ప్రసిద్ధ రచయత కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు

ప్రముఖ కవి, రచయత కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.  ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఆయన సోమవారం (మే22) ఉదయం తుది శ్వాస విడిచారు.   అభ్యుదయ రచయలత సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం పని చేసిన కేతు విశ్వనాథ్ రెడ్డి  జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు  కథా సంపుటులు  వెలువరించారు. ఈయన కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్‌ భాష ల్లోకి అనువాదమయ్యాయి. వేర్లు, బోధి అనే రెండు నవలలు కూడా రాశారు.  అంతే కాకుండా   ఆయన రాసిన సాహితీ వ్యాసాలు దృష్టి పేర పుస్తక రూపంలో వచ్చాయి. ఆయనను కేంద్ర సాహిత్య అకాడమీ సహా పలు పురస్కారాలు వరించాయి. కడప జిల్లా గ్రామ నామాలుపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పొందారు. ఆయన మృతి పట్ల పలువురు సాహితీ వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మళ్లీ సుప్రీంకు అవినాష్?

సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ న మెన్షన్ చేయనున్నారు. గతంలోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అయితే ఆ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు తేదీ ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే  సోమవారం (మే22) సీబీఐ అవినాష్ ను దాదాపుగా చుట్టుముట్టి అరెస్టు చేయడానికి సిద్ధం అయిన నేపథ్యంలో అవినాష్ మరో సారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు.  హై కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిలు పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను అరెస్టు చేయవద్దని సుప్రీంను అవినాష్ అభ్యర్థించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.    అరెస్టు అనివార్యం అని తేలిపోయినా, సుప్రీం కోర్టు పదే పదే సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెబుతున్నా అవినాష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఆశలన్నీ ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మీదే ఉన్నాయని అంటున్నారు. జగన్ హస్తన వెళ్లే వరకూ తన అరెస్టును నిలువరించుకోగలిగితే అక్కడ ఆయన ఎలాగోలా చక్రం తిప్పి సీబీఐ అరెస్టు నుంచి తనను కాపాడగలరని అవినాష్ హోప్ ఫుల్ గా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అవినాష్ అరెస్టునకు సీబీఐ రంగం చేసిన సందర్భంలో జగర్ హస్తిన వెళ్లి రాగానే  అరెస్టు విషయం వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో సారి అటువంటిదే ఏదో ఒకటి జగన్ చేయగలర్న నమ్మకంతోనే ఎలగైనా ఈ నెల 26 వరకూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఇంత వరకూ వచ్చిన తరువాత సీబీఐ కూడా అవినాష్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనీ, అందుకే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర  కార్యాలయం స్వయంగా అవినాష్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంలో  అవినాష్ పిటిషన్ వేస్తే దానిని సీబీఐ కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

అవినాష్ తల్లి హెల్త్ బులిటెన్లో ఏముంది? ఏం జరుగుతుంది?

అవినాష్ రెడ్డి సీబీఐకి చుక్కులు చూపిస్తున్నారు. దేశంలో సర్వోన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అవినాష్ ముందు చిట్టులుకలా మారిపోతోంది. విచారణకు డుమ్మా కొట్టినా, పదే పదే ఏవో సాకులు చెప్పి గైర్హాజరైనా చర్యలు తీసుకునే చొరవ చేయలేకపోతోంది. సీబీఐ తీరు చూస్తుంటే.. ఆసలది దర్యాప్తు సంస్థఏనా? అన్న అనుమానం సామాన్యులకు సైతం కలిగేలా ఉంది. అటువంటి సీబీఐ ఎట్టకేలకు ధైర్యం చేసి కర్నూలు చేరుకుని అక్కడి ఎస్పీకి తాము అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. లొంగిపొమ్మనండి లేదా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. అయినా కర్నూలులో పోలీసుల సహకారం కరవైందా?  లేక సీబీఐకే ధైర్యం తక్కువైందా తెలియదు కానీ ఈ తెల్లవారు జామునుంచీ ఆస్పత్రి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఇహనో ఇప్పుడో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయనున్నారని అంతా భావిస్తున్న వేళ ఇప్పటి వరకూ హెల్త్ బులిటిన్  విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ చెబుతూ వచ్చిన కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు అవినాష్ తల్లి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ బులిటిన్ లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు.  ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు. ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజులుగా విడుదల కాని హెల్త్ బులిటెన్ ఇప్పుడే విడుదల కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆసుపత్రి అవినాష్ స్నేహితుడికి చెందినది కావడం, పులివెందులకు దగ్గరగా ఉన్న బెంగళూరును కాదని, అలాగే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే హైదరాబాద్ నూ కాదని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ తన తల్లిని చేర్చించడంపై నాలుగు రోజుల కిందటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ లలో కంటే కర్నూలులో మెరుగైన వైద్యం లభిస్తుందని కాకుండా సీబీఐ నుంచి తనకు ర క్షణ ఏపీలో అయితేనే ఎక్కవ అన్న భావన ఆయనలో ఉందని కూడా పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని అంతా భావిస్తున్న వేళ.. అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల కావడం అనుమానాలకు తావిస్తున్నది.   నిజంగానే అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించి తీరాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే ఇప్పుడు విషయం అది కాదు.. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపైనే అనుమానాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆ సంస్థ నోటీసులను ధిక్కరించిన తీరు కారణంగానే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పూర్తిగా  ఆయన స్వయం కృతం. విశ్వభారతి ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అవినాష్ ను అరెస్టు నుంచి కాపాడటానికా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా అవినాష్ సీబీఐ విచారణను తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సోమవారం (మే 22) ఉదయం నుంచీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కాకమానవు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే స్వతంత్రంగా పని చేస్తోందా అన్న అనుమానాలూ వ్యక్తం కాక మానవు. కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న విశ్వ భారతి ఆసుపత్రి మొత్తం వైసీపీ, అవినాష్ అనుచరుల  అధీనంలోనే ఉందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీబీఐ వాహనాలు ఆ ఆసుపత్రి ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన అవినాష్ రెడ్డి అనుచరులు ఆ తరువాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించడానికి నానా అగచాట్లూ పడ్డుతున్నారు. వారిని బ్రతిమలాడుకుంటున్నారు. అంతకు మందు ఆదివారం రాత్రి విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో అవినాష్ అనుచరులు సృష్టించిన వీరంగాన్ని పోలీసలు ప్రేక్షకుల్లా తిలకించారు. వైసీపీ ఎమ్మెల్యే తరువాత తీరిగ్గా రంగప్రవేశం చేసి పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ విలేకరులకు చెప్పారు. అనినాష్ అనుచరుల స్వైర విహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా విలేకరులకు అవకాశం లేకుండా అవినాష్ అనుచరులు వారికి వెంబడించారంటే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు.  నిన్న అర్ధరాత్రి నుంచీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద  పదుల సంఖ్యలో ఉన్న అవినాష్ అనుచరుల వీరంగం సృష్టిస్తే.. మీడియా ప్రతినిథులపై దాడులు చేస్తే.. ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు.  సీబీఐ అధికారులను ఆసుపత్రి వద్ద అడ్డుకుంటుంటే ఆపడానికి పోలీసులకు అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, లేదా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

కడప ఎంపీ అవినాష్ అరెస్ట్?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వివినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోనికి తీసుకుంది. సీబీఐ విచారణకు హాజరు కాకుండా పదే పదే గడువు కోరుతూ తప్పించుకు తిరుగుతున్న అవినాష్ రెడ్డిని ఎట్టకేలకు సీబీఐ అరెస్టు చేసింది. సోమవారం(మే 22) ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆదివారం(మే21) సీబీఐకి పంపిన లేఖలో తన తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, పది రోజుల తరువాత వస్తాననీ పేర్కొన్నారు. దీంతో సీబీఐ అప్రమత్తమైంది. సోమవారం(మే22) తెల్లవారు జాముకే కర్నూలుని విశ్వ భారతి ఆస్పత్రికి చేరుకుంది. స్థానిక ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో కర్నూలు ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అవినాష్ అనుచరులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అయితే వారందరినీ చెదరగొట్టి సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే అవినాష్ రెడ్డి  రిమాండ్ రిపోర్ట్ ను సీబీఐ అధికారులు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. కర్నూలు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించి అవినాష్ అనుచరులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఆస్పత్రి వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా గత నాలుగు రోజులుగా అవినాష్ విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. కాగా తల్లి శ్రీలక్షిని అదే ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఆదివారం రాత్రి విశ్వభారతి ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆస్పత్రి వద్ద ఉన్న మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారి కెమేరాలను ధ్వంసం చేశారు.   సీబీఐ అధికారులు కర్నూలు వస్తున్నారన్న సమాచారంతోనే  వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని అంటున్నారు. సీబీఐ అధికారుల వాహనాలు ఆస్పత్రి వద్దకు వెళ్లకుండా అవరోధాలు సృష్టించారు. అయితే స్థానిక పోలీసుల సహకారంతో ఆ అవరోధాలను అధిగమించి పోలీసులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. 

విలువల గురించి బే ఫికర్.. రాపాక రాజకీయం!

ఎన్నికలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందాలంటే.. పార్టీ అండ దండ కావాలి. అలా అయితేనే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అధ్యక్షా అనొచ్చు. కానీ గత ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. ఇప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్నికల నాటికి సీన్.. సితారా అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌కు గట్టిగానే అర్థమైన్నట్లుందనే ఓ టాక్   సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఆయన ఫ్యామిలీకి రాపాక వారు గట్టిగానే సోప్ వేస్తున్నట్లు ఆయన చర్యలు చూస్తే ఇట్టే అర్థమవుతోందనే చర్చ సైతం సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తన కుమారుడు వివాహ వేడుకను రాపాక వాడుకొంటున్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రంపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ వారి పొటోలను ముద్రించిన శుభలేఖ అటు మీడియాను ఇటు సోషల్ మీడియాను చూట్టేస్తోంది. అయితే ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు..ఫ్యాన్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. జనసేన శ్రేణులు మాత్రం వ్యంగ్య బాణాలు సంధిస్తోంది.   ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇవే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు రాపాక.. దాంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. తాను జనసేన సభ్యుడిగానే ఉంటానని.. అలా అయితే తన నెంబర్ 1 గా ఉంటుందని.. అదే జగన్ పార్టీలోకి వెళ్లితే.. తన నెంబర్ 152గా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రకటించారు. అలా చెప్పిన కొద్ది రోజులకే రాపాక.. పార్టీ కండువా మార్చే చేశారు. ఆయన కుమారుడిని ముందుగా పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పారు. అలాగే పి.గన్నవరంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సైతం ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొని.. వేదిక మీద ఆశీసునులు అయిన సంగతి తెలిసిందే.  మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి అధికార ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాపాక సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వేళ పార్టీ టికెట్ సీఎం జగన్ వలదన్నా... తన వంతు ప్రయత్నంగా ముందు చూపుతో రాపాక వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరందుకొంది.

అవినాష్.. సీబీఐ.. ఓ అంతులేని కథ

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మాజీ మంత్రి నారాయణ, తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏసీబీ, ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వారి జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు వంటి వారిని అర్ధరాత్రి అరెస్టు  చేసిన సంఘటనలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీళ్లెవరూ ఉగ్రవాదులు కాదు... రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసి పరారైపోతారన్న అనుమానాలూ లేవు. అయినా కూడా ఏపీ సీఐడి, పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. అర్థరాత్రి ఇళ్లల్లోకి చొరబడి, ఒక్కో చోట తలుపులు బద్దలుకొట్టి, కాంపౌండ్ వాల్ దూకి మరీ అరెస్టు చేశారు.  టీడీపీ అధికారం లో ఉన్నపుడు జరిగినట్లుగా చెప్పబడుతున్న ఇఎస్ఐ స్కామ్ పై జగన్ ప్రభుత్వం ఎసిబి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. గతం లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్ల వ్యవహారం లో అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం భావించింది. ఈ స్కామ్ జరిగిన సమయం లో అచ్చం నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నఉన్నారంటూ 2020 జనవరిలో  అర్ధరాత్రి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ లో ఉన్న  మంత్రి అచ్చం నాయుడు ను ఎసిబి అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ కు తరలించింది. శస్త్ర చికిత్స చేయించుకుని కదలలేని స్థితిలో ఉన్న ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇందు కోసం  దాదాపుగా 100 మంది పొలిసు బలగం తో అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని చేశారు. అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరు కూడా వివాదా స్పదంగానే ఉంది. ఆయన జన్మదినం రోజున అర్దరాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ రోడ్డు మార్గాన ఏపీకి తీసుకువచ్చింది. దారి పొడవునా చిత్రహింసలు పెట్టిందని ఆయన ఆరోపించిన సంగతి విదితమే. అలాగే ఏపీలో విపక్ష నేతలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పట్ల ఏపీ సీఐడీ ఇలాగే వ్యవహరించింది. నోటీసులు, పద్ధతులు, నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా అరెస్టులు చేసింది. అదే వివేకాహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ విషయానికి వచ్చే సరికి అన్ని అనుమతులూ ఉన్నా, అరెస్టే తరువాయి అని స్వయంగా కోర్టులకు చెప్పిన సీబీఐ ఆయన నీడను కూడా ముట్టుకోవడానికి జంకుతోంది. కేంద్ర దర్యాస్తు సంస్థ అయిన సీబీఐ తీరు నవ్వుల పాలౌతోంది. జనంలో ఆ దర్యాప్తు సంస్థ చులకన అవుతోంది. అయినా పట్టించుకోవడం లేదు. విచారణకు రండి సార్ అని నోటీసుల మీద నోటీసులు ఇచ్చి బతిమలాడుకుంటోంది. అయినా కూడా అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాను కాక కాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పనులంటూ ఓసారి, తల్లి అనారోగ్యం అంటూ మరోసారి, ఇంకోసారి కడుపునొప్పి అంటూ స్వయంగా తానే ఆసుపత్రిలో చేరారు. ఇక తాజాగా తన తల్లి ఆనారోగ్యంతో ఉన్నందున ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే వరకూ విచారణకు హాజరు కావడానికి కుదరదని మరోసారి సీబీఐకి లేఖ రాశారు.  సోమవారం( మే10) విచారణకు రావాలంటూ సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మొదలైన హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు విచారణకు బయలుదేరిన అవినాష్ తల్లి ఆనోరోగ్యం సమాచారం అందిందంటూ  డుమ్మా కొట్టారు.   హైదరాబాద్ కు కానీ.. ఇటు బెంగళూరుకు కానీ తీసుకెళ్లకుండా మధ్యలో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుడు, అవినాష్ రెడ్డి స్నేహితుడు.  సరే సీబీఐ సోమవారం(మే 22)  విచారణకు రండి అంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు కూడా ఆయన కుదరదనే సమాధానం ఇచ్చారు.  ఆయన తీరును చూస్తే.. ఇప్పట్లో ఆయన విచారణకు హాజరు కాను అని చెప్పినట్లే ఉంది.  సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడానికి చాలా పకడ్బందీగా అవినాష్ రెడ్డి ఆడుతున్న గేమ్ లో సీబీఐ చిత్తవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అవినాష్ తీరు పట్ల సీబీఐ సీరియస్ గా ఉందనీ, సీబీఐ కేంద్ర కార్యాలయం ఆయనను అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసిందనీ వార్తలు వస్తున్నా.. సీబీఐ మాత్రం గడువు మీద గడువు ఇచ్చుకుంటూ వెళుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తోందా.. లేక అవినాష్ చెప్పినట్లు చేస్తోందా అని పరిశీలకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అవినాష్ విచారణ తెలుగు టీవీ సీరియల్ లా అంతులేకుండా సాగుతోందని అంటున్నారు. 

డిసెంబర్ లేదా జనవరిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు?

నిజం కావచ్చును  ..కాకపోనూ వచ్చును, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ మరోమారు ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలుగు దేశం పార్టీ అధినేత  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎప్పటి నుంచో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ముందస్తు ఎన్నికలు పోవడం ఖాయమని చెపుతూనే ఉన్నారు. అయితే  ముందస్తు ఎన్నికలు వస్తాయా  రావా అనే విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కార్యకర్తలలో జోష్ పెంచేందుకు విభిన్న కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. ఓ వంక యువనేత నారా లోకేష్, యువ గళం పాద యాత్ర తో జన ప్రభంజనం సృష్టిస్తున్నారు. మరో వంక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అనేందుకు నియోజక వర్గాల స్థాయిలో క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు.  అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం చేయక పోవచ్చనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్త పరుస్తున్నా, చంద్రబాబు నాయుడుతో పాటుగా, ఇప్పటికే టీడీపీతో పొత్తుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల ముందస్తు ముచ్చట తెచ్చారు.ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నెల నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన ముహూర్తాలు కూడా ఖరారు చేశారు. గతంలో కర్ణాటక ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పిన రఘురామకృష్ణం రాజు  , తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.   ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ గా కనిపిస్తోందన్నారు. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయమని అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు.  అదలా ఉంటే  ఇప్పడు తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం (2023)డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం (2024)జనవరిలో ఎన్నికలువస్తాయని స్పష్టం చేశారు. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అదెలా ఉన్నా ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు కోరుకొవడానికి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. కారణాలు ఏవైనా కేంద్ర ప్రభుత్వం  అండదండలు అడుగంటిపోతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరోవంక అక్రమాస్తుల కేసులు, బాబాయి మర్డర్ కేసుకు సంబందించిన చిక్కు ముళ్ళు తొలిగి పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ నిముషానికి ఏమి జరుగుతుందో అనే భయం వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో గుడ్డిదో ఎడ్డిడో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.

నోటు వాపస్ ఓటు వాపస్?

అనుకున్నదే జరిగింది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించిన నేపధ్యంలో, విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అస్త్రాన్ని బయటకు తీసింది.రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ పెద్ద నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఆ తర్వాత 2 వేల రూపాయల నోటు ఉన్నా.. అది చెల్లని కాగితంతో సమానంగా విలువను కోల్పోతుంది. అయితే, రూ.2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కి తీసుకోవడం వల సామాన్యులపై అంతగా ప్రభావం ఉండదు, నిజానికి సామాన్యులు రూ. 2000 నిటు చూసి చాలా కాలం అయింది. 2016 లో పెద్ద నోట్ల రద్దు సమయంలో అవసరార్ధం రూ.2000 నోట్లను చెలామణి లోకి తెచ్చిన రిజర్వు బ్యాంకు, అవసరం తీరిన తర్వాత 2018 నుంచే రూ.2000 నోట్ల ముద్రణను నిలుపు చేసింది. అంతే కాకుండా, చాలా కాలంగా బ్యాంకుల ఏటీఎంలలో రెండువేల రూపాయల నోట్ల అంతగా ఉంచడం లేదు. ఇక ఇప్పుడు కస్టమర్లకు ఈ నోట్లను ఇవ్వవద్దని బ్యాంకులకు సూచించిన ఆర్‌బీఐ.. తమ వద్ద ఉన్న నోట్లను సెప్టెంబర్‌ 30లోగా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. అంటే, స్పెషల్ పర్పస్ కోసం కోట్లలో నోట్ల కట్టలను పేర్చుకున్న వారికి  తప్పించి , రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం సామాన్యుల పై ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.  అయితే, రూ.2000 నోట్ల చెలామణిని నిలిపివేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంపన్నులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.  ఐటీ లెక్కల్లో చూపకుండా ఎక్కువ నగదును నిల్వ చేసుకునే వారు సాధారణంగా పెద్ద నోట్లనే ఎంచుకుంటారు. అంటే, కోట్ల రూపాయల సొమ్మను రూ.2000 నోట్ల కరెన్సీలో నిల్వ చేసుకునే వారు లెక్కలేనంత మంది ఉంటారు. పెద్ద మొత్తంలో అవసరం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఖర్చు చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారు చిక్కుల్లో పడ్డట్లే. బ్యాంక్ ఖాతాల్లో రూ.2000 నోట్లను ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఆర్బీఐ చెప్పింది. అయితే, రూ. 50 వేలు మొదలు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి వస్తే.. పాన్ కార్డ్ కావాల్సిందే. కోట్ల రూపాయలను డిపాజిట్ చేయాల్సి వస్తే.. అందుకు తగిన లెక్కలు చూపించి, ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఇప్పటిదాకా దాచుకున్న డబ్బును ఒకేసారి డిపాజిట్ చేస్తే.. కచ్చితంగా ఐటీ అధికారుల దృష్టిలో పడతారు. అంటే, ఎన్నికల ముందర రాజకీయ నాయకులకు ఇది గట్టి దెబ్బగానే చెప్పవచ్చు.అందుకే రిజర్వు బ్యాంకు తీకున్న నోటు వాపస్ నిర్ణయం.. ఓటు వాపస్  నిర్నయంగానూ భావిస్తునారు.

అవినాష్ సీబీఐ..టామ్ అండ్ జెర్రీ తీరు!

వివేకా హత్య కేసు దర్యాప్తు తీరు ప్రతిష్ఠాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను మంటగలుపుతోంది. అవినాష్, సీబీఐల మధ్య గత నాలుగు నెలలుగా సాగుతున్న వ్యవహారం టామ్ అండ్ జెర్రీని గుర్తుకు తెస్తోంది. ఒక సారి నువ్వు పై చేయి సాధించు.. మరో సారి ఆ చాన్స్ నాకివ్వు అని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా అవినాష్, సీబీఐ తీరు ఉంది. అనివాష్ పార్టీ పనులున్నాయంటూ విచారణకు డుమ్మా కొడితే.. సరే సార్ మీ పనులన్నీ అయ్యాకే తీరిగ్గా విచారణకు రండి అంటూ సీబీఐ గడువులు పెంచుకుంటూ పోవడం చూసి జనం నవ్వుకుంటున్నారు.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు వరుసకు సోదరుడనేనా అవినాష్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయన పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తోంది. లేదా అవినాష్ రౌడీయిజానికి అంత పెద్ద దర్యాప్తు సంస్థా బెదరిపోయి జీ హుజూర్ అంటోందా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. అవినాష్ వ్యవహారంలో సీబీఐ తీరుతో తెలుగు రాష్ట్రాలలో సీబీఐ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఐపీఎల్ లో బెట్టింగ్ లు చేస్తున్నట్లుగా జనం అవినాష్ ను సీబీఐ అరెస్టు చేయదంటూ కోట్లలో బెట్టింగులు చేస్తున్నారంటే.. సీబీఐ సత్తా, సామర్థ్యంపై విశ్వాసం, విశ్వసనీయతా జనంలో ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్ధమౌతుందంటున్నారు. కాగా కొంచం అటూ ఇటూగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇవే సందేహాలను, ఇవే అనుమానాలనూ వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీకి ఉన్న పాటి సత్తా, ధైర్యం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు లేదా అని నిలదీశారు. లేదా ఏపీ సీఎం తమ్ముడికి సీబీఐ దృష్టిలో ఏమైనా ప్రత్యేక అర్హతలు ఉన్నాయా అని సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఒక రూలు, ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డికి మరో రూలూ ఉంటుందా అని ప్రశ్నించారు. తలా  తోకా లేని నోటీసులతోనే రాత్రికి రాత్రి ఏపీ సీఐడీ అరెస్టులు చేసి పట్టుకు పోతుంటే.. కోర్టుల నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత కూడా సీబీఐ అవినాష్ దరిదాపుల్లోకి కూడా ఎందుకు వెళ్లలేకపోతోందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇక నుంచి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చినా ఎవరూ విచారణకు హాజరు కావద్దని  పిలుపు నిచ్చారు. ఏపీలో అయితే సీబీఐ అడుగు పెట్టలేదన్న ధైర్యంతోనే అవినాష్ కర్నూలు ఆస్పత్రిలో తలదాచుకున్నారని ఆయన ఆరోపించారు.  

దేవుడిని తలుచుకుంటే గుర్తకు వచ్చేది ఎన్టీఆరే!

ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదనీ, ఆయన తెలుగువారి ఆస్తి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కూకట్ పల్లి కైతలాపూర్ మైదానంలో శనివారం (మే20) జరిగిన ఆయన శత జయంతి సభలో ప్రసంగించిన చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యుడన్నారు. అమెరికాలో ఎన్టీఆర్ జయంతిని తెలుగు హెరిటేజ్ డేగా జరుపుకుంటారనీ, తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిన ఖ్యాతికి, గుర్తింపునకు ఇంకేం నిదర్శనం కావాలన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, సాధారణ జీవితం గడిపారనీ, ప్రతి రోజు తల్లి పాలు పితికి ఇస్తే వాటిని టీ దుకాణాలకు పోసి వచ్చేవారు. ఆ తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి చదువుకుని సాయంత్రానికి తిరిగి వచ్చి మళ్లీ పనులు చేసుకునేవారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఆయనకు రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. అయితే లంచాలు తీసుకోవడం నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించేందుకు మద్రాస్ వెళ్లారు. ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వెంకటేశ్వరస్వామిగా ఇలా ఆయన పోషించిన ప్రతి పాత్రా కూడా భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేనంత ప్రతిభామంతంగా నటించారని చంద్రబాబు చెప్పారు.   మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పిన చంద్రబాబు రాయలసీమలో కరవు వస్తే జోలె పట్టి విరాళాలు సేకరించారు. చైనా యుద్ధం, దివి సీమ ఉప్పెన సమయంలోనూ రాష్ట్రమంతా తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. తనను 40 ఏళ్ల పాటు ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టారు. ఇవాళ దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఎన్టీఆరే ఆద్యుడని చెప్పారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను ఐదు నిమిషాల పాటు మనసులో స్మరించి మీరు ఏ సంకల్పం అయినా చేయండి... ఆ సంకల్పం జయప్రదం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదని, ఓ మహాశక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. కాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సినీ, రాజకీయ రంగాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా,తెలంగాణ తెలుగుదేశం కాసాని జ్ఞానేశ్వర్,  నటులు మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్,  కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, శ్రీలీల, సుమంత్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ  ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ శకపురుషుడు పుస్తకాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించి ప్రసంగించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ శత జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నీతి నిజాయతీ, క్రమశిక్షణకు నిలువెత్తు రూపం ఎన్టీఆర్ అన్నారు.రాజకీయాలలోకి క్రమశిక్షణ తెచ్చిన మహోన్నతుడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జనం మనిషి ఎన్టీఆర్ అని దత్తాత్రేయ అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా మాట్లాడుతూ జాతీయ రాజకీయాలలో కూడా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. పేదల కష్టాలు తెలిసిన నేత, సామాజిక న్యాయం కోసం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. దేవుడిని ఎప్పుడు తలచుకున్నా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ మాత్రమేనని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ఎన్టీఆర్ చివరి వరకూ కృషి చేశారన్నారు.  ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు ఎన్టీఆర్ గోప్పతనం గురించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు. 

ఆ చిత్రంలో నటించడం తప్పా? 

ది కేరళ స్టోరిలో ఆసిఫా పాత్ర ధారి అయిన సొనాలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.  మొదట్నుంచి వివాదంలో ఉన్న ఈ చిత్రాన్ని  పశ్చిమ బెంగాల్ లో నిషేధించారు. సుప్రీం జోక్యంతో నిషేధం ఎత్తివేసారు. చాలా రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని హిందుత్వ వాదులు హెచ్చరించారు. అయితే ఎగ్జిబిటర్లే స్వయంగా  చిత్రాన్నిఎత్తివేస్తున్నారు.వేశారు కూడా. ఈ చిత్రంలో అసిఫా క్యారెక్టర్లో ఉన్న సొనాలికి బెదిరింపు కాల్స్ రావడంతో ఆమె కుటుంబం మీడియా ముందుకు వచ్చింది. సొనాలి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నటీమణి కుటుంబం అంటోంది. సొనాలికి మోడలింగ్ చేసిన అనుభవం ఉంది. మూడు నాలుగు చిత్రాల్లో నటించింది.  ది కేరళ స్టోరీని మహరాష్ట్ర , తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రదర్శించాలని బిజెపి నిర్ణయించింది. వోటు బ్యాంకు రాజకీయాలను ఈ ఎన్నికల్లో నడపాలంటే చిత్రాన్ని ఉచితంగా  చూయించాలని బిజెపి పన్నాగం. కేరళలో తప్పిపోయిన అమ్మాయిలు ఐసిస్ లో చేరి టెర్రరిస్ట్ లుగా మారతారు. ఇది స్టోరీ సారాంశం.వివాదానికి ఇదే కారణమైంది. చిత్రాన్ని నిషేధించడం వ్యవస్థను ప్రశ్నించడం అవుతుంది. ఇష్టమున్న వాళ్లు చిత్రాన్ని చూస్తారు. నచ్చని వాళ్లు చూడరు. సమాజానికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే కోర్టులు జోక్యం చేసుకుని నిషేధిస్తాయి. కానీ ఇవేవి జరగకుండా  అందులో నటించిన తారలకు అసభ్య మెసేజ్ లు, బెదిరింపుకాల్స్ చేయడం శోచనీయం. చట్టాలను చేతుల్లో తీసుకున్న వారిని చట్ట పరిధిలో శిక్షలు వేయాలని ప్రజాస్వామిక వాదులు డిమాండ్ చేస్తున్నారు. ది కేరళ స్టోరి చిత్రంలో నటించడం తప్పా అని లౌకికవాదులు ప్రశ్నిస్తున్నారు. 

విపక్షాల ఐక్యతకు సంకేతం.. సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య శనివారం (మే20)న   ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక విధంగా ఆయన ప్రమాణ స్వీకార  కార్యక్రమం . బీజేపీయేతర పక్షాల ఐక్యతకు వేదికగా మారింది. అంతే కాకుండా కాంగ్రెస్ లో మారిన సంస్కృతికి దర్పణంగా కనిపించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గేకు ఇరువైపులా సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు చేతులు పట్టకుని నిలుచున్నారు. వీరికి వెనుకగా కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్, ప్రియాంకలు నిలబడ్డారు. ఏ విధంగా చూసినా ఇది ఒక కొత్త దృశ్యం. కాంగ్రెస్ లో గాంధీ నెహ్రూ కుటుంబం స్వయంగా తమ ఆధిపత్యాన్ని తగ్గించుకుని పార్టీలో ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఈ కార్యక్రమానికి  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్‌గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా  తదితరులు హాజరయ్యారు. అలాగే రాజకీయవేత్తగా మారిన నటుడు కమల్ హసన్ కూడా హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లు గైర్హాజరయ్యారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పలు బీజేపీయేతర పార్టీల అధినేతల హాజరు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి బలోపేతం అవుతోందనడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది. ఈ లోగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలూ ఏకమౌతాయన్న అంచనాకు రావడానికి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం దోహదపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అణగారిన వర్గాలకు కర్ణాటక కేబినేట్ లో పెద్ద పీట

కర్ణాటక ప్రమాణ  స్వీకారోత్సవంలో అణగారిన వర్గాలకు పెద్ద పీట వేసింది.   ప్రమాణ స్వీకారం రోజు ఎనిమిది మందికి మంత్రి వర్గంలో చోటు దక్కింది.  సింహభాగం అణగారిన వర్గాలేనని తేలిపోయింది. ఈ వర్గాలకు తొలి జాబితాలో నే చోటు దక్కడం విశేషం. వొకలిగ కులానికి ఒక్క స్థానం దక్కకపోవడం మరో విశేషం. ఈ కులానికి చెందిన వారు  చిత్రదుర్గ , షిమోగో జిల్లాల్లో మాత్రమే కనిపిస్తారు. లింగాయత్ లు బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. బిజెపిని ఓడించిన ప్రజలు లింగాయత్లను కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం చేశారు.లింగాయత్లు హిందూత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. వీళ్లు శివుడుని ఎక్కువగా పూజిస్తారు. హిందూ మతానికి చాలా దగ్గరగా ఉండటంతో వీళ్ళు బిజెపికి పెద్ద పీట వేశారు.  డికె శివకుమార్  డిప్యూటి చీఫ్ మినిస్టర్ పోస్ట్ రావడంతో దళిత కులాలకు డిప్యూటి ముఖ్యమంత్రి పదవి అన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారాయి. ప్రముఖ దళిత నాయకుడు జి. పరమేశ్వరకు డిప్యూటి పదవి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. తీరా క్యాబినేట్  రోజు మాత్రం ఆయన ఊసు లేకుండా పోయింది.  మొదటి జాబితాలోనే ఆయన పేరు లేకుండా పోయింది. మల్లి ఖార్జున ఖర్గే కుమారుడుకి కూడా కేబినేట్లో చోటు దక్కింది. దళిత కుటుంబానికి చెందిన ఖర్గే ఎ ఐ సిసి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తొలి గాంధీ యేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి దక్కడం గమనార్హం అయితే తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచి ఐటి శాఖా మంత్రి రావడంతో వార్తల్లోకెక్కారు ఖర్గే  

అనినాష్ రెడ్డికి సీబీఐ మరో చాన్స్

అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వేచి చూచే ధోరణి అవలంబిస్తోందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దారులన్నీ మూసుకు పోయిన తరువాత కూడా ఆయన ఎంత కాలం దాగుడుమూతలట ఆడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తీరు ఉందని అంటున్నారు. సీబీఐ విచారణకు డుమ్మా కొట్టి తల్లి అనారోగ్యమంటూ శుక్రవారం (మే19) రోజంతా రోడ్లపై కాన్వాయ్ లో విపరీతంగా తిరిగిన వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు కర్నూలులో హాల్ట్ అయ్యారు. అక్కడి ఆస్పత్రిలో తల్లిని చేర్చి తాను కూడా అడ్మిట్ అయ్యారు. గుండెపోటుతో తల్లి హస్పిటల్ లో చేరితే కడుపులో మంట లేదా నొప్పి అంటూ అవినాష్ అదే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దాంతో నిన్న రోజంగా జరిగిన హైడ్రామాకు తెరపడింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులను ధిక్కరించి పులివెందుల బయలు దేరిన అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వెంబడించడంతో ఇక ఆయనను ఏక్షణంలోనైనా అరెస్టు చేస్తారనే అంతా భావించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి అవినాష్ ను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు సైతం జారీ అయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శనివారం అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అన్న నిర్ధారణకు పరిశీలకులు వచ్చేశారు. అయితే అనూహ్యంగా సీబీఐ ట్విస్టు ఇచ్చింది. కడుపు నొప్పికి చికిత్స చేయించుకుని సోమవారం ( మే20) విచారణకు హాజరు కావాల్సిందిగా తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. దారులన్నీ మూసుకుపోయిన అవినాష్ ఇంకెంత దూరం వెడతారో చూద్దామన్నట్లుగా సీబీఐ తమాషా చూస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. అవినాష్ విషయంలో సీబీఐ తీరు అనుమానాస్పదంగా ఉందని కొందరంటున్నారు. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందనీ, ఆ సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారనీ అప్పటి వదిలేయలేదనీ, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మరీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిందని గుర్తు చేస్తున్నారు. మరి అవినాష్ విషయంలో సీబీఐ ఆ విధంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకే కేసులో తండ్రి విషయంలో ఒకలా, తనయుడి విషయంలో ఒకలా సీబీఐ వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  అదలా ఉంటే.. వివేహా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.  వివేకా పి.ఏ కృష్ణారెడ్డి దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో డాక్టర్ సునీత ఇంప్లీడ్ అయ్యారు. వివేకా హత్య కేసులో నిజమైన బాధితురాలిని తానేననీ, ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని అంగీకరించడం, అంగీకరించకపోవడం తనకు సంబంధించిన విషయమనీ, కృష్ణారెడ్డికి ఏం సంబంధం కాదనీ పేర్కొన్నారు. ఈ మేరకు సునీత తరఫు న్యాయవాది.. తొలి నుంచీ ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నది తన క్లయింట్ సునీతేనని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని సుప్రీం ను ఆశ్రయించడం నుంచి, కేసు విచారణ ఏపీ నుంచి మార్చాలని కోరడం వరకూ అన్నీ సునీత అభ్యర్థన మేరకే జరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిజమైన బాధితులు సునీతారెడ్డి, ఆమె తల్లి మాత్రమేననీ, కృష్ణారెడ్డికి సంబంధం లేదనీ ఆయన వాదించారు. సునీత ఇంప్లీడ్ పిటిషన్ ను అనుమతించి సుప్రీం కోర్టు వచ్చే నెల 3లేదా 4 తేదీలలో విచారించనున్నట్లు తెలిపింది.  

ష్.. గప్ చిప్.. కొడాలికి ఏమైంది?

కొడాలి నాని  తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన ఆయన తనకు మాత్రమే ప్రత్యేకమైన బూతుల మంత్రి అని బిరుదు కూడా పొందారు. మంత్రిగా ఆయన చేసే వ్యాఖ్యలు, విమర్శలు విలువలకు వలువలు ఒలిచేసినట్లుగా ఉండేవి. ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనుచిత విమర్శలు చేసి వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడే భాష ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేకపోయినా.. దానినే వాడుతూ ఒక విధంగా నెగటివ్ పాపులారిటీ విపరీతంగా పొందారు. అదే సమయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలను సీఎం జగన్ ఏ మాత్రం ఖండించకపోవడం, పైపెచ్చు ముసిముసి నవ్వులతో ప్రోత్సహించడంతో నాని ఇంకా రెచ్చిపోయేవారు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా.. బూతుల మంత్రిగా జగన్ తొలి కేబినెట్ లో ఓ వెలుగు వెలిగిన కొడాలి నానికి చిత్రంగా మలి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. పునర్వ్యవస్థీకరణలో నాని మంత్రి పదవి ఊడింది. ఆ సమయంలో ఆయన ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. నోటికి తాళం వేసుకుని  ఓ పశువుల పాకలో పడుకున్న ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి కూడా. సరే కొంత కాలం మౌన మునిలా మారిపోయిన కొడాలి నాని ఆ తరువాత మళ్లీ తన నోటికి పని చెప్పడం ప్రారంభించారు. అది వేరే సంగతి. మధ్యలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున విమర్శలూ ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నాని మరోసారి నోటికి తాళం వేసుకున్నట్లుగా కనిపిస్తోంది.  బీజేపీ ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడికక్కడ చార్జిషీట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే గుడివాడలో బీజేపీ చార్జ్ షీట్ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ సునీల్ దియోధర్ నానిపై, నాని భాషపై, ఆయన కాసినో వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తిని అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయకూడదని  అన్నారు. అంతే కాకుండా ఇటువంటి నేతలను తమ పార్టీ  అధికారంలోకి వస్తే జైల్లో పెట్టిస్తామన్నారు. సరే.. సునీల్ దియోధర్ విమర్శించినది అలాంటిలాంటి నేతను కాదు.. నోరు విప్పితే బూతులు, దుర్భాషలు వినా మరొకటి రాని కొడాలి నానిని. మరి నాని ఊరుకుంటారా? తన నోటికి పదును పెట్టారు. సునీల్ దియోదర్ ని పకోడీగాడు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన లాంటి నాయకుల వల్లే కర్నాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. దీంతో బీజేపీ మండి పడింది. సాధారణంగా నానిని విమర్శించడానికి కానీ, ఆయన విమర్శలకు స్పందించడానికి కానీ ఎవరూ పెద్దగా ఇష్టపడరు. బురదలో రాయి వేయడం ఎందుకని మిన్నకుంటారు. కానీ బీజేపీ అలా ఊరుకోలేదు. తీవ్రంగా స్పందించింది. సవాళ్లు విసిరింది. నాని వాచాలతకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్లుగా ఎదురుదాడికి దిగింది. గుడివాడలో అభివృద్ధి, వైసీపీ పాలనపై బహిరంగ చర్చకు సవాల్ విసిరింది. ఇందుకు గన్నవరం బస్టాండ్ ను వేదికగా నిర్ణయించింది. మామూలుగా అయినే నాని ఇలాంటి సవాళ్లకు వెంటనే స్పందిస్తారు, సై అంటారు. కానీ బీజేపీ సవాల్ కు మాత్రం నాని నుంచి ఎటువంటి స్పందనా లేదు. నోటికి తాళం వేసుకున్నట్లు కూర్చున్నారు. వైసీపీ అధిష్ఠానం నోరు నొక్కేసిందో.. లేక బీజేపీతో శతృత్వం పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారో కానీ నాని మౌనమునిగా మారిపోయారు. అయితే బీజేపీ మాత్రం నానిని వదలడం లేదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. నోరెత్తితే ఊరుకోమన్నట్లుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయిన దానికీ కాని దానికీ బూతులతో విరుచుకుపడే నాని మౌనం వెనుక జగన్ హెచ్చరిక, మందలింపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి కోపం వస్తే.. జగన్ పుట్టి మునుగుతుందన్న భయంతోనే వైసీపీ అధిష్ఠానం నాని నోటికి తాళం వేసిందంటున్నారు. 

కొనుగోలు చేసిన భూములకే దిక్కూ దివాణం లేదు

ఖమ్మం జర్నలిస్తులకు 23 ఎకరాల భూమిని  బిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ చేసిన వినతికి ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వం హడావిడిగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారు.  పువ్వాడ అజయ్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన 70 ఎకరాల భూములకు ఇంత వరకు మోక్షం రాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో నిజాంపేటలో 32 ఎకరాలు, పేట బషీరాబాద్ లో 38 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ భూములు అయిన నిజాంపేటలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు 1100మంది జర్నలిస్ట్ లు చెల్లించారు. అదే పేట్ బషీర్ బాద్ స్థలాలను చదరపు అడుగుల లెక్కన ప్రభుత్వానికి  ఈ జర్నలిస్ట్ లు చెల్లించారు. కోర్టులో 15 ఏళ్ల పాటు కేసులు నడిచాయి. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ఇట్టి భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పు చెప్పారు. 9 నెలల క్రితం ఈ తీర్పు వెలువడినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఏడేళ్ల క్రితం మధ్యంతర ఉత్తర్వుల్లో ఈ భూములను జవహార్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే ఇట్టి భూములను డెవలప్ చేసుకోవచ్చని,  ఇళ్ల నిర్మాణాలను మాత్రమే చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి కెసీఆర్ మధ్యంతర ఉత్తర్వులపై స్పందిస్తూ హైదరాబాద్ లో భూములు కరువయ్యాయా బొచ్చెడు భూములు సుప్రీం తుది తీర్పు వచ్చాక హైదరాబాద్ జర్నలిస్ట్ లను చూసి ఈర్శ్య పడేలా పెద్ద జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. యూ ట్యూబ్ చానళ్లలో కెసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ  దొరుకుతాయి. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంతవరకు దిక్కు, దివాణం లేదు. కాగా  టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద గురువారం చేపట్టిన మహాధర్నాలో వైఎస్ రాజశేఖరెడ్డి తనయ వైఎస్ షర్మిల పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వానికి కమిషన్లు అందకపోవడం వల్లే 70 ఎకరాలను జర్నలిస్ట్ లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించిన ఈ భూములను కమిషన్ల కోసం బిఆర్ ఎస్ ప్రభుత్వం విక్రయించాలని చూస్తోందన్నారు. కొనుగోలు చేసిన జర్నలిస్ట్ లకు దక్కేలా తమ పార్టీ పోరాడుతుందని షర్మిల హామీ ఇచ్చారు. ఎన్నికలకు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో జర్నలిస్ట్ లు పోరాటస్పూర్తితో ఉద్యమిస్తే ఈ 70 ఎకరాలను సాధించుకోవడం పెద్ద కష్టమేమి కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని జర్నలిస్ట్ లు మరచిపోవడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తోంది. కోర్టు దిక్కారణ కేసు వేస్తే వీలయినంత త్వరగా భూములు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరు అన్నారు. సంప్రదింపులు, లాబీయింగ్ చేసి ఈ భూములను పొందడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  మెజారిటీ జర్నలిస్ట్ లు కోర్టు దిక్కారణ కేసు బిఆర్ఎస్ ప్రభుత్వంపై వేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 

హైద్రాబాద్ లో పెరుగుతున్న ఊష్ణోగ్రతలు

హైదరాబాద్ ఊష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పాదరస ముల్లు పై పైకి ఎగబాకుతుంది. శుక్రవారం రోజు 42.6 డిగ్రీల సెల్సియస్  పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ అత్యంత ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టిఎస్డి పిఎస్) తెలియజేసిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ తో పాటు ఇతర ఎనిమిది ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకంటే ఎక్కువగా  సెల్సియస్ నమోదవుతున్నాయి.  ఖైరతాబాద్ (42.5) డిగ్రీల సెల్సియస్), చార్మినార్(41.1 డిగ్రీల సెల్సియస్), నాంపల్లి (40.7 డిగ్రీల సెల్సియస్), బండ్ల గూడ (40.3 డిగ్రీల సెల్సియస్) హిమాయత్ నగర్ (40.3 డిగ్రీల సెల్సియస్),  ముషీరాబాద్(40.3 డిగ్రీల సెల్సియస్), షేక్ పేట(40.2 డిగ్రీల సెల్సియస్)గా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా జిల్లాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.   శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల , కరీంనగర్ వీర్నవంక 45.4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.   హైదరాబాద్ లో ఎండలు మరింత ముదరనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. మే  22 వరకు ఇదే పరిస్థితి. 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా.  మిగతా జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.  వాస్తవానికి హైదరాబాద్ ఊష్ణ మండల ప్రాంతం. ఎండాకాలంలో చెమటలు కక్కడం ఇక్కడ సర్వ సాధారణం. గత 120 సంవత్సరాల్లో ప్రస్తుతమున్న టెంపొరేచర్ ఎక్కువేనని వావారణ శాఖ వెల్లడించింది.