ఆర్5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునకు  సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు పేదలకు ఉందని  సుప్రీం పేర్కొంది. చట్ట ప్రకారమే 5 శాతం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు చెందిన వారికి ఇళ్ల స్థలాలివ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది.  సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53.1డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తన ఉత్తర్వులలో  పేర్కొంది.   అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో  జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (మే 17) విచారించింది. 

కోట్లు కుమ్మరిస్తున్న కేసీఆర్..!

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం  ఇండియా. అలాంటి దేశంలో ఎంతగా ప్రచారం చేసుకోంటే.. అంతగా ఎన్నికల్లో గెలుస్తామనే ఓ విధమైన భావన రాజకీయ పార్టీల్లో  బలంగా ఉంది. తాజాగా అటువంటి ప్రయత్నానికి  తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ తెర తీసింది. జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి  21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఆపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను  ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.  ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా..  ప్రచారం చేసేందుకు దేశంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయిలు వెచ్చించనుంది.  అందుకోసం దాదాపు 200 కోట్ల రూపాయిలను ప్రభుత్వం కేటాయించింది.. అందులో 70 కోట్ల రూపాయిలు ప్రచారానికి వినియోగించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ఠయాన్ని విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అంతే కాదు ప్రజల సొమ్ముతో   ప్రభుత్వం పండగ చేసుకొంటోందని విమర్శలు సంధిస్తున్నాయి.  మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలి రెండేళ్లలో ఆవిర్భావ ఉత్సవాల పేరిట కేసీఆర్ సర్కార్ చేసిన హడావుడి కనిపించినప్పటికీ ఆ తర్వాత ఆ వేడుకలను నామ్ కే వాస్తే అన్నట్లుగా నిర్వహించారు.. అయితే తొలి రెండేళ్లలో 5 రోజులు, ఆ తర్వాత వాటిని మూడు రోజులకు కుదించారని.. అనంతరం ఆ వేడుకలను ఒక రోజుకు  పరిమితం చేసి..   మమ అనిపించిందని  విపక్షాలు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నాయి.  అయితే ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావడంతో..  21 రోజులు పాటు రాష్ట్ర ఆవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది..  ఈ నిర్ణయం పై రాజకీయ పార్టీలలోనే కాదు.. సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  రాష్ట్ర అవతరణ దితోత్సవ వేడుకల కోసం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్..మొత్తం 33 జిల్లాలకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయిల నిధులు కేటాయించారనే వార్త సైతం హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని.. భారీగా డాక్యుమెంటరీలు సైతం నిర్మిస్తున్నారని తెలుస్తోంది.  అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతోపాటు ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో గెలవడం కోసం కేసీఆర్ ప్రచారార్భాటాన్ని పీక్స్ కు తీసుకెడుతున్నారన్న విమర్శలూ, వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీకి అక్కడి ఓటర్లు గట్టిగానే షాక్ ఇచ్చారు. అలాగే తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ , కాసాని జ్జానేశ్వర్ నేతృత్వంలోని టీటీడీపీ సైతం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ మరో  సారి అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ఏటికి ఎదురీదక తప్పని పరిస్థితులు ఉన్నాయి. 

మమత, అఖిలేష్ స్వరం మారింది.. ఆదే దారిలో మరింత మంది!

తెలుగువన్ చెప్పినట్లే జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం జాతీయ స్థాయిలో సమీకరణాలు మార్చేస్తుందని తెలుగువన్ సరిగ్గా అంచనా వేసింది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం బీజేపీయేతర పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుకు కింద ఐక్యతారాగం ఆలపించేందుకు ప్రేరేపిస్తుందని తెలుగువన్ ముందుగానే చెప్పింది. ఆ విధంగానే కర్నాటక ఫలితం వచ్చిన రెండో రోజు నుంచే  విపక్షాల ఐక్యతారాగంలో మార్పు కనిపించింది. క ర్నాటక ఫలితానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ వచ్చిన పార్టీలు.. కాంగ్రెస్సేతర అనే మాటను వెనక్కు తీసుకున్నాయి. బీజేపీయేతర కూటమి అంటూ తమ గొంతు సవరించుకున్నాయి. ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అంతకు ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ చెవినిల్లు కట్లుకుని ప్రచారం చేసిన మమతా బెనర్జీ కర్నాటక ఫలితంతో స్వరం మార్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ను గద్దె దించాలంటే కాంగ్రెస్ సహకారం తప్పని సరి అని గుర్తించారు. ఇప్పటికే యూపీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ వెనుక చేరడానికి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేశారు. ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు కలిపారు. మమతా బెనర్జీ అభిప్రాయంతో తాను వంద శాతం ఏకీభవిస్తున్నానని ప్రకటించారు.  2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. బిహార్, తెలంగాణ ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, కేసీఆర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట ఆ పార్టీకే మద్దతిస్తామని మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ సంతృప్తికర విజయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆ పార్టీ అటు ప్రజలతో పాటు..ఇటు తోటి ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఓ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫలితంగానే ఇది సాధ్యపడిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. 2024  సార్వత్రిక ఎన్నికలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పెరుగుతున్న  గ్రాఫ్ ఓ మంచి టానిక్కులా పని చేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ దినోత్సవం మే 17

పురాణాల్లో సమాచారం చేరవేతకు మేఘ సందేశాలు, హనుమంతుడు, నారదుడు, హంస, పావురాళ్లు...  ఆ తర్వాత  ఉత్తరాలు.. టెలిగ్రాములు, నెక్ట్స్ ల్యాండ్ లైన్లు.. ఇటీవల ఇంటర్నెట్ కనెక్షన్లు.. తాజాగా సెల్ ఫోన్లు..  4జీలు, 5 జీలు అంతా సమాచార యుగం.  గతంలో సమాచారం ఒకరి నుంచి మరొకరికి చేరాలంటే.. . ఏళ్లూ పూళ్లూ పట్టేది. ఆ తరువాత క్రమంగా  నెలలు, పక్షాలు, వారాలు, రోజులు నుంచి గంటలు, నిమిషాలు.. చివరకు సెకన్లకు చేరుకొంది.  దీంతో ప్రపంచంలోని సమాచారమంతా ఆ మూల నుంచి ఈ మూల వరకూ ఇప్పుడు సెకన్లలో చేరిపోతోంది. దీంతో సమాచార యుగంలో సమాచార ప్రసారం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థమైపోతోంది. మే 17వ తేదీ.. ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం.  2005 నుండి ప్రతి సంవత్సరం మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా పాటిస్తు వస్తున్నారు.  తొలుత అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ కన్వెన్షన్‌పై 1865 మే 17న పారిస్‌లో సంతకం చేశారు. 1969, మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. ఆ క్రమంలో తొలిసారి సంతకం చేసిన మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నారు.  అయితే దీన్ని ప్రాముఖ్యతను యావత్‌ ప్రపంచ దేశాలు గుర్తించాలని 2005లో ట్యూనిస్‌లోని ఇన్ఫర్మేషన్‌ సొసైటీ శిఖరాగ్ర సమావేశంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య తీర్మానాన్ని ప్రకటించింది. ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో భారత్ రెండవ అతి పెద్ద దేశంగా అవతరించింది.  మరోవైపు.. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. దేశా ఆర్థిక పరిపుష్టికి   సమాచార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. సెల్ ఫోన్ తయారీ నుంచి వాటి విడి భాగాలు ఇతర దేశాలకు ఎగుమతి వరకు చైనాతో పోటీ పడుతోంది. అలాగే నగదు లావాదేవిలు, అన్‌లైన్ సేవలు, వగైరా వగైరా అన్ని సెల్ ఫోన్ కేంద్రంగానే సాగుతోన్నాయి. అంతేకాదు.. సెల్ ఫోన్ రీచార్జ్‌ల పేరుతో అటు పలు నెట్ వర్క్ కంపెనీలకు ఇటు ప్రభుత్వానికి సైతం భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఈ టెలికమ్యూనికేషన్స్ రంగం వెన్నుదన్నుగా నిలుస్తోందనడంలో  ఎటువంటి సందేహం లేదు.       మరోవైపు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్‌పై ప్రభుత్వం అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు సైతం చేపడుతోంది. నవంబర్ 2006లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ మే 17ను ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రపంచ కమ్యూనికేషన్ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఇంటర్నెట్ గురించి సానుకూలతను వ్యాప్తి చేయడం. అదే విధంగా ప్రపంచ టెలికమ్యూనికేషన్ డే అనేది మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సమాచారం అందుబాటులోకి తీసుకురావడమే.

కర్నాటక సీఎం సిద్దరామయ్యే!

కర్నాటక ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారన్న విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యనే కాంగ్రెస్ అధిషఠానం కర్నాటక ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా సంపూర్ణ మెజారిటీ సాధించిన అనంతరం.. ముఖ్యమంత్రి ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు సిద్దరామయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని విధాలుగా పార్టీని పటిష్టం చేసేందుకు ఎంతో కష్టపడటమే కాకుండా.. బీజేపీ సర్కార్ కేసులతో వేధించినా, అరెస్టు చేసినా తట్టుకుని నిలబడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారు. సోనియాగాంధీకి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని గిఫ్ట్ గా ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ఒంటి చేత్తో స్క్రిప్ట్ చేశారని చెప్పవచ్చనే విధంగా ఆయన పని చేశారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలు కావడంలోనూ.. అంచనాలకు సైతం అందనంతగా కాంగ్రెస్ ఘన విజయం సాధించడంలోనూ డీకే శివకుమార్ ది కీలక పాత్ర.  అయినా ఆయనకు సీఎం పదవి అందని ద్రాక్షగా మిగలడానికి ప్రధాన కారణం  బీజేపీ వ్యూహాత్మకంగా గతంలో ఆయనపై పెట్టిన కేసులు, జరుగుతున్న సీబీఐ దర్యాప్తే కారణమని అంటున్నారు. కర్నాటక ఎన్నికలలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారకుడైన డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టే విధంగా క మలం పార్టీ అధిష్ఠానం పావులు కదిపింది.   సీబీఐ కొత్త బాస్ గా ప్రణీత్ సూద్ ను కేంద్రం నియమించింది. కేంద్రం ఈ మూవ్ డీకే శివకుమార్ ను ఇరుకున పెట్టడానికేనని అంటున్నారు. కర్నాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ ను సీబీఐ చీఫ్ గా నియమించడంతో డీకే శివకుమార్ పై బీజేపీ బనాయించిన అవినీతి కేసుల దర్యాప్తును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో.. ఆయనపై అరెస్టు కత్తి వేలాడుతున్నట్లైంది. దీంతో  కాంగ్రెస్ అధిష్ఠానం డీకేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు ముందు వెనుకలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎంగా ఎంపిక చేసి పదవి కట్టబెట్టినా.. కేసుల కారణంగా ఆయన పదవి నుంచి తప్పుకునే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్న భావనతో సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపింది.   

సుప్రీంలో అవినాష్ కు ఎదురుదెబ్బ

వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూ గుడుగుడు గుంచం గుండే రాగం అన్నట్లుగా తిరుగుతోంది. సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ అరెస్టు వ్యవహారంలో ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  తాజాగా   తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. అయితే అవినాష్ కు సుప్రీం కోర్టులో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమని భావిస్తే లిఖిత పూర్వకంగా  అభ్యర్థించాలని, దానిని బట్టి తాము విచారణ తేదీని ఖరారు చేస్తామనీ సుప్రీం స్పష్టం చేసింది.   అదలా ఉంటే మంగళవారం విచారణకు హాజరు కావాల్సిన వివేకా పార్టీ కార్యక్రమాలు ఉన్నందున నాలుగు రోజులు వ్యవధి కావాలని కోరితే.. సీబీఐ రెండో ఆలోచన లేకుండా మూడు రోజులు గడువు ఇచ్చింది.  ఆ వెంటనే ఆయన బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉన్న ముందస్తు బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వెంటనే తేల్చేలా ఆదేశాలివ్వాని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించారు.   తన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ సుప్రీం పరిశీలనలో ఉండడం వల్ల త్వరగా విచారణ జరగడం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్న అవినాష్ రెడ్డి వెకేషన్ కోర్టులో  తన ముందస్తు బెయిల్ విచారణ ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని.. అప్పటివరకు సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలనీ కోరారు. అదే సమయంలో  19న విచారణకు రావాలన్న సీబీఐ నోటీసుకు సమాధానమిస్తూ హాజరౌతానని పేర్కొన్నారు.   ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పి  సుప్రీంను ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. అవినాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఏ నిర్ణయం వెలువరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.  అదలా ఉంచితే.. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకున్న ప్రతిసారీ.. జగన్ రియాక్షన్ ఏలా ఉంటోందన్న విషయంలో సామాన్య జనమే కాదు పరిశీలకులు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వ్యవధి కోరారు. దాదాపుగా అదే సమయంలో జగన్ హస్తిన షెడ్యూల్ ఖరారైంది. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఢిల్లీ వెడుతున్నారు. ఆ సమావేశం ఈ నెల 27న కాగా జగన్ మాత్రం ఒక రోజు ముందు అంటే 26వ తేదీ నాటికే ఢిల్లీ చేరుకుంటారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీతో భేటీ అవుతారని చెబుతున్నారు. సాధారణంగా ఈ నాలుగేళ్లలో జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భాలు లే వు. విత్త మంత్రి బుగ్గనే జగన్ తరఫున ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. అలాంటిది ఈ సారి బుగ్గనను వద్దని జగన్ స్వయంగా వెళుతున్నారు. ఆయన పర్యటన లక్ష్యం నీతి ఆయోగ్ సమావేశం కాదనీ, తన బాబాయ్ హత్య కేసులో తమ పార్టీ ఎంపీని చిక్కుల నుంచి తప్పించడానికేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ హస్తిన పర్యటన పూర్తయ్యే వరకూ తన అరెస్టును నిలువరించుకునేందుకే అవినాష్.. మరోసారి సుప్రీంను ఆశ్రయించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇప్పటికే ఇదే ముందంస్తు బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా తమ అభిప్రాయాలను చెప్పేశాయి. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఎటువంటి ప్రతిబంధకాలూ లేవని విస్పష్టంగా చెప్పేసింది. అంతకు ముందు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టి వేయడమే కాకుండా ఇలాంటి ఆదేశాలు కూడా ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. దీంతో అవినాష్ ఇప్పుడు తాజాగా సుప్రీంను తన ముందస్తు బెయిలు పిటిషన్ ను త్వరగా విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ సుప్రీం ను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే సుప్రీంలో ఆయనకు ఊరట లభించకుండటంతో ఇక అరెస్టు అనివార్యం అన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. 

దశలవారీ మద్య నిషేధం దిశగా తొలి అడుగు!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి నాలుగేళ్లయినా.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం ఎంత సుందర ముదనష్టంగా అమలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మద్య నిషేధం మాట అటుంచి దిక్కుమాలిన జే బ్రాండ్ ల పేరుతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకున్నారు. అంటే జగన్ గత ఎన్నికల ముందు చేసిన దశల వారీ మద్య నిషేధం అన్నది ఒక బూటకపు హామీ అన్నది తేటతెల్లమైపోతుంది. పైపెచ్చు మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచేయడం ద్వారా ప్రజలలో మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ.. కొత్త కొత్త భాష్యాలు కూడా చెప్పారు. కాగా పొరుగున ఉన్న తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని స్టాలిన్ సర్కార్ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలకు కూడా ఉపక్రమించింది.  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జూన్‌ 3న కరుణానిథి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. తొలివిడతగా 500  దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు  ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూత పడతాయని తెలుస్తోంది. అదే విధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం వాగ్దానం చేసి నాలుగేళ్లయినా మద్యం వినియోగం పెంచడమెలా అన్న ప్రణాళికలతో జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని కూడా ఫణంగా పెడుతోంది. 

గాజు గ్లాసు పవన్ చేజారిందా?

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2019లో ఆ పార్టీకి అధికారికంగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఉపసంహరించుకుంది. ఈ సారి గాజు గ్లాస్ చిహ్నాన్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడం ద్వారా జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. ఏపీ నుంచి రెండు పార్టీలు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గుర్తింపు పొందిన పార్టీలుగా ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అవి అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీలు. దీంతో ఆ రెండు పార్టీల ఎన్నికల చిహ్నాలైన ఫ్యాన్, సైకిల్ గుర్తులను ఈసీ రిజర్వ్ చేసింది. అదే సమయంలో అధికారిక గుర్తింపు పొందని జనసేనకు గత ఎన్నికల సమయంలో కేటాయించిన గ్లాసు చిహ్నాన్ని ఈ సారి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది.  2019 ఎన్నికలలో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ జనసేనకు తమ పార్టీకే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీని కోరే అవకాశం మాత్రం ఉంది.  గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని జనసేన కోరుకునేందుకు వెసులుబాటు ఉంది. అందుకు ఈసీ ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.  అయితే.. ఇక్కడో చిక్కు ఉంది. అలా కోరాలంటే జనసేన రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ పోటీలో ఉండాల్సి ఉంటుంది. అయితే జనసేన, తెలుగుదేశంతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలలోనే పోటీ చేసే అవకాశాలు ఉండటంతో.. జనసేన పోటీలో లేని నియోజకవర్గాలలో గాజు గ్లాసు సింబల్ ను స్వతంత్రులెవరైనా కోరితే.. అక్కడ వారి విజ్ణప్తిని ఈసీ తిరస్కరించే అవకాశం ఉండదు. అంటే జనసేన పోటీ చేసే స్థానాలలో ఈ పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఈసీ కేటాయించినా, ఆ పార్టీ పోటీలేని నియోజకవర్గాలలో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఓటర్లలో ఒకింత అయోమయం ఏర్పడేందుకు వీలుంటుంది. అంటే తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన సందర్భం ఉంటే ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అంతిమంగా తెలుగుదేశం, జనసేనకు నష్టం చేకూరుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వివేకా హత్యకేసు.. సీబీఐ దర్యాప్తులో వేగం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి సొంత బబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తులో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన సీబీఐ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో మంగళవారం పులివెందుల్లోని కడప ఎంపీ  అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి కారు డ్రైవర్‌కు నోటీసులు అందించినట్లు సమచారం.  మరో వైపు మే 16వ తేదీ హైదరాబాద్‌ కోఠిలోని తమ కార్యాలయానికి రావాలని సోమవారం  అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు వాట్సప్‌లో నోటీసులు పంపారు.  దీంతో మంగళవారం సీబీఐ విచారణకు ఆయన హాజరవుతారని అంతా భావించారు. కానీ తనకు ముందుగా షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని..   తనకు విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల గడువు కావాలని సీబీఐ అధికారులను ఆయన కోరారు. తొలుత అందుకు నిరాకరించిన సీబీఐ మళ్లీ ఏమనుకుందో ఏమో మే 19న  గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ అంతలోనే మళ్లీ సీబీఐ అధికారులు .. పులివెందుల్లోని అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి కడప జిల్లా వాసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.   మరోవైపు  వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ... వివేకా రాసినట్లుగా చెబుతున్న  లేఖను ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి దాచిపెట్టమన్నారంటూ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో సదరు లేఖపై సీబీఐ ప్రస్తుతం దృష్టి సారించింది. ఆ క్రమంలో సదరు లేఖపై వేలిముద్రలు ఎవరెవరివో శోధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఆ వేలి ముద్రలు ఎవరివో గుర్తించేందుకు నిన్ హైడ్రేట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, నిందితుల అభిప్రాయాలను కోరింది. దీంతో జూన్ 2వ తేదీన ఈ అంశంపై విచారించే అవకాశం ఉందని సమాచారం.   అయితే వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఇక అనివార్యమనే  ఓ చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో నడుస్తోంది.  ఎందుకంటే  ఇప్పటికే ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆ వెంటనే వైయస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయిపోతారని అంతా భావించారు. చివరకు తాను కూడా అరెస్ట్ అయిపోతానని గ్రహించిన అవినాష్ రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.   అలాంటి పరిస్థితుల్లో   అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. తమదైన శైలిలో అటు అవినాష్ రెడ్డి, ఇటు ఆయన తండ్రి వైయస్ భాసరరెడ్డి, ఇంకోవైపు ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రధారులందరినీ విచారించి.. ఈ హత్య కేసు విచారణకు ముగింపు పలికే దిశగా సీబీఐ అడుగులు వేస్తోందనే చర్చ సైతం ఉమ్మడి కడప జిల్లాలో కొన... సాగుతోంది.

మేం నిషేధించలేదు.. వాళ్లే ఎత్తేశారు!

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ది కేరళ స్టోరీ చిత్రాన్ని పలు రాష్ట్రాలు ప్రదర్శించనీయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు తమ చిత్రాన్ని నిషేధించడాన్ని వారు సవాల్ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం చేసిన వాదన ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని తాము నిషేధించలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ది కేరళ స్టోరీ చిత్రాన్ని తాము తమిళనాడులో నిషేధించలేదని, పేలవ స్పందన కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు  ఆ సినిమాను ప్రదర్శించకుండా ఎత్తేశాయని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింది. సినిమాలో పెద్ద స్టార్లెవరూ లేకపోవడం, పేలవ స్పందన కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని వెల్లడించింది. బాక్సాఫీస్ కలెక్షన్లు లేకుండా సినిమాను థియేటర్లు మాత్రం ఎలా ఆడిస్తాయని ప్రభుత్వం ప్రశ్నించింది. ది కేరళ స్టోరీ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో ఆ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యజమానులు నిర్ణయించుకుంటే తాము మాత్రం ఏం చేస్తామని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మల్టీప్లెక్స్ యజమానులు సినిమాపై వచ్చిన విమర్శలు, ప్రముఖ నటులు లేకపోవడంతో కలెక్షన్లు లేక మే 7 నుండి సినిమా ప్రదర్శనను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో హిందీలో ఈ చిత్రం 19 మల్టీప్లెక్స్‌లలో మే 5న విడుదలైంది. సినిమాను ఉపసంహరించుకోవాలన్న థియేటర్ల యాజమాన్యాల నిర్ణయంపై ఎలాంటి నియంత్రణ లేదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మే 5న సినిమా విడుదలపై ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధిస్తోందని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా చిత్రనిర్మాతలు సినిమాకు ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నారని స్టాలిన్ సర్కార్ ఆరోపించింది. తద్వారా సుప్రీంకోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం సినిమాని నిషేధించిందన్న ఆరోపణకు మద్దతుగా నిర్మాతలు ఒక్క చిన్న రుజువును కూడా సమర్పించలేదని అదనపు డీజీ గుర్తుచేశారు. ది కేరళ స్టోరీ ని విదేశాలలో నిషేధించారు. ఇది ఫేక్ స్టోరీ అని, గొడవలకు దారి తీసేదిగా ఉందంటూ పలు దేశాలు సిన్మాను తమ దేశంలో విడుదల కాకుండా నిషేధించాయి.  ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సిన్మా ఉందని.. ఈ సిన్మాతో బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఆ 40 మంది జడ్జీల పదోన్నతులను రద్దు!

గుజరాత్ లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవ హారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 68 మంది జడ్జీలకు ఇచ్చిన పదో న్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికిచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. మిగిలిన ఏడుగురు న్యాయమూర్తుల విషయాన్ని వెల్లడించలేదు. ఈ నెల 12న జస్టిస్ ఎం.ఆర్.షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై  స్టే విధించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్ భాయ్ వర్మకు ఇచ్చిన పదోన్నతిని మాత్రం హైకోర్టు కొనసాగించింది. అయితే, తొలుత ఆయనకు రాజ్కోట్ లోని 16వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పోస్టింగ్ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా నియమించింది. సుప్రీంకోర్టు గుజరాత్ లో వివాదాస్పదమైన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంపై జులైలో విచా రణ జరిపేందుకు అంగీకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నర సింహ, జస్టిస్ జె. బి. పార్దీవాలతో కూడిన ధర్మా సనం తెలిపింది. ప్రతిభ, సీనియారిటీ ఆధారం గానే పదోన్నతి కల్పించా లన్న సర్వీసు నిబంధన లను గుజరాత్ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్ ఎం. ఆర్.షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న జడ్డీల పదోన్నతలుపై స్టే విధించిన సంగతి తెలిసింేద. ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.   జస్టిస్ ఎం.ఆర్. షా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే, పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పిదమేమీ లేకున్నా అవమానాలకు గురి కావాల్సి వచ్చిందంటూ కొందరు జడ్జీలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును జులైలో విచారణకు చేపడతామని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించిన న్యాయమూర్తికి పదోన్నతి కలిపించడం  ఇప్పటికే వివాదాస్పద అంశంగా మారిన నేపథ్యంలో.. ఆయనకు పదోన్నతి స్తంభన విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలతో పాటు న్యాయస్థానాలు కూడా ప్రభావితం అవుతున్నాయనే విమర్శలు వస్తున్న తరుణంలో... తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలమేర గుజరాత్ హైకోర్టు నిర్ణయం హర్షించదగినదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పరిధిమీరొద్దు.. అనుచిత దూకుడు వద్దు.. ఈడీకి సుప్రీం సూచన

రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న దురుద్దేశంతో పాటు రాజ కీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా మనీలాండరింగ్ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ ఛత్తీస్ గఢ్  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టు స్పందించింది. భయోత్పాత వాతావరణాన్ని సృష్టించకండి. మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే నిజాయితీగా జరిగిన లావాదేవీలపై కూడా అనుమా నాలు తలెత్తుతాయంటూ జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా ధర్మాసనం ఈడీ అధికారులకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు విని పిస్తూ.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభు త్వాన్ని మద్యం కుంభకోణం కేసులో ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దే శంతో రాష్ట్ర అధికారులపై ఈడీ తీవ్ర ఒత్తిడి తెస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించి తాము చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వా లంటోందని, దీంతో అధికారులు ఛత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖలో పనిచేయబోమని ప్రభుత్వానికి చెబుతున్నారని ధర్మాసనానికి విన్నవించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈడీ దూకుడు పెంచిందని ఆయన ఆరోపించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. 2019-2022 మధ్య కాలంలో మద్యం వ్యాపారంలో రూ.2వేల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని ధర్మాసనానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తోందని గత నెలలో సుప్రీంకోర్టును ఛత్తీస్ గఢ్    ఆశ్రయించిన సంగతి విదితమే. మనీలాండరింగ్ చట్టంలోని పలు నిబంధనల చెల్లుబాటును ఆ పిటిషన్ లో సవాల్ చేసింది. కేంద్రం కనుసన్నలలో దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయనీ,  బీజేపీయేతర ప్రభుత్వాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాయని గత కొంత కాలంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉత్తరాంద్రలో చంద్రబాబు

వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తమదైన శైలిలో పోరాడుతోంది. ఆ క్రమంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు తదితర కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.  ఆ క్రమంలో తాజాగా అంటే బుధవారం (మే 17) నుంచి శుక్రవారం (మే19)  వరకు చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అందులోభాగంగా బుధవారం పెందుర్తి.. గురువారం శృంగవరపు కోట.. శుక్రవారం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని.. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.   అందుకోసం చంద్రబాబు నాయుడు బుధవారం (మే17) మద్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొంటారు. అక్కడి నుంచి సాయంత్రం పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణానికి చేరుకొని పంచ గ్రామాల సమస్యపై వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డ్ షో ప్రారంభమవుతోంది... ఆ క్రమంలో పెందుర్తి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు  ప్రసంగిస్తారు. ఇక గురువారం (మే 18) ఉదయం టిడ్కో ఇళ్ల లబ్దిదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించి... ఆ తర్వాత స్థానిక నేతలతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం మత్స్యకారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శృంగవరపు కోటకు చంద్రబాబు పయనమై.. అక్కడ రోడ్డు షో నిర్వహించి   స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.    అలాగే శుక్రవారం (మే 19)  అనకాపల్లిలో నల్లబెల్లం రైతుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరిస్తారు. అనంతంర రోడ్ షో నిర్వహించిన ఆ తర్వాత స్థానిక నెహ్రూ చౌక్‌కు చేరుకొని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకుంటారు.

నెల్లూరు వైసీపీలో మళ్లీ మొదలైంది!

ఏమిటో... అదేమిటో ఈ అధికార ఫ్యాన్ పార్టీలో బాబాయి.. అబ్బాయిల గోల అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉందని.. ఇలా అయితే పార్టీ పరిస్థితి గాలిలో దీపంలా తయారవుతోందని అధికార వైసీపీలోని ఓ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయి నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య విబేధాలు తలెత్తి... అవి తార స్థాయికి చేరడం... దీంతో ఈ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి  జగన్ వద్దకు చేరడం.. రెండు రోజుల క్రితం ఆ బాబాయి, అబ్బాయిలను.. తన వద్దకు పిలుపించుకొని... ఇద్దరి చేతులు కలిపి... విబేధాలు వదిలేయాలి.. పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించినట్లు ఓ టాక్  వైరల్ అవుతోంది.    అయితే నెల్లూరు నగర ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ ఎన్నికైనా..  మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినా.. నియోజవర్గంలో పార్టీ పరంగా అబ్బాయి అనిల్ తరఫున అన్నీ బాబాయి రూప్ కుమార్ యాదవే చక్కదిద్దే వారని.. కానీ ఆయన నెల్లూరు నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి.. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించి.. బాబాయిని దూరంగా ఉంచే ప్రయత్నాలు అబ్బాయి చేశారని.. అయితే తాజాగా రూప్‌కుమార్ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకొని.. రాజకీయం చేయడంతో... ఈ బాబాయి అబ్బాయిల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అంతేకాదు బాబాయితో కలిసేదే లేదు.. కావాలంటే పార్టీకి రాజీనామా చేయడానికైనా సిద్దమని సాక్షాత్తూ అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించినట్లు ఓ వార్త అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పెన్నా నదీ తీర నగరంలో మళ్లీ గోల మొదలనే   చర్చ పార్టీలో జోరందుకుంది.   మరోవైపు ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సాగనంపి.. ఆ నియోజకవర్గంలో కొత్త ఇన్ చార్జ్‌లను నియమించి.. పార్టీ పరిస్థితిని స్థానికంగా చక్కదిద్దే కార్యక్రమానికి పార్టీ అధిష్ఠానం శ్రీకారం చుట్టిందని... అంతలోనే మళ్లీ అదే జిల్లాలో మరో పితలాటకం   చోటు చేసుకోవడం చూస్తుంటే.. ఈ సారి జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బ తప్పదనే అభిప్రాయాం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇంకో వైపు ముఖ్యమంత్రి  జగన్ సొంత బాబాయి  వివేకా హత్య కేసులో అబ్బాయి పాత్రపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఆ క్రమంలో ఇప్పటికే కడప ఎంపీ, సీఎం   జగన్ సోదరుడు  అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారని..  ఇప్పటికే వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించిందని.. అయితే ఈ కేసులో రేపో మాపో కడప ఎంపీ   అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమౌతోంది. ఆ తర్వాత ఈ హత్య కేసులో అసలు సిసలు సూత్రధారులు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ సైతం పార్టీ వర్గాల్లోనే నడుస్తోంది. అదీకాక ఎన్నికల సమీపిస్తున్నాయి.ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం అసన్నమైంది. అలాంటి వేళ ఈ బాబాయి అబ్బాయిల గోల.. పార్టీ పుట్టి ముంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని... చర్చ   వాడి వేడిగా సాగుతోంది.

వివేకా హత్య కేసులో మళ్లీ అదే వరస

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక అంశంగా మారిన వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా నలభై మలుపులు తిరిగింది. ఇంకా తిరుగుతూనే ఉంది. విచారణ ఏ రాష్ట్రంలో జరగాలి, ఎవరు విచారణాధికారిగా ఉండాలి, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేయాలి, ఎవరిని విచారించాలి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నాయి.   తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టులు కలగజేసుకోవాల్సి వచ్చింది.  ఇంత ప్రాముఖ్యత ఉన్న  కేసు ఇటీవలి కాలంలో లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంతగా ప్రభావితం చేస్తున్న వివేకా కేసు కర్నాటక ఎన్నికల తరువాత కొత్త కోణం తీసుకోనుందని తెలుస్తోంది. న్యాయస్థానాలు విధించిన గడువు జూన్ 30వ తేదీతో ముగియనుండడంతో సీబీఐ దూకుడు పెంచింది. ఈ సారి విచారణను సమగ్రంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని రంగంలోకి దించింది. కడప జిల్లాలో, పులివెందుల పట్టణంలో దాదాపు ప్రతి వ్యక్తిని సీబీఐ పలకరించింది. 2019 మార్చి4 15వ తేదీ జరిగిన వివేకా హత్యపై స్థానికులు అందించిన సమాచారాన్ని సీబీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వివేకా వాచ్ మెన్ నుండి, అవినాష్ రెడ్డి వ రకూ ఎవరినీ వదలకుండా సాక్ష్యాలు సేకరిస్తోంది.  తాజాగా విచారణకు హాజరు కావాలన్న నోటీసుపై అవినాష్ రెడ్డి వాయిదా కోరడంతో తిరిగిా 19వ తేదీన హాజరు కావాల్సిందిగా తిరిగి నోటీసులు జారీ చేసింది. గతంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ ను సీబీఐ విచారించింది. తాజాగా అవినాష్ విచారణకు గడువు కోరడంతో సీబీఐ మరోసారి సునీత, రాజశేఖర్ లను విచారణకు రావాల్సిందిగా పిలిచింది. వివేకా హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని విచారించేందుకు కేసుకు  సంబంధించిన ఏ చిన్న క్లూను కూడా సీబీఐ వదలడం లేదనే చెప్పాలి. రాజకీయంగా  అత్యంత ప్రాధాన్యత ఉండటంతో  అవినాష్ ను అరెస్టు చేస్తే జరిగే పరిణామాలను కూడా సీబీఐ పరిశీలిస్తోంది. ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసేందుకు న్యాయ సంబంధమైన అవరోధాలు లేకపోయినప్పటికీ కేసు ప్రాధాన్యత దృష్ట్యా పకడ్బందీగా వ్యవహరించాలని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది.  ఏది ఏమైనా రానున్న రోజులు అవినాష్ రెడ్డికి కొంత ఇబ్బంది కలిగిస్తాయని కడప వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

రాజమండ్రి@ 49 డిగ్రీల ఉష్ణోగ్రత.. నిప్పుల కొలిమిలా ఏపీ

ఏపీలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. నడి వేసవిలో అకాల వర్షాలతో చల్లబడిన వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. గత నాలుగు రోజులుగా ఏపీ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మంగళవారం అయితే ఏపీయా ఎడారా అనిపించేలా ఎండ మండిపోయింది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అత్యథికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవలి కాలంలో ఏపీలో ఈ స్థాయిలో ఉష్ట్రగ్రతలు నమోదైన సందర్భం లేదని స్థానికులు చెబుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఎండలకు  వడగాల్పులు తోడకావడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే  ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ హీట్ వేవ్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధ్యమైనంత వరకూ అత్యవసర పని ఉంటే తప్ప ఎండ సమయంలో బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించింది. 

ఇక్కడ స్విచ్.. అక్కడ లైటు!

ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుందన్నట్లు వివేకా హత్య కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు వస్తే.. జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటుంది. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు రావడానికీ జగన్  ఫ్రస్ట్రేషన్ కీ సంబంధం ఏమిటన్న లాజిక్కులు వెతకడం అనవసరం.  ఎందుకంటే ఆ సంబంధం ఏమిటన్నది గూగుల్  లుక్ ఔట్ ద్వారా సీబీఐ ఎప్పుడో బయటపెట్టేసింది. వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ ఎవరెవరికి ఎన్నెన్ని సార్లు ఫోన్ చేశారన్న విషయాన్ని సీబీఐ తన దర్యాప్తు ద్వారా బట్టబయలు చేసేసింది.  అవినాష్ రెడ్డికి సీబీఐ ఈ ఏడాది జనవరి చివరిలో విచారణకు హాజరు కావాలంటూ తొలి సారి నోటీసులు జారీ చేసినప్పుడు జగన్ తన అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఆయన సిరికిం చెప్పడు.. అన్న చందంగా హుటాహుటిన హస్తినకేగారు. అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏం మంతనాలు జరిపారన్నది షరామూమూలుగానే ఎవరికీ చెప్పరు. రాష్ట్ర సమస్యలపై చర్చించామని ఫొటో స్టాట్ కాపీలాంటి ప్రకటన ఒకటి సీఎంవో నుంచి విడుదల అవుతుంది. అంతే. అటు నుంచి సానుకూల స్పందన అన్న ముక్తాయింపు యథాప్రకారంగా ఉంటుంది.   సరే అదలా ఉంచితే.. జగన్ పర్యటన తరువాత వివేకా హత్య కేసులో  సీబీఐ దర్యాప్తు వేగం మందగించింది. అంతేనా.. అప్పటి వరకూ వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్ సింగ్ ను సీబీఐ తప్పించింది. ఆయన స్థానంలో కొత్త దర్యాప్తు అధికారి వచ్చారు. ఇక ఆ తరువాత కూడా అవినాష్ కు మరో మూడు సార్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అవినాష్ ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ పొందారు. అయితే వివేకా కుమార్తె తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిలిస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ తరువాత ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కూడా బెయిలు పిటిషన్ పై తీర్పును వాయిదా వేస్తూ అవినాష్ ను అరెస్టు చేయడానికి ఎటువంటి అడ్డంకులూ లేవనీ, అరెస్టు చేసి విచారించాలనుకుంటూ నిరభ్యంతరంగా ఆ పని చేయవచ్చనీ  విస్పష్టంగా చెప్పింది. దీంతో వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టుకు చట్ట పరంగా ఎటువంటి రక్షణ కవచాలూ లేవు అయినా  సీబీఐ అవినాష్ అరెస్టు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక ఈ మధ్యలో అవినాష్ కు సీబీఐ నుంచి తాఖీదులు వచ్చిన ప్రతిసారీ జగన్ విపక్షాలపై విమర్శల దాడిని తీవ్రం చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారిపోయింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం మందగిస్తే జగన్ మౌనమునిలా మారిపోవడం.. అవినాష్ వైపు సీబీఐ ఒక అడుగు వేస్తే.. జగన్  విపక్షాలపై విమర్శలతో విరుచుకు పడటం ఈ మూడు నెలల కాలంలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా అవినాష్ ను విచారణ రావాల్సిందిగా ఆదేశిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మంగళవారం (మే16) అవినాష్ హైదరాబాద్ లోకి సీబీఐ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. అయితే అవినాష్ హాజరు కాలేనంటే లేఖ రాస్తే అందుకు సీబీఐ సమ్మతించిందనుకోండి అది వేరే సంగతి. కానీ.. జగన్ అదే రోజు అంటే మంగళవారం (మే16) బాపట్లలోని నిజాంపట్నంలో సీఎం జగన్ వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా ఆయన దానికి పార్టీ ప్రచార సభగా మార్చేసి విపక్షాల మీద విమర్శల దాడికి ఉపయోగించుకున్నారు. దత్తపుత్రుడు అంటూ పవన్ పై పాత విమర్శనే మళ్లీ కొత్తగా చేశారు. చంద్రబాబు చెప్పిన దానికి తలవూపడడే పవన్ పని అని ఎద్దేవా చేశారు. పొత్తులు, విడిపోవడాలు, విడాకులు అంటూ చాలా చాలా మాటలు మాట్లాడారు. మొత్తంగా అవినాష్ సీబీఐ విచారణ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. గతంలో కూడా వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెరిగిన ప్రతి సారీ జగన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ చేరిందని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

అవినాష్ కు చెలగాటం.. సీబీఐకి ప్రాణ సంకటం!

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం ఆయన వ్యవధి కావాలని కోరడం.. సీబీఐ అవినాష్ కోరినట్లుగా వ్యవధి ఇవ్వడం గత కొన్ని నెలలుగా నిరాటంకంగా సాగుతోంది. ఈ వ్యవహారం మొత్తం పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్న సామెత గుర్తుకు వస్తోంది. అయితే ఇక్కడ పిల్లి అవినాష్ అయితే సీబీఐ ఎలుక అన్నట్లుగా ఉంది.  సీబీఐ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అవినాష్ రెడ్డి ఆ దర్యాప్తు సంస్థతో తన ఇష్టారీతిగా ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం గత  జనవరి నుంచి ప్రారంభమైంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ సీబీఐ నాలుగు మార్లు అవినాష్ ను విచారించింది. ముందస్తు బెయిలు కోసం అవినాష్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ లో అవినాష్ ను అరెస్టు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. కోర్టులు అవినాష్ కు ఇచ్చిన బెయిలు రక్షణను తొలగించేసినా.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయనను అరెస్టు చేయడానికి ముందుకు రావడం లేదు. తాజాగా  సీబీఐ జారీ చేసిన నోటీసుకు ప్రతిగా అవినాష్ రెడ్డి నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖ రాసి దర్జాగా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత అవినాష్ కోరిన వ్యవధి ఇచ్చేది లేదు.. వెంటనే హాజరు కావాల్సిందేఅంటూ సీబీఐ హుకుం జారీ చేసింది. అంతలో ఏమైందో ఏమో గంట వ్యవధిలోనే అవినాష్ కోరినట్లు నాలుగురోజులు కాకుండా మూడు రోజులు గడువు ఇచ్చి ఈ నెల 19న హాజరు కావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది.   అసలు సీబీఐ విషయంలో  మొదటి నుంచీ కూడా అవినాష్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. సీబీఐ కార్యాలయంలో విచారణను ఎదుర్కొని బయటక వచ్చి అదే దర్యాప్తు సంస్థపై ఇష్టారీతిన ఆరోపణలు చేసినా సీబీఐకి చీమ కుట్టినట్టు ఉండదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి.. మీరు కోరినట్లు విచారణకు హాజరు కావడానికి కుదరదంటూ అవినాష్ పదే పదే విచారణకు హాజరు కాకుండా అవాయిడ్ చేస్తున్నా.. సీబీఐ మాత్రం జీహుజూర్ మీకు కుదిరినప్పుడే రండి అన్నట్లు గడువు ఇస్తూ వస్తోంది.  ఈ వ్యవహారమంతా సీబీఐ ప్రతిష్టను మంటగలపుతోంది, పరువును గంగలో కలిపేస్తోంది. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలకు తావిస్తోంది. ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తోందని పరిశీలకులు అంటున్నారు.