత సీనుంది. లెక్క‌కు మించి రాజ‌కీయ వ్యూహాలు అందులో దాగున్నాయి. టీడీపీ గెలిచినా ఓకే, ఓడినా డ‌బుల్ ఓకే. తిరుప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంతోనే కావాల‌సిన ప‌నంతా పూర్తైంది. ఇప్పుడు ఫ‌లితం ఎలా ఉంటుందోన‌నే ఉత్కంఠ టీడీపీ నాయ‌కుల‌కు అన‌వ‌స‌రం. ఆ టెన్ష‌న్ అంతా అధికార వైసీపీకే అవ‌స‌రం. తిరుప‌తి కేంద్రంగా ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రిగాయి. వాటిని జాగ్ర‌త్త‌గా విశ్లేషిస్తే.. భ‌విష్య‌త్ అంతా తెలుగుదేశానిదేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌సి.. తెలుగు త‌మ్ముళ్ల‌లో మునుపెన్న‌డూ లేనంత క‌సి. పంతం.. ప‌సుపు ద‌ళంలో ప‌ట్టువ‌ద‌ల‌ని పంతం. ప‌ట్టుద‌ల‌.. మ‌ళ్లీ ఎలాగైనా స‌త్తా చాటాల‌నే ప‌ట్టుద‌ల‌. ఈ మార్పులు చాల‌వా ఈ స‌మ‌యంలో తెలుగుదేశానికి. కేడ‌ర్‌లో కొండ‌ల‌నైనా పిండి చేసేంత జోష్‌. వైసీపీని ఎలాగైనా మ‌ట్టిక‌రిపించాల‌నేంత క‌రేజ్‌. డౌట్ ఉంటే ఓసారి గ‌డిచిన కొన్ని వారాలుగా తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలో టీడీపీ ప్ర‌చార స‌భ‌ల‌ను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ వ‌చ్చేస్తుంది. ముందు నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చారు. త‌మ్ముళ్ల‌లో జోష్ నింపారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు దిగిపోయారు. రోడ్ షోల‌తో దుమ్మురేపారు. జ‌న‌మే జ‌నం. ఫుల్ జ‌నం. ఎవ‌రికీ మందు పోయ‌లేదు. బిర్యానీ పొట్లాలు పంచ‌లేదు. డ‌బ్బులిచ్చి తీసుకొచ్చిన జ‌నం కాదు వారు. వాహ‌నాలు పెట్టి త‌ర‌లించిన షో పీసులు కాదు వారంత‌. నికార్స‌యిన తెలుగు త‌మ్ముళ్లు. పార్టీ కోసం, చంద్ర‌న్న కోసం స్వ‌చ్చందంగా త‌ర‌లివ‌చ్చిన జ‌నం.  ఈసారి మ‌న తెలుగుదేశాన్ని ఎలాగైనా గెలిపించుకోవాల‌నే క‌సి వారి క‌ళ్ల‌ల్లో క‌నిపించింది. అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఓట్ల‌తో అడ్డుకొని.. బుద్ది చెప్పాల‌నే కోపం వారిలో కొట్టొచ్చింది. అందుకే, చంద్ర‌బాబు ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. లోకేశ్ మ‌రెక్క‌డ కాలు మోపినా.. చుట్టూ జ‌న‌మే జ‌నం. ప‌సుపు ప్ర‌భంజ‌నం. టీడీపీకి ఈ స‌మ‌యంలో కావ‌ల‌సింది ఇదే. గెల‌వాల‌నే త‌ప‌న కార్య‌క‌ర్త‌ల్లో క్రియేట్ అయింది. జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని జ‌నాలంతా డిసైడ్ అయ్యారు.  పోలింగ్ సంద‌ర్భంగా అధికార పార్టీ ఎన్ని అరాచ‌కాల‌కు పాల్ప‌డినా.. దొంగ ఓటర్ల‌ను బ‌స్సుల్లో భారీగా త‌ర‌లించినా.. గుట్టు చ‌ప్పుడు కాకుండా రిగ్గింగ్ జ‌రిపినా.. గెలుపోట‌ములు ప్ర‌భావిత‌మ‌వుతాయేమో కానీ కేడ‌ర్‌లో వ‌చ్చిన ఉత్సాహాన్ని మాత్రం ఎవ‌రూ కిల్ చేయ‌లేరు. కుదిరితే ఇప్పుడు.. వీలైతే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు.. టీడీపీని గెలిపించ‌డం ఖాయం.. జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వ‌డం ఖాయం. 2019 ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాళ‌హ‌స్తిలో సభ నిర్వ‌హించారు. జ‌నం లేక ఆ మీటింగ్ వెల‌వెల‌పోయింది. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభ‌వించిన‌ త‌మ్ముళ్లు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ గెలుస్తాంలే అనుకున్నారు కానీ ఈసారి కూడా ఎలాగైనా గెల‌వాల‌నే క‌మిట్‌మెంట్ వారిలో ఏమాత్రం క‌నిపించ‌లేదు.‌ నిరుత్సాహం నిలువెల్లా ఆవ‌హించింది.  అప్పుడే టీడీపీ ఓట‌మి క‌న్ఫామ్ అయింది. ఇప్పుడు అదే కాళ‌హ‌స్తిలో.. మునుపు స‌భ జ‌రిగిన చోటే.. ఈసారి మ‌ళ్లీ చంద్ర‌బాబు మీటింగ్ జ‌రిగింది. ఇసుకేస్తే రాల‌నంత‌గా జ‌నంతో ఆ ప్రాంగ‌ణం నిండిపోయింది. రెండేళ్ల‌లో ఎంత తేడా. గ‌తంలో ఎక్క‌డైతే చంద్ర‌బాబు షోల‌కు జ‌నం క‌రువ‌య్యారో.. ఇప్పుడు అదే చోట జ‌నం ప్ర‌భంజ‌నంలా క‌దిలివ‌చ్చారు. టీడీపీకి ప్ర‌స్తుతం కావ‌ల‌సింది ఇదే. ఈ ఉత్సాహ‌మే.. మరో మూడేళ్ల‌లో తెలుగుదేశాన్ని అధికారం వైపు అడుగులు వేసేలా చేస్తుంది.‌‌ అప్ప‌ట్లో 2019 ఎల‌క్ష‌న్స్‌ను వైసీపీ కేడ‌ర్ స‌వాల్‌గా తీసుకుంది. అప్ప‌టికి ప‌దేళ్లుగా ప‌వ‌ర్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు కాక‌పోతే మ‌రెప్పుడు అన్న‌ట్టుగా ఫైట్ చేశారు. అందుకే జ‌గ‌న్ పాద‌యాత్రలు జ‌న ప్ర‌వాహంలా సాగాయి. జ‌గ‌నన్న‌ వెన‌క జ‌నం ఉప్పెన‌లా పోటెత్తారు. జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆ ఉత్సాహ‌మంతా నీరుకారిపోయింది. గ్రామాల్లో పెత్త‌న‌మంతా వాలంటీర్ల‌దే. ఇసుక‌లో కాసులు పిండుకుందామ‌ని భావించిన నేత‌లంద‌రికీ ఇప్పుడు చెక్ ప‌డింది. ఇసుక రీచుల‌ను కార్పొరేట్ల‌కు అమ్ముకొని జ‌గ‌నే సాంతం దోచుకోవ‌డంతో కిందిస్థాయి వైసీపీ కేడ‌ర్‌కు దిక్కుతోచ‌ని దుస్థితి. వైన్ షాపుల‌తోనైనా వ్యాపారం చేసుకుందామంటే అవీ ప్ర‌భుత్వ పాలు కావ‌డంతో కేడ‌ర్‌లో క‌ల్లోలం. జగన్ సర్కార్ రివర్స్ పాలనతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అంది. దీంతో రియల్ వ్యాపారం చేసే రెడ్లంతా జగన్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. ఇలా.. వైసీపీ శ్రేణులంతా తీవ్ర నిరాశ‌, నిస్పృహాల్లో కూరుకుపోయాయి. అదే సమ‌యంలో తెలుగు తమ్ముళ్ల‌లో మాత్రం రెట్టించిన ఉత్సాహం.  ఓట‌మి ఎంత దారుణంగా ఉంటుందో టీడీపీ శ్రేణుల‌కు తెలిసొచ్చింది. అధికార పార్టీ ఆగ‌డాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అనుభ‌వంలోకి వ‌చ్చింది. గ‌దిలో వేసి కొడితే పిల్లి అయినా తిరగ‌బ‌డుతుంది అన్న‌ట్టు.. పుంగ‌నూరులో అంజిరెడ్డి పులి బిడ్డ‌లా తొడ‌కొట్టి వైసీపీపై తిర‌గ‌బ‌డిన తీరు సంచ‌ల‌నం. చంద్ర‌బాబునూ ఆక‌ట్టుకుంది ఆయ‌న ధైర్యం. అంజిరెడ్డి స్పూర్తిగా తెలుగు త‌మ్ముళ్లు తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల్లో తెగువ ప్ర‌ద‌ర్శించారు. త‌రంగంలా చంద్ర‌న్న కోసం త‌ర‌లివ‌చ్చారు. ఈ ధైర్య‌మే, ఈ తెగువే.. తెలుగుదేశానికి ఆశాకిర‌ణంగా మారింది. ఆ వెలుగు 2024 గెలుపున‌కు మలుపు. ఇప్పుడు తిరుప‌తి ఫ‌లితం ఎలాగైనా ఉండొచ్చు. ఇది తాత్కాలికమే. కానీ, తిరుప‌తి ఉప ఎన్నిక వేదిక‌గా తెలుగు త‌మ్ముళ్ల‌లో క‌నిపించిన గెలిచి తీరాల‌నే తెగువ‌, అధికార‌ పార్టీకి బుద్ది చెప్పాల‌నే ప‌ట్టుద‌ల‌.. టీడీపీకి వెయ్యి ఏనుగుల బ‌లాన్నిచ్చింది. ఈ క‌మిట్‌మెంట్ ఇలానే కొన‌సాగితే.. భ‌విష్య‌త్తంతా తెలుగుదేశానిదే. అధికారం మళ్లీ టీడీపీని వెతుక్కుంటూ రావాల్సిందే. ఎనీ డౌట్స్?‌‌‌‌‌

అమ్మ కోసం గుండె ఆగింది..  

అమ్మంటే మెరిసే మేఘం. అమ్మంటే కురిసే వాన. అమ్మంటే  నూరేళ్ళ ఆశాదీపం. అమ్మ ఆరోప్రాణం. అమ్మ తారాదీపం. అమ్మే ఒక పూజా పుష్పం. అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...  నువ్వే లేక వసివాడనమ్మ పాట వినే ఉంటారు. తన పిల్లల కోసం తల్లీ గుండె ఆగిపోవడం చాలా చూసి ఉన్నాం. కానీ అదే తల్లీ కోసం కొడుకు గుండె ఆగిపోవడం ఎక్కడైనా ఎప్పుడైనా చూసి ఉంటారా.. మథెర్స్ డే రోజు మాత్రం ప్రేమించి.. మిగితా రోజుల్లో అమ్మపై అరవడం కాదు ప్రేమంటే.. అమ్మ కోసం బతకడం నిజమైన ప్రేమంటే అని నిరూపించాడు సత్తిరెడ్డి.    అమ్మంటే ఆ బిడ్డకు ఆకాశమంత  ప్రేమ. చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసింది తల్లి. కన్నతల్లి  అనారోగ్యం బారినపడటంతో ఆ కొడుకు కుంగిపోయాడు. రెండేళ్లుగా ఆమె సేవలో ఉన్నాడు. ఉన్నట్టుండి తల్లి తనను వదిలి వెళ్లిపోయిందని.  తెలుసుకున్న కొడుకు గుండెలవిసేలా ఏడ్చాడు. బహుశా అమ్మ కోసం తాను పెట్టిన కన్నీళ్లతో తన గుండె ఆగిపోయిందో ఏమో! ఆ కొడుకు గుండె ఆగిపోయింది. తల్లితోటే ఆ కొడుకు కట్టె కాలిపోయింది.   నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన యానాల సత్తిరెడ్డి, సత్యమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెలిద్దరూ వివాహాలై అత్తవారింటికి వెళ్లారు. కుమారుడు నాగిరెడ్డి వ్యవసాయ పనులు చూసుకుంటూ కుటుంబానికి అండగా నిలిచాడు. సత్యమ్మ రెండేళ్ల క్రితం కేన్సర్‌ బారినపడ్డారు. అప్పట్నుంచి కుమారుడు తల్లిని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ ఆసుపత్రిలో మంచి చికిత్స దొరుకుతుందంటే అక్కడికంతా తీసుకెళ్లేవాడు. ఆమె వైద్యానికి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నాగిరెడ్డి పొలం నుంచి ఇంటికొచ్చాడు. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా ఏడుస్తూ కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల్లీకొడుకులు గంట వ్యవధిలో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.     

తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు దిగారనే ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారులు కానీ.. పోలీసులు స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం పోలింగ్‌ బూత్‌లో టీడీపీ, బీజేపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలింగ్ అధికారులు, పోలీసులు అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. తొట్టంబేడు మండలం గుండెలుగుంటలోనూ టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అధికార పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తున్నా నిలువరించాల్సిన అధికారులు, పోలీసులు వారికే వత్తాసు పలకడమేంటి..? అని స్థానిక టీడీపీ నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఓటర్లను వైసీపీ  నేతలు ప్రలోభపెడుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు కొందరు ఇలా చేస్తున్నారని టీడీపీ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే జిల్లాలో వాలంటీర్లు కూడా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నప్పటికీ పోలీసులు.. కనీసం పోలింగ్ అధికారులు పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు పలువురు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఓటర్లని నేరుగా బూత్‌ల వద్దకి తీసుకొవచ్చి ఓటేయిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అధికార పార్టీ నేతలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు బాగా వేయిస్తే అవార్డులు.. రివార్డులు ఇప్పిస్తామని, తగ్గితే ఉద్యోగాలే ఉండవంటూ కొందరు వాలంటీర్లను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీలేక ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాలంటీర్లు ఇలా దగ్గరుండి మరీ ఓటర్లను బూత్‌లకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌తో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, లారీల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చారని కేంద్ర ఎన్నికల అధికారులకు బాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీ వారిని టీడీపీ శ్రేణులు పట్టుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. తిరుప‌తి ఉప ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతోంది. అయితే, ప‌లు చోట్ల అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటోల ఆధారాల‌ను త‌న లేఖ‌కు చంద్ర‌బాబు నాయుడు జ‌త చేశారు. రెండు బ‌స్సుల్లో బ‌య‌టి వ్య‌క్తుల్ని వైసీపీ నేత‌లు తిరుప‌తిలోకి త‌ర‌లించార‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ నేత‌లు కొన్ని బూత్‌ల‌లో టీడీపీ ఏజెంట్ల‌ను అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న తెలిపారు. తొట్టెంబేడు మండ‌లం కందేలుగుంట‌లో టీడీపీ నేత‌ల‌ను అడ్డుకున్నార‌ని వివ‌రించారు. స్థానికేత‌రుల‌తో తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ నేత‌లు అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డే ప్ర‌య‌త్నాలు జరుపుతున్నార‌ని ఆయ‌న అన్నారు. 

తెలంగాణకు కరోనా జ్వరం.. 

తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 4,446 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,11,008 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,809గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 33,514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 22,118 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 598 మందికి క‌రోనా సోకింది.

ఇండియా కరోనా యమ డేంజర్!

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మరణ మృదంగం మోగిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఇండియాలో 2 లక్షల 34 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 13వందల మరణాలు సంభంవించాయి. తాజాగా ఇండియాలో విస్తరిస్తున్న కరోనా గురించి మరో సంచలన విషయం వెలుగుచూసింది. ఇండియాలో కరోనా వైరస్ డబుల్ మ్యూటెంట్ చెంది మరింత ప్రమాదకరంగా మారిందని  బ్రిటన్ వెల్లడించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను రద్దు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆయనకు సూచించడం కలకలం రేపింది.  ఇండియాలో పుట్టిన కొత్త వేరియంట్ బ్రిటన్ కు కూడా వ్యాపించిందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్ ను తొలిసారిగా ఇండియాలోనే కనుక్కున్నారని పేర్కొన్న అధికారులు, దీనికి బీ1617 అని నామకరణం చేశారు. ఈ డబుల్ మ్యూటెంట్  కొత్త వైరస్ విషయంలో ఎపిడెమాలజిక్, ఇమ్యునోలాజికల్, పాథోజెనిక్ విభాగాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇంగ్లండ్ లో 77 భారత్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయని, స్కాట్లాండ్ లో సైతం కనిపించిందని అధికారులు వెల్లడించారు."ఈ వేరియంట్ తొలిసారిగా ఇండియాలోనే కనిపించింది. 484క్యూ, ఎల్452ఆర్, పీ681ఆర్ తదితర వేరియంట్ల కలయికగా ఇది ఏర్పడింది. ఈ వైరస్ నియంత్రణకై కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం" అని పీహెచ్ఈ పేర్కొంది. ఇందులో ఓ వేరియంట్ గత సంవత్సరం కాలిఫోర్నియాలో వెలుగులోకి రాగా, మరో వేరియంట్ సౌతాఫ్రికా, బ్రెజిల్ లో కనిపించింది. ఇప్పుడు ఈ రెండూ కలిసి ఇండియాలో సమ్మిళితమై ప్రపంచానికి వ్యాపిస్తున్నాయని అన్నారు. ఇండియాలో ఇప్పుడు రోజుకు మిగతా దేశాల కన్నా అత్యధికంగా 2 లక్షలకు పైగా కేసులు ప్రతి రోజూ నమోదవుతున్నాయని గుర్తు చేసిన పీహెచ్ఈ, ఈ వైరస్ వ్యాప్తిని తక్షణం అరికట్టాల్సి వుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు చండీగఢ్‌లో యూకే రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ నమోదైన కేసుల్లో 60 శాతం నమూనాలను ఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రానికి పంపించి పరీక్షించగా వాటిలో 70 శాతం శాంపిళ్లలో యూకే స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.మరో 20 శాతం నమూనాల్లో 681 హెచ్ మ్యూటెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఒక్క నమూనాలో మాత్రం డబుల్ మ్యూటెంట్‌ను గుర్తించారు. యూకే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.

తిరుపతిలో భారీగా దొంగ ఓటర్లు! రిగ్గింగ్ కు వైసీపీ ప్లాన్?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ దౌర్జాన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భారీగా దొంగ ఓటర్లను తిరుపతికి తరలించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చిత్తూరు నుంచి బస్సులు, కార్లు, సుమోల్లో వేలాది మందిని అధికార పార్టీ నేతలు తరలించారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని.. రిగ్గింగ్ చేసుకోవాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓ మంత్రికి చెందిన ఫంక్షన్ హాల్ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఓటర్లను దాచిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక టీడీపీ నేతలు పీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరకు వెళ్లాలని చూసినా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు అక్కడే భైఠాయించి ఆందోళన చేస్తున్నారు. దొంగ ఓట్లు వేయించేందుకే వైసీపీ నేతలు ఇతర ప్రాంతాల నుంచి జనాలకు తీసుకొచ్చారని మండిపడుతున్నారు. వాళ్లందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ కు ముందు 36 గంటల ముందు నుంచి బయటి వ్యక్తులు నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాని తిరుపతి పరిధిలో మాత్రం పోలింగ్ రోజునే వేలాది మంది బయటి ప్రాంత వ్యక్తులు తరలిరావడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో విపక్ష పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.  కడప రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ఉన్న వ్యక్తులు తిరుపతిలో హల్ చల్ చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ఆరోపించారు. దొంగ ఓట్లతో పాటు రిగ్గింగ్ చేసుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.తిరుపతి ఉప ఎన్నికపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలను అడ్డుకోవాలని ఆయన లేఖలో కోరారు. దొంగ ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చారని, వాళ్లందరిని వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.   

కేటీఆర్ తో బీజేపీ నేతల మీటింగ్.. భగ్గుమన్న బండి సంజయ్ 

తెలంగాణ బీజేపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. గ్రేటర్ హైదరాబాద్ నేతల తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే గ్రేటర్ బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకోవడంపై బండి భగ్గుమంటున్నారని చెబుతున్నారు. తెలంగాణలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతో పాటు ఖాళీగా ఉన్న వార్డు, డివిజన్ సభ్యుల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కూడా ఉంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.  లింగోజిగూడ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నారు.  ఆయన ఏకగ్రీవానికి  సహకరించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ను  ప్రగతి భవన్ లో కలిసింది. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆకుల రమేష్ గౌడ్ గారు మరణించడం దురదృష్టకరమన్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో పోటీ పెట్టవద్దు అని బీజేపీ నుండి వచ్చిన విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారి సూచన మేరకు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్,  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కప బీజేపీ ప్రతినిధి బృందంతో పాటు ఆకుల రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం విషయంలో టీఆర్ఎస్ నేతలను కలవడంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడుకి సమాచారం ఇవ్వకుండానే టీఆర్ఎస్ నేతలను రామచంద్రరావు ఆధ్వర్యంలో  బీజేపీ బృందం కేటీఆర్ ను కలిసిందని తెలుస్తోంది. పార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను కలవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. గెలిచే సీటు విషయంలో ఏకగ్రీవం కోసం అడగడం ఏంటని అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. బండి సంజయ్ తో మొదటి నుంచి రామచంద్రరావుకు మంచి సంబంధాలు లేవు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రామచంద్రరావు కోసం సంజయ్ సరిగా పని చేయలేదనే ప్రచారం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ తో రామచంద్రరావుకు మరింత గ్యాప్ పెరిగిందంటున్నారు. రామచంద్రరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో బండికి చెప్పకుండానే తన బృందంతో రామచంద్రరావు కేటీఆర్ ను కలిశారంటున్నారు. ఈ గొడవ బీజేపీలో మరింత చిచ్చు రాజేసే అవకాశం ఉందంటున్నారు. 

కిట్స్ లేవు.. బెడ్స్ లేవు! తెలంగాణలో కరోనా కల్లోలం

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 3 వేల 8 వందలకు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే జిల్లాల నుంచి వస్తున్న లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. సర్కార్ చెబుతున్న కేసుల కంటే  రెండు, మూడు రెట్లు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని తెలుస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విస్తరిస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి వైరస్ సోకుతోంది. తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. రోగుల తాకిడి పెరగడంతో గాంధీ ఆస్పత్రి ని శనివారం నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.  OPని నిలిపివేయనున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి కేవలం కోవిడ్ హాస్పిటల్ గా మార్చనున్నారు. ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్ చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. గాంధీలో ఇప్పటికే 450కి పైగా పేషెంట్స్ ఉన్నారు. గురువారం  ఒక్కరోజే 150మంది అడ్మిట్ అయ్యారు. 10 నిమిషాలకు ఒక పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు. గాంధీలోని IP బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయింది.  ఇక తెలంగాణలో కరోనా టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. టెస్టుల కోసం జనాలు భారీగా వస్తుండటంతో కిట్లు లభించడం లేదు. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో కరోనా టెస్ట్ కిట్స్ లేక పరీక్షలు నిలిపివేశారు. టెస్ట్ కిట్స్ అయిపోవడంతో టెస్ట్ లు చేసుకోకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు జనాలు. రెండు రోజుల కు సరిపడా 3000 వేళా కరోనా టెస్ట్ కిట్స్ తెప్పించారు వైద్య అధికారులు. 

పవన్‌కు పాజిటివ్‌.. ఊపిరితిత్తుల్లో నిమ్ము.. ఫ్యాన్స్ కంగారు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.  ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ల సుమన్ ఆయనకు చికిత్స చేస్తున్నారు.  ‘‘ఈనెల 3న తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అయినా, వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఫలితం పాజిటివ్‌ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో చికిత్స అందిస్తున్నారు.’’ అంటూ జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.  ‘‘పవన్‌కల్యాణ్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు పవన్‌ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు’’ అని జనసేన పార్టీ తెలిపింది. 

అయ్యా  సీఎస్.. కొవిడ్ రూల్స్ పట్టవా?

కొవిడ్ పాజిటివ్ వస్తే 14 రోజుల క్వారంటైన్ కంపల్సరీ. రెండు వారాల తర్వాతే కొవిడ్ టెస్టు చేయించుకుని నెగిటివ్ వస్తే బయటికి రావాలి. రెండు వారాలకు ముందే నెగిటివ్ వచ్చినా సరే 14 రోజుల హోం క్వారంటైన్  పాటించాల్సిందే.. ఇది కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన కొవిడ్ మార్గదర్శకాల్లో అత్యంత కీలకం. అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని, కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కూడా 14 రోజులు హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులను కూడా రెండు వారాలు ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. దేశమంతా ఈ రూలే పాటిస్తున్నారు.  తెలంగాణలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ కొవిడ్ మార్గదర్శకాలు గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడం దుమారం రేపుతోంది. కొవిడ్ భారీన పడిన సీఎస్ సోమేష్ కుమార్.. రెండు వారాల క్వారంటైన్ పాటించకుండా మధ్యలోనే  సచివాలయం వచ్చారు. రావడమే కాదు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 6వ తేదిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  కరోనా బారిన పడ్డారు.  కొంత అస్వస్థతకు గురైన ఆయన... కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఏఐజీ హాస్పిటల్ లో చేరారు. ఐదు రోజుల తర్వాత ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొవిడ్ రూల్స్ ప్రకారం  సోమేష్ కుమార్ 21వ తేదీ వరకు క్వారంటైన్ లో ఉండాలి. కాని ఆయన ఆరు రోజుల ముందే సచివాలయానికి రావడం, అధికారులతో సమీక్షలు జరపడం విస్మయపరుస్తోంది.   గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎస్ సోమేష్ కుమార్..  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ ను పెంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని కూడా ఆయన  కలెక్టర్లను ఆదేశించారు.ప్రతి ఒక్కరూ మాస్కలు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రతి జిల్లాలో కోవిడ్ సెంటర్లను రెట్టింపు చేయాలని ఆయన సూచించారు.అంతేకాదు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడ వేగవంతం చేయాలని సీఎస్ కోరారు.      సీఎస్ సోమేష్ కుమార్ పై గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో  ఇతర ఉన్నతాధికారులతో ఆయన సఖ్యతగా ఉండరనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పరంగా కీలకమైన అంశాల్లోనూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది. అంతేకాదు గతంలో విదేశీ టూర్లకు వెళ్లి వచ్చిన అధికారులు 14 రోజుల వరకు ఆఫీసుకు రావద్దని ఆయనే ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు కొవిడ్ నెగెటివ్ వచ్చినా సరే.. రెండు వారాల ఐసోలేషన్ తర్వాతే కార్యాలయానికి రప్పించారని అంటున్నారు. అలాంటిది సీఎస్ కు కొవిడ్ పాటిజివ్ వచ్చినా.. రెండు వారాలు క్వారంటైన్ లో ఉండకుండా ఆయన సచివాలయానికి రావడం, సమీక్షలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొవిడ్ వచ్చిన కొన్ని రోజులకే సోమేష్ కుమార్ సచివాలయం రావడంతో ఉద్యోగులు అవాక్కయ్యారని తెలుస్తోంది. అయితే సీఎస్ కావడంతో ఎదురుగా అడగలేక.. చాటుగా సీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎస్ సమీక్షకు పిలవడంతో ఉన్నతాధికారులు కూడా ఆందోళనకు గురయ్యారట. అయితే సీఎస్ సమీక్ష కావడంతో భయంభయంగానే సమావేశానికి వెళ్లారని తెలుస్తోంది.  మొత్తంగా కొవిడ్ రూల్స్ పక్కాగా పాటించేలా చూడాల్సిన సీఎస్సే... వాటిని బ్రేక్ చేయడం సంచలనంగా మారింది. దీని ద్వారా సీఎస్ జనాలకు రాంగ్ మెసేజ్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఖర్చు భరిస్తాం.. గెలిపిస్తాం.. అభ్యర్థులకు కొండా అభయం

కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. వరంగల్‌లో కేడర్‌ను కాపాడుకోడానికి కొండా దంపతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికల నగారా మోగాక పలువురు కిందిస్థాయి నాయకులు పార్టీ మారుతుండటం హస్తం నేతలను కలవరానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో నమ్మకద్రోహం సరికాదంటూ వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు కొండా సురేఖ, కొండా మురళి దంపతులు.  కార్పొరేషన్ ఎన్నికలలో ఎవరూ అమ్ముడుపోవద్దని కొండా సురేఖ హితవు పలికారు. "మీరు అమ్ముడుపోతే కన్నతల్లిని అమ్ముకున్నట్టే.. మీ గెలుపునకు మేము కృషి చేస్తాం, మేమే ఖర్చు భరించి గెలిపిస్తామని" అని సురేఖ అభ్యర్థులకు అభయం ఇచ్చారు. అభ్యర్థులు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని సూచించారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఈ కార్పొరేషన్ ఎన్నికలే పునాది అని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు కొవిడ్ విజృంభిస్తుంటే మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టారని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతోనే కరోనా టైమ్‌లో ఎన్నికలు పెట్టారని సురేఖ విమర్శించారు.  వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. గతంలో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ ఆ తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిపోయారు. పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వరంగల్ ఈస్ట్ నుంచే బరిలో దిగాలను సురేఖ భావిస్తున్నారు. అందుకు గ్రౌండ్ వర్క్‌గా ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో తన వారికి టికెట్లు ఇప్పించుకొని వారిని గెలిపించుకునే బాధ్యతను కొండా కపుల్స్ తీసుకున్నారు. అందుకు అనుగుణంగా.. నగరంలో కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ నిర్వహించారు. మేమే ఖర్చు భరిస్తాం.. మేమే గెలిపించుకుంటాం అంటూ అభ్యర్థులకు ధైర్యం నూరిపోశారు కొండా సురేఖ. ప్రస్తుత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు, కొండా ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సై అంటే సై అంటూ ఇద్దరు నేతలు డివిజన్ల వారీగా అభ్యర్థులను బరిలో నిలుపుతున్నారు. ఇది రెండు పార్టీల పోరుగా కాకుండా.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. నరేందర్ వర్సెస్ కొండా దంపతులు అన్నట్టుగా మారింది గ్రేటర్ వరంగల్ పుర పోరు. 

తెలంగాణలో ఆక్సిజన్ కొరత..ఎవరూ బయటికి రావొద్దన్న ఈటల

తెలంగాణలో ఆక్సిజన్‌ కొరత వాస్తవమేనని అంగీకరించారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అయితే, ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో కంటే మరింత వేగంగా కరోనా విస్తరిస్తోందని.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  25 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్టు ఈటల తెలిపారు. అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని.. కానీ హామీ మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ కానీ‌, కర్ఫ్యూ కానీ విధించే ఆస్కారం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని కోరారు మంత్రి ఈటల.

షర్మిల టెంపర్.. తెలంగాణలో మంటల్..

గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇంతసేపు? ఈ మాటలన్నది మరెవరో కాదు వైఎస్ షర్మిల. ఆమెతో ఈ మాటలు పడింది కూడా ఎవరో మామూలు మనిషి కాదు ఇందిరా శోభన్. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేత. గతంలో హస్తం పార్టీ అధికార ప్రతినిధి. ఫైర్ బ్రాండ్ లీడర్‌గా, కాంగ్రెస్ మౌత్ స్పీకర్‌గా సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడేవారు ఇందిరా శోభన్. అప్పట్లో పులిలా గాండ్రించిన ఇందిరా శోభన్.. ఇప్పుడు షర్మిల ముందు పిల్లిలా మారిపోయారు. మౌనంగా మాటలు పడుతున్నారు. నిరుద్యోగ సమస్యపై ఇందిరాపార్కు దగ్గర షర్మిల చేపట్టిన దీక్షలో జరిగిందీ అవమానకర ఘటన. షర్మిలను చూసేందుకు వేదికపైకి అభిమానులు వస్తుండగా.. వారిని కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడ్డారు షర్మిల. సిబ్బందిని పిలిచి వారిని గట్టిగా మందలించారు. వేదికపైకి "ఎవరొచ్చినా నీకుంది.." అంటూ తన సెక్యూరిటీ స్టాఫ్‌కు వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో హడావుడిగా అక్కడికి వచ్చారు ఇందిరా శోభన్. ఆమె వల్లనే సెక్యూరిటీ వైఫల్యమని భావించిన షర్మిల.. వేదికపైనే ఇందిరాపై నోరు పారేసుకున్నారు. "ఏం చేస్తున్నారు మరి ఇంతసేపు.. గాడిదలు కాస్తున్నారా?" అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. విసుగ్గా ముఖం పెట్టి.. రుసరుసగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.  వేదికపై అందరి ముందే ఇందిరా శోభన్‌తో అంత నిష్ఠూరంగా మాట్లాడటం.. చేతిలో మైకు ఉందనే సోయి కూడా లేకుండా గాడిదలు కాస్తున్నారా? అంటూ చీప్‌గా తీసిపారేయడం షర్మిల అహంకారానికి నిదర్శనం అంటున్నారు తెలంగాణ వాదులు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు హవా కొనసాగించిన ఇందిరా శోభన్‌కు ఎంత ఖర్మ పట్టిందంటూ ఆమెపై సానుభూతితో పాటు సెటైర్లూ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో షర్మిల దూషించిన వీడియాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇది తెలంగాణ అత్మాభిమానానికి జరిగిన అవమానమంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. వైఎస్సార్ మంచోడే.. జగనే మహా మొండి. ఎంపీ పదవి కోసం తండ్రినే టార్చర్ చేశాడు. బాబాయ్‌పైనా చేయి చేసుకున్నాడు. వైసీపీ నేతలను చీప్‌గా చూస్తాడు. ఇంటికొస్తే టీ, బిస్కెట్లు కూడా ఇవ్వడు. కనీసం మంచి కుర్చీ కూడా వేయరు. ఇలా వైఎస్ జగన్‌పై అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన సోదరి వైఎస్ షర్మిలలోనూ అలాంటి అహంకారమే కొట్టొచ్చినట్టు కనబడుతోందని అంటున్నారు. రాజన్న రాజ్యమంటూ ఇటీవలే పార్టీ పెట్టిన షర్మిల.. పలువురు పాత కాపులను పార్టీలో చేర్చుకున్నారు. అందులో, తెలంగాణ వైసీపీకి చెందిన కీలకనేత కొండ రాఘవరెడ్డి ప్రముఖుడు. ఒకవిధంగా చెప్పాలంటే కొత్త పార్టీలో షర్మిల తర్వాత దాదాపు నెంబర్ 2 పొజిషన్ ఆయనది. అలాంటి రాఘవరెడ్డిని ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఓ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించారు. షర్మిల.. దర్జాగా ఖరీదైన సోఫాలో ఆసీనురాలై.. ఆ పక్కనే ఓ పనికిరాని ప్లాస్టిక్ ఛైర్‌లో రాఘవరెడ్డిని కూర్చోబెట్టి తెలంగాణ నాయకుడిని ఇన్‌సల్ట్ చేశారంటూ అప్పట్లో చర్చ జరిగింది. అది సద్దుమనిగేలోగా.. తాజాగా మరో తెలంగాణ ఫైర్ బ్రాండ్ లేడీ ఇందిరా శోభన్‌ను అందరిముందే.. అందరికీ వినిపించేలా.. గాడిదలు కాస్తున్నారా? అంటూ మైకులో అరవడం కచ్చితంగా షర్మిల షార్ట్ టెంపర్‌కు నిదర్శనమని తెలంగాణవాదులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఇది కేవలం ఇందిరా శోభన్‌కో, కొండా రాఘవరెడ్డికో జరిగిన అవమానం కాదని.. యావత్ తెలంగాణ జాతిని షర్మిల కించపరిచిందని సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్నారు. అన్నలానే చెల్లికి సైతం నాయకులంటే చిన్నచూపని.. తామే సుపీరియర్ అనే టెంపర్ వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మండిపడుతున్నారు. ఏ అత్మాభిమానం కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో.. అదే ఆత్మాభిమానం వైఎస్ కుటుంబం ముందు తాకట్టు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చూపించిన ఫైర్.. షర్మిల ముందు చల్లారిపోయిందా? అంటూ ఇందిరా శోభన్‌ను ప్రశ్నిస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా? అంటూ హేళన చేసిన షర్మిలకు తగిన బుద్ది చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ నడుస్తోంది.

జొమాటో సీఈఓ సారీ.. ఎందుకో తెలుసా.. 

జొమాటో సీఈఓ సారీ.. ఎందుకో తెలుసా..  ఎంత గొప్పవాళ్ళైనా అయినా. కొన్నీసార్లు పరపాట్లు  తప్పవు.. ఎంతటివారైనా అప్పుడప్పుడు పప్పులో కాలు వేస్తుంటారు. అందుకు నేను కూడా తక్కువేం కాదు అంటున్నాడుజొమాటో సీఈఓ . తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పొరపడి పెట్టిన ట్వీట్‌ తర్వాత ఆ తప్పు క్షమాపణలు వరకు వెళ్ళింది. తన పోస్ట్ పై ముంబయి పోలీసులు స్పష్టత ఇచ్చారు.  మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇటీవల అక్కడి ప్రభుత్వం రాత్రి ఎనిమిది నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే దీపిందర్ ట్వీట్ చేశారు.   ‘ముంబైలో రాత్రి ఎనిమిది తరవాత అవసరమైన ఫుడ్ డెలివరీ చేయడానికి జొమాటో సిద్ధం. అయితే మేం చట్టానికి కట్టుబడి ఉంటున్నాం. కానీ పోటీ సంస్థ రాత్రి ఎనిమిది తరవాత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీనిపై ముందుకెళ్లే మార్గాన్ని స్పష్టం చేయమని ముంబయి పోలీసుల్ని కోరుతున్నాను’ అంటూ దీపిందర్‌ స్విగ్గీ హోం పేజీని షేర్ చేశారు.   ఆయన చేసిన కామెంట్ కి  ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు. ‘ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి గమనించండి. వాటిలో హోం డెలివరీకి అనుమతించింది. ఎక్కడ కూడా కాలపరిమితి విధించలేదు’ అని జవాబిచ్చారు. దీనిపై ముంబయి పోలీసులకు దీపిందర్ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే స్విగ్గీని ట్యాగ్ చేసి..‘క్షమాపణలు, మాకు మరో అవకాశం లేదు’ అంటూ వ్యాఖ్యను జోడించారు. అయితే జొమాటో సీఈఓ వైఖరిని మాత్రం నెటిజన్లు తప్పు పడుతున్నారు.   

కర్ణాటక సీఎంకు కరోనా.. సెలబ్రెటీలపై సెకండ్ వేవ్ పంజా 

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పేద, ధనిక అనే భేదం లేకుండా అందరని కబళించేస్తోంది. రాజకీయ నేతలు ఎక్కువగా వైరస్ భారీన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను వదలడం లేదు మాయదారి కరోనా. ఎంతో ఫిట్ గా ఉండే క్రీడాకారులు కూడా కరోనా భారీన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లు కూడా కరోనా సోకి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు.  తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనాకు సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం ఉదయం యడ్యూరప్పను  రామయ్య మెమోరియిల్ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేసింది. శుక్రవారం  ఉదయం యడియూరప్ప తన నివాసంలో కోవిడ్‌పై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది కూడా యడియూరప్పకు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు కోవిడ్-19 పాజిటివ్ నిర్థరణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. తనను ఇటీవల కలిసినవారు ఐసొలేషన్‌లో ఉండాలని కోరారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు దిగ్విజయ్ సింగ్.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్ సుర్జీవాలా తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. గత ఐదు రోజుల్లో తనను కలిసినవారంతా స్వీయ ఏకాంతంలో గడపాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌కు కూడా కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.  ఇక సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా (68) శుక్రవారం కన్నుమూశారు. కరోనా వల్లే ఆయన మృతి చెందినట్లు సమాచారం. రంజిత్ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.  అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీజీగా, సీబీఐ డెరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్‌గా కూడా పనిచేశారు.    కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ భారీన పడ్డారు క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్. కొన్ని రోజుల పాటు ఆయన హాస్పిటల్ లో ఉన్నారు. బాలీవుడ్ అగ్రహీరోల్లో చాలా మందికి వైరస్ సోకింది. రాజకీయ నేతల విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇటీవలే కరోనా భారీన పడ్డారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనాను జయించి డిశ్చార్చ్ అయ్యారు. కొందరు కేంద్రమంత్రులు కరోనాతో హాస్పిటల్ లో  అడ్మిట్ అయ్యారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి చందులాల్ శుక్రవారం కరోనాతో చనిపోయారు. మహబూబా బాద్ ఎంపీ మాలోతు కవిత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కరోనా నిర్దారణ అయింది.  

కడుపులో బిడ్డకు కరోనా.. 

దేశంలో కరోనా అందర్నీ దత్తత తీసుకుంటుంది.. మొన్నటి వరకు చాల మంది సెలబ్రెటీలు కరోనా భారీన పడ్డారు.  తాజాగా మొదటి సారి అప్పుడు పుట్టిన పసి బిడ్డకు కూడా కరోనా సోకిందని తెలిపారు డాక్టర్స్. ఇలాంటి కేసు రావడం ఫస్ట్ టైం అని కూడా చెప్పారు.   ఆమె నిండు గర్భిణీ. తొలుత ఆమె భర్తకు కరోనా వచ్చింది. ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు. చివరకు ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది. కట్ చేస్తే.. అప్పుడే పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. హర్యానాలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని ప్రసవం చేసిన డాక్టర్ చెప్పారు. కడుపులో ఉండగానే బిడ్డకు కరోనా సోకడం చాలా అరుదని వివరించారు.   తల్లి నుంచి కడుపులోని బిడ్డకూ కరోనా వైరస్ సోకిన అరుదైన ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్పారు. అలా పుట్టే పిల్లలు చాలా అరుదు అని వివరించారు. తాజాగా హర్యానాలోని ఆయుష్మాన్ భవ్ అనే ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది.

టెంపుల్స్ పై కరోనా పంజా.. ఒంటిమిట్ట రామాలయం మూసివేత

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆలయాలపైనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే పలు ఆలయాల్లో దర్శనాలు రద్దు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టీటీడీ, పురావస్తు అధికారుల సమక్షంలో ఆలయానికి నోటీస్‌ అంటించారు. మే  15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు నోటీసులో తెలిపారు కోదండరామాలయంతోపాటు కడప జిల్లాలోని మరో 15 ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం మూసివేతతో ఈనెల 21నుంచి జరగాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కొవిడ్ ఎఫెక్టుతో ఈసారి ఉత్సవాలు సాదాసీదాగా జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే టీటీడీలో సర్వ దర్శనాలు రద్దు చేశారు. 

వివేకా హత్య కేసులో సంచలన వివరాలు

"వివేకా మర్డర్ కేసు వివరాలు తన దగ్గర ఉన్నాయి. డీటేల్స్ ఇస్తానన్నా దర్యాప్తు అధికారులు స్పందించలేదు. స్వయంగా ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు. వివేకా హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. పోలీసులను కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారు." ఇలా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలతో ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు.  వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని సీబీఐ డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని దర్యాప్తు అధికారికి రెండు సార్లు తెలిపినా స్పందించలేదని లేఖలో వివరించారు. దర్యాప్తు అధికారి ఎన్‌కే సింగ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదన్నారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారని ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో తెలిపారు. హత్య జరిగిన తర్వాత ఇల్లంతా కడిగేసి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే వరకు ఘటనా స్థలిని ఎంపీ అవినాష్‌రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని వెల్లడించారు. ఆసమయంలో మీడియా, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదని తెలిపారు. మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి  నిఘా విభాగం అందజేసిందని ఏబీ లేఖలో వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నానని, ఈ కారణంగానే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని ఏబీ వెంకటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు.   

షర్మిల కాదు.. సివంగి...

షర్మిల బ్లౌజ్ చిరిగింది. ఆమె సంకల్పం మాత్రం చెదరలేదు. షర్మిల శరీరాన్ని మహిళా పోలీసులు నలిపేశారు. ఆమె మనోనిర్బరం మాత్రం నలగలేదు. షర్మిల పాదయాత్రపై ఖాకీలు కౌర్రంగా ప్రవర్తించారు. ఆమె పద ఘట్టనలు ప్రభుత్వంలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. షర్మిలపై పోలీసులు బల ప్రయోగం చేసి ధర్నా చౌక్‌లో శిబిరం ఎత్తేశారు. ఆమె దీక్ష మాత్రం లోటస్ పాండ్‌లో కొనసాగుతోంది. ఒక షర్మిల.. వందలాది మంది పోలీసులు.. ఒక షర్మిల.. వందలాది మంది అభిమానులు.. ఒక షర్మిల.. కేసీఆర్ సర్కారుపై వందలాది బాణాలు.. షర్మిల.. షర్మిల.. షర్మిల.. ఇప్పుడు తెలంగాణలో షర్మిల పేరు మారుమోగుతోంది. ఇంకా పార్టీ పేరైనా ప్రకటించలేదు.. అప్పుడే ప్రభుత్వంపై మడమ తిప్పని పోరాటం చేస్తోంది. కంచె ఐలయ్య మాటల్లో చెప్పాలంటే.. షర్మిల రాణి రుద్రమదేవిలా కేసీఆర్ సర్కారుపై దండెత్తుతోంది. ఆమె చేస్తున్న పోరాటం, ఆమె ప్రదర్శిస్తున్న రాజకీయ చాణక్యం.. హేమాహేమీ పార్టీలను, బడాబడా నాయకులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. షర్మిల పార్టీకి ఇంకా జెండా, అజెండానే లేదు. కానీ, తనకు కావలసినంత కరేజ్.. టన్నులకు టన్నులు కమిట్‌మెంట్ ఉందని నిరూపిస్తున్నారు.  దొర పాలనపై పోరాటమంటూ.. ఖమ్మంలో మొదటి సభతోనే తన టార్గెట్ కేసీఆరే అని సూటిగా చెప్పేశారు షర్మిల. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న మొట్టమొదటి ఇష్యూ మరింత సంచలనం. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ భర్తీపై దీక్షా దక్షత ప్రకటించారు. ఏళ్లుగా అసంతృప్తితో రగిలిపోతున్న నిరుద్యోగులను దిక్సూచిగా మారారు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం సునీల్ నాయక్ సూసైడ్ చేసుకుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ కేవలం ప్రకటనలకు, సంతాపాలకే పరిమితమయ్యాయి. కాకలుతీరిన కాంగ్రెస్ కానీ, దూకుడు మీదున్న బీజేపీ కానీ, తూతూమంత్రంగా హడావుడి చేసి సైలెంట్ అయ్యాయి. షర్మల మాత్రం అలా కాదు. జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ ఏకంగా దీక్షకు దిగారు. సున్నితమైన సమస్యపై దీక్ష చేపట్టారు. మొదట ఒకరోజు దీక్ష మాత్రమే.. అప్పటికప్పుడు అది మూడు రోజుల దీక్షగా మారింది. అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేయాలని చూస్తే గట్టిగా వ్యతిరేకించారు. పాదయాత్ర అడ్డుకోవాలని ప్రయత్నిస్తే.. పట్టు వదలకుండా తుదకంటూ ప్రయత్నించారు. పోలీసులు అడ్డునిలిచి కాలు కదపకుండా అడ్డుకుంటే.. ‘‘ఇంకోసారి నాపై చేయివేస్తే బాగోదు’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఖాకీలు ఆమెను బలవంతంగా ఇంటిలో దిగబెడితే.. అక్కడే మొక్కవోని దీక్ష కొనసాగిస్తున్నారు.  షర్మిల దీక్షతో ఉద్యోగాల భర్తీ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. నిరుద్యోగ సమస్య గురించి ఈ మధ్య కాలంలో ఇంతలా మరెవరూ పోరాడింది లేదు. షర్మిల సరైన సమయంలో, సరైన దీక్ష చేపట్టారని అంటున్నారు. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం పదునైన సమస్యపై పోరాటంతో ప్రారంభించడం బాగుందని చర్చించుకుంటున్నారు. షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఓ రాజకీయ సంచలనం. ఒక మహిళగా ఆమె చేస్తున్న పోరాటంతో మిగతా రాజకీయ పార్టీలకు కలవరం. అన్న కోసం ప్రచారం చేయడం మినహా ఇప్పటి వరకూ పెద్దగా రాజకీయ అనుభవం లేదు ఆమెకి. నిన్నామొన్నటి వరకూ అన్న చాటు చెల్లమ్మే. ఇప్పుడూ తల్లి విజయమ్మ తోడుగా ఉండాల్సిందే. అలాంటిది.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ షర్మిల రాజకీయ అరంగేట్రం చేయడం ఓ సంచలనం. మొదట్లో ఆమె ఎవరు వదిలిన బాణమో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ అదే అనుమానం. పార్టీ పెట్టబోతున్నానంటూ ప్రకటించారు అంతే. మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వివిధ వర్గాల ప్రముఖులు వరుసబెట్టి ఆమెను కలవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి, షర్మిల పార్టీకి అంత క్రేజ్ ఏంటి అంటూ అంతా చెవులు కొరుక్కున్నారు. ఆ ఏముందిలే.. ఎందరిని చూడలేదు.. షర్మిలకు అంత సీన్ ఉందా అంటూ అంతా లైట్ తీసుకున్నారు. ఖమ్మం సభ వేదికగా కేసీఆర్‌పై పదునైన విమర్శన బాణాలు వదలడంతో అంతా షాక్ అయ్యారు. ఈమె మామూలు ఆడది కాదు.. ఆడ సివంగిలా ఉందిగా అనుకున్నారు. ఖమ్మం సభతోనే సినిమా అయిపోలేదు.. ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు.. నిరుద్యోగ సమస్య, ఉద్యోగాల భర్తీ కో్సం ఇందిరాపార్కు దగ్గర ఆమె చేపట్టిన దీక్ష రాజకీయంగా దుమ్ము రేపింది. పోలీసుల బలప్రయోగాన్ని ధిక్కరించి పాదయాత్ర చేపట్టడం.. బ్లౌజ్ చిరిగినా.. చెదరని సంకల్పంతో.. సమరనాదం వినిపించడం సంచలనమే. ఇప్పుడు లోటస్‌పాండ్‌లో 72గంటల దీక్ష కొనసాగిస్తున్నా.. తెలంగాణకు ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానంటూ సవాల్ చేసినా.. అది షర్మిలకే చెల్లింది.