ఉచితం లేకపోతే జియో పరిస్థితి అంతే..
ఉచిత కాల్స్, డేటాతో రిలయన్స్ జియో ఇప్పటికే దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. జియో దెబ్బకి మిగిలిన కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. అయితే ఈ హవా అంతా ఉచితం అన్నది ఉన్నంతవరకే అంటున్నారు నిపుణులు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ మార్చి వరకు మాత్రమే ఉంది. అప్పటివరకూ 10 కోట్ల మంది వినియోగదారులకు చేరువ అవుతుందని జియో భావిస్తుంది. అయితే రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ 'ఫిచ్' జియోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉచితం పేరుతో జియో సర్వీస్ బాగానే కొనసాగుతున్నా.. ఉచితం అనే ఆఫర్ తొలగిపోయిన తరువాత, సంస్థ కస్టమర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గి వస్తుందని, ఇతర టాప్ కంపెనీల కన్నా దిగువకు వినియోగదారుల సంఖ్య పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోనీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్ టెల్, ఐడియా సేవలను వినియోగిస్తున్న వారు, రెండో సిమ్ గా రిలయన్స్ జియోను తీసుకుని ఉచిత ఆఫర్లు వాడుతున్నారని, ఒకసారి డబ్బు చెల్లించాలని చెప్పిన తరవాత, వీరిలో అత్యధికులు జియో సిమ్ లను పక్కన పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.