600 కేజీల బర్త్ డే కేక్.. లారీపై ఊరేగింపు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం డిసెంబర్ 21( బుధవారం). ముఖ్యమంత్రిగా ఆయన జరుపుకుంటున్న నాలుగో పుట్టిన రోజు. అదే కాదు.. ఈ ఏడు ఆయన జరుపుకుంటున్న పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే..   ఆది ఆయన 50వ జన్మదినం. దీంతో వైసీపీ శ్రేణులు రెండు రోజుల ముందు నుంచే సంబరాలు ఆరంభించేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటల, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. అన్నిటికీ మించి ఆయన బర్త్ డే సందర్బంగా 600 కేజీల కేక్ తయారు చేయించి దానికి లారీపై ఊరేగించారు. గొల్లపూడిలోని మైలురాయి సెంటర్ లోని బాబూ జగజ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకూ లారీపై ఊరేగించి అనంతరం కేక్ ను కట్ చేశారు.  ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?.. చార్జిషీట్ లో పేరు

ఢల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతోఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐల దూకుడు గమనిస్తే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే న్యాయనిపుణులు సైతం అంటున్నారు.  ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా  ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె   ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి  సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసులు విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు  అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు. మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన   నిర్దారణకు వచ్చిన తరువాతనే  సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు. సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్త మౌతోంది. అయితే మలి నోటీసు మేరకు ఆమెను ఎప్పుడు విచారిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.  ఎందుకంటే త్వరలోనే విచారణకు ఎక్కడకు హాజరు కావాలి, ఏ తేదీన హాజరుకావాలి, ఏ సమయంలో హాజరు కావాలని అన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సీబీఐ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.   ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక తాజాగా ఈ కుంభకోణంలో సమీర్‌ మహేంద్రు కేసులో ఈడీ   చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఆ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొంది. కవిత తన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసుకున్నట్లు ఈడీ నిర్ధారించింది. కవితతో పాటు చార్జిషీట్ లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, అభిషేక్ రావు పేర్లను కూడా చేర్చింది. కాగా ఈ చార్జిషీట్ లో  ఒబేరాయ్ హోటల్‌లో సమావేశం జరిగినట్లు ఈడీ  వెల్లడించింది.   ఒబేరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌నాయర్‌ పాల్గొన్నట్లు  పేర్కొంది.  

ఖమ్మంలో తెలుగుదేశం సభ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణపై దృష్టి కేంద్రీక‌రించారు. ఒక వైపు ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే.. మరో వైపు తెలంగాణ‌లోని టీడీపీ క్యాడ‌ర్‌లోనూ జోష్ నింపి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీడీపీకి కంచుకోట‌గా చెప్పుకొనే ఖ‌మ్మం జిల్లా నుంచి చంద్ర‌బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.  ఖ‌మ్మం  స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంలో బుధవారం (డిసెంబర్ 21) బ‌హిరంగ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణ టీడీపీ నేత‌లు బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. చంద్ర‌బాబు భారీ కాన్వాయ్ తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖ‌మ్మం వెళ్తారు. ఖ‌మ్మం జిల్లా సరిహద్దులో  కూసుమంచి వ‌ద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌ను బ‌హిరంగ స‌భ‌కు త‌ర‌లించేలా ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయడం ద్వారా తెలంగాణ టీడీపీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు చంద్ర‌బాబు త‌న తొలి అడుగు వేయ‌నున్నారు. చంద్ర‌బాబు స‌భ విజ‌య‌వంతం అయితే తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు బ‌హిరంగస‌భ‌లో చేయ‌బోయే ప్ర‌సంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  చంద్ర‌బాబు త‌న స్పీచ్‌లో తెలంగాణలోని టీడీపీ శ్రేణుల‌కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌పై ఇప్ప‌టికే బీఆర్ఎస్ ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు బీజేపీ కూడా  ఖ‌మ్మంలో జ‌రిగే చంద్ర‌బాబు స‌భ‌పై ఫోక‌స్ పెట్టింది. తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజకీయ పోరు రసతవ్తరంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంటే కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడం, రాజకీయంగా క్రియాశీలం కావడం కేసీఆర్ కు ఒకింత ఇబ్బందే. ఇంత వరకూ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలం కాకుండా అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ గా నామకరణం చేసి జాతీయ రాజకీయాలు అనడంతో ఆయన తెలంగాణ సెంటిమెంట్ అంటూ మాట్లాడే అవకాశం కోల్పోయారు. ఎందుకంటే పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసిన కేసీఆర్ ఇక తెలుగుదేశం పార్టీని నిందించడానికి ఆంధ్రాపార్టీ, వలస పాలన అన్న మాటలు అనే అవకాశం లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ కాదు కాదు.. బీఆర్ఎస్‌ విషయానికి వస్తే ఆ పార్టీలో  స‌గానికిపైగా క్యాడ‌ర్ టీడీపీ నుంచి వెళ్లిందే. ఇక ప్రస్తుతం కీలకంగా ఉన్న నేతలలో కూడా అత్యధికులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కనుక తెలంగాణలో బలపడితే భారీగా నష్టపోయేది బీఆర్ఎస్ మాత్రమే.  ఇక బీజేపీ అయితే ఖమ్మం సభ విజయవంతమైతే.. బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు చేయి చాస్తుంది. అందుకు ప్రతిగా ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగే విధగా పొత్తుకు సై అనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచే అవకాశాల కనిపిస్తున్నాయి. ఖమ్మంలో తెలుగుదేశం సభ విజయవంతం అయితే  ఆ అవకాశాలు మరింత మెరుగౌతాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో, బీజేపీకి తెలంగాణలో బాగా కలిసివస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  అంటే ఇక్కడ తెలంగాణ‌లో బీజేపీ బ‌లం పెర‌గ‌డంతో పాటు, ఆంధ్రాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ   టీడీపీకి అనుకూలంగా మార‌డం ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూరుతుందన్న మాట. ఈ వ్యూహంతోనే చంద్రబాబు ఖ‌మ్మం సభను విజయవంతం చేసి తెలుగుదేశం సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఎప్పుడంటే..?

తెరాస స్థానంలో భార‌తీయ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌) అవ‌త‌రించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కాలు మోపేందుకు బీఆర్ఎస్ ను దేశ‌వ్యాప్తంగా  బ‌లోపేతం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఢిల్లీ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్నిఏర్పాటు చేయ‌డంతో పాటు, ప‌లు క‌మిటీల‌ను సైతం నియ‌మించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్ కు మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఆ రాష్ట్రాల్లో మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీల‌తో క‌లిపి బీఆర్ఎస్‌ను బ‌లోపేతంపై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. ఇక సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ త్వ‌ర‌లో బీఆర్ఎస్ కాలు మోపేందుకు సిద్ధ‌మైంది. క్రిస్మ‌స్ త‌రువాత ఏపీలో బీఆర్ ఎస్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేలా కేసీఆర్ ఇప్పటికే ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారు. ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు బీజేపీకి అనుకూలంగానే  ఉన్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ వ్యతిరేక వర్గాన్ని క‌లుపుకొని బీఆర్ఎస్‌ను ఏపీలో విస్త‌రించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. క్రిస్మ‌స్ త‌రువాత బీఆర్ఎస్ ఏపీ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌తో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, రైతు సంఘాల నేత‌లు, వివిధ సంఘాల నేత‌లు   మంత‌నాలు జ‌రిపిన‌ట్లు చెబుతున్నారు. వీరంద‌రితో క‌లిపి కిసాన్ సెల్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏపీలో అడుగు పెట్టాల‌ని కేసీఆర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. కేసీఆర్ ఏపీలో ముఖ్యంగా తెలుగుదేశం ను టార్గెట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. టీడీపీలోని కీల‌క నేత‌లతో కేసీఆర్‌కు ఎప్ప‌టినుంచో మంచి సంబంధం ఉంది. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రిని బీఆర్ ఎస్‌లోకి తీసుకొస్తారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాలలో గత కొంత కాలంగా     జ‌రుగుతోంది. క్రిస్మ‌స్ త‌రువాత కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేస్తారా? లేదా అక్క‌డి నేత‌లే కిసాన్ సెల్ గా ఏర్పాట‌వుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ  కేసీఆర్ ఏపీకి వ‌స్తే రాజ‌ధానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏపీ రాజ‌ధానిపై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారని అంటున్నారు.  క్రిస్మ‌స్ త‌రువాత కిసాన్ సెల్ ఏర్పాటుతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న కేసీఆర్‌.. జ‌న‌వ‌రి త‌రువాత భారీ బ‌హిరంగ స‌భ‌ను  నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.

కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్  సింగ్ మాన్ భేటీ కానున్నారు. హైదురాబాద్ లో నేడు జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పంజాబ్ సీఎం   కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ లో ఆయనతో భేటీ అయ్యారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తరువాత వీరిరువురూ కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ఇరువురి మధ్యా జాతీయ రాజకీయాలపై చర్చ జరిగిందని అంటున్నారు. దేశ రాజకీయాలపై ఇరువురూ అభిప్రాయాలు పంచుకున్నారని చెబుతున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కనీసం అటువైపు చూడలేదు సరికదా.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హస్తిన వీధుల్లో  ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలిగించేశారు. ఈ నేపథ్యంలోనే భగవంత్ సింగ్ మాన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కర్నాటక, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మినహా ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెప్పుకోదగ్గ నేతలెవరూ రాలేదు. ఆహ్వానం అందినా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన నాయకులు కూడా బీఆర్ఎస్ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కనీసం శుభాకాంక్సలు తెలిపిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేసీఆర్ ఆహ్వానం  మేరకే అయినా ప్రగతి భవన్ కు వెళ్లి ఆయనతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా భేటీ కేవలం 20 నిముషాలలోనే ముగిసింది.  దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై   ఇరువురి మధ్యా చర్చ జరిగిందని అంటున్నారు.   

జడ్జీల కొరతతో కుప్పలుగా పేరుకుపోతున్న కేసులు

న్యాయం జరగడం ఆలస్యం అయితే న్యాయం జరగనట్టే అంటారు. ప్రస్తుతం దేశంలో న్యాయం సత్వరంగా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే న్యాయస్థానాల తీర్పులు వెలువడటంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం న్యాయమూర్తుల కొరత.  పేరుకుపోతున్న అపరిష్కృత కేసుల సంఖ్య లక్షలు దాటేస్తున్నది. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, న్యాయమూర్తుల సంఖ్య పెంచడంతోనూ సమస్య తీరిపోదనీ నిపుణులు అంటున్నారు. ప్రతిభావంతులైన న్యాయమూర్తులు లభ్యం కావడం లేదని  న్యాయ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మర్ సుశీల్ మోడీ అన్నారు. సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్ అయితే.. కేవలం న్యాయమూర్తల సంఖ్య పెంచడం వల్లనే  ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. వెరసి ఇరువురూ కూడా సమస్య పరిష్కారానికి కొత్త తరహాలో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి భావంతులైన, సమర్థులైన హైకోర్టు న్యాయమూర్తులు లభ్యం కావడం తగ్గిపోతుంటే.. మరో వైపు ఏటా పదుల సంఖ్యలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. కొత్త న్యాయమూర్తుల నియామకం లేకుండా ఏటా పదుల సంఖ్యలో న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం వల్ల కేసుల పరిష్కారం విషయంలో జాప్యం తీవ్రమవ్వడం వినా మరో ప్రయోజనం లేని పరిస్థితి.  అందుకే న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలన్న సూచనను సాక్షాత్తూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నుంచి వచ్చింది. మొత్తానికి, సుప్రీంకోర్టు, హైకోర్టులలో పేరుకుపోతున్న కేసులను సాధ్యమైనంత త్వరగా తగ్గించడాని కి   క్రియాశీల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయంలో ఎలాంటి భిన్నాబిప్రాయం లేదు.   ఇక పెండింగ్ కేసుల విషయానికి వస్తే.. దేశం లోని న్యాయస్థానాలలో మొత్తం  4.70 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సమాచారం.   సుప్రీం కోర్టులో 70,154 కేసులు, దేశంలోని 25 హైకోర్టులలో మార్చి నాటికి 58,94,060 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటువంటి  పరిస్థితి నివారించడానికి న్యాయ వ్యవస్థలోనే అంతర్గతంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవలసిన అవసరం ఉంది.   పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్యను పరిశీలించడం, నియామకాలను మదింపు చేయడం వంటివి ఆ సిస్టమ్  నియంత్రణ లో ఉండాలి. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించ డానికి ఒక స్ట్రాటజీ అవసరం ఎంతైనా ఉంది.  ఉన్నత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో   ప్రతి కేసు పరిష్కారానికీ ఒక నిర్దిష్ట కాల పరిమితి విధించాల్సి ఉంది.యప డుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌, డిజిటల్‌ కోర్టుల ఏర్పాటు ద్వారా  న్యాయ వ్యవస్థను ఎక్స్ పాండ్ చేయడం వల్ల  కేసుల సంఖ్య  గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.  అన్నిటి కంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే పెండింగ్‌ కేసుల్లో సింహభాగం ప్రభుత్వానికి చెందినవే.  అంటే పెండింగ్ లో ఉన్న కేసుల్లో ఎక్కవ కేసులలో  ప్రభుత్వాలే ప్రతివాదులు. ఈ కేసుల పరిష్కారంలో ప్రభుత్వపరంగా ఉండాల్సిన చొరవ ఉండటం లేదు.    న్యాయ వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు న్యాయ మూర్తుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా  తీర్పులు వెలువరించడంలో  జాప్యం అనివార్యమౌతోంది. హై కోర్టులలో 50 శాతం కూడా న్యాయమూర్తుల కొతర ఉంది. త్వరితగతిన కేసులను పరిష్కరించడానికి తాము చేయగలిగినంత చేస్తున్నామని కేంద్రం   ప్రకటనలైతే చేస్తోంది కానీ , ఆచరణలో మాత్రం చొరవ కనిపించడం లేదు. నిజంగా న్యాయం జరగాలంటే ముందు న్యాయవ్యవస్థలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

పని మొదలెట్టేసిన దిగ్విజయ్ సింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ నివారణ బాధ్యతలను హైకమాండ్ దిగ్గీ రాజాకు అప్పగించీ అప్పగించగానే ఆయన రంగంలోకి దిగిపోయారు.   కట్టు  రాష్ట్ర పార్టీ నేతలను  దారిలో పెట్టేందుకు నడుం బిగించేశారు. పార్టీలో తొలి నుంచీ ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్ లతో పాటు దిగ్విజయ్ సింగ్ కు కూడా ట్రబుల్  షూటర్ గా పేరున్న సంగతి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తరువాత కాంగ్రెస్ లో గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ లు మాత్రమే  ట్రబుల్ షూటర్లుగా మిగిలారు. గులాం నబీ ఆజాద్ పార్టీ వీడి వేరు కుంపటి పెట్టుకున్నాకా.. కాంగ్రెస్ లో సంక్షోభ వివారణకు దిగ్విజయ్ మాత్రమే దిక్కైన పరిస్థితి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించే బాధ్యతలను పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ కు అప్పగించింది.  వెంటనే రంగంలోకి దిగిన ఆయన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లతో ఫోన్ లో మాట్లాడారు. అంతే సీనియర్లు వెనక్కు తగ్గారు. మంగళవారం (డిసెంబర్ 20) సాయంత్రం జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశారు.  ఒకటి రెండు రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చి నేతలతో మాట్లాడతానని దిగ్విజయ్ సింగ్ సీనియర్లకు చెప్పారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డితో మాట్లాడగా, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ కమిటీల నియామకంతో రాష్ట్ర కాంగ్రెస్ లో మొదలైన చిచ్చు అంతకంతకూ పెరుగుతూ రాజీనామాల వరకూ వెళ్లింది. రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గంగా చీలిపోయి పరస్పర విమర్శల పర్వం కొనసాగుతూ వచ్చింది.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల్లో తన వర్గం వారికే రేవంత్ రెడ్డి పట్టం కట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు.  దీంతో సీనియర్ నేతల ఆరోపణలను తిప్పి కొడుతూ రేవంత్ వర్గీయులు 12 మంది తమ పీసీసీ కమిటీల పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దింపింది. 

రాజ్యసభలో శునకోపాఖ్యానం

రాజస్థాన్ లో జరుగుతున్న రాహుల్ భారత జోడో యాత్రలో పాల్గొన్న ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభ దద్దరిల్లింది. ఇంతకీ మల్లికార్జున్ ఖర్గే భారత్ జోడో యాత్రలో ఏమన్నారంటే.. భారత దేశం కోసం నిజమైన త్యాగాలు చేసినది కాంగ్రెస్సేననీ, బీజేపీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదనీ అన్నారు. ఈ వ్యాఖ్యలే రాజ్యసభను అట్టుడికించేశాయి. మల్లికార్జున్ ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభలో డిమాండ్ చేసింది. ఇందుకు ఖర్గే నిరాకరించారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పీకర్ వారిస్తున్నా బీజేపీ సభ్యలు శాంతించలేదు. ఆందోళనకు దిగారు . సోమవారం(డిసెంబర్ 19) ఖర్గే రాజస్థాన్ లోన అల్వార్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లడారు. పులిలా గర్జిస్తామంటుంది కానీ పిల్లిలా  ప్రవర్తిస్తుందంటూ కేంద్ర ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు.  సరిహద్దులో చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా.. చేతులు ముడుకుచుని కూర్చుంటుందని దుయ్యబట్టారు. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చకు మాత్రం అంగీకరించదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కాంగ్రెస్ నిలబడిందనీ, ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారనీ ఖర్గే అన్నారు. అదే సమయంలో బీజేపీ దేశం కోసం ఒక్క శునకాన్ని  కూడా కోల్పోలేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలే మంగళవారం (డిసెంబర్ 20) రాజ్యసభలో దుమారానికి కారణమయ్యాయి. ఖర్గే వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ సభలో ఆందోళకు దిగింది. ఖర్గే క్షమాపణకు డిమాండ్ చేసింది. అయితే ఖర్గే క్షమాపణకు ససేమిరా అన్నారు. పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం త్యాగాలు చేశారనీ, బీజేపీలో ఎవరు  ప్రాణ త్యాగం చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు.  

యువతి కిడ్నాప్

తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్ధం నిర్ణయించారని నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మందితో వచ్చి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన మరువక ముందే.. దాదాపు అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి గుడికి వెళ్లి వస్తున్న యువతిని కారులో వచ్చిన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన తండ్రిని తోసేసి మరీ ఆమెను కారులో ఎక్కించుకుని ఉడాయించారు. కాగా ఈ కిడ్నాప్ వ్యవహారం వెనుకా ప్రేమ వ్యవహారమే ఉందని అనుమానిస్తున్నారు. కాగా తండ్రిని తోసేసి యువతిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో మంగళవారం(డిసెంబర్ 20) జరిగింది. వివరాలిలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాడపల్లికి చెందిన గోలి శాలిని తండ్రితో కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా  ఈ కిడ్నాప్ జరిగింది.  కాగా అదే గ్రామానికి చెందిన కటుకూరి జాన్ తన కుమార్తెను కిడ్నాప్ చేయించాడని శాలిని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు ఏడాది కింద కూడా జాన్ శాలినిని తీసుకు వెళ్లాడనీ, అప్పటికి శాలిని మైనర్ కావడంతో పోలీసులు జాన్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి శాలినిని తల్లిదండ్రులకు అప్పగించారు. మైనారిటీ తీరిన శాలినికి వేరే యువకుడితో నిశ్చితార్ధం జరిగిన నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరగడంతో పోలీసులు కూడా జాన్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాలిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.  

మిల్లెట్స్ కు వ్యవస్థీకృత ప్రచారం.. యోగా అంతటి ప్రాచుర్యం

ప్రపంచానికి భారత్ ఇచ్చిన అపురూప కానుక యోగా.. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకుంటున్నాం. ఆరోగ్య రక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. యోగాకు ఎంతటి ప్రాచుర్యం లభించిందో మన సిరిధాన్యాలు (మిల్లెట్స్) కు కూడా అంతటి ప్రాచుర్యం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అత్యధిక పోషక విలువలు ఉన్న సిరిధాన్యాల వినియోగం మానవ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెప్పిన మోడీ వీటికి వ్యవస్థీకృత ప్రచారాన్ని కల్పించాలని అన్నారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం సందర్భంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎంపీలందరికీ మంగళవారం (డిసెంబర్ 20) మిల్లెట్ లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని హాజరయ్యారు. ఎంపీలకు మిల్లెట్స్ లంచ్ లో రాగి, జొన్న, బజ్రా తదితర మిల్లెట్స్ పదార్థాలను వడ్డించారు. 

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభ పరిష్కారం కోసం దిగ్విజయ్ సింగ్

తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఒక వైపు సీనియర్ల అలక, మరో వైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన నాయకుల రాజీనామాలతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణకు పార్టీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. పార్టీలో సీనియర్ నేత, సంక్షోభ నివారణలో దిట్టగా గుర్తింపు పొందిన దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. తెలంగాణ కాంగ్రెస్ సలహాదారు బాధ్యతలను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించింది. ఆయన నేడో రేపే రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం  రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చు రేపిన సంగతి విదితమే.   టీపీసీసీ చీఫ్ రేవంత్ కు వ్యతిరేకంగా సీనియర్లంతా కట్టకట్టుకుని విమర్శలు గుప్పిస్తుంటే.. వారికి దీటుగా రేవంత్ వర్గం కూడా గళం విప్పింది. సీనియర్ల విమర్శలు, వ్యాఖ్యలకు నోటితో కౌంటర్ ఇవ్వడమే కాకుండా చేతలతో చెక్ కూడా పెట్టే యత్నం చేసింది. ఇందులో భాగంగానే వలస నేతలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు  చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాలతో కౌంటర్ ఇచ్చింది.   టీపీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది నేతలు తమ తమ పదవులకు రాజీనాలు చేశారు. తాము రాజీనామా చేసి త్యజించిన పదవులను  తమను వలస నేతలంటూ కామెంట్లు చేస్తున్న సీనియర్లకు ఇవ్వాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ మేరకు వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ కులేఖ రాశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితి అదుపుతప్పుతోందని గ్రహించిన పార్టీ హైకమాండ్ డిగ్గీ రాజాను రంగంలోకి దింపింది. ఆయనను  టీ కాంగ్రెస్ అడ్వయిజర్ బాధ్యతను అప్పగించింది.నేడో రేపో దిగ్విజయ్ సింగ్ టీ. కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతారని అంటున్నారు.   

అధికారులపై విమర్శల వెనుక మోహన్ బాబు టార్గెట్ జగనేనా?

మోహన్ బాబు నటనలోనే కాదు.. వ్యవహార శైలిలోనూ తనదైన విలక్షణత ప్రదర్శిస్తారు. ఆయన ఏం మాట్లాడినా నిర్మొహమాటంగా ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని తన మనసులో మాటను చెప్పకుండా ఉండరు. అయితే  ఆ నిర్మొహమాటం తరచుగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. దీంతో మోహన్ బాబును వివాదాలు వెతుక్కుంటూ వస్తాయా? మోహన్ బాబే వాటిని వెతుక్కుంటూ వెళతారా అన్న సంశయం ఆయన అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ తరచూ వ్యక్తం అవుతూ ఉంటుంది. నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు తన రాజకీయ ప్రస్థానంలో కూడా విజయాల బాటే పట్టారు. తెలుగుదేశం తరఫున ఒక సారి రాజ్యసభకు వెళ్లారు. ఆ తరువాత రాజకీయంగా ఏ మంత క్రియాశీలంగా లేరనే చెప్పాలి. తొలుత తెలుగుదేశంలో ఒకింత క్రియాశీలంగా వ్యవహరించినా.. ఆ పార్టీకి దూరమైన తరువాత జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే వరకూ ఆయన రాజకీయంగా చురుకుగా లేరు. జగన్ అదికారంలోకి వచ్చిన తరువాత ఏదో పదవి రాకపోతుందా అని మూడున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నా.. పదవి కాదు కదా, కనీస గుర్తింపు లేకుండా పోయిందన్న వేదన ఆయనలో గూడుకట్టుకందని అంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్లీ తెలుగు దేశం గూటికి చేరతారన్న భావన కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమైంది. ఇందుకు తార్కాణంగా వారు ఇటీవల ఒక సందర్బంగా మోహన్ బాబు తెలుగుదేవం అధినేత చంద్రబాబునాయుడిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడాన్ని చెబుతున్నారు. అయితే తన కాలేజీ ఆవరణలో షిరిడీ సాయిబాబా విగ్రహావిష్కరణకు చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లినట్లు చెప్పారు అది వేరే విషయం. అయితే ఆ భేటీ మాత్రం అప్పట్లో సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కూడా పొందిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు   తిరుపతిలోని తన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం  ఆందోళన చేశారు. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా కూడా నిర్వహించారు.  ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలా ఆయన జగన్ పార్టీకి దగ్గరయ్యారు. చివరికి ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత పార్టీలో ఆయనకు వీసమెత్తు గౌరవం కానీ, ప్రాధాన్యత కానీ దక్క లేదు. దీంతో ఆయన కూడా నెమ్మది నెమ్మదిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒక సారి ప్రధాని మోడీతో భేటీ అయినా ఆయన రాజకీయంగా క్రియాశీలంగా మాత్రం లేరు. అయినా ఆయనలో తాను వైసీపీ కోసం కష్టపడి పని చేసినా.. పార్టీ విజయం కోసం ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తనను నిర్లక్ష్యం చేయడం పట్ల మోహన్ బాబులో అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మోహన్ బాబు చూచాయిగా బయటపెట్టారు కూడా. అప్పట్లో అంటే చంద్రబాబు హయంలో తన విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదని రోడ్డెక్కిన మోహన్ బాబు.. ఇప్పుడు అంటే జనగ్ హయాంలో కూడా అదే పరిస్థితి ఉంది ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మోహన్ బాబు తనకు టీటీడీ  చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించారని, అయితే జగన్ పట్టించుకోకపోవడంతో ఒకింత అసంతృప్తికి గురయ్యారనీ ఆయన సన్నిహితులు చెబుతారు.  ఈ నేపథ్యంలోనే చిన్నవో చితకవో అలీ, పోసాని, సింగర్ మంగ్లిలకు పదవులిచ్చిన జగన్ మోహన్ బాబును పూర్తిగా విస్మరించడంతో రగిలిపోతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన విశాల్ సినిమా లాఠీ ప్రముష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు జగన్ సర్కార్ లక్ష్యంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. నిజమే లాఠీ ప్రమోషన్ కార్యక్రమంలో మోహన్ బాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో చేసిన వ్యాఖ్యల టార్గెట్ జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కార్యక్రమంలో తనకు పోలీసు అధికారులంటే గౌరవం అని చెబుతూనే వారు అధికారంలో ఉన్న వారి కోసమే పని చేస్తారని, సామాన్యుల గురించి పట్టించుకోరనీ అన్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన తాను చేసిన వ్యాఖ్యలను నిర్మొహమాటం మాటున కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థపై విమర్శలు చేయడమంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే. తిరుపతిలో మోహన్ బాబు అదే చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనీ, అధికారులకు కొమ్ముకాయడమే పోలీసులు డ్యూటీగా భావిస్తున్నారనీ చెప్పకనే చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి.  

కుప్పంలో పోటీకి విశాల్ నో.. జగన్ తో భేటీకి సై..

తమిళ సూపర్ స్టార్ విశాల్ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీ మూలాలున్న విశాల్ తమిళనాట స్థిర పడి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు  పొందారు. విశాల్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి విజయవంతమయ్యాయి. దీంతో తెలుగునాట కూడా విశాల్ కు మంచి గుర్తింపు ఉంది.  అటువంటి విశాల్  ఏపీలో రాజకీయ ప్రవేశం చేయనున్నారన్న వార్త గత కొంత కాలంగా ఏపీలో హల్ చల్ చేస్తోంది. మామూలుగా ఆయన ఏదో ఒక పార్టీ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతారన్న వార్తలైతే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు.. కానీ ఆయన ఏకంగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో పోటీకి నిలబడనున్నారన్న ప్రచారం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కుప్పం టార్గెట్ గా ఏపీ సీఎం జగన్ ఎంతో మందిని అక్కడ నుంచి నిలబెట్టాలని చూశారు. కుప్పం నుంచి కచ్చితంగా గెలిచే అభ్యర్థినే రంగంలోకి దింపాలని భావించిన ఆయనకు పార్టీలో అందుకు సమర్ద నాయకుడెవరూ కనిపించలేదు. దీంతో కుప్పంతో సంబంధాలున్న తమిళనటుడు విశాల్ పై ఆయన దృష్టి పడింది. దీంతో విశాల్ అంగీకారంతో సంబంధం లేకుండానే కుప్పం వైసీపీ అభ్యర్థి విశాల్ అన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజ్ లో జరిగింది.  ఒక దశలో ఇది వాస్తవమే అని అంతా నమ్మే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇందుకు కారణం కుప్పంతో విశాల్ కు ఉన్న అనుబంధం. గతంలో విశాల్ తండ్రి కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేశారు. ఆ సమయంలో తండ్రికి సహాయంగా విశాల్ కూడా కుప్పంలోనే ఉండేవారు. అందుకే కుప్పంలోని వీధి వీధి విశాల్ కు తెలుసు. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. అదీ కాకుండా తమిళనాడుకు సమీపంగా ఉండే చిత్తూరు జిల్లాలో తమిళ సినిమాలకూ, తమిళ నటులకూ మంచి క్రేజ్ ఉంది. అందుకే విశాల్ ఏపీ రాజకీయాలలో  కుప్పం నుంచి అడుగుపెడతారన్న ప్రచారానికి ప్రాధాన్యత పెరిగింది. అన్నిటికంటే విశాల్ కుప్పం వ్యవహారానికి రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి కారణం కుప్పం తెలుగు దేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  సొంత నియోజకవర్గం. దీంతో విశాల్ అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం అన్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాజాగా విశాల్ తన కొత్త చిత్రం లాఠీ ప్రమోషన్్సలో భాగంగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఆయన కుప్పం పొలిటికల్ ఎంట్రీ వార్తలన్నీ ఒట్టి వదంతులేనని తేల్చేసింది. తాను ఏపీ రాజకీయాలలో కాలుపెట్టడం లేదని నిర్ద్వంద్వంగా చెప్పేసిన విశాల్.. ఈ సందర్బంగా తనకు ఏపీ సీఎం జగన్ అంటే అభిమానమని కూడా చాటారు. ఆయన మీద అభిమానం ఉన్నంత మాత్రాన ఆయన చెప్పినట్లుగా కుప్పం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తానని ఎలా భావిస్తారని ఎదురు ప్రశ్నించారు. కానీ అదే సమయంలో విశాల్ తాను జగన్ తో మంగళవారం బేటీ కానున్నారని చెప్పారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాముఖ్యత ఏదీ లేదని కూడా ఎవరూ అడగకుండానే చెప్పారు. దీంతో ఈ భేటీ ఆంతర్యమేమిటన్న చర్చ సర్వత్రా మొదలైంది. విశాల్ తన స్థాయి ఎమ్మెల్యే కంటే ఎక్కువ అని చెప్పుకున్నారు. గుర్తింపు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ ఎమ్మెల్యే కంటే తన స్థాయి ఎక్కవ అన్నారు విశాల్. రాను రానంటూనే.. విశాల్ జగన్ తో భేటీకి సిద్ధమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   వైసీపీ ఎప్పటి నుండో కుప్పం నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి ఉంది. ఇక్కడ దెబ్బకొట్టి టీడీపీ అధినేత చంద్రబాబును కోలుకోకుండా చేయాలన్నది జగన్ తన లక్ష్యంగా చెబుతూ వస్తున్నారు. అందుకే విశాల్ జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఒకే సమయంలో విశాల్ రాజకీయాల పట్ల అనాసక్తిని, జగన్ పట్ల అనురక్తినీ ప్రకటించి ఏపీ సీఎంతో భేటీపై ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండేంత ఉత్కంఠ రేకెత్తించారు. ఆయన ఎంతగా ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టే ప్రశ్నే లేదని చెబుతున్నా.. తమిళ ఫిల్మ్ అసోసియేషన్ వ్యవహారాలలో విశాల్ పోషించిన క్రియాశీల పాత్ర ఆయన అడుగులు రాజకీయాలవైపే అని చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాల్ ఏపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తారా అన్న చర్చ మాత్రం సశేషంగా సాగుతూనే ఉంది. జగన్ తో భేటీ అనంతరం విశాల్ ఏం చెబుతారన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది.   సినిమా నటుడిగా విశాల్ కు ఎంత అభిమానం ఉన్నా.. రాజకీయ నాయకుడిగా ఆయనను జనం ఆదరిస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తమౌతోంది. కేవలం సినిమా గుర్తింపుతోనే రాజకీయాలలో రాణించడం ఏమంత సులువు కాదని చిరంజీవి, పవన్ కల్యాణ్ ల విషయంలో ఇప్పటికే రుజువైపోయింది. ఎంతటి ప్రముఖ నటుడైనా విశాల్ నటన, ప్రజాదరణ విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ కు సాటి రారనడంలో సందేహం లేదు.  అయినా వైసీపీ శ్రేణులు అవసరానికి మించి విశాల్ కు హైప్ ఇస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

అమెరికాలో అన్నగారి విగ్రహం

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలుగు వారి గుండె చప్పుడు, నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్. అయన మరణించి ఎన్నేళ్లు అవుతున్నా అయన సినిమాలు, ప్రజా సేవ ఆయనకు ప్రజల హృదయాలయాల్లోసుస్థిర స్థానం ఏర్పరిచాయి.  ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయనను తమ అభిమాన నాయకుడిగా గుండెల్లో గుడి కట్టిపూజిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఆయన విగ్రహం ఏర్పాటు కాబోతోంది.    అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఒక నిర్దేశిత ప్రాంతంలో ప్రపంచ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అక్కడి స్థానిక నాయకులు ముందుకొచ్చారు. అక్కడ తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలని ఎడిసన్ సిటీ మేయర్ కు ప్రతిపాదించారు. అందుకు ఆయన వెంటనే అంగీకారం తెలిపారు. దీంతో 2023లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా  తెలుగు  వెలుగు నందమూరి తారక రామారావు  విగ్రహాన్ని అమెరికా న్యూ జెర్సీ ఎడిసన్ సిటీలో ప్రతిష్టించనున్నారు. 

మళ్లీ వెయ్యి రూపాయల నోట్లు.. నిజమేనా?

డిమానిటైజేషన్ తరువాత మాయమైపోయిన వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం మేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి వెయ్యి రూపాయల నోట్లు చెలామణిలోకి రానున్నాయా? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చ  సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ రాబోతున్నాయన్న చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లు పూర్తిగా రద్దవుతాయని, వాటి స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు వెయ్యి రూపాయల నోట్లు విడుదల కావట్లేదని తెలుస్తోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ తేల్చేసింది. ఇటువంటి ప్రచారాలను నమ్మొద్దని పేర్కోంది. రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడాన్ని ఆర్బీఐ ఎప్పుడో ఆపేసిందని ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేస్తుందన్న ఊహాగానాలు మెదలయ్యాయి. అలాగే త్వరలో వెయ్యి రూపాయల నోట్ల విడుదల కానున్నాయన్న ప్రచారమూ మొదలైంది. అయితే ఈ రెండు ప్రచారాలలోనూ వాస్తవం లేదని పీఐబీ అనే ఫ్యాక్ట్ చెక్  సంస్థ తెలిపింది. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదని అవి పూర్తి స్థాయిలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. పీఐబీ సంస్థ ప్రభుత్వ పథకాలపై జరిగే ప్రచారాల విషయంలో వాస్తవాలు వెలికి తీస్తుంది. ప్రజల సందేహాలు తీరుస్తుంది.  

ఇదేం అరాచకం తల్లీ... హోటల్ లో ఫారిన్ టూరిస్ట్ వీరంగం

అరాచకత్వానికి , విశృంఖలతకు పరాకాష్ట అన్నట్లుగా వ్యవహరించిందో ఫారిన్ టూరిస్ట్. హోటల్ కారిడార్ లో నగ్నంగా తిరుగుతూ సిబ్బందిపై దాడికి పాల్పడింది. మత్తు తలకెక్కితే విచక్షణ మాయమౌతుంది. తామెక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం ఉండదు. రాజస్థాన్ లో ఒ విదేశీ టూరిస్టు వ్యవహరించిన తీరు అచ్చం అలాగే ఉంది.ప జైపూర్ లో ఓ విదేశీ మహిళా టూరిస్టు హోటల్ సిబ్బందిపై విరుచుకుపడటం చూస్తే.. ఆమె ఒళ్లు తెలియనంతగా మత్తులో ముగినిపోయి ఉంటుందని అనిపించక మానదు.ప ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. విదేశీ వనిత జైపూర్ కు టూరిస్టు గా వచ్చి ఆ హోటల్ లో బస చేసింది. ఏం జరిగిందన్నది తెలియదు కానీ ఆమె నగ్నంగా తన గది నుంచి బయటకు వచ్చింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా..వారిపై ముష్టిఘాతాలతో దాడికి దిగింది. కాలితో తన్నింది. ఆమె ఇంత వయలెంట్ గా ప్రవర్తించడానికి కారణమేమిటన్నది తెలియరాలేదు. అయితే సిబ్బంది మాత్రం ఆమెను నియంత్రించలేక పోలీసులను ఆశ్రయించారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా తన గది నుంచి బయటకు వచ్చిన ఆ విదేశీ పర్యాటకురాలిని నచ్చజెప్పి గదిలోకి పంపించడానికి ఆ హోటల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వారామెను సముదాయించడానికి ప్రయత్నించిన కొద్దీ రెచ్చిపోయి దాడులకు దిగింది. ఆమె సిబ్బందిని దూషిస్తూ, దాడి చేయడాన్ని కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి నెట్టింట పోస్టు చేశారు.  ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది. డ్రగ్స్ మత్తులో ఆమె అలా వీరంగం సృష్టించి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. 

వైసీపీ మంత్రులకు ఎదురుగాలి?.. 60 నియోజకవర్గాలలో వైసీపీ ఓటమి ఖరారేనా?

వైసీపీ మంత్రులకు రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోంది. జగన్ సర్కార్ తీవ్ర మైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పలువురు మంత్రులు తమ తమ నియోజకవర్గాలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. తమ తమ నియోజకవర్గాలలో వారికి ప్రజాదరణ కరవైందని తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం తమ తమ నియోజకవర్గాలలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మంత్రులలో రోజా, విడదల రజని,  ఉషశ్రీ చరణ్ , గుడివాడ అమర్నాథ్,  సిదిరి అప్పలరాజు, జోగి రమేష్, శంకర్ నారాయణ,  మెరుగు నాగార్జున ఉన్నారు. ఒక్క చాన్స్ అంటూ రాష్ట్రమంతా నడిచి  వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. నిజమే.. అఖండ మెజారిటీతో ఆయన ఒంటి చేత్తో పార్టీకి అధికారాన్ని సముపార్జించి పెట్టారు.  అయితే ఈ మూడున్నరేళ్లలో జగన్ కు ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు  అని జనం వగచేలా ఆయన పాలన ఉంది.    రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు నమోదైతే, అది జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అది మూడు శాతానికి పడిపోయింది.   నిజానికి, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు, అన్నీ ఇన్నీ కాదు. అందుకే, ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న  పర్యటనలకు లభిస్తున్న ఆదరణ చూస్తే, జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో,  అర్థమవుతుంది. జగన్ పార్టీ విజయావకాశాలపై ఇటీవలి కాలంలో వచ్చిన సర్వేలన్నీ ఒకే మాట చెప్పాయి. ఆయన గ్రాఫ్ అతి వేగంగా పడిపోతోందని.  కాగా తాజాగా శ్రీ ఆత్మసాక్షి నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో కనీసంలో కనీసం 60 స్థానాలలో వైసీపీ అత్యంత బలహీనంగా ఉందని.. అంటే 175 అవుటాఫ్ 175 అంటున్న జగన్ పార్టీ ఎన్నికలు జరగడానికి ముందే కనీసం 60కి పైగా స్థానాలలో వైసీపీ విజయం కోసం ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయని శ్రీ ఆత్మ సాక్షి సర్వే చెబుతోంది.   రాష్ట్రంలోని 70 వరకూ నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, మంత్రులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని  శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడించింది. ఆయా   నియోజకవర్గాలలో మంత్రి రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం,  మరో మంత్రి విడదల రజని ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరి పేట నియోజకవర్గం, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గం కూడా ఉన్నాయి. కూడా ఉండటం గమనార్హం.  ఇక పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు, అలాగే విజయనగరం జిల్లా శృంగవరపు కోట, విజయనగరం, బొబ్బిలి, కురుపాంలు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్ నియోజకవర్గాలతో పాటు పెందుర్తి, అనకాపల్లి, అరకు, పాయకరావు పేల, గాజువాక నియోజవర్గాలలో వైకాపీ అత్యంత బలహీనంగా ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పిఠాపురం, పి.గన్నవరం, అమలాపురం, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, నిడదవోలు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాలలో వైపీపీ పరిస్థితి ఎదురీతగానే ఉందని సర్వే వెల్లడించింది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని జిల్లా పరిధిలోని విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ, పెడనలలోనూ, గుంటూరు జిల్లాలోని తాడి కొండ, వినుకొండ, చిలకలూరి పేట, తెనాలి, బాపట్ల, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, వేమూరు, పొన్నూరులలో వైసీపీ తీవ్ర మైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జల్లాలోని సంత నూతల పాడు, కనిగిరి, పరుచూరు, అద్దంకి, దర్శిలలోనూ, నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ, కావలి, గూడూరు, ఉదయగిరిలలోనూ వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప లో కూడా మైదుకూరు, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, కల్యాణ దుర్గం నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. అదే విధంగా కర్నూలుజల్లాలో కూడా కర్నూలు, నంది కొట్కూరు, పత్తికొండ, పాణ్యం, ఆలూరులలోనూ, చిత్తూరు జిల్లా నగరి, సత్యవేడు, పుతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు గాలి వీస్తున్నది.  ముఖ్యమంత్రి జగన్ సహా అధికార పార్టీ నాయకుల సభలు జనంలేక వెలవెలబోవడం, అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబు సహా ఆ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టడంతో రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సర్వే కూడా ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేదిగానే ఉంది.

వరుడి పేరుకు మ్యాచ్ అయ్యే కానుక.. ఏమిటో తెలుసా?

పెళ్లి కానుకలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. స్నేహితులు పెళ్లి కానుకగా పాలసీతా ఇచ్చిన ఉదంతాలు చూశాం. అలాగే కండోమ్ లు ఇచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి.  అయితే ఉత్తర ప్రదేశ్ లో మాత్రం పెళ్లి కూతురి తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక మాత్రం ఎవరికైనా షాక్ కలిగించక మానదు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నిబంధనల ఉల్లంఘనులు, నేరస్థులు, పన్ను ఎగవేతదారులు ఇలా ఒకరేమిటి తప్పు చేశారనిపిస్తే చాలు వాళ్ల ఇళ్ల మీదకు బుల్ డోజర్లను పంపించేస్తుంటారు. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బుల్డోజర్ సిఎం అని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూ, పెళ్లికుమారుడికి వధువు తండ్రి ఇచ్చిన కానుకకూ సంబంధం ఏమిటంటారా? ఉంది. ఆ సంబంధం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే ముందుగా వరుడి పేరు తెలుసుకుని తీరాలి. సరే వివరాల్లోకి వెళితే..   యూపీలోని దేవ్‌గావ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు పరశురామ్ కుమార్తె నేహాకు నౌకాద‌ళంలో ప‌నిచేస్తున్న సౌఖ‌ర్ గ్రామానికి చెందిన యోగేంద్ర అలియాస్ యోగికి ఈ నెల 15న వివాహం జరిగింది. ఈ సందర్భంగా నేహా తండ్రి తన అల్లుడికి ఇచ్చిన కానుక అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేససింది. ఇంతకీ ఆ మామ తన కొత్తల్లుడికి ఇచ్చిన కానుక ఏమిటంటారు. బుల్డోజర్. ఔను బుల్డోజరే. పెళ్లి కొడుకు పేరు యోగి అవ్వడంతో సింబాలిక్ గా ఆయన తన అల్లుడికి బుల్ డోజర్ కానుకగా ఇచ్చాడు. ఇది పెళ్లికి వచ్చిన వారినే కాదు పెళ్లి కుమారుడినీ ఆశ్చర్య పరిచింది. వరకట్నం వద్దన్న అల్లుడికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని భావించిన మామ  త‌న అల్లుడికి క‌ట్నంగా బుల్డోజ‌ర్‌ను ఇచ్చాడు ప‌ర‌శురామ్. ఇది చూసిన అక్క‌డి వారు ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. యోగి అన్న పేరున్నందుకు బుల్ డోజర్ బహుమతిగా వచ్చిందా బ్రో.. బాధపడకు.. అన్యాయాన్ని బుల్ డోజ్ చేసేయ్ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు సంధిస్తున్నారు.  దీనిపై పెళ్లి కొడుకు యోగి మాట్లాడుతూ..   తాను కట్నం తీసుకోవడానికి నిరాకరించానని, ఎలాంటి డిమాండ్ చేయలేదని, అయితే మామగారు బుల్‌డోజర్‌ను సర్‌ప్రైజ్‌గా బహుమతిగా ఇచ్చారన్నారు.

ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన

అదో వంతెన.. పూర్తయ్యి ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు. 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి నోచుకోకపోవడానికి కారణం తెలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్దమౌతుంది. బీహార్ లో సీఎం నాబార్డ్ పథకం కింద నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన పర్తై ఐదేళ్లయినా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభం కాకుండానే కుప్పకూలిపోయింది. ఇంతకీ బగుసరాయ్ లోని గండక్ నదిపై నిర్మించిన ఈ వంతెన ప్రారంభానికి ఎందుకు నోచుకోలేదంటే.. ఆ వంతెనకు అప్రోచ్ రోడ్డు లేకపోవడమే. నాడా దొరికిందని గుర్రం కోసం వెతికిన చందంగా నిధులు మంజూరయ్యాయనీ వంతెన నిర్మించేశారు. అప్రోచ్ రోడ్డు కు మాత్రం ఐదేళ్లుగా మోక్షం కలగలేదు. ఈ వంతెనే ఆదివారం కుప్పకూలింది. వంతెన ముందు భాగం కూలి నదిలో పడింది. ఇంతకీ కూలిపోవడానికి కారణమేమిటంటే.. అప్రోచ్ రోడ్ లేకపోవడంతో వంతెన ప్రారంభం కాలేదు కానీ, భారీ వాహనాలు, ట్రాక్టర్లు ఈ వంతనపై  యథేచ్ఛగా రాకపోకలు సాగించాయి. దీంతో  పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. దీంతో వంతెన కూలిపోయింది.