కొనసాగాలా? వద్దా.. ఎలాన్ మస్క్ సంశయం

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అదినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు. ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది. అయితే తాజాగా ట్విటర్ల వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో  ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు.  ఇంత కాలం ట్విట్టర్ కు షాక్ ల మీద షాక్ లు ఇచ్చిన సీఈవో ఎలాన్ మస్క్.. తనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో అసలు ట్విట్లర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. అదేదో సినిమాలో హీరో ప్రేమించాలా వద్దా అన్న డైలమాలో పడిన విధగా తయారైంది ఇప్పుడు ఎలాన్ మస్క్ పరిస్థితి. సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న తన సంశయాన్ని తీర్చుకోవడానికి ఆయన నెటిజన్లు ఆశ్రయించాడు.   తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు. 

చైనాలో కరోనా టెర్రర్

కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలకు వర్క్ ఫ్రం హోం నేర్పింది. ఇప్పుడు అలసి పోయి తాను ఇంటి నుంచి పని చేస్తోంది అంటూ సామాజిక మాధ్యమంలో జోకులు పేలుతున్నాయి. అయితే చైనాలో పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది.   ప్రపంచాన్ని కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు వణికించేసింది. ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారిని వదిలించుకుని యథాపూర్వస్థితికి చేరుకుంటోంది. అయితే కరోనా పుట్టిన దేశం చైనా మాత్రం మహమ్మారి గుప్పిట్లో విలవిలలాడుతోంది. ప్రపంచంలో కరోనా తొలి, మలి దశలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో.. ఇప్పుడు చైనాలో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. స్మశానాలు కరోనా మృతులతో నిండిపోతున్నాయి. అంతిమ సంస్కారాని నోచుకోక వందల సంఖ్యలో మృతదేహాలు స్మశానం బయట పడి ఉంటున్నాయి. ప్రస్తుతం చైనాలో రోజు వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. కరోనా నియంత్రణకు ఆ దేశం ఆంక్షలు విధించింది. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో అనివార్యంగా ఆంక్షలను ఎత్తివేయాల్సి వచ్చింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కరోనా అక్కడ కరాళ నృత్యం చేయడం ప్రారంభించింది. దీంతో ఆంక్షలతో సంబంధం లేకుండా జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమైపోతున్నారు. ఇందుకు ఆదివారం (డిసెంబర్ 18) దేశంలోని అన్ని ప్రధాన నగరాలూ నిర్మానుష్యంగా కనిపించడమే తార్కానం. ఇక చైనా బయటకు అయితే వెల్లడించడం లేదు కానీ..  కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కర స్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. స్మశాన వాటికల వద్ద కనిపిస్తున్న రద్దీయే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 

వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీలో పోటీ

వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ.. ఔను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి ఇటీవలే వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చుకున్న వర్సిటీయే.. ఆ వర్సిటీలో పదవుల కోసం వైసీపీలోని కీలక వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. వర్సిటీలో కీలక పదవులైన వీసీ, రిజిస్ట్రార్ పదవుల కోసం వైసీపీ నేతల సమీప బంధువుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలా పోటీ పడుతున్న వారు సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే వైసీపీ నేతల బంధువులే కావడంతో ఈ వర్సిటీ పదవులు దక్కించుకునే వారెవర్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. హెల్త్ వర్సిటీ ప్రస్తుత చాన్సలర్ శ్యాంప్రసాద్ పదవీ కాలం జనవరి 13తో ముగియనుంది. ఈ పదవి కోసం మంత్రి సురేష్ సమీప బంధువు బాబ్జి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుత వీసీ కూడామరో సారి  వీసీగా కొనసాగేందుకు తన  వంతు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక వీసీ తరువాత అంత కీలకమైన వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు కోసం వైసీపీ ఎంపి వేంరెడ్డి ప్రభాకరరెడ్డి సమీప బంధువు, డాక్టర్ రాధికారెడ్డి ప్రయత్రాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ పోస్టులలో జగన్ ఎవరిని నియమిస్తారన్నవిషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.  

మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి ఏమయ్యిందంటే?

పెళ్లి విందులో విషాదం చోటు చేసుకుంది. పందిట్లో పెళ్లి జరుగుతోంది. పక్కనే పెళ్లి విందు. అందరూ ఆనందంగా ఉన్నారు. పెళ్లి పందిరంతా కళకళలాడుతోంది. అంతలోనే విషాదం. విందారగిస్తున్న ఓ ఆహుతుడు కుప్పకూలిపోయాడు. అంతలోనే మరణించాడు. ఇంతకూ అతడు ఎందుకు మరణించాడంటే విందారగిస్తుండగా ఆయన ఇష్టంగా తింటున్న మటన్ ముక్క గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఉక్కిరిబిక్కిరై కన్నుమూశాడు. ఈ విషాద ఘటన నిజామామాద్ జిల్లా నవీపేట మండలంలో జరిగింది. పెళ్లి విందారగిస్తున్న రమణాగౌడ్ అనే వ్యక్తి గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. ఉక్కిరిబిక్కిరై కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మరణించినట్లు నిర్దారించారు. దీంతో పెళ్లింట విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.

విపక్షాల ఐక్యత ఎండమావేనా?

2024 సార్వత్రిక ఎన్నికలలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ యేతర పార్టీల జాబితాలోకి తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేరింది. ఇప్పటికే  కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ లు ఆ ప్రయత్నాలలోనే ఉన్నాయి. అయితే ఈ పార్టీలన్నిటికీ ఒంటరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనడం అంత తేలిక కాదని స్పష్టంగా తెలుసు. అందుకే కూటముల ఏర్పాటు విషయంలో ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయితే స్వరాష్ట్రంలో రాజకీయ అవసరాల దృష్ట్యా.. కూటమిలో కీలక పొజిషన్, సముచిత ప్రాధాన్యత విషయంలో ఏకాభి ప్రాయానికి రాలేక చర్చల ప్రక్రియను సుదీర్ఘంగా విడతల వారీగా కొనసాగిస్తూ వార్తలలో ఉండేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే స్థాయికి పరిమితమైపోయాయి.  వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలు  ఏకతాటి మీదకు వచ్చి, సంఘటితంగా బీజేపీపై పోరాటం జరిపే అవకాశం ఉందంటూ   జాతీయ దినపత్రిక ఇటీవల ఒక విశ్లేషణను ప్రచురించింది.  నిజానికి, ఏ దినపత్రికా ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత విషయంపై పెద్దగా దృష్టి  సారించడం  లేదు. అయితే తాజాగా ఓ జాతీయ దినపత్రిక  విపక్షాల ఐక్యతపై ఓ కథనం ప్రచురించడమే కాకుండా.. ఆ ఐక్య కూటమికి లేదా ఫ్రంట్ కు  నతీష్ కుమార్ ఔను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమారే  నాయకత్వం వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషించింది. అయితే ఈ విశ్లేషణను నితీష్ కుమార్ వెంటనే ఖండించారు. విపక్షాల ఐక్యతా ప్రయత్నాలను ఖండించకుండానే.. తాను ప్రధాని రేసులో లేనని స్పష్టం చేశారు.  ఇంత వరకూ బానే ఉంది.  ప్రతిపక్షాల   ఐక్యత కోసం నడుంబిగించి ముందుకు వచ్చే నాయకుడు ఎవరు?  గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతి సారీ వామపక్షాలు ముందుకు వచ్చేవి. ముఖ్యంగా సీపీఎం నాయకులు తమంత తాముగా చొరవ తీసుకునే వారు. 1996, 2004 సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు ఎవరికి వారుగా ఉన్నప్పుడు కూడా సీపీఎం చొరవ తీసుకుని  ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తీసుకు రాగలిగింది. ఇక జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ పొత్తుల ఎత్తులలో ముందు చూపు ఉన్న నేత అనడంలో సందేహం లేదు.  ఆయన దాదాపుగా ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకునే రంగంలోకి దిగుతారు. ఆ పొత్తుల ఎత్తులతోనే ఆయన గత 15 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. తాజా పరిస్థితి తీసుకుంటే..  ఇటీవల వరకు బీజేపీతో కలిసి సాగిన నితీశ్‌ కుమార్‌  ఇప్పుడు అదే బీజేపీని బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు.   ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దింపేందుకు  ప్రతిపక్షాల మధ్య ఐక్యత అంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీ కొనాలంటే పొత్తుల  విషయంలో దూరదృష్టి మాత్రమే ఉంటే సరిపోదు. గతానికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలుచేపట్టిన తరువాత  భారత ఎన్నికల ముఖచిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పు వచ్చింది. ప్రజలు పార్టీలు ఏవైనా సరా, కూటములు ఏవైనా సరే.. ముందు ఆయా పార్టీల, కూటముల ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చూస్తున్నారు. అంటే విపక్షాల ఐక్యత సాకారం కావడమంటే.. అవి ఎన్నకలకు ముందే ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చి ఆవిషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పుడే జనం ఆ కూటమిని కన్సడర్ చేసే పరిస్థితి ఉంటుంది.   అందుకే 2004 వరకూ ఒక లెక్క.. 2004 తరువాత నుంచీ మరో లెక్క అన్నట్లుగా జాతీయ రాజకీయాలు మారిపోయాయి.   ఈ మార్పును పరిగణనలోనికి తీసుకుంటేనే విపక్షాల ఐక్యత సాకారమవుతుంది. లేదంటే ఐక్యతా ప్రయత్నాల దారి గతుకుల బాటగానే మిగిలిపోతుంది. 

కేసీఆర్ బీఆర్ఎస్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసిందా?

తెరాస అధినేత కేసీఆర్  పార్టీ పేరులోంచి తెలంగాణ తీసేసి భారత చేర్చడం.. తమది ఇక తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీ కాదంటూ హస్తిన కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పుతాననడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లైందన్న టాక్ తెలంగాణలో జోరుగా సాగుతోంది.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు  ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్కీచాన్స్ కొట్టేశారంటూ.. తెరాస శ్రేణులు అంటున్నాయి. తెరాస అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేసి.. దేశ రాజధాని ఢిల్లీలో కారు స్టీరింగ్ తిప్పేస్తున్నారు.  దాంతో రాష్ట్రంలో సైకిల్ పార్టీ మళ్లీ పుంజుకోనేందుకు  కేసీఆర్ స్వయంగా బాటలు వేసినట్లు అయిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం   దాదాపు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ .. తెలంగాణ వాదాన్ని ఎత్తుకోవడం.. అందులో భాగంగా.. ప్రజల్లో ఆ సెంటిమెంట్ రాజేసి గెలవడంలో వందకి వంద శాతం  సఫలమైంది. అందుకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలే ఉదాహరణ అని.. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్‌గా మారడంతో..  తెలంగాణ అనే పదం మాయమైపోయింది..  దీంతో  వచ్చే అసెంబ్లీ ఎన్నకలలో  తెలంగాణ వాదాన్ని ఎత్తుకునే చాన్స్ కేసీఆర్ కోల్పోయారు. కేసీఆర్ అనేమిటి ఆయన కుటుంబం, బీఆర్ఎస్ కు లేకుండా పోయింది.  దీంతో తెలంగాణలో మళ్లీ టీడీపీకి పుంజుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని తెరాస శ్రేణులే అంటున్నాయి.   మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించడంతోపాటు.. రాష్ట్రంలో సైకిల్  సవారీకి అవసరమై వ్యూహాలపై  కసరత్తు చేశారు... చేస్తున్నారు.  అలాగే గతంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాలపై వీరు దృష్టి సారించారు. ఆ క్రమంలో వివిధ జిల్లాల నేతలతోపాటు కేడర్‌తో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.      ఇప్పటికీ ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో పసుపు పార్టీకిఇప్పటికీ బలంగా ఉందన్న సంగతి తెలిసిందే.   ఆ క్రమంలోనే ఖమ్మంలో టీ టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో సైతం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి సైకిల్ పార్టీని మరింత బలోపేతం చేస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ పార్టీకే కాదు.. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి సైతం టీడీపీ గట్టి కిక్ ఇస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల తర్వాత.. టీ టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా.... తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని.. ఇది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఓ విధంగా లక్కీ ఛాన్సేనని  విశ్లేషకులు అంటున్నారు.

పెళ్లిని క్యాన్సిల్ చేసిన షాంపూ

పెళ్లిళ్లు రద్దు కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలతో కూడా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పీటల వరకూ వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడానికి వివాహ విందులో చికెన్ లేదనీ, వరుడి ముక్కు చిన్నగా ఉందనీ, పెళ్లిలో స్వీట్ తినడానికి వధువు నిరాకరించిందనీ ఇలా అతి చిన్న చిన్న విషయాలు కూడా కారణం అవ్వడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ అయ్యింది. అయితే వీటన్నిటినీ మించిన  సిల్లీ కారణంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో జరిగింది. అన్నీ కుదిరి పెళ్లికి ముహూర్తం కూడ పెట్టేసుకున్న తరువాత అతి చిన్న కారణంతో పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో ఇంతకీ ఆ సిల్లీ కారణం షాంపూ. ఔను షాంపూ కారణంగా పెళ్లి నిలిచిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే హౌలీకి చెందిన అమ్మాయికి అసోంకు చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. వరుడు ఇంజనీర్. అక్కడి సంప్రదాయం ప్రకారం వరుడి కుటుంబం అమ్మాయి పెళ్లి అలంకరణకు కావలసిన వస్తువులు పంపాలి. ఆ అబ్బాయి తరఫు వారు అలాగే పంపారు. అయితే ఆ పంపిన వస్తువులలో షాంపూ కారణంగా అన్నీ కుదిరి పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ ఆ షాంపూ కారణమేమిటో తెలుసా... అబ్బాయి తరఫు వారు పంపిన  వస్తువుల్లో ఉన్నషాంపూ ఒకింత చవకదట. దీంతో వధువుకు ఒళ్లు మండింది. వెంటనే ఇంజనీరింగ్ చదివారు ఇంత చవక రకం షాంపూ పంపుతారా? ఇదేనా మీ స్థాయి అంటూ మెసేజ్ పంపింది. దీంతో వరుడికి మనిషికి రావలసినంత కోపమూ వచ్చింది. వెంటనే పెళ్లి క్యాన్సిల్ అనేశాడు. వరుడిపైపు వారూ, వధువు వైపు వారూ ఎంత చెప్పినా వినలేదు. 

ఆ ఇల్లు నిజంగానే బంగారం!

ఏదైనా మంచి పని చేస్తే నీ ఇల్లు బంగారం గానూ అంటారు. అంటు భోగభాగ్యాలతో తులతూగమని ఆశీర్వాదం. అంతే కానీ నిజంగా ఇల్లంతా బంగారం అయిపోతుందని కాదు. కానీ ఓ భవనాన్ని మాత్రం మొత్తం బంగారంతో నిర్మించేశారు. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ బంగారంతో నిర్మించిన భవంతి ఎక్కడుందయ్యా అంటే వియత్నాంలో.  ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్టర్ ఈ భవనాన్ని వియత్నాలోని కాన్తో నగరంలో నిర్మించాడు. ఇంటు గోడల నుంచి పై కప్పు వరకూ పూర్తిగా బంగారంతో తాపడం చేయించాడు, అలాగే ఇంటిని కూడా బంగారు వస్తువులతో నిర్మించేశాడు. ఇప్పుడు ఇదో బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. పూర్తిగా బంగారంతో నిర్మించిన ఇంటిని చూసి తరించాలని ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు కాన్తో నగరానికి క్యూ కడుతున్నారు. ప్రపంచంలోనే పూర్తిగా బంగారంతో నిర్మించిన భవనం బహుశా ఇది ఒక్కటే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించడానికి బంగారు భవంతిని నిర్మించడమేమిటని ఆశ్చర్య పోతున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన కుమ్ములాటలు.. హై కమాండ్ సపోర్ట్ రేవంత్ కే!?

తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పుతోంది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెడుతోంది. వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ వర్గాయులపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది. టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు. అక్కడితో ఆగకుండా తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను  తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్  తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. సీనియర్లు ఏదో ఒక రూపంలో పార్టీ నడకకు, పురోగతికి అడ్డు పడుతూనే ఉన్నారు. అన్నిటినీ సహించి పార్టీని ఏకతాటిపై నడిపించాలని రేవంత్ చేసిన ప్రయత్నాలు ఏమంత సఫలం కాలేదు. ఇక మునుగోడు ఉప ఎన్నిక తరువాత నుంచీ రేవంత్ పై సీనియర్ల విమర్శల దాడి ఒక రేంజ్ కు చేరుకుంది. తాజాగా పీసీసీ కమిటీల నియామకంతో సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకించే విషయంలో ఓపెన్ అప్ అయిపోయారు. రేవంత్ పట్టుబట్టి లేదా పైరవీలు చేసి పీసీసీ కమిటీలను వలస నేతలతో నింపేశారంటూ రోడ్డెక్కారు. కొందరు రాజీనామాల బాట పట్టారు. దీంతో ఇక లాభం లేదని రేవంత్ వర్గీయులూ కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు. తెలంగాణ పీసీసీ కమిటీ పదవులకు రాజీనామా చేసిన 12 మంది నేతలు.. పార్టీ సీనియర్లపై మాటల యుద్ధానికి దిగారు.  పీసీసీ కమిటీలకు రాజీనామాలు చేసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరు రాజీనామా చేసి ఊరుకోకుండా.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లతో అటో ఇటో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. రాజీనామాల అనంతరం వీరు సీనియర్ల పై విమర్శల దాడికి దిగారు. నిజానికి గతంలో ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో నియమించిన కమిటీల్లో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారేనని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాస్తవంగా చూస్తే తాజాగా అధిష్ఠానం నియమించిన కమిటీలు మొత్తంలో కలిపి తెలుగుదేశం నుంచి వచ్చిన వారు 13 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా తెలంగాణలో తెలుగు దేశం క్రీయాశీలంగా వ్యవహరించకపోవడంతో అనివార్యంగా కాంగ్రెస్ లో చేరిన వారే. వీరంతా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తున్నవారే. పదేపదే వలస నేతలంటూ తమపై వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాల్న నిర్ణయానికి వచ్చారు. అందుకే రాజీనామాలు, విమర్శలతో రచ్చకెక్కారు. దీంతో ఇప్పటి వరకూ రేవంత్ పైన, రేవంత్ వర్గీయులపైనా విమర్శలు చేస్తూ వస్తున్న సీనియర్లంతా డిఫెన్స్ లో పడ్డారు. దీంతో పార్టీ విషయాలను బహిరంగంగా మాట్లాడటం కరెక్టు కాదు.. ఏమైనా ఉంటే పార్టీలో చర్చించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  ఒక వైపు పార్టీలో ఈ స్థాయిలో వాద ప్రతివాదాలు జరుగుతున్నా.. అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు బహిరంగం అయిపోయినా.. రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఇప్పటి వరకూ ఆయన తలపెట్టిన పాదయాత్రకు హై కమాండ్ అనుమతి ఉంటుందా... సీనియర్లు ఏమంటారు? అడుగులు పడనిస్తారా? అన్న అనుమానాలున్నాయి. నిజానికి రేవంత్ పాదయాత్ర చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా.. సీనియర్లు పదే పదే అడ్డు పడుతుండటంతో రేవంత్ పాదయాత్ర వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ పీసీసీ కమిటీల నియామకం తర్వాత సీన్ మారిపోయింది. పార్టీ సీనియర్లు తమ వ్యతిరేకతను బహిరంగం చేయడంతో ఇక రేవంత్ కు దారి క్లియర్ అయిపోయినట్లైంది.  దీంతో జనవరి నుంచి సకల జనుల సంఘర్షణ పేరిట రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ఆయన కార్యాచరణ ప్రకటించేశారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసేశారు. సీనియర్లు కలిసి వచ్చినా, రాకున్నా తన పని తాను చేసుకుపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. టీపీసీసీ చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు, 2023 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ విస్పష్టంగా ప్రకటించేశారు. అంతే కాకుండా.. ఎంతగా బుజ్జగించినా, ఎన్నిసార్లు సీనియర్లను సమాధానపరిచినా వారి తీరు మారకపోవడంతో కాంగ్రెస్ హై కమాండ్ కూడా సీనియర్లను పట్టించుకోకుండా పని చేసుకుపోవాలని రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ లో కీలక నేత ప్రియాంక గాంధీ కూడా రేవంత్ కు పూర్తి మద్దతు ప్రకటించి గో ఎహెడ్ అని అనుమతి ఇచ్చేశారని అంటున్నారు.  రేవంత్ పైనా, రేవంత్ వర్గీయుల పైనా విమర్శలు గుప్పిస్తున్న  సీనియర్లెవరూ తమ సొంత నియోజకవర్గంలో కూడా గెలిచే సత్తాలేనివారేనని హై కమాండ్ గుర్తించడం వల్లనే వారిని లైట్ తీసుకుని రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించే విషయంలో పీసీసీ చీఫ్ కు స్వేచ్ఛ ఇచ్చిందని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.  

పెళ్లితో దండలే కాదు.. జనసేన కండువాలూ మార్చుకున్నారు!

వివాహాలు వేడుకగా జరుపుకుంటారు. స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటారు. ఆకాశమంత పందిరి..  అంటూ వివాహం ఎంత ఘనంగా జరుపుకున్నారో చెప్పుకోవడానికి అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఇక కొంత మంది కమ్యూనిస్టు వివాహాలు చేసుకుంటారు. ఆడంబరంగా ఖర్చు లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేసుకుంటారు. కలిసి అన్యోన్యంగా ఉంటామని ప్రతిజ్ణ చేస్తారు. ఇక రిజిస్టర్ మ్యారేజీ లు ఉండనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఓ జంట మాత్రం తమ వివాహ వేడుకలో వినూత్న పద్ధతిని అనుసరించారు. ఆ కొత్త జంట జనసేన కార్యకర్తలు అవునా కాదో.. తెలియదు. ఇంతకీ ఆ జంట వివాహం ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వారి పెళ్ల ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి.  ఇంతకీ వారు పెళ్లిలో అనుసరించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద అపారమైన అభిమానం ఉన్న ఆ జంత తమ పెళ్లితో దండలతో పాటు జనసేన కండువాలనూ మార్చుకున్నారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోవడమే కాకుండా జనసేన కండువాలు కూడా కప్పుకున్నారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అభిమానమంటే ఇదేరా భాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. జనసేన ప్రచారానికి ఇదో కొత్త దారి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జనసేన కండువాలతో జరిగిన పెళ్లిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

బంగ్లాతో సిరీస్.. తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా విన్

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 188 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 513 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన బంగ్లా 324 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఆఖరి రోజైనా ఆదివారం ఓవర్ నైట్ స్కోరు   272/6 తో  రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన‌ బంగ్లాదేశ్ మ‌రో 52 ప‌రుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్ష‌ర్ ప‌టేల్ నాలుగు, కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ఉమేశ్ యాద‌వ్‌, సిరాజ్‌, అశ్విన్ త‌లో  వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 90, శ్రేయ‌స్ అయ్య‌ర్ 86 ప‌రుగుల‌తో రాణించ‌డంతో 404 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్‌కు 254 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ కూడా కెప్టెన్ రాహుల్ మ‌రోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు ఇన్నింగ్స్ లో శుభ్‌మ‌న్‌(110), పుజారా(102 నాటౌట్‌) శ‌త‌కాలు బాదారు.   భార‌త్ త‌న రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వ‌ద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే బంగ్లా 324 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కుల్దీప్ యాద‌వ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి కల్దీప్ యాదవ్ ఎనిమిది వికెట్లు తీశాడు.  ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో, చివరి టెస్టు  డిసెంబర్  22 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అందుబాటులోకి రానున్నాడు.

నా మరణదిన వేడుకలకు రండి.. మాజీ మంత్రి వింత ఆహ్వానం

పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం చూశాం.. వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడమూ చూశాం. ఇంకా గృహ ప్రవేశాలు, ఓణీ ఫంక్షన్లు, వివాహాలు ఇలా శుభ కార్యాలకు ఆహ్వానా పత్రికలు ముద్రించి పంచడమూ తెలుసు. కానీ ఒకాయన మాత్రం 12 ఏళ్ల తరువాత తాను మరణిస్తాననీ, అందుకే ఇప్పటి నుంచే తన మరణ దిన వేడుకలు ఏటా జరుపుకుంటాననీ అంటున్నారు. ఇందు కోసం తన మరణ దిన ఆహ్వాన పత్రికను ముద్రించి మరీ పిలుస్తున్నారు.  ఔను వినడానికి వింతగా ఉన్నా అది నిజం. మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ కొత్త ఆహ్వానం పలుకుతున్నారు.  తన మరణ దినోత్సవానికి రావాలంటూ ముద్రించిన ఆహ్వాన పత్రికలో మాజీ మంత్రి పాలేటి రామారావు  ఇకపై తాను ఏటా మరణ దిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నట్లే పేర్కొన్నారు. పుట్టన రోజు వేడుకలు జరుపుకోవడం అర్ధ రహితమనీ, 2034లో తాను మరణిస్తాననీ, మరో 12 ఏళ్ల తరువాత అంటే 2034లో తాను మరణిస్తాననీ. ఇక ఇప్పటి నుంచీ ఏటా తన మరణ దిన వేడుకలు జరుపుకుంటాననీ పేర్కొన్నారు. ఆ వేడుకలకు హాజరై ఆశీర్వదించాలని పాలేటి రామారావు ఆ ఆహ్వాన పత్రికలో కోరారు.   1994, 1999 ఎన్నికలలో తెలుగుదేశం తరఫున పోటీ చేసి విజయం సాధించిన పాలేటి రామారావు మంత్రిగా కూడా చేశారు. 2004లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ తరువాత వైసీపీలో చేరి కొనసాగుతున్నారు.   

తెనాలిలో అన్నా క్యాంటిన్ కు నిప్పు

 మాచర్లలో వైసీపీ -టీడీపీ మధ్య చెలరేగిన ఘర్షణల విధ్వంస  సెగలు చల్లారలేదు. మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. శుక్రవారం (డిసెంబర్ 17).. నాటి ఘటనలు మాచర్లను అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన బాధితులు ఇంకా భయాందోళనల నుంచి తేరుకోనే లేదు.   సాధారణ ప్రజలు సైతం ఎప్పుడేం జరుగుతుందో అని భయంతో వణికి పోతూనే ఉన్నారు. అయితే పోలీసులు మాచర్లలో భారీ బలగాలను మోహరించామని చెబుతూనే ఈ ఘటనలపై ఇప్పటి వరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్నారు. పల్నాడు ఘటనలో తెలుగుదేశం కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలను దగ్ధం చేశారు. తెనాలి పరిస్థితి సద్దుమణగక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్ కు అర్ధరాత్రి సమయంలో దుండగులు నిప్పు పెట్టారు. క్యాంటీన్ తలుపు వద్దే ఈ నిప్పు పెట్టగా.. మంటలు చెలరేగటం  గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చి న టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టటం వెనుక ఉన్నది వైసీపీ హస్తమేనని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విధ్వంసం, దహనకాండలతో వైసీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఏపీలో పొత్తులు పొడిచేసినట్లేనా? పవన్ మాటల మర్మమేటిటి?

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడుపులపై జనసేనాని స్పష్టత ఇచ్చేసి నట్లేనా.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వను అని పునరుద్ఘాటింవచిన పవన్ మాటల వెనుక ఉన్నది,  తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కూటమేనా? అంటే ఔననక తప్పదు. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవదు అని ఖరాఖండీగా చేప్పేసిన పవన్   ఇప్పటికే బీజేపీతో మిత్రుత్వం ఉన్న జనసేన తమ కూటమితో తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళతామన్న సంకేతమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కల్యాణ్ అనడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా రాష్ట్రంలో పొత్తుల గురించి తొట్ట తొలుత మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆ తరువాత దారి మార్చినట్లు కనిపించినా తాజాగా మరోసారి..అదు మాట పునరుద్ఘాటించారు. కొద్ది రోజుల ముందు శ్రీకాకుళంలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కూడా ఇదే మాట చెప్పారు. రాష్ట్రంలో వైసీపీని తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతిపక్షాల ఐక్యత పై తమ అధినేత జగన్ త్వరలో ప్రకటిస్తారన్నారు. ఆయనా మాట అన్న రోజుల వ్యవధిలోనే పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికలలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఈసారి వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా.. అన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాదు.. రానివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. పల్నాడులో జనసేన కౌలురైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్..  ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని.. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదన్న పవన్.. వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలిన మాటలేనని.. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానన్నారు. వాళ్ళు నన్ను ఎంత తొక్కాలని చూస్తే.. అంత బలంగా పైకి లేస్తానన్న పవన్.. అందుకు జన సైనికులే రక్షగా ఉండాలన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పొత్తులపై కొంత క్లారిటీ ఇచ్చేసినట్లైంది.   అంతే కాకుండా 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీలతో   జనసేన పొత్తు  ప్రస్తావించారు.  2014 మాదిరి 2019లో కూడా బీజేపీ, టీడీపీలతో పొత్తులో పెట్టుకుంటే వైసీపీ గెలిచేది కాదన్న పవన్.. ఈసారి  ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ  వైసీపీకి ఛాన్స్ ఇవ్వనని చెప్పేశారు. ఆయన మాటలను బట్టి చూస్తే ఈసారి ఎన్నికలలో మహా పొత్తు (అంటే తెలుగుదేశం, జనసేన అలయెన్స్) ఖరారైనట్లే. ఈ మాట పవన్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. 2019ని ప్రస్తావిస్తూ ఈసారి అలా జరగదని చెప్పారంటే ఆయన మాటల వెనుక ఉన్న అర్ధమదే అని అంటున్నారు. దానికి తోడు వైసీపీ వ్యతిరేక శక్తులన్నటినీ ఏకం చేస్తానని కూడా చెప్పేశారు. సో.. మొత్తంగా ఈసారి ఏపీలో తెలుగుదశం పార్టీతో బీజేపీ, జనసేనలు కలసి పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది.

విశాఖకు జగన్.. ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు!

నవ్వి పోదురు గాక నాకేటి వెరుపు అన్నది సామెత... పారి పోదురు గాక కాకేటి వెరుపు అన్నది జగన్ నినాదం. లోకమంతా ఒక దారి అయితే ఉలికిపిట్టది ఒక దారి అంటారు. అలా ఉంది మూడు రాజధానుల విషయంలో జగన్ తీరు. కోర్టులు, రాజకీయ పార్టీలు, అమరావతికి భూములిచ్చిన రైతులు, ఆఖరికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ కూడా అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ముక్త కంఠంతో చెబుతున్నా జగన్ చెవికెక్కడం లేదు.   హైకోర్టులో  ఎలాగూ వ్యతిరేకంగా తీర్పు  వస్తుందన్న ఆలోచనతోనే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. మళ్ళీ పకడ్బంధీగా  బిల్లును తీసుకురావాలని చూస్తున్నది.  మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూనే ఉన్నారు. సుందర నగరమైన విశాఖలో దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. దానికి కొద్దిపాటి మొత్తం కేటాయిస్తే రాజధాని సిద్ధమవుతుందని సాక్షాత్తు సీఎం జగన్ పలుమార్లు చెప్పారు. అంతే కాదు ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ  నుంచి పాలన సాగిస్తే అదే రాజధాని అవుతుందని కూడా సెలవిచ్చారు. అలా చెప్పడం ద్వారా తాను విశాఖ నుంచే పాలన సాగించాలని భావిస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు. విశాఖలో వసతులు, కార్యాలయాల కోసం.. ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు కోసం కూడా ఇప్పటికే స్థల నిర్ధారణ జరిగిపోయిందని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. దీంతో అధికారికంగా  విశాఖకు పాలనా రాజధాని తరలించడం వీలు కాకపోయినా.. అనధికారికంగా రాజధానిని విశాఖకి తరలించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే..జగన్ రాజధానిని విశాఖకు తీసుకు వెల్లానంటుంటే.. అక్కడ ఉన్న పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమలను అక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఒక్క విశాఖ అని ఏమిటి జగన్ పాలనా నిర్వాకంతో  ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రం నుంచి పలు పరిశ్రమలు తరలిపోయాయి. విస్తరణ లక్ష్యాలను విరమించుకున్నాయి. కొన్ని కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసుకుంది.   కియా అనుబంధ సంస్థలు చెన్నై, హైదరాబాద్ కు తరలిపోయాయి. ఇక అదానీ డేటా సెంటర్, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు జగన్ ప్రభుత్వంరద్దు చేశారు.   ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాల్సిన ఏషియన్ పల్ప్ పేపర్ పరిశ్రమ తన పెట్టుబడులు ఉపసంహరించుకోగా.. బీఆర్ షెట్టి సంస్థలు, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టులు, రేణిగుంటలో రిలయన్స్ పెట్టుబడులు, ఒంగోలు నుంచి ఏపీపీ పేపర్ కంపెనీ, విశాఖ రుషికొండ ఐటి సెజ్ నుండి కంపెనీలు తరలిపోయాయి. చిత్తూరు జిల్లాకు తలమానికమైన అమర్ రాజా బ్యాటరీస్ కూడా తరలిపోయింది. అలా రాష్ట్రానికి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిన   వాటిలో ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పంద సంస్థలే కాగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా అదే బాటలో ఉంది.  ఔను పెట్రోలియం యూనివర్సిటీ ఏపీ నుండి తరలిపొంతోంది.   విభజన హామీల్లో భాగంగా ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్టీ సంస్థను స్థాపించారు. ఈ విద్యా సంస్థ దేశంలో రెండే చోట్ల ఉంది. ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉండగా.. రెండోదాన్ని విశాఖపట్నానికి కేటాయించారు.  ఈ సంస్థ కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వంగలి గ్రామంలో సుమారు 201.8 ఎకరాల సేకరణకు సిద్ధమై కొంత భూమిని సేకరించింది. దీనికి  2016లోనే భూమి పూజ పూర్తయ్యింది. శాశ్వత క్యాంపస్‌ అందుబాటులోకి వచ్చే వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 60, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 సీట్లు ఉండగా.. ఇప్పటికే రెండు బ్యాచ్ లు తమ విద్యాభ్యాసాన్ని ముగించి  బయటకు వెళ్లిపోయాయి. మొత్తం రూ.655 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం మొదటి దశగా రూ.150 కోట్లు విడుదల చేశారు. ముందుగా సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణ బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించగా ఇప్పటి వరకు ఈ ప్రహరీ నిర్మాణం   పూర్తి కాలేదు  పట్టాదారులతో సమానంగా తమకూ నష్టపరిహారం చెల్లించాలని పట్టాలేని రైతులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. విచారించిన ధర్మాసనం సాగులో ఉన్నారు కనుక పట్టాదారులకు ఇచ్చినట్టుగానే పట్టాలేని రైతులకూ ఇవ్వాలని ఆదేశించింది. కానీ, పట్టాలేని రైతులకు ఇక్కడ అంత మొత్తంలో చెల్లిస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే చెల్లించాల్సి వస్తుందని, ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ కేసు పెండింగ్‌లో ఉండడంతో ఇది ఇప్పట్లో తేలే అంశం కాదని కేంద్రం ఈ విద్యా సంస్థను రాష్ట్రం నుంచి తరలించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనిని కూడా యూపీ యూనివర్సిటీలో విలీనం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  

ఆత్మీయ సమ్మేళనమా.. రాజకీయ తంత్రమా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏణ్ణర్ధం సమయం ఉన్నప్పటికీ ఎలక్షన్ హీట్ మాత్రం మిడ్ సమ్మర్ ను తలపిస్తోంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ కుల సమీకరణాలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం మద్దతు కోసం పార్టీలన్నీ తెగ ఆరాటపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు రాజకీయ నాయకుల అడుగులు అన్ని పార్టీలలోనూ రాజకీయ ఉత్కంఠను పెంచేస్తున్నాయి. ఆ ముగ్గురిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే.. మరొకరు కమలం పార్టీకి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇప్పుడు వారి కదలికలపై అన్ని పార్టీలలోనూ ఉత్కంఠ పెరిగేందుకు కారణమైంది.  రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా జరుగుతున్న కాపు నేతల సమావేశాలు, సదస్సులూ రాజకీయ  హీట్ ను పెంచేస్తున్న నేపథ్యంలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ముగ్గురూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఆ ప్రాధాన్యత ఇంకా పెరిగింది. వీరిలో బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నాయకుడు. అయితే గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా తెలుగుదేశం కార్యక్రమాలలో క్రియా శీలంగా పాల్గొనడం లేదు. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేరా అన్న సందేహం కలిగేంతగా గంటా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక బోండా విషయానికి వస్తే.. ఇటీవలి కాలంలో ఆయన గతంలోలా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నదాఖలాలుకనిపించడంలేదు. బోండా ఒకింత అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం శ్రేణులే అంటున్నాయి. ఇక బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సంగతి తీసుకుంటే.. ఆయనకు కమలం పార్టీలో పొమ్మన లేక పొగపెడుతున్న పరిస్థితి  ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన కన్నాకు.. ఆ పదవి పోయిన తరువాత బీజేపీలో ప్రాధాన్యత బాగా తగ్గింది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుతో అసలు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే బోండా ఉమ, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణలు బేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నిటికంటే మించి ఈ ముగ్గురి భేటీకి కొద్ది ముందు కన్నా లక్ష్మీ నారాయణ తో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ స్వయంగా గంటా నివాసానికి వచ్చి మరీ భేటీ అయ్యారు. దీంతో బోండా, గంటా, కన్నాల భేటీ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. ఈ ముగ్గురూ మాత్రం తమది ఆత్మీయ సమ్మేళనంగా చెప్పుకుంటున్నా... రాజకీయ వర్గాలు మాత్రం ఈ ముగ్గురి సమావేశం వెనుకా ఉన్నది రాజకీయమేనని  గట్టిగా చెబుతున్నాయి.  అయితే ఈ ముగ్గురు నేతల భేటీకి కారణాలేమిటన్న దానిపై భిన్న చర్చలు, వాదనలు వినవస్తున్నాయి.  

వ్యూహాలు, ఎత్తులు నితీష్ రాజకీయ జిత్తులు

నితీష్ కుమార్ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకు జేడీయూ అధినేత.. కానీ ఈయన రాజకీయం అంతా పొత్తులు.. పొరపొచ్చాలే. మైనారిటీలో ఉండి కూడా సమయానుకూలంగా కూటములు కట్టి తన ముఖ్యమంత్రి పదవిని పదిలంగా కాపాడుకోవడంలో ఈయనను మించిన మొనగాడు లేడు. వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ.. అందరిలో మంచివాడు, మేధావి అని గుర్తింపు పొందేసి.. బీహార్ ముఖ్యమంత్రి పదవిని గత దశాబ్దంనర కాలంగా తన గుప్పిట్లోనే ఉంటేసుకున్న వ్యూహకర్త. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావును మించిన రాజకీయ చాణక్యం ఈయన సొంతం.   అయితే ఇటు కాకుంటే అటు అన్నట్లుగా  బీహార్ లో అయితే బీజేపీతో కాదంటే ఆర్జేడీతో జతకట్టి జేడీయూ అధికారంలో కొనసాగేలా.. సీఎం పగ్గాలు తన చేతిలో ఉండేలా చూసుకుంటూ సక్సస్ ఫుల్ గా రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తున్న నితీష్ కుమార్.. రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం విషయంలో ఒక స్పష్టత ఉందన్నట్లుగా ఆయన మాటల తీరు ఉంటుంది. విమర్శకు ప్రతి విమర్శ చేయడంలో నితీష్ కుమార్ దిట్ట. అయితే ఒక్క ప్రశాంత్ కిషోర్ విషయంలోనే నితీష్ కుమార్ మన్మోహన్ సింగ్ ను మించిన మౌనముని అయిపోతారు. ప్రశాంత్ కిషోర్ ఎవరంటారా? ఇంకా తెలియలేదా.. ఎన్నికల వ్యూహ బేహారి పీకే. ఔను పీకేనే.. గతంలో ప్రశాంత్ కిశోర్ అనబడే ఈ పీకే నితీష్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అప్పట్లో నితీష్ కుమార్ పీకేను తన రాజకీయ వారసుడిగా కూడా ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ.. ఇరువురికీ చెడింది. ఇప్పుడు పీకే రాజకీయ వ్యూహ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సొంత కుంపటి పెట్టుకుని బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. నితీష్ పై విమర్శలతో నిరాటంకంగా నడుస్తున్నారు. అయితే నితీష్ కుమార్ మాత్రం పీకే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. కనీసం స్పందించడం లేదు. ఆయనది కాని తీరులో వ్యవహరిస్తున్నారు.  సరే తాను స్పందించేంత సీన్ పీకేకు లేదన్నది నితీష్ అభిప్రాయం అయితే అయి ఉండొచ్చును. అటు పీకే పాదయాత్ర కూడా ఎవరికీ పట్టని యాత్రగానే సాగుతోంది. ఇంత వరకూ విశేషం ఏమీ లేదు కానీ.. ఉరుములేని పిడుగులా నితీష్ కుమార్ 2025లో బీహార్ అసెంబ్లీకి జరిగనున్న ఎన్నికల్లో మహాఘట్ బంధన్ ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ నేతృత్వంలోనే ముందుకు సాగుతుందని ప్రకటించేశారు. అంతే కాదు ఇప్పటికే ఉపముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ కు ఇప్పటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. కాబోయే ముఖ్యమంత్రిఆయనే అన్నట్లుగా సీన్ బిల్డప్ చేస్తున్నారు నితీష్. నితీష్ తీరు. శైలి తెలిసిన వారంతా ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు. సీఎంగా నితీష్ తాను వినా మరొకరిని కలలో కూడా  అంగీకరించరు.. అలాంటిది తేజస్వికి ఆయన స్వయంగా ఇంత బిల్డప్ ఇవ్వడమేమిటని నొసలు ముడేస్తున్నారు. అయితే అసలు విషయమేమిటంటే.. 2024  సార్వత్రిక ఎన్నికలలో మూడో ఫ్రంటో, థర్డ్ ఫ్రంటో ఏదో ఒకటి ఏర్పాటు చేసి తాను ప్రధానిగా పదవీ పగ్గాలు అందుకోవాలన్న వ్యూహ రచనతోనే.. రాష్ట్రంలో ఆయన తేజస్వి ప్రసాద్ కు పగ్గాలు అప్పగించేందుకు కార్యాచరణ ఆరంభించేశారు. అందుకే 2024 సాధారణ ఎన్నికల్లో విపక్షాలను ఐక్యం చేసే పనిలో నిమగ్నం కావడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారని అంటున్నారు. అందుకే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాఘట్ బంధన్ కు తేజస్వి ప్రసాద్ నాయకత్వం వహిస్తారని నితీష్ కుమార్ ఇప్పటికే సంకీర్ణం లోని అన్ని పార్టీలకూ స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. అయితే నితీష్ కుమార్ తేజస్విపై చూపుతున్నఈ అపార ప్రేమ వెనుక 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆర్జేడీకి ప్రధానంగా అండగా ఉండేది ముస్లింలు, యాదవులు. ఇక జేడీయూకి అయితే.. దళితుల ఓటు బ్యాంకు మద్దతు ఎక్కువ. దేశ వ్యాప్తంగా కూడా ఈ మూడు వర్గాల మద్దతు కూడగడితే తన పీఎం ఆకాంక్ష సాకారం అవుతుందన్నది నితీష్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కారణమేమిటంటే?

అవిభక్త కవలల గురించి విన్నాం.. జన్యులోపాలతో  వైకల్యంతో జన్మించే శిశువుల గురించీ కన్నాం.. ఒకే కానుపులో నలుగురు శిశువులు జన్మించిన ఘటనలూ అరుదుగానైనా చూశాం. చేతికి ఆరువేళ్లు ఉండటాన్నీ విచిత్రంగా చూశాం. అయితే సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జన్మించిన బిడ్డను చూసి అందరూ అచ్చెరువోందుతున్నారు. ఎందుకంటే ఆ బిడ్డకు ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ ఆసుపత్రిలో ఆర్తి కుష్వారా అను మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ బిడ్డను చూసి వైద్యులే ఆశ్చర్య పోయారు. ఆ బిడ్డకుఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. ఇలా జన్మించడాన్ని వైద్య పరిభాషలో ischiopagus అంటారని వైద్యులు చెప్పారు. అరుదుగా   గర్భ ధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయని. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుందని.. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయని, ఈ పాప విషయంలో కూడా అదే జరిగిందని వైద్యులు అంటున్నారు. అన్ని పరీక్ష చేసి ఆపరేషన్ ద్వారా   అదనపు రెండు కాళ్లను తొలగిస్తామని చెప్పారు.

బెంజి కారుకు ఆటో ఆసరా!

తాతకు దగ్గులు నేర్పినట్లుఅన్నా.. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు అన్నా.. తమ కంటే పై స్థాయి వాళ్లకు సాయం చేస్తామనడం, సలహాలిస్తామనడం సరికాదు అని చెప్పడమే. అయితే అరుదుగానైనా అటువంటి సందర్బాలు ఎదురౌతుంటాయి. ఓ బెంజి కారు ఓనరుకు అలాంటి పరిస్థితే వచ్చింది. ఆగిపోయిన తన కారుకు ఆటోయే ఆసరా అయ్యింది. హాయిగా ఝామ్మంటూ వెళుతున్న వాహనం హఠాత్తుగా రోడ్డు మీద ఆగిపోతే.. దగ్గర్లో మెకానిక్ ఉంటే వెళ్లి పిలుచుకుని వచ్చి రిపేర్ చేయించుకుంటాం. అదే దగ్గరలో మెకానిక్ షాపేదీ లేకపోతే ఏం చేస్తాం. టూ వీలర్ అయితే తోసుకుంటూ వెళిపోతాం. అదే కారైతే.. రోడ్డు మీద వెళ్లే మరో కారు వాళ్లనో, ట్రాలీ డ్రైవర్ లో బతిమలాడుకుని దానికి ఓ తాడు కట్టి మెకానిక్ షాపు వరకూ తీసుకు వెళతాం. రోడ్డు మీద అలాంటి దృశ్యాలను చాలానే చూసి ఉంటాం. ఓ ఆటో ఆగిపోతే.. మరో ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ కాలితో ముందు ఆగిపోయిన ఆటోను తీసుకువెళతాడు. ద్విచక్రవాహనాలనూ అలా తోసుకుంటూ వెళుతున్న సందర్భాలు మనకు చాలానే తారసపడి ఉంటాయి. అయితే ఏకంగా ఓ బెంజి కారుకు ఆటో డ్రైవర్ తన కాలి ఆసరా ఇచ్చాడు.  ఔను నిజమే.. రోడ్డు మీద  ఆగిపోయిన మెర్సిడీస్ బెంజ్ కారును ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ ముందు బెంజికారుకు తన కాలు ఆసరాగా ఇచ్చి తోసుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన పుణెలో జరిగింది. కోరాగావ్ పార్క్ ప్రాంతంలో ఓ బెంజ్ కారు ఆగిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డుపై ఆగిపోయిన కారు ముందు బిక్కముఖం వేసుకు నిలుచున్న ఆ కారు యజమానిని చూసి జాలేసిందో ఏమో.. ఆ దారిలో వెళుతున్న ఆటో డ్రైవర్ తన ఆటోను నడుపుతూ.. తన కాలును కారు బంపర్ పై పెట్టి తోసుకుంటూ మెకానిక్ షెడ్ వరకూ తీసుకు వెళ్లాడు. ఆ ఆటో డ్రైవర్ సహకారాన్ని నెటిజన్లు తెగపొగిడేస్తున్నారు.