కేటీఆర్ సినిమాల్లో కొస్తున్నారా? మహేష్ బాబుతో నటిస్తారా?

కల్వకుంట్ల తారకరామారావు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ అభివృద్ధి పురోగతిపై ఏ సభలోనైనా, సమావేశంలోనైనా సాధికారికంగా మాట్లాడతారు. మంచి వాగ్ధాటితో ప్రతర్యర్థులపై విమర్శలు గుప్పిస్తారు. ఇది ఒక పార్శ్వం.. మరో పార్శ్వం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. అందుకోసం వర్కౌట్లు చేస్తారు. ఆయనకు సినిమా పరిశ్రమలో హీరోలు, నిర్మాతలతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులూ ఉన్నారు. తాజాగా ఆయన తాను వర్కౌట్లు చేస్తున్న ఫొటో ఒకటి ట్వీట్ చేశారు. ఈ ఫొటో చూసిన ఆయన అభిమానులంతా ఫిదా అయిపోయారు. సినీ హీరోలా ఉన్నారంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. సినిమాల్లోకి రావాలనీ, మహేష్ బాబుతో కలిసి నటించాలనీ ట్వీట్ల వర్షం కురిపించేశారు. కేటీఆర్, మహేష్ బాబుల మధ్య మంచివ స్నేహ సంబంధాలున్న సంగతి తెలిసిందే కదా.

మెట్రో పట్టాలపై డ్రోన్ క్రాష్.. ఎక్కడంటే?

మోట్రో పట్టాలపై కుప్పకూలిన డ్రోన్   గంట  పాటు భయాందోళనలను సృష్టించింది. మెట్రో సర్వీసులను నిలిపివేసింది. ఈ ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 25) ఓ డ్రోన్ మెట్రో రైలు పట్టాలపై కుప్ప కూలింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మోట్రో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మెట్రో స్టేషన్లు మూసి వేశారు. జసోలా మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు పట్టాలపై కుప్పకూలిన డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోన్ ఒక ఫార్మా కంపెనీదని  విచారణలో తేలింది. ఔషధాల సరఫరాకు ఆ కంపెనీ డ్రోన్ ను వినియోగిస్తున్నదని అంటున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రోన్ కారణంగా నిలిచిపోయిన మెట్రో సర్వీసులను దాదాపు గంట తరువాత పునరుద్ధరించారు.  

రౌండప్ 2022.. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నిక

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జులై   జులై 1.. నాటకీయ పరిణామాల నడుమ, జూన్ 30 న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన, శివసేన చీలిక వర్గం నేత ఏకనాథ్ షిండే, ప్రభుత్వం శాసన సభ బలపరీక్షలో నెగ్గింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్’ నియమితులయ్యారు.  జులై 5.. మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.  జులై 6.. మరో రోజులో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపధ్యంలో కేంద్ర మంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నక్వి, ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. నక్వీ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోయిందని విపక్షాలు పేర్కొన్నాయి.  పరుగుల రాణి పీటీ ఉషా, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో పాటుగా ప్రముఖ సామాజిక కార్యకర్త, దాత  వీరేంద్ర హెగ్గాడే, దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో పేరెన్నికగన్న కథా, స్క్రీన్ ప్లే రచయిత, వి.విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభకు నామినేట్ అయ్యారు.  జులై 8... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ కు సంబంధమున్న 18 వ్యాపార స్థావరాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ( పిఎంఎల్ఎ) పరిధిలో చర్యలు ఉంటాయని ఈడీ అధికారులు తెలిపారు. జులై 11..శివసేన థాకరే వర్గం ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించింది  జులై 18.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి.  రాష్ట్రపతి ఎన్నిక...దేశ 15 వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఈరోజు పోలింగ్ జరిగింది. పది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో, ఎలెక్టోరల్ కాలేజీలోని సభ్యులు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  నూటికి నూరు శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ భవన్ తో పాటుగా దేశ వ్యాప్తంగా 30 కేంద్రాల (అసెంబ్లీ)లో పోలింగ్ నిర్వహించారు.అధికార ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాలు  పోటీలో ఉన్నారు. జులై21న ఫలితాలు వెలువడుతాయి.  జులై21..ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా 64 ఏళ్ల ద్రౌపతి ముర్ము చరిత్రను సృష్టించారు. జులై 25న ఆమె ప్రమాణస్వీకారం చేస్తారు.  జులై 21..నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  జులై 25..  రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపతి ముర్ము దేశ 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ చరిత్రలో రెండవ మహిళా రాష్ట్రపతిగా, ప్రప్రధమ గిరిజన మహిళా రాష్ట్ర పతిగా బాధ్యతలు స్వీకరించిన ముర్ము స్వంతత్ర భారత దేశంలో జన్మించిన తొలి రాష్ట్రపతి కావడం మరో విశేషం. కాగా, రాష్ట్రపతి ముర్ము, అత్యంత పేదరికంలో జన్మించిన తాను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం,పేదలు తమ కలలను నిజం చేసుకోవచ్చనేందుకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.  జులై 28..అవినీతి ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చట్టేర్జీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రి పదవి నుంచి తొలిగించారు.

దిగ్విజయ్ తో కేవీపీ భేటీ ..ఏంటి కథ?

తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభ పరిష్కారానికి  పార్టీ కేంద్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్  ను దూతగా పంపింది. దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజులు గాంధీ భవన్ లో కూర్చుని. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం నాయకులను, ఇటు రేవంత్ రెడ్డి వ్యతిరేక సీనియర్ నేతలను కలిశారు... అందరితోనూ మాట్లాడారు.అంతా బాగుంది.ఆల్ ఈజ్ వెల్.. టీ  కాంగ్రెస్ సంక్షోభం టీ  కప్పులో తుపానులా తేలిపోయిందని చెప్పేసి చక్కా పోయారు. పార్టీ అద్యక్షుదు మల్లికార్జున ఖర్గే కి కేంద్ర నాయకత్వానికి ఆయన ఏమి నివేదిక ఇస్తారు, ఏమి నివేదిస్తారు, కేంద్ర నాయకత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది అనేది, వేరే విషయం.  అదెలా ఉన్నా, ట్రబుల్ షూటర్  దిగ్విజయ్  రాకతో   టీ  కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం ఆయనే చెప్పినట్లుగా టీ కప్పులో తుపానులా తేలిపోయిందనే అనుకుందాం. నిజానికి దిగ్విజయ వచ్చి వెళ్ళిన తర్వాత, సమస్య మరింత జటిలం అయిందని, టీ కప్పులో తుపాను సునామీగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు అనుకోండి అదివేరే విషయం.  అయినా, ఆవిషయాన్ని పక్కన పెట్టి, నిజంగానే దిగ్విజయ్ సింగ్ సమస్యను చక్కగా పరిష్కరించారనే కాసేపు అనుకుందాం.  కానీ, తెలంగాణ కాంగ్రెస్’ లో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్   ఆంధ్ర ప్రాంతానికి చెందిన  వైఎస్ ఆత్మ  కేవీపీ రామచంద్ర రావుతో రెండు గంటలకు పైగా, వన్ టూ వన్  మంతనాలు సాగించడంలో మతలబు ఏమిటి? ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి  కేవీపీ ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు అయినా  రాష్ట్ర విభజన తర్వాత, 2020 వరకు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. అంతేకాదు,తెలంగాణలో సాగే, తెర వెనక రాజకీయాలు నడుపుతారనే   పేరుంది. అంతే కాదు  ఎంతవరకు నిజమో ఏమో కానీ  కేవీపీకి కేసీఆర్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు. ఆయనకు వైఎస్సార్ తో ఒక విధమైన ‘ఆత్మ’ బంధం ఉంటే, కేసీఆర్  తో మరో విధమైన ‘కుల’ బంధం ఉందనీ అంటారు. అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని కడ తెర్చెందుకే, కేవీపీ కాంగ్రెస్  లో కొనసాగుతున్నారనే  అనుమానాలు లేక పోలేదు. అలాగే  కాంగ్రెస్ కోవర్టులకు ఆయనే ఆది గురువనే ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయని అంటారు.  మరి అంతటి అనుమానస్పద వ్యక్తితో దిగ్విజయ్  అంత సేపు ఏకాంతంగా ఏమి చర్చించారు? ఈ భేటీ ద్వారా దిగ్విజయ్ సింగ్ పార్టీ నాయకులు, క్యాడర్ కు ఎలాంటి సకేతాలు ఇచ్చారు? అందుకే రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా, కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానం దూతగా వస్తే, కేవీపీ... పార్టీ అసమ్మతి గళం వినిపిస్తున్నసీనియర్ల ( వీరిని కొందరు కోవర్టులనీ అంటున్నారు) తరపున కేసీఆర్ దూతగా దిగ్విజయ్ సింగ్ ను కలిశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తమ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నంత వరకు కేసీఆర్ కు కాంగ్రెస్ గురించి ఆలోచించవలసిన అవసరం ఏర్పడ లేదు. అలాగే, ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్న సీనియర్లు ఎవరితోనూ కేసీఆర్ కు, లాలూచీ వుందో లేదో కానీ, ఎలాంటి పేచీ అయితే లేదు. మాజీ పీసీసీ చీఫ్ తోనే కాదు,మాజీ, తాజా సీఎల్పీ నాయకులు జానారెడ్డి, భట్టి విక్రమార్క తోనూ, కేసీఆర్ కు ఎలాంటి పేచీ, పంచాయతీ లేదు.  సభ లోపల వెలుపల కూడా కేసీఆర్ వారితో సత్సంబంధాలు కొనసాగించడం తెలియంది కాదు.  ప్రధాని నరేంద్ర మోడీ సహా ఏ నాయకుడిని అయినా  ఏ మాత్రం స్పేర్  చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో  ఏనాడు జానారెడ్డిని ఏకవచనంలో సంభోదించలేదు. చులకన చేసి మాట్లాడలేదు. గౌరవంగా  ‘పెద్దలు’ జానా రెడ్డి గారనే సంభోదించారు. జానారెడ్డి కూడా అదే రీతిలో సభ లోపలా వెలుపలా ‘మర్యాద’ గీత దాట లేదు. అవసరం అయితే సర్కార్ కు అండగా నిలిచారే కానీ, ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏ నాడూ చేయలేదు. చేతి గుర్తు మీద గెలిచిన  ఎమ్మెల్యేలను కళ్ళెదుటే కేసీఆర్ కారెక్కిస్తున్నా, జానా రెడ్డి, భట్టి ఏనాడు అభ్యంతరం చెప్పలేదు.  అంతే కాదు, తను ప్రతిపక్ష నేతను అనే విషయం మరిచి పోయారో ఏమో కానీ, ఒకానొక సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మధ్యలో విలేకరులతో కలిసి సీఎల్పీ నేత జానారెడ్డి ప్రత్యేకంగా అధికార పార్టీ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్న  రూ.5 భోజనం తెప్పించుకుని, ఆహా .. ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు. అద్భుతం అమోఘం అంటూ కితాబు నిచ్చారు.ఆ విధంగా అధికార తెరాసకు ఉచిత ప్రచారం చేసి కేసీఆర్ పొగడ్తల ఋణం తీర్చుకున్నారు. ఇక భట్టి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ప్రతిపక్ష నాయకులు ఎవరికీ ప్రవేశం లేని రోజుల్లోనే భట్టికి ప్రగతి భవన్ రెడ్ కార్పెట్ పరిచింది. దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజక వర్గాన్ని చేర్చారు. అంతే కాదు  ఇంకెవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి  సభలోనే, భట్టిని గులాబీ గూటికి ఆహ్వానించారు. ఇక కోమటి రెడ్డి తదితర నాయకుల విషయం అయితే చెప్పనే అక్కరలేదు. (అవును దిగ్విజయ్ సింగ్, కోమటి రెడ్డి తోనూ సుదీర్ఘంగ ఏకాంత చర్చలు జరిపారు.) ఈ అందరిదీ ఒకటే నినాదం, భరాసతో దోస్తీకి అడ్డుగా ఉన్న రేవంత్ రెడ్డిని సాగ నంపి,గులాబీ బాస్ కేసేఆర్  తో చెలిమికి తలుపులు తీయడమే, ఈ నేతల లక్ష్యం. ఈ నేపథ్యాన్ని గమనిస్తే, దిగ్విజయ్ సింగ్ ను కేవీపీ ఎందుకు కలిశారో, ఏమి చర్చించారో వేరే చెప్పవలసిన అవసరం రాదు. అవును, కాంగ్రెస్, భరాసల స్నేహ బంధాన్ని పునరుద్ధరించడమే దిగ్విజయ్ .. కేవీపీ  భేటీ సారాంశం.. అంటున్నారు. నిజానికి, రాష్ట్ర విభజన సమయంలో దిగ్విజయ్ సింగ్. రాష్ట్ర ఇంచార్జిగా ఉన్నారు.  విభజన క్రెడిట్  ఏ మాత్రం కాంగ్రెస్ ఖాతాలో చేరకుండా  గంప గుత్తగా కేసేఆర్ ఎకౌంటులో వేసిన ‘ఘనత’ కుడా దిగ్విజయ్  కే దక్కుతుందని అంటారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి.. అంతా జగన్మాయ!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఏం చెబుతుందో అది చేయదు.. ఏం చెప్పలేదో... అది చేస్తుంది.  మాట ఒకటి.. చేత ఒకటి ఇది గతంలో పలు సందర్భాలలో రుజువైంది. అయితే జగన్ సర్కార్ తమ విధానమంటూ చెప్పుకు వస్తున్నమూడు రాజధానుల విషయంలో కూడా ద్వంద్వ ప్రమాణాలే పాటిస్తోందనీ తేటతెల్లమైపోయింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అంటూ జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఉట్టి నీటి మూటలేనని తేలిపోయింది.  గతంలో కర్నూలులో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అంటూ జారీ చేసిన జీవోను ఇప్పుడు రద్దు చేసింది. ఆ జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరిలోనే ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసంది. జీవో అయితే ఇక్కడే జారీ చేసింది కానీ మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ పనులు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. హైకోర్టు నేతృత్వంలో ఆ పనులు జరుగుతున్నాయి. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఈ అకాడమీని ప్రారంభిస్తారు. ఇది కూడా ఖరారైంది. అయితే కర్నూలులో ఏర్పాటు చేయదలచిన జ్యుడీషియల్ అకాడమీ కోసం జీవో కూడా జారీ చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు దానిని రద్దు చేసి మంగళగిరిలోనే ఏర్పాటు చేయడానికి కారణమేమిటన్నదానిపై పలు ఊహాగానాలు వ్యక్తమౌతున్నాయి. కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ కోసం ఆందోళనలు చేసిన రాయలసీమ న్యాయవాదులు దానిని మంగళగిరికి తరలించేసినా ఎందుకు కిమ్మనడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయమేమిటంటే హైకోర్టుతో సంబంధం లేకుండా జగన్ సర్కార్ కర్నూలులో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు అంటూ జీవో జారీ చేసేసింది. అయితే కర్నూలలో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు.. అది మంగళగిరిలో మాత్రమే ఏర్పాటు చేయాలని విస్పష్టంగా తేల్చి చెప్పేసింది. దీంతో జగన్ సర్కార్ మరో గత్యంతరం లేక పాత జీవోను రద్దు చేసి మంగళగిరిలో జ్యుడీషియల్ అకాడమీ అంటూ తాజాగా మరో జీవో జారీ చేసింది. వైసీపీ పెద్దలు తల నిలువుగా ఊపితే ఆందోళనలు, అడ్డంగా ఊపితే నిశ్శబ్దం పాటించే అనుయాకులు.. ఈ జీవో విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్ కర్నూలులో హైకోర్టు ప్రశక్తే లేదని తేల్చి చెప్పేసింది. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికీ.. ప్రాంతీయ విభేదాలు సృష్టించి లబ్ధి పొందడానికి మాత్రమే మూడు రాజధానుల జపం చేస్తున్నదన్న విషయం జ్యూడీషిల్ అకాడమీ జీవోతో మరో సారి తేటతెల్లమైంది. 

ఎనిమిది కాళ్ల దూడ.. బ్రహ్మం గారు చెప్పిందే జరిగిందా?

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది.. అన్నది చాలా పాపులర్ పాట. దేశంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అనడం కద్దు. సరిగ్గా అలాంటి వింతే తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన దేవిశెట్టి రత్నాజీ అనే రైతు కు చెందిన గెదె ఓ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడను చూసిన వారంతా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఇలాంటి వింతలు జరుగుతాయని, వింత జననాలు సంభవిస్తాయనీ అంటున్నారు. ఇంతకీ ఆ దూడ ప్రత్యేకత ఏమిటంటే దానికి ఎనిమిది కాళ్లు ఉన్నాయి. సాధారణంగా దూడకు నాలుగు కాళ్లే ఉంటాయి. అలాంటిది ఈ దూడ ఎనిమిది కాళ్లతో జన్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  ఆ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. ఆ దూడకు సంబంధించి వీడియో సమాజిక మాధ్యమంలో వైరల్ అయిపోయింది. అయితే పశువైద్యులు మాత్రం ఇదేం వింత కాదనీ, బ్రహ్మం గారి జోస్యం అంతకన్నా కాదనీ అంటున్నారు. జన్యు లోపాలతో ఆవు, గేదె వంటి జంతువులకు ఇలాంటి దూడలు జన్మించడం అరుదే కానీ,  వింతేమీ కాదని చెబుతున్నారు. ఇలాంటి జన్యు లోపాలతో పుట్టిన దూడ ఎక్కువ కాలం బతకదని కూడా పశువైద్యులు చెబుతున్నారు.  

రసకందాయంలో భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మూడో రోజు వికెట్లు టపటపా

ఢాకా వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో  టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో బంగ్లా 231 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 144 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం మాత్ర‌మే బంగ్లాదేశ్‌కు ద‌క్కింది. 145 పరుగుల  స్వల్పలక్ష్య ఛేదనలో భారత్ చెమటోడుస్తోంది. కేవలం 45 పరుగులకే నాలుగు  వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే టీమ్ ఇండియా ఇంకా వంద పరుగులు చేయాలి. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 7 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల విజృంభణకు టపటపా వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ జాకీర్ హుస్సేన్ (51), టిటన్ దాస్ (73)ల పోరాట పటిమ కారణంగా 231 పరుగులు చేయగలిగింది. టీమ్ ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు. సిరాజ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టగా, ఉనాద్కత్ కు ఒక వికెట్ దక్కింది.  తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 314 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలిసిందే.

రౌండప్ 2022.. సోనియా, రాహుల్ కు ఈడీ సమన్లు

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జూన్ జూన్ 1...నేషనల్ హెరాల్డ్ కేసులో  జూన్ 8 న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. సోనియా, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరవుతారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. అయితే, అనారోగ్య కారణాల వలన సోనియా గాంధీ ఆ రోజు విచారణకు హాజరు కాలేరనడంతో. జూన్ 23 న హాజరు కావాలని తాజా సమన్లు జారీ చేసింది.  జూన్ 5... ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ 50వ పుట్టిన రోజు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు యోగీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.   మొహ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మను, ఢిల్లీ మీడియా ముఖ్యుడు నవీన్ కుమార జిందాల్  ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.   జూన్ 8.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద యాదవ్ కు పాటా హై కోర్టు రూ. 600 జరిమానా విధించింది.  జూన్ 9.. రాష్ట్ర పతి రామనాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగుస్తుంది. దీంతో, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జులై 18న జరుగుతుంది . కౌంటింగ్ జులై 21న చేపడతారు.   జూన్ 10.. నాలుగు రాష్ట్రాలలోని 16 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 11.. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన మూడు రాజ్యసభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. గెలిచిన వారిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మరో ఇద్దరు ఉన్నారు . జూన్ 12...  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,  ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ లకు లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో గ్రామా స్వరాజ్ దిశగా వేసిన అడుగులు, అమలు చేసిన పథకాలను వివరించారు.  జూన్13... నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించింది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జూన్ 14 న కూడా ఈడీ విచారణ  కొనసాగింది  జూన్ 14..  రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పోటీ చేసేందుకు నిరాకరించారు.అలాగే ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ కూడా తమ నిరాసక్తత వ్యక్తం చేశారు. చివరకు జూన్ 20 న జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో కేంద్ర  మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి.  జూన్ 21..  ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు. జూన్ 20.. కేంద్ర ప్రభుత్వం సైనికుల నియామకానికి ప్రకటించిన నూతన అగ్నిపధ్ పథకం పై విపక్షాలు విరుచుకు పడ్డాయి. సైన్యాధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.   జూన్ 22.. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం మొదలైంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేతో ఆ పార్టీ అధికార ప్రతినిధి సామ్నా సంపాదకుడు సంజయ్ రౌత్ చర్చలు ప్రారంభించారు. షిండే పార్టీ వదలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రాజీనామాకు సిద్ధమయ్యారు.  జూన్ 27.. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు తెరాస మద్దతు ప్రకటించింది. జూన్ 29.. కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించింది.  ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామా చేశారు జూన్ 30.. మహారాష్ట్ర సంక్షోభానికి తెర పడింది. శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా, మజీ  ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగ్ ప్రమాణ స్వీకారం చేశారు.  

మద్య నిషేధం కాదు.. మద్యపాన ప్రోత్సాహం ఏపీ సర్కార్ విధానం

ఏపీలో మ‌ద్య నిషేధం ఒక క‌ల‌గానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. జగన్ ఎన్నికల సమయంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి మ‌హిళా ఓట్లు దండుకున్నారే కానీ మ‌ద్య నిషేధానికి మాత్రం  ధైర్యం చేయ‌డం లేదు.  విభ‌జిత ఏపీలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప‌లితంగా మ‌హిళా ఓట్ల‌ను అధిక‌శాతం రాబ‌ట్టుకోవ‌టంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. వై.ఎస్‌.జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీలో మ‌ద్య నిషేదం అమ‌ల‌వుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఏపీ ప్ర‌భుత్వం అలాంటి నిర్ణ‌యం ఏమీ ప్ర‌క‌టించ‌లేదు. ఒక‌ వైపు ప‌క్కరాష్ట్రం తెలంగాణ‌లో మ‌ద్యం విక్ర‌యాల ద్వారా భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. దీంతో లోటు బ‌డ్జెట్ క‌లిగిన రాష్ట్రంలో మ‌ద్య నిషేధం అమ‌లు జ‌రిపితే ప్ర‌భుత్వ ఆదాయం త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం భావించి.. మ‌ద్య నిషేధం హామీని ప‌క్క‌కు పెట్టేసింది.   మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోవటంపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యం రేట్లు పెంచింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వస్తోంది.  మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గ‌డం అటుంచితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన మందుబాబుల జేబులు గుల్ల‌వుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది. మ‌రోవైపు విపక్ష నేత చంద్ర‌బాబు నాయుడు   మ‌ద్య నిషేధంపై ఎలాంటి హామీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ.. మ‌ద్యం షాపుల్లో రిజ‌ర్వేష‌న్లు తెచ్చి అధిక‌శాతం మ‌ద్యాన్ని క‌ల్లుగీత కార్మికుల‌కు ద‌క్కేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఇది కొంతలో కొంత మేలే అయినప్పటికీ  ఏ పార్టీకూడా మ‌ద్య నిషేధం విషయంలో ధైర్యంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు. ఎందుకంటే మద్యం మాత్రమే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.   దీంతో మద్య నిషేధం అమలు చేస్తే  ప్ర‌భుత్వ ఆదాయానికి భారీగా గండిప‌డ‌టంతో పాటు సంక్షేమం కుంటుపడి ప్రజాగ్రహానికి గురౌతామన్నది జగన్ భయంగా కనిపిస్తోంది.    మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు.  ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. 

రేవంత్ స్వగృహ ప్రవేశం త్వరలో టీడీపీలోకి ?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనానికి తొలి అడుగు పడింది. సుదీర్ఘ విరామమ తర్వాత  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం నుంచి పూరించిన సమర శంఖారావం రాష్ట్ర రాజకీయాలలో కలవరం సృష్టిస్తోంది. ముఖ్యంగా  రాజకీయ ప్రతికూల పరిస్థితిలో వేర్వేరు పార్టీలలో చేరిన తెలుగు తమ్ముళ్ళు తిరిగి సొంత గూటికి రావాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు  రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తోంది. నిజానికి  తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా ‘అవుటై’ పోలేదు. నాయకులు అటూ ఇటూ వెళ్ళినా పార్టీ క్యాడర్ , ప్రజలు, మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాల ప్రజలు, మరోమారు టీడీపీకి జై కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఖమ్మం సభ సక్సెస్ అదే విషయాన్ని స్పష్టం చేస్తోందని, పరిశీలకులే కాదు. టీడీపీ ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తున్నారు. భారాస మంత్రుల కలవరం గమనిస్తే  చంద్రబాబు పిలుపు ప్రభావం ఏ రేంజ్ లో వుందో అర్థమవుతుందని అంటున్నారు.   ఈ నేపధ్యంలో మరో దారి లేక  తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి  కొంచెం ఆలస్యంగానే అయినా  టీడీపీని వదిలి వెళ్ళిన నాయకులు చాలా మంది నాయకులు అద్దె కొంపలో ఇమడ లేక తంటాలు పడుతున్నారు. ఒక విధంగా ఉక్కపోతకు గురవుతున్నారు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మినట్లు అవమానం ఫీల్ అవుతున్నారు. అందుకే    మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్ధన రెడ్డి వంటి మాజీ టీడీపీ సీనియర్ నాయకులు ఎక్కడా స్థిరంగా ఉండలేక పోతున్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ  పార్టీలోకి దూకి ప్రజల్లోనూ చులకనవుతున్నారు. ఇలాంటి నాయకులంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే, గతంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితునిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆయన అనుచరులు కూడా తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం అటు గాంధీ భవన్, ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వినిపిస్తోంది. నిజానికి    రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టింది మొదలు  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చాలా చాలా  ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రజల్లో నాయకుడిగా నిలబడడమే కాకుండా  పార్టీ ఆదిస్థానం వద్ద కూడా మార్కులు కొట్టేశారు. అయితే, పార్టీలో సీనియర్లు అనుకునే పెద్దలు మాత్రం  రేవంత్ ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ సీనియర్ నాయకులే కారణమయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపొతే  రేవంత్ రెడ్డికి ఉద్వాసన పలక వచ్చనే వ్యూహంతో సీనియర్లు కాంగ్రెస్ అభ్యర్ధిని విజయవంతంగా ఓడించారు.   మరో వంక తాజాగా రేవంత్ రెడ్డి వర్గీయులను వలస వాదులంటూ చులక చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలలో తమకేదో అన్యాయం, అవమానం జరిగిందని  సీనియర్ నాయకులు బజారున పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువున చీలిపోయే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా చూస్తే  పీసీసీ అధ్యక్షుడికే  గాంధీ భవన్ లో ఉక్క పోసే పరిస్థితి ఏర్పడిందని అంటునారు. ఈ నేపథ్యంలో  రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన మాజీ టీడీపీ నాయకుల అడుగులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు పడుతున్నాయనే మాట రెండు వైపులా నుంచి బలంగా వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ సీనియర్లకు తలంటినట్లు తెలుస్తోంది. అయితే  తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని విధంగా చిందరవందరగా సాగుతున్న నేపధ్యంలో చివరకు ఏమి జరుగుతుంది అనేది  వేచి చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

టీడీపీ రీఎంట్రీతో తెలంగాణలో మారుతున్న ముఖచిత్రం

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత, రాష్ట్ర రాజకీయాలలో ‘గుణాత్మక’ మార్పులు చోటు చేసుకున్నాయి.  ఉద్యమ పార్టీగా పుట్టిన  తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహిచింది. కానీ, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమ స్పూర్తిని తెరాస పక్కన పెట్టింది. ఉద్యమ వాసనలను వదిలేసి, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి  తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్  అనే విధంగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో చాలా వరకు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్షం,ప్రజాపక్షం అనేది లేకుండా చేశారు. ఓవంక ఉద్యమ నాయకులను ఒకరి వెంట ఒకరిని బయటకు పంపారు.. మరోవంక ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేశారు. సామ ధాన భేద దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రా పార్టీ ముద్ర  వేసి టీడీపీని నిర్వీర్యం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.  అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయనే నానుడి మరో మారు నిజమైంది. ఎనిమిదేళ్ళలో తెరాస రూపు రేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తెలంగాణ అస్తిత్వ పునాదులపై ఉద్యమ పార్టీగా పుట్టి కుటుంబ పార్టీగా మారిన తెరాస సహజంగానే ఉద్యమ స్పూర్తికి  ప్రజలకు  దూరమైంది. ఉప ఎన్నికల ఓటమితో మొదలైన తిరోగమనం  తెరాస నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. కుటుంబ పాలనా ముద్రను మురికి మరకను తుడిచేసుకునేందుకు అవతారం మార్చింది. అదే క్రమంలో జాతీయ పార్టీగా అవతరించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. అదలా ఉంటే, తెరాస పేరు భారాసగా మారిన  నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాలలో మరో మారు, రాజకీయ పునరేకీకరణ ప్రక్రియ మొదలైంది.ఇంతవరకు సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సాగించిన రాజకీయాలకు తెర పడింది. ఈ నేపధ్యంలో  తెలుగు దేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలిసిన  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం చూసి ఖమ్మం నుంచి తెలంగాణ శంఖారావం పూరించారు. ఇంత కాలం తాతకు దగ్గులు నేర్పుతున్నామనే భ్రమల్లో ఉన్న కేసేఆర్ అండ్ కో చంద్రబాబు శంఖారావంతో ఒక్క సారిగా ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని  ప్రాతీయ  ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందిన తెరాస పేరును భారాసగా మార్చుకుని దేశంలో జెండా ఎగరేస్తానంటూనే  తెలంగాణలోకి మాత్రం తెలుగుదేశం పార్టీ రాకుడదాని అంటున్నారు. అయితే, ప్రజలు మాత్రం పోటీ పడి మరీ టీడీపీకు పునః స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ రీఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పునరేకీకరణ,రాష్ట్ర రాజకీయ  ముఖచిత్రంలో అనూహ్య మార్పులు తప్పవని అంటున్నారు.

యూటీలుగా హైదరాబాద్, విశాఖ? తెలుగు రాష్ట్రాలను కేంద్రం ఏం చేయాలనుకుంటోంది?

తెలుగు రాష్ట్రాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుందా? ఇరు రాష్ట్రాలకూ రెవెన్యూ లేకుండా చేసి తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఆ గడువు తీరిపోగానే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం యోచిస్తున్నదన్న సమాచారంతో పాటు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెవెన్యూ వచ్చే విశాఖ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందని తెలుస్తోంది.  మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా ఆ రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి కొట్టి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేలా చేసి ఆధిపత్యాన్ని చెలాయించాలన్నదే కేంద్రం వ్యూహంగా చెబుతున్నారు.  తొలుత  తెలంగాణ రాజధాని. దేశంలో టాప్ ఐదు నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.  ప్రస్తుతానికి అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని. 2024 జూన్ వరకూ హైదరాబాద్ హోదా అదే.  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీని కోసం గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పటి కేంద్ర సర్కార్ అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేండ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 వరకు ఇది వర్తిస్తుంది.  ఉభయ తెలుగు రాష్ట్రాలకూ రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్న  నేపథ్యంలోనే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.     గతంలో అంటే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకించారు.   దరిమిలా   హైదరాబాద్ ను  పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలఉమ్మడి రాజధానిగా  ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతున్నాయి. ఆ తరువాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నా.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వినియోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఏపీ హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే.  అయితే  హైదరాబాద్ విషయంలో కేంద్రం ఆలోచన వేరుగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేయటం లక్ష్యంగా  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అన్న అంశం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.  ఇప్పటికే తెలంగాణకు అప్పుల విషయంలో అవరోధాలు సృష్టిస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మెలిక పెట్టే అవకాశాలు లేకపోలేదు.  హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలు లేవకుండా నిరోధించొచ్చని కేంద్రం భావిస్తోంది. ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు ఓకే అన్నారు. ఇప్పుడు కేంద్రం దానినే సాకుగా చూపి ఈ ప్రతిపాదనతో వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయంటున్నారు.   ఇక విశాఖ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ చాలా చాలా కోల్పోయింది. హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయింది. భద్రాచలం రామాలయాన్ని కోల్పోయింది. ఆదాయాన్ని కోల్పోయింది. ఉపాధి అవకాశాలను కోల్పోయింది. విద్యాసంస్థలను కోల్పోయింది. పరిశ్రమలను కోల్పోయింది ఒకటేమిటి.. ఎన్నో ఎన్నెన్నో కోల్పోయింది. ముఖ్యంగా రెవెన్యూ లోటుతో భవిష్యత్ ఎలాగా అన్న భయాన్ని, ఆందోళన మాత్రమే విభజన కారణంగా ఏపీకి దక్కింది. ఇన్నీ కోల్పోయినా ఆంధ్రులు మన విశాఖ ఉందిగా అనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన విశాఖ సుందర నగరమే కాదు, పర్యాటక, వాణిజ్య పరంగా ప్రత్యేకత సంతరించుకున్న నగరం కూడా. ఈ నగరం ఒక టూరిస్ట్ స్పాట్. ఉపాది, విద్యావకాశాలకు కేంద్రం. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశ, విదేశీ టూరిస్టులు కూడా వేల సంఖ్యలో సందర్శించే నగరం విశాఖ. సాగర తీరం, ఉద్యానవనాలు, కొండలు, నైట్ లైఫ్, ఫుడ్ డెస్టినేషన్స్ ఇలా ఇక్కడ పర్యాటకులకు అవసరమైనవన్నీ ఒకే చోట కుప్పపోసినట్లు ఉన్న నగరం. ఇక పారిశ్రామికంగా విశాఖ ఏపీకి బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెప్పాలి. అటువంటి విశాఖ నగరం గత మూడున్నరేళ్లుగా ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది. పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. కోర్టులు, పర్యావరణ వేత్తలు, ఎన్జీటీ వంటి ట్రైబ్యునళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా విశాఖ ఘనతను మసకబార్చే పనిలో ముందుకు సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో ఉన్న విశాఖ విభజన అనంతరం ఏపీకి మిగిలిన ఏకైక  ప్రధాన ఆదాయ వనరు.  , విశాఖలో కేంద్ర సంస్థలు నేవీ, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. కేంద్ర ఉద్యోగులు ఎక్కువ మంది  రిటైర్మెంట్ తర్వాత కూడా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే ఇప్పుడా పరిస్థితి వేగంగా కనుమరుగైపోతోంది.  భూ కబ్జాలు, పారిశ్రామిక వేత్తలకు వేధింపులు.. ఇలా విశాఖ తన ప్రశాంతతను కోల్పోతోంది. విశాఖ రాజధాని అని వైసీపీ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచీ ఇక్కడ పొలిటికల్ రౌడీ ఇజం పెరిగిపోయింది. సామాన్య జనమే కాదు.. పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడ నుంచి బిచాణా ఎత్తేయడమే మేలా అన్న మీమాంశలో పడ్డారు. ఇక ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న ఉక్కు ప్రైవేటు పరం చేస్తున్నా జగన్ సర్కార్ లో ఉలుకు, పలుకూ లేదు. విశాఖ జోన్ కు మంగళం పాడేసినా చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు.  జగన్ సర్కార్ అశక్తతని, నిష్క్రియా పరత్వాన్నీ ఆసరాగా తీసుకుని విశాఖను కూడా ఏపీకి దక్కకుండా చేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. నిన్న మొన్నటి దాకా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ వచ్చిన కేంద్రం కన్ను ఇప్పుడు విశాఖపై పడింది. విశాఖను కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ మేరకు హస్తిన స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చి విశాఖను పరిశీలించి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏపీకి ఉన్న ఏకైక ప్రధాన వనరు విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కేంద్రం యోచన వెనుక ఆ నగర ప్రాశస్థ్యాన్ని, ఘనతను, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరే కారణమని అంటున్నారు.  ఇప్పటికే జగన్ నిర్వాకం వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  రాజధాని  నగరానికి  ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో  ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి  అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విభజిత రాష్ట్రానికి హైదరాబాద్ స్థాయిలో ఆదాయ వనరుగా ఎదుగుతుందని అంతా భావించిన అమరావతి పురోగతి నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఏపీ హైకోర్టు విస్పష్ట తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ తీరు మారలేదు. కోర్టు తీర్పుతో అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు   ప్రకటించినా తమ విధానం మూడు రాజధానులే అంటూ వస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి అభివృద్దికి ముందుకు అడుగులు వేయలేదు. అలా బంగారు గనిలా మారుతుందనుకున్న అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి విశాఖ నగరాన్ని కూడా రాష్ట్రానికి దక్కకుండా చేస్తోంది. మొత్తం మీద విభజనకు ముందు ఏదోలా రాష్ట్రం సాధించుకుంటే చాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ యూటీగా అభ్యంతరం లేదని చెప్పడాన్ని సాకుగా చూపి హైదరాబాద్ ను, అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యాలతో జగన్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన విశాఖ ప్రాభవాన్ని, ప్రాశస్థ్యాన్నీ దిగజారుస్తుండగాన్ని నెపంగా చూపి విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

నీ హక్కులు నీవే రక్షించుకో

 గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉన్నాం. మనకు అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే ఉంటాయి. మనం కొనే... కాస్ట్లీ వస్తువులే కాదు, ఉప్పు, పప్పు మొదలు ప్రతి కొనిగోలులో మోసం ఎదురవుతుంది. ధర విషయంగానో, నాణ్యత పరంగానో, తూకం కొలతల విషయంలోనో, కల్తీల విషయంగానో మరో విధంగానో మనం మోస పోతూనే ఉన్నాం. ఒక్క వస్తువుల కొనుగోలు విషయంలోనే కాదు, వైద్య, బీమా సేవలు మొదలు ప్రభుత్వ సేవల వరకు,  సేవల విషయంలోనూ, అనేక విధాల మనం మోస పోతున్నాం. మోసాలకు గురవుతున్నాము. మార్కెట్ మోసాల కారణంగా వినియోగ దారులు కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య పరంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలే  కోల్పోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కల్తీ మందులు, కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ పానీయాలు ప్రాణాలు తీసిన సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. ఇక  మద్యం కల్తీ గురించి అయితే చెప్పనే అక్కర లేదు. ఇక కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు, విత్తనాలు,పురుగుల మందులు, ఎరువుల బ్లాక్ మార్కెట్, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అలాగే, బీమా సంస్థలు కూడా మోసాలకు పాల్పడుతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, మార్కెట్ మోసాలు మహమ్మారిని మించిన విషాదాలను సృష్టించాయి.సృష్టిస్తున్నాయి.  ఈ మోసాలని కట్టడి చేసేందుకు, వినియోగ దారుల హక్కులను రక్షించేందుకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమాలు నడిచాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం మార్చి 15 తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినం, జాతీయ స్థాయిలో డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపు కుంటున్నాం.   వినియోగదారులకు హక్కులున్నాయి. ఆ హక్కులను పరిరక్షించే చట్టాలున్నాయి. నిజానికి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకి జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్  వంటి వ్యవస్థలున్నాయి. మోసాలకు పాల్పడిన వ్యాపార, వాణిజ్య,ఉత్పాదక సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని సందర్భాలలో కాకున్నా, కొన్ని సందర్భాలో అయినా కఠినంగా శిక్షిస్తున్నాయి. అయినా, మార్కెట్ శక్తుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు, ఇంకా ఇతర కారణాలున్నా,వినియోగదారులకు తమకున్న హక్కులు, చట్టాల గురించి  అవగాహన లేక పోవడం ఒక ప్రధాన కారణం. అందుకే, వినియోగాడులకు తమకున్న హక్కుల గురించి అవగాహన కల్పించేందుకే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతోంది. అంతర్జాతీయ, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం వేర్వేరు తేదీలో జరుగుపుకుంటున్నా లక్ష్యం మాత్రం ఒక్కటే. వినియోగదారులకు హక్కులు, బాధ్యతలను గుర్తు చేయడం, ఉద్యమాన్ని ఐక్యంగా మరింత ముందుకు తీసుకు వెళ్ళడం ఇవే వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రధాన లక్ష్యాలు. మన దేశంలో 1986 డిసెంబర్ 24న, వినియోగదారుల హక్కుల చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆ రోజు నుంచి వినియోగదారుల హక్కుల చట్టం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం, అదే రోజున దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయిత, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక  థీమ్  తీసుకుని డిసెంబర్ 24 న, జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. దేశంలో అవినీతి, అక్రమ వ్యాపారాలను అరికట్టేదుకు, ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న సంస్కరణల నేపధ్యంలో, దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్న నేపధ్యంలో, ఈ సంవత్సరం, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’  అంశాన్ని ప్రధాన థీమ్ గా  తీసుకుని, ఈ డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాం. నిజానికి, సుస్థిర స్వచ్ఛ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణ కారణంగా   ఆర్థిక వ్యవస్థలో,వ్యాపార కార్యకలాపాలలో,వ్యాపార,సేవా కార్యకలాపాల స్వరూప, స్వభావాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగానూ ‘ఆన్లైన్’ కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ‘ఆన్లైన్’ మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులకు అనుగుణంగా  కేంద్ర ప్రభుత్వం, 1986 నుంచి అములులో ఉన్న నియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని, డిజిటల్ యుగానికి తగిన విధంగా సవరించింది. గతంలో, 1991, 1993లోనూ చట్ట సవరణలు జరిగినా, 2020 జూలై 20 నుంచి అమలులోకి వచ్చిన, 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారుల హక్కుల పరిధిని విస్తృత పరిచింది. ఒక విధంగా నూతన చట్టం డిజిటల్ చట్టం..పాత మోసాలకు పగ్గాలు బిగిస్తూనే, డిజిటల్ మోసాలకు కళ్ళెం బిగించేందుకు ఉద్దేశించిన చట్టంగా పేర్కొనవచ్చును.    అందుకే, 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల హక్కుల రక్షణ దినోత్సవం, థీమ్’గా తీసుకోవడం జరిగింది. నిజానికి  కేంద్ర కన్స్యూమర్ అఫైర్స్ డిపార్టుమెంట్ కొవిడ్  కాలంలోనూ 2019 చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే వుంది. అందులో భాగంగానే, గత సంవత్సరం 2021లో, వర్చువల్ గా నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, ‘వినియోగాదరుడా .. తెలుసుకో నీ హక్కులు అన్న థీమ్  తీసుకుని ప్రచారం కల్పించడం జరిగింది. కొత్తగా 1986 హక్కుల చట్టానికి తెచ్చిన సవరణలలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏర్పాటు ప్రధామైనది. అలాగే,   కాంట్రాక్టుల్లో అక్రమాలను అరికట్టేందుకు పొంచుపరిచిన నిబంధనన అసంబద్ధ నిబంధనలకు అడ్డు కట్టవేస్తుంది.కొత్త చతంలో   నినియోగాదరుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గా మార్చారు. అలాగే. ఇంతకు  ముందు చట్టం పరిధిలో లేని, ఆన్లైన్ ప్రకటనల మోసాలను చట్టం పరిధిలోకి తీసుకు వచ్చారు. వినియోగదారులను పక్కదారి పట్టించే ఆన్లైన్ ప్రకటనలపైన 2019 చట్టం కొరడా ఝుళిపించింది. అంతే కాదు, సవరణ చట్టం, పక్కదారి పట్టించే వాణిజ్య ప్రకటనలకు చక్కని నిర్వచనం కూడా ఇచ్చింది. వస్తు సేవల తప్పుడు వర్ణన, ఒక ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి తప్పుడు హామీ, తప్పుడు గ్యారెంటీ ఇవ్వడం. వస్తు సేవల మౌలిక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి గోప్యంగా ఉంచడం, ఇలా, వినియోగదారుని తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలు చట్ట పరిధిలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. వాణిజ్య ప్రకటనల మోసాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ( సిసిపిఎ) చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్‌, టెలీషాపింగ్‌, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్‌ వివాదాలు సిసిపిఎ పరిధిలోకి వస్తాయి. అందులో భాగంగా, వాణిజ్య ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేండ్ల జైలు, రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విదేంచే అధికారం సిసిపిఎకు ఉంటుంది.  నిజానికి, గతంలో గానీ ప్రస్తుతంలో గానీ, వినియోగదారుల హక్కుల రక్షణకు చట్టాలు లేక పోవడం కంటే, ఉన్న చట్టాల గురించి వినియోగదారులకుసరైన అవగాహన లేక పోవడం వల్లనే వినియోగదారులు మరింతగా దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా చట్టాలు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతలు గురించి  తెలియక పోవడం, తెలిసినా చిన్న మొత్తాల కోసం, సమయం ‘వృధా’ చేసుకోవడం ఎందుకని, ఎవరికి వారు, చట్టం తలుపులు తట్టక పోవడం వలన, మార్కెట్ శక్తులు వినియోగదారులను తేలిగ్గా చీట్ చేస్తున్నాయని  వినియోగదారుల హక్కుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.  ఉదాహరణకు, డి మార్ట్ క్యారీ బ్యాగుల కేసునే తీసుకుంటే, డి మార్ట్   ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌- సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది.అయితే, ఒక్క డి మార్ట్ అనే కాదు, ప్రతి షాపింగ్ మాల్. క్యారీ బ్యాగ్ కు ఛార్జ్’చేస్తూనే ఉన్నాయి. ఎవరికివారు ముష్టి మూడు రూపాయలే కదా అని ఉపేక్షించడం వల్లనే, షాపింగ్ మాల్స్ కోట్లలో దోపిడీకి పాల్పడుతున్నాయని వినియోగ దారుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.  అందుకే, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మొదటి అడుగు, వినియోగదారులదే కావాలని, వినియోగదారులు కళ్ళు తెరిస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవుతుందని అంటున్నారు. నీహక్కులకు నేవే రక్ష ..నీ హక్కులు నీవే రక్షించుకో అంటున్నారు.

రేవంత్ సైకిలెక్కేస్తారా?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మళ్లీ సెకిలెక్కేయనున్నారా? తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేయడానికి తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారా? ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయా? అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ సమయంలో కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వ  పరిణామాలు కారణం. ఒకటి  ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట నిర్వహించిన సభలో  పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా తిరిగి రావొచ్చునంటూ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రెండోది తెలంగాణ కాంగ్రెస్ లో    సీనియర్లు.. జూనియర్ల రచ్చ.  కాంగ్రెస్ లో ఈ రచ్చకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డే. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే దాకా.. అడపాదడపా అసమ్మతి గళం విప్పినా ఓపికగా వేచి చూశారనే చెప్పాలి. అయితే మునుగోడు ఫలితం తరువాత సీనియర్ల అసమ్మతి గళం పెరిగింది. పీసీసీ కమిటీల నియామకంతో అది పతాక స్థాయికి చేరింది.   దీంతో ట్రబుల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్.. హుటాహుటిన హైదరాబాద్ రావడం.. ఆయనకు అంతే వేగంగా.. రేవంత్‌పై సీనియర్లు ఫిర్యాదులు చేయడం చకా చక జరిగిపోయాయి.    ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి లాంటి వారు పీసీసీ కమిటీల్లో  తమ పదవులకు రాజీనామా చేసేశారు. అంతకు ముందే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ  మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. నిజమే రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడన్న సంగతి విదితమే. అయితే ఓటుకు నోటు కేసు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తెలంగాణలో   తెలుగుదేశం క్రీయాశీలంగా లేదన్న భావనతో కాంగ్రెస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు రేవంత్ అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయన అనుమతి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. సరే మొత్తం మీద సైకిల్ దిగి ‘చేయి’ అందుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో రెడ్ కార్పెట్ వెల్ కమ్ లభించింది. ఇలా పార్టీలో చేరారో లేదో అలా టీపీసీసీ పగ్గాలు అందుకున్నారు.   కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతుకుముందు.. రేవంత్ రెడ్డి స్వయంగా అమరావతికి వెళ్లి... నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయం విదితమే. అలాగే రేవంత్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు బలంగా మారారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తరువాతే అప్పటి దాకా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.   అయితే కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చెల్లు చీటీ రాసే విషయంలో మాత్రం రేవంత్ సక్సెస్ కాలేకపోయారు.  పైపెచ్చు సీనియర్లు తన పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించడంతో రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెరాస భారాసగా రూపాంతరం చెందిన తరువాత ఆ పార్టీ ఇక సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిరోధించే అవకాశాలు లేవు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు ఖమ్మం సభ నభూతో అన్న చందంగా సక్సెస్ అయ్యింది.  ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మళ్లీ సైకిలెక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భేటీ... ఆంతర్యమేమిటి?.. సంకేతాలేమిటి?

బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఇద్దరూ రాజకీయ, సినీ  రంగాలలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న వారే. బాలకృష్ణ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే కాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఇరువురూ రాజకీయ, సినీ రంగాలలో బిజీగా ఉన్నవారే. బాలకృష్ణ సినిమాలూ, ఆన్ స్టాపబుల్ అనేషో, రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలు, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటువంటి వీరిరువురూ భేటీ అయ్యారంటే.. అది సంచలనమే. సర్వత్రా ఆసక్తి కలిగించే విషయమే. అదే జరిగింది. బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న చోటుకు పవన్ కల్యాణ్ వచ్చారు. బాలకృష్ణతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  బాలకృష్ణ ఓ పక్క అన్ స్టాపబుల్ షోతో, సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ కలవడం అనేది చాలా రేర్.   అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ వస్తారని వార్త ఇటీవల బాగా వినిపిస్తుంది. అయితే  అందులో నిజమెంతో తెలియదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బాలయ్యలు భేటీ అయ్యారు. వీరి భేటీ సినీ, రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. వీరి భేటీ వెనుక కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది.  వీరసింహారెడ్డి షూట్ లో పవన్ కళ్యాణ్ బాలయ్యని, చిత్ర యూనిట్ ని కలిసి కాసేపు మాట్లాడారు.   ఆల్ ది బెస్ట్ చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాలోని సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో పవన్ వెళ్లారు. బాలయ్య, పవన్ ల భేటీ కి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  మామూలుగా సినిమా సెట్ లో వీరు భేటీ అవ్వడమే ఇంత సెన్సేషన్ సృష్టించిందంటే.. నిజంగానే బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో  పవన్ కల్యాణ్ కనిపిస్తే మరెంత సెన్సేషన్ అవుతుందోనన్న చర్చ అటు రాజకీయ వర్గాలు, ఇటు సినిమా వర్గాలలోనూ జోరందుకుంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనవ్వను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త రాజకీయ సమీకారణాలపై చర్చకు తెరలేపిన సంగతి విదితమే. ఇప్పుడు బాలయ్య తో పవన్ బేటీ ఏపీ రాజకీయాలలో రానున్న మార్పులకు సంకేతమా అన్న చర్చ జోరందుకుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్, బాలకృష్ణలు సినీ హీరోలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. ఇద్దరూ చెరో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేత కాగా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, హిందుపురం ఎమ్మెల్యే. అంతే కాకుండా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి స్వయానా వియ్యంకుడు. ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మామ, మేనమామ కూడా. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్, బాలకృష్ణల భేటీ రాజకీయాలలో కొత్త సమీకరణాల చర్చను తెరపైకి తీసుకు వచ్చింది. 

బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు ఆధిక్యం

బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మీర్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఆరంభంలోనే ఒవర్ నైట్ బ్యాట్స్ మెన్ రాహుల్, శుభ్ మన్ గిల్ ల వికెట్లు కోల్పోయింది.  ఆ తరువాత స్వల్ప వ్యవధిలోనే పుజారా (24), కోహ్లీ (24) కూడా పెవిలియన్ బాట పట్టడంతో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా పీకలోతు కష్టాల్లో పడింది. అయితే రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొని టీమ్ ఇండియాను ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించారు. ముఖ్యంగా రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో మోదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పంత్ ఔటౌన తరువాత  టీమ్ ఇండియా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శ్రేయస్ అయ్యర్ 84 పరుగులు చేసి ఔటయ్యారు. మిగిలిన వారంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 314 పరుగుల వద్ద ముగిసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యత సాధించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్,  మెహందీ హసన్ మిరాజ్ లు చెరో నాలుగు వికెట్లూ పడగొట్టారు. 

మిలిటరీ ట్రక్కు లోయలో పడి 16 మంది దుర్మరణం

ఉత్తర సిక్కింలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన బెంగాల్ లోని ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. చైనా సరిహద్దులోని జెమా ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్నవాహనం లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు.  సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందడంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

డిగ్గీ రాజా వచ్చిన పని పూర్తయ్యిందా?

డిగ్గీ రాజా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు బయటకు దారి చూపారా? పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నచర్చను బట్టి ఔననే అన్నారు. గత మెంతో ఘన కీర్తి గలవారమని విర్రవీగుతూ ఇప్పడు పార్టీకి గుదిబండగా మారుతామంటూ చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఒకింత  కఠినంగానే సీనియర్లకు చెప్పేశారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.   రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభాన్ని నివారించడానికి అధిష్ఠానం దూతగా వచ్చిన దిగ్విజయ్.. పార్టీ నేతలతో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎటువంటి మొహమాటాలకూ తావులేకుండా పార్టీలో సీనియర్లు, జూనియర్లూ అన్నతేడాలేవీ ఉండవని కుండ బద్దలు కొట్టేశారు. ఎవరు పార్టీ కోసం.. పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తారో వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తమ గత ఘనతల భుజకీర్తులతో పని చేయకుండా అందలాలు అందుకుందామనుకునే వారికి స్థానం లేదని చెప్పకనే చెప్పేశారు. ఒక రకంగా తమ సీనియారిటీకి తగిన గుర్తింపు లేకుండా పోయిందని మధన పడుతూ అసమ్మతి రాగాలు ఆలపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు దిగ్విజయ్ సింగ్ ఒక రకంగా మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టినప్పటి నుంచీ ఆయనకు సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురౌతూనే వస్తోంది. తొలి రోజులలో అందరినీ కలుపుకు పోవడానికి తన వంతు ప్రయత్నాలు చేసిన రేవంత్ తర్వాత తర్వాత తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పరుచుకుని తన పని తాను చేసుకుంటూ పోవడం ప్రారంభించారు. సీనియర్లను, వారి విమర్శలను, వారి ధిక్కారాన్ని, అసంతృప్తిని, అసమ్మతిని పెద్దగా ఖాతరు చేయడం మానేశారు. దీంతో మరింత గా  రగిలిపోతున్న సీనియర్లకు   తాజా పీసీసీ కమిటీల నియామకం.. తమ అసమ్మతిని బహిరంగం చేయడానికి ఒక అస్త్రంగా దొరికింది. తమకు గుర్తింపు లేకుండా పోయిందంటూ సీనియర్లు రేవంత్ పై విమర్శల దాడి పెంచడంతో రేవంత్ వర్గీయులు కూడా ప్రతి విమర్శలు చేయడమే కాకుండా పీసీసీ కమిటీలలో తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడినట్లైంది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా రాష్ట్ర కాంగ్రెస్ లో సంక్షోభ నివారణ కోసం ట్రబుల్ షూటర్ గా అధిష్ఠానం ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతోనే పనిలోకి దిగిపోయిన ఆయన సీనియర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న కాన్సెప్ట్ లేదనీ, అందరూ సమానమేననీ కుండ బద్దలు కొట్టేశారు. గతంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా పని చేసిన డిగ్గి రాజాకు రాష్ట్ర కాంగ్రెస్ నేతల అందరి వ్యవహారాలు పూర్తిగా తెలుసు. గతంలో ఆయనతో విభేదించిన వారిలో పలువురు ఇప్పుడు సీనియర్లుగా అసమ్మతి రాగం ఆలపిస్తున్న వారిలో ఉన్నారు. అందుకే డిగ్గీ రాజా రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారకుడిగా వస్తున్నారనగానే వారిలో చాలా మంది బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.   సంక్షోభ నివారణకు ప్రయత్నాలు అంటూ ఆయన సీనియర్లకు పార్టీ హైకమాండ్ కు అన్నీ తెలుసునని స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసే వారికే పదవులూ, గుర్తింపు అని తేల్చేశారు. ఒక విధంగా  ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితే కొనసాగుతుందని  చెప్పకనే చెప్పేసి బంతిని సీనియర్ల కోర్టులో వేశారు. ఇక తేల్చుకోవలసింది సీనియర్లే అని తన చేతులు దులిపేసుకున్నారు.   దిగ్విజయ్ సింగ్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరితోనూ ముఖాముఖి సమావేవం అయ్యారు. వాళ్లు చెప్పినదంతా విన్నారు. చివరకు తన మాట ఏమిటో చెప్పేసి ఇక నిర్ణయించుకోవలసింది మీరే అన్నారు. దీంతో సీనియర్ల భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

రౌండప్ 2022 ఈ ఏడాది ఏం జరిగింది?

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. జనవరి 1   2022 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.   జనవరి 4   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు.  జనవరి 5  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  జనవరి 15 సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు. జనవరి 20  బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు.  జనవరి 23  నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు.  జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు. జనవరి 31  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి  జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు.  ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు.  అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.   ఫిబ్రవరి 6:   ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. మార్చి తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.  మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.   యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.  మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది. ఏప్రిల్ ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్,  హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో  చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని  తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది. ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్  డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో  పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ  కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు.  తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి  జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు.  ఏప్రిల్ 11  తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు  సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని  సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.   ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు.  ఏప్రిల్ 14  ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన  ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు.  ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు. ఏప్రిల్ 24  ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో  పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు.  ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు. మే నెల వివరాలు రేపు