ఏపీ, తెలంగాణలకు మరో ఘనత... మొదటి ర్యాంకు

  రెండు తెలుగురాష్ట్రాలు మరో ఘనతను సాధించాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సంయుక్తంగా తొలి ర్యాంక్‌ సాధించాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా ఇప్పుడు మొదటిర్యాంకు సాధించింది. ఇక 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ ఏకంగా మొదటిస్థానానికి ఏగపాకింది. ఇక గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మొదటి ర్యాంకు సాధించగా.. మూడోస్థానంలో గుజరాత్‌, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచాయి.

పాఠశాలపై ఉగ్రదాడి...

  పాకిస్థాన్ లో కూడా ఈ మధ్య ఉగ్రదాడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోదాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ బహవాల్‌నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలపై సోమవారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తు విద్యార్దులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇద్దరు సాయుధులైన ఉగ్రవాదులు పాఠశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వెంటనే పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో స్కూల్‌ సెక్యూరిటీ గార్డు మాత్రం ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలలోని విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు.

పోలీసులు క్షమాపణ చెప్పాలి.. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఆందోళన..

  తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ శ్రీనివాసరావు నిర‌స‌నకు దిగారు. తనతో పోలీసులు దుర్భాషలాడారంటూ ఆయన నిరసనకు దిగారు. వివరాల ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దీపావళి పండుగ సందర్భంగా నిన్న‌ రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు దుకాణాలను మూయించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌నివాస‌రావు ఇంటి సమీపంలో ఉన్న ఓ బేకరీని మూసేయాల‌ని చెప్పారు. దీంతో శ్రీ‌నివాసరావుకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జ‌రిగింది. దీంతో ఆయ‌న ఆందోళ‌నకు దిగారు. పోలీసులు ఆయ‌న‌కు నచ్చజెప్పే పయత్నం చేశారు. అయినా శ్రీ‌నివాస‌రావు త‌న‌ ఆందోళనను విరమించలేదు. న‌గ‌ర‌ ప్రజల పట్ల పోలీసుల తీరు బాగోలేద‌న‌డానికి ఈ ఘ‌ట‌నే నిదర్శనమని శ్రీ‌నివాసరావు ఆరోపించారు. తనకు పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.

ట్రంప్ అలాంటివాడే అని నమ్ముతున్న అమెరికన్లు..

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అక్కడ సర్వేలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇప్పటికి పలు సర్వేలు చేసిన సంస్థలు ఇప్పుడు ట్రంప్ పై సర్వే నిర్వహించారు. రిపబ్లికన్ల తరపున పోటీ చేస్తున్నడొనాల్డ్ ట్రంప్ మహిళలపై పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ సందర్భాల్లో తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆయన చేత లైంగికంగా వేధింపులకు గురయ్యామని పలువురు మహిళలు తెలిపారు. అయితే ఇప్పుడు ట్రంప్ పై వచ్చిన ఆరోపణలు ఎంత వరకూ నమ్ముతున్నారని ఓ సర్వే నిర్వహించారు. ఏపీ-జీఎఫ్ కే సంస్థ  చేసిన ఈ సర్వేల్లో 70 శాతం మంది అమెరికన్లు ఆ ఆరోపణలు నిజమని నమ్ముతున్నారట. ఇక ఈ ఆరోపణలను ప్రత్యర్థుల కుట్రగా, ట్రంప్ అభివర్ణిస్తున్నప్పటికీ, అమెరికన్లు మాత్రం ట్రంప్ పై వచ్చిన ఆరోపణల్ని నమ్ముతున్నారట. దీంతో ప్రత్యర్థి హిల్లరీ పైచేయి సాధిస్తుందని ట్రంప్ వర్గీయులు ఆందోళన చెందుతున్నారట. కాగా నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

భయపడ్డ జకీర్ నాయక్.. తండ్రి అంత్యక్రియలకూ రాలేదు...

  జకీర్ నాయక్ గత కొద్ది రోజులుగా భారత్ రాకుండా విదేశాల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. భారత్ కు ఎక్కడ వస్తే తనను ఎక్కడ పట్టుకుంటారో అని ఇండియా రావడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు తాను భయపడుతున్నది నిజమే అని మరోసారి రుజువు చేశారు. తన తండ్రి అంత్యక్రియలకు సైతం జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు. బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు అయిన జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ నిన్న తెల్లవారుజామున మరణించారు. అయితే ప్రస్తుతం మలేసియాలో ఉన్నారని భావిస్తున్న జకీర్ నాయక్.. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. ఆయన అంత్యక్రియలకు భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు వచ్చారు. కానీ జకీర్ నాయక్ మాత్రం.. భారతదేశానికి వస్తే తనను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో రాకుండా ఆగిపోయారు. కాగా నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్రకుమార్ దారుణ హత్య..

  పొరుగు దేశాల్లో, పొరుగు రాష్ట్రాల్లో మన తెలుగు వారు హత్యకు గురవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఇప్పటికి ఎన్నో చూశాం. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే బెంగుళూరులో చోటుచేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్త పరుచూరి సురేంద్రకుమార్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆయనను కాల్చి చంపారు. అయితే, ఈ హత్య వెనుక ఆయన పాత మేనేజర్ హస్తం ఉండవచ్చని..పక్కా ప్లాన్ తోనే ఈ మర్డర్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియలెస్టేట్ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాపారంతో పాటు, పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ ను కూడా సురేంద్ర కుమార్ నిర్వహిస్తున్నారు.

టెర్రర్ టెన్షన్..8మంది సిమీ ఉగ్రవాదులు పరార్..

  బోపాల్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బోపాల్ జైలు నుండి 8మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ గొంతును స్టీల్ ప్లేట్ తో  కోసి ఉగ్రవాదులు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. రమాశంకర్ ను హత్య చేసిన అనంతరం, బ్లాంకెట్స్ సహాయంతో ప్రహరీ గోడను ఎక్కి, జైలు నుంచి బయటపడ్డారు. పరార్ అయిన సిమీ ఉగ్రవాదుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ 8 మంది ఉగ్రవాదులను గతంలో ఒడిశాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండ్వా జైలు నుంచి ఏడుగురు సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నారు అని చెప్పారు.

సైనికుల‌తో మోడీ దివాళి సెల‌బ్రేష‌న్స్

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దీపావ‌ళిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కిన్నూర్ జిల్లాలో విధులు నిర్వ‌ర్తిస్తున్న సైనికుల‌తో ఆయ‌న దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. సిమ్లా నుంచి 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌మ్ దో ప్రాంతంలో ఇండో-టిబెటెన్ బోర్డ‌ర్ పోలీస్, డోగ్రా స్కౌట్స్, ఆర్మీ జ‌వాన్ల‌ను క‌లుసుకున్న ప్ర‌ధాని స్వ‌యంగా జ‌వాన్ల‌కు స్వీట్లు పెంచి దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాని వెంట జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, ఆర్మీ చీఫ్ ద‌ల్బీర్ సింగ్ ఉన్నారు. అనంత‌రం చాంగో గ్రామంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌తో మోడీ ముచ్చ‌టించారు.   

న్యూజిలాండ్ లక్ష్యం 270..

  భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ గెలుచుకుంది. మొత్తం ఐదు వన్డేల్లో చెరో రెండు మ్యాచులు గెలిచిన టీంలు ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించడానికి కసరత్తు చేశాయి. ఇక బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కూడా కాస్త తడబాటుగానే ఆడి స్వల్ప లక్ష్యాన్నే కివీస్ ముందు ఉంచింది. మొత్తం 6 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసిన ఇండియా.. 270 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కు ఇచ్చింది కాగా, నాల్గో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన నాల్గో వన్డేల్లో మొదటి, మూడో మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించగా; రెండు, నాల్గో వన్డే మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. దీంతో చివరి మ్యాచ్లో గెలవడానికి ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి.

క్షమాపణ చెప్పిన ఎయిర్ఇండియా..

  పూరీ జగన్నాథ టెంపుల్ కమిటీకి విమానయాన సంస్థ ఎయిర్ఇండియా క్షమాపణ చెప్పింది. జగన్నాథ టెంపుల్పై తప్పుడు వ్యాసాన్ని ప్రచురించినందుకు గాను ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా క్షమాపణ చెప్పింది. నెలవారీ మ్యాగజీన్ లో పురీలోని జగన్నాథ టెంపుల్లో మాంసాహార వంటకాలను అందజేస్తున్నారని తప్పుడు ఆర్టికల్ను ఎయిర్ ఇండియా ప్రచురించింది. ఈ ఆర్టికల్ వల్ల  ఒడిశాలో తీవ్ర దుమారమే రేగింది. దీనిపై స్పందించిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా అంశంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఈ వ్యాసాన్ని తాము ప్రచురించలేదని ఎయిర్ ఇండియా తన క్షమాపణ చెప్పుకుంది.  అన్ని ఎయిర్ క్రాప్ట్ల నుంచి మ్యాగజీన్ను వెంటనే ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది.

టాటా నుండి ముగ్గురు ఔట్....

  టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. రతన్ టాటా ప్రస్తుతం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు మరో ముగ్గురు టాటా గ్రూప్ కి గుడ్ బై చెప్పారు. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు చెందిన బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ మధు కన్నన్‌, వ్యూహకర్త నిర్మాల్య కుమార్‌, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ ఎన్‌ఎస్‌ రాజన్‌ సంస్థకు గుడ్‌బై చెప్పారు. ముగ్గురు ప్రస్తుతం రాజీనామా చేయగా మరో ఇద్దరిని వేరే విధులకు పంపించారు. వీరిలో బ్రాండ్‌ కస్టోడియన్‌ ముకుంద్‌ రాజన్‌, టైటాన్‌ సీవోవో హర్షాభట్‌ ఉన్నారు.

రిక్షాలో పేటీఎం సీఈవో.. ఆశ్చర్యపోయిన అఖిలేష్

  నగరాలలో ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రతి ఒక్కరూ గురి కావాల్సిందే. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. ఆఖరికి ఎంత ప్రముఖులైనా సరై ట్రాఫిక్ టార్చర్ అనుభవించాల్సిందే. ఇలాంటి సమస్యే ఎదురైంది పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మకు. సీఎం అఖిలేష్ ను కలవడానికి బయలు దేరిన ఆయన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఇక ముందుకు కదిలే గత్యంతరం లేకపోవడంతో.. ఓ రిక్షాకార్మికుడు ఆపద్బాంధవుడిలా ఆయనను ఆదుకున్నారు. ఆయనను తన రిక్షాలో ఎక్కించుకొని సీఎం నివాసం 5 కాళిదాస్‌ మార్గ్‌కు తీసుకెళ్లారు. దీంతో విజయ్‌ శేఖర్‌ శర్మ రిక్షాలో రావడంతో అఖిలేశ్‌ ఆశ్చర్యపోయారు. తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్‌ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్‌ సీఈవో విజయ్‌ రిక్షా సైకిల్‌లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి’  అని అఖిలేశ్‌ పేర్కొన్నారు. వారి సంగతేమో కానీ సీఈవోను తీసుకొచ్చినందుకు గాను రిక్షావాలాకు మాత్రం అదృష్టం కలిసొచ్చింది. అతనికి రూ. 6వేల రివార్డుతోపాటు కొత్త రిక్షా సైకిల్‌, కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని సీఎం అఖిలేశ్‌ హామీ ఇచ్చారు.

మళ్లీ కేసీఆర్ కే నెంబర్ వన్ స్థానం..

  తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత దాదాపు ఏ సర్వేలు చేసినా... కేసీఆర్ కానీ.. రాష్ట్రం కానీ ముందు ప్లేస్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు మరో సర్వేలో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.  దేశంలో అత్యంత జనాదరణ కలిగిన సీఎంల గురించి వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో కేసీఆర్‌ అగ్రస్థానంలో నిలిచారు. రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మూడో స్థానంలో పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా.. తెరాసకు 51 శాతం ఓట్లు వస్తాయని వీడీపీ సర్వే వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఐదో స్థానంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరో స్థానంలో నిలిచారు. ఇక రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58 శాతం రేటింగ్‌తో 8వ స్థానంలో నిలిచారు.