అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక

అన్నాడీఎంకే అధినేత్రిగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ చెన్నైలో జరిగిన  సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేతలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉద్రిక్తతలు జరుగుతాయనుకున్న సమావేశం కాస్తా కూల్‌గా సాగిపోయింది. జయ మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. అమ్మ మరణించిన వెంటనే అర్థరాత్రి తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పదవి భర్తీ అయ్యింది. అయితే ప్రధాన కార్యదర్శి పదవిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ అన్నాడీఎంకే అగ్రనేతలంతా శశికళ వైపే మొగ్గుచూపడంతో ఆమె చేతికే పార్టీ పగ్గాలు వెళతాయని అనధికారికంగా తేలిపోయింది. ఇవాళ అదే నిజమైంది.

ఢిల్లీకి కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్..?

ఢిల్లీకి కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నియామకం దాదాపు ఖరారైంది. కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ బైజాల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. 1969 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఈయన కేంద్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అనిల్ నియామకానికి సంబంధించిన ఫైలు ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు చేరిందని సమాచారం. హైదరాబాద్‌లో శీతాకాల విడిదిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ఢిల్లీ చేరుకున్న వెంటనే అనిల్ నియామకానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. గతంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా వ్యవహరించిన నజీబ్ జంగ్ తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. కేంద్రంతో ఉప్పు నిప్పులా ఉండే కేజ్రీవాల్‌తో అనిల్ ఎలా వ్యవహరిస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

క్యాష్ లెస్‌ విధానంలో భద్రతా సమస్యలు-చంద్రబాబు

పెద్ద నోట్లు రద్దు తర్వాత దేశవ్యాప్తంగా జనం నగదు రహిత లావాదేవీలపై  దృష్టిసారించారు. ప్రభుత్వాలు కూడా క్యాష్ లెస్ లావాదేవీలపై అవగాహన కలిగిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ముఖ్యమంత్రులతో కమిటీని కూడా వేసింది. దీనిపై సీఎంల కమిటీ చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైంది. ఆ భేటీ అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ..మొబైల్ లావాదేవీలపై ఫలవంతమైన చర్చ జరిగిందని చెప్పారు. నగదు రహిత లావాదేవీలకు భద్రతా సమస్యలు ఉన్నాయని..అలాగే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని అన్నారు. దేశంలోని అన్ని బ్యాంకులు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్ మిషన్‌ల సరఫరాను కేంద్రం వేగవంతం చేసిందన్నారు. అతి త్వరలోనే నగదు రహిత లావాదేవీల వైపుకు దేశం మళ్లుతుందని ఆయన అన్నారు.

శశికళ లాయర్‌పై దాడి...చెన్నైలో ఉద్రిక్తత

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికోసం..పార్టీ పగ్గాల కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర ఆధిపత్యపోరు నడుస్తోందని..చీలిక దిశగా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. కొందరు శశికళకు, మరి కొందరు పన్నీర్ సెల్వంకు మద్ధతు ప్రకటిస్తున్నారు. అయితే జయ మృతికి శశికళే కారణమంటూ ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప విమర్శలు గుప్పించారు.   దీంతో శశికళ అనుకూల వర్గాల్లో ఆమెపై పీకలదాకా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య శశికళ పుష్ప లాయర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. అంతే, శశికళ పుష్పపై ఆగ్రహాంగా ఉన్న కార్యకర్తలు ఆయన్ను చూడగానే మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. లాయర్‌ను బందోబస్తు మధ్య పోలీసులు పార్టీ కార్యాలయం నుంచి బయటకు తరలించారు.

పాతనోట్లు జేబులో ఉంటే శిక్షార్హులే..!

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రద్దయిన నోట్లు తదితర చర్యలపై చర్చించింది. బ్యాంకుల్లో పెద్ద పాత నోట్లను మార్చుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొన్ని షరతులతో నోట్లను మార్చుకోవచ్చు. అయితే గడువుతీరినా బ్యాంకుల్లో జమ చేయకుండా పాత రూ.500, రూ.1000 కలిగి ఉన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు గానూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం మార్చి 31, 2017 నుంచి రూ.10,000కు మించి పాత నోట్ల కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్దినెన్స్ ద్వారా వీలు కలుగుతుంది.

క్షమాపణలు చెప్పిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దళిత కార్యకర్తకు క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని మాన్సాకు చెందిన గాయకుడు బంత్‌సింగ్ జబ్బార్‌ ఇటీవల ఆప్‌లో చేరారు. ఆయన కూతురు రేప్‌కు గురయ్యారు. ఒకసభలో పాల్గోనేందుకు వెళ్లిన ఆయనకు కూతురిని రేప్ చేసిన నిందితులు తారసపడ్డారు. వారు కూడా ఆప్‌లో చేరారని తెలియడంతో ఆయన షాక్‌కు గురయ్యారు.   ఆప్ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు పార్టీ సభ్యత్వానికి అనర్హులు..ఈ విషయాన్ని బంత్‌సింగ్ స్థానిక పెద్దల వద్దకు తీసుకువెళ్లడంతో నిందితుల్ని ఆప్‌ నుంచి తొలగించారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌కు విషయం తెలియడంతో బంత్‌సింగ్‌ను వ్యక్తిగతంగా కలిసి సముదాయించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. ఇది పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకుంటున్నాం. జరిగిన దానికి మేం సిగ్గు పడుతున్నాం. పార్టీలో చేరిన ఆ నిందితుల్ని వెంటనే తొలగించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో మీ పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ

ముఖానికి మాస్కులు వేసుకుని.. కత్తులతో బ్యాంకులోకి ప్రవేశించి..సిబ్బందిని బెదరించి నగదు, నగలు దోచుకెళ్లడం మనం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు అచ్చం అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో జరిగింది. గత రాత్రి రామచంద్రాపురంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌ శాఖలోకి ప్రవేశించిన దుండగులు సిబ్బందిని బెదిరించి 50 కిలోల బంగారు నగలను అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను బట్టి ఎరుపు రంగు స్కార్పియోలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దోపిడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో వచ్చిన వీరు సెక్యూరిటీ గార్డును బెదిరించి దోపిడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఉదయం సిబ్బంది వచ్చి సెక్యూరిటీ గార్డు కట్టు విడిపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.

వేలుపెట్టిన ఫలితం..రష్యాపై అమెరికా ఆంక్షలు

ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండు అగ్రరాజ్యాల మధ్య మళ్లీ చిచ్చుపెడుతున్నాయి. తమ దేశ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నందుకు అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాను కఠినంగా శిక్షించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. దీనిలో భాగంగా రష్యాపై ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సైబర్ ఆపరేషన్స్‌లో జోక్యం చేసుకోవడం, కోవర్ట్ ఆపరేషన్‌ వంటి చర్యలకు రష్యా పాల్పడినట్లు అమెరికా తేల్చింది. విదేశీ హ్యాకర్లు తమ దేశ ఆర్థిక, భద్రతాంశాల్లోకి ప్రవేశిస్తే వాటిపై చర్యలు తీసుకునే అధికారానికి సంబంధించిన చట్టాన్ని 2015లో ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చింది. రష్యాపై తీసుకోనున్న ఈ చర్యలను అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కూడా భవిష్యత్తులో ఉపసంహరించలేని విధంగా తీసుకోవాలని ఒబామా పావులు కదుపుతున్నారు.

నల్లబాబుల సేవలో మరో బ్యాంక్ మేనేజర్

నోట్ల మార్పిడి తర్వాత తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయల డబ్బును మార్చుకోవడానికి మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు నల్లబాబులు. ఎవరికి తోచిన దారిలో వారు డబ్బును మార్చుకున్నారు. అందులో ఒకటి బ్యాంకు మేనేజర్లతో నగదు మార్పిడి. అక్రమార్కుల ఎరకు చిక్కిన బ్యాంకు అధికారులు ..సామాన్యులు కష్టాలు పడుతున్నా లెక్కచేయకుండా..కోట్లకొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంక్ అధికారులు కొందరు ఇలాగే సహకరించినట్లు ఐటీ శాఖ తేల్చింది. ఇప్పుడు తాజాగా అదే దేశ రాజధానిలో మరో బ్యాంకు అధికారి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు చిక్కాడు. ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఈడీ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అతడిపై కేసు నమోదు చేసి..దర్యాప్తు జరుపుతోంది.

నల్లకుబేరుల కోసం ప్రధాని యజ్ఞం

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్..కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల మధ్య తరగతి ప్రజలు, చిన్న చిన్న వ్యాపారులు, రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బును మనం తీసుకోవడానికి వీలు లేకుండా చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..కానీ బడాబాబులు హాయిగా గడుపుతున్నారని..నల్లధనం అరికట్టడానికి యజ్ఞం చేస్తున్నానని ప్రధానమంత్రి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని..కానీ ఆ యజ్ఞం నల్లకుబేరులకు అనుకూలంగా జరుగుతుందని ఆయన ఆరోపించారు. 

చైనా ఎందుకు అంతలా భయపడుతోంది

భారత అమ్ముల పొదిలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా చెప్పబడుతున్న అగ్ని-5 ప్రయోగం విజయవంతం కావడంతో డ్రాగన్ వణికిపోతోంది. అగ్ని-5ను చైనాను దృష్టిలో పెట్టుకునే భారత్ రూపొందించిందని ఆరోపించింది. అగ్ని పరిధిని భారత్ తక్కువ చేసి చూపిస్తోందని..చైనాలోని అన్ని ప్రాంతాలను చేరుకోగల శక్తి దీనికి ఉందని చైనా మీడియా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో దీనికి దీటుగా బదులిచ్చింది భారత్..తామీ మిసైల్‌ను ఏ దేశం కోసమో తయారు చేసుకోలేదని, క్షిపణి పరీక్షల విషయంలో అన్ని అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడే అడుగులు వేస్తున్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ప్రత్యేకించి ఒక దేశాన్ని లక్ష్యంగా తామెన్నడూ చూడలేదని, మిగతా దేశాలు ఎలా మిసైల్ టెక్నాలజీని వాడుకుంటున్నాయో, ఇండియా కూడా అదే బాటలో పయనిస్తుందోనని..ఇది దేశ రక్షణ విధానమని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ అన్నారు.

యూపీలో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. సెల్దా నుంచి అజ్మీర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌కు సమీపంలోని రురా-మెథా మార్గంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందగా, రైలు గార్డు సహా దాదాపు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ప్రాథమిక చికిత్సనందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మాపై బురద జల్లాలనే మోడీ ప్రయత్నం-మాయావతి

బీఎస్పీ పార్టీ బ్యాంకు ఖాతాలో గత ఏడువారాల్లో రూ.104 కోట్లు డిపాజిట్ అవ్వడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్‌ పార్టీపై విమర్శలు చేశాయి. దీంతో స్వయంగా పార్టీ అధినేత్రి మాయవతి వివరణ ఇచ్చారు.  తమ పార్టీ ఖాతాలో జమ చేసిన రూ.100 కోట్లకు పైగా డబ్బుకు పూర్తిగా ఆధారాలున్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ డబ్బు పూర్తిగా పార్టీదేనని, నిబంధనలకు లోబడే దానిని జమ చేశామని..ప్రతి రూపాయికీ తమ వద్ద ఆధారాలున్నాయని మాయవతి చెప్పారు.   ప్రధాని మోడీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఎస్‌పీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముందు బీజేపీ ఖాతాలో డిపాజిట్ల గురించి బహిర్గతపరచగలరా అని ఆమె ప్రశ్నించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విరాళాలు సేకరిస్తున్న సమయంలో ప్రధాని నోట్ల రద్దును ప్రకటించారని మాయావతి పేర్కొన్నారు. తమకు అందిన పాతనోట్లన్నీ నిబంధనలకు లోబడే బ్యాంకులో జమ చేశామన్నారు.

ఆయన ఇంటిలో భోజనం చేయాలనుంది-కేసీఆర్

పార్టీకి అధినేతగా..ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్‌కి ఒక కోరిక మిగిలి పోయిందట. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ తన కోరికను బయటపెట్టారు. అసెంబ్లీలో బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్షనేతల నివాసాలకు వెళ్లి భోజనాలు చేసే గొప్ప సంప్రదాయం ఉండేదని అయితే తాను సీఎం అయిన తర్వాత ప్రతిపక్షనేత ఇంటికి వెళ్లి భోజనం చేయాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయిందన్నారు. అతి త్వరలో ప్రతిపక్ష నేత జానారెడ్డి నివాసానికి భోజనానికి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పగానే సభలో నవ్వులు పూశాయి.

దుర్మార్గులకు దూరంగా ఉండండి-చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి పోలవరం ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేశామని..కేంద్రం నుంచి నిధులు కూడా సాధించుకున్నామని..కానీ ఈ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు ప్రతిపక్షనేతలు ఎన్నో కుట్రలు పన్నారని..ఇంకా పన్నుతున్నారని..అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమను అడ్డుకోవడానికి ఎన్నో ఎత్తులు వేసి, విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. రైతులను రెచ్చగొట్టడం, కోర్టుల్లో కేసులు వేయడం లాంటి పనులు చేశారన్నారు. దుర్మార్గులకు దూరంగా ఉండాలంటూ ఆయన ప్రజలకు సూచించారు.  ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం అన్నారు.

రిబ్బన్లు కట్ చేయడానికి ప్రధానిని కాలేదు-మోడీ

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లో చార్‌ధామ్ హైవే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రిబ్బన్లు కట్ చేయడానికి..క్యాండిళ్లు వెలిగించడానికి తాను ప్రధాని కాలేదన్నారు. నల్లధనం మీద తాను యుద్ధం ప్రకటించాననీ, ఈ యుద్ధంలో మీ అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు. అసలు సమస్య నల్లధనం కాదని, కొంతమంది మనసులే నల్లగా ఉన్నాయని అదే అసలు సమస్య అని చెప్పారు. అవినీతి, దోపిడి అంతమైతేనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. నల్లధనం, అవినీతి, డ్రగ్ మాఫియా, మానవుల అక్రమరవాణా అన్నింటిపైనా ఒక్కనోట్ల రద్దుతోనే వేటు వేశామన్నారు. తాను తప్పుడు హామీలు ఇవ్వనని, ఏం చెప్పానో గుర్తుంచుకుంటానని చెప్పారు. 

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఖైరతాబాద్‌లో అరెస్ట్

. తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేట్ బస్సులను నడుపుతున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసిన ప్రభాకర్ దీనిలో భాగంగా ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.   అయితే అప్పటికే తెలంగాణ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జేసీని గేటు వద్దే అడ్డుకున్నారు. తాను అన్ని ఆధారాలతో వస్తే, లోపలికి వెళ్లకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏ ప్రశ్న వేసినా సమాధానం చెబుతానని, తనకున్న అన్నిబస్సుల పర్మిట్లను తీసుకువచ్చానని వాటికి టాక్స్ కట్టానో లేదో చెక్ చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

అమ్మే ఉంటే ఇలా జరిగేదా..?

ఐటీ దాడులు, ఆసుపత్రిలో చికిత్స అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు. తన ఇంట్లో దొరికిన ఆస్తులకు సంబంధించిన అన్నిటికి ఆధారాలున్నాయని  వాటిని మీడియాకు అందజేస్తున్నట్టు తెలిపారు. తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ ఉంటే తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్‌కు ఎవరిచ్చారని అన్నారు. అయినా తన కుమారుడు విదేశాల్లో ఉంటాడని, తనతో ఉండటం లేదని చెప్పారు.   అయినా తనను అమ్మ చీఫ్ సెక్రటరీగా నియమించిందని..జయ బతికి ఉంటే కేంద్రం ఇంత ధైర్యం చేయగలిగేదా..? సీఎస్‌గా ఉన్న నా ఛాంబర్‌లో తనిఖీలు రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. తనను బదిలీ చేసిన తర్వాత తనిఖీలు నిర్వహించాల్సిందని రామ్మోహన్ అన్నారు. తన ఇంట్లో 1,12,320 రూపాయలు పట్టుకున్నారని..తన కుమార్తె, భార్యలకు చెందిన 50 తులాల బంగారం, 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు సీజ్ చేశారని వెల్లడించారు. 32 ఏళ్లపాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. నేను శేఖర్‌రెడ్డికి సంబంధించిన ఏ వ్యవహారంలోనూ తల దూర్చలేదన్నారు.