ముందస్తు అయినా కాకున్నా మునక ఖాయం!

ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి .. ఎటూ పోలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం…కొట్టుమిట్టాడు తోందా అంటే,పబ్లిక్  టాక్ అవుననే అంటోంది. మేథావులు అయితే, మహా కవి  శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు గీతాన్ని గుర్తు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వాన్ని కూడా అదిగో అలాంటి సంధ్యా సమస్యలే వెంటాడుతున్నాయి అంటున్నారు. అందుకే పరిస్థితి ఎటూ పాలుపోక గుడుగుడు గుంజం గుండేరాగం .. అన్నట్లు ముందస్తు ఎన్నికల చుట్టూ అక్కడక్కడే, గిరగిర తిరుగుతోందని, వైసీపీ నేతలు  పిల్లి మొగ్గలు వేస్తున్నారని అంటున్నారు. నిజానికి, ఓటమి భయం తోనే వైసీపీ నేతలు ఏమి  చేయడమో ... ఎటు పోవడమో పాలుపోని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు పోదామంటే,  ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని అందాక అగుదామంటే..అసలుకే మోసం వచ్చేలా వుందన్న అనుమానం పీడిస్తోంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల అట్టును, ఒక రోజు ఇటు ఒక రోజు అటు తిరగేస్తున్నారు. నిజానికి, ముందస్తు ఎన్నికలను ముందుగా తెరపైకి తెచ్చిందే అధికార పార్టీ నాయకులు.. ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు వైసీసీ పార్టీలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో ‘ఆల్ ఇన్ వన్’ గా చెలామణి అవుతున్న  సజ్జల రామకృష్ణా రెడ్డి ముందస్తు ఉందనో లేదనో వాక్రుచ్చి, ఎప్పటికప్పుడు ముందస్తు చర్చను సజీవంగా ఉంచుతున్నారు.  అలాగే ప్రజలు కూడా ముందస్తా వెనకస్తా అనేది పక్కన పెట్టి, ఎన్నికలు ఎప్పడు వచ్చినా, ఒక్క ఛాన్స్ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే, వైసీపీ  నాయకులు మాత్రం ఇంకా తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేసే విఫల ప్రయత్నం చేస్తున్నారు.  అయినా అసలు ముందస్తు విషయంలో జగన్ ఏ ధైర్యంతో ముందడుగేస్తారన్న ప్రశ్న పరిశీలకులు వేస్తున్నారు. ఆఖరు క్షణం వరకూ అధికారంలో ఉండేందుకే ఆయన చూస్తారని అంటున్నారు. అన్ని వైపుల నుంచీ వ్యతిరేక పవనాలు ప్రస్ఫుటంగా వీస్తున్న సంగతి తేటతెల్లంగా కనిపిస్తుంటే.. ముందస్తుడు అడుగు ముందుకేసే అవకాశమే లేదని అంటున్నారు. చివరి వరకూ అధికారంలో కొనసాగితే ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి ఏదో ఒక అవకాశం దొరకదా అన్న దింపుడు కళ్లెం ఆశను సజీవంగా ఉంచుకోవడానికైనా జగన్ ముందస్తుకు అడుగు ముందుకు వేయరని చెబుతున్నారు. అయితే ముందస్తు ముచ్చటను పదేపదే తెరమీదకు తీసుకురావడం ద్వారా విపక్షాలను కన్ష్యూజ్ చేయడం, వారి వ్యూహాలకు చెక్ పెట్టడం అనే విధానాన్ని జగన్ ఫాలో అవుతున్నారంటున్నారు.  రాజకీయ పరిశీలకులు మాత్రం ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత, ముందస్తు  వెనకస్తు తేడాలుండవంటున్నారు.  అయినా జగన్ ముందస్తుకు వెళ్లాలంటే అందుకు ప్రజలకు కారణం చెప్పి తీరాలి. ఆర్థిక సంక్షోభమా, మూడు రాజధానులా, సంక్షేమానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయనా, ఎందుకు ముందస్తుకు వెళుతున్నామన్న దానికి జగన్ జవాబు చెప్పాల్సి ఉందని అంటున్నారు. 

ఇమ్రాన్ అరెస్ట్ పై సుప్రీం సీరియస్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను పాకిస్థాన్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రిజిస్టార్ అనుమతి లేకుండా 90 మంది కోర్టు ప్రాంగణంలోకి వచ్చి అరెస్ట్ చేయడాన్ని సుప్రీం కోర్టు సహించలేకపోయింది. న్యాయస్థానాన్ని అగౌరవ పరిచే చర్య అని సుప్రీం వాఖ్యానించింది.  ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్ భగ్గుమంది. ఆయన అభిమానులు రోడ్ల మీద నిరసనలు చేపట్టారు.వందలాది ఇమ్రాన్ అభిమానులను  ప్రభుత్వం  అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ను మళ్లీ కోర్టులో గంటలోపు హాజరుపర్చాలని సుప్రీం ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ విషయంలో చాలాకాలంగా పాకిస్థాన్ లో చర్చనీయాంశంగా  ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని కోర్టులో వచ్చి లొంగిపోతాను అని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ అతను లొంగిపోకపోవడంతో ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగి పాకిస్థాన్ అగ్ని గుండమైంది. ఇవ్వాళ ఇమ్రాన్ అరెస్ట్ తో మళ్లీ అగ్ని గుండమైంది. 

ఆలీ .. కాట్రవల్లి.. కల తీరేనా?

జగమెరిగిన కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు.  బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన  అలీ వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు, వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా ఒకటో రెండో (ఇంకా ఎక్కువో కూడా) సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అలాగే, అలీ ...తో సరదాగా .. కార్యక్రమంతో టీవీ యాంకర్  గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని మాటలు ఎందుకు గానీ,తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. సందేహం లేదు. అంతవరకు అయితే, ఓకే కానీ, ఈలోగా ఆలీని రాజకీయ పురుగు కుట్టింది. సినిమా విజయాలతో సంతృప్తి చెందని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.  నిజానికి ఆలీ రాజకీయలకు కూడా కొత్తకాదు. ఎంతో కాలంగా ఆయన పొలిటీషియన్’ అయిపోవాలని కలలు కంటున్నారు.కాస్ట్యూమ్స్ గట్రా రెడీ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లంచ్’కి పిలిచి త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, కొత్త బొత్తాలు కుట్టించుకుని మరీ రెడీ అయి పోయారు. అయితే  ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా పట్టుకోవాలని, ఆలీ ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్  కట్టబెట్టిన జగన్  అలీ అశలను నెరవేర్చారా? అంటే లేదు ఉసూరు మనిపించారనీ అలీ అభిమానులు అంటున్నారు. అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్  తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి.  అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే  ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తెలిసింది. యిక ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తలంచారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకు బాగా దగ్గరగా ఉన్న అలీ.. కేవలం ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలన్న ఆశతోనే.. ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అనూహ్యంగా జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.   వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న జగన్ సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు.  సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.   అదలా ఉండే యిప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు యింకా ఏడాది సమయం ఉన్నా.. ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో  ఆశావహులు తమతమ పార్టీల అధినేతలను ప్రసన్న చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడానికి ప్రయత్నాలను షురూ చేసేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అలీకి వైసీపీ నుంచి పోటీ చేయడానికి టికెట్ లభిస్తుందా? అందుకోసం ఆయన ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? అన్న సందేహాలు సహజంగానే అలీ అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.  అలీ అయితే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి ఫిక్స్ అయిపోవడమే కాకుండా  ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఇందులో గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనీ ఈ నాలుగు  నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట.   తల్లినీ, చెల్లినే కాదు పొమ్మన్న వైసీపీ అధినేత జగన్   అలీకి పార్టీ టికెట్ ఇస్తారా?  రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి బాబాయ్ నే పక్కకు  తప్పించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ రెడ్డి అలీ  కి ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అలీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే హేమాహేమీలు పోటీకి రెడీగా ఉన్నారు.  మరి వారిని కాదని  జగన్  అలీకి టికెట్ ఇస్తారా?  ఒక వేళ ఇస్తే  గన్  ప్రభుత్వం ఎదుర్కుంటున్న వ్యతిరేక సునామీలో  కొట్టుకుపోకుండా నిలబడగలరా? నిలబడి గెలవగలరా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.  మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ ఆశ ఈ సారైనా నెరవేరుతుందా? చూడాలి.

కామన్ సివిల్ కోడ్ కు హిమంత బిశ్వ ముందడుగు

మన చట్టాలు బహు భార్యత్వాన్ని నిషేదించాయి. ఒక్క ముస్లిం పర్సనల్ లా షరియత్ మాత్రమే బహు భార్యత్వాన్ని అంగీకరించాయి.  దేశమంతా కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసోంలో బిజెపి ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి పావులు కదుపుతోంది. బహు భార్యత్వంపై 2024లోపు నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ  శర్మ గురువారం ప్రకటించారు.  రాష్ట్రంలో బహుభార్యత్వ నిషేధాన్ని అమలు చేయడంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు  కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు.కమిటీ తన నివేదికను సమర్పించడానికి మూడు నెలల సమయం ఇవ్వబడుతుంది. ‘‘అసోంలో బహుభార్యత్వంపై ఈ సంవత్సరం చివరి నాటికి 2024లోపు మనం బహుభార్యాత్వాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకురాగలమని నేను ఆశిస్తున్నాను’’  అని ముఖ్యమంత్రి వెల్లడించారు "రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో పరిశీలించేందుకు అసోం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది" అని ట్వీట్‌లో పేర్కొన్న మూడు రోజుల తర్వాత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ బహుభార్యత్వాన్ని నిషేధించాలని శర్మ చేసిన ప్రకటనను వ్యతిరేకించారు.  రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రి షరియత్ కు వ్యతిరేక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారని ఆయన  ఎద్దేశా చేశారు. అజ్మల్ ప్రకటనపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు. “అతను (బద్రుద్దీన్ అజ్మల్) మా ప్రతిపక్షం. ఆయన నాకు మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎలా ఓటు వేస్తారు? కాబట్టి, నేను అజ్మల్‌కి ప్రాముఖ్యత ఇవ్వదల్చుకోలేదు’’ అని హిమంత  అన్నారు. కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పుకోవచ్చు.   

రైతుకు బంధువేనా?

‘రైతు బంధుకు నేటితో ఐదేళ్లు.. సీఎం కేసీఆర్  ఆలోచనతో ప్రారంభించిన రైతు బంధు వివాదాస్పదమైంది. కౌలు రైతులకు రైతుబంధు వర్తించకపోవడం వివాదానికి కారణమైంది.  ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యిందని బీఆర్ ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి.  అందుకే సీఎం కేసీఆర్  అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసాయి అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయి’… అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా, రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి 5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేస్తోంది. ఖరీఫ్,రబీ సీజన్ లకు ఎకరానికి 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదివేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తోంది. ఈ మొత్తాన్ని రైతులకు చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. రైతుబంధుకు వచ్చిన ఆదరణ చూసి జాతీయ స్థాయిలో ఈ స్కీం అమలు చేయడానికి బిజేపీ ప్రభుత్వం ఆలోచన చేసి పిఎం కిసాన్ స్కీం అమల్లోకి తెచ్చింది.  తెలంగాణ వ్యాప్తంగా 10 విడతలుగా చెల్లించిన రూ.65,000 కోట్లరూపాయలతో  70 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.  రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా విముక్తి చేయడం ఈ పథక ముఖ్య ఉద్దేశ్యం.  ఫిబ్రవరి 25, 2018న ప్రొఫెసర్ జయశంకర్  అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమన్వయ సమితి సదస్సులో ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. కరీంనగర్‌లోని ధర్మరాజ్‌పల్లి గ్రామంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ముందు అదే సంవత్సరం బడ్జెట్‌లో రూ.12,000 కోట్ల రూపాయలను రైతుబంధు కోసం  కేటాయించారు.  తెలంగాణా రాష్ట్రంలో రైతుబంధుకు  స్పందన బాగా ఉండటంతో ను  రైతు బంధు, జాతీయ స్థాయిలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఆలోచించేలా చేసింది.  కేంద్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పిఎంకిసాన్ యోజన ప్రారంభించారు.   ఒడిశాలోని బిజెడి ప్రభుత్వం కాలియా పథకం  రైతు బంధు నుండి ప్రేరణ పొందినవే.  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ పథకం కింద ఇప్పటివరకు 10 విడతలుగా సహాయం అందించింది. ఈ ఏడాది యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 144.35 లక్షల ఎకరాలకు రూ.7,217.54 కోట్లు విడుదల చేసింది. అంతేకాకుండా ఈ పథకం దేశంలోని రైతు సంక్షేమం కోసం ప్రకటించిన టాప్ 20 పథకాలలో ఒకటిగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ చే ప్రశంసించబడింది. రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వ్యవసాయరంగ రూపురేఖల్ని మార్చేసింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 2022-23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానం రెండో స్థానానికి ఎగబాకింది.

మహా గవర్నర్ తీరును తప్పుపట్టిన సుప్రీం

శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన  సుప్రీం కోర్టు ధర్మాసనం  గవర్నర్  తీరును తప్పుపట్టింది. అలాగే  షిండే జారీ చేసిన విప్ ను అప్పటి స్పీకర్ గుర్తించడాన్ని సైతం తప్పుపట్టింది. అయితే  సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనకుండానే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసినందున ఆయనను తిరిగి సీఎంగా నియమించలేమని పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఒక రాజకీయ పార్టీలో  చీలికను బలపరీక్ష ద్వారా నిర్ధారించడానికి వీల్లేదని పేర్కొంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ చీలిపోయిందని కాదనీ,  పార్టీ శ్రేణులు, కార్యకర్తల స్థాయిలో చీలికను గుర్తించాలనీ పేర్కొంది.   సరిగ్గా ఈ కారణంగానే  తెలుగుదేశం పార్టీలో 1995 ఆగస్టులో  తెలుగుదేశం పార్టీలో సంభవించిన సంక్షోభ సమయంలో చంద్రబాబునాయుడి నాయకత్వంలోని గ్రూపునే అసలైన తెలుగుదేశం పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.  తెలుగుదేశం చీలిక వర్గం నేతగా చంద్రబాబు అప్పట్లో   కేంద్ర ఎన్నికల సంఘానికి  1995 సెప్టెంబర్ 15,  అదే  నెల 29 అలాగే అక్టోబర్ 10, అక్టోబర్ 24 తేదీలలో వరుసగా లేఖలు రాశారు. అలాగే  మొత్తం 3694 మంది పార్టీ జనరల్ బాడీ సభ్యులలో 2679 మందిఎన్టీఆర్ స్థానంలో  తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబుకు మద్దతుగా న్యాయ న్యాయ నిపుణులు కపిల్ సిబల్, రాజేంద్ర చౌదరి, రాకేష్ శర్మ, ఎన్వీ రమణ (ఈయన ఆ తరువాత సీజేఐ అయ్యారు)లు వాదించారు. అయితే  ఏక్ నాథ్ షిండే  శివసేనను  చీల్చిన సమయంలో ఈ ప్రక్రియ ఏమీ జరగలేదు.  అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం షిండే ను శివసేన అధ్యక్షుడిగా గుర్తించి పార్టీ గుర్తును కూడా కేటాయించింది.  అయితే సుప్రీం కోర్టు  మాత్రం ఏకపక్షంగా షిండే వర్గాన్ని అసలు శివసేనగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఎటువంటి వ్యాఖ్యలూ లేయలేదు. అదలా ఉండగా షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ దేనని  సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో ప్రస్తుత స్పీకర్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే ఆయన నిర్ణయం ఎలా ఉన్నా సుప్రీం కోర్టు తీర్పుతో మహారాష్ట్ర ప్రజలకు ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని అక్రమంగా పడగొట్టారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. 

కర్ణాటకలో కింగ్ మేకర్ జెడిఎస్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, ఎగ్జిట్ పోల్‌లలో చాలా వరకు కాంగ్రెస్‌కు బలం చేకూర్చాయి, వాటిలో మూడు అధికార బిజెపీతోతో గట్టి పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 122 నుండి 140 సీట్లు సాధిస్తుందని అంచనా.  న్యూస్ 24-టుడే చాణక్య ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్  పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా . 224 మంది సభ్యుల సభలో అధికార బిజెపి మెజారిటీ సాధిస్తుందని కేవలం ఒక పోల్‌స్టర్-న్యూస్ నేషన్-సిజీఎస్ అంచనా వేసింది. చాలా సర్వేలు జేడీ(ఎస్)కి 20-స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన మొదటి దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం.  సర్వేల ప్రకారం అధికారం బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి మారనుంది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంది. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల సంఘం ప్రకారం 72.67 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) 2018 ఎన్నికలలో మిత్రపక్షాలుగా పోటీ చేసి  పరాజయం చెందాయి.  జనతాదళ్ (సెక్యులర్)తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బుధవారం ఉదయం  విలేకరులతో అన్నారు.2018 ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, జెడిఎస్ జతకట్టాయి. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరడంతో వారి ప్రభుత్వం కూలిపోయింది.  "జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం"అని శివకుమార్ అన్నారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు లేవని తెలుస్తోంది.  అధికారంలో వచ్చే పార్టీలకు జేడీఎస్   మద్దత్తు ఇస్తే సరిపోతుంది. కాబట్టి జెడిఎస్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జెడీఎస్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? బిజెపీతో పొత్తు పెట్టుకుంటుందా? వేచి చూడాలి.  

విశ్వనగరం కాదు ఉగ్ర నగరం!

హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందా?  విశ్వనగరం అంటూ బీఆర్ఎస్ ఒక వైపు గొప్పలు చెప్పుకుంటుంటే మరో వైపు  రాష్ట్ర రాజధాని ఉగ్రనగరంగా  మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే  హైదరాబాద్ ప్రజలు బాంబులపై  నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర లింకుల ఆరోపణలపై అరెస్టైన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండాన్ని ప్రస్తావించిన ఆయన ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు.  2‌016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను కూడా ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.  హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర ఘటన జరిగినా హైదరాబాద్ లింకులు బయటపడుతున్నా కేసీఆర్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని నిలదీశారు.   ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మజ్లిస్ పార్టీతో  కుమ్మక్కయ్యానని బండి విమర్శిస్తున్నారు.  హైదరాబాద్ లో హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యుటి) ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు పట్టుబడటంతో మరోసారి హైదరాబాద్ కు ఉగ్ర లింకుల అంశం తెరపైకి వచ్చింది.  రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న హెచ్ యుటి కావడం.. ఆ సంస్థతో లింకులున్నాయంటూ హైదరాబాద్ లో అరెస్టులు జరగడం సహజంగానే హైదరాబాదీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.   లుంబినీపార్క్, దిల్ షుక్ నగర్ పేలుళ్ల ఘటనల ను నగర వాసులు యింకా మరచిపోకముందే.. మరో సారి నగరంలో ఉగ్ర మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.   ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.    

అట్టుడికిన పాక్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలతో బుధవారం అర్థరాత్రి పాకిస్తాన్ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాటకీయ నిర్బంధం తరువాత ఎనిమిది రోజుల పాటు కస్టడీలో ఉంటారు. ఖాన్‌ను మంగళవారం రాజధాని ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  నిరసనకారుల సామూహిక అరెస్టులతో పాకిస్థాన్ అట్టుడికింది.    పాకిస్థాన్ లో  అనేక స్మారక చిహ్నాలు మరియు ప్రభుత్వ భవనాలు తగలబడ్డాయి."మేము ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటాము. మరణం వరకు అతనికి మద్దతు ఇస్తాము." అని అభిమానులు నినదించారు. శాంతిని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.  రాజధానిలో సైన్యాన్ని మోహరించడానికి మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఇమ్రాన్ ఖాన్ కు  చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇస్లామాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పిటీఐ మద్దతుదారులు పోలీసులతో  ఘర్షణ పడ్డారు.  

తిట్ల పురాణాలను యికనైనా స్వస్తి పలుకుతారా?

తిట్ట పురాణాలే రాజకీయ విమర్శలుగా  చెల్లుబాటు అవుతున్నాయి. రాజకీయాలలో  భిన్నాభిప్రాయాన్ని హుందాగా వ్యక్తం చేయడమన్నది కనుమరుగైపోయింది. కొడాలి నాని మార్కు విమర్శలకే నాయకులు ప్రాధాన్యత యిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి మారాలి. మారుతుందా అంటే తలసాని, రేవంత్ రెడ్డిల ఎపిసోడ్ లో తలసాని ఒక అడుగు వెనక్కు వేసి తన పిసుకుడు విమర్శను వెనక్కు తీసుకోవడం చూస్తే మారుతుందనే అనిపిస్తుంది. యింతకీ అసలీ పిసుడుకు విమర్శ, దానికి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు రాజకీయాలలో భాషా దారిద్యం  ఏ స్థాయికి వెళ్లిందో అర్ధమౌతుంది.  బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై, తెలంగాణ సీనియర్‌ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాటలతో విరుచుకుపడ్డారు.  పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేరెత్తకుండానే  ఆ పొట్టోని నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యే లేదు. మంత్రులు లేదు. అందరినీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. పిసికితే పోతాడు’’అని తలసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందుకు అంతే దీటుగా రేవంత్ కూడ బదులిచ్చారు అది వేరే సంగతి. అయితే తలసాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తన మాట తూలుడును సద్దుకునే ప్రయత్నం చేశారు. తమ అధినేత కేసీఆర్ ను కించపరిచేలా విమర్శలు చేశారన్న ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి మాట తూలనని తలసాని హుందాగా అంగీకరించారు.  బాధ్యతగల మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నేను ఆవేదనతో , ఆగ్రహంతో చేసిన అనుచిత చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. పార్టీలు వేరైనా ప్రత్యర్థులపై చేసే విమర్శలు అర్ధవంతంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.  వ్యక్తిత్వాన్ని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఉండటం మంచిది కాదన్నది తన అభిప్రాయమనీ  ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాని  అన్నారు. అయితే తలసాని తనను పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఏమీ హుందాగా స్పందించలేదు. పేడ పిసికే అలవాటున్న తలసాని, పిసుగుడు గురించే మాట్లాడతారంటూ ఆయన కూడా మర్యాద గీతను దాటేశారు.  ఆయన కూడా వెనక్కు తగ్గి తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగ్రహంతో మాట తూలడం, ఆ తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని ఆ మాటను ఉపసంహరించుకోవడం రాజకీయాలలో  గతం నుంచీ కూడా ఉంది. అయితే యిటీవలి కాలంలో అనుచిత వ్యాఖ్యలను సమర్ధించుకోవడం. మర్యాద గీతను ఎంత దాటితే అంత గొప్ప  నేత అన్న భావన ఎక్కువ అవ్వడం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు నోటికి పని చెప్పడం ద్వారానే తమ పార్టీ అధినేత ప్రాపకం పొందగలం అన్న భావనలో ఉన్నారని అనిపించక మానదు. ఏది ఏమైనా తలసాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆగ్రహంతో మాట తూలానని అంగీకరించడం హుందాగా ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ప్రతి విమర్శలూ మర్యాద గీత దాటిన సందర్బాలు చాలా అరుదు. అలా అరుదుగానైనా మాట జారిన నేత వెంటేనే వనక్కు తగ్గి క్షమాపణతోనో, తన వ్యాఖ్యల ఉపసంహరణతోనో దిద్దుబాటు చర్యలకు దిగేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత అటువంటి వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బూతులూ, తిట్లే రాజకీయ విమర్శలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.  ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంలో ప్రధమ స్థానంలో ఉండగా, తెలంగాణలో కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు.   ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుని హుందాతనాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో నేతలు యిక నుంచైనా మాటలు మీరే విషయంలో నియంత్రణ పాటించాలి. ఒక వేళ తూలినా.. హుందాగా ఆ విషయాన్ని అంగీకరించి ఉపసంహరించుకుంటే.. రాజకీయాలలో విలువలకు ఒక అర్ధం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. 

శృతి మించిన విమర్శలు..రేవంత్ వర్సెస్ తలసాని!

రాజకీయాలలో విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణ విషయం. అయితే అవి శృతి మించితే  ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పిసుకుడు చాలెంజ్  ఆ కోవకే చెందుతుంది. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతదని పరోక్షంగా రేవంత్ రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ అయ్యాయి. తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో,  రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు. దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాసయాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాసరావుకుందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడంటూ  రేవంత్ రెడ్డి  కౌంటరిచ్చారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్టాడటమా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాసయాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు. కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా, తన స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.విషయమేమిటంటే.. పరిధిలు దాటి  పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్న ఈ ఇద్దరూ కూడా ఒకప్పుడు టీడీపీలో కలిసి పని చేసిన వారే.  2014లో ఇద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తలసాని టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి, తలసాని మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మరోసారి.. తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ ల మధ్య విమర్శలు మర్యాద పరిధి దాటుతున్నాయి. ఓ వైపు ఎండలు..మరో వైపు అకాల  వర్షాలతో  రైతులు, ప్రజలు కష్టాలలో ఉంటే.. వాటిని విస్మరించి..  బాధ్యతాయుత పదవులలో ఉన్న నేతలు  యిలా చౌకబారు విమర్శలతో  కాలం గడిపేయడమేమిటని జనం ఛీత్కరించుకుంటున్నారు.   

ముద్రగడ రాజకీయ అడుగులు ఎటో?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి పున: ప్రవేశంపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన సత్యం జయించిందని సంతోషమని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు చింతిస్తున్నానని లేఖలో ప్రస్తావించారు. 2016 ఫిబ్రవరి 2న తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీ చేశారన్నారు. బెయిల్ తెచ్చుకోండి, లేకపోతే అండర్ గ్రౌండ్ కి వెళ్లమని సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదన్నారు. తుని ఘటన తరువాత తనను తీహార్ జైలుకు తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశారన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే కాపు ఉద్యమం చులకనయ్యేదన్నారు. అప్పటి డీజీపీకి కూడా నాపై సమస్త కేసులు పెట్టుకోండంటూ అప్పట్లో లేఖ రాశానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదన్నారు. తుని రైలు దగ్ధం కేసును ఇటీవల రైల్వే కోర్టు కొట్టివేసింది. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై పెట్టిన కేసులు ఎత్తేసింది. దీంతో ముద్రగడ పద్మనాభం  వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం  ఉందన్నప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని వాస్తవమేననీ అనలేదు. తాజాగా రాసిన లేఖలో మాత్రం రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో  ముద్రగడ రాజకీయ అడుగులు ఎటువైపు అన్నచర్చ అయితే జోరందుకుంది. అదలా ఉంటే.. ముద్రగడ కమలం వైపు మొగ్గు చూపుతున్నాన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ ప్రచారానికి ముద్రగడతో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు జరిపినట్లుగా చెబుతున్నచర్చలు కూడా ఒక కారణం.   ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముద్రగడ తాను కాకపోతే  తన వారసుడిని న్నికల బరిలో నిలపాలని ముద్రగడ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే  ముద్రగడ లేఖ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో  కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమాలు చేసిన ముద్రగడ.  వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం యిచ్చిన తరువాతే ఆయన రాజకీయపున: ప్రవేశం చేయాలని కాపు నేతలుఅంటున్నారు.  

ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు!

పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే  బెటరని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలంగాణ భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్ కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అన్న కోణంలో ఆయా అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని  బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని ఇంటర్ విద్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి  అంటున్నారు. ఎస్ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని అంటున్నారు.   ఇప్పుడు ఇంటర్ మార్కుల కంటే జేఈఈ, నీట్ ర్యాంకులు వస్తాయో? రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉందనడంో సందేహంల లేదు. అనేక కారణంల వలన  సరిగ్గా సాగని విద్యా సంవత్సరం, స్మార్ట్ ఫోన్ రంగప్రవేశం లాంటివి విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశం. ఫలితంగా.. వారు పరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పదో తరగతి తరహాలోనే ఇంటర్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇవ్వాలనే  తెలంగాణ సర్కారు ఆలోచన  కార్యరూపం దాలిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, విద్యారంగ నిపుణులూ అంటున్నారు. 

పెట్టుబడులు ఎవరికో మరి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికున్న అవకాశాలు, తెలంగాణ సర్కార్ పారిశ్రామిక వేత్తలకు వేస్తున్న రెడ్ కార్పెట్ గురించి వివరించడానికి మంత్రి కేటీఆర్ ఈ సారి యూకే కు బయల్దేరారు. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సు రెండో ఎడిషన్‌లో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది.రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన ఈ నెల 13 వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా కేటీఆర్ ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి ఆయన వివరించనున్నారు.అయితే గతేడాది మే లో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి  లండన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయలు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు.అయితే ఈ పర్యటన మంచి ఫలితాలను ఇచ్చింది. లండన్ కు చెందిన పలు కంపెనీలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈ సారి కేటీఆర్ యూకే పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేశారు. తెలంగాణాకు పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతో యూకే బయలు దేరిన కెటీఆర్ ఇక్కడి ప్రభుత్వ స్థలాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఈ పర్యటన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు  ఒక సవాల్ చేశారు. దమ్ముంటే భూకబ్జాలు, ఖరీదైన ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ ఆస్పత్రికి విక్రయించడం తదితర ఆరోపణలన్నీ అవాస్తవమని నిరూపించాలని సూచించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలను కూడా వెల్లడిస్తానని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి బిల్డర్లకు అనుమతులు ఇస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులివ్వడమేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కెటీఆర్ యుకె పర్యటన వివాదాస్పదం కానుందని విశ్లేషకులు అంటున్నారు. 

పవన్ కల్యాణ్ ఫ్రం 2014 టు 2024

కొణిదెల కల్యాణ్@ కొణిదెల పవన్ కల్యాణ్@ పవర్ స్టార్ పవన్ కల్యాణ్లో కొన్ని అరుదైన గుణాలు ఉన్నాయని ఆయనను దగ్గరగా చూసిన వారు అంటూ ఉంటారు. అన్నచాటు తమ్ముడిగా, సినిమాలలో అడుగులు వేసి, అన్నతోటి తమ్ముడిగా ప్రజారాజ్యంలో కలిసి, అన్నను మించిన తమ్ముడిగా జనసేనతో మెరుస్తున్న పవన్ కల్యాణ్ ది కొంత విలక్షణమైన మనస్తత్వమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో  పవన్ కల్యాణ్  పేరు ఒకటి అని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు.  2007 అక్టోబర్ లో రివాల్వర్ పట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లపై హల్ చల్ చేసిన పవన్ కు, పీఆర్పీ పెట్టనప్పుడు ప్రసంగాలు చేసిన పవన్ కు, జనసేన అధినేతగా  యిప్పుడు పావులు కదుపుతున్న పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.  కానీ పవన్ కల్యాణ్ కు సినిమారంగంలో దక్కినంత స్టార్ డమ్రాజకీయాలలో దొరకలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. సహజంగా గెలిచిన నాయకులు కూడా ప్రజల మొహం చూడని నేటి రాజకీయాలలో సమయం దొరికినపుడు ప్రజలతో కలిసే పవన్ కల్యాణ్ ను ప్రజలు యిష్టపడతారు.  రెండు చోట్లా ఓడించినా ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాట అనని పవన్ తన మీద తానే జోకులు వేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నిస్తున్నారు.  యిదంతా పవన్ మేనరిజం అనుకుంటే పొరపాటే. పవన్ తన భావోద్వేగాలను తాను నియంత్రించుకుని రాజకీయ నాయకుడిగా తనను తాను మలచుకుంటున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అంటే జోడు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారికి సినిమాలు తన జీవనోపాధి అని చెప్పేశారు. కనుక సినిమాలు చేయక తప్పని పరిస్థితి అనేది స్పష్టమైంది. గతంలో పవన్ ను కేవలం సినిమా స్టార్ గానే ప్రజలు చూశారనడంలో సందేహం లేదు. కానీ ఆ ఇమేజ్ ని పవన్ మార్చుకోగలిగారు. ఇందుకు పవన్ లోని రాజకీయ నిబద్ధత, కొంత కారణమైనా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం.  2014 మార్చ్ 14న ప్రారంభమైన జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో  2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీఅధికారలోకి రావడానికి తాము కూడా కారణమని భావించిన జనసేన 2019 ఎన్నికలలో స్వయంగా రంగంలోకి దిగి ఒకే ఒక్క అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. దీంతో రాజకీయాలంటే సినిమా కాదని పవన్ కల్యాణ్ కి తెలిసి వచ్చింది. సహజంగానే 2019 ఓటమి తరువాతే పవన్ కల్యాణ్ లో గుణాత్మకమైన మార్పు వచ్చింది.  గడిచిన నాలుగేళ్లలో అధికార వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను మరింతగా పదును పెట్టారు.  క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ ర ాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పారు.  తాజాగా టీడీపీకి పవన్ దగ్గరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. అంతే కాకుండా మోడీ ఆశీస్సులు బలంగా పవన్ కల్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. గతంలో పవన్ వివాహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగాగమనిస్తున్న జనసేన బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే అంశంపై రెండో ఆలోచనకు తావులేదనిపవన్ కల్యాణ్జనసేన ముఖ్యనేతలకు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని, పవర్ షేరింగ్అనే విషయాలపై ఎవరూ నోరెత్తవద్దని పవన్ కల్యాణ్ తన పార్టీ సీనియర్లకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా త్వరలో బస్సుయాత్ర చేసేందుకు పవన్ సిద్ధంఅవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.  ఇదంతా గమనిస్తే  రాజకీయ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పవన్ ఎంత వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారో అర్ధంఅవుతుంది. అభిమానుల ఆవేశాన్నికంట్రోల్ చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న పవన్ 2024 ఎన్నికలలో జనసేనపోటీ చేయబోతున్న సీట్లపై కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది.

సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగింపు తగదు

పిల్లలలో తార్కిక ఆలోచనా విధానానికి, శాస్త్రీయ దృక్ఫధంలో నిర్ణయాలు తీసుకునే  శక్తికీ తిలోదకాలిచ్చేసేలా ఎన్సీఈఆర్టీ నిర్ణయాలు ఉంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యాంశాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం అటువంటి నిర్ణయమేనని వారంటున్నారు. టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలని యిటీవల ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. ఈ అంశంపై తాజాగా టాటా యిన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వివిధ ఐఐటీలకు చెందిన 1800 మంది  నిపుణులు రాసిన బహిరంగ లేఖలో జీవపరిణామ సిద్ధాంతాన్ని విస్మరిస్తే తదనంతర కాలంలో మనం దేన్నీ అర్థం చేసుకోలేమని అందులో పేర్కొన్నారు. డార్విన్ సిద్ధాంతం సాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయడం కుదరదనీ,  ప్రజల్లో విజ్ఞానం పెంపొందించాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఎన్సీఈఆర్టీ నిర్ణయం విరుద్ధమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.  చరిత్రను.. భవిష్యత్తును అర్ధం చేసుకోవడానికి దోహదపడే  సిద్దాంతాలను తొలగిస్తే.. భవిష్యత్ తరాలు దేన్నీ కూడా అర్థం చేసుకోలేమ పరిస్థితి ఎదురౌతుందనీ, రాబోయే తరంలో మూఢ నమ్మకాలు పెరుగుతాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కునో పార్కులో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా ప్రాణాలు వదిలింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన  చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మృతి చెందింది. పార్క్ లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో  తీవ్రంగా గాయపడిన దక్ష చికిత్స పొందతూ  చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. దక్ష మృతిలో కునో నేషనల్ పార్కులో లో  40 రోజుల వ్యవధిలో ఇది మూడో  చీతా చనిపోయినట్లైంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. భారత్ కు రాకముందు నుంచే మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చీతా.. మరింత అస్వస్థతకు గురై  మృతిచెందింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయింది.  ప్రాజెక్ట్ చీతా భాగంగా  ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, 2023 ఫిబ్రవరి 17న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా  వీటిని  దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకువచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా మధ్యప్రదేశ్ కునో పార్కులో వదిలిన సంగతి విదితమే.  వీటిలో ఒక్కొక్క చీతా  మరణిస్తుండటంతో పార్కు అధికారులు ఏం చేయాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు.