కోతి చెప్పిన జోస్యం.. ట్రంపే గెలుస్తాడు..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రపంచమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. అంత కంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ పలు సర్వేలు నిర్వహించగా కొన్ని హిల్లరీకి అనుకూలంగా వస్తే.. మరికొన్ని ట్రంప్ కు అనుకూలంగా వచ్చాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో ఓ కోతి కూడా జోస్యం చెబుతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా... అసలు సంగతేంటంటే... 'గెడా' అనే కోతి  అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్ ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది. ఈ ఏడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్ లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్ గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో అందరూ గెలుపు ట్రంప్ దే అని అంటున్నారు. మరి చూద్దాం గెడా చెప్పినట్టు ట్రంప్ గెలుస్తారా.. లేక హిల్లరీ గెలుస్తారా..?

ఢిల్లీ కాలుష్యం..1800 స్కూళ్ల‌కు సెల‌వు..

  దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్యాన్ని నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం వర్కవుట్ కావట్లేదు. గత కొద్ది రోజుల నుండి ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఢిల్లీలో కాలుష్యం నమోదైంది. కాలుష్యంలో పీఎం స్థాయి 1200 మైక్రోగ్రామ్స్ దాట‌డంతో ప్ర‌భుత్వం స్కూళ్ల మూసివేత‌కు ఆదేశాలు జారీ చేసింది. సుర‌క్షిత స్థాయి కంటే 13 రేట్లు ఎక్కువ‌గా కాలుష్యం ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో ప్ర‌భుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే.. ఢిల్లీలో ఉన్న 1800 ప్రైమ‌రీ స్కూళ్ల‌కు ఇవాళ సెల‌వును ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల సుమారు 9 ల‌క్ష‌ల మంది చిన్నారులు స్కూల్‌కు దూరంకానున్నారు.

99 సార్లు కాల్పులకు తెగబడ్డ పాక్..

జమ్ము కాశ్మీర్ సరిహద్దులో పాక్ బలగాలు తరుచూ కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైన్యం.. సర్జికల్ దాడులు జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకూ 99 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. జమ్ములోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి ఉన్న 16వ కోర్ ఏరియా పరిధిలో 83 సార్లు, కశ్మీర్‌లోని ఎల్‌వోసీ వెంట ఉన్న 15వ కోర్ ఏరియా పరిధిలో 16 సార్లు పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయని ఆర్మీ సీనియర్ అధికారులు శుక్రవారం తెలిపారు. దీనికి భారత బలగాలు దీటుగా స్పందించి 14 పాక్ పోస్టులను ధ్వంసం చేశాయని, ఇద్దరు రేంజర్లను హతమార్చాయని వివరించారు.

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు గ్రీన్ సిగ్నల్..

  గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సింగరేణి ఉద్యోగుల విషయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది.  సింగరేణి బోర్డు  నుంచి ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలోవారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. * సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. * ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

వ్యభిచారంలోకి ప్రత్యూష బెనర్జీ..

  బాలిక వధు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ కేసులో భాగంగా ఆమె ప్రియుడు రాహుల్‌రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే మొదట్లో ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.. కానీ గత రోజులుగా ఈ విషయం మరుగునపడిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అదేంటంటే..  ప్రత్యూష చనిపోవడానికి ముందు రాహుల్‌కి ఫోన్‌ చేసి మూడు నిమిషాల పాటు మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చింది. ‘నీచుడా... నా జీవితంలో అన్నింటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నా కెరీర్‌ కోసం.. నటించడానికి వచ్చాను. కానీ నువ్వు నన్ను వ్యభిచారిని చేశావ్‌. రాహుల్‌.. నువ్వు చేసిన పనికి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలీదు. నువ్వు స్వార్థపరుడివి. నా పేరు చెడగొట్టావ్‌. నా గరించి, నా తల్లిదండ్రుల గురించి సమాజం చెడుగా మాట్లాడుకుంటోంది. అంతా అయిపోయింది. నా పని అయిపోయింది.. నేనిక లేను’’ అని ప్రత్యూష మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి రాహుల్‌.. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని అరగంటలో వస్తున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు రాహుల్‌ ప్రత్యూషని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించాడని స్పష్టంగా తెలుస్తోందని లాయర్‌ నీరజ్‌ గుప్తా తెలిపారు. ఈ కేసు విషయమై మళ్లీ విచారణ జరపాల్సిందిగా పిటిషన్‌ వేస్తున్నట్లు పేర్కొన్నారు.

జయలలిత పూర్తిగా కోలుకున్నారు..హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను క్రిటికల్ కేరు యూనిట్(సీసీయూ) నుండి వేరే గదిలోకి మార్చుతున్నామని.. ఆమె ఆరోగ్యం కుదుపపడిందని అన్నాడీఎంకే నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మరింత క్లారిటీ వచ్చింది. జ‌య‌ల‌లిత పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో హాస్ప‌ిట‌ల్ చైర్మ‌న్ ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. చెన్నైలో జరిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ జయన ఆరోగ్యంపై స్పందిస్తూ.. పైవిధంగా వ్యాఖ్యానించారు. జ‌య పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని, త‌న చుట్టు జ‌రుగుతున్న విష‌యాలు ఆమె గ్ర‌హించ‌గ‌లుతున్నారని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కావాల్సిన వాటిని ఆమె అడుగుతున్నార‌ని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్న జ‌య‌ల‌లిత‌ను త్వ‌ర‌లోనే క్రిటిక‌ల్ కేర్ యూనిట్ నుంచి త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి. కాగా జయలలిత గత కొద్ది కాలంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

ముఖేష్‌ అంబానీకి భారీ షాక్.. 10 వేల కోట్లు జరిమానా..

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారీ నజరానా విధించింది. ఎన్‌జీసీ-రిలయెన్స్ సంస్థల‌కు చెందిన కేజీ- డీ 6 బ్లాక్ పై కొంత‌కాలంగా గ్యాస్ వివాదం చెల‌రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. 10,312 కోట్ల రూపాయ‌లు కట్టాలని ఆదేశించింది. ఓకృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిల‌య‌న్స్‌కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేసిందన్న నేపథ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్)1 బిలియన్ డార్లుగా ( సుమారు రూ. ​6652.75 కోట్లుగా)  లెక్క కట్టడంతో.. 1.55 బిలియన్ డాలర్లు( దాదాపు 10,312 కోట్ల రూపాయ‌లు) జరిమానా క‌ట్టాల‌ని కేంద్ర స‌ర్కారు పేర్కొంది.

ములాయంకు షాక్.. అఖిలేష్ లేకపోతే కుదరదు...

  యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నాయి. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా నిన్ననే తన ప్రచార యాత్రని ప్రారంభించారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు పొత్తుకు కూడా సిద్దమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు షాక్ తగిలినట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. దీంతో అఖిలేశ్ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా పెడితేనే చేతులు కలుపుతామని భాగస్వామ్య పార్టీలు స్పష్టం చేయడంతో ములాయం ప్రయత్నాలకు ఆరంభంలోనే హంసపాదు ఎదురైంది. సమాజ్ వాదీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా అఖిలేశ్ పేరును ఖరారు చేస్తేనే ఉమ్మడి పోరుకు అంగీకరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ కూడా మాట్లాడుతూ.. ములాయం మహాకూటమి ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా తన కుటుంబంలో రేగిన కలహాలను పరిష్కరించుకోవాలని సూచించారు.  అంతేకాదు సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి వస్తేనే మహాకూటమి సాధ్యమన్న అభిప్రాయాన్ని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యక్తం చేశారు. మరి ములాయం దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

యూకే కొత్త వీసా రూల్స్... ఇండియన్స్ కు కష్టమే..

  ఇకనుండి యూకే వెళ్లడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇండియన్స్... అందులోనూ ఐటీ రంగానికి చెందినవారు. ఎందుకంటే యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌భుత్వం త‌మ వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. యూకే హోమ్ ఆఫీస్ ఈ కొత్త రూల్స్‌ను ప్ర‌క‌టించింది. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫ‌ర్ (ఐసీటీ) కేట‌గిరీలో వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే ప్రారంభ‌ వేతనం 30 వేల పౌండ్లు ఉండాల్సిందే. ఇంత‌కుముందు ఇది 20800 పౌండ్లుగా ఉండేది. ఈ కొత్త నిబంధ‌న న‌వంబ‌ర్ 24 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఐసీటీ కేట‌గిరీలో బ్రిట‌న్‌లో ఉండే ఇండియ‌న్ ఐటీ కంపెనీలే ఎక్కువ శాతం వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తుంటాయి. ఇందులో సుమారు 90 శాతం వాటా ఇండియ‌న్ ఐటీ కంపెనీల‌వేన‌ని యూకే మైగ్రేష‌న్ అడ్వైజ‌రీ క‌మిటీ (ఎంఏసీ) వెల్ల‌డించింది.

మైనర్ బాలికలపై అత్యాచారం..11 మంది అరెస్ట్

  మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజయ్ బావిష్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర, బుల్దాన జిల్లా హివర్‌ఖేడాలోని నినాదీ ఆశ్రమ పాఠశాలలో బాలికలపై ఉపాధ్యాయులు, సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. పాఠశాల ప్రెసిడెంట్, సెక్రెటరి, జాయింట్ సెక్రటరితో పాటు పలువురు సిబ్బంది ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారని.. వీరిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. కేసు విచారణ కోసం మహారాష్ట్ర డీజీపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్‌)ను ఏర్పాటుచేశారు.

'టైమ్స్‌ నౌ' కి ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు..

  సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ 'టైమ్స్‌ నౌ' లో చీఫ్ ఎడిటర్ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తన పదవినుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆర్నబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. 'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమందిపై నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్‌ షో ‘ద న్యూస్‌ అవర్‌'తో పాపులరయిన ఆర్నబ్‌ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్‌ నౌ'లో పనిచేశారు. కాగా ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది.

పాక్ ప్రతీకారం.. 8మంది ఉద్యోగులపై ఆరోపణలు..

భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవడంలో ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టేట్టు కనిపించడంలేదు. ఇప్పటికే భారత్ లో పనిచేస్తూ గూఢాచార్య చేస్తున్న నేపథ్యంలో పాక్ ఉద్యోగిని విధుల నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే. దానికి పాక్ కూడా వెంటనే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు తాజాగా ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది భారత హై కమిషన్ అధికారులు పాక్ కు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని ఆరోపిస్తుంది. దీనిపై విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే  ఈ ఆరోపణలు చేస్తుందని అన్నారు. కేవలం ఒక్క పాక్ జాతీయుడినే భారత్ బహిష్కరించిందని గుర్తు చేసిన ఆయన, పాక్ ఎనిమిది మంది భారత ఉద్యోగుల గుర్తింపును బహిర్గతం చేసిందని, దీని వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుందని.. పాకిస్థాన్ లో ఉన్న భారత ఉద్యోగులు, వారి కుటుంబీకులందరి రక్షణ బాధ్యత ఆ దేశానిదేనని ఆయన స్పష్టం చేశారు.

జయలలిత గది మార్పు..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది రోజులుగా చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట హెల్త్ బులిటెన్లు విడుదల చేసినా.. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాస్త కుదుటపడిన నేపథ్యంలో బులిటెన్లు ఇవ్వడం కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి మరోసారి తెలిపారు అన్నాడీఎంకే నేతలు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ మాట్లాడుతూ.. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను  క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి వేరే గదిలోకి మారుస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు.

వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం నిధులు..

  తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.450 కోట్లు కేంద్రం విడుదల చేసింది.  2015-16 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నిధులను రూ.382.34 కోట్లు వినియోగించుకున్నట్టు కేంద్రానికి రాష్ట్రం ఇటీవల నివేదిక సమర్పించి.. దీంతో పాటు రెండో విడుత నిధులు విడుదల చేయాలని కోరింది. దీనికి గాను కేంద్రం 2016-17 ఆర్థిక సంవత్సరానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజిగా రెండో విడుతగా ఈ నిధులను విడుదల చేసింది. పాత జిల్లాలను ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణలో ఒక్కోజిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది జిల్లాలకు కలిపి రూ.450 కోట్లు విడుదల చేసింది.