కేసీఆర్.. ట్రంప్ ఇద్దరూ ఒకటే..

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి దిట్ట అని అందరికి తెలిసిందే. పక్క పార్టీనేతలపైనే.. సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయగల ధైర్యం ఆయనది. ఇప్పుడది కూడా చాలదన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన జేసీ అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కొంచం సేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లది ఒకే మాట, ఒకే యవ్వారం అని.. కేసీఆర్ ఆంధ్రవాళ్లను కేసీఆర్ జాగో, భాగో అన్నారని... ట్రంప్ కూడా విదేశీయులను అలాగే అన్నారని చమత్కరించారు. ఇంకా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు నీతివంతమైన రాజకీయనాయకుడని... పైసలిస్తేనే ఫైలుపై సంతకం చేసే వ్యక్తి కాదని... తాను విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబును చూస్తున్నానని చెప్పారు. ఇంకా చంద్రబాబు ముందుగానే బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారని కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా స్పందించిన జేసీ.. ఆయన అలాంటి వాడు కాదని అన్నారు. తెలంగాణలోని రెడ్ల వద్ద డబ్బుల్లేవని... డబ్బంతా యాదవులు, గౌడ్ ల వద్ద ఉందని చెప్పారు. మరి జేసీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి...

ఉప్పులేటి కల్పన టీడీపీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు....

వైసీపీ మహిళా నేత, పామర్రు నియోజకవర్గ సభ్యురాలు ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. గత రెండు మూడు రోజుల నుండి కల్పన టీడీపీ ఎంట్రీపై పలు  వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న కల్పన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాల్గొన్న నేపథ్యంలో ఆమె టీడీపీలోకి జంప్ అవుతుందన్న కథనాలు ప్రచారమయ్యాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఆమె టీడీపీ కండువా కప్పుకోడానికి సిద్దమయ్యారు. ఈ నెల 23న విజయవాడలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. బుధవారం సాయంత్రం పలువురు వైకాపా, తెదేపా నాయకులతో ఆమె మాట్లాడి, అంతా 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకోవాలని ఆమె కోరారు.

సిద్దార్థనాథ్‌సింగ్‌ కు పవన్ సూటి పశ్న...

జనసేన అధినేత  పవన్‌ కల్యాణ్‌  ట్విట్టర్ ద్వారా బీజేపీని పరోక్షంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, దేశభక్తి, గోవధ, జేఎన్య్యూ హెచ్సీయూ రోహిత్ ఆత్మహత్య పై ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు పోస్ట్ చేస్తూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన భాజపా నేత సిద్దార్థనాథ్‌సింగ్‌ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ట్విట్టర్ ద్వారా సిద్దార్థనాథ్‌సింగ్‌కు నాది ఒకటే సూటి ప్రశ్న అంటూ స్పందించారు. సుదీర్ఘ అనుభవం, నిపుణులైన మీ నేతలు చరిత్రాత్మక తప్పిదం ఎలా చేశారు? మీ చరిత్రాత్మక తప్పిద నిర్ణయం అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంది’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో.. పవన్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

హైదరాబాద్ పర్యటనకు ప్రణబ్ ముఖర్జీ..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది నేపథ్యంలో ఆయన రేపు హైద‌రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్ర‌ప‌తి నిల‌యానికి రానున్నారు. రేపు హైదరాబాద్ వచ్చిన ఆయ‌న ఈ నెల‌ 31 వరకు ఇక్కడే ఉంటారు. తన పర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌వుతారు. ఎల్లుండి ఆయ‌న‌ ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో ఎండీఎస్‌, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. అనంత‌రం ఎఫ్‌టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి హాజ‌ర‌వుతారు. అనంత‌రం ఈ నెల 24న న‌గ‌రంలో మహిళా దక్షత సమితి, బన్సీలాల్‌ మలాని కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ లను ప్రారంభిస్తారు. ఆ త‌రువాతి రోజు బెంగళూరుకు బ‌య‌లుదేరుతారు.

అశ్విన్ నంబ‌ర్ వ‌న్.. జ‌డేజా నంబ‌ర్ టూ..

  ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా రికార్డుల మీద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బౌలర్లు అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరు కీలక పాత్ర పోషించారు. దీనివల్లే భాగంగానే ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో ర్యాంకులు సాధించారు. తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించిన‌ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ నంబ‌ర్ వ‌న్ ర్యాంకులో నిలిచాడు. ఇక‌ ర‌వీంద్ర జ‌డేజా నాలుగు ర్యాంకులు ఎగ‌బాకి రెండోస్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు క‌లిసి ఓ రికార్డు కూడా సృష్టించారు. 1974 త‌ర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమిండియా బౌల‌ర్లుగా నిలిచారు. 1974లో ఈ రికార్డు భార‌త స్పిన్ ద్వ‌యం బిష‌న్‌సింగ్ బేడీ, భ‌గ‌వ‌త్ చంద్ర‌శేఖ‌ర్ లు నెల‌కొల్పారు.

ఆర్భీఐ నిర్ణయాలపై రాహుల్ గాంధీ.. సిగ్నల్ లైట్లల ఉంది..

  పెద్ద నోట్లు రద్దు చేసినప్పుటి నుండి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీనికి తోడు ఆర్భీఐ రోజుకో నిర్ణయం తీసుకుంటున్న దానిపై ఇప్పుడు ఆయన స్పందించి ట్విట్టర్ ద్వారా కామెంట్ విసిరారు. ట్విట్టర్లో సిగ్నల్ లైట్లకు సంబంధించిన ఓ ఫొటో పోస్ట్ చేస్తూ ఏక కాలంలో అనేక లైట్లు వెలుగుతూ గందరగోళంగా ఉన్న సిగ్నల్ లైట్లలాగానే  ప్రభుత్వ ఆదేశాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో అంటూ రాహుల్ కామెంట్ విసిరాడు. ఇంకా దీనిపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా స్పందిస్తూ.. నోట్ల రద్దు తర్వాత గడిచిన 43 రోజుల్లో ఆర్బీఐ 126సార్లు నిబంధనలు మార్చిందని, ఆర్బీఐ తీరు చూస్తుంటే.. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కాస్తా రివర్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మారిపోయిందని విమర్శించారు.

వెనక్కి తగ్గిన ఆర్బీఐ... పరిమితి ఎత్తివేత..

  డిసెంబర్ 30 వరకు రోజుకు ఐదు వేలు మాత్రమే డిపాజిట్ చేయాలని ఆర్భీఐ రెండు రోజుల క్రితం షరతులు విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆర్భీఐ వెనక్కి తగ్గింది. ఐదు వేల ప‌రిమితిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.  ఐదు వేల‌కు పైగా ఒక్క‌సారే డిపాజిట్ చేయాల‌ని.. అది కూడా ఇద్ద‌రు బ్యాంకు అధికారులకు వివ‌ర‌ణ ఇచ్చి వాళ్లు సంతృప్తి చెందితేనే తీసుకుంటార‌న్న నిబంధ‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మైంది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో రెండు రోజుల్లోనే ఆర్బీఐ ఈ నిబంధ‌న తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఈ మేర‌కు ఆర్బీఐ అన్ని బ్యాంకుల‌కు లేఖ‌లు పంపింది. నిబంధ‌న‌ల‌పై పునఃస‌మీక్ష నిర్వ‌హించామ‌ని, కేవైసీ క‌స్ట‌మ‌ర్ల‌కు ఐదు వేల ప‌రిమితిని ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆ లేఖ‌లో ఆర్బీఐ స్ప‌ష్టంచేసింది.

తమిళజాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ...

తమిళనాడు ముఖ్యమంత్రి పనీర్‌సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమిళ జాలర్ల విషయం గురించి ముచ్చటించిన సంగతి తెలిసిందే. తమిళ జాలర్ల విషయంలో శ్రీలంక నేవీ అనుసరిస్తున్న తీరుపై పరిష్కారం చూపాలని పన్నీర్ సెల్వం ప్రధానిని కోరారు. అయితే ఇది జరిగిన మరుసటిరోజే శ్రీలంక నేవీ తమిళజాలర్లపై తమ తీరును ప్రదర్శించారు. పంబన్‌ నుంచి మూడు బోట్లలో 20 మంది మత‍్స్యకారులు వేటకు వెళ్లగా నిషేధించిన వలలతో చేపల వేటకు వెళ్లిన వీరిని, శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకోనే సమయంలో ఒక బోట్‌లో ఎనిమిది మంది అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశారు. మిగిలిన రెండు బోట్లలోని 12 మందిని శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకొని కంగేసంతురాయ్‌ పోర్ట్‌కు తరలించారు. ఈ సందర్బంగా శ్రీలంక నేవీ అధికారులు మాట్లాడుతూ.. తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారనే కారణంతో అరెస్టే చేశామని తెలిపారు.

మమ్మల్ని తెలంగాణలో కలిపి ఉంటే బావుండేది..

  వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్.. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డిని కలిశారు. దీంతో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై జేసీ జానారెడ్డితో ముచ్చటించినట్టు సమాచారం. ఈ సందర్బంగా జేసీ.. తెలంగాణ స‌ర్కారుపై కాంగ్రెస్ నేత‌లు సరిగా పోరాడడం లేదని.. జానారెడ్డితో మాట్లాడుతూ పలు జోకులు పేల్చారు. అంతేకాదు విభజనతో తమను అడవుల పాలు చేసేశారని..  కర్నూలు, అనంతపురం జిల్లాలు సీఎంల దయ మీద ఆధారపడే ఉంటాయని పేర్కొన్నారు. రాయలసీమలోని రెండు జిల్లాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వ‌చ్చేద‌ని అన్నారు.

సామాన్యులకు ఊరట.. ఏటీఎం విత్‌డ్రా పరిమితి ఎత్తివేత...

పెద్ద‌నోట్లను ర‌ద్దు అనంతరం సామాన్య మానవుడికి ఊరట కలిగించే ఓ నిర్ణయాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకంది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం డబ్బు విత్ డ్రా పై కొన్ని షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఏటీఎంల‌లో అయితే ఒక‌సారి 2,500, అదే బ్యాంకుల్లో అయితే 24 వేల వ‌ర‌కు తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడానికి విధించిన ప‌రిమ‌తిని ఎత్తివేయనున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గడువు ఇంకా పదిరోజుల్లో ముగియనుంది. దీంతో డిసెంబ‌రు 30 త‌రువాత‌ బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఖాతాదారులు  ఏటీఎంల నుంచి త‌మ‌కు ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే న‌గ‌దు మీద కూడా విధించిన ప‌రిమితిని ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది.

అటకెక్కిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొత్తపార్టీ...

బీజేపీ తరఫున ఎంపీగా పనిచేసి.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సిక్కు పుణ్యక్షేత్రం అమృతసర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే... తాను ఎన్నికల బరిలో దిగబోయేది తన కొత్త పార్టీ నుండి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దూ పోటీ చేయనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి.   బీజేపీ పార్టీ నుండి బయటకు వచ్చినా సిద్దూ ముందు ఆప్ పార్టీలో చేరతారని అనుకున్నారు. అయితే తన డిమాండ్లు వర్కవుట్ కాకపోవడంతో ఆప్ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. ఇక సిద్దూ.. ఆప్ పార్టీలో చేరతారా.. లేక కాంగ్రెస్ పార్టీలో చేరతారా అని అందరూ తర్జనభర్జనలు చేస్తుండగా.. ఇవన్నీ కాదన్నట్టు తానే కొత్త పార్టీ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే పార్టీ పెట్టడానికి అయితే పెట్టాడు కానీ..ఇంతవరకూ ఎలాంటి ముందడుగు వేయలేదు. దీనికి తోడు సిద్దూ భార్య ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు సిద్దూ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని కలిసి చర్చలు జరిపిన సిద్ధూ, పార్టీలో తన చేరికపై తేదీని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి కొత్త పార్టీ పెట్టి.. నానా హంగామా చేసిన సిద్దూ కొత్త పార్టీని ఎందుకు పెట్టినట్టో.. ఇప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారో..అంత కష్టపడి పెట్టిన పార్టీని ఏం చేస్తారో..? చూద్దాం..

దాడి చేసింది మేమే... నిజం ఒప్పుకున్న ఐసిస్..

  జర్మనీ రాజధాని  బెర్లిన్‌లో క్రిస్మస్‌ మార్కెట్లో ట్రక్కు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 12 మంది మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి జరిపింది ఉగ్రవాదులే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసుకున్నారు. ట్రక్కును నడిపిన పాకిస్థాన్‌కు చెందిన 23ఏళ్ల యువకుడిని జర్మనీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ దాడి జరిపింది తామే అని  ఇస్లామిక్స్‌ స్టేట్స్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేసింది. అంతర్జాతీయ కూటమిగా ఏర్పడిన దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు ఐసిస్‌ ప్రకటించుకుంది. కాగా ఐఎస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాలతో జర్మనీ కూడా భాగస్వామ్యం వహిస్తోంది.

తమిళనాడు సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు.. నేతల గుండెల్లో గుబులు...

తమిళనాడులో ఐటీ శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బును పట్టుకున్న ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంట్లో సోదాలు చేపట్టింది. శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో భారీగా న‌గ‌దు, బంగారం, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో డాక్యుమెంట్ల‌లో రామ్మోహ‌న్‌రావుకు సంబంధించి ప‌లు వివ‌రాలు ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇసుక కాంట్రాక్ట్ లలో భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో.. పక్కా సమాచారంతో ఏక కాలంలో ఏడు చోట్ల ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. అన్నా నగర్ నివాసంలో ఉదయం నుండి తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డికి జయలలిత రికమెండేషన్ ద్వారానే టీడీడీ బోర్డు సభ్యుడిగా పదివి దక్కింది. ఇప్పుడు  సీఎస్ రామ్మోహన్ జయ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించేవారు. దీంతో వీరిపై ఐటీ దాడులు జరపగా.. మిగిలిన అన్నాడీఎంకే నేతల్లో కూడా గుబులు పట్టుకున్నట్టు సమాచారం.

వింత సమస్య... ఉరిశిక్ష ఓకే.. ఉరికంబాలే లేవు..

మన దేశంలో నేరాలు చేసినా వాటిని కోర్టులో విచారణ జరిపి.. నిందితులకు శిక్షలు పడాలంటే ఏళ్లకు ఏళ్లు గడవాల్సిందే. అలా 2013లో దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి దాదాపు మూడు సంవత్సరాల తరువాత శిక్ష విధించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. శిక్షలైతే విధించారు కానీ.. వారికి ఉరితీయడానికి ఉరికంబాలు లేకుండా పోయాయి. ఎందుకంటే తెలంగాణలోని రెండు సెంట్రల్ జైళ్లలో ఒక్క ఉరికంబం కూడా లేదు. హైదరాబాద్ లో ఉన్న చంచల్ గూడ, వరంగల్ లో ఉన్న సెంట్రల్ జైళ్లలో ఉరికంబాలు కావాలని ఇక్కడి జైళ్ల శాఖ గతంలోనే ప్రతిపాదనలు పంపింది. కానీ, ఇంత వరకు దానికి అనుమతులు రాలేదు. మరి ఇప్పుడు ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్షను విధించడంతో... వారిని ఎక్కడ ఉరి తీయాలి? అనే వింత సమస్య మొదలైంది. కాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాత్రం ఒక ఉరికంబం ఉంది.

త్వరలో తమిళనాడు సీఎంగా శశికళ..!

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుండి అమ్మ నెచ్చెలి అయిన శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపడతారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆమెనే బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్న సంగతి తెలిసిన విషయమే. దాంతో ఆమె ఎప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు నవనీతకృష్ణన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనకు శశికళ కోసం పన్నీర్‌సెల్వం తన ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా? అని ప్రశ్నించగా... దానికి నవనీతకృష్ణన్‌ స్పందిస్తూ ‘చిన్నమ్మ’ తలచుకుంటే డిసెంబరు 5నే ముఖ్యమంత్రి అయ్యేవారని, ఆమెను ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. అంతేకాదు.. త్వరలో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలిపారు. మరి ఆఖరికి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

జగన్ పుట్టినరోజున ఎదురుదెబ్బ...

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆయన పెద్ద షాకే తగిలింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అవ్వగా ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే టీడీపీలోకి జంప్ అవుతున్నట్టు తెలుస్తోంది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది.   కాగా 2004లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉప్పులేటి కల్పన ఆ సంవత్సరం ఎన్నికల్లో నిడుమోలు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తరువాత 2009లో పామర్రు నుంచి పోటీచేసి ఓడిపోయింది. 2013లో వైకాపాలో చేరి, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యను ఓడించారు. ఇక గత కొంత కాలంగా వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆమె, ఇటీవల జరిగిన బెల్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబుతో కలసి పాల్గొన్న నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి.

ప్రణబ్, మోడీ, రాహుల్ కి శశికళ కృతజ్ఞతలు...

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు స్వయంగా వచ్చి అమ్మకు నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారు వచ్చినందుకుగాను జయలలిత నెచ్చెలి అయిన శశికళ వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిలోభాగంగానే.. జయలలిత మరణానంతరం వ్యక్తిగతంగా వచ్చి నివాళులర్పించి పరామర్శించినందుకు గాను ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ముగ్గురికీ వేర్వేరుగా లేఖలు రాశారు. ‘చెన్నై వచ్చి, వ్యక్తిగతంగా మీ సంతాపాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. చెన్నై వచ్చే సమయంలో ఇబ్బందులు తలెత్తినా వెనుదిరగకుండా వచ్చారని ఆమె రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ’కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘భరించలేని బాధ, శోకంలో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి సానుభూతిని వ్యక్తపరిచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని ప్రధానికి రాశారు. ‘నా పట్ల మీరు చూపించిన సానుభూతి, పలికిని సాంత్వనవచనాలు ఓదార్పునిచ్చాయ’ని రాహుల్‌గాంధీకి రాసిన లేఖలో తెలిపారు. కాగా ఆమె ప్రస్తుతం చెన్నైలోని పొయెస్‌ గార్డెన్‌లోనే నివాసముంటున్నారు.

బ్లాక్ మనీ వివరాలు... 72 గంటల్లో 4వేల మెయిల్స్‌

  పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా ఐటీ శాఖ జరుపుతున్న దాడుల్లో కోట్ల కొద్దీ నల్లధనం బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా నల్లధనాన్ని బయటపెట్టేందుకు పలు చర్యలు కూడా తీసుకుంటుంది. దీనిలో భాగంగానే నల్లధనానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ  ఈమెయిల్ (blackmoneyinfo@incometax.gov.in) ను క్రియేట్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇది క్రియేట్ చేసిన కొద్ది గంటల్లోనే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 72 గంటల వ్యవధిలో 4వేల మెయిల్స్‌ వచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకు ఖాతాల్లో అక్రమంగా జమ అవుతున్న రోజువారీ నగదు వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫినాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఎఫ్‌ఐయూ) ద్వారా ఎప్పటికప్పుడు అందుతోందని.. దీని ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించగలిగామని అన్నారు.రోజువారీ డిపాజిట్ల నివేదికను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అనుమానాస్పద ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.