మళ్లీ పాక్ కాల్పులు.. 12 గంటల్లో 6 సార్లు

  పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఆరుసార్లు కాల్పులు జరిపింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని నౌషేరా, సుంద‌ర్బ‌ని, ప‌ల్ల‌న్‌వాలా సెక్టార్ల‌లో విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులకు మన జవాన్లు ధీటైన సమాధానం చెబుతుండగా.. కాల్పుల వల్ల  ఒక బాలిక‌కు గాయాల‌ైనట్టు తెలుస్తోంది. ఇంకా ఈ కాల్పుల్లో  ఒక పాక్ రేంజ‌ర్ హ‌త‌మైన‌ట్లు స‌మాచారం. మరోవైపు ఈ కాల్పుల వల్ల సరిహ్దదు ప్రాంత ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. అంతేకాదు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని బీఎస్ఎఫ్ సూచించింది.

ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1200 కార్లు

సాధారణంగా పండుగలకి ఉద్యోగులకి బోనస్ లు ప్రకటిస్తుంటారు. అయితే ఇచ్చే జీతంతోపాటు ఏదో ఒక వెయ్యో.. రెండు వేలో బోనస్ గా ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యజమాని మాత్రం ఏకంగా... ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1200 కార్లు ఇచ్చాడు. వివరాల ప్రకారం... తన  కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. అతనే మన దేశంలో పేరుమోసిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ఢోలాకియా. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఢోలకియా.. ఈ ఏడాది తన వ్యాపార స్వర్ణోత్సవం సందర్భంగా దీపావళి బోనస్‌ల కోసం రూ. 51 కోట్లు వెచ్చించారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు దీపావళి బహుమతిగా 400 ఫ్లాట్లు, 1200 కార్లు ఇచ్చాడు. కాగా 2011 నుంచి ప్రతి ఏడాది ఈ రకంగా బోనస్ లు ఇవ్వడం ప్రారంభించారు ఆయన.

ఆఖరి వన్డే.... భారత్, న్యూజిలాండ్ కసరత్తు..

  భారత్-న్యూజిలాండ్ ల మధ్య వన్డే మ్యాచ్ల సరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి నాలుగు వన్డే మ్యాచ్లు జరుగగా..  ఆఖరి వన్డే మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి, ఐదో వన్డే మ్యాచ్ విశాఖపట్టణంలో జరగనున్న నేపథ్యంలో  రెండు జట్లు కొద్దిసేపటి క్రితం ‘విశాఖ’కు చేరుకున్నాయి. కాగా, నిన్న రాంచీలో జరిగిన నాల్గో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన నాల్గో వన్డేల్లో మొదటి, మూడో మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించగా; రెండు, నాల్గో వన్డే మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. దీంతో చివరి మ్యాచ్లో గెలవడానికి ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి.

సిరియా వైమానిక దాడులు...22 మంది చిన్నారులు మృతి

సిరియాలో తరచూ వైమానిక దాడులు జరుగుతూనే ఉంటాయి. ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న సిరియాలో.. దానికి అణచివేయడానికి సిరియా ప్రభుత్వం.. ఇతర దేశాల సహాయంతో వైమానిక దాడులు చేస్తుంది. ఇప్పుడు మరోసారి తాజాగా సిరియాలో వైమానికి దాడులు జరిగాయి. అయితే ఈ వైమానిక దాడుల్లో  22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. రష్యా, సిరియా యుద్ధ విమానాలు ఇడిలిబ్‌ ప్రావిన్స్‌లోని  పాఠశాల కాంప్లెక్స్‌పైనా దాడులు చేయడంతో 22 మంది చిన్నారులు, ఆరుగురు ఉపాధ్యాయులు  ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐరాస పిల్లల విభాగం యునిసెఫ్‌ వెల్లడించింది. ఇది అత్యంత విషాదమని, యుద్ధనేరమని యునిసెఫ్‌ డైరెక్టర్‌ ఆంటోనీ లేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

పంజాబ్ లో చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు...

ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఉగ్రవాదులు పంజాబ్ లో చొరబడినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వివరాల ప్రకారం... బబ్బర్ ఖల్సా అనే తీవ్రవాద సంస్థకు చెందిన 12 మంది సభ్యులు పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని పంజాబ్ లోకి చొరబడ్డారని హెచ్చరికలు అందాయి. ఈ నెల 23న పోలీసులు అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ ను విచారించిన పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని సమాచారం. వీరంతా భారీ ఎత్తున ఆయుధాలు తీసుకుని పంజాబ్ లోకి వచ్చారని, ఎన్నికల వేళ విధ్వంసాలకు దిగడమే వీరి లక్ష్యమని, కాశ్మీర్ ప్రాంతానికి చెందిన కమల్ దీప్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పంజాబ్ వ్యాప్తంగా పోలీసు, భద్రతా బలగాలను అలర్ట్ చేసి, పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత డబ్బును ఖర్చు పెట్టడానికి సిద్ధం..

  అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో హిల్లరీ క్లింటన్ పై విమర్సలు చేశారు.  ప్రైమరీ ఎన్నికల సమయంలో తాను ఎలాంటి విరాళాలు తీసుకోలేదని, తన సొంత డబ్బునే ఖర్చు పెట్టానని.. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ మాత్రం సొంతంగా ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రైమరీ ఎన్నికల నాటి నుంచి కూడా ఆమె పూర్తిగా డొనేషన్లపైనే ఆధారపడ్డారని విమర్శించారు. అంతేకాదు ఇప్పటి దాకా సొంతంగా 100 బిలియన్ డాలర్లను ప్రచారం కోసం వినియోగించానని, అవసరమైతే మరింత డబ్బును ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అదే విధంగా ఈ ఎన్నికల్లో గెలుపు కూడా తనదే అనే విషయం తనకు తెలుసని అన్నారు. హిల్లరీ అధికారంలోకి వస్తే అవినీతి పెరుగుతుందని... అది అమెరికన్లకు ఇష్టం లేదని చెప్పారు. ఒబామా తరహా పాలనను మరో నాలుగేళ్ల పాటు అనుభవించే ఓపిక అమెరికన్లకు లేదని తెలిపారు. కాగా నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్ ను కాల్చిపారేస్తా..

  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గతంలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంట‌నే ఆయ‌న‌ను కాల్చిపారేస్తామని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బెదిరింపులు చేశాడు. ప్రస్తుతం కేజ్రీవాల్ చండీగ‌ఢ్‌లో ప‌ర్యటిస్తున్నారు. పర్యటన ముగిసిన అనంతరం... ఆయన అక్క‌డి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీలో అడుగుపెట్టిన వెంట‌నే ఆయ‌న‌ను కాల్చిపారేస్తామని ఢిల్లీ పోలీసు అత్యవసర విభాగానికి.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి  బెదిరింపు కాల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మ‌యిన పోలీసులు కేజ్రీవాల్ కు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

రతన్ టాటాను పిచ్చోడని అనుకున్నావా?

  టాటా గ్రూపు ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. తన ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో సైరస్ మిస్త్రీని తొలగించారు. ప్రస్తుతం రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. అయితే తనను ఛైర్మన్ పదవి నుండి తొలగించడంపై స్పందించిన సైరస్ మిస్త్రీ.. తనను తొలగించడం అన్యాయమని, కనీస ధర్మాలు పాటించకుండానే తీసేశారని ఆరోపించాడు. సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలపై స్పందించిన రతన్ టాటా లీగల్ కౌన్సిల్, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనూ సంఘ్వీ స్పందించి సైరస్ మిస్త్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్త్రీ రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయని, రతన్ టాటాను పిచ్చోడని అనుకున్నావా? అని ప్రశ్నించారు. టాటాల బోర్డును చేతకానిదని భావించి, అధికారం ఉంది కదా అని, తన ఇష్టానికి వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. బోర్డులోని ప్రతి ఒక్కరికీ మిస్త్రీ మీద నమ్మకం పోయిందని.. 9 మంది సభ్యులున్న బోర్డులో ఆరుగురు ఆయన్ను తొలగించాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. మిస్త్రీ గ్రూప్ సంస్థల పరువు తీసే నిర్ణయాలు తీసుకుంటుంటే రతన్ టాటా ఓ బొమ్మలా చూస్తూ ఎలా ఉంటారని సంఘ్వీ ప్రశ్నించారు. కాగా కొత్త ఛైర్మన్ ను నియమించడానికి మరో నాలుగు నెలలు సమయం పడుతుందని రతన్ టాటా చెప్పారు.

పీవోకేలో బ్లాక్ డే.. పాక్ పోలీసుల క్రూరత్వం...

  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాక్ పోలీసులు ఆందోళన కారులపై తమ క్రూరత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. పీవోకేలోని భింబేర్‌, కోట్లీ, ముజ‌ఫ‌రాబాద్‌, మీర్పూర్ ప్రాంతాల్లో  పాక్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వందలాది మంది ఆందోళనకారులు బ్లాక్ డే పాటిస్తున్నారు. దీంతో పోలీసులు లాఠీల‌తో దాడి చేసి.. కొంత మందిని అరెస్ట్ చేశారు. కాగా 1947లో పాకిస్థాన్  దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డి క‌శ్మీర్‌లో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుంది. అప్ప‌టి నుంచి అక్క‌డ అక్టోబ‌ర్‌ నెలలో పాక్‌కు వ్య‌తిరేకంగా బ్లాక్ డే నిర్వ‌హిస్తారు.

ఇండియాలో పాక్ ఉద్యోగి అరెస్ట్...

  ఇటీవలే భారత్ సమాచారాన్ని పాక్ అందించాడన్న ఆరోపణల నేపథ్యంలో ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... ఇండియాలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాక్ చేరవేస్తున్న అధికారిని ఢిల్లీ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. పాక్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న మహమూద్ అక్తర్ అనే ఉద్యోగి గూఢచర్యం చేస్తున్నట్టు పసిగట్టిన నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అతని ఇంట సోదాలు జరిపి అరెస్ట్ చేశారు. సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గర్నుంచి పట్టుబడటం గమనార్హం. ఈ అధికారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, విషయాన్ని పాక్ అధికారులకు తెలిపామని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇండియాకు 130వ ర్యాంకుపై మోడీ అసంతృప్తి...

భారత్ పరిశ్రమలు పెట్టుకోవడానికి గాను.. వ్యాపారం చేసుకోవడానికి గాను అనువైన దేశాల్లో ఒకటిగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకు పై ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సులువుగా వ్యాపారం చేసుకోదగ్గ దేశాల జాబితాను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. మొత్తం 190 దేశాలకు ర్యాంకులివ్వగా.. అందులో ఇండియా 130వ స్థానంలో నిలిచింది. దీంతో భారత ర్యాంకు కలవరపరిచే స్థాయిలో ఉండటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా కీర్తించబడే భారత్ కు ఇంత తక్కువ స్థాయి ర్యాంకు రావడానికి గల కారణాలను అన్వేషించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుదీకరణ జరగడం, ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే వేగవంతమైన అనుమతులు, సులభ రుణాలు, పన్ను రాయితీలు వంటివి అందుబాటులో ఉన్నా, ర్యాంకు ఘోరంగా ఉండటంపై ఓ నెలలోపు నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాను మోదీ ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఒడిశా సీఎంపై గుడ్లదాడి..

తన పాలనాదక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న ముఖ్యమంత్రి  ఆయన. అందుకే ప్రజలు వరుసగా నాలగవసారి ఆయనకే సీఎం పీఠాన్ని కట్టబెట్టారు. అలాంటి వ్యక్తిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు ఒడిషా ముఖ్యమంత్రి, బీజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్. మయూర్‌భంజ్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం..సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఓ యువకుడు కోడిగుడ్లతో నవీన్ పట్నాయక్‌‌పై దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రికి రక్షణగా నిలిచారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేడీ కార్యకర్తలు అతనిని చుట్టుముట్టి చితకబాదారు..అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

లోకేశ్, చంద్రబాబులను వదిలేది లేదు-మావోయిస్టులు

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చావు దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లను వదిలేది లేదని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రకటన విడుదల చేశారు. అవసరమైతే చంద్రబాబు కుటుంబంపై ఆత్మహుతి దాడులు జరుపుతామని..ఎల్లకాలం పోలీసులు, మిలటరీ ఆయనను కాపాడలేవని స్పష్టం చేశారు. కోవర్టు ఆపరేషన్ ద్వారా ఆహారంలో విషం కలిపి, మావోయిస్టులు అపస్మారక స్థితిలో ఉన్నపుడు పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆరోపించారు. తమకు సంబంధించిన తుపానుల్లో ఇది అతిపెద్ద తుపాను అని..దీనిని తట్టుకుని నాలుగు రోజుల్లో నిలబడతామని శ్యామ్ ప్రకటించారు.