తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ స్వరం?

దేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల రాజకీయం ఒక ప్రత్యేకత సంతరించుకున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆసక్తి కంటే జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల రాజకీయం పట్లే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలుగు రాష్ట్రాలపై పడింది.  నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పుట్టినట్లు చెప్పుకుంటూ.. రాష్ట్రం తెరాస చేతుల్లో ఉంటేనే ‘సేఫ్’ అని చెప్పుకుంటూ వస్తున్న తెరాస ఒక్కసారిగా జాతీయ ప్రయోజనాల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడతామని ఢిల్లీకి చేరుకుంది. జాతీయ స్థాయి రాజకీయం అంటే తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటకలలో కూడా బీఆర్ఎస్ కాలూనేందుకు ప్రయత్నాలు చేపట్టింది.  తెలంగాణ నినాదాన్ని వదిలేసి కేసీఆర్ జాతీయ నినాదం అందుకోవడంతో  తెలంగాణలో  ఇతర ప్రాంతీయ పార్టీలకు స్కోప్ లేదా స్పేస్ లభించిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ తెలంగాణలో రాజకీయాలు వదులుకున్నా.. తెలుగుదేశం మాత్రం ఇప్పటికీ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. కేడర్ విషయంలో మాత్రం గట్టి బలమే ఉంది. అందుకే ఈ సారి ఎన్నికలలో టీడీపీ కూడా తెలంగాణలో  యాక్టివ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పోటీకి సై అంటున్నారు.   తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ తన క్యాడర్ కు పిలుపునిచ్చేశారు.  ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ చార్జి   శంకర్ గౌడ్ వెల్లడించారు. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఆయన  మరి కొన్ని  నియోజకవర్గాలలో పోటీ చేసే విషయం యోచిస్తున్నామని వివరించారు. అయితే ఏపీలో  కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీకి దిగితే రాజకీయంగా ఇరు రాష్ట్రాలలో ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో జోరందుకున్నాయి. అలాగే పరిశీలకులు తమ విశ్లేషణలకు పదును పెడుతున్నారు.   ఏపీలో పొత్తుకు సిద్దమవుతున్న జనసేన-టీడీపీ తెలంగాణలో కూడా కలిసి పోటీకి దిగితే ఎలా ఉంటుంది?.. ఒకవేళ వీటికి బీజేపీ కూడా తోడై రెండు తెలుగు రాష్ట్రాలలో  ఉమ్మడిగా రంగంలోకి దిగితే ఏమౌతుందన్న చర్చ తెరపైకి వచ్చింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగితే ఏపీలో ఈ కూటమికి ఎదురే ఉండదనీ, అదే ఫార్ములా తెలంగాణలో కూడా సక్సెస్ అయ్యేందుకే ఎక్కువ అకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా పోటీకి దిగితే ఏపీలో వైసీపీకి నష్టమని చాలా కాలంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్బావంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనల పొత్తు.. సమైక్య ముద్రతో ప్రజలకు దూరం అవుతుందా అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసిన కేసీఆర్ బీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. మొత్తం మీద పొత్తు పొడుపులు, రాజకీయ సమీకరణాల విషయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రంజుగా మారాయనడంలో సందేహం లేదు. మొత్తంమీద ఈ సారి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ స్థాయిలో ఏదో ఒక మేరకు ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

2022 రౌండప్ .. సమతామూర్తి విగ్రహావిష్కరణ

  ఫిబ్రవరి..    కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ... నిన్న జనవరిలో ఏమి జరిగింది తెలుసుకున్నాం .. ఈరోజు ఫిబ్రవరిలోకి వెళదాం రండి ..  జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.  ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.  అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.   ఫిబ్రవరి 6:   ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. (మార్చి 22 లో ఏమి జరిగింది ..రేపు చూద్దాం)  

బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మా కారణమేంటి?

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంత కాలంగా వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్..చివరికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేసేశారు. తన కొత్త పార్టీ కేద్ర కార్యాలయాన్ని హస్తినలో  బుధవారం (డిసెంబర్ 14) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు. అయితే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం తన హస్తిన పర్యటనను చివరి నిముషంలో రద్దు చేసుకున్నారు. అలా రద్దు చేసుకోవడానికి జపాన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవమే కారణమని బయటకు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఆవిర్బావానికి ముందు నుంచీ కూడా తెరాసలో లుకలుకలు ఉన్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య అంతగా పొసగడం లేదన్న ప్రచారమూ ఉంది. అందుకే కేసీఆర్ ‘జాతీయ’ బాట పట్టారనీ కూడా అంటున్నారు. నిజమే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు. వ్యూహాలు రచిస్తున్నారు.  ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు. నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ వెంటనే, “ కల్వకుట్ల తారక రామారావు .. అను నేను ... అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి, ఒక దాని కొకటి సమాంతరంగా సాగుతాయని తెరాస శ్రేణులే కాదు, ఇతర రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నారు. అందులో రహస్యం ఏమీ లేదు. నిజానికి, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, అది జరగలేదు. ఆ కారణంగానే అప్పట్లో సుమారు ఆరేడు నెలలకు పైగా, మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ముఖ్యమంత్రి కేసేఆర్, ఉప ముఖ్యమంత్రి ముహ్మదాలీ ఇద్దరే పరిపాలన సాగించారు.  ఇక అక్కడి నుంచి, కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సనాహాలు జరిగాయో, ఎన్ని ముహూర్తాలు మురిగి పోయాయో  లెక్కలేదు. నిజానికి ఒక దశలో, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నా లే అన్నట్లు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటి కప్పుడు  విఘ్నాలు అడ్డుపడుతున్నాయి. ఈ కారణంగానే తండ్రీ కొడుకుల మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాల్లో అప్పటి నుంచీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగానే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభో త్సవానికి డుమ్మా కొట్టారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. 

అయోధ్య మసీదు డిజైన్ ఎలా ఉందంటే..?

వివాదాస్పద అయోధ్యరామజన్మ భూమి అంశం కోర్టులో పరిష్కారం అయిన తరువాత రామమందిర నిర్మాణం జోరందుకుంది. అలాగే కోర్టు సూచనల మేరకు అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని    అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కన, దన్నిపూర్ గ్రామంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయింపు కూడా జరిగింది. ఆ ప్రదేశంలో మసీదు నిర్మాణం కానుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ కూడా రెడీ అయ్యింది.   అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ నుంచి మసీదు నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఇక మసీదు నిర్మాణం కూడా జోరందుకుంటుంది. అయితే ఆ స్థలంలో కేవలం మసీదే కాకుండా 200 పడకల హాస్పిటల్ కూడా నిర్మిస్తామని  ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు.  ఇందు కోసం మొదటి దశలో రూ.100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు మొత్తం 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని వివరించారు. తాజాగా అయోధ్యలో నిర్మించనున్న మసీదు డిజైన్ ను విడుదల చేశారు. మసీదు ఎలా డబోతోందో ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు.  దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసేందుకే మసీదు డిజైన్ అద్భుతంగా ఉందనీ, నిర్మాణం పూర్తయితే మరింత బ్రహ్మాండంగా ఉంటుందని అంటున్నారు. 

జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ ఆహ్వానం?

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జేడీ లక్ష్మీనారాయణకు పరిచయం అవసరం లేదు. సిబిఐలో ఆయన హోదా (జేడీ)నే ఇంటి పేరుగా మార్చుకున్నఆయన అసలు పేరు, వీవీ లక్ష్మి నారాయణ, వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ. ఆ పేరుతో ఆయన్ని ఎవరూ గుర్తుపట్టక పోవచ్చును కానీ, జేడీ అంటే చాలు, లక్ష్మీనారాయణ కళ్ళ ముందు కనిపిస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జేడీ లక్ష్మినారాయణ వార్తల్లో వ్యక్తిగా, మీడియలో తరచు కనిపిస్తూనే ఉన్నారు. అయితే    ఇప్పడు ఇక్కడ ఆయన ప్రస్తావనకు  ఆయన సిబిఐ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం లేదు. అయితే  అందుకో కారణం వుంది. నో .. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సిబిఐ విచారణ ఎదుర్కుంటున్న  తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కుమార్తె  తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కేసు గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు  విశ్లేషణలు, ఇక్కడ ఆయన ప్రస్తావనకు కారణం కాదు.  నిజానికి ఆయన పూర్వాశ్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అయినా సిబిఐ వాసనలు ఆయనను వదలక పోయినా, ఆయన ప్రస్తుతం  ఒక పొలిటీషియన్. రాజకీయ వేత్త. ఆరేడేళ్ళ కిందట స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో చేరారు.  2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం  నుంచి పోటీ చేశారు. ఓడి పోయారు.ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. అయితే అయిన రాజకీయాలను వదిలేయలేదు. మరో పార్టీలో చేరలేదు కానీ రాజకీయాలో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అంతే కాదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను విశాఖ నుంచి మళ్లీ పోటీ చేస్తానని.. ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఇప్పడు అదే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కిల్స్ లో  హాట్ టాపిక్. జేడీ ఏ పార్టీలో చేరతారు అనే విషయం  కట్టప్పను ఎవరు చంపారు  స్థాయిలో టెన్షన్  క్రియేట్ చేస్తోందని అంటున్నారు.  మరో వంక చాలా కాలంగా జేడీ రాజీకీయ భవిష్యత్ ప్రస్థానం గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బీజేపీలో చేరతారని అంటుంటే.. మరికొందరు వైసీపీలో చేరే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇంకొందరు టీడీపీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారు. మరోవంక మాజీ జేడి అమ్ ఆద్మీ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అదలా ఉంటే  గత నాలుగైదు రోజులుగా జేడీ లక్ష్మినారాయణ రాజకీయ ప్రస్థానం గురించి మరో  బ్రేకింగ్ న్యూస్ వినవస్తోంది.  అవును జేడీ లక్ష్మినారాయణను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్న పార్టీలలో మరో పార్టీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా జాతీయ రాజకీయ యవనిక పై తెలంగాణ జెండా ఎగరేసే లక్ష్యంతో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చుకున్న  తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల ‘జాతీయ’ పార్టీ కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారాస ఏపీ బాధ్యతలు చూస్తున్నట్లు చెపుతున్న  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్  మాజీ జేడీతో సంప్రదింపులు ప్రారంభించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే  తలసాని జేడీతో కలవాలని అనుకుంటోంది, అందుకోసంగా ఆయనను ఫోనులో సంప్రదించింది నిజమే అయినా ఆయనని పార్టీలోకి ఆహ్వానించేందుకు కలవాలనుకుంటున్నారా  లేక కవిత కేసులో సలహాలు తీసుకునేందుకు కలవాలని అనుకుంటున్నారా? అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. నిజానికి, ఈ అనుమానంతోనే కావచ్చును జేడీ లక్షినారాయణ  ఏ పార్టీలో చేరాలనే విషయంలో ఇంకా ఒక ఆలోచనకు రాలేదని  సున్నితంగా తలసానికి నో .. చెప్పినట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, ఇంతవరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై అంతగా దృష్టి పెట్టని  కేసీఆర్  ఇప్పడు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలపై దృష్టిని  కేంద్రీకరించారని  ఏపీలో ముఖ్యంగా కాపు వర్గం పై దృష్టి పెట్టారని  అంటున్నారు. అందులో భాగంగానే  యాదవ్ సామాజిక వర్గానికి చెందిన  మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో కోడి పందేల బంధుత్వాలు, టీడీపీ రాజకీయ చుట్టరికాలు ఉన్న తలసాని శ్రీనివాస రావుకు ఏపీ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికకి చెందిన జేడీ లక్ష్మీనారాయణతో సంప్రదింపులు ప్రారంభించి నట్లు తెలుస్తోంది. అయితే  ఈసారి ఎలగైనా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని గట్టిగా భావిస్తు జేడీ లక్ష్మీనారాయణ అసలు  ఏ పార్టీలోనూ చేరక పోవచ్చని  చివరకు ఒక జాతీయ పార్టీ ప్రత్యక్ష, మరో ప్రాంతీయ పార్టీ పరోక్ష మద్దతుతో విశాఖ నుంచి ఇండిపెండెంట్  గా పోటీ చేసే ఆలోచన నడుస్తోందని అంటున్నారు. నిజానికి  స్వయంగా జేడీ లక్ష్మినారాయణ కూడా  ఒక ఇంటర్వ్యూలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం లేకపోలేదని సూచన ప్రాయంగా చెప్పారు.  కర్ణాటకలో సినీనటి సుమలత అంబరీష్ ఎంచుకున్న మార్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తే అందరి  మద్దతు పొందే అవకాశం ఉంటుందని ఆయన అత్యత సన్నిహిత మిత్రులు అంటున్నారు.  సో .. జేడీ భారాస లో  చేరతారా, లేదా, అనేది ఇప్పట్లో తేలే విషయం కాదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందనే అనుకోవచ్చును.

అమ్మో అమ్మాయేనా?.. ఇంటికొస్తున్నా ఇవన్నీ సిద్ధం చేయండంటూ తండ్రికి మెసేజ్

పిల్లలంటే తల్లిదండ్రులకు మురిపెం. పిల్లలేం చేసిన వారికి ముద్దుగానే ఉంటుంది. అందులోనూ తమకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లలంటే మరీను. వారికి సెవలులెప్పుడొస్తాయా? ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని  ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇంటి మీద బెంగ ఉంటుంది. గారంగా కోరితే కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చే తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండటం వారికీ ఇబ్బందే. అందుకే హాస్టల్ కు వెళ్లిన రోజు నుంచీ వారు ఎప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడు ఇంటికి వెడదామా అని రోజులు లెక్కిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంటి దగ్గర అమ్మ తనకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ వండి పెడుతుంటే.. ఆ రుచికి అలవాటు పడిన వారు హాస్టళ్లలో తిండి తినలేక ఇంటి ఫుడ్ కోసం మొహంవాచిపోయి ఉంటారు. అలా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ఇష్టమైనవన్నీ తినేద్దామా అన్న ఆత్రంలో ఉన్న ఓ బాలిక హాస్టల్ నుంచి తన తండ్రి ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ఫలానా రోజున ఇంటికి వస్తున్నాననీ, ఆ రోజుకు తాను పంపిన మెనూ ప్రకారం ఫుడ్ రెడీ చేయమనీ ఆ మెసేజ్ సారాంశం. శ్వేతాంక్ భూషణ్ అనే వ్యక్తి   కుమార్తెను హాస్టల్ ఉండి చదువుకుంటోంది. ఐదు నెలల తరువాత శుక్రవారం (డిసెంబర్16)   క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి రానుంది. ఈ సందర్బంగా ఆమె తండ్రికి మెసేజ్ చేసింది. తాను సెలవలకు ఇంటికి వస్తున్నాననీ, తనకు సెలవులలో ఏం ఫుడ్ కావాలో ఓ లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్ చూసిన శ్వేతాంక్ భూషణ్ తొలుత షాక్ అయ్యాడు. ఆ తరువాత కూతురిపై ప్రేమ పొంగుకొచ్చింది. ఆమె కోరినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు తనకు పంపిన మెసెజ్ ను యథాతథంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయ్యింది. ఇంతకీ తన తండ్రికి ఆ అమ్మాయి మెసేజ్ చూసిన లిస్ట్.. సెలవుల్లో ఆ అమ్మాయి తినాలనుకుంటున్న ఫుడ్ ఐటెమ్స్. ఆ జాబితా ఏం చిన్నగా లేదండోయ్ చాలా చాలా భారీగా ఉంది. హాస్టల్ తిండి తినలేక రుచికరమైన ఫుడ్ కోసం ఆ అమ్మాయి ఎంతగా తహతహలాడిపోతోందో ఆ లిస్ట్ చూస్తే ఇట్టే అర్దమైపోతుంది. అందుకే సామాజిక మాధ్యమంలో  తెగ వైరల్ అయిపోయింది. గతంలో నా కుమార్తే ఇలాగే చేసేది.. ఇప్పుడు పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇంటికి వస్తోందంటే ఇలా తనకు కావలసిన ఫుడ్ ఐటెమ్స్ జాబితా పంపుతుంది.. అయితే ఇప్పుడు తన ఒక్కర్తికే కాదు.. భర్త,  పిల్లల కోసం కూడా సెపరేట్ లిస్ట్ పెడుతోందని ఓ తండ్రి స్పందించాడు. ఇక విద్యార్థులైతే మేం కూడా అంతే అని కొందరు...ఇక పై మేమూ ఇదే ఫాలో అవుతామని మరి కొందరూ స్పందించారు.  

జాతీయ పానియంగా తేనీరు.. బీజేపీ ఎంపీ డిమాండ్

జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి.. మరి జాతీయ పానియం? ఈ విషయంలోనే అసోంకు చెందిన బీజేపీ పబిత్రా మర్గెరిటాకు కోపం వచ్చింది. తేనీరు (టీ)ని జాతీయ పానియంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరో అవర్ లో మంగళవారం (డిసెంబర్ 13)న ఆయన మాట్లాడారు. దేశంలో మరేం సమస్యా లేదన్నట్లు టీకి జాతీయ పానియం హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోకుండా దేశంలో ప్రజల జీవనంలో తేనీరు ఒక భాగమని చెప్పారు. దేశంలో అత్యధికులు తమ రోజును ఒక కప్పుటీతో ప్రారంభిస్తారని తెలియజేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అందరి జీవనంలో తేనీరు అంతర్భాగమన్నారు. అంతెందుకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం చాయ్ వాలాగానే ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు.  మరి ఇన్ని ఘనతలున్న తేనీరును జాతీయ పానియంగా ప్రకటించకపోతే ఎలా అని పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. టీని జాతీయ పానియంగా ప్రకటించడంతో పాటు.. తేయాకు తోటల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తేయాకు తోటలలో పని చేసే కార్మికుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనీ కోరారు.   2023లో అస్సాం టీ 200వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందనీ,  అసోం ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారని చెప్పిన ఆయన ఈ సందర్భంగానైనా తేనీరును జాతీయ పానియంగా ప్రకటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. 

ప్రత్యేక హోదా వన్స్ మోర్.. అదే ప్రశ్న ..అదే జవాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పడు ఆ లోతుల్లోకి పోవలసిన అవసరం లేదు. అయితే, రాష్ట్ర విభజన న్యాయంగా జరిగిందో  అన్యాయంగా జరిగిందో ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. అయితే, కనీసం  రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం అయినా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ఆంద్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంట్ లోపల వెలుపల ఎందుకు గళం విప్పలేక పోతున్నారు. ముఖ్యంగా అధికార వైసేపీ సభ్యులు  పార్లమెంట్  ఉభయ సభల్లో హోదా, పోలవరం ప్రస్తవన వచ్చిన ప్రతి సంధర్భలో ఎందుకు మౌనంగా ఉండి పోతున్నారు. ఎందుకు వారు గళం ఎత్తుతారని ఆశించడం కూడా అత్యాశగా అనిపిస్తోంది? అంటే,   వైసేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఎంపీలు కేంద్రానికి అంతగా దాసోహం అంటున్నారు కాబట్టే అనే సమాధానమే వస్తోంది. ఆ మాటలు అంటోంది  ఎవరో కాదు, అధికార పార్టీ  నాయకులూ, క్యాడర్ నోటి నుంచే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి.  రాష్ట్ర విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ప్రామిస్ చేసిన  ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. అదొక ముగిసిన అధ్యాయం  అంటూ పక్కన పెట్టేసింది. ఎన్ని సార్లు అడిగినా అదే సమాధానం. అవే మోసపు మాటలు. తాజాగా మంగళవారం  (డిసెంబర్ 13) రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అటు లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా విభజన అంశాలపై ప్రశ్నించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే పాత పాటనే మరోమారు వినిపించింది. 14, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించింది.  14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం చూపడంలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని పేర్కొంది.  తద్వారా ప్రత్యేక హోదా అంశం తమ దృష్టిలో లేదని స్పష్టం చేసింది. అలాగే 14వ ఆర్థిక సిఫారసులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.    కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. నిజమే   అయితే, మన బంగారం మంచిదైతే కదా, వేరొకరిని వేలెత్తి చూపేందుకు.. నిజానికి  2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీ  లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే  ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే చేతులు ఎత్తేశారు. కేంద్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి ఇక, ప్రత్యేక హోదా మోడీ దయ మన ప్రాప్తం అంటూ జగన్ రెడ్డి చేతులు  ఎత్తేశారు.  నిజమే  కావచ్చును  కానీ, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పడు  సంఖ్యాబలంతో పని లేకుండా పార్లమెంట్ లోపల, వెలుపల, న్యాయస్థానాల ద్వారా.. కేంద్రం మెడలు వంచేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎందుకు ఉపయోగించు కోలేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఎన్ని సార్లు ప్రధానిని కలిసినా ఎంత సేపు కాళ్ళకేసి చూడడమే తప్ప గొంతెత్తి అడిగిందేదని అధికార పార్టీ క్యాడర్, ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన యువత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ లో తెలుగు దేశం సభ్యులు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు  వైసీపీ సభ్యులు మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఎవరు అడిగారన్నది కాదు... రాష్ర ప్రయోజనాల విషయంలో అయినా  వైసేపీ రాజకీయాలకు అతీతంగా ఎందుకు కేంద్రాన్ని  నిలదీయ లేక పోతోంది, అనేదే అసలు ప్రశ్న అంటున్నారు.

మోడీ కంటే ఘనుడు భూపేంద్ర పటేల్!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరున చాలా రికార్డులే నమోదై ఉండవచ్చును. ఆయన,  గుజరాత్ అసెంబ్లీ లో ముఖ్యమంత్రిగానే తొలి  అడుగు, వేశారు. కనీసం ఎమ్మెల్యే అయినా కాకుండానే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, మోడీ,  పార్లమెంట్  ఎంట్రీ కూడా అంతే. ఆయన ప్రధానమంత్రిగానే  లోక్ సభలో అడుగు పెట్టారు. అలాగే ఆయన  ఇంతవరకు ఏ ఎన్నికలోనూ ఓడిపోలేదు. ఆయన ఓడిపోక పోవడమే కాదు  ఆయన సారధ్యంలో పోటీ చేసిన ఏ ఎన్నికల్లోనూ అది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అయినా  పార్లమెంట్ ఎన్నికలే అయినా  ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడి పోలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరసగా మూడు సార్లు ప్రభుత్వ వ్యతిరేకతను జయించిన మోడీ, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకతను జయించారు. ముందు (2014) కంటే 2019లో ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు.  మోడీ రికార్డులు ఇంకా  చాలానే ఉంటాయి, అయితే  గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన  భూపేంద్ర పటేల్  (ఈయన కూడా అనుకోకుండా, అనుహ్యంగా  ముఖ్యమంత్రి అయ్యారు) మోడీ సాధించలేని ఒక కొత్త రికార్డును సృష్టించారు. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పటేల్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ రికార్డునే బద్దలు కొట్టారు.అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి ఎమ్మెల్యేగా,ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. 2021 సెప్టెంబర్ లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రుపానీని అనూహ్యంగా ఆ పదవి నుంచి తొలగించి భూపేంద్ర పటేల్ కు అధిష్టానం పగ్గాలు అప్పగించింది. రూపానీ రాజీనామా తర్వాత చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయినా మంత్రి అయినా కానీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ పేరును  ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజానికి, 2001లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఉహించలేదు. ఎవరో  ఏమిటి, మోడీ కూడా ఉహించలేదు. పటేల్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే సమయానికి, కనీసం ఎమ్మెల్యే. మోడీ అది కూడా కాదు. అలాగే  భూపేంద్ర పటేల్  ముఖ్యమంత్రి అవుతారని, ఆయనతో సహా ఎవరు ఉహించలేదు. ఎలాంటి మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేకుండానే, పటేల్ గత ఏడాది తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా,అయన సారధ్యంలో బీజేపీ, చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. నరేంద్ర మోడి సారధ్యంలో 2014 ఎన్నికలలో బీజేపీ, మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసింది.ఎన్డీఎ కూటమిగా పోటీ చేసిన, బీజేపీ, మూడు పదుల కాలంలో మొదటి సారిగా ఒంటరిగా ( సింగిల్ పార్టీ) మెజారిటీ సాధించి చరిత్రను సృష్టించింది. అలాగే గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇతవరకు ఆదుకోలేక పోయిన కాంగ్రెస్ రికార్డును భూపేంద్ర పటేల్  సారథ్యంలో బీజేపీ అందుకుంది. 1985లో ముఖ్యమంత్రి మాధవ సింగ్ సోలంకి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ  సృష్టించిన, 149/182 సీట్ల రికార్డును, 2022 ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ 156/182 సీట్ల భారీ మెజారిటీతో  బద్దలు కొట్టారు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బిజెపి 127 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపేంద్ర పటేల్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఏకంగా 156 మంది ఎమ్మెల్యేల బలగంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అదొకటి అలా ఉంటే ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2017 లో తొలిసారి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి శక్తి కాంత్ పటేల్ పై విజయం సాధించారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పటేల్ అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోను అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.92 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అందుకే, మోదీ కంటే ఘనుడు పటేల్ .. అంటున్నారు గుజరాత్ ప్రజలు. ఓటర్లు.

2022 రౌండప్ ..

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జనవరి 1 2021 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.   జనవరి 4 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు.  జనవరి 5  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  జనవరి 15 సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు. జనవరి 20  బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.  జనవరి 23  నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.  జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు. జనవరి 31  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.   (ఫిబ్రవరి 22  రౌండప్ రేపు)  

టార్గెట్ 175 ఆఫ్ 175.. మరి అభ్యర్థులెవరు?

వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్... పక్కాగా ఫిక్స్ అయిపోయారు. అదీ కూడా మొత్తం 175కి 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ ఖాతాలో పడి పోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో పని చేసిన వారికే మళ్లీ టికెట్లు.. అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షా సమావేశంలో సీఎం జగన్ క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.  దీంతో తమకు మరో  ఛాన్స్ లేదని ఇప్పటికే వైసీపీలోని   పలువురు ఎమ్మెల్యేలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.  మరోవైపు.. పలువురు ఎంపీలను ఈ సారి అసెంబ్లీకి పంపాలని సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో విశాఖ ఎంపీ .వి.వి.సత్యనారాయణ, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ మార్గాని భరత్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్ ఉన్నట్లు సమచారం.  విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎం.వి.వి.సత్యనారాయణ సంగతే తీసుకుంటే.. విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటన్నింటిలో.. ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత పార్టీలోని నేతలు సైతం ఆయనపై అసంతృప్తితో రగలిపోతున్నారని.. ఈ విషయాన్ని పసిగట్టిన ఎంపీ సత్యనారాయణ.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగుతానంటూ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం  వద్ద కూడా ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ తూర్పు లేదా ఉత్తరం నుంచి ఎంవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.  ఇక కాకినాడ లోక్‌సభ సభ్యురాలు వంగా గీత కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసి.. మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో కాకినాడకు కూత వేటు దూరంలోని పిఠాపురం నుంచి ఆమె బరిలోకి  దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇక్కడున్న పెండెం దొరబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని జగన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు... దీంతో వచ్చే ఎన్నికల్లో వంగా గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  పోటీ చేస్తారని తెలుస్తోంది.       రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్ కూడా ఈ సారి అసెంబ్లీపై కన్ను వేసినట్లు సమాచారం. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. సొంత పార్టీలోని నేతల్లో ఆయనపై పీకల వరకు అసంతృప్తి ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తే.. సొంత పార్టీలోని వారే పనిగట్టుకొని మరీ తనను ఓడిస్తారని భరత్‌కు క్లియర్ కట్‌గా అర్థమైందని.. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు భరత్.. తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఓ వేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే.. బీసీ వర్గానికి చెందిన తనకు జగన్ కేబినెట్‌లో బెర్త్ గ్యారంటీ అని భరత్ పూర్తిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.     ఇక మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. నరసారావుపేట నుంచి   పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బందరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి ఎంపీ బాలశౌరి మధ్య పచ్చగడ్గి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలశౌరిని బందరు లోక్‌సభ స్థానం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయించేందుకు పేర్ని నాని కంకణం కట్టుకొని మరీ జగన్ వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు ఓ చర్చ అయితే బందరులో హల్‌చల్ చేస్తోంది. అదీకాక ప్రస్తుతం నరసారావుపేట ఎంపీ లావు కృష్ణాదేవరాయులు.. రాజధాని రైతులకు మద్దతు తెలపడంతో.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ఆగ్రహానికి ఆయన గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణదేవరాయులు... సైకిల్ పార్టీలోకి జంప్ చేసేందుకు తన ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.  బాపట్ల ఎంపి నందిగం సురేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. మంత్రి కావాలని ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే  జిల్లాలో ఎక్కడా అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఓ వేళ.. ఆమె పార్టీ మారితే.. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి నందిగం సురేష్‌ను నిలిపే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. న్యూడ్ వీడియోతో గట్టిగానే మకిలి అంటించుకొన్నారు. దీంతో పార్టీలోనే కాదు.. ప్రజల్లో సైతం ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓ వేళ ఆయనపై వేటు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆయన సామాజిక వర్గ ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని.. ఆ క్రమంలోనే జగన్ అండ్ కో.. గోరంట్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిందనే  ఓ టాక్ అయితే అప్పట్లో బాగానే నడిచింది. అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా మరో వ్యక్తిని నిలబెట్టే అవకాశాన్ని జగన్ పార్టీ పరిశీలిస్తుంన్నదనే   చర్చ   ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.   కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి.. వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు.. సీఎం   జగన్ ఫ్యామిలీ తప్ప..ఆ కుటుంబంలోని మరో ఫ్యామిలీ   అవినాశ్  రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైఎస్ అవినాశ్ రెడ్డిని రాజంపేట ఎమ్మెల్యేగా బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి.. గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు. ఆయనను ప్రస్తుతం పార్టీ అధిష్టానం సాధ్యమైనంత దూరం పెట్టింది. దీంతో ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.  మరో వైపు అన్నమయ్య జిల్లా కేంద్రంగా  రాజంపేటను కాదని  రాయచోటిని  చేయడంపై ప్రజల్లో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో ఈ స్థానం నుంచి  ఆవినాశ్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ఓ టాక్  వైరల్ అవుతోంది.

తెలంగాణలో ఎవరి గోల ఏమిటో?

ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయి, ఎనిమిదేళ్లు నిండి పోయాయి, అయినా ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  చాలా విషయాల్లో దాయాది తగవులు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. విబేధాలు, విమర్శలు, కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. అయినా అక్కడ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసల మధ్య స్నేహ పూర్వక సంబంధాలే కొనసాగుతున్నాయి. అలాగే  ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా మంచి మిత్రులుగానే మెలుగుతున్నారు. చిన్న చిన్న పొర పొచ్చాలు ఉన్నా రాజకీయ ,స్నేహ సంబంధాల విషయంలో మాత్రం ఇచ్చి పుచ్చుకునే ధోరణి కొనసాగుతోంది. భారాస కు వైకాపా రెడ్ కార్పెట్  స్వాగతం పలికిందంటే, ఇక ఆ రెండు పార్టీల మధ్య స్నేహ బంధంగా ఎంత పటిష్టంగా వుందోవేరే చెప్పనక్కరలేదు. ఆలాగే, ఉభయ తెలుగు రాష్టాల రాజకీయాల విషయానికి వస్తే  ఎవరిదారి వారిది, అన్నట్లుగా  అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి పరిధికి వారు పరిమితమై రాజకీయం చేస్తున్నారు. అయితే, ఇంతవరకు ఒక లెక్క, ఇప్పడు మరో లెక్క అన్నట్లుగా కథ మారింది. ముఖ్యంగా, తెలంగాణలో రాజకీయ ఈక్వేషన్స్ వేగంగా మారి పోతున్నాయి. అధికార  తెరాసని వరసగా రెండు సార్లు గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్, ఇప్పడు అంత వేడిగా లేదు. చాలా వరకు  చల్లబడింది. అంతేకాదు  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన, కుటుంబ అవినీతి పెరిగిపోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో  తెలంగాణ సెంటిమెంట్ తిరగబడింది. మరో వంక తెరాస,భారాసగా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడంతో కొన ఊపిరితో మిగిలిన ఆ కాస్త సెంటిమెంట్  కూడా తుడిచి పెట్టుకు పోయింది.  ఈ నేపధ్యంలో తెలంగాణ రాజకీయాలలో ఏపీ పాలిటిక్స్  వచ్చి కలవడంతో తెలంగాణ రాజకీయ లెక్కలు మారుతున్నాయనే చర్చకు తెర లేచింది. నిజానికి తెలంగాణ రాజకీయాలు 2018 ఎన్నికల నుంచి చాలా దూరం వచ్చాయి.  2018లోనూ బీజేపీ బరిలో ఉన్నా, తెరాస,కాంగ్రెస్ పార్టీలను మాత్రమే ప్రజలు ప్రధాన ప్రత్యర్దులుగా గుర్తించారు. 2014లో  తెలుగు దేశంతో పొత్తు జనసేన మద్దతుతో పోటీచేసి ఐదు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో నాలుగు సీట్లు కోల్పోయి, గోషామహల్ ( రాజా సింగ్) స్థానం ఒక్కటి మాత్రమే నిలబెట్టుకుంది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి మునుగోడు వరకు కథ మారుతూ వచ్చింది. తెరాసకు ప్రధాన ప్రత్యర్ధి స్థానం  కోసం జరిగిన పోటీలో బీజేపీ కాంగ్రెస్ పై పైచేయి సాధించింది.   ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక ఓటును మరింతగా చీల్చేందుకు, తెరాస వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే  గురితప్పి తెలంగాణలో వాలిన జగనన్న విడిచిన బాణం, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇమేజ్  పెంచేందుకు, ఆమెను తెరాస ప్రత్యర్ధిగా చూపేందుకు, ఆమె పాదయాత్రను అడ్డుకోవడం, అరెస్ట్, గృహ నిర్భందం, రోడ్ (భైఠాయింపు) షో డ్రామాలతో రక్తి కట్టిస్తున్న తెరాస నాయకత్వం, ఇప్పడు ఏపీకి చెందిన మరో, ‘స్టార్’ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ను తెర మీదకు తెచ్చింది. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తెలంగాణ తెర మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఏపీలోనే కాదు  తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. జనసేన 32 స్థానల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత లెక్కల్లో, అదే విధంగా కేసీఆర్ సర్వేల్లో బీజేపీ 32 స్థానల్లో తెరాసకు గట్టి పోటీ ఇస్తుందని, ఆ 32 స్థానాల్లో బీజేపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇప్పడు పవన్ కళ్యాణ్  32 సీట్లలో పోటీ చేస్తారని ప్రచరం జరగడంతో పవన్, కేసేఆర్ వదిలిన బాణం అనే అనుమానానికి బలం చేకురుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఇది నాణానికి ఒక వైపు, ఉహాగానం, అయితే, మరో వైపున షర్మిల బీజేపీ టచ్ లోకి వెళ్ళారని  అందుకే ఆమె అరెస్ట్ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు ఆమెకు సంఘీభావం ప్రకటించారని తెరాస నాయకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై ఈడీ,సిబిఐలకు ఫిర్యాదు చేసిన షర్మిల త్వరలో ఢిల్లీకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పైన మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే కేసీఆర్ ఆమెను టార్గెట్ చేశారని  మొదటి సారిగా  పాద యాత్రను అడ్డుకుని అరెస్ట్ చేశారని అంటున్నారు. అయితే  పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటికే క్లారిటీతో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు  షర్మిలతో సంబంధాల విషయంలో  మౌనంగా ఉండడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో జనసేనతో తమ పార్టీకి పొత్తు ఉండదని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గతంలోనే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నబీజేపీ  నాయకులు షర్మిల విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. నిజానికి, బీజేపీ నాయకత్వం  షర్మిలతోనే కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో  ఉభయ తెలుగు రాష్ట్రాలలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు, చెప్పారు. అయితే 2018 లో, కేసేఆర్, చంద్రబాబుబు బూచిగా చూపించి, తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని  కొంచెం అటూ ఇటవుతోందని అంటున్నారు. అదలా ఉంటే ఉహా గానాలు, వ్యూహా గానాలు ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని,  నిజానికి  బీజేపీనే కాదు తెరాస సహా ఏ పార్టీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపించే వరకు ఆట ఆలా సాగుతూనే ఉంటుందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.అంతవరకు ఎవరి గోల వారిది ..చూసి, విని ఆనందించండి.

కోహ్లీ, స్మృతి ఇద్దరూ 18నే.. తగ్గేదే లే!

క్రికెట్ అనగానే ప్రపంచంలో ఆ క్రీడను అభిమానించే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీని అభిమానించే క్రికెట్ ప్రేమికులు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నిటిలో ఉన్నారు. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీలోని బెస్ట్ క్రికెటర్ బయటకు వస్తాడు. అంటే ప్రత్యర్థులు నిర్దేశించే విజయ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపుతాడు.  ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో కోహ్లీ ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. టి 20లలో అత్యధిక పరుగులు, హయ్యస్ట్ నంబర్ ఆప్ హాఫ్ సెంచరీలు, అత్యుత్తమ సగటు ఇలా దాదాపు రికార్డులన్నీ కోహ్లీ పేరునే ఉన్నాయి. అయితే అలాంటి ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్ మరొకరు ఉన్నారు. ఔను నిజమే టి20లో కోహ్లీతో సాటి రాగల క్రికెటర్ మరొకరున్నారు. అయితే పురుషుల క్రికెట్ లో కాదు. మహిళల క్రికెట్ లో ఆమె పేరు స్మృతి మందాన. మహిళల పొట్టి క్రికెట్ లో రికార్డులన్నీ స్మృతి మదాన పేరునే ఉన్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ లో ఆమె బ్యాటింగ్ లెవెలే వేరు. విశేషమేమిటంటే కోహ్లీ జెర్సీ నంబర్ 18 అయితే స్మృతి జెర్సీ నంబర్ కూడా 18. ఇద్దరికీ బ్యాటింగ్ స్టైల్ నుంచి జెర్సీ నంబర్ వరకూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.

సీఎం స్టాలిన్ సెక్యూరిటీ టీంలో మహిళా కమెండోలు

తమిళనాడు మహిళల సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అన్ని రంగాలలో మహిళలకు సమప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు సీఎం చెబుతున్నారు. ఆ సమ ప్రాధాన్యం దిశలోనే ఇప్పుడు ఆయన సెక్యూరిటీ దళంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించారు. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించడం బహుశా ఇదే మొదటి సారి. మహిళా దినోత్సవం సందర్భంగా గత మార్చి 8న తమిళనాట మహిళా కమెండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న 80 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 9 మందికి సీఎం సెక్యూరిటీ విశాగంలో నియమించారు. 

రేవంత్ ‘రెడ్డి’ టీం రెడీ!

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే స్వయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సమాజిక వర్గమే రక్ష అన్నఅభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి పలువురు సీనియర్లకు మనస్తాపం కూడా కలిగించారు. ఆ తరువాత ఆ వివాదం ఎలాగో సద్దుమణిగింది. రేవంత్ రెడ్డి ఏదో వివరణ ఇచ్చారు. అదంతా వేరే సంగతి. గడిచిపోయిన గతం కూడా. అయితే ఇప్పుడు నాడు రేవంత్ రెడ్డి ఆ మాటలు  ఏదో యథాలాపంగా అనలేదని తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త కమిటీని చూస్తే అర్దమౌతుంది. రేవంత్ ‘రెడ్డి’ తన టీమ్ లో ఆ సామాజిక వర్గానికే పెద్ద పీట వేయించుకున్నారు.   కీలకమైన ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల పదవులతోపాటు, జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ సింహభాగం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. సహజంగానే ఈ పరిణామం పట్ల పార్టీలోని ఇతర సామాజిక వర్గాలలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలో ఈ అసంతృప్తి మరింతగా వ్యక్తమౌతోంది. రాష్ట్ర జనాభాలో కనీసం నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో విజయం కోసం కాంగ్రెస్ ఎలా ప్రయత్నిస్తుందని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ కమిటీల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంపై పార్టీ అధ్యక్షుడు మల్టికార్జన్ ఖర్గేకు ఇక ఫిర్యాదులు వెల్లువెత్తనున్నాయి. ఇప్పటికే  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో బీసీలు ఖర్గేకు ఫిర్యాదు చేసేందుకు హస్తిన పయనమయ్యారు. వరుస ఓటములతో రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కులకలం రేగడం ఆ పార్టీ అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోందనడంలో సందేహం లేదు కాంగ్రెస్ కు ఉన్న . బడుగు బలహీన వర్గాల పార్టీ  ముద్ర చెరిపివేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాజా కమిటీకీ, గతంలో రేవంత్ రెడ్డి చేసిన రెడ్డిసామాజికవర్గసుప్రిమసీ వ్యాఖ్యలకూ లింకు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. పీసీసీ కమిటీలో అధిష్ఠానం ప్రకటించిన 84 మంది ప్రధాన కార్యదర్శుల్లో 22 మంది, 24 మంది ఉపాధ్యక్షుల్లో 7, రాజకీయ వ్యవహారాల కమిటీలో 6గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం, అలాగే డసీసీ కమిటీల్లోనూ పది మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం ఒకెత్తయితే.. వారంతా కూడా రేవంత్ వర్గీయులే కావడం పార్టీలోని ఆయన వ్యతిరేకులకు మరింత ఆగ్రహం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీల విషయంలో రేవంత్ రెడ్డి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ  నేతలు ఆరోపిస్తున్నారు.   సాధారణంగా  అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే కమిటీను ప్రకటిస్తారు. ఇప్పుడూ అలాగే చేశామని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నప్పటికీ సీఎల్పీ నాయకుడినైన తనకే కమిటీల గురించి ఎలాంటి సమాచారం లేదని భట్టి విక్రమార్క ప్రకటించడమే పార్టీలో అసంతృప్తి ఏ స్థాయికి చేరుకుందో తెలియజేస్తోంది. రేవంత్‌రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌ కలసి అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించి, కమిటీని తమ సొంత మనుషులతో నింపేసుకున్నారన్న విమర్శలు, ఫిర్యాదులు  వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు, ఫిర్యాదులపై అధిష్ఠానం స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి.

ఏపీలో ఉద్యోగుల ఉద్యమ బాట

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ తీరు  పట్ల అన్ని వర్గాలలోనూ తీవ్ర అసహనం, ఆగ్రహం పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్తితి రోజు రోజుకూ దిగజారుతోంది. చివరికి ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి వేతనాలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్నింటికీ మించి ఇప్పటికే తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి నిధుల కోసం అన్వేషణలోనే ప్రభుత్వం పుణ్యకాలాన్ని గడిపేస్తోంది. ఇక పాలనపై దృష్టి ఎక్కడ సారిస్తుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న ఉద్దేశమే లేనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.  దీంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చేస్తున్న పనులలో వేగం తగ్గించేశారు. దీంతో కొత్త పనులు మొదలు కావడం లేదు. ఇప్పటికే ఆరంభమైన పనులు పూర్తయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇక గోదావరి పెన్నా నధుల అనుసంధానం పనులైతే పూర్తిగా నిలిచిపోయాయి. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి చేసిన పనులకు ప్రబుత్వం బిల్లులు క్లియర్ చేయకపోవడమే కారణం. ఇక వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనుల సంగతైతే మరీ దారుణం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం రూపకల్పన జరిగింది. టెండర్లు కూడా పిలిచారు. అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ అంటూ మళ్లీ టెండర్లు పిలిచి, అదే సంస్థకు పనులు అప్పగించింది. అయితే పనులు ప్రారంభం కాలేదు.ప్రస్తుతం ఏపీలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులు ప్రభుత్వ నిర్వాకం కారణంగా నిలిచిపోయాయి. ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ సలహాదారుల వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్టులు దక్కించుకుని అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లించడం లేదు. అడిగినా సమాధానం ఇచ్చే నాథుడు కనిపించడం లేదు. అలాగే వేతన జీవులకూ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మేరకే వేతనాల చెల్లింపు జరుగుతోంది. నెల నెలా మొదటి తేదీన అందాల్సిన వేతనం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంతే కాదు ఏ శాఖకు ఏ తేదీన వేతనాలు పడతాయో తెలియని పరిస్థితి.  ఇక ఉపాధ్యాయుల పరిస్థితి అయితే మరీ దయనీయం. పీఆర్సీ కోసం పట్టుబట్టారన్న కోపాన్ని వేతనాల విషయంలో తీర్చుకుంటోందా అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహార శైలి ఉంటోంది. నవంబర్ జీతాలు ఇప్పటికీ చాలా జిల్లాలలో టీచర్లకు అందలేదు. ఎప్పుడు అందుతాయో కూడా తెలియని పరిస్థితి.వేతన జీవులకు సకాలంలో వేతనాలు అందకుంటే ఉండే ఇబ్బందులను ప్రభుత్వం అసలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు.   ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే వారికి రావలసిన ప్రయోజనాలన్నీ అందజేసి, పెన్షన్ పేపర్లు కూడా సిద్ధం చేసి గౌరవంగా సాగనంపేవారు.   ఇప్పుడా పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. తమ హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులూ, నిర్బంధాలు. నెలంతా పని చేసి వేతనం అడిగేందుకు వీలులేని పరిస్థితి. జీవితమంతా కొలువు చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే  ఉద్యోగులు ఉద్యమ బాటకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారని అంటున్నారు.

కవితకు కల్వకుంట్ల దూరం.. తెలంగాణ జాగృతే రక్ష?

కల్వకుంట్ల కవిత. ఎంపీ కావచ్చును, ఎమ్మెల్సీ కావచ్చును, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కావచ్చును,  రాజకీయంగా ఆమె ఏమైనా కావచ్చును, ఏమీ కాకపోనూ వచ్చును.కానీ, ఆమె ముఖ్యమంత్రి, తెరాస/ భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె. రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుట్ల తారకరామా రావు సోదరి. కల్వకుట్ల కుటుంబ సభ్యురాలు. నిజానికి ఆమె రాజకీయానికి పునాది, ఆమె కుటుంబం. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కేసీఆర్ లేకుంటే కవిత రాజకీయ జీవితం ఇలా అయితే ఉండేది కాదు. కల్వకుట్ల బ్రాండ్ నేమ్ , కేసేఆర్ కుమార్తె అనే ట్యాగ్లైన్ తోనే ఆమె రాజకీయంగా ఎదిగొచ్చారు. నిజానికి, కేసీఆర్ అనే మూడక్షరాలు లేకున్నా తెలంగాణ వచ్చేదేమో కానీ, కవిత, కేటీఆర్ సహా  కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరు ఈరోజున్న స్థితిలో అయితే ఉండేవారు,కాదు. అలాగే, ఈరోజు కవిత సహా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎదుర్కుంటున్న సమస్యలు  చికాకులు కూడా  ఉండేవి కాదేమో,  ఇది ఏవరైనా అంగీకరించి తీరవలసిన నిజం. సరే అది వేరే విషయం.అయితే, తెలంగాణ రాజకీయాల్లో ఫస్ట్ ఫ్యామిలీగా, రాజకీయంగా తిరుగులేని కుటుంబంగా నిలిచిన, కల్వకుంట్ల కుటుంబం, ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవితను దూరం పెట్టిందా? ఆ మచ్చ ఇటు పార్టీకి, అటు కుటుంబానికి అంటకుండా ఉండేందుకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి నంతవరకు కల్వకుంట్ల కవితతో పార్టీ పరంగా లేదా కుటుంబ పరంగా ప్రత్యక్ష సంబంధాలు లేకుండా, జాగ్రత్త వహిస్తున్నారా. అందుకే, తెలంగాణ జాగృతి నుంచి నైతిక మద్దతు పొందేందుకే ఆమె ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ ఎదుట హాజరైన మరుసటి రోజే, తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇంత కాలంగా ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పేరు, ప్రముఖంగా వినిపిస్తున్నా, కేసీఆర్, కేటీఆర్ సహా కల్వకుట్ల కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా స్పందించలేదు.అయితే  ఈ కేసు విచారణ చేస్తున్న, సీబీఐ ఆమెకు సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె మూడు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి  చర్చించినట్లు వార్తలొచ్చాయి. కవితకు నోటీసు వచ్చిన వెంటనే, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులూ పోటీలు పడి మరీ, కవితకు మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు. కేంద్రాన్ని, మోడీని, సిబిఐ, ఈడీలను విమర్శించారు. బీఆర్ఎస్ భయానికి మోడీ, కేసీఆర్ ను కట్టిడి చేసేందుకు  కవితను టార్గెట్ చేశారని విమర్శించారు. అలాగే,ఆదివారం ఆరుగంటలకు పైగా ఆమెను, విచారించే వరకు కూడా కల్వకుంట్ల కుటుంబం కాకున్నా పార్టీ నాయకులు, మంత్రులు,ఎమ్మెల్యేలు ఆమెకు అండగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరికించిందని వాదించారు.  అయితే, విచారణ పూర్తయి, ఆమె ప్రగతి భవన్ కు వెళ్లి వచ్చిన తర్వాత సీన్  మారిపోయింది. అంతలోనే  సీబీఐ కవితకు 91 సీఅర్పీసీ నోటీసు ఇచ్చి ఆమె ఇచ్చిన  వాంగ్మూలానికి సంబదించిన ఆధారాలను ఇవ్వాలని కోరింది. అంతే  తెరాస నాయకులు మెల్లగా మెల్లగా  మౌనంలోకి వెళ్లి పోయారు. ముఖ్యమంత్రి, కేసేఆర్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ఇక ఆపైన కల్వకుంట్ల కుటుంబం, తెరాస/భారాస నాయకులు అవసరానికి మించి మాట్లాడడం లేదు.ఈ పరిణామాలను గమనిస్తే, వ్యూహాత్మకంగానే కావచ్చును  కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ తెరాస / భారాస, కల్వకుంట్ల కుటుంబం తాత్కాలికంగా అయినా దూరం పెట్టిందనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే ఆమె  తనను తాను రక్షించుకునేందుకు  తెలంగాణ జాగృతిని తెర మీదకు తెచ్చారని అంటున్నారు. అందుకే ఆమె, తెలంగాణ జాగృతి విస్తృత స్తాయి సమావేశం ఏర్పాటు చేశారు.  తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు.  ఒక్క పిలుపు ఇస్తే ప్రతీ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి శాఖ సిద్ధమవుతుందని  ధీమా వ్యక్తం చేశారు.  బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.  సానుభూతికోసమో సెంటిమెంట్ పండించేందుకో తెలియదు కానీ  తెలంగాణ ఆడబిడ్డల కళ్లలో నుంచి వచ్చేది నీళ్లు కాదు నిప్పులని, అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు  మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, తనపై జరుగతున్న దాడులు కూడా అదే కోవకు చెందుతాయని నమ్మ పలికారు. అయినా  దాడులకు తాను భయపడనని ప్రకటించారు. అయితే, ఇప్పడు ప్రశ్న ఆమె భయపడుతున్నారా, లేదా అని కాదు. ఇంత అర్జెంటుగా కల్వకుంట్ల కవిత ఫ్యామిలీని, పార్టీని కాదని తెలంగాణ జాగృతిని ఎందుకు వేదిక చేసుకోవలసి వచ్చింది? కవితకు కల్వకుంట్ల దూరమయిందా? ఏమో  తెలియదు కానీ, ఆమె తమ భవిష్యత్ పోరాటానికి తెలంగాణ జాగృతిని వేదిక చేసుకున్నారా, అన్న అనుమానాలు మాత్రం నిజమని అంటున్నారు.

గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చీపురు చెక్!

దేశంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. దశాబ్దాల పాటు ఏకఛద్రాధిపత్యంగా దేశంలో అధికారంలో ఉన్నపార్టీ కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ప్రధాన విపక్షంగానైనా తన స్థానాన్నినిలబెట్టుకోవాలని తాపత్రేయపడుతోంది. అయితే ఇటీవల ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కు, గుజరాత్, హిమాచల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలహీన పడటం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా  వ్యక్తమైంది. ఏదో గుడ్డిలో మెల్ల అన్న చందంగా హిమాచల్ లో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. కాంగ్రెస్ కు, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ఓట్ల శాతం ఒకటి కంటే తక్కువే ఉండడాన్ని బట్టే కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో ఎంత నేరోగా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గుజరాత్ లో అయితే కాంగ్రెస్ గత ఎన్నికలలో సాధించినన్ని స్దానాలను కూడా గెలవలేకపోయింది. వరుసగా ఆరు సార్లు అధికారంలో ఉండి.. ఏడో సారి ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ గుజరాత్ లో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదు.  దీంతో ఈ సారి గుజరాత్ లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద బండి నడకే అనుకున్నారంతా. అయితే ఫలితాలు అందుకుపూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ సునాయాస విజయం సాధించింది. ఇక ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయం తీసుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ సోదిలోకి కూడా లేదన్నంతగా ఫలితాలు వచ్చాయి. ఈ మూడు ఎన్నికల ఫలితాలలో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తేలుతున్న విషయం ఏమిటంటే.. ఢిల్లీలో కాంగ్రెస్   ఉనికి మసకబారింది. గుజరాత్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ను కబలించేయడానికి ఆప్ రోజు రోజుకూ బలపడుతోంది. ఇప్పటికిప్పుడు అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాకున్నా, ఆ తరువాతి ఎన్నికల సమయానికైనా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ఆప్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని  రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రస్థానం ప్రారంభించినది మొదలు  ఏనుగు కుంభ స్థలాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోందనేలాగే ఆ పార్టీ ప్రస్థానం కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ లను సవాల్ చేస్తూ తొలుత ఢిల్లీలో బలపడింది. ఆ తరువాత అంచలంచలుగా ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నది.    బీజేపీయేతర, కాంగ్రెస్సెతర పార్టీలకు, కూటములకు ప్రత్యామ్నాయంగా బలపడుతోంది.  ఢిల్లీలో వరుసగా రెండవసారి అధికారం చేజిక్కించుకోవడమే కాకుండా, పంజాబ్ లో కాంగ్రెస్ ఆశలకు గండి కొట్టి మరీ అక్కడ అధికారాన్ని దక్కించుకోవడం వరకూ.. ఆప్ రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయాలలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే దిశగానే సాగుతోందని చెప్పవచ్చు. ఓట్లూ, సీట్లూ లెక్కలను పక్కన పెట్టి జనానికి చేరువ కావడం అన్న వ్యూహంతోనే ఆ పార్టీ అడుగులు వేస్తున్నది. ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రాలలో బలోపేతం కావడంపైనే దృష్టి పెట్టింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లూ, సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటువంటి సంచలనాలూ సృష్టించ లేదు.. కానీ రెండు రాష్ట్రాలలోనూ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్) గెలుపు ఓటములను ప్రభావితం చేసింది. హిమాచల్ లో పోటీ చేసిన ఏ స్థానంలోనూ డిపాజిట్ దక్కించుకోకపోయినా.. ఆప్ ఆ రాస్ట్రంలో తన ఉనికిని బలంగా చాటిందనడంలో సందేహం లేదు. ఆప్ భావజాలం ప్రజలపై ప్రభావం చూపుతోందన్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రజల ఆలోచనలను ప్రత్యామ్నాయం వైపు మళ్లించేలా ఆప్ ప్రయత్నాలు ఫలించే సూచనలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కాకుండా మరో సింగిల్ పార్టీ ప్రత్యామ్నాయం కోసం ఆప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు జనం ఆకర్షితులయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న స్థానంపై ఆప్ కన్నేసింది. ఢిల్లీలో అది సాధించింది. ఇక జాతీయ స్థాయిలో ఆ స్థానం కోసం ఆప్ అడుగులు వేస్తోంది. కూటముల, ఫ్రంట్ ల కలగూర గంప ప్రభుత్వాలను చూసిన ప్రజలు సింగిల్ పార్టీగా జాతీయ స్థాయిలో ఆప్ కు ఓ చాన్స్ ఇస్తే అన్న ఆలోచన కలిగేలా చేయడం కోసమే ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న విషయాన్ని గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలు తేటతెల్లం చేశాయి. 

సీఎం సతీమణికి ఆలయ ఛత్రం! వివాదంలో స్టాలిన్ కుటుంబం

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు కానీ, ఒక ముఖ్యమంత్రి తలచుకుంటే తన సతీమణికి దేవుడి కంటే ఎక్కువ ప్రాముఖ్యత దక్కుతుందని ఎవరూ అనలేదు. కానీ తమిళనాడులో మాత్రం ఆలయ అధికారులు అలా చేసి సీఎం సతీమణి సేవలో తరించిపోయారు. విషయమేమిటంటే.. చెన్నై నగరంలోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. నిజానికి తమిళనాడు సీఎం అధికారిక దర్పాలకు దూరంగా చాలా సింపుల్ గా ఉంటారు. సామాన్యుడిలా జనంలో మమేకమౌతారు. అయితే అధికారులు అత్యుత్సాహంతో చేసిన పని వల్ల ఆయన, ఆయనతో పాటు ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. సీఎం సతీమణి వర్షంలో తడవకుండా ఉండటం కోసం  అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని  ఉపయోగించడం  ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నైలోని తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయ  ఉత్సవమూర్తి ఊరేగింపు ఆలయ మాఢవీధిలో జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరే గించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చారు. ఆ ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రం పట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.