3 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ పట్టివేత...

  రాజ‌స్థాన్‌లో అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్నారు. ఒకటి కాదు రెండు కాదులు ఏకంగా 3వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ ను అధికారులు ఓ ఫ్యాక్ట‌రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబ‌ర్ 28న మ‌రుధార్ డ్రింక్స్‌పై అధికారులు దాడి చేయ‌గా.. అందులో ఒక రూమ్ నిండా నిషేధిత మాండ్రాక్స్ టాబ్లెట్స్ క‌నిపించాయి. అందులో మొత్తం రెండు కోట్ల ట్యాబ్లెట్లు ఉండ‌గా.. వాటి బ‌రువు 23.5 మెట్రిక్ ట‌న్నుల‌ని, విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుంద‌ని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్‌ (సీబీఈసీ) చైర్‌ప‌ర్స‌న్ న‌జీబ్ షా వెల్ల‌డించారు. దీనిలో భాగంగా.. బాలీవుడ్‌కు చెందిన ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అరెస్ట్ చేశారు. డీఆర్ఐ చ‌రిత్ర‌లో ఇంత‌పెద్ద డ్ర‌గ్స్ రాకెట్ ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు.

పాక్ కే భారీ నష్టం..

  జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ రేంజర్లు తరచూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. వీరికి భారత సైన్యం కూడా బాగానే సమాధానం చెబుతున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే బీఎస్ఎఫ్ ద‌ళాలు చేసిన దాడిలో పాకిస్థాన్‌కు చెందిన బంక‌ర్ ధ్వంస‌మైనట్టు తెలుస్తోంది.  దానికి సంబంధించిన వీడియో ఫూటేజీని విడుద‌ల చేశారు. ఈ సందర్బం బీఎస్ఎఫ్ ఐజీ డీకే ఉపాధ్యాయ మాట్లాడుతూ.. భార‌త్ ఆర్మీ జ‌రిపిన దాడుల వ‌ల్ల పాక్‌లో భారీ న‌ష్ట‌మే వాటిల్లిన‌ట్లు తెలిపారు. చాలా ప‌క్క‌గా భార‌త‌ ద‌ళాలు దాడుల్లో పాల్గొంటున్నాయ‌ని, దాని వ‌ల్లే పాక్ ఆర్మీకి భారీ న‌ష్టం క‌లిగింద‌ని, సాధార‌ణ పౌరుల‌ను తాము టార్గెట్ చేయ‌లేద‌ని బీఎస్ఎఫ్ అధికారి వెల్ల‌డించారు. పాకిస్థాన్‌లో ఉన్న మిలిట‌రీ పోస్ట్‌ల‌ను మాత్ర‌మే తాము టార్గెట్ చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా గత కొద్ది  రోజులుగా రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న సంగతి తెలిసిందే. 

బస్సు చూడండి కానీ ముట్టుకోవద్దు.. అఖిలేష్ యాదవ్‌

  ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ ‘వికాసయాత్ర’ పేరిట గురువారం నుంచి ఈ యాత్రను ప్రారంభిచనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రకు గాను అఖిలేష్ యాదవ్ ఓ ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసుకున్నారు. పది చక్రాల ఎర్రటి మెర్సిడెస్‌ బస్సును సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రత్యేక బస్సు మంగళవారం అఖిలేష్ అధికారిక నివాసానికి చేరుకుంది. వికాస యాత్ర పేరుతో సాగే ఈ ప్రచారయాత్రలో కొద్దిరోజుల పాటు ఇదే బస్సులో ఆయన బస చేయనున్నారు. మంగళవారం లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చిన ఈ బస్సును వీక్షించేందుకు మీడియా, ప్రజలు ఎగబడ్డారు. అయితే బస్సును చూస్తున్నప్పుడు మీడియా ఫొటోలు తీస్తుండగా.. ‘బస్సు చూడండి కానీ ముట్టుకోవద్దు’ అని అఖిలేష్ అన్నారట. అంతేకాదు అఖిలేష్‌ నిలబడి ప్రచారం చేయడానికి వీలుగా బస్సులో హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. బస్సు చుట్టూ సీసీటీవీ కెమెరాలు, లోపల ఎల్‌సీడీ టీవీలు, సోఫాలు, బెడ్‌ తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. కాగా గత కొద్ది రోజుల నుండి అఖిలేష్ కుటుంబంలో విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలసిందే.

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ..

  వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన రాహుల్ గాంధీ..ఇదే కొత్త భారత్ అని..ఇది మోదీ ఇండియా.. వాళ్లు ప్ర‌జాస్వామ్యాన్ని విశ్వ‌సించ‌డం లేదు. ఇదొక ర‌కం మ‌న‌స్త‌త్వం అని ఈ సంద‌ర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. ఇంక ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా.. ఆసుపత్రి కుటుంబాన్ని పరామర్శించే ప్రదేశం కాదని అన్నారు. ఆసుపత్రిలో పరామర్శ కుదరదని చెబుతున్నా రాహుల్ వినకపోవడంతోనే అడ్డుకోవాల్సివచ్చిందని వెల్లడించారు. ఆయన్ను ప్రస్తుతం మందిర్ మార్గ్ పోలీసు ఠాణాలో ఉంచినట్లు చెప్పారు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌.. భారత జట్టు ఎంపిక

  న్యూజిలాండ్ తో ఇండియా టెస్ట్ సిరీస్, వన్డే మ్యాచ్ ల సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లడ్ తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసింది.   మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్‌ కోహ్లీ, రహానె, ఇషాంత్‌ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్‌ గంభీర్‌, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వర్దమాన్‌ సాహా, కరుణ్‌ నాయర్‌, మురళీ విజయ్‌, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య.  

జనసేన పార్టీతో జ‌త‌క‌ట్ట‌లేము.. బీజేపీ ఇంఛార్జ్

  వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పూర్తిగా రాజకీయ ప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీకి మద్దతు పలికిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు భార‌తీయ జ‌నతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు మ‌ద్ద‌తు మాత్ర‌మే తెలిపార‌ని, ఆయ‌న‌ స్థాపించిన జనసేన పార్టీతో తాము జ‌త‌క‌ట్ట‌లేద‌ని అన్నారు. త‌మ‌కు ఏపీ అధికార పార్టీ టీడీపీతో ఎలాంటి విభేదాలు లేవని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న ర్యాలీ నిర్వహించ‌నుంద‌ని, అందులో త‌మ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటార‌ని పేర్కొన్నారు.

హిల్లరీకి షాక్.. ట్రంప్‌ పైచేయి

  ఈనెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకూ హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ కంటే పై చేయిలో ఉండగా.. ఇప్పుడు ఆమె ఆధిక్యం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికాలో పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకూ హిల్లరీ ఏడు శాతం మద్దతుదారులను కోల్పోయారు. ఇక ట్రంప్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు ఈ-మెయిల్‌ వివాదమే అని తెలుస్తోంది.  గత ఎన్నికల్లో ఇదే సమయానికి రెండు పార్టీల అభ్యర్థులకున్న మద్దతుదారులతో పోలిస్తే.. ప్రస్తుతం హిల్లరీ, ట్రంప్‌ ఇద్దరు వెనకబడినట్టే కనిపిస్తుందని వివరించింది. తాజా విజయంపై ట్రంప్‌ రెట్టించిన ఉత్సాహంతో స్పందించారు. ‘వావ్‌, ప్రస్తుతం నేను ఆధిక్యంలో ఉన్నా. రెండు వారాల్లో దాదాపు 12 పాయింట్లు పైకి వెళ్లాను. అది కూడా సంకుచిత హిల్లరీని వెనక్కు నెట్టి’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇప్పటివరకూ ప్రముఖ సంస్థలు వెలువరించిన అంచనాల సగటు చూస్తే.. హిల్లరీ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌పై ఆమె 3.1 శాతం పాయింట్లు ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరి ఎన్నికలు జరిగే వేళ వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడాలి.

భోపాల్ లో హైఅలర్ట్...

  భోపాల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. భోపాల్ సెంట్రల్ జైలు నుండి 8మంది ఉగ్రవాదులు పారిపోగా వారిని ఎన్ కౌంటర్లో హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్ కౌంటర్ పై పలు కథనాలు వస్తున్నాయి. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ హై అలర్ట్ ప్రకటించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నాయకులు ఎక్కడికి ప్రయాణించొద్దని పోలీసులు తెలిపారు. అదేవిధంగా వారి భద్రత పెంచినట్టు తెలుస్తున్నది. మరోవైపు భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశమున్నదని, ఈ దాడుల్లో అమెరికా పౌరులను ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ లక్ష్యం చేసుకోవచ్చని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి అని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. సినిమా హాళ్లు, రైళ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామి, హర్కత్ ఉల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబ వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశముందని పేర్కొన్నది.

ఫ్యాన్సీ నెంబరు కోసం 60 కోట్లు...

  సాధారణంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం.. దుబాయిలో ప్రాపర్టీ డెవలపర్ అయిన భారతీయుడు బల్వీందర్ సహానీ తన కారు నెంబరు కోసం రూ.60కోట్ల్లు ఖర్చు చేశాడు. అక్టోబర్ 8న  ప్రభుత్వం నిర్వహించిన వేలంలో 33 మిలియన్ దిర్హామ్స్ పెట్టి డీ5 అనే సంఖ్యను దక్కించుకున్నాడు. ఇంకా రెండు రోల్స్ రాయిస్ కార్లకు ఇలాంటి నంబర్లే దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. గత ఏడాది కూడా 09 నంబర్‌ను 6.7 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. కొంత మంది తాను డబ్బును వృథా చేస్తున్నానని ఆరోపిస్తారు.. కానీ తిరిగి ఇవ్వడంపై తనకు నమ్మకం ఉందని.. తాను వెచ్చించే డబ్బు చారిటీలకు, దుబాయ్ నగర అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈశాన్య ఢిల్లీలోని మోహన్ పార్క్ ప్రాంతంలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పార్కింగ్ ప్రదేశం నుంచి వచ్చిన మంటలు క్రమంగా అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమవ్వగా..మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పార్క్ చేసిన ఆటో రిక్షా నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఏవోబీ ఎన్‌కౌంటర్‌.. మావోల బంద్ పిలుపు

  ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో వారం రోజుల క్రిందట భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లో చాలా మంది మావోయిస్ట్ లు చనిపోయారు. అయితే ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు బంద్ కు పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో  బంద్‌కు మావోలు పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుతోపాటు తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాచలం ఏజెన్సీలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉండడం సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. హై అలెర్ట్ ప్రకటించారు.

పాక్ వరుస పేలుళ్లు... 10మంది మృతి, 50మందికి గాయాలు..

  పాకిస్థాన్ వరస పేలుళ్లతో రక్తమోడుతుంది. ఇప్పటికే పలుమార్లు వరుస పేలుళ్లు సంభవించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి పాకిస్థాన్‌లోని దక్షిణ బెలూచిస్థాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 10మంది మృతి చెందగా, 50మందికి పైగా గాయాలపాలయ్యారు. కాలం చెల్లిన నౌకలను విచ్ఛిన్నం చేసే ప్రాంతంలో ఓ ఆయిల్‌ట్యాంకర్‌ కారణంగా ఈ పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్లు జరిగిన సమయంలో గద్దాని షిప్‌ బ్రేకింగ్‌యార్డులో 100మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఈ పేలుళ్లలో 10మంది మృతి చెందగా, 50మందికి పైగా గాయపడగా..30మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా నౌకలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించాయి.

తెదేపా ఎంపీటీసీలు రాజీనామా...

  నలుగురు టీడీపీ ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలానికి చెందిన పల్లలమూడి ఎంపీటీసీ సంధ్యారాణి, ఎంఎన్‌ పాలెం ఎంపీటీసీ శాంతకుమారి, దిగవల్లి ఎంపీటీసీ నాగేంద్రప్రసాద్‌, రావిచర్ల ఎంపీటీసీ సాంబశివరావు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీల మధ్య వివాదం నడుస్తోంది.  గ్రామాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీటీసీలకు తెలియకపోవడం.. అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గ ఇంఛార్జి ఏర్పాటుచేశారని చెప్పడంతో వారు మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో వారు నూజివీడు ఎండీవో కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాలను ఎండీవో రాణికి అందజేశారు. అయితే వాటిని ఆమె తిరస్కరించి... ఇది తన పరిధిలోనిది కాదని జిల్లా పరిషత్‌ సీఈఓకు అందజేయాలని సూచించారు.

చిక్కుల్లో పాక్ ప్రధాని...

  నల్లధనానికి సంబంధించి పనామా పేపర్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లలో పాకిస్థాన్ ప్రధాని మంత్రి న‌వాజ్ షరీఫ్ పేరు కూడా బయటపడిన సంగతి విదితమే.. అయితే ఇప్పుడు ఈ విషయంలో న‌వాజ్ ష‌రీఫ్ చిక్కుల్లో ప‌డ్డారు. ప‌నామా ప‌త్రాల కుంభ‌కోణంలో ష‌రీఫ్‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై విచార‌ణ‌కు ఆదేశించింది పాక్ సుప్రీంకోర్టు. ఈ మేర‌కు ఓ న్యాయ‌మూర్తి నేతృత్వంలో విచార‌ణ క‌మిష‌న్‌కు కూడా నియ‌మించింది. ఈ క‌మిష‌న్‌కు సుప్రీంకోర్టుకు ఉండే అన్ని అధికారాలను క‌ట్ట‌బెట్టింది. ఈ కేసులో రోజువారీ విచార‌ణ జ‌ర‌ప‌డానికి కూడా సుప్రీంకోర్టు అంగీక‌రించింది.