పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి!

పట్టుచీరలు  ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి! భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్  పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు.  అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు  టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు.                                       *నిశ్శబ్ద.

సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..!

సర్వైకల్ క్యాన్సర్..  మహిళలకు ప్రాణాంతక జబ్బు ఇది..! మహిళల ఆరోగ్యానికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య రక్కసిలా కోరలు చాపుకుని పొంచి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ నటి , మోడల్.. పూనమ్ పాండే మహిళల ప్రాణాలను అధికంగా బలితీసుకుంటున్న సర్వేకల్ క్యాన్సర్ తో మృతిచెందింది. అప్పటికే ఈ క్యాన్సర్ గురించి పలు అవగాహనా వార్తలు, చర్యలు తీసుకుంటుంటగా.. పూనమ్ పాండే మృతి ఈ సమస్య మీద గట్టిగా చర్చించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.  32ఏళ్ల వయసుకే  పూనమ్ పాండే మరణానికి కారణం అయిన సర్వైకల్ క్యాన్సర్  ఎలా వస్తుంది? దీనికి చికిత్స లేదా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలలో యోని, గర్భాశయాన్ని కలిపే భాగాన్ని సర్వైకల్ అని పిలుస్తారు. ఈ సర్వైకల్  ప్రాంతంలో క్యాన్సర్ కణాలు పెరిగి అవి క్రమంగా గర్బాశయంలోకి వ్యాపించి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. దీన్నే సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్బాశయ క్యాన్సర్ అని అంటారు.  నిజానికి సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి.  హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఈ వ్యాధికి కారణమవుతుంది.  కానీ ఈవైరస్ వచ్చినప్పుడు చాలా వరకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని అధిగమిస్తుంది. ఈ  హ్యూమన్ పాపిల్లోమావైరస్  కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఈ వైరస్ ఎలా సంక్రమిస్తుందంటే.. చాలావరకు ఈ వైరస్ శారీరక సంభోగం వల్లే వస్తుంది. అక్రమ సంబంధాలు కలిగి ఉండటం. ఎక్కువ మందితో రిలేషన్ మెయింటైన్ చేయడం వంటివి ఈ వైరస్ కు ఎక్కువ కారణాలు.  యోని ప్రాంతంలో ఇన్పెక్షన్లు రావడం వంటివి కూడా ఈ వైరస్ రావడానికి ప్రధాన కారణం అవుతాయి. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు.. కటి నొప్పి మూత్రంలో రక్తం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువ పీరియడ్స్ ముగిసిన తర్వాత కూడా రక్తస్రావం కావడం వింత వాసనతో కూడిన బ్లడ్ లేదా యోని నుండి ద్రవాలు రావడం అలసట ఆకలి నష్టం వెన్నునొప్పి కాళ్ళలో వాపు గర్భాశయ క్యాన్సర్ నాలుగు దశలలో ఉంటుంది. దీనికి చికిత్స క్యాన్సర్ దశను బట్టి జరుగుతుంది. కీమెథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్లెటెడ్ థెరపీ, శస్త్రచికిత్స, ఇమ్యునోథెరపీ మొదలైన పద్దతులలో దీనికి చికిత్స చేస్తారు.                                                *నిశ్శబ్ద.

విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా !

విడాకులు తీసుకోవడానికి సిద్దపడ్డారా..ఈ ఐదు విషయాల గురించి స్పష్టత ఉందా ! స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో  ఒక్కటై జీవితాంతం కలసి ఉండాలనే ఆలోచనతో పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇక ఇద్దరూ కలసి ఉండటం అసాధ్యమని, ఇద్దరూ ఒక చోట ఉంటే అక్కడ పెద్ద గొడవకే దారి తీస్తుందనే పరిస్థితి వచ్చాక చట్టప్రకారంగా విడాకులు తీసుకుని విడిపోతారు. ఈ మధ్యకాలంలో విడాకులు కూడా చాలా సాధారణం అయిపోయింది.  నిజానికి భార్యాభర్తలు కష్టంగా కలసి ఉండటం కంటే ఇద్దరూ మాట్లాడుకుని ఆరోగ్యకరంగానే విడిపోవడం మంచిది. దీనివల్ల కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యక కొన్ని విషయాల మీద స్పష్టత అవసరం అవుతుంది. ఆ విషయాల గురించి పూర్తీగా క్లారిటీ వచ్చిందన్నాకే విడాకులు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళల జీవితంలో విడాకులు పెద్ద కుదుపుకే కారణం అవుతాయి. అప్పటికే పిల్లలున్నా, కుటుంబాలు కాస్త సాంప్రదాయంగానూ, పెద్దవిగానూ అయినా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటారు. అందుకే ఈ ఐదు విషయాల మీద స్పష్టత ఉండటం ఎంతో అవసరం అవుతుంది. విడాకుల ప్రక్రియ.. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకోవడం వేరు దాన్ని చట్టప్రకారంగా అమలు దిశగా తీసుకెళ్లడం వేరు. విడాకులు తీసుకోవాలని  నిర్ణయించుకున్నాక అనుభవజ్ఞులైన న్యాయవాదుల దగ్గరకే వెళ్లాలి. వారు విడాకుల నిర్ణయం ఎంతవరకు సరైనదో కూడా చెబుతారు. దీనివల్ల ఆవేశం మీద చీలిపోయే బంధాలు కూడా నిలబడే అవకాశం ఉంటుంది. చట్టప్రకారంగా విడాకులు తీసుకుంటే ఆ తరువాత హక్కులు, బాధ్యతలు వంటి విషయాల గురించి కూడా న్యాయవాదులు స్పష్టత ఇస్తారు. ఆర్థిక పరిస్థితి.. భర్త సంపాదిస్తున్నాడు కదా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే అదే సంతోషం అనుకుని చాలామంది మహిళలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుంటారు. దీనివల్ల విడాకుల తరువాత ఇబ్బందులు తలెత్తుతాయి. భర్త నుండి భరణం లభించినా అది నేటి ఖరీదైన జీవనానికి ఎంతవరకు సరిపోతుందో చెప్పలేం. ఇకపోతే మగవారు విడాకులు తీసుకోవాలి అనుకుంటే ముందుగా తమ ఆర్థిక పరిస్థితి గమనించుకోవాలి. తమ సంపాదనలో భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించి ముందడుగు వెయ్యాలి. పిల్లల గురించి ఆలోచన.. చాలా కేసులలో భార్యాభర్తల గొడవల కారణంగా పిల్లలు తల్లిదండ్రుల  ప్రేమను కోల్పోతారు. తల్లిదండ్రుల విడాకుల తరువాత ఇద్దరి ప్రేమను ఉమ్మడిగా పొందే అవకాశం పిల్లలకు ఉండదు. పైపెచ్చు పిల్లలు ఎవరో ఒకరి దగ్గరున్నా, వారి సంరక్షణ విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎదురవుతాయి. నిజానికి విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా పిల్లలు కూడా సమాజం నుండి చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ఆలోచించాలి. విడాకులు తీసుకోవడం అంత ఈజీ కాదు.. సినిమాల్లోనూ, సీరియళ్లలోనూ చూపించినంత ఈజీగా విడాకుల వ్యవహారం ముగిసిపోదు. దానికి చాలా పెద్ద తతంగమే నడుస్తుంది. విడాకుల గోల నడుస్తుండగానే ఆ ఒత్తిడి భరించలేక చాలా సార్లు డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే విడాకుల విషయం పూర్తీగా స్పష్టత వచ్చాకనే ముందుకు వెళ్లాలి. ఆ తరువాత కూడా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలుస్తూ గతం తాలూకు విషయాలు చాలా వరకు అధిగమించాలి. భాగస్వామ్యం అవసరం.. విడాకులు కావాలంటే ఓ లాయర్ ను నియమించుకోవాలి. కేవలం లాయర్ ను నియమించుకుంటేనే కాదు.. విడాకులకు గల కారణాలను ఆధారాలతో సహా కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కోర్టు అడిగే ప్రతి విషయంలో చురుగ్గా స్పందించాలి. విడాకుల చట్టంలో నియమాలు, సందేహాలు తప్పని సరిగా తెలుసుకోవాలి. లీగల్ ప్రోసీడింగ్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.                                                  *నిశ్శబ్ద.  

వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి!

వాషింగ్ మెషీన్ లో దుస్తులు వేసే అలవాటు ఉంటే ఈ పనులు మాత్రం చెయ్యకండి! స్నానం చెయ్యడం, ఉతికిన  దుస్తులు ధరించడం పిల్లల నుండి పెద్దల వరకు పాటించే అలవాటు. అయితే వాషింగ్ మెషిన్ వాడే అందరికీ అందులో దుస్తులు వేయడం గురించి సరైన అవగాహన ఉండదు. కొందరు తెలిసీ తెలియక కొన్ని రకాల దుస్తులు వేయడం వల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  అసలు వాషింగ్ మెషీన్లో వేయకూడని దుస్తులేంటో తెలుసుకుంటే.. ఉన్ని దుస్తులు.. ఉన్నిదుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. దీనివల్ల దుస్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఉన్ని దారాల మధ్య గ్యాప్ పెరిగిపోయి దుస్తులు చాలా వదులుగా తయారవుతాయి. దీనివల్ల ఈ దుస్తులను చలికాలంలో వేసుకున్నా చలిని నియంత్రించలేవు. పైపెచ్చు ఉన్నిదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే రంగు కోల్పోయనట్టు డల్ గా తయారవుతాయి. లెదర్ దుస్తులు.. అబ్బాయిలు లేదా అమ్మాయిలు లెదర్ దుస్తులను వాడుతుంటారు. ముఖ్యంగా లెదర్ జాకెట్లు చాలామందికి ఉంటాయి. అదే విధంగా తోలుతో తయారైన ఇతర దుస్తులు కూడా ఉంటాయి.  కానీ వీటిని వాషింగ్ మెషీన్లో వేయకూడదు. ఇవి తొందరగా మన్నిక తగ్గడమే కాదు, రంగు నుండి చాలా విధాలుగా నష్టం జరుగుతుంది. పట్టుబట్టలు.. పట్టు దుస్తులు  అమ్మాయిల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆడవాళ్ళు వీటిని చాలా అపురూపంగా చూసుకుంటారు. పైగా ఇవి ఖరీదు కూడా ఎక్కువ. తెలిసీ తెలియనితనంతో పొరపాటుగా  పట్టు దుస్తులను వాషంగ్ మెషీన్లో వేస్తే అంతే సంగతులు. దుస్తుల పోగులు పైకి లేవడమే కాకుండా పట్టుదుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్ట కుచించుకుపోతుంది. దుస్తుల రూపమే మారిపోతుంది. స్టక్చర్డ్ దుస్తులు.. ఫ్యాషన్లో భాగంగా ముడతలతో కూడిన దుస్తులు వస్తుంటాయి. వీటిని ప్లీటెడ్ దుస్తులు అని కూడా అంటారు. ఈ దుస్తులను వాషింగ్ మెషీన్లో అస్సలు వేయకూడదు. ఇలాంటి దుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తే బట్టల నాణ్యత దెబ్బతింటుంది. దుస్తుల రూపం చెడిపోతుంది.                                      *నిశ్శబ్ద.  

సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి! ' సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ పండుగలో అమ్మాయిల అందం, వారు వేసే ముగ్గులతో పోటీ పడుతూ ఉంటుంది. ఇక వస్త్రధారణ సరేసరి. ఎంత అందంగా తయారు అయినా మగువల ముఖం వెలవెలబోతుంటే ఏమీ బాగుండదు. పండుగ కళ మొత్తం ముఖంలో కనిపించాలన్నా, ముఖం గాజులా  మెరిసిపోవాలంటే కొరియన్ స్టైల్ గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నం చెయ్యాలి.  కొరియన్ అమ్మాయిలకు ఉన్నట్టు ముఖం గాజులా మెరిసిపోవడానికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్  మధు చోప్రా  ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. దీన్ని ఫాలో అవుతుంటే 50 ఏళ్ల వయసు వచ్చినా ముఖంలో ఏ చిన్న ముడత కనిపించదు. అదేంటో తెలుసుకుంటే.. కొరియన్ అమ్మయిల్లా గ్లాసే స్కిన్ కావాలి అంటే రైస్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది రైస్ వాటర్ అంటే బియ్యపు కడుగుతో ముఖం కడుగుతుంటారు, అదే ముఖానికి స్ప్రే చేస్తుంటారు. కానీ రైస్ వాటర్ తయారు చేసుకోవడం, ముఖానికి అప్లై చేయడం పూర్తిగా విభిన్నమైన పద్దతి.  సరైన  జుట్టుకు మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.  ఇప్పట్లో బియ్యం నీటిని అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మినరల్స్ మంచి పరిమాణంలో ఉంటాయి, ఇవి వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. బియ్యం నీరు చర్మశుద్ధి, మచ్చలు,  వడదెబ్బ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. ముందుగా అరకప్పు బియ్యాన్ని బాగా కడిగి కొంచెం నీళ్ళు వేసి స్టౌ మీద పెట్టి ఉడికించాలి. బియ్యం ఊడుకు పట్టిన తరువాత స్టౌ ఆఫ్ చేసి బియ్యంలో ఉన్న నీటిని వేరు చేయాలి. సాధారణంగా దీన్ని స్టార్చ్ అని అంటారు. ఇది మరీ పలుచగా ఉండకూడదు. కాసింత గట్టిగానే ఉండాలి. అందులో అలోవెరా జెల్,  కొన్ని చుక్కల ఆముదం కలపాలి.  చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. కానీ  చర్మం పొడిగా ఉంటే ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇదే రైస్ వాటర్ మాస్క్. ఈ పేస్ట్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని కడిగి ఆరిన తరువాత దీన్ని ముఖానికి అప్లై చేయలి..  దీన్ని ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. మొదట్లో ఇది ముఖాన్ని శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.   ఏడు రోజుల పాటు ఈ రెమెడీని కంటిన్యూగా పాటించడం వల్ల గాజులాంటి మెరిసే చర్మం  సొంతమవుతుంది. దీన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే 50 యేళ్లు వచ్చినా ముఖంలో ముడతలు, మచ్చలు కనిపించవు.                                     *నిశ్శబ్ద.

స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి! చలికాలం రాగానే ప్రతి ఇంట్లో ఏ అల్మరాలోనో, బీరువాల్లోనో భద్రం చేసిన ఉన్ని దుస్తులు అన్ని బయటకు తీస్తారు. వీటిలో చేతి తొడుగులు, మంకీ క్యాప్ లు, స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు, చెవులకు రక్షణ ఇచ్చే వివిధ రకాల దుస్తులు ఉంటాయి. అయితే అన్ని రోజులు బీరువాల్లోమూలిగి ఉన్నవాటిని బయటకు తీయగానే వాటిని ఉతికి వాడటం చాలా మంది చేసే పని. కానీ ఉన్ని దుస్తులను ఉతకడంలో చాలామంది తప్పులు చేస్తారు. ఈ కారణంగా అవి తొందరగా పాడవుతాయి. ఉన్ని దారాలు పైకి పొలుసుల్లా లేచి దుస్తులను తొందరగా పాడైపోయేల చేస్తాయి. ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ తెలుసుకుంటే..  ఉన్నితో చేసిన బట్టలు చాలా సున్నితమైనవి. వాటిని మెయింటైన్ చేయడం,  శుభ్రపరచడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే వాటి  మెరుపు,  వెచ్చదనం ఇచ్చే లక్షణాలను కోల్పోతుంది. చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే.  స్వెట్టర్లను ఉతకడంలో తప్పులు చేస్తే  అవి కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోయే అవకాశం ఉంటుంది.   వాషింగ్ మెషిన్ లో వేయొద్దు.. ఉన్ని బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టల గమనం చాలా వేగంగా ఉంటుంది. పైపెచ్చు వాషింగ్ మెషిన్ లో బట్టల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.  దీనివల్ల బట్టలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే స్వెటర్లను ఎల్లప్పుడూ చేతులతో సున్నితంగా రుద్దుతూ శుభ్రం చెయ్యాలి. . అలాగే బ్రష్‌తో కూడా రుద్దకూడదు. ఇలా ఉతికితే ఉన్ని దుస్తులు మీద పొరలు లేస్తాయి.   నీటిలో నానబెట్టకూడదు.. స్వెటర్లు లేదా ఏదైనా ఉన్ని బట్టలు డిటర్జెంట్ నీటిలో కానీ సాధారణ నీటిలో కానీ ఎక్కువ సేపు  నానబెట్టకూడదు. దీంతో అవి త్వరగా పాడైపోతాయి. అంతేకాకుండా, దాని రంగు కూడా పోతుంది.  డిటర్జెంట్ పౌడర్ వొద్దు.. ఏళ్ల తరబడి డిటర్జెంట్ పౌడర్ వాడే అలవాటు ఉండటంతో అందులో బట్టలు ఉతకడం మామూలే. కానీ బట్టల నుండి పౌడర్ సరిగ్గా వదలదు.   దీని కారణంగా బట్టలు పాడవుతాయి. అందువల్ల, స్వెటర్లను కడగడానికి డిటర్జెంట్ ద్రవాన్ని ఉపయోగించడం మంచిది. లిక్విడ్ డిటర్జెంట్ అయితే దుస్తులు శుభ్రం చేయడం సులువే కాదు సువాసన కూడా బాగుంటాయి.                              *నిశ్శబ్ద.

 ప్రసవానంతర స్త్రీలు ఈ తప్పు చేయకూడదు.!

 ప్రసవానంతర స్త్రీలు ఈ తప్పు చేయకూడదు.! ప్రసవం తర్వాత మహిళలు పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. నార్మల్ డెలివరీ అయినా.. సిజేరియన్ డెలివరీ అయినా.. ఇలాంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడం మానుకోండి: ప్రసవించిన తర్వాత, మహిళలు తమను.. వారి నవజాత శిశువును అలాగే ఇంటి పనులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి సందర్భాలలో, వారు తరచుగా నీటితో నింపిన బకెట్లు, ఉతికిన బట్టలు మొదలైన బరువైన వస్తువులను ఎత్తుతుంటారు. అలాంటి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల పొత్తికడుపుపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది కడుపు నొప్పి లేదా నడవడానికి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఎలాంటి బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండండి. పదే పదే మెట్లు ఎక్కడం: నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా.. మహిళలు కొన్ని రోజులు మెట్లు ఎక్కడం, దిగడం మానేయాలి. మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఎక్కవలసి వస్తే, పదే పదే మెట్లు ఎక్కడం మంచిది కాదు. ఇది ప్రసవ సమయంలో వేసిన కుట్లు తెరుస్తుంది. నొప్పిని పెంచుతుంది. పిల్లల పనులన్నీ మీరే చేయకండి: సాధారణంగా తల్లులు మాత్రమే పిల్లల బాధ్యత తీసుకుంటారు. పురుషులు కూడా తమ బాధ్యతను కొంతమేరకు మోయాలి. డెలివరీ అయిన వెంటనే బిడ్డకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవద్దు. బదులుగా, ఇంటిలోని ఇతర సభ్యులతో పిల్లల బాధ్యతను పంచుకోండి. ఇది మీకు విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని ఇస్తుంది. మీరు కోలుకోవడంలో సహాయపడుతుంది. రాత్రికి సరిపడా నిద్ర పట్టదు: పిల్లలు రాత్రంతా మేల్కొని ఉంటారని తరచుగా చెబుతారు. పిల్లలతో ఉన్న తల్లులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు పుట్టిన వెంటనే పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే, మీ కోలుకోవడం నెమ్మదిగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి మీకు చికాకు కలిగిస్తుంది. వేగంగా కోలుకోవడానికి, బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. శిశువు రాత్రిపూట నిద్రపోకపోతే, మీరు విశ్రాంతి తీసుకునేలా శిశువును జాగ్రత్తగా చూసుకోమని అమ్మకు కానీ అత్తకు కానీ లేదంటే ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించండి. శిశువు నిద్రిస్తున్నప్పుడు, మీరు శిశువుతో నిద్రిస్తారు. పరిశుభ్రత గురించి పట్టించుకోవాలి: ప్రసవం తర్వాత పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కాస్త అప్రమత్తత లోపించినా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి, సాధారణ ప్రసవం ఉన్న మహిళలు తమ యోని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ ప్యాంటీని క్రమం తప్పకుండా మార్చాలి. మూత్రవిసర్జన సమయంలో మీ ప్రైవేట్ భాగాలను నీటితో కడగాలి.  కనీసం 40 రోజులు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండండి.

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ ఐదే ప్రధాన కారణాలట!

భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఈ ఐదే ప్రధాన కారణాలట! సంతోషకరమైన వైవాహిక జీవితం,  సంతోషకరమైన కుటుంబం చాలా మంది కల. వివాహాం తరువాత  ప్రతి జంట సంతోషంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. ఏడు జన్మల సంబంధం అనుకునే వివాహ బంధాన్ని ఒక్క జన్మకు కూడా కొనసాగించలేని పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలు తమ బంధంలో తీసుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలు కొన్నిసార్లు   వారి సంబంధానికి శత్రువులుగా మారతాయి. ఇదే వారి మధ్య పెద్ద అడ్డుగోడ కడుతుంది. ఇది ద్వేషంగా కూడా మారుతుంది. ఈ ద్వేషం మితిమీరిపోతే ఎంతో సంతోషంగా గడపాల్సినవారు కాస్తా  విడిపోవాలని నిర్ణయించుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసే ముఖ్యమైన విషయాలేంటో ముందే తెలుసుకుని వాటిని తమ జీవితంలో పొరపాటున కూడా ప్రస్తావించకపోవడం ఉత్తమం. అన్నింటిలో తప్పులు, లోపాలు వెతకడం.. ఎప్పుడూ ఒకరి వ్యక్తిత్వంలో లేదా పనిలో  లోపాలను వెతుక్కునే భార్యాభర్తలు బంధాన్ని  నిలకడగా నిలుపుకోలేరు. ఒకరిలోపాలను ఒకరు పదే పదే ఎత్తిచూపుతుంటే ఆ సంబంధం చాలా ప్రతికూలంగా మారుతుంది.  కొంతకాలం తర్వాత ఇద్దరూ విడిపోవడమే మంచిదనే ఆలోచన కూడా పుడుతుంది. నిజానికి ఇలా తప్పులు ఎంచడం భార్యాభర్తల బంధంలోనే కాదు.. వేరే ఏ బంధంలో కూడా మంచిది కాదు. ఒక్కరిమీదే భారం ఉండటం.. వైవాహిక జీవితంలో భాగస్వాములిద్దరూ సమానంగా  ఉండాలి. భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిపని చూసుకోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే ఇంటి పనులు ఇద్దరూ చూసుకోవడం చేయాలి. అలాగే ఎవరికి నచ్చిన పనిని వారు మాత్రమే చేసుకోకుండా ఇద్దరూ కలసి చేయాలి. నీ పని నీది, నాపని నాది అనే భావన పొరపాటున కూడా చూపించవద్దు. వ్యక్తిగతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటే భార్యాభర్తల మధ్య  తాము ఒక్కటనే ఫీలింగ్ కొరవడుతుంది. ఫోన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి కంటే తన ఫోన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపితే అది వారి సంబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ అలవాటు వల్ల దాంపత్య సంతృప్తి తగ్గుతుందని, రోజుకోక గొడవ సర్వసాధారణమైపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రజలను డిప్రెషన్ వైపు నడిపిస్తాయి. బంధం చీలిపోవడానికి కారణం అవుతాయి. మనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం.. డబ్బు నిర్వహణలో సరైన అవగాహన లేని భాగస్వాములతో కలసి జీవించడానికి చాలా మంది అనాసక్తి చూపిస్తారు. డబ్బు బ్రతకడానికి ప్రధాన వస్తువు అయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా బాగా తెలిసి ఉండాలి. డబ్బును నిర్లక్ష్యం చేసేవారితో భాగస్వాములు ఎక్కువగా గొడవలు పడతారు.  ఇలాంటి గొడవలు  జరగడం ఆ తరువాత గొడవలు మాములు అయిపోవడం కూడా జరుగుతుంది. అన్నీ లెక్కలు వేసుకోవడం..  భాగస్వామి కోసం తాము చేసిన ఖర్చులను  ఎప్పుడూ  లెక్కగట్టే వారు కొందరు ఉంటారు. ఇలాంటివారు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో అనిపించేలా ఉంటుంది వారి ప్రవర్తన. భాగస్వామితో సంతోషాలను వారికోసం చేసే ఖర్చును మాటిమాటికి లెక్కవేయడం, దాన్ని పదే పదే భాగస్వామి దగ్గర ప్రస్తావించడం వల్ల  వైవాహిక జీవితంలో సంతోషం దెబ్బతింటుంది.                                                         *నిశ్శబ్ద

నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం.!

 నవరాత్రుల భక్తి వెనుక ఆరోగ్యం.. ఆరోగ్యంగా అధిక బరువుకు చెక్ పెట్టేద్దాం.. స్త్రీ పూజ్యునీయురాలు . భారతదేశంలో స్త్రీని దేవతగా భావిస్తారు. స్త్రీ శక్తిని చాటి చెప్పే కథలు, పండుగలు కూడా ఉన్నాయి. వాటిలో శరన్నవరాత్రులు ఎంతో ప్రాశస్త్యమైనవి. దేవి నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని, దసరా అని పిలుచుకునే ఈ పండుగ సందర్భంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. భక్తితో అటు దైవ కృపకు పాత్రులు కావడం, ఇటు ఫిట్ గా మారడం మహిళల చేతుల్లోనే ఉంది. చాలామంది నవరాత్రుల సందర్బంగా  ఉపవాసాలు ఉంటారు. అధిక బరువు కలిగిన వారికి ఈ నవరాత్రులు మంచి అవకాశం. భక్తి వెనుక భయం కూడా ఉంటుంది. కాబట్టి సాధారణ సమయాల్లో నోరుకట్టేసుకుని బాధపడుతూ మధ్యలో కాంప్రమైజ్ అయ్యేవారు దేవుడి ముందు భక్తితో ఉపవాసం పాటిస్తారు. నవరాత్రుల ఉపవాసంలో పండ్లు ఎక్కువగా తీసుకుంటారు.  అయితే, పండ్ల పేరుతో చాలామంది  ఫ్రూట్స్ కలిపిన పాయసం,  నైవేద్యం పేరుతో  పూరీ, బూరెలు,  కేసరి, డ్రైఫ్రూట్స్, పనీర్ వంటివి తింటారు. వీటి వల్ల కేలోరీలు బాగా శరీరంలోకి వెళతాయి. అలా కాకుండా బరువు పెరగకుండా రోజులో ఒకపూట మాత్రమే తినే ఆహారం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం కింది టిప్స్ పాటించాలి. ఏ వంటకం చేసినా దాన్ని  వేయించడం మానుకోవాలి. ఆవిరి మీద ఉడికించినవి తీసుకోవాలి. చక్కెరకు బదులుగా ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలను ఉపయోగించండి. మిశ్రి(కండచక్కెర), బెల్లం, తేనే, ఎండు ద్రాక్ష మొదలైనవి తీపిని ఇస్తాయి. సగ్గుబియ్యం, మఖనా, బరువు ఉండవు  కాబట్టి బరువు పెరగం అనుకుంటారు. కానీ ఇవి అధిక  కేలరీల ఆహారాలు, ఇవి బరువును పెంచుతాయి. వాటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా మొత్తం పండ్లను తినాలి. బరువు తగ్గడానికి తాజా పండ్లను బీట్ చేసే డైట్ లేనే లేదు. వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. ఉపవాస సమయంలో రోజంతా వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. పాల ఉత్పత్తులు కొందరు జీర్ణించుకోలేరు. అలాంటి వారు పాల ఉత్పత్తును తినకపోవడం మంచిది. దీనికి బదులుగా   వెజిటేరియన్ ప్రోటిన్ పౌడర్ ఉపయోగించవచ్చు. ఉపవాసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. అది ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యామోహాన్ని తగ్గిస్తుంది. చాలామంది దేవుడి పేరుతో బాగా వండుకుని తింటారు. కానీ అది తప్పు. ఆ భావన వదలకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ప్రశ్నార్థకమే అవుతాయి. పండుగ ముగిసేసరికి మరింత బరువు పెరుగుతారు.                                                    *నిశ్శబ్ద.

అమ్మబాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే ఖరీదైన విల్లా కూడా అమ్ముకోవాల్సిందే!

 అమ్మబాబోయ్.. ఈ నెయిల్ పాలిష్ కొనాలంటే ఖరీదైన విల్లా కూడా  అమ్ముకోవాల్సిందే.. అందానికి అమ్మాయిలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అమ్మాయిలు సహజంగానే ఎంత అందంగా ఉన్నా సరే.. తమ అందం మరింత పెరగాలని  ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. శరీరంలో ప్రతి భాగాన్ని ఆకర్షణగా తీర్చిదిద్దుకుంటారు. కళ్లకు కాటుక, నుదుటన బొట్టు, కనురెప్పలు, కనుబొమ్మలు, పెదవులు, వేళ్లు, వేలి గోర్లు  ఓయబ్బో ఈ సింగారాలకు అంతులేదు.  అమ్మాయిల ఈ వీక్నెస్ ఏ బ్యూటీ ఉత్పత్తుల బిజినెస్ కూడా. పైన చెప్పుకున్న ఎన్నో ఐటెమ్స్  కు పదుల నుండి వందలు వేలు కూడా ధారబోస్తారు. అయినా కించిత్  విచారం కూడా వ్యక్తం చేయరు. ఈ కారణంగానే చాలా బ్యూటీ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల ధరలను ఆకాశాన్నంటేలా  ఉంచుతుంటారు. ఇకపోతే అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాచుర్యం పెరిగాక నెయిల్ పాలిష్ ల అమ్మకాలు కూడా బాగా  ఊపందుకున్నాయి.  సాధారణంగా నెయిల్ పాలిష్ ల ధరలు చిన్న చిన్న షాప్ లలో మన్నిక  క్వాలిటీ లేనివి అయితే 20రూపాయల నుండి లభిస్తాయి. అదే మంచి క్వాలిటీ కావాలంటే వీటి ధరలు 50 నుండి వందల రూపాయలు ఉంటాయి. ఇంకా ఖరీదైన బ్రాండులు అయితే వేలు కూడా ఉండొచ్చేమో. కానీ ఓ నెయిల్ పాలిష్ ధర మాత్రం గుండెలు దడదడలాడిస్తోంది. ఈ నెయిల్ పాలిష్ కొనాలి  అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న మంచి విల్లాను అమ్మేసుకోవాలి. ఏంటి నెయిల్ పాలిష్ కే అంత మాట అంటున్నారని డౌటా? అయితే ఈ నెయిల్ పాలిష్ కథ తెలుసుకోవాల్సిందే.. అమ్మాయిలు ఎంత అందంగా తయారైనా సరే. అందమైన చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకపోతే అంత ఆకర్షణ ఉండదు. అంతేనా డ్రస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ పెడితే మరింత ఆట్రాక్షన్ గా మారిపోతారు. చాలావరకు అమ్మాయిల దగ్గర కనీసం ఓ పది రంగులైనా నెయిల్ పాలిష్ లు ఉండనే ఉంటాయి. వీటి ధర 50 నుండి వందలు, వేలు ఉండచ్చు. కానీ నెయిల్ పాలిష్ ధర ఏకంగా కోటి రూపాయలు ఉండటం ఎప్పుడైనా విన్నారా? కోటి అనేమాట వింటుంటేనే దిమ్మతిరిగిపోతుంది కానీ ఇది అక్షరాలా నిజమే.. లాస్ ఏంజిల్స్ కు చెందిన అజాచర్ బ్లాక్ అండ్ డైమండ్ నెయిల్ పాలిష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ గా నిలుస్తోంది.  15మి.లీ ల నెయిల్ పాటిష్ ధర్ ఏకంగా రూ. 1,63,66,000. ఇంత డబ్బు తో హైదరాబాద్ లో మాంచి విల్లాను కొనుగోలు చేయవచ్చు. లేదూ.. ఈ నెయిల్ పెయింట్ కొనాలని అనిపించిందా.. ఇదిగో మాంచి ఖరీదైన విల్లాలను అమ్ముకుని నెయిల్ పాలిష్ కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నెయిల్ పాలిష్ తెగ హాట్ టాపిక్ గా మారింది.  కేవలం గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ ఇంత ఖరీదు ఉండటమేంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.                                                        *నిశ్శబ్ద. 

మనశ్శాంతి కరువైందా.. వెంటనే ఈ నాలుగు విషయాలు వదిలెయ్యండి..

  మనశ్శాంతి కరువైందా.. వెంటనే ఈ నాలుగు విషయాలు వదిలెయ్యండి.. జీవితంలో మనశ్శాంతి కరువైందని చెప్పేవారు చాలామంది ఉంటారు. మనశ్శాంతి ఉంటే ఎంత సమస్యలు ఎదురైనా వాటిని చాలా నేర్పుగా ఏదుర్కొంటారు.  చాలామంది మనశ్శాంతి కేవలం సమస్యల  వల్ల ఉండదని  అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే మనశ్శాంతి అనేది సమస్యల వల్ల కాదు చేతులారా చేసే నాలుగే నాలుగు పనుల వల్ల కోల్పోతారు.  సెల్ప్  లవ్ ఉన్నవారు తమ మనశ్శాంతిని పోగొట్టుకోకుండా దాన్ని ఎవరి గుప్పెట్లో వారు ఉంచుకోవాలంటే కేలవం నాలుగు పనులు చేస్తే చాలు. ఆ నాలుగు పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరం ఉండటం.. చాలా సార్లు ఆత్మీయులుగా అనిపించే   కుటుంబం, స్నేహితులు మరియు జీవిత భాగస్వామి మొదలైనవారు   ఆందోళనలకు దుఃఖాలకు కారణం అవుతారు.  అయితే దీన్ని అంగీకరించడం చాలా కష్టం. వాళ్లు నా వాళ్ళు వారి గురించి ఇలా అనుకుంటే ఎలా నేను పొరపడుతున్నానేమో అని మభ్యపుచ్చుకోవడం చాలామందిలో కనిపిస్తుంది. మరికొన్నిసార్లు నా వాళ్లే కదా నా మంచికోసమే చేసుంటారు అనే ఒకానొక అమాయకపు భావన కూడా మూర్ఖులుగా మార్చేస్తుంది. కానీ ఒకరి  శాంతి,  ఆనందం కోసం  ఇతరుల జీవితాలను ఇబ్బందులకు గురిచేయడం ఎప్పుడూ సరైనది కాదని తెలుసుకోవాలి. అందరూ మీ జీవితాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇబ్బందుల పాలు చేస్తుంటే   అది  చాలా నష్టాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని  జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నవారికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని వదిలేయడం.. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడ పని చేస్తారు? ఈ విషయాలు ఎక్కువగా  జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడితో కూడిన వాతావరణం  ఆనందాన్ని,  శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ గురించి శ్రద్ధ వహిస్తే, జలగలాగా మీ మనశ్శాంతిని నెమ్మదిగా నాశనం చేసే  వాతావరణం నుండి వెంటనే  దూరం వెళ్లాలి. లేకపోతే అది క్రమంగా మానసిక జబ్బున్న వ్యక్తిగా మిమ్మల్ని మార్చేస్తుంది. బయటి విషయాలను బాధ్యులుగా మార్చకుండా ఉండటం.. మీరు మీ సమస్యలన్నింటికీ బయటి  పరిస్థితులను నిందిస్తే  జీవితంపై నియంత్రణను కోల్పోతారు. ఇలా చేసేవారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కొంతకాలం తర్వాత కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని వదిలివేస్తారు. ఇలాంటి  పరిస్థితిలో సొంతంగా చేసే   తప్పులు,  బాధల బాధ్యతను,  పర్యావసానాలను  అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  ఈ రోజుకు   రేపటిని మార్చే శక్తి ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరినీ సంతోషంగా ఉంచడానికి తమ సంతోషాన్ని త్యాగం చేయడం.. అందరినీ సంతోషంగా ఉంచడం సాధ్యం కాని పని . ఇలాంటి  పరిస్థితిలో తమను తాము ఇబ్బంది పెట్టుకుంటూ  ఇతరులకు సుఖాన్ని లేదా ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అందువల్ల, ఒక వ్యక్తి తన స్వంత ఆనందాన్ని త్యాగం చేయడం ద్వారా ఇతరులను సంతోషంగా ఉంచడానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేని మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.                                                        *నిశ్శబ్ద.  

ఈ నాలుగు టిప్స్ ఫాలో అయితే చాలు.. అచ్చం బేకరీ టేస్ట్ కేక్ కుక్కర్లో తయారుచేయవచ్చు!!

కేక్ అంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే..  మారుతున్న కాలంతో పాటు, కేక్ మన జీవితంలోని ప్రతి ఆనందంలో  భాగంగా మారింది. ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా లేదా ప్రత్యేక సందర్భం అయినా  ఖచ్చితంగా కేక్ కట్ చేస్తారు. దీని క్రేజ్ ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కరూ తమ వంటగదిలో బేకరీ లాంటి కేక్‌ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది మంచి ఫలితాన్ని పొందలేరు. చివరికి   కేక్ కోసం బేకరీపై ఆధారపడటం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. కానీ ఇకమీదట అలాంటి ఫెయిల్యూర్ మీకెప్పుడూ ఎదురుకాదు. ఎందుకంటే ఇంంట్లోనే కుక్కర్లోనే మెత్తగా స్పాంజ్ కేక్  తయారుచేయడానికి కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. ఈ టిప్స్ ఫాలో అయితే అచ్చం బేకరీలో కొన్న కేక్ లా నోరూరిస్తూ అందరినీ అలరినీ అలరించే కేక్ తయారవ్వడం ఖాయం. దీనికోసం నాలుగు టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే.. సరైన కుక్కర్‌ని ఉపయోగించాలి.. కేక్ తయారు చేయడానికి కుక్కర్ సెలక్షన్ చాలా ముఖ్యమైనది.  ఎప్పుడూ బరువైన అడుగు మందంగా,  గట్టి మూత ఉన్న కుక్కర్‌ని ఉపయోగించాలి . అలాగే కుక్కర్ మూత పెట్టేటప్పుడు  రబ్బరు తీసి మూత పెట్టాలి. ఇది కాకుండా, కేక్ చేయడానికి ముందు, కుక్కర్‌ను 5 నిమిషాలు సరిగ్గా వేడి చేయాలి. స్టాండ్ ఉపయోగించాలి..  కేక్ పిండి ఉన్న పాత్రను నేరుగా కుక్కర్‌లో ఉంచకూడదు. ఇది కేక్‌ను పాడుచేస్తుంది, అంతే కాదు  దానిని మాడిపోయేలా చేస్తుంది. అందువల్ల  ఎప్పుడూ ముందుగా కుక్కర్‌లో స్టీల్ స్టాండ్‌ను ఉంచి, ఆపై పిండి ఉన్న పాత్రను దానిపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల కేక్ బాగా బేక్ అవుతుంది. కేక్ పిండిలో వెనిగర్ కలపాలి..  బేకరీలో లాగా ఇంట్లో మెత్తగా  స్పాంజి లాంటి  కేక్ తయారు చేయాలనుకుంటే, పిండిలో అర టీస్పూన్ కంటే కొంచెం తక్కువ వెనిగర్ జోడించాలి.   ఉష్ణోగ్రత ముఖ్యం..   కుక్కర్‌లో కేక్‌లను తయారు చేస్తుంటే, గ్యాస్ స్టవ్ మీద తయారుచేయడం మంచిది.  కేక్ ఉడికే మొత్తం సమయం మధ్యస్థంగా ఉంచాలి. ఓవెన్‌లో కంటే గ్యాస్‌పై కేక్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి.  కాబట్టి అస్సలు తొందరపడకూడదు. కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి  టూత్‌పిక్‌తో ఒకటి లేదా రెండుసార్లు కేక్ లోపలికి గుచ్చి చెక్ చేయాలి.  అయితే కుక్కర్‌ని పదే పదే  తెరవడం తెరవకూడదు.  సమయాన్ని సెట్ చేసుకుని ఆ తరువాత మాత్రమే చెక్ చేయాలి.                                                                    *నిశ్శబ్ద.

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే వినాయకుడి మండపం!

డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే వినాయకుడి మండపం పండుగ అంటే అందరికీ సంబరమే. కొన్ని ప్రాంతీయ పండుగలు అయితే మరికొన్ని జాతీయ పండుగలు. దేశం యావత్తు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయకుడు భక్తుల కష్టాలు తీర్చేవాడు. పార్వతీదేవి ముద్దుల తనయుడు. పరమేశ్వరుడి మెప్పు పొంది  ఏ కార్యంలోనైనా తొలిపూజ అందుకునే వరం పొందినవాడు. అష్టసిద్దులు పొందినవాడు. వినాయకుడి పూజ ఎంత నిష్ఠగా చేసుకుంటే అంత ప్రశాంతత. జీవితంలో కష్టాలు మెల్లగా తొలగిపోతాయి. అయితే ప్రతి ఒక్కరికీ తాము చేసుకునే పండుగ కాస్త ప్రత్యేకంగా ఉండాలని అనిపిస్తుంది. ఇందుకోసం  రకరకాల పిండివంటలు ఎలాగూ చేస్తారు. కానీ వినాయకుడి మండపం, దాని అలంకరణ అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలాగని ఊరికే ఉండలేం కదా. అందుకే వినాయకుడి మండపాన్ని చాలా ఈజీగా, పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో మీరే స్వయంగా ఏర్పాటు చేస్తే మీ ఇంట్లోవారే కాదు.. చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అనకుండా ఉండలేరు. వినాయక చవితి రోజు ఇల్లు అలకడం, పిండివంటలు చేయడం అందరూ చేసేదే. కానీ ప్రకృతి ప్రియుడు అయిన వినాయకుడికి  చాలా సహజంగా మండపం ఏర్పాటు చేసి,  అంతే సహజంగా డెకరేషన్ చేయచ్చు. గ్రామీణ ప్రాంతాలలో  నివసించేవారు అయితే అరటి చెట్లు తెచ్చి పెడుతుంటారు. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండవు. ఇలాంటి వారు ఏం చేయాలంటే  ఫ్రిడ్జ్ లు, పరుపులు, కూలర్ లు వచ్చిన అట్టముక్కలు ఉంటాయి. ఈ అట్టముక్కలను చుట్టగా చుట్టి ఏదైనా తాడు తీసుకుని బిగుతుగా కట్టేయాలి. ఇలాంటివి నాలుగు తయారు చేసుకోవాలి. వీటిని మండపానికి స్థంభాలుగా ఉపయోగించవచ్చు.  వినాయకుడి పరిమాణాన్ని బట్టి ఈ మండపాల ఎత్తు  చూసుకోవచ్చు.  నాలుగు ప్లాస్టిక్ డబ్బాలలో ఇసుక వేసి వాటిలో ఈ స్థంబాలు పెట్టాలి. ఇప్పుడు అవి బాగా గట్టిగా నిలబడగలుగుతాయి. వీటికి పైన ఒక దాన్నుండి మరొక దానికి సన్నని తీగలాంటి తాడుతో బిగుతుగా కట్టాలి. నాలుగు స్థంబాలను అనుసంధానం చేస్తూ ఇలా కట్టిన తరువాత మండపం చాలా వరకు సెట్ అయినట్టే.  ఈ అట్టముక్క స్థంబాలు బయటకు కనిపించకుండా ఉండటం కోసం  చమ్కీలతో ఉన్న చీరలకు మొదలు, చివర కుచ్చిళ్లు పెట్టి వీటిని స్తంభానికి చుట్టూరా ఉండేలా చుట్టాలి. ఇందుకోసం సేప్టీ పిన్ ఉపయోగించవచ్చు. లేదా జాగ్రత్తగా స్టాప్లర్ కూడా ఉపయోగించి ఫిక్స్ చేయవచ్చు.  రెండు స్థంభాలకు ఒక చీర చెప్పున ఫిక్స్ చేయాలి. పైన చాలా తేలికగా ఉన్న చీర లేదా చున్నీ వేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ చీరలు బరువు లేకుండా చాలా తేలికగా ఉండాలి. వినాయకుడు ప్రకృతి ప్రియుడు.. అందుకే అలంకరణ చాలా సహజంగా పువ్వులు, తీగలు, లైట్లతో ఉంటే  బాగుంటుంది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను ఒకదానికొకటి ముడివేస్తూ పొడవాటి తీగలాగా తయారుచేసుకోవాలి. దీనికి తెలుపు, ఎరుపు, పసుపు మందారాలతోనూ, కాగితం పువ్వులతోనూ అలంకరణ చేయాలి. ఆకుపచ్చని ఆకులను మధ్యలో అక్కడక్కడా ఉంచాలి. ఇలా చేస్తే చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుంది.  ఇక వినాయకుడికి ఆసనం కోసం పెద్ద పీట వేసి మధ్యలో ఆయన్ను ప్రతిష్టించాలి.  అయితే  పూజ కోసం వెలిగించే దీపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  దీపాలు పొరపాటున చీరలకు తగిలినా సంతోషం మొత్తం విషాదంగా మారుతుంది. మండపానికి ఇరువైపులా రెండు టేబుళ్లు వేసి వాటిమీద  ఒకే రంగు చున్నీలతో కవర్ చేయాలి. దీంతో అది ఎంతో అందంగా కనిపిస్తుంది. వీటిమీద పువ్వులు, గరిక రెండు కలిపి ఉంచితే చాలా ఆకట్టుకుంటుంది. ఈ మండపానికి మరింత మెరుపులు తీసుకురావడం కోసం  చిన్న లైట్లు అయినా సెట్ చేయవచ్చు. అవి పెట్టడానికి  అనుకూలం లేకపోతే ఛార్జ్ లైట్లు ఉంటాయి. వాటిని నాలుగు మూలలా ఏర్పాటు చేయవచ్చు. వినాయకుడి విగ్రహానికి అలంకరణ కోసం అందుబాటులో ఉన్న రంగురంగుల పువ్వులను ఉపయోగించాలి. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే భక్తి్పేరుతో వినాయకుడిని పువ్వులు, పత్రితో ముంచెత్తకూడదు. వినాయకుడిని ఆసీనం చేసినతరువాత కొంచెం ముందుగా పీట వేసి పువ్వులు, పండ్లు, ప్రసాదాలు మొదలైనవి ఉంచాలి. వినాయకుడు ప్రకృతి ప్రియుడు కాబట్టి సహజమైన అలంకరణ, భక్తితో చేసే పూజ,  భక్తిగా సమర్పించే ప్రసాదం ఆయన్ను సంతుష్టుడిని చేస్తుంది.                                              *నిశ్శబ్ద.  

భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..

 భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం కావాలంటే మొదట ఈ పని చెయ్యాలి..   భారతదేశంలో వివాహ బంధానికి చాలా గొప్ప ప్రాధ్యాన్యత  ఉంది. అయితే దురదృష్టవశాత్తు నేటికాలంలో  ఈ వివాహ బంధం చాలా  పెలుసుగా మారిపోయింది. నిన్నటిదాకా ఎంతో నవ్వుతూ గడిపిన భార్యాభర్తలు సడన్ గా గొడవ పడతారు. ఆ తరువాత విడాకులు అంటారు. ఇలాంటి సంఘటనలే ఎక్కువ ఉన్నాయి చాలాచోట్ల. పెళ్ళిళ్ళు ఏమో ఆకాశమంత పందిరి వేసి ఎంతో ఘనంగా చేసుకుంటారు కానీ బంధాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం చతికిలబడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినా, విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నా దానికి ముఖ్యకారణం ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే వెంటనే చేయాల్సిన పని ఒకటుంది. షేరింగ్ వద్దు.. భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే  చాలామంది తమకు దగ్గరగా ఉన్న వ్యక్తితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అయితే తల్లులు, స్నేహితురాళ్లు,ఎవరూ ఊహించని విధంగా వారి నుండి దూరమైన పాత ప్రియుడికి కూడా తన భర్తతో ఉన్న విభేధాల గురించి చెబుతుంటారు. ఇలా భార్యాభర్తల గొడవ గురించి అందరికీ చెప్పుకోవడం వల్ల బంధం పట్ల ఇతరుల్లో చులకన భావం ఏర్పడుతుంది, మనుషుల మీద కూడా చిన్న చూపు కలుగుతుంది. ఇలాంటి సందర్బాలలో చాలామంది రెచ్చగొడుతుంటారు. నువ్వలా చెయ్యి, ఇలా చెయ్యి అని సలహాలు ఇస్తుంటారు. ఆ సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ నిజమేనని అనిపిస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే బంధం మరింత బలహీనం అవుతుంది తప్ప తిరిగి బలంగా తయారవ్వదు. వీళ్ళకు దూరంగా ఉండాలి. లైఫ్ పార్టనర్ తో గొడవలు జరిగినప్పుడు పొరపాటున ఎప్పటినుండో పరిచయం ఉన్నవారికి చెప్పుకుంటే వారు కొన్ని సలహాలు ఇస్తారు. నిజానికి మంచి కోరేవారు అయితే  బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో వారికి తెలిసి ఉంటుంది. సందర్భానికి తగినట్టు మంచి సలహా ఇస్తారు. కానీ అవతలి వారి జీవితంలో కూడా భార్యాభర్తల గొడవలుండి వారితో బంధం తెంచుకుని ఉంటే మాత్రం వారి సలహాలు తీసుకోకూడదు. ముఖ్యంగా జీవితంలో వివిధ సమస్యలతో డిప్రెషన్ అనుభవిస్తున్న వారి సలహాలు తీసుకోవడం, వారికి దగ్గరగా ఉండటం చేయకూడదు. డిప్రెషన్ ఉన్నవారికి సహాయం చేయవచ్చు కానీ వ్యక్తిగత బంధాలు,  వాటి నిర్ణయాలు వారి చేతిలో పెట్టకూడదు.  ఎంటర్టైన్మెంట్ కావొద్దు.. కొందరికి  గొడవలంటే భలే ఇష్టం ఉంటుంది. ఇలాంటి వారు భార్యాభర్తల మధ్య గొడవలను చూసి పైకి అయ్యో పాపం అంటున్నా లోలోపల సంతోషపడుతుంటారు. వీరిది కాస్త మానసిక శాడిజం అని చెప్పవచ్చు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడా చెప్పేవారు కూడా ఎంతో స్నేహితులు అయినట్టు ఉంటారు. వీరినుండి కూడా దూరం ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు భార్యాభర్తల విషయాలు చెప్పడం కానీ, వారి సలహా తీసుకోవడం కానీ చేయకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదని అనుకున్నా, జరిగిన గొడవలు పరిష్కారం కావాలన్నా  కచ్చితంగా పైన చెప్పుకున్న మనుషులకు దూరంగా ఉండాలి.                                           *నిశ్శబ్ద.

భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే..

భారతదేశానికి కీర్తి తెచ్చిన బచేంద్రి పాల్.. ఆమె ప్రయత్నం ఇదే.. మనిషి దృఢ సంకల్పంతో ఉంటే ఎంత పెద్ద పని అయినా  సులభంగా చేయగలుగుతాడు. ఈ  విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఎంతోమంది వ్యక్తుల  జీవితాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఇలాంటి వారిలో బచేంద్రి పాల్ కూడా ఒకరు. బచేంద్రి పాల్ అనే పేరు వినగానే చాలామందికి ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తోందా?  చిన్నప్పుడు  జి.కే బిట్స్ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు పరిచయమే. ఎవరెస్టు శిఖరాన్ని అధిగమించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్ అని టక్కున చెప్పేవాళ్ళం.  1984లో మహిళలకు ఈ సమాజంలో ఏమాత్రం ప్రోత్సాహం లభించని కాలంలో బచేంద్రి పాల్ సాధించిన ఈ ఘనతకు ప్రపంచం యావత్తు సలామ్ చేసింది. మహిళలకు స్పూర్తిని రగిలించే ఈమె గురించి తెలుసుకుంటే.. బచేంద్రి పాల్ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా నకూరి గ్రామంలో 1954 మే 24న జన్మించారు. ఈమె అప్పటికే  బిఎలో గ్రాడ్యుయేషన్,  సంస్కృతంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, బచేంద్రి పాల్ తన బి.ఎడ్ పూర్తీ చేసింది. ఆమె ఉపాధ్యాయురాలు కావాలని ఆమె కుటుంబం ఆశించింది. అందుకు తగ్గట్టే ఆమెను భోదనా రంగంవైపు వెళ్లమని సూచించింది. కానీ బచేంద్రి పాల్ కు మౌంటెనింగ్ మీద చాలా ఆసక్తిగా ఉండేది. ఆమె లక్ష్యం, కుటుంబ సభ్యుల అభ్యర్థన వేరు వేరు ఉండటంతో ఆమె ఏం చేయాలనే విషయం పై గందరగోళం అనుభవించింది. కానీ చివరికి తన అభిరుచినే ఆమె కొనసాగాలని నిర్ణయించుకుంది.  కానీ పర్వతారోహకురాలు కావడానికి పాల్‌కు  కుటుంబం నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. బచేంద్రి పాల్ తండ్రి కిషన్ పాల్ సింగ్ సాధారణ వ్యాపారవేత్త. లక్ష్యం వైపు ఎలా వెళ్ళిందంటే.. బచేంద్రి పాల్ మౌంటెనీరింగ్ మీద  ఆసక్తితో   నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది.  ఈ  ఇన్‌స్టిట్యూట్‌ వారు 1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు ఒక సాహసయాత్ర బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం పేరు  పేరు ఎవరెస్ట్ 84. ఈ టీమ్‌లో బచేంద్రి పాల్ కూడా ఉన్నారు. ఎవరెస్ట్ ఎక్కడానికి వీరికి శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ తర్వాత వీరి  బృందం అదే సంవత్సరం మేలో ఎవరెస్ట్ అధిరోహణకు  బయలుదేరింది. మే 23, 1984న, బచేంద్రి పాల్  ఎవరెస్ట్ అధిరోహిస్తున్న సమయంలో వాతావరణం చాలా వ్యతిరేకంగా ఉంది, మంచు  తుఫాను ప్రభావం అధికంగా ఉంది. అయనా ఆమె ఎక్కడా వెనుదిరగకుండా  కఠినమైన మార్గం గుండా ప్రయాణించి  ఎవరెస్ట్‌ను అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఈమె  భారతదేశానికి తెచ్చిన గుర్తింపుకు గానూ 1984లో పద్మశ్రీ, 1986లో అర్జున అవార్డు అందుకున్నారు. ఇది కాకుండా, ఈమె 2019 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఈమె ఎంతో మంది మహిళలకు స్పూర్తిగా నిలిచారు.                                                                   *నిశ్శబ్ద  

విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ

విద్యతో.. సేవతో.. భారతదేశాన్ని పునీతం చేసిన వీర వనిత.. కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ.. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నిలవద"ని పండితుడు, చరిత్ర కారుడు, విజ్ఞానచంద్రికా మండలి స్థాపకుడు అయిన శ్రీ కొమ్మ జాజు లక్ష్మణ రావుగారి భావన. సంఘ సంస్కారి, సేవాతత్పరురాలు, విద్యావతి, అబలా సచ్చరిత్ర రత్నమాల అనే బృహద్గ్రంధ రచయిత్రి అయిన శ్రీమతి భండారు అచ్చమాంబ శ్రీ లక్ష్మణరావు సోదరి. ఆమె అకాలమరణం చెందగా  ఆమె పట్లగల ఎనలేని  గౌరవ అభిమానాల కారణంగా ఆయన తన కూతురుకి అచ్చమాంబ అని పేరు పెట్టుకున్నారు. ప్రాణాధికంగా పెంచి తనలో చెలరేగే వున్నత భావాలను, ఆదర్శాలను, సంస్కార భావాలను పసితనంనుంచే ఆమెకు నూరి పోశారు. అందుకే ఆమె దృష్టిలో స్త్రీ అంటే చీటికి మాటికి బేలగా కన్నీరుకార్చే బలహీనురాలు, వాజమ్మకాదు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో పరిష్కరించుకుని నిబ్బరంగా ముందుకు సాగిపోగల ఆత్మాభిమాని, కరుణామయి. సానుభూతికి బదులు గౌరవం అందుకోవలసిన మానవ జాతిలో సగభాగం స్త్రీ అని భావన. ఆమె 1906 అక్టోబరు 6న గుంటూరులో జన్మించారు. ఆమె తల్లి శ్రీమతి రామకోటమాంబ. ఆమె పెరగటం, చదవటం మద్రాసులో జరిగింది. అశాంతి, కల్లోలం తొలగించి ప్రశాంతత నెలకొల్పాలని అవసరంలో వున్నవారికి చేయి అందించాలని ఆమెకు చిన్ననాటినుంచే అనిపించేవి. వస్తుతః స్వతంత్రభావన అధికంగాగల ఆమె చదువుకునే రోజుల్లోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితుసాలైంది. విదేశీ వస్తు వస్త్రాలను బహిష్కరించింది. నూలు వడికేది, ఖాదీ ధరించేది ఉబుసుపోక కాలక్షేపానికి యేపని చేయటం ఆమెకు నచ్చదు. ప్రతిదాని గురించి చాల తీవ్రంగా ఆలోచించటం అలవాటు.  1923లో అనుక్షణం ఆమెను తీర్చిదిద్దుతున్న తండ్రి అకస్మాత్తుగ గుండెపోటుతో మరణించారు. జీవితానికొక లక్ష్యమంటూ ఉండాలన్న సంకల్పంతో ఆమె మెడికల్ కాలేజిలో చేరారు. ఎప్పుడూ యేవో సభల్లో సమావేశాలలో పాల్గొంటు ధాటిగా వుపన్యసించేవారు. సైమన్ కమిషన్ పట్ల నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నారు. శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించిన యూత్ లీగ్ లో చేరి జాతీయోద్యమ ప్రచారం చేశారు. తల్లి రామకోటమాంబగారితో సహా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. విద్యార్థి వుద్యమం నడిపారు. తుపాకి పోట్లకి, లాఠీ దెబ్బలకు క్షతగాత్రులయిన వాలంటీర్ల సపర్యలకు చికిత్సకు ఆసుపత్రి నెలకొల్పారు. 1931 నాటికి మెడికల్ కాలేజీలో చదువు ముగిసింది. కాని ఆమెకు సంతృప్తి కలగలేదు. శిశు సంరక్షణ, ప్రసూతి శాస్త్రాలు యింకా బాగా చదివి, దేశంలోని స్త్రీలకు మరింతగా వైద్య సహాయం అందించాలన్న తలంపుతో ఇంగ్లండులో  చదివి, మూడు ప్రత్యేక పరీక్షలు నెగ్గి డిగ్రీలతో వచ్చారు.  స్త్రీలకు విజ్ఞాన వికాసాలు కల్పించాలనే కోరికతో ప్రసూతి, శిశు పోషణ అనే గ్రంథాన్ని తెలుగులో సులభ శైలిలో అందరికి అర్థమయ్యే పదాలతో వ్రాశారు. ఆనాటివరకు అటువంటి వైద్య పుస్తకం సామాన్య ప్రజల అందుబాటులోకి రాలేదు. అందువల్ల ఆ పుస్తకం  ప్రచారంపొంది ఆమె ఆశయం తీరింది. అధిక ఆహారోత్పత్తి ప్రచార సందర్భంలో డాక్టరు అచ్చమాంబ స్వయంగా గునపం పట్టుకుని ప్రతి రోజు కొన్ని గంటలకాలం తవ్వటం, మట్టి మోయటం వంటి పనులు చేశారు. అతి నాజూకైన సూక్ష్మ పరికరాలు పట్టి ఆపరేషన్లు చేసే డాక్టరు గునపంపట్టి యెండలో తవ్వుతుంటే మరి అనుసరించే అభిమానులకు కొరత వుండదుగదా. ప్రజలకు అత్యంత సన్నిహితులై నారు. 1940లో వఝల వెంకటరామశాస్త్రి గారిని వివాహం చేసుకున్నారు. శ్రీమతి లక్ష్మీ వారి ఏకైక సంతానం.   పసివారిని చిన్నప్పటి నుంచి తగిన జాగ్రత్తతో పెంచి, తీర్చి దిద్దితే వాళ్లు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యవంతులైన చక్కని భావి పౌరులు కాగలరని ఆమె నమ్మకం. 20 మంది పిల్లలు, 11 మంది టీచర్లతో ఆమె విజయవాడలో స్థాపించిన మాంటిసోరీ స్కూలు ఈనాడు వేలకొద్దీ పిల్లలతో, వందమంది టీచర్లతో, బ్రహ్మాండమైన గ్రంథాలయంతో స్వంత భవనాలతో విజయవంతంగా నడుస్తోంది. 1948 జూన్లో శాసనోల్లంఘనం చేసి జైలుకు వెళ్లారు. రాయవేలూరులో 7 నెలలు గడిపి వచ్చారు. 1957లో కాంగ్రెసు తరఫున శాసన సభకు ఎన్నికయినారు.  1964 అక్టోబరు 20న గుండె పోటుతో మరణించారు. ఆ సమయంలో ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టుకున్నారు. ఇలా కొమ్మఱ్ఱాజు అచ్చమాంబ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచింది.                                           *నిశ్శబ్ద. 

మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు!

మహిళలు భర్తల కోసం చేయకూడని పనులు ఈ ప్రపంచంలో అతి గొప్ప బంధం వివాహబంధమే. మధ్యలో ముడిపడే ఈ బంధం జీవితం చివరికంటా తోడుగా ఉంటుంది. అంతేనా.. జీవితంలో దైర్యం, నమ్మకం, జీవితం మీద ఆశ కలిగించేది ఈ బంధమే. చాలావరకు వివాహ బంధంలో మహిళలు చాలా మారిపోతారు. వస్త్రాధారణ నుండి ఆహారపు అలవాట్ల వరకు ఎన్నో విషయాలలో మారతారు. కొత్తగా పెళ్ళయ్యాక భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడానికి వారికి నచ్చినట్టు మారతారు. భర్తలు కూడా భార్యలను సంతోషపెట్టడానికి ఎన్నెన్నో చేస్తారు. అయితే మొత్తం మీద చెప్పుకుంటే భర్తల కోసం మారిపోయే మహిళలే ఎక్కువ. అదంతా ప్రేమ అని అనుకుంటారు. కానీ భర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. కొన్ని ఇష్టాలు మార్చుకోకూడదు. ఇలా చేస్తే మొదట్లో వారికోసం అంటూ చేసిన పనులు ఆ తరువాత మహిళల జీవితాలకే పెద్ద సమస్యలుగా మారతాయట. అసలు మార్చుకోకూడనివి ఏంటి? చేయకూడనివి ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే.. నియంత్రణకు లోను కావొద్దు.. పెళ్ళైన కొత్తలో అమ్మాయిలు భర్తలకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడతారు. అయితే ఇందులో భాగంగా భర్త ఆ పనులు చేయకు, ఈ పనులు చేయకు, ఆ దుస్తులు వేసుకోకు, ఆ తిండి తినకు, వారితో మాట్లాడకు అలా ఉండకు, ఇలా ఉండకు అని చెబుతూ ఉంటాడు. అవన్నీ వినకపోతే భార్యకు భర్తమీద గౌరవం లేదని, ప్రేమ లేదని అనుకుంటారేమోననే సంకోచంతో మహిళలు ఈ మాటలను గౌరవిస్తారు. ఫలితంగా భర్త చెప్పినట్టు చేస్తారు. మొదట్లో భార్యలు గౌరవం అనుకున్నది కాస్తా ఆ తరువాత ఇబ్బందిగా మారుతుంది. భర్త పూర్తీ భార్య జీవితాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. భర్తకు, అతని ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనంతవరకు భార్యలు చేసే పని ఏదైనా మానుకోవాల్సిన పని లేదు. తిట్టడం, చెయ్యిచేసుకునే అలుసు ఇవ్వద్దు.. భార్యలు అంటే భర్త దగ్గర మాటలు పడటానికి, వారి చేతిలో దెబ్బలు తినడానికి దొరికిన ఆప్షన్ కాదు. చాలామంది భర్తలు వారి మానసిన అసంతృప్తిని, ఇతరుల మీద కోపాన్ని భార్యలపైన చూపిస్తుంటారు. తిట్టడం, చెయ్యిచేసుకోవడం మొదలైన విషయాలకు వారికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలు తమకు ఇష్టం లేకుండా పడక గది కార్యాకలాపాలలో పాల్గొనద్దు. ఇది ఒకసారి  అలవాటైతే జీవితాంతం మహిళలకు ఇష్టం లేని సమయంలో భర్తల చేతుల్లో సెక్స్ డాల్స్ గా మారే ప్రమాదం ఉంది. దూరంగా ఉండకండి.. చాలామంది మహిళలకు తమ భర్తలు పనిచేసే ఆఫీసు, అతని కొలీగ్స్, అతని స్నేహితులు వంటి విషయాల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మహిళలు  అడిగినా నీకెందుకు ? అని దబాయించే మగవారుంటారు. కానీ మగవారి స్నేహితులు, ఆఫీసులు కొలీగ్స్, ఇతర పరిచయస్తుల నుండి దూరంగా ఉండద్దు. భర్త మీద అనుమానం కాదు, అతనికి తెలిసిన వారితో టచ్ లో ఉండటం వల్ల కొన్నిసార్లు  కొన్ని పనులు, ఇబ్బందులు చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఇష్టాల్ని మార్చుకోకండి.. భర్తలు భార్యల మీద కొన్ని విషయాల్లో ఒత్తిడి తెస్తారు. వీటలో ముఖ్యమైనది శరీరానికి సంబంధించినవే. వాళ్లకు నచ్చని దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేయడం, వారికి  నచ్చని ఆహారం తింటే లావైపోయావనో, మరే ఇతర కారణంతోనో బాడీ షేమింగ్ చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నా పెళ్లాం నేను చెప్పినట్టు వింటుందనో, అతనొక హిట్లర్ మొగుడిలా బంధువులు, స్నేహితుల ముందు బిల్డప్ ఇవ్వడానికో భార్య మీద అజమాయిషీ చేస్తుంటారు. ఇలాంటి వాటికి అస్సలు ఆస్కారం ఇవ్వకండి. భార్యల్ని ఇష్టపడే భర్తలు ఎప్పుడూ తమ భార్యలను నియంత్రించాలని కోరుకోరు. మరీ ముఖ్యంగా భార్య ఇష్టాలను, కోరికలను గౌరవిస్తారు. ఎవరిముందూ కించపరచరు. తమకోసం ఏమీ మారక్కర్లేదనే విషయాన్ని ప్రవర్తనలోనే స్పష్టం చేస్తారు. భార్యలు పూర్తీగా భర్తలకు అనుకూలంగా మారిపోతే భార్యలకంటూ ఎలాంటి విలువా ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి.                                                          *నిశ్శబ్ద.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు!

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఈమె గురించి తెలిస్తే ఆశ్చర్య పోతారు! “విజయమో వీరస్వర్గమో అంతుతేలాలి. శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులారా భారతదేశాన్ని వదలివెళ్లిపొండి. క్విట్టిండియా" అని 1942 క్విట్టిండియా కాలంలో ఒక వీరనారి సివంగివలె గర్జిస్తూ ఉండేది. గట్టివరస శరీరంతో, తేజోవంతమైన ముఖంతో ఖాదీ నిక్కరు, చొక్కా ధరించి ఒక యూరోపియన్ వనిత ఈ నినాదాలు ఇవ్వటం వినిన పొరుగూరువారు క్షణకాలం బిత్తరపోయి చూసేవారు. ఆమె శ్రీమతి మెల్లీ షోలింగరు. సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రుల అభిమానం సంపూర్ణంగా పొందిన తెలుగింటికోడలు.  శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగరు లక్ష్మణరావు. ఈమె 1898 వ సంవత్సరం మార్చి మూడవ తేదీన స్విట్జర్లాండు ముఖ్యపట్టణమైన జూరిచ్ లో జన్మించారు. శ్రీ అధల్ఫ్, శ్రీమతి బెర్తా షోలింగర్ లకు కుమారులు ఉన్నారు గాని కూతురు ఈమె ఒకరే కావటాన ఇష్టంగా చదివించారు. దానితో ఈమె హోంసైన్స్ పట్టభద్రురాలు అయింది. మెడికల్ కాలేజీ పంపించారు. రెండు సంవత్సరాలు చదువు ముగిసింది. ఇంతలో మొదటి ప్రపంచయుద్ధ కారణంగా తండ్రి ఆస్థి అంతా విధ్వంసమై ఆమె చదువు నిలిపివేశారు.  తండ్రికి వ్యాపార నిర్వహణలో సాయపడుతూ ఉండేవారు. వ్యాపారరీత్యా దక్షిణ జర్మనీలో ఉన్న ట్యూబెన్గెన్ నగరంలోవున్న మిత్రులను కలుసుకోవటానికి వెళ్లవలసివచ్చేది. ఆ సమయంలో అక్కడ డాక్టరేటుకు చదువుతున్న శ్రీ ఉప్పల లక్ష్మణరావును కలుసుకోవటం జరిగింది. ఆమె మాతృభాష జర్మన్, అప్పటికే ఆమె జర్మన్ భాషలో సుప్రసిద్ధ ఇండాలజిస్ట్ శ్రీ ఓల్టెన్బర్లు పండితుడు వేదాలను గురించి, బౌద్ధమతాన్ని గురించి వ్రాసిన గ్రంధాలను చదివారు. బహుమతి గ్రహీత ప్రఖ్యాత రచయిత శ్రీ హెర్మొన్ హెన్సే హిందూ దేశాన్ని గురించి, సింహళ దేశాన్ని గురించి వ్రాసిన పుస్తకాలు చదివారు. మనదేశంపట్ల సంస్కృతిపట్ల ఎంతో అభిమానం, సద్భావము కలిగాయామెకు. అందువల్ల శ్రీ లక్ష్మణరావు పట్ల గౌరవము, స్నేహము ఏర్పడ్డాయి. అప్పటికే భారత దేశ రాజకీయాలలో గాంధీయుగం ఆరంభమయింది. ఆమెకు సోషలిజం పట్ల ప్రపంచ కార్మికోద్యమంపట్ల అంతకు పూర్వంనుంచే అభిమానం ఉండేది. అందువల్ల భారతదేశంలో బ్రిటిష్ వారి దమన నీతిని, హింసాకాండను ఏవగించుకుంటూ భారతదేశ స్వాతంత్ర్యోద్యమంపట్ల సహానుభూతి కనపరచేవారు. మిత్రులైన శ్రీ లక్ష్మణరావు గారి ద్వారా మత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను సవిస్తరంగా తెలుసుకుంటూ ఉండేవారు. పర్యవసానంగా హిందూదేశం చూసితీరాలన్న కోరిక కలిగింది. తండ్రి అనారోగ్య కారణంగా ఆమె 1934 చివరన స్వదేశం వెళ్లి పోయినారు. 1937 ఆగస్టు 30న మాస్కోలో డాక్టరు శ్రీ ఉప్పల లక్ష్మణ రావుగారితో ఆమె వివాహం జరిగింది. 1937 లో భారతీయ వనితగా ఆంధ్ర మహిళగా విజయవాడలో భర్తతో స్థిరపడ్డారు. క్విట్టిండియా ఉద్యమంలో  ఆమె వుద్రేకం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకయినా మంచిదని శ్రీమతి ఉప్పల మెల్లీ షోలింగర్ ను 1942 సెప్టెంబరులోనే ఆరెస్టుచేశారు. ఆ ఊళ్లోనే తాలూకా ఆఫీస్ సబ్ జైలులో రెండు నెలలపాటు రిమాండులో ఉంచారు. అక్కడ ఒక్క నదుపాయం లేకపోగా మహిళా ఖైదీలకు కనీసపు అవసరాలు అయిన మరుగుదొడ్లు, స్నానాల గదులుకూడాలేవు. ఎందరెందరో విన్నవించుకున్నారు. బ్రతిమలాడుకున్నారు, విసుక్కున్నారు. ప్రయోజనం లేకపోయింది. ఇక ఇదిమార్గం కాదని శ్రీమతి మెల్లీ నిరశనవ్రతం పూనారు. పచ్చి మంచినీళ్లు ముట్టకుండా వారం గడిచింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలా నీరస స్థితిలో ఉన్నారు. శక్తి కూడతీసుకుని "క్విట్టిండియా” అని ఉచ్చరిస్తూనే ఉన్నారు. జైలు అధికారులకు కొంచెం జంకు కలిగింది. ఆమె కోరిక ప్రకారం జైలులో శ్రీ ఖైదీలకు కనీనపు సదుపాయాలు కల్పించారు. ఆమె కేసు విచారణ చేసి ఒకటిన్నర సంవత్సరాలు కఠినశిక్ష వేశారు. "సి" కాను ఇచ్చి రాయ వేలూరు పంపారు. రాయవేలూరు జైలుకు వెళ్లటం ఆమెకది మొదటిసారికాదు, రెండవ సారికాదు. మూడవసారి. అందుకనే కసితీర ఆమెకు శిక్ష ఘాటుగా వేశారు. ఆ  నిరశనవ్రతం సందర్భంలో క్షీణించిన ఆరోగ్యం ఆమె తిరిగి కోలుకోనేలేదు.  1957లో తన సోదరులను చూడటానికి, ఆమె భర్తతో సహా తూర్పు జర్మనీకి వెళ్లారు. అక్కడ ఉన్న రెండు సంవత్సరాల కాలంలోను అనేక పట్టణాలలో భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, భారత మహిళాభ్యుదయం వంటి అనేక విషయాలపై ఉపన్యసించేవారు, గోష్టులు జరిపేవారు. 1959లో దంపతులు మాస్కో వెళ్లారు. 1965 జూలై 27న ఒక రోడ్డుప్రమాదంలో ఆమె తనువు చాలించారు. ఆనాటికీ ఆమె ఖాదీ ధారణ మానలేదు. ఆమె పట్టుదల, సేవానిరతి, త్యాగం భారతీయులు గుర్తుంచుకోవాలి.                                   ◆నిశ్శబ్ద.  

తన జీవితాన్ని తనే మలుచుకున్న తెలుగు శక్తి పెరంబుదూరు సుభద్రమ్మ!

తన జీవితాన్ని తనే మలుచుకున్న తెలుగు శక్తి పెరంబుదూరు సుభద్రమ్మ! కొంతమంది జీవితాలు సాఫీగా ఒక పద్ధతిలో గడిచిపోతాయి. మరి కొందరి జీవితాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతాయో తెలియకుండ వింతనడకలు నడుస్తుంటాయి. అందుకు చక్కని ఉదాహరణ శ్రీ పెరంబుదూరు సుభద్రమ్మ గారి జీవితం.  వైష్ణవ సాంప్రదాయానికి చెందిన మామిళ్లపల్లి రామానుజాచార్యులు తాయారమ్మగార్ల కుమార్తెగా ఆమె 1904 లో జన్మించారు. తూర్పు గోదావరిజిల్లా, కాకినాడ ఆమె స్వస్థలం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వున్నారు. చాలా చిన్నతనంలోనే ఆమెకు శ్రీ పెరంబుదూరు బుచ్చయాచార్యులుగారితో వివాహం జరిగింది. మరి కొద్దికాలానికే విధి వక్రించింది. నందనవనం అవుతుందనుకున్న ఆమె జీవితం తల్లిదండ్రులకొక విషమ సమస్యగా తయారయింది. 4-5 తరగతులవరకు చదివించటం తప్ప యేమి చేయటానికి వారికి తోచలేదు. ఆమె చిన్నన్నగారయిన గోపాలాచారిగారికి చెల్లిలిపైన ఎంతో అభిమానం, జాలి ఉండేవి. ఆయన ఉద్యోగరీత్యా మెసపొటేమియాలో ఉంటున్నా..  ఆయన చెల్లెలిని క్రమవిధానంలో చదివించమని తల్లితండ్రులకు ధైర్యం కలిగించి, తగిన ధనసహాయం చేశారు. 15 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయి వున్న పూళ్లో చిన్న క్లాసులు చదవటం బాగుండదని చాలా సాహసంచేసి ఆమె తల్లిదండ్రులు ఆమెను విశాఖపట్నంలో క్వీన్ మేరీ గర్ల్స్  హైస్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఆమెకి హాస్టలులో వసతి ఏర్పాటు చేయించారు. ఇలా ఆమె 1927 లో స్కూలు ఫైనలు ముగించారు. కాకినాడ పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంటరు ముగిసింది. ఆమెకొక స్వతంత్ర జీవనోపాధి మార్గం చూపించి, స్థిరమైన భవిష్యత్తు కల్పించాలనుకున్న చిన్నన్నగారికి విశాఖపట్నంలో వుద్యోగమయింది. ఇక చెల్లెలి చదువు నిరాఘాటంగా సాగుతుందన్న తలంపుతో ఆమెను విశాఖపట్నం రప్పించి అక్కడ బి. ఏ. ఆనర్సులో చేర్పించాడు. కాని అప్పటికే ఆమెకు ఇంగ్లీషు చదువులమీద మోజుపూర్తిగా నశించి, జాతీయావేశం దృఢ పడింది. జాతీయోద్యమంలో చేరి, స్వరాజ్య సంపాదనకు పాటుపడితీరాలని నిశ్చయించుకుంది. ఆనర్సు చదువు ముగియకుండానే బహిరంగ సభల్లో వుపన్యసించటం, సత్యాగ్రహం చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాదర్తి సుందరమ్మ గారితో ఈమెకు సాన్నిత్యం పెరిగింది.  1980 ఉప్పు సత్యాగ్రహంలో నాయకులందరు అరెస్టయిన తరువాత పుద్యమం చల్లారి పోకుండ యీమె, సుందరమ్మగారు బందరు కోనకు వెళ్లి వుప్పువండేవారు. కల్లుసారా దుకాణాల దగ్గర పికెటింగు చేసేవారు. చివరకు 1980 లో అరెస్టు అయినారు. 8 నెలల కఠినశిక్ష అనుభవించటానికి రాయవేలూరు జైలుకు వెళ్లారు. తోడుగా వెళ్లి జైలులో దింపివచ్చిన సుందరమ్మగారు 27-8-1980న అరెస్టయి ఆ జైలుకే వెళ్లారు. 1980 సత్యాగ్రహ సందర్భంలో పశ్చిమ కృష్ణాజిల్లాలో అరెస్టయిన 188 మందిలోను స్త్రీలు వీరిద్దరే. శాసనోల్లోంఘన ఉద్యమం కోసం ఆంధ్రరాష్ట్రం తరపున సుభద్రమ్మగారు కర్రసాము, గస్తీ తిరగటం, నగర సంకీర్తనం వంటి విద్యలనభ్యసించారు.  1981 డిశంబరు 31న దేశ వ్యాప్తంగ శాసనోల్లంఘనం చేయటానికి గాంధీజీ అనుమతించారు. దాంతో వుద్యమంలో కొత్త కెరటం ఉవ్వెత్తున లేచింది. ఆంధ్రులు, స్త్రీలు పురుషులు అమితమైన సాహసంతో పట్టుదలతో పాల్గొన్నారు. ఆ కార్యకలాపాలను ఆపకుండానే శ్రీమతి సుభద్రమ్మ తీవ్రకృషిని సాగించారు. ఆంధ్ర రాష్ట్ర నియంతగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1992 ఏప్రిల్ 2న గుంటూరు జిల్లా పెనుమాకలో అరెస్టయినారు. అప్పుడు జైలులో వుండగానే ఆమెకు మళ్లీ చదువుపైన ధ్యాన కలిగి పరిక్ష వ్రాసి బి. ఏ పాసయినారు. జైలు నుండి విడుదలయివచ్చిన తరవాత బ్రిటిష్ ప్రభుత్వం కింద వుద్యోగం చేయరాదని నిశ్చయించుకున్నారు. ఆరోజుల్లో విజయవాడలో తంగిరాల రాఘవయ్యగారు నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ నిర్వహిస్తూ దానిలో స్త్రీలకు ప్రత్యేక విభాగం ఏర్పరచారు. ఆ కంపెనీ ఏజెంటుగా ఆమె అతిసమర్థవంతంగా పనిచేశారు. అప్పట్లో ఇన్సూరెన్సు రంగంలో అంత పేరు తెచ్చుకున్న మహిళలు లేరు. ఆమె ఆ పనిమీద తరుచు మద్రాసు వెళ్లవలసి వస్తుండేది. చివరకు మద్రాసుకే మకాం మార్చారు. ఆమెకు చిన్ననాటి నుంచి తనది, తనకోసం అనేమమత తక్కువ, ఉన్నదానిని అవసరమైన నలుగురికీ వుపయోగపరచాలనే తత్వం, దాంతో ఆమె సహాయం పొందేవారితో ఇల్లు నిండుగా వుండేది. కులమత భేదాల పట్టింపు ఆమెకు బొత్తిగాలేదు. నిరాధారులు సహాయము అడిగితే ఆశ్రయమిచ్చి ఏదో ఒక చేతి పనివృత్తి నేర్చుకోవటానికి సహకరించేవారు. చదువుపట్ల అభిరుచి వున్నవారికి పరీక్షలకు కట్టటానికి తోడ్పడేవారు. ఆమె విద్యావంతురాలు, సమర్ధురాలు. ఏ రంగంలోను శృంఖలాలను భరించలేని స్వేచ్ఛావాది. తన భవిష్యజీవనానికి బంగారుబాట అయిన ఆనర్సు చదువును కాలదన్ని దేశ సేవచేసి జైలు నరకం అనుభవించారు. పరప్రభుత్వం కింద బానిసగా వుండనంటు స్వతంత్ర జీవితాన్ని ఎన్నుకొన్నారు. ఆంధ్ర బాలలకు, మహిళలకు సేవచేశారు. ఆర్తులకు, నిస్సహాయులకు, అనాధలకు ఆఖరు పైసా వరకు సహాయం అందించారు. 1974లో హైదరాబాదులో శాశ్వతంగా కన్నుమూశారు.                                ◆నిశ్శబ్ద.

ఇంటి పని.. ఉద్యోగం.. లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి!

ఇంటి పని.. ఉద్యోగం.. లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి! 1970 వ సంవత్సరం ఆగస్టు నెల నాలుగోవారంలో శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మగారు అనారోగ్యంగ పడుకొని ఉన్నారు. అలవాటు ప్రకారం మహిళా సమాజ కార్యకర్తలు, మిత్రులు, సమావేశమై వున్నారు. సమాజం సంగతులు చర్చించుకుంటు వున్నారు. అప్పుడు ఆమె "ఏదో భగీరథ  ప్రయత్నం చేసి, భీమవరం వాళ్ళనడుమ చక్కని స్థలం సమకూర్చగలిగాము, కాని ఆ మున్సిపల్ వారి ఆమోదముద్ర మన ప్లానుల మీద యెప్పటికి పడుతుందో, ఈ లోపల నిరుత్సాహపడి, మాట యిచ్చిన వాళ్ళు విరాళాలు పంపడం అశ్రద్ధ చేస్తారేమో. మరికొంతమంది కొత్త వాళ్ళను కూడ కలుసుకొని యింకా కొంతడబ్బు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. అనుకున్న ప్రకారం 'బా- బాపు భవనం' నిర్మాణం వీలయినంత త్వరగా జరిగిపోవాలి" అని చెపుతూనే వున్నారు. మరికొంతసేపటికి ఆమె మాట పడిపోయింది. అవే ఆమె చివరి మాటలు. మరి మూడురోజులకు 27-8-1970 ఆమె భగవత్సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇంతటి కార్య దీక్షత కలిగిన మహిళ లక్ష్మీబాయమ్మ. ఇప్పటికాలం మహిళలు ఇంటి పని ఉద్యోగం పెద్ద టాస్క్.. అని అంటూ ఉంటారు. ఒకప్పుడు మహిళలు అందరూ ఉద్యోగాలు ఏమీ చేయలేదు.. వారికేం తెలుసు ఇంత పెద్ద టాస్క్ ల గురించి అని కూడా అనుకుంటారు. కానీ అందరూ లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి.  శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1898 లో శ్రీ చన్నా ప్రగడ సుందర రామయ్య-శ్రీమతి రామ లక్ష్మాంబల కడగొట్టు బిడ్డగా జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలుకా లోని ముత్యాలవల్లి ఆమె జన్మ స్థలం. అదొక విద్వత్కుటుంబం. అందరు కవులు, పండితులే. నిత్యం పండిత గోష్టులు, సాహిత్య చర్చలు జరుగుతు వుండేవి. తన రెండవ యేటనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మీబాయమ్మ కవులు, పండితుల మధ్య తండ్రివడిలో పెరిగారు. సంస్కృత పద భూయిష్టమైన భాషనే యింట్లో అందరు మాట్లాడటంతో ఆభాషే ఆమెకు సహజంగ వచ్చేసింది. భోజనానికి వెళ్ళబోతూ "అన్నయ్యా యీవేళ సూపమాః చోష్యమాః భక్ష్యములేమిటి" అని అడిగే వారట.  లక్ష్మీబాయమ్మది బడికి వెళ్ళి నేర్చిన చదువుకాదు. అంతా స్వయం కృషివల్ల సాధించినదే. హిందీ, ఇంగ్లీషు భాషలు చక్కగా చదవడం, వ్రాయడం వచ్చు. సంస్కృత, ఆంధ్రభాషలలో గొప్ప విద్వత్తుగలవారు. కవిత అల్లగల వారు. చిన్న వయసులోనే ఆమె కంద పద్యాలలో 'కృష్ణ శతకం' వ్రాశారు. మరి మూడేళ్లకు 'వీరమతి' అనే నవలను వ్రాశారు. 'శాంతి కాముడు' అనే పద్య కథానికను, ఇంటరంటే ఏమిటనే వ్యాసం, నారాయణ రావు అనే కథానిక, 'దుర్గా దండకం', శ్రీకృష్ణ పరంగా 'ప్రభూ' అనే శీర్షికతో పద్య వ్యాసం వ్రాశారు. గృహ లక్ష్మి పత్రికలో అనేక కథలు, గేయాలు, వ్యాసాలు వ్రాశారు. భారతి పత్రికలో కూడ అసంఖ్యాకంగ గద్య పద్యరచనలు వ్రాశారు. విదుషిగా, కవయిత్రిగా తెలుగు నాట పేరుపొందగలిగారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకుని తన కష్టార్జితాన్ని యితరులకు సంతోషంగ పంచారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యాన నడుస్తున్న కేంద్ర స్త్రీ సంక్షేమ సంఘంలో శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1955 నుంచి సభ్యురాలుగా వున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇంప్లిమెంటింగు కమిటీ చైర్మన్ గా నాలుగయిదు సంవత్సరాలు సేవ చేశారు. తాలూకాలలో, గ్రామాలలో విరివిగా సెంటర్లు నెలకొల్పి వాటి తరపున స్త్రీలకు చదువుకునే అవకాశాలు, కుట్లు అల్లికలవంటి వుపయోగ కరమైన చేతిపనులు, ప్రసూతి కేంద్రాలు, వైద్య సౌకర్యాలు యెన్నో ఆమె కల్పించి యెనలేని సహాయం చేశారు. ఎంతోమంది స్త్రీలకు తమకాళ్ళపైన తాము నిలబడగల శక్తిని కల్పించారు. మహిళాభ్యున్నతి ఆమెకు అతి ప్రధానం అని చెప్పవచ్చు.                                    ◆నిశ్శబ్ద.