జగన్‌కు కలిసిరాని జనవరి 11

  జనవరి 11 జగన్‌కు ఏమంత అచ్చి వచ్చినట్లు కనిపించడం లేదు. ఈ రోజు జరిగిన ఓ రెండు సంఘటనలు ఆయన రాజకీయ జీవితానికి మరింత విఘాతం కలిగించేలా ఉన్నాయి. పులివెందులకి కృష్ణా నీటి విడుదల వీటిలోని మొదటి అంశం. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల వైఎస్సార్‌ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. జగన్‌ తాతయ్య రాజారెడ్డి నాటి నుంచి రాయలసీమ మీద పట్టుసాధించేందుకు పులివెందుల నియోజకవర్గం వారికి అండగా నిలిచారు. అదే పులివెందలులలో పైడిపాళెం ప్రాజెక్టుకి నీటిని అందించడంతో క్రమేపీ టీడీపీ కడప జిల్లా మీద తన పట్టుని విస్తరించినట్లయ్యింది. పులివెందులకి నీరు అందేదాకా మొక్కు తీయనని దీక్షపట్టిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్‌ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నట్లయ్యింది.   ఇంతేకాదు! తెదెపా ప్రతిష్టాత్మకంగా చేపడతున్న సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులలో రాయలసీమకు కూడా తగిన వాటాను కేటాయిస్తున్నారు. దీని వెనుక అక్కడ జగన్‌ ప్రాబల్యాన్ని తగ్గించడమే లక్ష్యమని కూడా చెబుతున్నారు. మరోవైపు రాయలసీమ వెనకబడుతోందంటూ వేర్పాటువాదానికి ప్రయత్నిస్తున్న నేతలని కూడా ఈ ప్రాజెక్టులతో అడ్డుకున్నట్లు అవుతోంది. నిన్న గండిపెట ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాళెం రిజర్వాయరుకు నీటిని మళ్లించిన ప్రభుత్వం ఈ రిజర్వాయరుకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం మరో ఆసక్తికరమైన ఆంశం. దీంతో వైకాపాకు సహజంగానే పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అందుకనే చంద్రబాబు రాయలసీమ పట్ల ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతున్నారని తీవ్రంగా విరుచుకుపడింది. తాము చేపట్టిన ప్రజెక్టులకు చంద్రబాబు గేట్లు ఎత్తుతున్నారంటూ ఎద్దేవా చేసింది. పైడిపాళెం రిజర్వాయరు ప్రారంభోత్సవం సందర్భంగా తెదెపా నేత జే.సీ.దివాకరరెడ్డి, జగన్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే... తెదెపా తన దూకుడుని పెంచినట్లే కనిపిస్తోంది.   ఇక జగతిలో పెట్టుబడి పెట్టిన మరో రెండు బోగస్ కంపెనీల గురించి సీబీఐ విచారణ సాగించడం జగన్‌కు మింగుడుపడని మరో అంశం. ఇప్పటికే తన తండ్రి హయాంలో ప్రాజెక్టులు కేటాయించినందుకుగాను వచ్చిన అడ్డగోలు లంచాలన్నింటినీ జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్ వంటి సంస్థల్లోకి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లధనాన్ని ఇలా పెట్టుబడులుగా మార్చుకునేందుకు బోగస్ కంపెనీలు ఎన్నింటినో సృష్టించారనీ తేలింది. తాజాగా వాటిలో మరో రెండు కంపెనీల భాగోతం కూడా బయటపడింది. సరైన చిరునామా కూడా లేని భాస్కర్‌ ఫండ్‌ మేనేజ్మెంట్‌, డెల్టన్‌ కంపెనీ అనే సంస్థలు జగతిలో వాటాలను కొనుగోలు చేసినట్లు తేలింది. మాయావతి తమ్ముడైన ఆనంద్‌కుమార్ భాగోతాలను తవ్వి తీస్తుంటే ఈ చిత్రం కూడా బయటపడింది.   వైఎస్‌ఆర్‌ హయాంలో జగన్‌ ఎలాగైతే కోట్లకి పడగలెత్తారో... మాయావతి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, సదరు ఆనంద్‌కుమార్ కూడా కుబేరునిగా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు 7 కోట్ల నుంచి 1300 కోట్లకు చేరుకున్నాయంటేనే తెలుస్తోంది, ఆయన తన ఆస్తులను ఎంత సజావుగా సంపాదించారో తేలిపోతోంది!   ఇప్పటికే జగన్ వెంట సమర్థులైన నాయకులు ఎవరూ మిగల్లేదు. మైసూరారెడ్డి, భూమానాగిరెడ్డి వంటి పెద్దన్నలందరూ పార్టీని వీడిపోయారు. తెదెపా ఆకర్షణకి ఆ పార్టీ ద్వారా ఎన్నికైన శాసనసభ్యులు సైతం ఒకొక్కరుగా సైకిలెక్కేస్తున్నారు. ఇటు ED, IT, CBI వంటి శాఖలన్నీ జగన్ ఆస్తుల మీద పట్టు బిగిస్తున్నాయి. ఇన్ని కష్టాలలోనూ రాయలసీమవాసులు తనకి అండగా ఉన్నారనే ధైర్యం జగన్‌ది. మరి ఆ రాయలసీమ మీద అతని పట్టు కూడా చేజారిపోతే... భవిష్యత్‌ అగమ్యగోచరమే!

తాగుబోతు అమ్మాయిలతో రోడ్లపై జాగ్రత్త...

  ఇదేదో సినిమా టైటిల్ కాదు..నిజంగా జరిగిన సంఘటన..ప్రజంట్ అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు అమ్మాయిలు..అబ్బాయిల్లా డ్రెస్సింగ్..అబ్బాయిల్లా డ్రైవింగ్‌.. అబ్బాయిల్లా డ్రింకింగ్. ఇలా ప్రతి పనిలో అబ్బాయిలను మించిపోతున్నారు నేటి కాలం అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు మందు కొడతారన్నది బహిరంగ రహస్యమే. ఒకపక్క మందు కొడుతూ..మరో చేత్తో డ్రైవింగ్ చేయడం లేటేస్ట్ ట్రెండ్..ఇప్పుడు ఇదే అలవాటుని అందిపుచ్చుకున్నారు హైదరాబాద్ అమ్మాయిలు. ఇటువంటి సంఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌‌లో జరిగింది. తాగుతూ..తూగుతూ డ్రైవ్ చేస్తున్న అమ్మాయిలకి మద్యం మత్తు నెత్తికెక్కడంతో ఒళ్లు తెలియని మైకంలో ముందు వెళ్తున్న మూడు వాహనాలను ఢీకొట్టడంతో పాటు..రోడ్డున వెళుతున్న పాదచారులను ఢీకొట్టారు. అదేంటని ప్రశ్నించబోయిన ఓ కారు డ్రైవర్‌ని అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారు..విషయం తెలిసి వచ్చిన ట్రాఫిక్ పోలీసులను వదల్లేదు. ఎలాగోలా మందు భామలను అదుపులోకి తీసుకుని కారు చెక్‌ చేసిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. వారు వచ్చిన కారులో స్టీరింగ్ పక్కనే సగం తాగిన మద్యం గ్లాస్‌లతో పాటు మద్యం బాటిళ్లని కనుగొన్నారు. బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయగా, డ్రైవ్ చేస్తున్న యువతి విపరీతంగా మద్యం సేవించినట్లు తేలింది. కారును సీజ్ చేసిన పోలీసులు ఆ యువతిపై డ్రంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి యువతి తల్లిదండ్రులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఇంత రచ్చ చేసిన తాగుబోతు అమ్మాయి హైదరాబాద్‌ సోమాజీగూడకు చెందిన యువతి. ఆమె బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీబీఏ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

మన చదువులు అంతంతమాత్రమే!

  మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరు రోనాల్డ్‌ రాస్ ఏకంగా ఐదుగరు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏడో తరగతి చదివే విద్యార్థులు కనీసం తమ పేరుని తాము తెలుగులో రాయలేకపోవడమే కలెక్టరుగారి ఆగ్రహానికి కారణం అయ్యింది. దీనికి తోడు వీరికి చదువు చెప్పే టీచర్లు మాత్రం నిబ్బరంగా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారని తెలిసి కలెక్టరుగారికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అయితే ఇదేదో సదరు కలెక్టరు ఆకస్మిక తనిఖీలో వెల్లడైన నిజం అనుకుంటే పొరపాటే! నిజంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఉన్న పాఠశాలలన్నింటి మీదా ఒకేసారి దాడి చేస్తే వేలమంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయవలసి వస్తుందేమో!   నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి వికాసం అద్భుతంగా సాగాలి. ఎలాంటి ఒత్తిడీ లేని చదువు, మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా పుస్తకాలు, ఆటపాటలకు కావల్సినంత ఆవకాశం, కోట్లకొద్దీ ప్రవహించే నిధులు... ఇవన్నీ చూసి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరుకోవాలి. కానీ పాచి పని చేసుకునైనా సరే ప్రైవేటు బడిలోనే చదివించాలని కోరుకుంటున్నారంటే అది ఖచ్చితంగా విద్యావ్యవస్థలోని వైఫల్యమే! ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన ఓ వ్యక్తి, తన పిల్లలకి ప్రైవేటు చదువులు చెప్పించేందుకే ఈ పని చేస్తున్నాని చెప్పడం చూస్తే... నిజంగా ప్రభుత్వాలు తలవంచుకోవాల్సిన పరిస్థితి.   సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి కారణం ఉపాధ్యాయులే అంటూ అంతా విమర్శిస్తూ ఉంటారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్న నానుడి నుంచి బతికితే బడిపంతుల్లాగా బతకాలి అన్న స్థాయికి వారి జీతాలు చేరుకున్నాయి. కానీ పిల్లలను భావితరాలుగా తీర్చిదిద్దాలన్న తపన మాత్రం తగ్గిపోయిందన్న విశ్లేషణ వినిపిస్తోంది. కొందరికి సీనియారటీ మేరకు యాభైవేలకు మించి జీతం వస్తున్నా కూడా తమ జీతానికి తగ్గ ఫలితాన్ని అందించలేకపోతున్నారన్న విమర్శా ఉంది. ఏడాదిలో సగానికి పైగా రోజులని సెలవుల్లో గడిపేయడం, ట్యూషన్ల మీద శ్రద్ధ వహించడం వంటి కార్యకలాపాలతో పాటుగా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే ఉపాధ్యాయులు కూడా తెగ తారసిల్లుతారు. తమ దగ్గరకి వచ్చే పిల్లలంతా దిగువ మధ్యతరగతివారు కాబట్టి, వారికి చదువు చెప్పకపోయినా దేశానికి వచ్చే నష్టమేం లేదనే ‘అమూల్యమైన’ అభిప్రాయం కూడా కొందరిలో కనిపిస్తుంది.   ఉపాధ్యాయుల తీరు ఈ రకంగా ఉంటే విద్యాశాఖ తీరు మరో రకంగా సాగుతోంది. అసలు లోపం ఎక్కడ ఉంది? దానిని చక్కదిద్దడం ఎలా? అన్న విషయాల మీద విద్యాశాఖకు ఒక స్పష్టత ఉన్నట్లు తోచదు. అందుకనే ఒకోసారి ఒకో శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆంగ్లంతోనే ప్రభుత్వ పాఠశాలలు అద్భుతాలు సాధిస్తాయనే ఒకే ఒక్క వాదనని పట్టుకు వేళ్లాడుతుంటుంది. ఇక విద్యాశాఖ పెట్టే లక్ష్యాలకు భయపడి పదోతరగతిలో ఉపాధ్యాయులే స్వయంగా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.   ఉపాధ్యాయులు, విద్యాశాఖ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వాధినేతలు కూడా ఇందుకు మినహాయింపుగా కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి అనుకూలంగానే ప్రభుత్వ ప్రవర్తన ఉంటుందనేది బహిరంగ రహస్యం. అందులో వాస్తవాన్ని గ్రహించాలంటే ఒక్కసారి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన పాఠశాలల్లో వసతులని గమనిస్తే సరిపోతుంది. తెలుగు రాష్ట్రాలలో సగానాకి సగం ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకమైన రిజర్వేషన్‌ వంటి చట్టాలు కల్పించే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు తోచదు. తమిళనాడులోలాగా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడం వంటి చర్యలు తీసుకోవడమూ కనిపించదు. పైగా సాక్షాత్తూ ప్రభుత్వాధినేత నోటి వెంటే ఆంగ్ల విద్య గురించిన పొగడ్తల గురించి వినిపిస్తూ ఉంటాయి. వారి పక్కనే కార్పొరేట్‌ పాఠశాలల యజమానులు కనిపిస్తూ ఉంటారు. గొంగట్లో తింటూ వెంట్రుకలున్నాయని ఆరోపించినట్లుగా... పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నప్పుడు, ఎక్కడో ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పలేకపోతున్నారని ఆరోపించడం హాస్యాస్పదం కదా! మరి ఈ విషవిలయానికి అంతు ఎక్కడ!!!

ఆంధ్రా X తెలంగాణ... నీటి కోసం కొట్లాట

భవిష్యత్తులో జరిగేవన్నీ నీటియుద్ధాలే అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు నిరాశావాదంగా తోచిన ఈ మాటలు నిజం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. నదులు నిండుగా ప్రవహించే రోజున ఎలాంటి సమస్యా రాకపోవచ్చు. కానీ వరసగా ఓ రెండేళ్లు కరువు వచ్చిందంటే ప్రతి నీటి చుక్కనీ లెక్క వేసుకోక తప్పదు. సహజంగానే లెక్కలున్న చోట గొడవలుంటాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇలాంటి గొడవలే రాజుకుంటున్నాయి.   కృష్ణా, గోదావరి, తుంగభద్ర... ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహించే ఈ మూడు నదులూ కూడా తెలంగాణ గుండా ప్రవహించాల్సిందే! ఇలా భౌగోళికంగా తెలంగాణని పైచేయిగా ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తెలంగాణలో నీటి సమస్యలను నివారించలేకపోయాయన్నది ఒక వాదన. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ఈ వాదనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక నినాదంగా మారింది. అయితే తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల వల్ల, అక్కడి నేల మీద ప్రాజెక్టులు నిర్మించడం ఏమంత తేలిక కాదనీ... అందుకే సులువుగా ప్రాజెక్టులకు అవకాశం ఉండే ఆంధ్రా ప్రాంతంలోనే ఎక్కువ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయనీ టి.హనుమంతరావు వంటి సాగునీటి రంగ నిపుణులు సైతం చెప్పేవారు.   కారణం ఏదైతేనేం.. తెలంగాణ రైతులు వర్షపు నీటిని నమ్ముకుంటూ, బోరుబావులను తవ్వుకుంటూ వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు ఎండిపోవడం, ఏళ్ల తరబడి కరువు రక్కసి కోరలు చాచడంతో... తెలంగాణ రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఈ పరిస్థితిలో మార్పుని తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులతో బీడుపోయిన తెలంగాణ భూములు సస్యశ్యామలం అవుతాయని చెబుతోంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్‌ కూడా పోలవరం వంటి భారీ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.   నిరంతరం ఎండిపోయి ఉండే కృష్ణానదిలోకి గోదావరి జలాలను కలపడం పోలవరం ఉద్దేశం. అయితే దీని వల్ల తనకు దక్కాల్సిన గోదావరి జలాలు దక్కకుండా పోతాయన్నది తెలంగాణ వాదన. ఇక శ్రీశైలం రిజర్వాయరు నుంచి పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథాకానికి కృష్ణా జలాలను మళ్లించడం వల్ల ఆంధ్రాలోకి రావాల్సిన కృష్ణా జలాలకు కోత పడుతుందన్నది ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణ. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు చేసుకున్న ప్రాజెక్టు ఒప్పందాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు కంటగింపుగా మారాయి. తవ్వుకుంటూ పోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇలాంటి నీటి వివాదాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నీటి కోసం కూడా ఇరు జిల్లాలూ కొట్లాడుకునే పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్‌ నీటి కోసమూ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులే నెలకొంటున్నాయి.   తాజాగా కృష్ణాజలాల వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని సుప్రీం తెలంగాణకు తేల్చిచెప్పడంతో... ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వివాదం తారస్థాయికి చేరుకున్నట్లయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణా నదీ జలాలలను తిరిగి పంపిణీ చేయాలని తెలంగాణ కోరుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలను భాగస్వాములుగా చేసి ఈ పంపిణీ సాగించాలని ఆశిస్తోంది. కానీ ఇదంతా అనవసరమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తమలో తాము ఈ నీటిని పంచుకుంటే సరిపోతుందన్నది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ పేర్కొంది.   ఈ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకి ఎక్కడంతో అక్కడా చుక్కెదురైంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీరు పట్ల తెలంగాణ ఏమంత సానుకూలంగా లేకపోవడంతో.. మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే! సమస్య ఎలాగొలా సామరస్యంగా పరిష్కారం అవుతుందా లేకపోతే కావేరీ జలవివాదంలాగా ఇరురాష్ట్రాలూ కొట్లాడుకునే పరిస్థితి వస్తుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది. అన్నదమ్ముల్లా విడిపోయిన ప్రజల మధ్య అలాంటి స్థితి రాకూడదనే ఆశిద్దాం! ఇందుకోసం ఇరురాష్ట్ర ప్రభుత్వాలూ కాస్త తమ బెట్టుని పక్కన పెట్టాల్సిందే.

నేతన్నల వెతలు తీరేనా

  ఒకప్పుడు సిరిసిల్ల అన్న పేరు చెబితే చాలు ఆత్మహత్యలే గుర్తుకువచ్చేవి. నేసిన బట్టలు అమ్ముడుపోక, వాటి ముడిసరుకు కోసం చేసిన అప్పులు తీరక... అదే బట్టలని ఉరితాడుగా మార్చుకునే బాధాతప్త జీవితాలకు సిరిసిల్ల ప్రతినిధిగా నిలిచేంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల ఆత్మహత్యలు కూడా ఒక కీలక నినాదంగా మారాయి. తెలంగాణ ఏర్పటైన తరువాత తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన నేతన్నల పరిస్థితిలో ఏమంత మార్పు రాలేదు. చేనేత రంగాన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఒకటీ అరా సంక్షేమ పథకాలను ప్రకటించినా, అవి వారికి అంతగా ఉపయోగపడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.   చేనేత వెతలని రూపుమాపేందుకు స్వయంగా కేటీఆర్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. తను స్వయంగా చేనేత దుస్తులను ధరిస్తూ, నేత వస్త్రాలు ధరించాల్సిందిగా అధికారులను ప్రోత్సహిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సర్వశిక్షా అభియాన్ కింద యూనిఫారాల కాంట్రాక్టుని కూడా సిరిసిల్లకు అందించడంతో ఓ మూడు నెలల పాటు అక్కడి కార్మికులందరికీ తగినంత పని ఉంటుందని ఆశిస్తున్నారు. అక్కడి ప్రతి కార్మికుడూ వర్క్షెడ్, మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన రుణాలు అందిస్తానని కూడా ప్రకటించారు. సిరిసిల్ల వెతలకు ఇవన్నీ శాశ్వత పరిష్కరాలు కాకపోయినా కూడా చేనేత మీద ప్రభుత్వం దృష్టి సారించిదని సంతోషించదగ్గ విషయాలే!   తెలంగాణ ప్రభుత్వ అధికారికి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో లక్షమందికి పైగా నేత కార్మికులు ఉన్నారు. వీరందరి పరిస్థితీ కూడా అగమ్యగోచరంగానే ఉంది. ప్రభుత్వం కేవలం సిరిసిల్ల మీదే దృష్టి సారిస్తే సరిపోదనీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల జీవితాలు మెరుగుపడేందుకు సత్వర చర్యలు తీసుకోవాలనీ వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలలో వేలాది మగ్గాలు మూతబడిపోయాయి. వేలాది నేత కుటుంబాలు గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలిపోయాయి. నానాటికీ పెరిగిపోతున్న ముడిసరుకు ధరలతో ఎలాగొలా శ్రమకోర్చి నేసిన బట్టని కొనే నాథుడు లేకపోవడంతో నేతన్నలు దిక్కు తోచకుండిపోతున్నారు.   ఈ పరిస్థితి మారాలంటే రాజకీయ నాయకులో, సినిమా యాక్టర్లో నేత వస్త్రాలతో ఫొటోలు దిగితే సరిపోదు. ఏదో ఒక ప్రాంతానికి కొన్ని నెలలపాటు ఉపాధి చూపించీ లాభం లేదు. ప్రభుత్వంలోని విభాగాలన్నీ కూడా తమ యూనిఫాంలను నేతన్నల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ముడి సరుకు కొనుగోలులో తగిన సబ్సిడీని అందించాలి. చేనేత సహకార సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తేవాలి. మగ్గాలను ఏర్పాటు చేసుకునేందుకు, వాటిని నిర్వహించుకునేందుకు రాయితీ ఆధారంగా రుణాలను అందించాలి. మాస్టర్ వీవర్స్ కింద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. నేత కార్మికులకు ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలి.   మరోపక్క సాధారణ ప్రజానీకం కూడా చేనేత వైపుగా మళ్లేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు చేనేత వస్త్రాల పట్ల అభిమానం ఉన్నా కూడా, వాటిని అధిక ధర పెట్టి కొనుగోలు చేయలేని పరిస్థితి. పవర్లూంలో సింథటిక్ వస్త్రంతో రూపొందే ఒక చొక్కా ఖరీదు వంద రూపాయలు ఉంటే, అదే చేనేతలో కొనుగోలు చేయాలంటే మూడు వందలు తక్కువ ఖర్చవదు. ఇక నేత చీరలైతే వేల మీదే ఖరీదు చేస్తున్నాయి. కాబట్టి అటు నేతన్నలు సంతోషంగా తమ ఉత్పత్తిని సాగించేందుకు తగిన అవకాశాలు అందిస్తూనే, ఇటు ప్రజానీకం కూడా చేనేత వైపుగా మళ్లేందుకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చిన రోజున చేనేత కార్మికుని మొహాన నవ్వు విరుస్తుంది.

మళ్లీ వస్తుందా చిరంజీవి మేనియా...

  ఇప్పుడంటే మల్టీప్లెక్స్‌లు వచ్చేశాయి. ఆన్‌లైన్ బుకింగ్స్ జరుగుతున్నాయి. కొత్త సినిమాని ఒకేసారి వందలాది ధియేటర్లలో ప్రదర్శించే అలవాటు మొదలైంది. కానీ ఒకప్పుడు చిరంజీవి సినిమా చూడాలంటే పట్నం వెళ్లాలి. అక్కడ మొదటి రోజే చిరంజీవి సినిమాని చూసి రావడం అంటే అదో చిన్నపాటి సాహసం. ఆ తొక్కిసలాటలో లాఠీదెబ్బలు తింటే అదో బహుమానం. ఇంతా చేసి మొదటి రోజు సినిమాకి వెళ్తే ఒక్క డైలాగు కూడా వినిపించనంతగా హాల్లో కోలాహలం. అలా ఉండేది చిరంజీవి మేనియా. ఇప్పటి టీనేజి కుర్రాళ్లకి ఆశ్చర్యంగా కనిపించే ఆ మేనియాలో ఆంధ్రదేశంలో ఆనాటి కుర్రకారంతా మునిగితేలినవారే! ఇప్పుడు ఖైదీ నెం.150తో అలాంటి తోపులాటలు ఉండకపోవచ్చు. కానీ సందడిలో మాత్రం ఏమాత్రం సద్దు కనిపించేట్లు లేదు. చిరంజీవి ఆఖరి సినిమా శంకర్‌ దాదా జిందాబాద్‌ వచ్చి పదేళ్లు గడిచిపోయింది. 2008లో ప్రజారాజ్యం పెట్టిన తరువాత సినిమాలకు దూరమైపోయారు చిరంజీవి. సినిమా రంగంలో చెలరేగినంత తేలికగా రాజకీయాలలోనూ దూసుకుపోదామనుకున్న మెగాస్టార్‌కి చుక్కలు కనిపించాయి. లౌక్యం లేకపోవడం వల్లనో, తరచూ తప్పటడుగులు వేయడం వల్లనో, అతి విశ్వాసమో... కారణం ఏదైతేనేం 2011కల్లా ప్రజారాజ్యానికి పేకప్‌ చెప్పేసి కాంగ్రెస్‌లో కలిసిపోయారు. 2009 ఎలక్షన్లలో ప్రజారాజ్యం కనుక పోటీ చేసి ఓట్లను చీల్చకపోయి ఉంటే రాష్ట్ర చరిత్ర మరోలా ఉండేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. అటు పార్టీగా ప్రజారాజ్యమూ, ఇటు రాజకీయ నేతగా తాను హిట్‌ కాకపోవడంతో చివరికి రాజ్యసభ సభ్యునిగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజకీయాలు తనకి సరిపడవనో, తానే రాజకీయాలకు సరిపడననో మొత్తానికి చిరంజీవి దృష్టి మళ్లీ సినిమా మీద పడింది. ఈ నేపథ్యంలో తన 150 చిత్రపు మైలురాయి కూడా దగ్గరపడటంతో ఆయన పునరాగమనం మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు మూడేళ్ల నుంచి ఆయన 150 చిత్రం ఎలా ఉండాలి, దానికి కథ ఏంటి, ఎవరు దర్శకత్వం వహించాలి అంటూ ఎవరికి వారే విశ్లేషణలు మొదలుపెట్టేశారు. చివరికి వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా రామ్‌చరణ్ నిర్మాణంలో ఖైదీ నెం.150 రూపొందింది. ‘రాననుకున్నారా రాలేననుకున్నారా?’ అంటూ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి సాగిన ప్రసంగానికి బాగానే మార్కులు పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదల అయిన పాటలు లక్షల మీద లక్షల వ్యూయర్‌షిప్‌ను సాధించడం, ట్రైలర్‌కి కూడా మంచి స్పందన రావడంతో... ఖైదీ నెం. 150కి ఆరంభ వసూళ్లు అదిరిపోతాయని తేలిపోయింది. ఇక నిజంగానే సినిమాలో దమ్ముంటే మరోసారి చిరంజీవి శకం ఖాయంగా కనిపిస్తోంది. దాసరి అన్నట్లు దాదాపు పదేళ్ల తరువాత ఒక హీరో తిరిగి సినిమాల్లోకి రావడం ఇదే మొదటిసారి కావచ్చు. అన్నీ కలిసి వస్తే మరో పదేళ్ల పాటు చిరంజీవి సినిమాల్లో నటించవచ్చు. ఖైదీ నెం.150 హిట్‌ అయితే నటనాపరంగా చిరంజీవికి మరో దశ మొదలైనట్లే. కానీ రాజకీయపరంగా ఇది ఎలాంటి ఫలితం చూపించబోతోందన్నది ఆసక్తికరమైన విషయం. తెలుగు రాష్ట్రాలలో అందునా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏదో అద్భుతం జరిగితే కానీ ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ నిలదొక్కుకోవడం అసాధ్యం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చిరంజీవి కనుక తన గ్లామర్‌ను మళ్లీ సాధించగలిగితే... అలు కాంగ్రెస్‌కు లాభించడమే కాదు, చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలిపినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విషయాన్ని ఊహించో ఏమో దాసరి, చిరంజీవి సరసన కనిపించేందుకు.... ఇప్పటివరకూ పరోక్షంగా నానాతిట్లూ తిట్టిన మనిషిని, అదే నోటితో తెగ పొగిడేందుకు ఉత్సాహపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మెగా ఈవెంట్‌కి డుమ్మా కొట్టి లేనిపోని వివాదానికి మరోసారి తెరదీశారు. మరి ఖైదీ నెం.150లో ఏం డైలాగులు పేలతాయో, ఎలాంటి కథ వినిపిస్తుందో... వాటికి ప్రేక్షకులు స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే! అది చిరంజీవి సినిమా కెరీర్ మీదా రాజకీయ పురోగతి మీదా ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా జనవరి 11నాటికి తేలిపోనుంది.

ఉద్దానం - పవన్ విమర్శకి చంద్రబాబు జవాబు!

  జనసేన అధినేత పవన్కళ్యాణ్ మీద ఒక భారీ విమర్శ ఉంది. హడావుడిగా ఎగసిపడే కెరటంలా ఆయన అప్పుడప్పుడూ వచ్చి ఓ నాలుగు మాటల తూటాలని పేల్చి వెళ్లిపోతూ ఉంటారని అంటుంటారు. పైగా తెదెపా కష్టకాలంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ ప్రజలని చల్లార్చేందుకో, వారి దృష్టి మరల్చేందుకో పవన్ మైకు పట్టుకుంటారన్న విశ్లేషణలూ వినిపిస్తుంటాయి.   ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య విషయంలోనూ ఆయన చేపట్టిన ఉద్యమం మీద ఇలాంటి విమర్శలే వచ్చాయి. పెద్దనోట్ల రద్దు మీద పెను విమర్శలు చేస్తారనుకుంటే... ఎక్కడో ఉద్దానం సమస్య మీద పవన్ ప్రతిస్పందించడం ఏమిటనేవారు లేకపోలేదు. నిజానికి ఉద్దానం సమస్య ఏమంత తేలికగా కొట్టిపారేసే విషయం కాదు. అంతుపట్టని కిడ్నీ వ్యాధులు సోకి గత పది సంవత్సరాలలో ఈ ప్రాంతంలో 4,500 మంది చనిపోయారంటే... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ్రహించవచ్చు.   ఒక ఇరవై ఏళ్ల క్రితం ఆంధ్రాలోని ఉత్తర కోస్తా జిల్లాలో మొదలైన ఈ వింత వ్యాధితో అక్కడ ప్రతి ఇంటా ఒక్కరన్నా మృత్యువుతో పోరాడుతున్నట్లు అంచనా. అకస్మాత్తుగా రక్తపోటు రావడం, షుగర్ వ్యాధి బారిన పడటం, రక్తకణాలు తగ్గిపోవడం, మూత్రంలో యూరిక్ యాసిడ్ పోవడం... వంటి లక్షణాలు మొదలై చివరికి అది కిడ్నీ వైపల్యానికి దారితీయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉద్దానం నెఫ్రోపతి పేరుతో ప్రపంచ ప్రసిద్ధమైన ఈ సమస్యకి కారణం ఏమిటన్నది మహామహా శాస్త్రవేత్తలే తేల్చేలేకపోయారు.   2016లో హార్వర్డు విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి ఉద్దండ సంస్థలు కలిసి చేపట్టిన పరిశోధనలో ఉద్దానం ప్రాంతంలోని మంచినీరులో సిలికా అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నం అవుతోందేమో అన్న అనుమానాన్ని వెలిబుచ్చాయి. దీనికి తోడు పవన్ హఠాత్తుగా ఉద్దానం సమస్య గురించి మాట్లాడటం మొదలుపెట్టడంతో రాష్ట్ర ప్రజల దృష్టి ఉద్దానం వైపుగా మళ్లింది. ఉద్దానం బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పవన్ అల్టిమేటం జారీచేశారు. పవన్ అల్టిమేటానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడంతో ఉద్దానానికి ఊరట లభించినట్లయ్యింది.   వ్యాధి తీవ్రత ఉన్న గ్రామాలకు మినరల్ వాటర్ అందిస్తామనీ, అక్కడ మరో రెండు డయాలసిస్ యూనిట్లను మంజూరు చేస్తున్నామనీ, కిడ్నీ రోగులకు పింఛన్లనూ, సంచార వైద్య సదుపాయాన్నీ కల్పిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనతో పవన్ శాంతించినట్లే కనిపించారు. ఆయన ప్రకటనను స్వాగతిస్తున్నానంటూ పవన్ ట్విట్టర్లో చేసిన పోస్టు తెదెపాకి మంచి ఉత్సాహాన్నిచ్చింది.   ఉద్దానం రాజకీయ అంశం కాదు కాబట్టి దీనిని లేవనెత్తడం వల్ల జనసేనకీ, తెదెపాకీ, ఉద్దానం బాధితులకీ కూడా లాభం కలిగించేందిగా ఉంది. మున్ముందు పవన్ ఇలాంటి ప్రజా సమస్యలు మరిన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అలాంటి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రని పవన్ పోషించడం వల్ల అన్ని వర్గాలకీ మేలు జరుగుతుందన్ని ప్రజల భావన. మరి రాజకీయంగా తెదెపాని ఇరకాటంలో పెట్టే విషయాలలోనూ పవన్ ఇదే తీరున నిక్కచ్చిగా వ్యవహరించగలరా లేదా అన్నదే అనుమానం!  

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న హైకోర్టు తీర్పు

జీవో 123 కింద భూమి సేకరణని జరపడానికి వీల్లేదంటూ నిన్న హైకోర్టు వెలువరించిన తీర్పు పతాక శీర్షికలలో నిలిచింది. దీంతో ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనే సంబరంలో ఉన్న తెరాస ప్రభుత్వం నేల మీద కాళ్లని నిలిపి తన తీరుని సమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. నిజానికి 2015 జులైలో తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చినప్పటి నుంచీ, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి ఇలా దొడ్డిదారిని భూసేకరణ జరపాల్సిన అగత్యం ఏమిటంటూ పెద్దలు ప్రశ్నిస్తూనే వచ్చారు. తను తెచ్చిన రాష్ట్రం కాబట్టి తను తెచ్చిన చట్టానికి ఎదురుండదు అని భావించిన తెరాస ప్రభుత్వానికి... మల్లన్నసాగర్‌ నిర్వాసితులు గట్టిగానే తమ గొంతుని వినిపించడం మొదలుపెట్టారు. దాంతో ప్రభుత్వానికి ఎక్కడో ఒక చోట ఎదురుదెబ్బ తప్పదన్న అనుమానం కలుగుతూనే వస్తోంది. అది హైకోర్టు తీర్పు రూపంలో నిన్న బయటపడింది. ఏదో ఒకటి రెండు గ్రామాలలోని ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే- అబ్బే వారిని ఎవరో రెచ్చగొడుతున్నారు అని ఓట్రించవచ్చు. కోదండరాం వంటి పెద్దలు భూసేకరణకు విరుద్ధంగా మాట్లాడుతుంటే- వారి మీద తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేయవచ్చు. కానీ ఏకంగా ఉన్నత న్యాయస్థానమే ఈ జీవోని వ్యతిరేకించడంతో ఇప్పటికైనా ప్రభుత్వం తన కార్యచరణలోని లోటుపాట్లని గమనించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2013లో పార్లమెంటు ఆమోదించిన భూసేకరణ చట్టం చాలా బలిష్టమైనదన్న అభిప్రాయం ఉంది. నిర్వాసితుల నష్టాన్ని, అక్కడి సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... భూసేకరణ ద్వారా లాభమే కానీ నష్టం కలగని రీతిలో ఈ చట్టాన్ని రూపొందించారు. కానీ చట్టప్రకారం వెళ్తే పని సులువుగా జరగదనో, పరిహారంగా పెద్ద ఎత్తున వనరులను వదులుకోవాల్సి వస్తుందనో... కారణం ఏదైతేనేం, తెలంగాణ ప్రభుత్వం జీవో 123 ద్వారా సులువుగా భూసేకరణని సాగించే ప్రయత్నం చేసింది. నిర్వాసితులకు తగిన పునరావాసం కల్పించకుండా, సమాజిక ప్రభావం మీద అధ్యయనం చేయకుండా, అక్కడ ఉపాధి ఉద్యోగాలు నష్టపోయిన వారికి మరో దారి చూపించకుండా... జీవో 123 ద్వారా భూసేకరణ చేసే ప్రయత్నం జరిగిందంటున్నారు విమర్శకులు. పైగా మార్కెట్‌ రేటుతో పొంతన లేని పరిహారాన్ని అందిస్తున్నారనీ, ఇచ్చిందేదో పుచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నారనీ, ఒకో చోట ఒకో తీరున పరిహారాన్ని చెల్లిస్తున్నారనీ... ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. దీంతో న్యాయస్థానం కొంతవరకు ఏకీభవించింది కూడా! ఫలితంగా ఇక మీదట ఈ జీవో కింద భూసేకరణ జరిపేందుకు వీల్లేదని తీర్పుని అందించింది. ఇది 2013 భూసేకరణ చట్టంలోని కొన్ని అంశాలకు విరుద్ధంగా ఉందనీ, చట్టం ముందు అందరూ సమానులే అనే ఆర్టికల్‌ 14కి వ్యతిరేకంగా ఉందనీ పేర్కొంది. దీని వలన సదరు భూములపై ఆధారపడినవారి హక్కులు కూడా హరించుకుపోతాయని అభిప్రాయపడింది. సహజంగానే హైకోర్టు తీర్పుతో ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. తెరాస పెద్దలు మాత్రం 2013 భూసేకరణ చట్టాన్ని యథావిధిగా అమలుచేయడం కష్టమని చెబుతోంది. అందుకోసమే జీవో 123ని తీసుకువచ్చామని చెబుతోంది. పైగా కొత్తగా తాము రూపొందించిన 2016 భూసేకరణ చట్టం కనుక అమలులోకి వస్తే భూసేకరణలోని ఇబ్బందుల తొలగిపోతాయని చెబుతోంది. అయితే ఈ నూతన చట్టం కూడా 2013 చట్టానికి విరుద్ధంగానే ఉండి ఉంటుందనీ, అది కూడా న్యాయస్థానం ముందు నిలువదనీ విమర్శలు వినవస్తున్నాయి. తెలంగాణ రైతులు ఇప్పటివరకూ బోరు బావుల మీదే ఆధారపడుతున్న దుస్థితిలో సాగునీటి ప్రాజెక్టులు అత్యంత ఆవశ్యకం అన్న విషయాన్ని ప్రత్యకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలలో తెలంగాణది రెండో స్థానం అన్న విషయాన్ని గుర్తించినప్పుడు, ఇక్కడి రైతుల కోసం ఎంత శ్రమకి ఓర్చైనా సరే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాల్సిందే అన్న పట్టుదలా కలగక మానదు. కానీ అందుకోసం జరిగే భూసేకరణలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నదే ప్రజల అభిలాష. మరి అందుకోసం పకడ్బందీగా రూపొందించిన 2013 భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందన్నది ఊహకందని ప్రశ్న!

తెలుగువాడికి నోబెల్ వస్తుందంటారా

తిరుపతిలో జరుగుతున్న భారత సైన్స్ కాంగ్రెస్లో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ- నోబెల్ బహుమతి సాధించే తొలి ఆంధ్రునికి వందకోట్ల రూపాయలు అందిస్తామని ఘనంగా ప్రకటించారు. వినడానికి ఈ మాట ఎంత బాగుందో! కానీ నోబెల్ స్థాయిని చేరుకోవడానికి తెలుగువారు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే ప్రశ్న.   జాతీయస్థాయిలో ఫలానా పరీక్షలో తెలుగువారిదే పైచేయి అని వార్తలు వస్తుంటాయి. అమెరికాలో ఐటీ రంగాన్ని తెలుగువారు తెగ దున్నేస్తున్నారని నివేదికలు ఊదరగొడుతుంటాయి. ప్రతిష్టాత్మకమైన సీఏ పరీక్షలలో ర్యాంకులు, ఐఐటీ సీట్లూ అన్నింటా తెలుగువారే ముందు కనిపిస్తుంటారు. స్పెల్బీ, ఐక్యూలకి సంబంధించిన రికార్డులలోనూ తెలుగు పిల్లల ఫొటోలు కనువిందు చేస్తాయి. అంటే భవిష్యత్తుకి ఢోకా లేని రంగాలలోనూ, బట్టీపట్టే సందర్భాలలోనూ మనం ముందుంటున్నాం అన్నమాట.   సంగీతం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం వంటి సృజనాత్మక రంగాలలో తెలుగువాడు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడన్న వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి. తెలుగులో పొరపాటున ఆర్ట్ ఫిలిం తీసినా దాని దర్శకులు ఇతర భాషలవారై ఉంటారు. తెలుగు కీర్తనల మీద పట్టు సాధించినా, అది తమిళురై ఉంటారు. తెలుగు రాష్ట్రాలలో విద్య ఎప్పుడైతే కార్పొరేట్ పరం అయిపోయిందో... పిల్లల జీవితం మార్కులే పరమావధిగా మారిపోయింది. ఈ పరుగులో తాము ఎక్కడ వెనకబడిపోతామో అన్న భయంతో ప్రతి ఒక్కరూ పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది.   ర్యాంకులు, జీతాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు వంటి భౌతికమైన కొలబద్దలతో మన జీవితాలని కొలుచుకోవడం మొదలుపెట్టేశాం. తదనుగుణంగానే పిల్లల పెంపకమూ వారి విద్యాబుద్ధులూ సాగుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో విజ్ఞాన శాస్త్రానికి నా జీవితాన్ని అంకితం చేస్తానంటే ఎవరన్నా ఊరుకుంటారా! మంచి రచయితగా స్థిరపడతాననో, గొప్ప సంగీతకారుడిని అవుతాననో, సమాజసేవలోకి అడుగుపెడతాననో ఎవరన్నా లక్ష్యంగా పెట్టుకుంటే... వాడిలోని ‘పైత్యాన్ని’ వదలకొట్టకుండా ఊరుకుంటారా!   కాబట్టి... నోబెల్ బహుమతి సాధించేవారికి వందకోట్లు ఇస్తాను అనగానే పరిస్థితి మారిపోదు. తెలుగు సమాజం భౌతిక విజయాల వైపు పరుగులు తీస్తోదనే సత్యాన్ని ముందుగా గ్రహించాలి. పిల్లల్లో హేతుబద్ధతని పెంచేలా, విజ్ఞానం పెరిగేలా విద్యని రూపొందించాలి. అలా కాకపోతే ఎన్ని తెలుగు తరాలు ఆర్థికరంగంలో దూసుకుపోయినా వారి ఆలోచనలు మాత్రం ప్రాథమికంగానే ఉంటాయి. అమెరికా వెళ్లినా కులసంఘాలు పెట్టాలనో, అక్షరం చదివినా రూపాయి లాభం ఉండాలనో... వారి మెదళ్లు ప్రణాళికలు వేస్తూనే ఉంటాయి.   వాణిజ్యపరమైన విజయాలే అసలైన విజయాలన్న దృక్పథం నుంచి బయటపడితేనే చరిత్రలో నిలిచిపోయే స్థానాన్ని సంపాదించగలం. ఆఖరికి చంద్రబాబునాయుడు కూడా తన ప్రసంగంలో అమెజాన్, ఉబర్, మైక్రోసాఫ్ట్ వంటి వ్యాపార సంస్థలనే ఉదాహరణగా చూపించారంటే... మన ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతున్నాయో గమనించవచ్చు. మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సింది మైక్రోసాఫ్టుని కాదు ఎల్లాప్రగడ సుబ్బారావు, నాయుడమ్మ, సూరి భగవంతం, రాజిరెడ్డి వంటివారిని. ఆ తరువాతే నోబెల్ బహుమతి తెలుగువాడికి వస్తుందో లేదో అని మధనపడదాం. అందుకు తిరుపతిలో జరిగిన వైజ్ఞానిక పండుగ ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిద్దాం!

రైతుల ఆత్మహత్యలలో రెండో స్థానం ఎందుకు?

  వాళ్లు ప్రేమలో విఫలమై చావుని చేరుకోలేదు. కుటుంబ సమస్యలు ఉన్నాయని విరక్తితో జీవితాన్ని అంతం చేసుకోలేదు. మన ఆకలి తీర్చాలని ఆశించిన పాపానికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. National Crime Record Bureau అనే సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 8,007 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 15 శాతానికి పైగా రైతులు తెలంగాణకు చెందినవారు కావడం బాధాకరం. 1,358 రైతు ఆత్మహత్యలతో తెలంగాణ, దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రైతు ఆత్మహత్యలకి సంబంధించిన ఈ గణాంకాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో రైతుల దుస్థితికి కారణాలు స్పష్టంగానే తెలుస్తున్నాయి. ఏళ్ల తరబడి పీడిస్తున్న తీవ్రమైన కరవుతో అక్కడ మంచినీటికి సైతం మనుషులు కటకటలాడిపోయారు. దానికి తోడు అక్కడి రైతులు చెరకు పంట మీద ఎక్కువగా ఆధారపడటంతో పరిస్థితి మరింత ఉధృతరూపం దాల్చింది. ఎందుకంటే చెరకుని పండించాలంటే విపరీతంగా నీరు కావాల్సి ఉంటుంది. ఒక్క కిలో పంచదార ఉత్పత్తి అయ్యేందుకు దాదాపు 2,450 లీటర్ల మంచినీరు కావాల్సి వస్తుందని ఓ అంచనా. అలాంటి పరిస్థితులలో అక్కడి రైతు కరువు కోరలలో చిక్కుకుని విలవిల్లాడిపోయాడు.   తెలంగాణలోని పరిస్థితి ఇందుకు విభిన్నంగా ఉంది. ఇక్కడి రైతులు చెరకుతో పాటుగా వరి, పత్తి, పొగాకు, మామిడి, పసుపు, మిర్చి వంటి భిన్నమైన పంటల మీద కూడా ఆధారపడుతూ ఉంటారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే పంట కాలువలు, చెరవులకంటే బోరు బావుల మీదే రైతులు అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. అంటే బోరు కనుక పడకపోతే రైతు గుండెలో రాయి పడ్డట్లే అన్నమాట. కేవలం బోర్ల కోసమే లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి... నీటి చుక్క కనిపించకపోయేసరికి గుండెపగిలినవారు చాలామందే ఉన్నారు. ఒకవేళ బోరు పడినా కూడా వర్షభావపు పరిస్థితుల మధ్య భూగర్భ జలాలు ఎండిపోతే దిక్కుతోచక తనువు చాలించినవారూ ఉన్నారు.   కాబట్టి వ్యవసాయానికి నిరంతరం నీటి సరఫరా వల్లే పరిస్థితిలో ఎంతో కొంత మార్పు వస్తుందన్నది కాదనలేని విషయం. ఇందుకోసం మిషన్‌ కాకతీయ వంటి ప్రణాళికలు, పాలమూరు వంటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ కలలు సాకారమయ్యేలోగా రైతులకు బాసటగా నిలబడటం కూడా ప్రభుత్వ బాధ్యతే! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామిక, ఐటీ రంగాల మీద చూపించిన శ్రద్ధ వ్యవసాయ రంగం మీద చూపడం లేదన్న ఆరోపణ వినిపిస్తోంది. రైతుల రుణ మాఫీకి సంబంధించి కూడా సర్కారు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.   తెలంగాణ రైతులకు ఉన్న సమస్యలు చాలవన్నట్లు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒకటి వెలువడింది. దీంతో చచ్చి చెడీ పండించిన పంటను కొనే నాథుడే లేకుండా పోయాడు. పొలంలో కూలీలకు డబ్బులిచ్చేందుకు కూడా అప్పు తీసుకురావల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా విడుదల అయిన నోట్లను గ్రామీణ ప్రాంతాలకు, సహకార బ్యాంకులకు చేరవేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. నగదురహిత పల్లవిని అందుకున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో అదెంత కష్టసాధ్యమైన ఆచరణో గ్రహించి కూడా తన పల్లవిని మార్చుకునేందుకు సిద్ధపడటం లేదు.   ఇన్ని సమస్యల మధ్యా ఈ ఏడాది వర్షపాతం బాగుండటం  కొంతలో కొంత ఆశని కలిగిస్తోంది. వీటికి తోడు మిషన్‌ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలని అందించే సంస్థల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కూడా ముదావహమే! ఇక రైతుల రుణాలకి సంబంధించిన హామీలు కూడా ఖచ్చితంగా అమలు జరిగితే 2017లో తెలంగాణ రైతులు కాస్త ‘ఊపిరి’ పీల్చుకోవచ్చు. ఇప్పటివరకంటే గత ప్రభుత్వాల వైఫల్యం అంటూ ప్రభుత్వ పెద్దలు తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఇక మీదట కూడా తెలంగాణ రైతుల ఆత్మహత్యలని నిలువరించలేకపోతే... ఆ బాధ్యత ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వానిదే అవుతుంది.

ఎన్నికల నుంచి కులం తప్పుకుంటుందా!

కులమతాల ప్రాతిపదికన ఓట్లని అభ్యర్ధించడం నేరమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన తీరు భారత ఎన్నికల వ్యవస్థలోనే ఓ మైలురాయని విశ్లేషణలు మొదలయ్యాయి. అసలు ఇక మీదట ఎన్నికలలో కులం అన్న పేరే వినిపించదంటూ ఆశావహులు ఊహాలోకాలలో తేలిపోసాగారు. కానీ నిజంగా ఈ తీర్పుతో మన దేశంలో ఎన్నికలు మరింత స్వచ్ఛతను సంతరించుకుంటాయా!   పదుల కొద్దీ మతాలు, వందలాది భాషలు, వేలాది కులాలు... ఇంత వైవిధ్యమున్నా కూడా సమైక్యంగా ఉండటమే భారతీయ తత్వమన్నది పైకి వినిపించే మాట. కానీ ఆ మతాలు, కులాల ఆధారంగా ప్రజల్ని చీల్చి అధికారాన్ని సంపాదించుకుంటున్నారన్నది కాదనలేని వాస్తవం. ఏ రాష్ట్రంలోని ఎన్నికల తీరుని చూసినా కూడా రాజకీయాల మీద ఈ కులమతాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో ఇట్టే తెలిసిపోతుంటుంది. అంతదాకా ఎందుకు? దేశం నడిబొడ్డున ఉన్న ఉత్తర్ప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా కులాల సమీకరణలే అధికారాన్ని నిర్ణయిస్తున్నాయి.   మన దేశంలోని ఎన్నికలలో పాలుపంచుకుంటున్న ప్రతి పార్టీకీ తనదైన కులతంత్రం ఉంది. కొన్ని పార్టీలు బహిరంగంగానే తాము ముస్లింల తరఫునో, హిందుత్వ తరఫునో మొగ్గి ఉన్నామని చెప్పుకుంటాయి; ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు అణగారిన పక్షమని చెప్పుకొంటూనే అధికారం కోసం పాటుపడుతుంటాయి; కాంగ్రెస్ లాంటి పార్టీలు సెక్యులరిస్టు పేరుతోనే అవసరమైనప్పుడు మతరాజకీయాలకు పాల్పడుతుంటాయి.... ఆఖరికి కమ్యూనిస్టు పార్టీలలో సైతం కొన్ని అగ్రవర్ణాలదే పైచేయి అన్న ఆరోపణలూ ఉన్నాయి.   పార్టీల పరిస్థితి ఇలా ఉంటే జనం మనస్తత్వం అందుకు భిన్నంగా ఏమీ లేదు. నాగరికతలో ఎంత ముందుకు పోయినట్లు కనిపించినా... కొత్త మనిషి పరిచయం అవగానే, అతని కులమేమిటా అని బేరీజు వేసుకునే మనస్థితి మనది. విదేశాలకు వెళ్లినా కులకుంపట్లు పెట్టుకుంటాము, ఒలంపిక్స్లో పతకం సాధించిన మనిషి కులం ఏమిటా అని ఆరా తీస్తాం. ఆఖరికి వీళ్లకి రక్తం కావాలన్నా కూడా కులం కావాలేమో అంటూ ప్రపంచం నవ్వుకునే స్థితికి చేరుకున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఒక అభ్యర్థి ప్రత్యేకించి తన కులం పేరు చెప్పి ఓటు అడగాల్సిన అవసరం ఏముంది? ఏ పార్టీ ఏ కులానికి ప్రాముఖ్యతని ఇస్తుంది, ఏ పార్టీ తరఫు అభ్యర్ధి ఏ కులపు వాడు నిలబడ్డాడు అని ప్రజలే ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు కదా!   ఎన్నికలలో కులాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో భాజపాకు దెబ్బ అని విశ్లేషిస్తున్నవారు లేకపోలేదు. ఎందకంటే భాజపా తన మ్యానిఫెస్టోలో తరచూ రామమందిర నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. ఇక ముందు ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఆ పార్టీ మ్యానిఫెస్టో నుంచి రామమందిరాన్ని తొలగించమంటూ మున్ముందు తీర్పు వెలువడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ భాజపా రామమందిరానికి అనుకూలం అన్న అభిప్రాయాన్ని మాత్రం ఓటర్ల మది నుంచి తొలగించలేరు కదా! ఏతావాతా సమస్య ఒక పార్టీ బహిరంగ ప్రకటనలలో మాత్రమే లేదని తేలిపోతోంది. పౌరుల మనసులోనే కుల కల్మషం ఉంది. అది తొలగిపోవాలంటే భారీ మార్పులే రావాలి. దేశంలోని మేధావులు, లేదా మేధావులమని భుజకీర్తులు తగిలించుకున్నవారు ముందుగా ఆలోచించాల్సింది... అసలు కులం అనే మాటని నిర్మూలించడం ఎలాగా అనే!  

ఈ నెల 11 తర్వాత జగన్ పరిస్థితి ఏంటి..?

పులివెందుల..ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సుమారు మూడు దశాబ్ధాల పైగా పులివెందుల కేంద్రంగా ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ బతికున్నంతకాలం పులివెందుల వైపు చూడటానికి ప్రత్యర్థులు భయపడేవారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి తెలుగునాట కాంగ్రెస్ పునాదుల్ని పెకలించిన ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం ఇక్కడి జనం వైఎస్‌కే పట్టం కట్టారు. స్థానికుడు కావడం..స్థానిక సమస్యలపై పట్టు ఉండటంతో వైఎస్ కుటుంబానికి పులివెందులలో తిరుగు లేకుండా పోయింది.   ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు పులివెందులలో పాగా వేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు..కానీ అది కలగానే మిగిలిపోయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ వైఎస్ కోటను బద్దలుకొట్టే అవకాశం వచ్చింది. కడప జిల్లాకు కృష్ణాజలాలను తరలించాలని ఎందరో ముఖ్యమంత్రులు భావించారు..కానీ అది కాగితాలకే పరిమితమయ్యింది తప్పించి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు.   అయితే రాష్ట్ర విభజన జరగిన తర్వాత సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి అధికారులను పరుగులు పెట్టించారు. సీఎం పట్టుదల, అధికారుల కృషి ఫలితంగా ఈ నెల 11న ఈ కల సాకారం కాబోతోంది. ఆ రోజున స్వయంగా పైడిపాళేనికి కృష్ణజలాలను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబుకు ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు లాభాలున్నాయి. బాబు కడప జిల్లాను చిన్నచూపు చూస్తున్నారన్న ప్రతిపక్షనేత జగన్‌ ఆరోపణలను తిప్పికొట్టడం ఒకటైతే..కడప జిల్లాకే చెందిన వైఎస్ సీఎంగా ఉండి కూడా సాధించలేని ప్రాజెక్ట్‌‌ను తాము సాధించగలిగామని బాబు ఘనంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 

ఉగ్రవాదులతో టర్కీ చెలగాటం

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలలో మునిగి ఉన్న సమయంలో టర్కీ మాత్రం శోక సంద్రంలో మునిగిపోయింది. డిసెంబరు 31 రాత్రి ఆ దేశ రాజధాని ఇస్తాంబుల్లోని ఓ నైట్ క్లబులోకి ఓ ఉగ్రవాది శాంతాక్లాజ్ వేషధారణలో అడుగుపెట్టాడు. బహుమతులు పంచాల్సిన చేతులతోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పదులకొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని రూఢి అయిన తరువాత, చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. హారర్ సినిమాకంటే భయాన్ని కలిగించే ఈ వార్త, అక్కడి భీతావహ పరిస్థితికి ఒక సూచన మాత్రమే!   2016లో టర్కీలో ఉగ్రదాడులు సర్వసాధారణం అయిపోయాయి. ఈ ఒక్క ఏడాదే అక్కడ 300 మందికి పైగా పౌరులు ఉగ్రవాదుల దాడులలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కూడా స్వయంకృతాపరాధమే అంటున్నారు నిపుణులు. ఉగ్రవాదం మీద సవారీ చేయాలనుకున్న టర్కీ పాలకులు చివరికి ఆ ఉగ్రవాదానికే బలవుతున్నారని విశ్లేషిస్తున్నారు. అందులో నిజం లేకపోలేదు.   ఐరోపా, ఆసియా ఖండాల మధ్యన ఉండే టర్కీ దేశం మొదటి నుంచీ ఏమంత అభివృద్ధి చెందిన దేశం కాదు. అందుకనే "Sick man of Europe" అని టర్కీని పిలుస్తారు. గత దశాబ్ద కాలంలో అక్కడి పాలకుల తీరు, దేశాన్ని మరింత అధ్వాన్న స్థితిలోకి నెట్టేశాయి. చుట్టుపక్కల దేశాలని నియంత్రిద్దామనుకునే అతితెలివితేటలు, చివరికి భస్మాసుర హస్తంలా పరిణమించాయి.   టర్కీ పక్కనే ఉన్న సిరియా, ఇరాక్ దేశాలలో ఆ మధ్య ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదులు వేళ్లూనుకున్న విషయం తెలిసిందే! మొదట్లో టర్కీ ఈ ఉగ్రవాదులని చూసీ చూడనట్లు ఊరుకుంది. IS ఉగ్రవాదులు తమ దేశంగుండా ఇతర దేశాలలోకి ప్రవేశిస్తున్నా కిమ్మనకుండా ఉంది. పైగా వారిని ప్రోత్సహించిందన్న విమర్శలూ వినిపించాయి. కానీ ఎప్పుడైతే తన దేశంలో కూడా IS కార్యకలాపాలు పెచ్చరిల్లిపోతున్నాయో... అప్పుడిక వారి మీద చర్యలు తీసుకోక తప్పలేదు. అందుకోసం నాటో దళాలతో కలిసి ISతో పోరాటం మొదలుపెట్టింది. కానీ అప్పటికే చేతులు కాలిపోయాయి. సిరియా, ఇరాక్లలో వెనక్కి తగ్గాల్సి రావడంతో IS టర్కీలో బలపడేందుకు ప్రయత్నించసాగింది.   పోనీ IS మీద జరుగుతున్న పోరులో అన్నా టర్కీ మనస్ఫూర్తిగా పాల్గొంటోందా అంటే అదీ లేకపోయింది. టర్కీ, రష్యాలు రెండూ కలిసి ఒకవైపు సిరియాలోని IS ఉగ్రవాదుల మీద దాడిచేస్తున్నట్లు హడావుడి చేస్తూనే... అక్కడ అధ్యక్షస్థానంలో తమకు అనుకూలంగా ఉన్న అసద్ పదవికి ఎలాంటి ఆపదా రాకుండా పన్నాగాలు మొదలుపెట్టాయి. దాంతో అమెరికా కూడా టర్కీకి వ్యతిరేకంగా మారిపోయింది.   సిరియా, ఇరాక్ల మీద పట్టు సాధించేందుకు టర్కీ చేస్తున్న పలు ప్రయత్నాల వల్ల దాని పొరుగు దేశం ఇరాన్కు కూడా నచ్చకపోవడంతో ఇరాన్ సైతం టర్కీ అంటే రగిలిపోతోంది. ఇంతాచేసి పోనీ రష్యాతోనన్నా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయా అంటే అదీ లేదు. గత నెల టర్కీలోని రష్యా రాయబారిని కాల్చి చంపడంతో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒక్క కుదుపుకి లోనయ్యాయి.   ఇవన్నీ ఒక ఎత్తైతే కుర్దుల మీద టర్కీ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత ధోరణి మరో ఎత్తు. టర్కీలోని కొన్ని ప్రాంతాలలో తాము స్వయంగా పాలించుకునే అవకాశం ఇవ్వమంటూ ఈ కుర్దులు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. వారి సమస్యలని సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే, మరోవైపు వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది టర్కీ ప్రభుత్వం. ఫలితంగా కుర్దుల నిరసన సాయుధ పోరాట స్థాయికి చేరుకుంది.ఏతావాతా ఒక దేశం ఎలా వ్యవహరించకూడదో అన్నిరకాలుగా ఆచరించి చూపింది టర్కీ. ఫలితంగా ఇప్పుడు అగ్నిగుండంగా మారిపోయింది. మరి ఇక మీదటన్నా తెలివి తెచ్చుకుని దీర్ఘకాలికంగా లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకుంటుందా లేకపోతే మరిన్ని వ్యూహాలు పన్ని తనతో పాటుగా ప్రపంచశాంతికే ముప్పు తెస్తుందా అన్నది కొత్త ఏడాదిలో తేలిపోనుంది.

ఈ భీం మనని కాపాడతాడా

  500, 1000 రూపాయల విలువ కలిగిన పాతనోట్లను రద్దుచేయగానే దేశం యావత్తూ నివ్వెరపోయింది. ఆ నివ్వెరపాటు నుంచి తేరుకున్న జనం ఒక్కసారిగా బ్యాంకుల వైపు పరుగులు తీశారు. తొలుత నల్లధనం రద్దుకోసమే ఈ నిర్ణయం అంటూ ప్రకటించిన కేంద్రం నిదానంగా నగదురహితం అనే కొత్త పల్లవిని అందుకుంది. నోట్ల పాట్లుతో విసిగెత్తిపోయి ఉన్న దేశప్రజలు కూడా నగదురహిత లావాదేవీలకు అలవాటు పడటం మొదలుపెట్టారు. అప్పటివరకూ డెబిట్‌ కార్డులను కేవలం ఏటీఎంలలో మాత్రమే ఉపయోగించినవారు... ఇప్పుడు స్వైపింగ్‌ మెషీన్లలలోనూ, ఆన్‌లైన్ కొనుగోళ్లలోనూ తమ కార్డులను వాడటం నేర్చుకున్నారు.   ప్రజల్లో మొదలైన ఈ ‘నగదురహిత’ అలవాటుని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను ప్రారంభించింది. అదే భీమ్ (Bharat Interface for Money - BHIM). భీం రావ్ అంబేడ్కర్‌ పేరు మీదుగా ఈ యాప్‌కు ఆ పేరు పెట్టామంటూ ప్రకటించిన కేంద్రం, నిన్న మోదీ చేతుల మీదుగా దీనిని లాంఛనంగా ప్రారంభించింది. రిజర్వ బ్యాంక్‌ ప్రోత్సాహంతో National Payments Corporation of India (NPIC) అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. NPIC రూపొందించిన ఈ యాప్‌ ప్రపంచంలోనే ఓ గొప్ప అద్భుతంగా నిలవబోతోందంటూ మోదీ సైతం ప్రశంసిస్తున్నారు. భీం యాప్‌లో ఫీచర్స్‌ను గమనించినవారికి, ఇది నిజంగానే ఓ అద్భుతమైన యాప్ అనిపించక మానదు. ఎందుకంటే మన మొబైల్ నెంబరు బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉంటే చాలు, భీం యాప్‌ ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. అయితే దీనికోసం మన బ్యాంకు నుంచి ఒక UPI పిన్‌ నెంబరుని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మనం చెల్లింపులు జరిపే వ్యక్తికి UPI సౌకర్యం లేకపోతే అతని ఖాతా వివరాలతో పాటుగా అతని బ్యాంక్ IFSC CODEని ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీని పూర్తిచేయవచ్చు.   కేవలం UPI పిన్ నెంబరు, IFSC కోడ్ల ద్వారానే కాకుండా QR కోడ్‌ని బదిలీ చేసుకోవడం ద్వారా కూడా భీం చెల్లింపులు సాధ్యమవుతాయంటున్నారు అధికారులు. అంతేకాదు! ఈ యాప్ మెసేజ్‌ల ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి, సాధారణ ఫీచర్‌ ఫోన్లు ఉన్నవారు కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నారు. వ్యాపారస్తులు కనుక ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే, కొనుగోలుదారుల వేలిముద్రల తీసుకుంటే చాలు... చెల్లింపులు పూర్తియిపోతాయని భరోసా ఇస్తున్నారు. కొనుగోలుదారుని బ్యాంకు ఖాతా అతని ఆధార్‌కార్డుతో అనుసంధానమై ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుంది. ఏ రకంగా చూసినా కూడా ఈ యాప్ ఒక చక్కటి సౌకర్యంగానే కనిపిస్తోంది. కానీ వాడకంలోకి వచ్చేసరికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది వేచి చూడాలి. నిరక్షరాస్యులు ఈ యాప్‌ను ఉపయోగించడం అంత తేలిక కాదన్నది పక్కన పెట్టేద్దాం. కనీసం సాంకేతికత మీద పట్టున్నవారిని సైతం ఈ యాప్‌ ఆకర్షిస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే యాప్‌ మధ్యమధ్యలో హ్యాంగ్‌ అయిపోతోందనీ, ఒకసారి వాడిన తరువాత మళ్లీ తెరుచుకోవడం లేదనీ కొన్ని వార్తలు వస్తున్నాయి. యాప్‌ ఇంకా ప్రారంభదశలోనే ఉందికాబట్టి, దానిని ఉపయోగించే సమయంలో ఎదురయ్యే సాధకబాధకాలన్నింటినీ NPIC పరిశీలిస్తుందనీ... మరో నెల రోజుల్లో ఈ యాప్‌ ఎలాంటి అవాంతరమూ లేకుండా పనిచేసేలా తగు మార్పులు చేస్తుందనీ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే 2017 భీం నామ సంవత్సరంగా మిగిలిపోవడం ఖాయం.

పోల’వరం’లో కీలకదశ

  పోలవరం గురించి ఊరిస్తూ వచ్చిన ఊహలు సాకారమయ్యే దశకు చేరుకున్నాయి. ఇన్నాళ్లుగా భూసేకరణ, కాలువల నిర్మాణం వంటి మౌలిక పనులు సాగిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు స్పిల్‌వేకు శ్రీకారం చుట్టడంతో ప్రాజెక్టు నిర్మాణంలో కీలకదశకు చేరుకున్నట్లయ్యింది. దాదాపు కిలోమీటరుకు పైగా 48 గేట్లతో నిర్మించే ఈ స్పిల్‌వేతో నీటి మట్టాన్ని నియంత్రించవచ్చు.   దాదాపు 60 సంవత్సరాలుగా కేవలం ప్రణాళికల దశలోనే ఉన్న పోలవరంలో తొలి కాంక్రీటు నిర్మాణం జరగడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా సాగించాలని భావిస్తోంది. అందుకోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మందిని తరలించడంతో పాటుగా కేంద్ర మంత్రులు సైతం ఇందులో పాలుపంచుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వేడుకని ఘనంగా నిర్వహించేందుకు ఏకంగా 50 మంది ఐయేఎస్ ఆఫీసర్లను కూడగడుతున్నారంటే... ప్రభుత్వం దీనినెంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.   గోదావరి నుంచి సముద్రంలోకి వ్యర్థంగా చేరిపోయే మిగులు జలాలను వినియోగించుకోవాలన్నా, ప్రతి వేసవిలోనూ ఎండిపోతున్న కృష్ణమ్మ ఒడిని నింపాలన్నా కూడా పోలవరం కీలకమన్నది జలనిపుణుల మాట. ఇంతటి బృహత్‌ ప్రాజెక్టుకి వేలకోట్లుగా నిధులు అవసరం అవుతాయి. వేల ఎకరాల భూమినీ సేకరించాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలనీ పట్టించుకుని తీరాల్సిందే!   కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో నిధులకి కొరత లేకపోవచ్చునన్న భరోసా కలిగింది. రాష్ట్రానికి ఎలాగూ ప్రత్యేక హోదాని ఇవ్వడం లేదు కాబట్టి, కనీసం పోలవరానికి సాయం చేయక తప్పకదన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక పోలవరంతో తమ రాష్ట్రాలు ముంపుకి గురవుతాయంటూ ఒడిషా, చత్తీస్‌గడ్‌, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... అవి ప్రాజెక్టుని నిర్వీర్యం చేసే స్థాయిలో లేవు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.   పోలవరం నిర్మాణంతో విలువైన అటవీ సంపద ఎలాగూ నీట మునిగే అవకాశం ఉంది. ఇది కాకుండా 40 వేల కుటుంబాలకు పైగా తమ భూమిని కోల్పోనున్నాయని ఓ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ తగిన పరిహారం ఇవ్వడం లేదనీ, ఉన్నఫళంగా ఊళ్లకి ఊళ్లే ఖాళీ చేయిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు భూసేకరణ ఇంకా పూర్తి కానేలేదనీ, పూర్తయిన భూమికి చాలాచోట్ల పరిహారం అందలేదనీ విపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ తెదెపా ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరాన్ని ముందుకు తీసుకుపోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.   ప్రత్యేక హోదా విషయంలో చెలరేగిన అసంతృప్తినీ, అమరావతి నిర్మాణంలో సాగుతున్న జాప్యాన్నీ వెనుకకు నెట్టేస్తూ ప్రజలకు కాస్త సంతోషం కలిగించే తాయిలంలా పోలవరం తప్పక పనికొస్తుంది. పోలవరాన్ని విమర్శించేవారిని ఎలాగూ అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేయవచ్చు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులో దూకుడుని ప్రదర్శిస్తున్నా... నిరంతర విద్యుత్తునీ, సాగునీటినీ, తాగునీటినీ అందిస్తుందని ఆశించే పోలవరం కల సాకారమవుతోందంటూ ఆంధ్ర ప్రజలు మహా సంతోషంగా ఉన్నారు.

ఎస్ఐపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దౌర్జన్యం

చట్టం తన పని తాను చేసుకుపోతుంది..చట్టం కళ్లలోంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.. ఇవి మనదేశంలో రాజకీయ నాయకుల నోళ్లలో నానే మాటలు. కానీ అదంతా పైకి కనిపించే కలరింగ్ మాత్రమే వాస్తవంలో జరిగేది వేరు. నిజానికి చట్టాలైనా..అధికారులైనా అధికారంలో ఉన్న వారి కోసమే పనిచేస్తాయి. కాదంటే చట్టాలే మారిపోతాయి..అంతేతప్ప ఏ అధికారి తనంత తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. అక్రమం అని చెప్పబడే ప్రతి విషయం..మన నేతాశ్రీల కోసం సక్రమంగా మారుతుంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. ట్రిపుల్ రైడింగ్‌ చట్టరీత్యా నేరం..చట్టాన్ని ధిక్కరించి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసుల కంటపడ్డామా( అంటే పోలీసులు ఆ దారిలో లేకపోతే ఓకే) మన సంగతి అవుట్. జేబు గుల్లవ్వాల్సిందే.   అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు కొన్ని మినహాయింపులున్నాయి..ట్రిపుల్ రైడింగ్‌ చేస్తూనో..సీటు బెల్ట్ పెట్టుకోకుండానో..డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనో ఈ నాయకుల మనుషులు పట్టుబడితే వాళ్లను పోలీసులు వదిలిపెట్టాల్సిందే..అలా కాదని జరిమానా విధించడమో..జైలుకు పంపడమో చేశారనుకోండి. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకు తాజాగా జరిగిన ఘటన ప్రత్యక్ష నిదర్శనం.  కామారెడ్డిలో స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఒకే బైక్‌పై ముగ్గురు వెళ్లడం చూసిన ఎస్ఐ వాళ్లను ఆపారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు జరిమానా కట్టాలని ఎస్ఐ చెప్పారు. అయితే తాము టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ అనుచరులమని తమని వదిలివేయాలని వార్నింగ్ ఇచ్చారు. అందుకు ససేమిరా అన్న ఎస్ఐతో వారు వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ విషయం చెప్పారు.   అంతే  క్షణాల్లో అనుచరులతో స్పాట్‌కు వచ్చిన ఎమ్మెల్యే  రవీందర్ కోపంతో ఊగిపోతూ..అసలు ఏమైందో కూడా తెలుసుకోకుండా నానా రచ్చ చేశారు. "నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను..నేనెవరో నీకు తెలియదా..? నా పేరు చెప్పినా నా మనుషులను వదలవా..నీ సంగతి ఏంటో తెలుస్తా" అంటూ ఎస్ఐపై అంతెత్తున లేచారు. పక్కనున్న ఎమ్మెల్యే అనుచరులు ఎస్ఐని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా..దాడికి దిగబోయారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి తమ వారిని విడిపించుకుని వెళ్లిపోయారు. జరిగిన సంఘటనను మొదటి నుంచి చివరిదాకా చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు. 

నోట్ల రద్దు కాదు... ఎమర్జెన్సీ విధించినా ఓకేనట!

  మోదీ నోట్ల రద్దుతో దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి! జనం నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి మాటలు మనం రోజూ వింటూనే వున్నాం. రాహుల్ గాంధీ మొదలు మమతా బెనర్జీ వరకూ అందరూ ఎమర్జెన్సీ జపం చేస్తున్నారు! కాని, జనంలో పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా వుంది.  ప్రతిపక్ష నేతలు ఎమర్జెన్సీ బూచి చూపి భయపెడదామనుకుంటున్నంత భీభత్సంగా సామాన్య జనం ఎమర్జెన్సీ గురించి భయపడటం లేదు. మరీ ముఖ్యంగా , కాస్త చదువుకున్న ఈ కాలపు ఇండియన్స్ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే సోషల్ మీడియాలో అయితే ఎమర్జెన్సీ అస్సలు వణుకు పుట్టించటం లేదు! ఇన్ ఫ్యాక్ట్, నెటిజన్లు ఎమర్జెన్సీ కావాలంటున్నారు! అయితే, ఆ ఎమర్జెన్సీ మోదీ విధిస్తే ఓకే అంటున్నారు...  ప్రజాస్వామ్యంలో వుంటూ హాయిగా స్వేఛ్ఛని అనుభవిస్తున్న ప్రజలకి ఇదేం మాయ రోగం అనుకుంటున్నారా? అసలు సంగతి తెలియాలంటే, రైటర్ చేతన్ భగత్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ గురించి మాట్లాడుకోవాలి. ట్విట్టర్ లో చేతన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఫాలోవర్స్ వున్నారు. ఆయన త్వరలో రాయనున్న ఒక వ్యాసం కోసం జనం అభిప్రాయం కావాల్సి వచ్చింది. అది తెలుసుకునేందుకు తన ట్విట్టర్ అకౌంట్ సాయంతో సర్వే నిర్వహించాడు. అందులో అడిగిన కొశన్స్, వచ్చిన సమాధానాలు వింటే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది! చేతన్ భగత్ ''మోదీ లీడర్ గా వుంటూ కొంచెం ప్రజాస్వామ్యం దెబ్బతిన్నా ఫర్వాలేదా?'' అని అడిగాడు. అందుకు, 55శాతం మంది ఓకే చెప్పారు. మొత్తం ఓటింగ్ లో పాల్గొన్న వారి సంఖ్య పదివేలకు పైమాటే! చేతన్ భగత్ మరో ప్రశ్న వేశాడు ట్విట్టర్ యూజర్స్ కి... '' అవినీతి అంతానికి, అవినీతి పరుల్ని శిక్షించటానికి మోదీ కొద్ది కాలం పాటూ ఎమర్జెన్సీ విధిస్తే మీరు మద్దతిస్తారా?'' ఈ ప్రశ్నకి కూడా 9వేల మందికి పైగా ఓటింగ్ చేశారు. అందులో 57శాతం మంది మోదీ విధించే తాత్కాలిక ఎమర్జెన్సీకి సై అన్నారు! ఈ పలితాలు చూసిన చేతన్ భగత్ తానే అవాక్కయ్యాడు. అసలు జనానికి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదా? లేక అదంటే ఏంటో తెలియదా? అంటూ ట్వీట్స్ చేశాడు! చేతన్ భగత్ చేసిన సర్వేలో, వేలాది మంది ఎమర్జెన్సీకైనా సరే అనటం, మోదీ టెరిపిక్ పాలోయింగ్ కి నిదర్శనం! ఆయనని నిజాయితీపరుడిగా, గొప్ప ఫలితాలు సాధించగలిగే శూరుడిగా జనం చూస్తున్నారు. కాని, అంతకంటే ముఖ్యంగా డెబ్బై ఏళ్లుగా దేశాన్ని దోచుకున్న ఇతర నాయకులు, వారి పార్టీలు, వాటి పాలనలో బయటపడ్డ కుంభకోణాల పట్ల ఈ తరం వారికి తీవ్రమైన కోపం, కసి వున్నాయి. అవ్వే మోదీ పట్ల గుడ్డి విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి. మోదీ అయినా సరే ఎమర్జెన్సీ పెట్టడాన్ని బాధ్యతగల పౌరులు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే. కాని, అసలు ఆయన పెడతానంటే అందుకు కూడా తాము సిద్ధమని జనం అంటున్నారంటే లోపం ఎక్కడుందో ముందు గ్రహించాలి. గత డెబ్బై ఏళ్లుగా భారతీయులు తమని తాము అవినీతి ఎమర్జెన్సీలో వున్నట్టుగా ఫీలవ్వటమే ఈ ఆందోళకర ఆలోచనా సరళికి కారణం!       

అభివృద్ధి మాటున అభివృద్ధి చెందుతోన్న ఎమ్మేల్యేగారు!  

అభివృద్ధి... ఈ మధ్య ఈ పదం తెగ రుద్దబడుతోంది! ఏ రాజకీయ నాయకుడ్ని కదిపినా అభిరుద్ది కోసమే తాను రాజకీయాల్ని రుద్ది రుద్ది పిండేస్తున్నానంటాడు!ఇంతకీ అభివృద్ధి అంటే ఏంటి? తాజాగా వైసీపీ నుంచీ టీడీపిలోకి జంపైన ఒకప్పటి టీడీపీ నాయకురాలు, ప్రస్తుత ఎక్స్ వైసీపీ లీడర్ వాలకం గమనించాలి. చక్కగా అర్థం అవుతుంది! ఆమె ఒకప్పుడు టీడీపీలో వుండేది. ఏదో ఆషామాషీగా కాదు. పోలిట్ బ్యూరో మెంబర్ గా వెలిగిపోయేది. అలా పదేళ్లు పార్టీలో కొనసాగిన ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. కాని, ఎందుకోగాని... ఆమె అసెంబ్లీ చేరుకోలేకపోయింది. ఆమె టీడీపీలో వుండగా ఆ పార్టీ కూడా అధికారం చేపట్టలేకపోయింది. రెండు సార్లు ఎన్నికల్లో పోటీ, అయినా వరుస ఓటముల కారణంగా మేడమ్ గారు బాగా నష్టపోయారు. ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కి అసెంబ్లీలో కాలుపెట్టి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని భావించిన ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకుంది. అదృష్టవశాత్తూ గెలిచింది కూడా. కాని, ఈసారి మరో విధంగా బ్యాడ్ లక్కు వెక్కిరించి... ఆమె ఎమ్మెల్యేగా గెలిచని పార్టీ కాస్తా ప్రతిపక్షానికే పరిమితం అయిపోయింది! ఆపరేషన్ సక్సెస్ ... పేషంట్ డెడ్ అన్నట్టు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. మరో వైపు ఆమె మీద టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిన నాయకుడు మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నాడు. ఇసుక దందాలో ఇనుమడించి సంపాదిస్తున్నాడు. ఇదంతా బాధగా చూస్తోన్న లేడీ లీడర్ రెండున్నర ఏళ్లుగా ఆర్దిక ఒత్తిడికి లోనవుతున్నారు. తాను గెలిచి కూడా లాభం లేదనీ, అదే టీడీపీ నాయకుడు ఓడి కూడా భలే సంపాదిస్తున్నాడని కుమిలిపోయింది. పోనీ తనకు మూడేసి ఎన్నికల్లో అండగా నిలబడి కోట్ల రూపాయల ఖర్చులు భరించిన భర్తకైనా ఏమైనా లాభం వుందా అంటే అదీ లేదు. అసలు ఆయనగారిది మరో బాధ...  వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మన లీడర్ వారి హజ్బెండ్ ఆదాయ పన్ను శాఖలో మంచి ఆదాయం వచ్చే సీనియర్ ఆపీసర్. కాని, ఏవో కొన్ని కేసుల మూలన ఆయన్ని మూలన పడేసింది ఆదాయ పన్ను శాఖ. మంచి పొజీషన్లో పోస్టింగ్ వస్తే ఆయన సూపర్ గా రాబట్టేస్తారు. అందుకే, మన నాయకురాలు జగన్ వద్దకి వెళ్లి మొరపెట్టుకున్నారట. ఆయన జైట్లీతో మాట్లాడి మేడమ్ గారి భర్తని గారెల బుట్టలో వేయిస్తానన్నాడట. కాని, ఆ హామీ ఇప్పటి వరకూ నెరవేరిన దాఖలాలు లేవు. జగన్ మాట జైట్లీ వినేంత సీనూ లేదు. ఇదంతా అర్థమైపోవటంతో... ఆలసించిన ఆశభంగం అనుకున్నారు అమ్మగారు. టీడీపీ వారితో టచ్ లోకి వచ్చి తన డిమాండ్ వారి ముందు వుంచారట.  చంద్రబాబు, ఒకప్పటి ఈ పోలిట్ బ్యూరో సభ్యురాలు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోడు అర్థం చేసుకుని అభయం ఇచ్చారట. జైట్లీతో తాను మాట్లాడి ఎమ్మెల్యేగారి శ్రీవారికి జేబు నిండా పనుండే పోస్టింగ్ వేయిస్తానన్నారట. అదే పది వేలు అనుకున్న ఆమె కనీసం వచ్చే ఎన్నికల ఖర్చుకైనా ఆయనగారు సంపాదించి రెడీగా పెడతారని భావించి పార్టీ దూకేసింది. ఆ తరువాతే మీడియా ముందుకొచ్చి చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పచ్చ కండువా కప్పేసుకుంది! చాలా మందికి అప్పుడు ఒకటే అనుమానం కలిగింది... గతంలో దశాబ్ద కాలం పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పని చేసిన ఆమెకి చంద్రబాబు అభివృద్ది చేయగలరని 2014లో నమ్మకం కలగలేదా? వైసీపీలోకి వెళ్లిపోయి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాక ... ఇప్పుడు మళ్లీ తన పాత పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశం మీద ప్రేమెందుకు పుట్టుకొచ్చింది? చంద్రబాబు అభివృద్ధి చేయగలరని హఠాత్తుగా జ్ఞానోదయం ఎలా కలిగింది?  పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి, అభివృద్ధి అంటోన్న మాట నిజమే కాని... ఎవరి అభివృద్ధి? దీనిపైనే క్లారిటీ లేదు! జనం అభివృద్ధా? తమ అభివృద్ధా?      

వర్మ బయోపిక్ తీశాడా? భయపడుతూ పిక్చర్ తీశాడా? 

  విజయవాడు పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు గుర్తొచ్చేది దుర్గమ్మ. ఆ దుర్గమ్మ పాదాల చెంత వున్న కృష్ణమ్మ. అదే విజయవాడలో పుట్టిన మన వర్మ.... మరో విజయవాడ ఐకాన్ వంగవీటి జీవితచరిత్ర తీసుకుని సినిమా తీశాడు. కాని, తీరా జనం థియేటర్స్ కి వెళ్లి కళ్లప్పగించి చూస్తే మాత్రం... ఆశలన్నీ దుర్గమ్మ పాదాల వద్ద వున్న కృష్ణమ్మలో కలిపేశాడంటున్నారు! ఎందుకంటే, వంగవీటి సినిమా దుర్గమ్మ సమక్షంలోనే ఎండై అందర్నీ ఉసూరుమనిపిస్తోందట! వంగవీటి, దేవీనేని... ఈ రెండు పదాలు విజయవాడతో ఏ కాస్త పరిచయం వున్న వారికైనా బోలెడు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అసలు బెజవాడ గురించి ఏమీ తెలియని వారికి కూడా కాపు కాసే శక్తి అంటూ వర్మ బయలుదేరేసరికి ఛచ్ఛేంత ఇంట్రస్ట్ పుట్టుకొచ్చింది. కాని, తీరా తెరపై రామూ ఫస్ట్ ఎవర్ బయో పిక్ చూశాక చావులు తప్ప ఏం లేవని తేలిపోయింది. ఇంట్రవల్ కి ముందు , తరువాత వరుస మర్డర్లు తప్ప మ్యాటర్ లేదంటున్నారు హార్ట్ కోర్ ఆర్జీవీ ఫ్యాన్స్ కూడా. ఇక మామూలోళ్ల సంగతైతే చెప్పక్కర్లేదు. కనీసం రంగ హత్యకి ఎవరు కారణం అన్నది కూడా హింట్ ఇవ్వకుండా ఎండ్ చేశాడట వర్మ. మరో వైపు వంగవీటి అన్న పేరు పెట్టి దేవినేని ఫ్యామిలీని హైలైట్ చేశాడని కూడా అంటున్నారు, కొందరు పొలిటికల్ సెన్స్ వున్నవాళ్లు!  ఎవరు ఏమన్నా... వర్మ వదిలిన వంగవీటి ఇప్పుడు థియేటర్స్ లో వుంది. తన కెరీర్లో మొదటి సారి బయపిక్ కు తెగబడ్డ ఆయన భయపడుతూ పిక్చర్ నడిపాడని ఘాటు విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి మరి...