కార్పోరేటర్లు రాష్ట్ర పరువు తీశారు
posted on Apr 11, 2011 @ 10:58AM
విశాఖపట్నం: విశాఖపట్నం నగర కార్పోరేటర్లు కింగ్ఫిషర్ విమానంలో ఎయిర్ హోస్టెస్పై అసభ్యంగా ప్రవర్తించారు. తెలుగు రాదనే ఉద్దేశంతో ఆమెను వారు బూతులతో సత్కరించారు. విమానం పైలట్పై దురుసుగా వ్యవహరించారు. విశాఖపట్నానికి చెందిన 26 మంది కింగ్ ఫిషర్ విమానంలో విహార యాత్రకు బయలుదేరారు. దాదాపు 26 లక్షల రూపాయల ఖర్చుతో వారి ఉల్లాస యాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నంలో విమానం ఎక్కిన కార్పోరేటర్లు విమానంలో పాటలు పాడడం, కేకలు వేయడం, వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో ఇతర ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అడ్డు చెప్పబోయిన ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సిఎస్ఐఎఫ్కు పిర్యాదు చేసింది. దీంతో దాదాపు 30 మంది సిబ్బంది విమానాన్ని పూణేలో చుట్టుముట్టి సదరు కార్పోరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా కార్పోరేటర్లు వారి అదుపులోనే ఉన్నారు. వారిపై సిఎస్ఎఫ్ఐ బైండోవర్ చేసింది. విశాఖపట్నం కార్పోరేటర్లు క్షమాపణలు చెప్పారు, హామీలు ఇచ్చారు. దీంతో వారిని సిఎస్ఎఫ్ఐ వదిలేసింది. మొత్తం మీద, కార్పోరేటర్ల వ్యవహారం రచ్చకెక్కింది.