రెండవ విడత సహకారం నేడే

    ఈ రోజు సోమవారం రాష్ట్రంలో రెండవ విడత సహకార ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 1484 వ్యవసాయ సహకార సంఘాలకు, 940 ఇతర సంఘాలకు ఈ రోజు ఎన్నికలు జరుగవలసి ఉండగా, వాటిలో 68సంఘాల ఎన్నికల పై ప్రభుత్వం స్టే విదించింది. మొదటి విడతలో రాజకీయ పార్టీలు ఒక దానికొకటి పూర్తిగా సహకరించుకోనట్లే, రెండవ విడతలో కూడా నీకిది-నాకది అనే రీతిలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో 475 సంఘాలలో పోటీ లేకుండా ఏకగ్రీవం అయినందున అక్కడ ఎన్నికలు జరుపవలసిన అవసరం లేదు. ఈ రోజు ఉదయం 7గంటలకు మొదలయ్యే పోలింగు మధ్యాహ్నం 2గంటల జరుగుతుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి పూర్తవగానే ఫలితాలు కూడా ఈ రోజే వెల్లడిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే సంఘాలు:    జిల్లా పేరు            సంఘాల సంఖ్య విశాఖపట్నం 42 విజయనగరం 37 శ్రీకాకుళం 42 తూర్పుగోదావరి 42 పశ్చిమగో దావరి 56 కృష్టా 95 గుంటూరు 47 ప్రకా శం 61 నెల్లూరు 34 చిత్తూరు 30 కడప 22 కర్నూలు 27 అనంతపురం 42 అదిలాబాద్‌ 35 కరీంనగర్‌ 57 ఖమ్మం 48 వరంగల్‌ 33 నిజామబాద్‌ 54 నల్లగొం డ 53 మహబూ బ్‌నగర్‌ 44 మెదక్‌ 51 రంగారె డ్డి 18

టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాస యుద్ధం

  బొత్స సత్యనారాయణ ఏకారణంతో 9మంది జగన్ అనుకూల శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నాని ప్రకటించారో గానీ, అది తెలుగు దేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు మంచిపని కల్పించింది. ప్రభుత్వం మైనార్టీలో పడినప్పటికీ కూడా, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగు దేశం పార్టీ ఎందుకు జంకుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే, మీ సభ్యులను బహిష్కరిస్తే మీరే స్వయంగా ఆపని ఎందుకుచేయట్లేదని తెలుగు దేశం పార్టీ ఎదురు ప్రశ్నిస్తోంది.   కాంగ్రెస్ యం.పీ.గా కొనసాగుతూ వైయస్సార్ పార్టీకి జై కొడుతున్న సబ్బంహరి అడిగిన ప్రశ్నలకు జవాబుగా, “అసలు ముందు మీరే పార్టీలో ఉన్నారిప్పుడు? కాంగ్రెస్ లోనా లేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనా స్పష్టం చేయమని తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోఉంటూ తన స్వంత పార్టీ మీదనే అవిశ్వాసం పెట్టమని మమ్మలిని ఆయన అడుగుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ అతనిపై ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు? ఈవిధంగా అయన పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకి పాల్పడుతున్నపుడు అతనిని కూడా పార్టీలోంచి ఇంకా బహిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపేక్షిస్తోంది? అని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీపై అవిశ్వాసం పెట్టాలని ఆయన అంతగా తపిస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఆ పని స్వయంగా ఎందుకు చేయట్లేదు?తమ అనుచరులు 9 మందిని కాంగ్రెస్ పార్టీలోంచి బహిష్కరిస్తున్నపుడు, వారే స్వయంగా గవర్నర్ దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉపసహరించుకొంటున్నామని స్వయంగా చెప్పి, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై వారే స్వయంగా అవిశ్వాసం పెట్టవచ్చు కదా? అని సోమిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలని ప్రశ్నించారు.   మొత్తం మీద అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ కిరణ్ ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టే విషయంలో ఈ విదంగా కీచులాడుకొంటూ, వెనకడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన పని తానూ నిశ్చింతగా చేసుకుపోతున్నారు. బహుశః ఇప్పుడు ఏ పార్టీ కూడా తన ప్రభుత్వాన్ని కూల్చి, ఎన్నికలకి వెళ్ళే దైర్యం చేయలేదని ఆయనకి బాగా అర్ధం అయింది కనుకనే అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారేమో.

విజయవాడలో బాబు పాదయాత్ర, లగడపాటి హల్ చల్

      చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవాడ నగరంలో ప్రవేశించనున్న నేపథ్యంలో లగడపాటి ఆదివారం వ్యూహాత్మకంగా ‘సమైక్యర్యాలీ’కి శ్రీకారం చుట్టాడు. అటు చంద్రబాబు యాత్ర నగరంలోకి రావడం, ఇక్కడ లగడపాటి ర్యాలీ ఒకేసారి ఎదురుపడే పరిస్థితి వచ్చింది. దీంతో తాను చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇస్తానంటూ లొల్లిపెట్టాడు. దీంతో బుడమేరు వంతెన వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు అనుమతి ఇస్తే వెళ్తానని పోలీసులను కోరాడు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఊరుకున్నాడు. ఇంతకుముందు యాత్ర జిల్లాలోకి వచ్చిన సమయంలో అనుమంచి వద్ద లగడపాటి ఇలాగే హడావిడి చేశాడు. తాజాగా మళ్లీ ఇదే సీన్ క్రియేట్ చేశాడు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకం అన్న భావన కలిగించడమే లగడపాటి లక్ష్యంగా కనిపిస్తుంది.

'విశ్వరూపం' కు తొలగిన కష్టాలు...త్వరలో విడుదల

        మొత్తంగా నష్టం ఏ స్థాయి తేలుతుందో కానీ ఈ సినిమా తమిళనాడు విడుదల కు సంబంధించి చర్చలు సఫలం అయ్యాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తానని కమల్ తెలిపాడు. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనని అంటున్నారు. ముస్లిం సంఘాలు, కమల్ హాసన్ మధ్య శనివారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అయితే కొన్ని సీన్ల కోతలతో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఏడు వివాదస్పద దృశ్యాలు తొలగించేందుకు కమల్ అంగీకరించారు. మరో ఎనిమిది డైలాగుల వద్ద ‘సైలెంట్’ టోన్ పెట్టనున్నారట. చర్చలు సామరస్యంగా జరిగేందుకు సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని కమల్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన దావాను ఉపసంహరించుకుంటామని చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్ ట్వెంటీ X ట్వెంటీ మ్యాచ్

  కాంగ్రెస్ పార్టీ నుండి త్వరలో 9మంది శాసనసభ్యులు వెనక్కి రానున్నఈ తరుణంలో, త్వరలో వివిధ పార్టీలకి చెందిన మరో 20 మంది శాసన సభ్యులు కూడా తమ టీంలో చేరబోతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు మాచర్లలో తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కొత్త బ్యాచ్ లో అందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తమ టీంలో చేరిపోతారని ఆయన పేర్కొన్నారు.    ఆ 20మంది కూడా టీంలో జేరిపోతే, వారు వదిలి వచ్చిన పార్టీలతో మ్యాచ్చ్ మొదలుపెట్టేస్తారు. బయట పార్టీలతో వారు మ్యాచ్ ఆడుకొంటే పరువలేదు గానీ, రేపు తమకి పార్టీ టికెట్ ఇవ్వలేదని జగన్ మోహన్ రెడ్డి తో మ్యాచ్ ఆడుకొంటేనే ఇబ్బంది. అయినా, మంది ఎక్కువయితే మజ్జిగ పలుచన అవుతుందని తెలుసుకోకుండా, పార్టీలోకి వస్తామని అన్నవారినందరినీ ఆహ్వానించుకుంటూపోతే, రేపు పార్టీ టికెట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఎంత మందికి పంచుతారు? ఇదివరకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడుకూడా ఇదే తంతు జరిగి చివరికి ఆ పార్టీ ఎక్కడ తెలిందో గుర్తుంచుకొంటే, ఇక వైయస్సార్ కాంగ్రెస్ తన టీం పెంచుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును. లేదంటే ఆ పార్టీలో అసలు ప్లేయర్స్ కన్నా ఎగస్ట్రా ప్లేయర్లే ఎక్కువయిపోతారు. అప్పుడు వారిలో వారే 20X20 మ్యాచ్చులు ఆడుకోవలసి వస్తుంది. అయినా, కెప్టన్ ఇంకా టీంలోకి రాక ముందే ప్లేయర్స్ సిద్దం అయిపోతున్నారు.

చంద్రబాబుకి దమ్ముందా? మైసూరా

  నేతలు పార్టీలు మారగానే వారి విధేయతతో బాటు వారి స్వరం కూడా మారుతుంది. నిన్న మొన్నటివరకూ తెలుగుదేశం పార్టీలోనే నా చివరి శ్వాస, చంద్రబాబు వంటి నాయకుడు నభుతోన భవిష్యత్ అంటూ సినిమా డైలాగులు చెప్పిన మైసూరా రెడ్డి, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయగానే ఆయనకి చంద్రబాబు అకస్మాతుగా చెడ్డవాడయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ అనుచరులుగా ముద్రపడ్డ 9 మంది శాసనసభ్యులను బహిష్కరిస్తున్నట్లు పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించగానే, తమ అనుచరులను బయటకి గెంటుతున్నందుకు కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేయవలసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీతో యుద్ధం మొదలు పెట్టింది. “చంద్రబాబుకి దమ్ము దైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీతో తమకి తెరవెనుక ఒప్పందాలు ఉన్నాయని ఒప్పుకోవాలని” మైసూరా రెడ్డి ఒక వింత డిమాండ్ చేసారు. నిన్నగాక మొన్న పుట్టిన తమ పార్టీ ఆదేశిస్తే మూడు దశాబ్దాలు చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ శిరసావహిస్తుందని అనుభవజ్ఞుడయిన ఆయన ఎలా అనుకోన్నారో తెలియదు. కోటి సంతకాలతో జగన్ మోహన్ రెడ్డి ని జైలునుండి విడిపించుకోవచ్చుననే వింత ఆలోచన చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు “ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న మరోపార్టీ మీద, మూడో పార్టీ అడిగినప్పుడల్లా అవిశ్వాసం పెట్టకపోతే, ఆరెండు పార్టీలు కుమ్మక్కుఅయినట్లే” అనే మరో సరికొత్త రాజకీయ సిద్దాంతాన్ని మైసూర డిమాండుతో ఆవిష్కరించారు. అసలు, తమ అనుచరులు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోఉండి అక్కడ ఏమి చేస్తున్నారు? జగన్ మోహన్ రెడ్డికి విదేయులయినప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంతకాలం ఎందుకు వ్రేలాడేరు? వారిని కాంగ్రెస్ ఇప్పుడు బయటకి పంపుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీని నిందించకపోగా తెలుగు దేశం పార్టీని మద్యలోకి ఎందుకు లాగుతున్నారు? అనే ప్రశ్నలకు మైసూరా వద్ద సమాధానలు ఉన్నాయో లేవో? ఆయనే చెప్పాలి మరి.

బొత్స పేర్లెందుకు ప్రకటించలేదంటే....

  కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది శాసన సభ్యులను బహిష్కరిస్తున్నట్లు నిన్న బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో మళ్ళీ రాష్ట్రంలో రాజకీయలొక్కసారిగా వేడెక్కాయి. ఆయన 9మందిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు.   బహుశః తెలంగాణా అంశం నుండి మీడియా దృష్టిని మరల్చడానికో లేక జగన్ వైపు చూస్తున్నకాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టడానికో ఆయన అవిదమయిన ఎత్తుగడచేసి ఉంటారు. ఇక, ఎన్నికలు వస్తున్నతరుణంలో కాంగ్రెస్ పార్టీలో కోవర్టులా పనిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి అనుచరులను ఉంచుకోవడం పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతో, అతనికి విదేయులయిన వారిని ఈ విదంగా డెడ్ లయిన్ ఇవ్వడం ద్వారా వారంతట వారే పార్టీ వీడిపోయేలా చేయడానికి ఆయన ఈవిదమయిన ప్రకటన చేసిఉంటారు. అదే సమయంలో, ఇంకా సందిగ్ధంలోఉన్నజగన్ అనుచరులకు పార్టీలోఉండటమా లేక వదిలి వెళ్లిపోవడమా అనే సంగతిని కూడా వెంటనే తేల్చుకొనేందుకు ఆయన ఆఖరి అవకాశం ఇస్తూ వారి పేర్లు ప్రకటించక కొంత సమయం ఇచ్చారని భావించవచ్చును.   కాంగ్రెస్ పార్టీ, తమని మెడ పట్టుకొని బయటకి గెంటితే ఆ కారణంతో ప్రజల నుండి సానుభూతి పొందవచ్చునని ఎదురు చూస్తున్నశాసన సభ్యులకి, ఈ ప్రకటనతో కొంత గందరగోళం ఏర్పడి వారంతట వారే బయటకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ఉపాయం మెల్లగా ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జగన్ విధేయుడిగా పేరున్న జోగి రమేష్, బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతూ బయటపడటమే అందుకు చక్కని ఉదాహరణ. తద్వారా పార్టీలోంచి బయటకి వెళ్ళేవారు ఈవిధంగా తమ పరువు తామే తీసుకొని మరీ బయటకి వెళ్ళేలా చేయవచ్చును.   రాన్నున్న ఒకటి రెండు రోజుల్లో మరి కొంతమంది ఇదేవిధంగా బయటపడవచ్చును. అనర్హత వేటు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడే కన్నా, ఆ పార్టీకి రాజీనామా చేయడమే ఉత్తమం అని భావించే మరి కొందరు కూడా త్వరలోనే బయట పడవచ్చును. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు చేసినా, ప్రభుత్వము కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఆ సంగతి ఆలోచించకుండా బొత్స సత్యనారాయణ అటువంటి ప్రకటన చేసి ఉంటారంటే అనుమానమే

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన

        తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చి 2న నిజాం కళాశాలలో తెలంగాణ విద్యార్థి సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఓయూ జేఏసీ శనివారం ప్రకటించింది. అలాగే, ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. మార్చి 20న ఛలో అసెంబ్లీ ముట్టడికి ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది.విద్యార్థి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని తెలిపారు. త్వరలో అభ్యర్థి పేరు వెల్లడిస్తామన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది.

గోకరాజు ఛాముండీ మధ్యలో సచిన్!

        ఛాముండేశ్వరి నాథ్ అమ్మాయిలను బాగా ముస్తాబు చేసుకుని సచిన్ టెండూల్కర్ వద్దకు తీసుకువెళ్లేవాడని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు గంగరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. కార్యదర్శిగా చాముండేశ్వరి అక్రమాలకు పాల్పడ్డాడని, ఆయన అవకతవకల మూలంగా ఐదు కోట్ల రూపాయల దాకా అసోసియేషన్ నష్టపోయిందని అన్నారు. అందుకే ఆయనను అసోసియేషన్ నుండి సస్పెండ్ చేశామని అన్నారు. ఇద్దరి మధ్య పోరులో సచిన్ ను లాగిన గంగరాజు తనకు ఈ పదవి పెద్దదేం కాదని, తన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పినట్లు తనకి సచిన్ అంటే గౌరవమని అన్నారు.

యాంటీ రేప్ లా...ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులకు ఉరిశిక్ష?

  డిసెంబర్ 16వ తేదీన డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై వాద ప్రతివాదనలు నిన్నటితో పూర్తీ అవడంతో, ప్రత్యేకంగా నియుక్తమయిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఐదుగురు నేరస్తులకి వ్యతిరేఖంగా ఈ రోజు(శుక్రవారం) చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఆరవ నేరస్తుడు మైనర్ (17సం.ల 5నెలలు) అయిన కారణంగా అతనిని బాలనేరస్తుల కోర్టులో విచారిస్తున్నారు. అయితే, బాల నేరస్తులకి కటిన శిక్షలు వేసేందుకు చట్టం ఒప్పుకోదు గనుక, అతను కేవలం 3 సం.ల జైలు శిక్షతో కేసును నుండి తప్పిచుఒనే అవకాశం ఉంది.   నిన్న జరిగిన కేంద్ర కేబినేట్ మంత్రివర్గ సమావేశంలో, జస్టిస్ వర్మ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని, కేంద్రం ఒక ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి వెంటనే పంపింది. కేంద్రం చేసిన తాజా సిఫారసుల ప్రకారం ఇంతవరకు అత్యాచార కేసుల్లో విదిస్తున్న 10సం జైలు శిక్షను రెట్టింపు చేస్తూనే, అవసరమయితే దానిని జీవిత కాల ఖైదుగా మార్చే వీలుకల్పించింది. మరణ శిక్షను రద్దు చేయమన్న వర్మ కమిటీ సిఫారుసును పక్కన బెట్టి, బాదితురాలు మరణించినా లేదా ఆమె శాశ్వితంగా కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భంలో కోర్టులు మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంచింది. అయితే బాల నేరస్తుల వయసుని 18 నుండి 16కి తగ్గించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో, రాజకీయ పార్టీలతో సంప్రదించాక ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది.   అందువల్ల, ప్రస్తుతం 6వ నేరస్తుడు మైనర్ అయిన కారణంగా కటిన శిక్షల నుండి తప్పించుకొనే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ఈ విషయంపై చర్చ జరిగి బాలనేరస్థుల వయోపరిమితి తగ్గిస్తూ ప్రత్యేక చట్టం రూపు దిద్దుకొంటే తప్ప అందరి కంటే అతి కిరాతకంగా అత్యాచారంచేసి, బాధితురాలి శరీరంలోకి ఇనుప రాడ్డును దూర్చి ఆమె మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి శిక్షపడే అవకాశం లే

సీఎం కుర్చీ కోసం పీసీసీ చీఫ్ బొత్స కుట్రలు

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కుర్చీ నుంచి దించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుట్ర పన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకు బొత్స కంకణం కట్టుకున్నారని జోగి రమేష్ ధ్వజమెత్తారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుండి ఎమ్మెల్యేలను ఎలా బహిష్కరిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభానికి బొత్స తెర తీశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిందని బొత్స ఎలా చెబుతారని ఆయన అడిగారు. బలనిరూపణకు గవర్నర్ ఆదేశిస్తే ఏం చేస్తారని, తెలుగుదేశం పార్టీ మద్దతుతో గట్టెక్కుతారా అని ఆయన అడిగారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో కల్లోలం సృష్టించడానికి, కాంగ్రెసులో అంతర్గత కలహాలు సృష్టించడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసలు నేను ఎలాంటి తప్పు చేయలేదని, బహిష్కరించిన వారిలో తన పేరు ఉంటే బయట పెట్టాలని  జోగి రమేష్ డిమాండ్ చేశారు. తాము సమైక్యాంధ్ర ప్రదేశ్ను కోరుకుంటున్నామని, ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే ఎదురిస్తామని అన్నారు. పార్టీ నుండి బహిష్కరించిన ఎమ్మెల్యేల పేర్లను బయటపెట్టాలన్నారు.  

పోగొట్టుకున్నచోటే వెతుకుతానంటున్న మురళీమోహన్

      "నేను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుకుతాను. రాజమండ్రిలో ఓడిపోయాను. తీరిగి అక్కడే పోటీచేసి గెలుస్తాను” అని సినీ నటుడు, జయభేరి సంస్థల అధినేత మురళీమోహన్ అన్నారు. గత ఎన్నిక ల్లో టిడిపి తరపున రాజమండ్రి లోక్ సభ స్థానానికి పోటీచేసిన మురళీమోహన్ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఉండవల్లికి 3,57,449 ఓట్లు రాగా, మురళీమోహన్ కు 3,55,302 ఓట్లు వచ్చాయి. కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రలో ఆయనను మురళీమోహన్ కలిశారు. చంద్రబాబు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడున్న పరిస్థితులలో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తాను ఎక్కడ ఓడిపోయానో,అక్కడే గెలవాలని,ఎక్కడ పోయిందో , అక్కడే వెతుక్కుంటానని” అన్నారు.

సల్మాన్ రష్దీని సీఎం మమత బెదిరించింది

        పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. గత నెల 30వ తేదీన సల్మాన్ రష్దీ కోల్‌కతా సాహిత్య సమ్మేళనానికి హాజరుకావాల్సివుంది. దీనితో పాటు ఆయన నవల 'మిడ్ నైట్ చిల్డ్రన్' ప్రచార కార్యక్రమం ఉంది. కోల్‌కతా వెళ్ళడానికి సిద్దమైన తనను పోలీసులు సంప్రదించి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అడుగు పెట్టవద్దని చెప్పారు. కోల్‌కతా కు మీరు వస్తే మతఘర్షణలు వస్తాయని,అందువల్ల మీరు రాకుండా చర్యలు తీసుకోవాలని మమత ఆదేశించారని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ వస్తే మిమ్మల్ని మూట కట్టి తరువాతి విమానంలో వెనక్కి పంపిస్తామని మమత చెప్పినట్లు సల్మాన్ రష్దీ వెల్లడించారు.   అయితే, రష్దీని తామేమీ పిలవలేదని సాహిత్య సమ్మేళనం నిర్వాహకులు వేరే ప్రకటనలో ఖండించారు. దానిపై రష్దీ స్పందిస్తూ.. అది అమర్యాదకరమని, వాళ్లే తన విమానం టెకెట్లు బుక్ చేశారన్నారు. మమత ఒత్తిడి వల్లే వాళ్లలా మాట్లాడి ఉండొచ్చని ఆరోపించారు.    

ప్రజాస్వామ్యమా మజాకా...

  శుక్రవారంనాడు జరిగిన సహకార ఎన్నికలలో మన రాజకీయ పార్టీలు ఒకదానికొకటి ఎంత బాగా సహకరించుకొన్నాయో చూస్తే నిజంగా చాలా ముచ్చట వేసింది. రాజకీయ పార్టీలకతీతంగా సాగాల్సిన సహకార ఎన్నికలలోకి అన్ని రాజకీయపార్టీలు ప్రవేశించడమే కాకుండా, మళ్ళీ ఒకదానికొకటి సహకరించుకొని సహకార ఎన్నికల పేరు సార్ధకం చేసాయి కూడా. అయితే, ఈ సహకారం శాసనసభలో తమ జీతభత్యాలు పెంచుకొన్నపుడు తప్ప, మరెప్పుడు మనం చూసే భాగ్యానికి నోచుకోము.   ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో పార్టీలే నిర్ణయించుకొంటే, వారి గెలుపోటములు తమ చేతులలో ఉన్నాయనే భ్రమలోఉన్న వెర్రి ప్రజలు చేంతాడంత వరుసలల్లో నిలబడి, తాము తమకి నచ్చిన వాళ్ళకే ఓటు వేస్తునామనే భ్రమలో ఓట్లు వేసి వచ్చారు. వచ్చేసాధారణ ఎన్నికలలో కూడా వారు అదే భ్రమలోనే ఓట్లు వేసోస్తారు.   ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వద్దు, ప్రజారాజ్యంకి తమ ఓటు వేద్దామనుకొంటే, అది మళ్ళీ వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీలోనే కలిసింది. ఇప్పుడు భాజపా వద్దు అని తేదేపాకు ఓటువేస్తే, రేపు అది వెళ్లి భాజపాతోనే చేతులు కలపవచ్చును. తెరాసను కాదనుకొని తేదేపాకు వేస్తే అది తెరాసతోనే కలవొచ్చును. పోనీ వీరెవరూ వద్దు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వేసుకొని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకొందామని ప్రజలు అనుకొంటే, ఆనక ఆయన వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలవొచ్చును. అంటే ఓటు వేయడం వరకే ప్రజల బాధ్యత, ఆ తరువాత వారి అభీష్టానికి విలువలేదు, ఉండదు కూడా.   ఐదేళ్ళ కోసం ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకొంటే, అతను లేదా ఆమె తన రాజకీయ ప్రయోజనాలు దిబ్బతింటున్నాయని ఎప్పుడు భావిస్తే అప్పుడు తన పదవికి రాజీనామా చేసేసి, మళ్ళీ ప్రజా కోర్టులో తేల్చుకొంటానంటూ ప్రజల నెత్తిన ఎన్నికలు రుద్దడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప ఆ వ్యక్తిని నిలదీయాలనుకోరు. ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారడానికి తనని ఎన్నుకొన్న ప్రజల అనుమతి అవసరం లేదని భావిస్తే, ప్రజలు కూడా అవసరం లేదనే నమ్ముతారు. ప్రజా ప్రతినిధులు అన్నాక పార్టీలు మారకుండా ఉంటారా, అది రాజకీయాలలో సహజమే అని ప్రజల నమ్మేంతగా మన రాజకీయ పార్టీలు ప్రజలను మలుచుకోన్నాయి.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న9 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం చూస్తే, మన రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారి పోయాయో అర్ధం అవుతుంది. ఇంతకాలం వారు జగన్ మోహన్ రెడ్డి అనుచరులని తెలిసిఉన్నపటికీ, వారి మద్దతు అవసరం గనుక ఇష్టమున్నా లేకున్నా వారితో అంటకాగిన కాంగ్రెస్, పరిస్థితులను భేరీజు వేసుకొని వారిని బయటకి పంపడం ద్వారా తనకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమి లేదని నిర్దారించుకోన్నాక వారిని వదిలించు కోవాలనుకొంటే, ఇంతకాలం నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు అన్నీహుందాగా స్వీకరిస్తూ ఇప్పుడు ఎన్నికలు దగ్గిరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నుండి తమని బయటకి పంపడాన్ని కూడా రాజకీయంగా తమకి అనుకూలంగా మార్చుకొని, ‘ఈ కాంగ్రెస్ పార్టీలోంచి’ ‘ఆ కాంగ్రెస్ పార్టీలోకి’ మారనున్నారు. మళ్ళీ రేపు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీలు దగ్గరయితే, మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ భాయి భాయి అంటూ వారందరూ కలిసిపోయినా మనం ఆశ్చర్యపడనవసరం లేదు.   ఇది మన రాజకీయ పార్టీలన్నిటికీ వర్తించే సూత్రం. ఏపార్టీ ఎవరితోనయినా జత కట్టవచ్చును, విడిపోవచ్చును. ప్రజలు కూడా వాటి పొత్తులు, పోరాటాల గురించి ప్రశ్నించే బదులు ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారు ఎప్పుడు ఎందుకు విడిపోయారు అని మాత్రమే ఆలోచించే స్థాయికి ఎదిగిపోయారు గనుక, మన ప్రజాప్రతినిధులకి కూడా ప్రజలేమనుకొంటారో అనే టెన్షన్ లేకుండా హాయిగా పార్టీలు మార్చుకొంటూ, రాజీనామాలు చేసుకొంటూ, మధ్యంతర ఎన్నికలు పెట్టుకొంటూ ముందుకు సాగిపోతుంటే, ప్రతీ సారీ వెర్రి ప్రజలు చేంతాడంత వరుసలల్లో నిలబడి మళ్ళీ మళ్ళీ వారికే ఓట్లేస్తూ మన ప్రజాస్వామ్యాన్ని బహు చక్కగా కాపాడుకొస్తున్నారు.

కమల్ కు కష్టాలు తీరేనా..విశ్వరూపం విడుదలయ్యేనా?

  కర్ణుడు చావుకి వేయి కారణాలు, వేయి శాపాలు అన్నట్లుగానే కమల్ హస్సన్ విశ్వరూపం తమిళ్ వెర్షన్ సినిమా విడుదలకి కూడా వేయి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయన ఎంత పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నపటికీ ఆయన సినిమా కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు.   నిన్న మొన్నటివరకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అయన సినిమాకి సైందవుడిలా అడ్డుపడిందని అందరూ ఆరోపిస్తే కొంచెం వెనక్కి తగ్గిన ఆమె, తానే స్వయంగా ఆయనకీ, సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ముస్లిం నేతలకీ మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకు వచ్చారు. కమల్ హస్సన్ కూడా అందుకు చాలా సంతోషిస్తూ ఇక రేపోమాపో తన సినిమా విడుదల అయిపోతుందని భావిస్తూ, ముస్లిం నేతలు కోరినట్లు తన సినిమా నుండి వారు అభ్యంతరం చెప్పిన 9 నిమిషాల సన్నివేశాలు మొత్తం తీసేస్తానని ప్రకటించారు.   ఈ రోజు (శుక్రవారం) వారితో కలిసి విశ్వరూపం సినిమా చూసిన తరువాత వారు చెప్పిన సన్నివేశాలు తొలగించవలసిఉంది. అయితే, కమల్ హస్సన్ తనకు బదులుగా వేరే మరొకరిని పంపించడంతో ముస్లిం నేతలు ఆయన స్వయంగా వస్తే తప్ప సినిమా చూడమని చెప్పి వెళ్ళిపోయారు. తమిళనాడులో అందరికీ ఆరాధ్యుడయిన రజనీకాంత్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది.   ఇప్పటికే వారి ధోరణితో విసిగిపోయున్న కమల్ హస్సన్, వారితో కలిసి కూర్చొని వారు తన సినిమాలో తొలగించవలసిన సన్నివేశాలను ఒకటోకటిగా వారు చెప్పుకుపోతుంటే, అవి వినే ఓపిక నశించడంవల్లనే ఆయన వెళ్లి ఉండకపోవచ్చును. అయినా, వారు చెప్పినవి తొలగించేందుకు అంగీకారం తెలినప్పుడు, ఇంకా సమస్యని సాగదీయాలని వారు ప్రయత్నించడం ఎవరూ కూడా హర్షించరు. ఇదంతా చూస్తుంటే, తెగే వరకూ తాడు లాగకూడదని వారు గ్రహించకపోవడం వల్లనే ఈవిధంగా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. తన సినిమా విడుదల చేసుకోవాలనుకొంటే తప్పనిసరిగా వారి షరతులకు అంగీకరించక తప్పని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అయితే, ఆయనకీ అంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.   ఇది ఆయననే కాక, సినిమా పరిశ్రమకు చెందిన వారినందరినీ, ఆయన అభిమానులనీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు ఆర్ధికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన తన సినిమాకి, తన కృషికి ప్రశంసలు దక్కకపోగా, ఈ విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సినిమాయే విడుదలచేసుకోలేని దుస్థితి కల్పించినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. మరి ఈ కష్టాలు ఇంకా కొనసాగి సినిమా విడుదల కాకపొతే ఆయన ఏ తీవ్రనిర్ణయం తీసుకొన్న ఆశ్చర్యపోనవసరం లేదు.

టీఆర్ఎస్ కి మద్దతు పై చంద్రబాబు వివరణ

    సహకార ఎన్నికల్లో తెలంగాణ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరావు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన పై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వివరణ ఇచ్చారు . సహకార ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ టిడిపి పొత్తు పెట్టుకోదని చంద్రబాబు స్పష్టం చేశారు.   ఎర్రబెల్లి ప్రకటన తరువాత పార్టీ నేతల్లో గందరగోళం ఏర్పడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో అందరు కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సు లో ఎర్రబెల్లి తో మాట్లాడారని సమాచారం. టిడిపి పై టిఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తూన్న టైం లో ఎర్రబెల్లి ప్రకటన చేయడంతో పార్టీలో ఉత్కంఠ నెలకొంది. దాంతో టిడిపి అధినేత స్వయంగా రంగంలో దిగి వివరణ ఇవ్వడం విశేషం.

కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేల పై వేటు

        జగన్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే లని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. జగన్ వైపు వెళ్లిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే జగన్ గూటికి వెళ్లిన వారిలో ఆరుగురు మాత్రం ఓకే మరి మరో ముగ్గురు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ గూటికి వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని(ఏలూరు), సుజయ కృష్ణ రంగారావు(బొబ్బిలి), మద్దాల రాజేష్(చింతలపూడి), ద్వారంపూడి చంద్రశేఖర్(కాకినాడ సిటీ), పేర్ని నాని(మచిలీపట్నం), పెద్దిరెడ్డి(పుంగనూరు)లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరు ఓకే మరి మిగిలిన ముగ్గురు ఎవరన్న చర్చ జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం పేర్లు చెప్పేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే పిసిసి అధ్యక్షుడు ఆర్భాటంగా తొమ్మిది మంది అని చెప్పి పేర్లు ప్రకటించకపోవడం కాంగ్రెస్ బలహీనతగా కనిపిస్తుంది. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు.