జగనే ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం: కేసీఆర్ నోట సీమాంధ్ర మాట

  విభజనవాది కేసీఆర్, సమైక్యవాది ముసుగులో వున్న పచ్చి విభజనవాది జగన్ మధ్య వున్న ఆత్మీయత మరోసారి బయటపడింది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం వీరిద్దరి మధ్య వున్న అనుబంధానికి అద్దం పట్టింది. కేసీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే, తెలంగాణలో టీఆర్ఎస్‌కి 90 సీట్లు వస్తాయట. కాంగ్రెస్‌కి మాత్రం 23 నుంచి 30 స్థానాలు మాత్రమే వస్తాయట. ఈయనగారు తెలంగాణ సీఎం అవుతాడట. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందట. మొన్నటి వరకూ సోనియాని, రాహుల్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు సోనియా, రాహుల్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం, ఆ తల్లీకొడుకులంటే తనకెంలాంటి వ్యతిరేకత లేదని చెప్పడం వెరైటీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మూడో ఫ్రంట్ గురించి ఆలోచిస్తాడట. అంతేగానీ ఎన్టీయేకి మాత్రం మద్దతు ఇవ్వడట. ఇదిలా వుంటే ఈ డూప్లికేట్ తెలంగాణ బిడ్డ తన తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించకుండా సీమాంధ్ర గురించి, జగన్ గురించి ఆలోచించేశాడు. సీమాంధ్రలో జగన్ వందకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాడట. తాను చేసిన స్పెషల్ సర్వేలో జగన్‌కి వందకంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని తెలిసిపోయిందట. తెలుగుజాతి ప్రయోజనం కోసం తాను, జగన్ కలసిమెలసి పనిచేస్తారట.

మే 12 సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ కి ఓకే: సి.ఇ.సి.

  గతంలో ఎన్నికలు జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కి అవకాశం వుండేది. అయితే ఈసారి ఎన్నికలలో ఆ అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అనేక దశల్లో జరగడంతోపాటు ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల మీద ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ 12వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని నిషేధం విధించింది. ఎన్నికలు ముగిసినా ఎగ్జిట్ పోల్స్ సందడి లేకపోవడంతో రాజకీయంగా వేడి వాతావరణం అకస్మాత్తుగా తగ్గిపోయిన ఫీలింగ్ అందరిలో ఏర్పడింది. ఎన్నికల వేడిని మళ్ళీ రగలబోతోంది. ఈనెల 12 నుంచి ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించుకోవచ్చని ఎన్నికల కమిషన్ తాజాగా స్పష్టం చేసింది. తుది విడత పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా ప్రకటించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 12 సాయంత్రం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకూ మీడియా, ప్రజలు, రాజకీయ నాయకులు అసలైన ఎన్నికల పండుగ చేసుకోబోతున్నారు.

ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పెట్టి బిల్డింగ్ మీద నుంచి దూకింది

  మలేసియాలోని కోటా కినాబాలు అనే టౌన్‌కి చెందిన హర్సినా చీ అనే యువతి ఎంతోకాలంగా ఒక యువకుడితో ప్రేమలో వుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె లవ్‌స్టోరీలో అనుకోని మలుపులు వచ్చాయి. ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫేస్‌బుక్ వాల్ మీద నిర్వేదంతో కూడిన పోస్టింగ్స్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా పోస్ట్ చేస్తోంది. దీనిని ఆమె ఫ్రెండ్స్ గానీ, ఆమె ప్రియుడు కానీ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. సడెన్‌గా నిన్న ఆమె ఒక సూసైడ్ నోట్‌ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిల్డింగ్ మీద నుంచి దూకడం ఒక పిచ్చిపని అని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు నాముందు అది తప్ప మరో మార్గం లేదు. ఇది నీకోసమే రాస్తున్నాను. నేను ఎంత పిచ్చిదాన్నో నీకు తెలిసొచ్చేలా చేస్తాను. నీకు నా థాంక్స్. నేను నా కళ్ళని శాశ్వతంగా మూసేస్తున్నాను’’ అని పోస్ట్ చేసి వెంటనే బిల్డింగ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది.

ఆ కుటుంబం మీద మృత్యువు పగబట్టింది

  మృత్యుదేవత కర్కోటకురాలు. జాలి, దయ అనే పదాలే దానికి తెలియవు. అలాంటి మృత్యువు ఒక్కోసారి మరీ కర్కోటకంగా ప్రవర్తిస్తుంది. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మృత్యువు ఒక కుటుంబం మీద పగబట్టింది. ధనశ్రీ కదమ్ అనే బాలిక పోటీ పరీక్ష రాయడానికి ముంబై - గోవా హైవే మీద ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. కుమార్తె మరణవార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్, ప్రియాంక గుండెలు పగిలేలా రోదించారు. కూతురి మృతదేహం దగ్గరకి చేరుకుని విలపించారు. ఆ తర్వాత కూతురు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వెనుకే ప్రవీణ్, ప్రియాంక, వీరి సమీప బంధువు నరేష్ దేవ్‌రే కారులో వస్తున్నారు. ఇంతలో రోడ్డుపక్కన వున్న ఒక పొక్లెయినర్ అకస్మాత్తుగా ఒరిగిపోయి కారుమీద పడింది. దాంతో కారులో వున్న ప్రవీణ్, ప్రియాంక, నరేష్ అక్కడికక్కడే మరణించారు. తమ ఇంట్లో ముగ్గురూ ఒకేసారి మరణించడంతో, ప్రవీణ్, ప్రియాంక దంపతుల చిన్న కుమార్తె శివం కదమ్ షాక్‌కి గురైంది. ఈ దుర్ఘటనలను చూసి స్థానికులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం!

  విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం దొరికింది. ఇది ఎక్కడో ఏ ఫారిన్‌లోనే కాదు.. మన ఇండియాలోనే.. కేరళలోని కొరిప్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. షార్జా నుంచి కాలికట్ వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ టాయ్‌లెట్‌కి వెళ్ళినప్పుడు టాయ్‌లెట్‌లో ఎవరో ప్రయాణికుడు దాచిన రెండు కిలోల బంగారాన్ని గమనించింది. ఆమె వెంటనే ఈ విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్ళింది. విమానాన్ని దించడానికి ముందే పైలెట్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. అయితే అరవై లక్షల విలువైన ఆ బంగారం మాది అని ప్రయాణికులలో ఎవరూ ముందుకు రాలేదు. అలా వస్తే అరెస్టు చేయాలని ఎయిర్ పోర్ట్ అధికారులు వెయిట్ చేశారు. అయితే ఎవరూ సదరు బంగారాన్ని క్లెయిమ్ చేయకపోవడంతో ఆ రెండు కిలోల బంగారం ప్రస్తుతం కస్టమ్స్ అధికారుల దగ్గరే వుంది.

కడప, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న అల్లర్లు

  ఎన్నికలు పూర్తయ్యి రెండురోజులు కావస్తున్నా నేటికీ కడప, నెల్లూరు జిల్లాలలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రెండు జిల్లాలు కూడా వైకాపాకు మంచి పట్టున్న ప్రాంతాలే కావడం వలన సహజంగానే వైకాపానే అనుమానించవలసి వస్తోంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, ఖాజీపేట్, నెల్లూరులో దంతలూరు ప్రాంతాలలో నేటికీ ఇరువర్గాల నడుమ వీధిపోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి, వాటిలో ఇరువర్గాలకు చెందిన అనేకమంది గాయపడుతూనే ఉన్నారు. ఈ గొడవలకు ప్రధాన కారణం వైకాపాకు కంచుకోట వంటి ఈ ప్రాంతాలలో తెదేపా నేతలు పోటీకి దిగి, ఆ పార్టీ అభ్యర్ధులతో సమానంగా ప్రచారం చేసుకొని, వారితో సమానంగా డబ్బు, మద్యం వగైరాలు పంచడమే. తెదేపాకు చెందిన పీ.వెంకట శివారెడ్డి, వైకాపాకు చెందిన యం.యల్సీ. సీ.నారాయణ రెడ్డి వర్గాల మధ్య నిన్న జమ్మలమడుగులో ఘర్షణలు జరిగాయి. షరా మామూలుగా ఇరువర్గాల వారు గాయపడ్డారు, ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్లలో పిర్యాదులు చేసుకొన్నారు. కాజిపేట్ లో మైదకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లా ఎరుకొల్లు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకు ముందు ఎన్నికలలో కూడా ఇటువంటి అల్లర్లు, గొడవలు జరిగినప్పటికీ, అవి ఏనాడు కూడా ఇంతగా ఎన్నికల ముగిసిన తరువాత కూడా సాగిన దాఖలాలు లేవు. ఇటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్రానికి, రాజకీయాలకు కూడా హానికరం. రెండు పార్టీల అధినేతలు ఏసీ రూముల్లో కూర్చొని మీడియా ద్వారా ఒకరిని మరొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, అక్కడ గ్రామాలలో కార్యకర్తలు వీరికోసం బుర్రలు పగలగోట్టుకొని రక్తాలు ధారపోస్తున్నారు. కనీసం ఇప్పటికయినా ఆ రెండు పార్టీల అధినేతలు చొరవ తీసుకొని తమ తమ కార్యకర్తలను నియంత్రిస్తే తమ కార్యకర్తల కుటుంబాలకి మేలు చేసినవారవుతారు.

యు.పి.లో జీపును ఢీకొన్న రైలు: 13 మంది దుర్మరణం

  ఉత్తరప్రదేశ్‌లో పెళ్ళిబృందం ప్రయాణిస్తున్న ఒక జీపును లెవల్ క్రాసింగ్ దగ్గర రైలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పెళ్ళికి హాజరైన 16 మందితో తిరిగి వస్తున్న జీపు రాత్రివేళ కావడంతో యు.పి.లోని సిస్వా - గుగ్లీ మధ్య కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ దగ్గర ట్రాక్‌ని దాటే ప్రయత్నం చేయడంతో అకస్మాత్తుగా గోరఖ్ పూర్ - నర్కాతియా ప్యాసింజర్ రైలు దూసుకు వచ్చి ఈ ఘోర ప్రమాదం జరిగింది. జీపులో ప్రయాణిస్తున్న 16 మందిలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

మాజీ సీఎం నేదురుమల్లి కన్నుమూత.. పలువురి నివాళి

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దనరెడ్డి (80) హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1935 ఫిబ్రవరి 20న నెల్లూరు జిల్లా వాకాడలో నేదురుమల్లి జనార్దనరెడ్డి జన్మించారు. రాజకీయాలలోకి రాకముందు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 1998లో బాపట్ల, 1999లో నరసరావుపేట, 2004లో విశాఖపట్నం నుంచి లోక్‌సభకు నేదురుమల్లి ఎన్నికయ్యారు. 1988లో పీసీసీ అధ్యక్షుడిగా నేదురుమల్లి పనిచేశారు. 1990 నుంచి 92 వరకు జనార్దన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేదురుమల్లి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నక్సలైట్ల మీద నిషేధం విధించారు. ఆయనను చంపాలని నక్సలైట్లు రెండుసార్లు ప్రయత్నించారు. ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లికి నలుగురు కుమారులున్నారు. నేదురుమల్లి మరణంతో ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా వాకాడలో విషాదఛాయలు అలముకున్నాయి. నేదురుమల్లి భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి సోమాజిగూడలోని నివాసానికి తరలించారు. జనార్దనరెడ్డి మరణవార్త తెలియగానే కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, సహచరులు పెద్ద సంఖ్యలో నేదురుమల్లి నివాసానికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి పళ్ళంరాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యయ్య, మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, వైసీపీ నేత మైసూరారెడ్డి తదితరులు నేదురుమల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు పంపకాలు

  ఒకవైపు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలతో హడావుడి పడుతుంటే, గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం నిశబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. మే16న ఎన్నికల ఫలితాలు వెలువడగానే, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్దమయిపోతుంది గనుక, ఈలోగానే రెండు ప్రభుత్వాలకు అవసరమయిన కార్యాలయాల ఏర్పాట్లు చకచకా పూర్తి చేసేస్తున్నారు. జూన్ రెండున అధికారికంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్నపటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడేలోగానే, ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల కొరకు ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా విభజించి అవసరమయిన మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.   తెలంగాణకు ఏ, బీ, సీ, డీ బ్లాకులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణకు హెచ్, కె, ఎల్ బ్లాకులు కేటాయించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్ బ్లాక్ ను కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంగా లేక్ వ్యూ అతిథి గృహాన్ని కేటాయించారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ని కూడా రెండు రాష్ట్రాలకు విభజించారు. రెండు రాష్ట్రాలకు డీఐజీ మరియు సీఐడీ కార్యాలయాలను కూడా కేటాయిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. ఈనెల 20లోగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు రాష్ట్రాలకు అన్నివిభాగాలలో పంపకాలు, భవనాల కేటాయింపులు పూర్తయిపోవాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు.     ఇక ఈ రోజు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ విభాగాలకు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. వీటిలో తూర్పు డిస్కంకు-15.80 శాతం, మధ్య (సెంట్రల్) డిస్కంకు-38.02 శాతం, ఉత్తర డిస్కంకు-17.87శాతం, దక్షిణ డిస్కంకు-30.31శాతం విద్యుత్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.   ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు ఐఏయస్, ఐపీయస్ మరియు ఐఎయఫ్ అధికారులను కేటాయిస్తూ సిఫార్సులు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 మంది ఐఏయస్, 144 మంది ఐపీయస్, 82మంది ఐఎయఫ్ అధికారులను, తెలంగాణా రాష్ట్రానికి 163మంది ఐఏయస్,112మంది ఐపీయస్, 65 మంది ఐఎయఫ్అధికారులను కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 

పవన్ టీ ఇచ్చాడు.. చంద్రబాబు భోజనం పెట్టాడు

ఎన్నికల ముందు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి సఖ్యత కుదిరిన సమయంలో చంద్రబాబు నాయుడు అందర్నీ ఆశ్చర్యపరిచే రీతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం కోసమో, స్నేహం కోసమో ఒకరి ఇంటికి వెళ్ళడం అనేది ఎవరూ ఊహించని విషయం. ఎవరైనా చంద్రబాబు దగ్గరకే రావాలి తప్ప చంద్రబాబే ఒకరి దగ్గరకి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్‌తోనే మొదలైంది. ఆనాడు జరిగిన ఈ సంఘటన గురించి చంద్రబాబు చెబుతూ, ‘పవన్ కళ్యాన్ తేనీటి విందుకు పిలిచారు.. వచ్చాను’ అని చెప్పారు. ఆ తర్వాత పవన్, బాబు ఇద్దరి స్నేహం బలపడటం, బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ వీరలెవల్లో ప్రచారం చేయడం జరిగాయి. ఇచ్చిపుచ్చకున్నదే అసలైన స్నేహం. అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్‌ని తన ఇంటికి లంచ్‌కి పిలిచాడు. పవన్ కళ్యాణ్ కాదనకుండా చంద్రబాబు ఇంటికి వచ్చాడు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌‌తో కలసి పవన్ కళ్యాణ్‌కి సాదర స్వాగతం పలికారు. ముగ్గురూ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు కుటుంబం నవకాయ పిండివంటలతో షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన టీకి బదులుగా చంద్రబాబు మంచి భోజనం పెట్టాడు. చెల్లుకి చెల్లు మరి పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన దానికి బదులుగా చంద్రబాబు ఏమిస్తారో, ఏ పదవి ఇస్తారో చూడాలి.

వాట్స్ యాప్‌పై నిషేధం

  సెల్ ఫోన్లలో విస్తృతంగా వ్యాప్తిలో వున్న ‘వాట్స్ యాప్’ను ఇరాన్ నిషేధించింది. ఇరాన్‌లో ఈ యాప్ ఎవరూ వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ గతంలో ఫేస్ బుక్‌ని కూడా నిషేధించింది. ఫేస్‌బుక్‌ని, వాట్స్ యాప్‌ని నిషేధించడానికి ఇరాన్ అధికార వర్గాలు చెప్పిన కారణాలు వింటే ఎవరైనా ఆశ్చర్యంతో నోళ్ళు తెరుస్తారు. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ ఈమధ్యనే వాట్స్ యాప్‌ని కొలుగోలు చేశాడు. అందుకే దీనిని నిషేధించారు. గతంలో ఫేస్ బుక్‌ని నిషేధించడానికి కారణం దాని అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కావడమే కారణం. జుకెర్ బర్గ్ కి, ఇరాన్‌కి శత్రుత్వం ఏమిటని ప్రశ్నిస్తే, ‘‘జుకెర్ బర్గ్ అమెరికాకి చెందిన వ్యక్తి. అంతేకాకుండా అతను యూదులకు మద్దతు ఇస్తూ వుంటాడు. అందువల్ల అతనికి సంబంధించినవి ఇరాన్‌లో వ్యాప్తిలో వుండటానికి వీల్లేదు’’ అని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. చాదస్తం అంటే ఇదే కదూ?!

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మటాష్: వెంకయ్య నాయుడు

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవడం ఖాయమని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్లమెంటు స్థానం కూడా గెలుచుకోదని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయమని అన్నారు. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన సందర్భంగా గురువారం నాడు వెంకయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ప్రజలందరూ కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేశారని వెంకయ్య నాయుడు చెప్పారు. సీమాంధ్ర పోలింగ్‌లో కాంగ్రెస్‌కి ఓటు వేసినవాళ్ళుగానీ, కాంగ్రెస్ గురించి పట్టించుకున్నవాళ్ళు కానీ కనిపించలేదని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు.

చంద్రబాబు ప్రాధాన్యతలు ఏమిటి?

  ఈ ఎన్నికలలో రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్ర మోడీ కనుక అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడితే ఆయన ప్రాధాన్యతలు ఏవిధంగా ఉండవచ్చునో ఒకసారి చూద్దాము.   1. మొట్ట మొదట కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలో స్థిరపడేందుకు అవసరమయిన మద్దతు కూడగట్టవచ్చును.   2. కొత్త రాజధాని గుర్తింపు ప్రక్రియ పూర్తి కాగానే వీలయినంత త్వరగా ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలను యుద్దప్రాతిపదికన నిర్మించి ప్రభుత్వపాలన రాష్ట్రం నుండే చేసేందుకు అవసరమయిన చర్యలు తీసుకోవచ్చును. అవసరమయితే ముందుగా కొన్ని కార్యాలయాలను రాష్ట్రంలో లభ్యమయ్యే భవనాలలోకి మార్చినా మార్చవచ్చును.   3. గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టేందుకు అవసరమయిన అని చర్యలు యుద్దప్రాతిపాదికన చెప్పట్టవచ్చు.ఆర్ధిక లోటుని భర్తీ చేసుకొనేందుకు గాను కేంద్రం నుండి భారీ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తూనే, తనకున్నపరిచయాలతో సాఫ్ట్ వేర్ కంపెనీలను, పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పించవచ్చు. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలూ, నిర్మాణ రంగాలకు చెందిన పరిశ్రమలకు పెద్ద పీట వేయవచ్చును.   4. నష్టాల ఊబిలో కూరుకుపోయున్న ఆర్టీసీ, చేనేత వంటి అనేక సంస్థలను గాడిన పెట్టె ప్రయత్నం చేయవచ్చు.   5. ఇదివరకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వోద్యోగులను నిర్లక్ష్యం చేసినందున చాలా భారీ మూల్యం చెల్లించ వలసి వచ్చింది గనుక ఈసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ మూడు అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టడం తధ్యం.

తెదేపాకు కలిసి వచ్చిన అంశాలు ఏమిటి?

  ఆంద్ర, తెలంగాణాలలో ఎన్నికలు పూర్తయిపోయాయి. తెలంగాణాలో తెరాసకు కొంత ఆధిక్యత వచ్చి న్నప్పటికీ, అక్కడ సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తునన్నారు. ఇక ఆంద్ర విషయానికి వస్తే తెలుగుదేశం, వైకాపాల మధ్య జరిగిన హోరాహోరీగా పోటీలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం తెదేపా పటించిన అభివృద్ధి, సంక్షేమ మంత్రాలే. పట్టణాలలో ప్రజలను చంద్రబాబు చెప్పిన సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, సింగపూరు వంటి ఆధునిక రాజధాని నిర్మాణం వంటివి విపరీతంగా ఆకట్టుకోనగా, ఆయన ప్రకటించిన ఋణాల మాఫీ, సంక్షేమ పధకాలు, ఇతరత్రాలు గ్రామీణులను ఆకర్షించాయి.   ఇక చంద్రబాబుకి మరికొన్ని అంశాలు కూడా బాగా కలిసివచ్చాయి.   1. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో పూర్తిగా డ్డీలా పడిపోవడం. ఆ పార్టీ నుండి హేమాహేమీలు తెదేపాలోకి వచ్చి చేరడం.   2. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలలో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడి ఉండటం. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగి ఉండటం.   3. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేకపోవడం. అతనిపై అనేక సీబీఐ, ఈడీ కేసులు, అవినీతి ఆరోపణలు కలిగి ఉండటం. చంద్రబాబు పరిపాలనానుభావం అనుభవం, దక్షత, కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండటం.   4. విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు. మోడీతో ఆయనకున్న సాన్నిహిత్యం. మోడీ, పవన్ కళ్యాణ్ ప్రచారం, ప్రజలపై వారి ప్రభావం.

అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్‌ది అరణ్యరోదన

  రాష్ట్ర విభజన అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 17వ తేదీకి మార్చాలని, తద్వారా టీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చి, అధికారం నుంచి దూరమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో మొర పెట్టుకున్నా, ఢిల్లీలో మొరపెట్టుకున్నా సంబంధీకులందరూ డేట్ ముందుకు జరపడం మావల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చే అపాయింటెడ్ డేను జూన్ 2 నుంచి ముందుకు జరపడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ఆలోపు విభజన పంపకాలు చేయడం కుదరదని వెల్లడించాయి. అపాయింటెడ్ డే నాటికి పంపకాలు ఒక కొలిక్కి వచ్చేలా లేవని, దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరగా ప్రభుత్వాల ఏర్పాటు, అపాయింటెడ్ డేను ముందుకు జరపడం సాధ్యం కాదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జూన్ 2 వరకూ ఆపితే ఈ లోపు రాజ్యాంగ, రాజకీయ సమస్యలు ఎదురవుతాయని టీఆర్ఎస్ నాయకులు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.

హిందూపూరంలో గెలుస్తా.. సినిమాలు తగ్గిస్తా: బాలకృష్ణ

      అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలక‌ృష్ణ పోటీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బాలక‌ృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో తన గెలుపు ఖాయమని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాలయ్య తెలిపారు. ప్రజాసేవ కోసం సినిమాలను కొంత తగ్గించుకుంటానని, పూర్తిగా దూరంకాబోనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని బాలకృష్ణ తెలిపారు.

ఓటేశాక చనిపోయింది

      కాళ్ళూ చేతులు సరిగానే వున్న కుర్రకారుని ఓటేయడానికి రమ్మంటే ఇంట్రస్ట్ లేదని చెబుతారు. ఓటరుగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారు. అయితే బాధ్యత తెలిసిన వారు మాత్రం తమకు వయసు ఎంత మీద పడినా ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ ఎన్నికలలో శతాధిక వృద్ధులు అనేకమంది పోలింగ్ బూత్‌లకు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో అయితే వంద సంవత్సరాలు దాటిన వృద్ధురాలు ఆరోగ్యం బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా ఓటు వేయడానికి తపనపడింది. ఓటు వేసి వచ్చి ఉత్తమ పౌరురాలిగా తనను తాను నిరూపించుకుంది. పండంటి నిండు జీవితాన్ని చాలించింది. కృష్ణా జిల్లాలోని పి.నైనవరం గ్రామానికి చెందిన చిట్టి దుర్గమ్మ అనే శతాధిక వృద్ధురాలు ఓటు వేసి వచ్చిన కొద్ది సేపటికే కన్నుమూసింది.