తెలంగాణ ఎంపీల రాజీనామా ఎఫెక్ట్: ఢిల్లీ నుంచి పిలుపు

        తెలంగాణ అంశంపై రాజీనామాలకు సిద్దమయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఎంపీలందరూ ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు ఎంపీలు సిద్దమవుతున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎంపీలు కేకే నివాసంలో భేటీ అయ్యారు. రాజీనామా లేఖలను సోనియాకు అందించి వారం రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలు సిద్దమయ్యాయని ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వకుంటే రాజీనామాలు ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు ఎంపీ మధుయాష్కి తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అధిష్టానం సూచించిందని, రేపు ఢిల్లీలో  సోనియాను కలిసి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమిస్తున్నామని కేకే నివాసంలో భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు తెలిపారు.  తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి తమ నిర్ణయాన్ని అధిష్టాన పెద్దలకు వివరిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచామని, తమకు వయలార్ రవి, గులాం నబీ ఆజాద్ ఫోన్ చేశారని తెలిపారు.  

దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరనున్నాడా?

  1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిననాటి నుండీ 1996లో ఎన్టీఆర్ మరణించే వరకు పార్టీలో కొనసాగిన దేవినేని నెహ్రు, ఆ తరువాత పార్టీలోతనకు తీవ్ర ప్రతికూల పరిస్థితులేర్పడటంతో, తప్పని పరిస్థితుల్లో తెదేపాను వీడి, 1997 లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఆయనని అభిమానించేవారు చాలామంది ఉన్నారు. ఆ కారణం చేతనే, కొద్ది సం.ల క్రితం ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. గానీ, ఆయనను వ్యతిరేఖించే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అడ్డుపడటంతో దేవినేని కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.   అయితే ఆయన వర్గానికే చెందిన ప్రజలు అనేక మంది ఆయనను అభిమానిస్తున్నపటికీ, అయన కాంగ్రెస్ పార్టీలో జేరడంతో ఆయనకి దూరంగా ఉండిపోయారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో జేరడంవలన ఆయన తన వర్గానికి చెందిన ప్రజలను, అభిమానులను దూరం చేసుకొనగా, అటువంటి సమర్ధుడు, శక్తివంతుడయిన నేతని పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రనష్ట పోయింది. మరి చేసేదేమిలేక, అంబటి బ్రాహ్మణయ్యవంటి కులపెద్దను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించుకొని, యువకుడయిన దేవినేని ఉమాను కార్యదర్శిగా నియమించింది.   అయితే, అధికారానికి దూరమయిన ఈ 9 సం.లలో తెలుగుదేశం పార్టీకి ఒక విషయం స్పష్టంగా అర్ధమయింది. దేవినేని కుటుంబాన్ని దూరం చేసుకొన్నలోటును మరెవరూ కూడా పూడ్చలేరని అర్ధం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించలేకపోయినప్పటికీ, అయన సోదరుడు బాజీప్రసాద్ తనయుడు చంద్రశేఖర్‌కు స్థానికంగా యువతలో ఉన్న మంచి పేరు, మంచి ఫాలోయింగు దృష్ట్యా కనీసం ఆయననైనా తెలుగుదేశం పార్టీలోకి రప్పించాలని పాదయాత్రలో ఉన్న చంద్రబాబును పార్టీ శ్రేణులు కోరడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు సమాచారం.   అయితే, ఈ వ్యవహారాన్ని అయన స్వయంగా బాలకృష్ణకి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణకి, దేవినేని కుటుంబ ప్రతినిధులకీ మద్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రశేఖర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు సీటు ఇచ్చేందుకు పార్టీ అంగీకరించినట్లయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి అయన సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, అన్నీ సవ్యంగా జరిగినట్లయితే చంద్రబాబు పాదయాత్ర కృష్ణా జిల్లా సరిహద్దులు దాటకమునుపే, దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరే అవకాశాలు ఉన్నాయి.

పొన్నం చేసిన వేశ్య వ్యాఖ్యలపై మహిళా జేఏసీ ఫిర్యాదు

        రాజమండ్రి ఎమ్.పి ఉండవల్లి అరుణకుమార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పెద్దాపురం వేశ్యగా పోల్చడం పై సమైక్యాంధ్ర మహిళా జెఎసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ పట్టణంలోని మూడవ పట్ణణ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ను పొన్నం పెద్దాపురం వేశ్యతో పోల్చారు. ఆయన వేశ్యకన్న హీనమని పొన్నం విమర్శించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. పెద్దాపురం వేశ్య అని అన్న నేపథ్యంలో ఈ విధంగా మహిళలను కించపరచడం అన్యాయమని, మహిళల మనోభావాలను దెబ్బతీశారని మహిళా జేఏసీ తప్పుపట్టింది. తెలంగాణ కావాలంటే తెచ్చుకోవచ్చని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు స్థాయి దిగజారి మాట్లాడవద్దని వారు అన్నారు.

తెలంగాణకోసం రాజీనామాలు చేస్తాం: టీ కాంగ్రెస్‌ ఎంపీలు

        తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని తెలంగాణ ఎం.పి.లు నిర్ణయించుకున్నారు. వీరు పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.   పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఎం.పి.లు నిర్ణయం తీసుకున్నారు. ఈ లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధికే పంపించాలని వారు నిర్ణయించుకున్నారు. స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు. టి.ఆర్.ఎస్. 2014 ఎన్నికలే లక్ష్యంగా మాట్లాడుతున్నదని, కాని తాము మాత్రం తెలంగాణ ను సాధించే దిశగా అధిష్ఠానాన్ని నిలదీస్తామన్నారు.

మౌనమేలనోయి...ఈ మరపురాని రోజు

  అటు కేంద్ర సహకారం లేక, ఇటు రాష్ట్రంలోనూ మోర పెట్టుకొనేందుకు నాధుడు లేక, తెరాస బాధితులయిన తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ మరోమారు సమావేశమయ్యి తమ తదుపరి కార్యాచరణ రూపొందించుకోవడానికి సిద్దం అవుతున్నారు.   ఇంతవరకు ఏ తెరేసాతో వారందరూ అంటకాగేరో ఇప్పుడు అదే తెరాస నాయకులు తమను చీము నెత్తురు, సిగ్గు శరంలేని నాయకులని తిడుతున్నా కూడా వారు తమ పదవులను వదులుకొంటామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇంతకీ వారు తమ పదవులకి ఎందుకు రాజీనామా చేలేకపోతున్నారు? వారిని తమ పదవులని, పార్టీని వదిలిపెట్టనీయకుండా ఏమి అడ్డుపడుతోంది? పైకి చెప్పుకోలేని కారణాలు వారికి చాలానే ఉన్నాయి. వాటి గురించి తెరాస నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ, తెలియనట్లు నటిస్తూ వారిని పదవులు వదులుకోమని, వారికి తమ మద్దత్తు ఉంటుందని చెపుతున్నారు. అయితే ఇంతకీ ఆ బలమయిన కారణాలేమిటి?   తెరాస, జేయేసీ నేతల తిట్లకి ఉద్రేకపడి తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ పదవులను వదులుకొంటే మొదట నష్టబోయేది తామేనని వారందరికీ బాగా తెలుసు. ఆపని చేసిననాడు తమపై ఆధారపడిన ప్రభుత్వం కూలిపోవడం తధ్యం. తద్వారా పార్టీ అధిష్టానానికి కోపం తెప్పించడం, అది కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మంచిదికాదని వారికి తెలుసు. తెలంగాణాలో తెరాసా తప్ప వేరే ప్రత్యమ్నాయ పార్టీ లేకపోవడం, తెదేప, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీలలో జేరడానికి మనస్కరించకపోవడంవల్ల, మాట నిలకడలేని చంద్రశేకర్ రావును నమ్ముకోవడం కంటే, తమ పార్టీ అధిష్టానాన్ని నమ్ముకోవడమే మంచిదనే ఆలోచనతో వారు వెనకంజ వేస్తుండవచ్చును. ఒకవేళ దైర్యం చేసి పార్టీని వదిలిపెడితే, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి తప్ప వేరెవరికీ తలవంచనవసరం లేనంతగా స్వేచ్చ అనుభవించిన తాము, తెరాసాలో కేసీర్ కు, అతని కుటుంభానికి సలాములు చేస్తూ బ్రతకడం కష్టమని గ్రహింపుతోనే వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా అడుగువేయలేకపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయంగా తెలంగాణాలో తెరాస కాకుండా మరో బలమయిన పార్టీ ఏదయినా ఉండిఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఎప్పుడో రాజీనామాలు చేసేసి పార్టీ వదిలిపెట్టేవారు.   ఇక మరో బలమయిన కారణం ఏమిటంటే, ప్రస్తుతం పార్టీ అధిష్టానం తెలంగాణా సమస్యని పరిష్కరించేందుకు నిజాయితీగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈ తరుణంలో, కేసీర్ వంటి వారి మాటలకులొంగి ఇబ్బందులు కొనితెచ్చుకోవడం కంటే, మరి కొంత కాలం ఒపికపడితే, పార్టీ తెలంగాణాగానీ ప్రకటిస్తే, పరిస్థితులు అన్ని చక్కబడుతాయనే నమ్మకంవల్లనే వారు తమ పదవులను అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుండవచ్చును.   పదవి లేన్నప్పుడు తమ స్వంత పార్టీ వారికే కాకుండా తెలంగాణా ఉద్యమనేతలకి కూడా అలుసుగానే కనిపిస్తారనేది మరో చేదు నిజం. ఒకవేళ పార్టీ అధిష్టానం తెలంగాణా ఇచ్చినట్లయితే, తమ పార్టీలోనే తెరాస విలీనమయితే, అప్పుడు పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకి పార్టీలోకి కొత్తగా వచ్చిన కేసీర్, కేటీర్,హరీష్ రావువంటి వారిపై తమదే పైచేయి అవుతుంది, వారికి తాము సలాములు చేస్తూ బ్రతుకవలసిన అగత్యం కూడా ఉండదనే ఆలోచన కూడా తెలంగాణా కాంగ్రెస్ నేతలను పార్టీకి, పదవులకి అంటిపెట్టుకు ఉండేలాచేస్తోందని భావించవచ్చును. కానీ, ఇటువంటి ఆలోచనలను పైకి చెప్పుకొనే అవకాశం వారికి లేదు గనుక మౌనంగా నిందలు భరిస్తున్నారు.

హోంమంత్రి షిండే, చిదంబరం పై 420 కేసు

        ఆర్ధిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ల పై ఎల్బీనగర్ పోలీసులు 420 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశం మీద ఏ విషయం వెల్లడిస్తాం అని గడువు విధించి మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ వాదులు రంగారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. తెలంగాణ అంశం మీద ఇచ్చిన మాట తప్పి వేలాది మంది ఆత్మహత్యలకు కారణం అయ్యారని, అప్పటి హోంమంత్రి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి చిదంబరం, ఇప్పుడు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు గడువుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారిమీద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.  దీనిమీద విచారించిన కోర్టు మంత్రుల మీద 420 కేసులు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై నెలరోజుల్లో తేలుస్తామని గత నెల 28న అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  అన్నారు. ఈ రోజుతో ఆ గడువు ముగిసిపోయింది. ఓ రోజు ముందే ఆయన తెలంగాణ అంశం తేల్చేందుకు మరింత సమయం కావాలని, మరిన్ని చర్చలు జరగాలని అన్న నేపథ్యంలో న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.

"సమరదీక్ష"వద్ద టి ఉద్యోగుల అత్యవసర భేటి

        ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న సమరదీక్ష వేదిక వద్ద తెలంగాణ ఉద్యోగులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆదివారం ఆజాద్, షిండేల వ్యాఖ్యల అనంతరం నెలకొన్న పరిస్థితులపై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 100 రోజుల సమ్మెను చెప్పట్టే దిశగా ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని మరుగున పడేస్తుందని, అందుకే ఈ సమయంలోనే కేంద్రం మీద వత్తిడి పెంచేలా కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారు. ఇంతకుముందే 100 రోజుల సమ్మెకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులను సంసిద్దం చేశారు. ఇప్పుడు మరింత నాన్చివేత ధోరణి నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.

"సమరదీక్ష"కు సబిత అనుమతి

        తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించనున్న "సమరదీక్ష"కు పోలీసులు అనుమతినిచ్చారు. 36 గంటల దీక్షకు అనుమతించకుండా అడ్డుకోవడంతో తెలంగాణవాదులు ఆందోళన బాట పట్టారు. ఎంఎల్ సీ చుక్కా రామయ్య, ప్రజా గాయకుడు గద్దర్ అనుమతి కోసం హోంమంత్రిని ఆశ్రయించారు. దీంతో హోంమంత్రి సబిత సమర దీక్షకు అనుమతిని ఇచ్చారు. వినతి పత్రాన్ని సైబరాబాద్ కమిషనర్‌కు ఇవ్వాలని సూచించారు. సోమవారం సాయంత్రం వరకు దీక్ష చేసుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ సూచించారు. దీక్షకు పోలీసుల అనుమతి లభించడంతో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు, విద్యార్థులు, తెలంగాణవాదులు ఇందిరాపార్క్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సమరదీక్ష ప్రాంగణం తెలంగాణవాదులతో నిండిపోయింది.  

కేటీఆర్‌, స్వామిగౌడ్‌ అరెస్ట్

        తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించ తలపెట్టిన ‘సమరదీక్ష’ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ నేతలను అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమరదీక్షను నిర్వహించి తీరుతామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. నిర్బంధం ద్వారా దీక్షను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు ఆదివారం సాయంత్రంలోగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఫిబ్రవరిలో ‘చలో హైదరాబాద్’ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. అసెంబ్లీ నుంచి జేఏసీ కార్యాలయం వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో టీఎన్‌జీవో జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ కార్యకర్తలను, టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులను పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. వీరిని గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఖైరాతాబాద్ చౌరస్తాలో రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. రాజ్‌భవన్ రోడ్డుని పూర్తిగా మూసేసిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు. గన్‌పార్క్ వద్దకు కార్యకర్తలో చేరుకున్న టీఆర్‌ఎస్ నేత స్వామిగౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అరెస్టులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దానికి తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.  

కృష్ణాజిల్లా యాత్రలో బాబును పరామర్శించిన కుటుంబసభ్యులు

        కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును కంచికచర్లలో సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, సోదరి హైమావతి, మరదులు ఇందిర, మేనల్లుడు ఉదయ్, ఎన్టీఆర్ కుమార్తెలు, కోడళ్లు, ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రకు విరామం ఇవ్వాలని కోరమాని అయితే చంద్రబాబు అంగీకరించలేదన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని బాబు చెప్పినట్లు ఆమె తెలిపారు. చంద్రాబాబు మానసికంగా బలంగా ఉన్నారని, నడుము, కాలినొప్ప చంద్రబాబుకు తాత్కాలికమే అని ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ తెలిపారు.

తప్పు చేసి బాబును తప్పుపట్టిన బొత్స

  పీసిసి అధ్యక్షులుగా యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన బొత్స సత్యనారాయణ నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్ర మహా సభలో పాల్గొనడం మొదటి తప్పయితే, హిందీ వాళ్ళకి పది రాష్ట్రాలు ఉన్నపుడు తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని లౌక్యంగా ప్రశ్నిస్తూ పార్టీలో తెలంగాణావాదులనుండి ఇబ్బందులు రాకుండా ఇంతవరకు కాలక్షేపం చేసేసిన ఆయన సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభలో పాల్గొంటూ పరోక్షంగా వారికి తన మద్దతు ప్రకటిస్తూ, సభలో చంద్రబాబును లక్ష్యం చేసుకొని ప్రసంగించడం మరో తప్పు. చంద్రబాబు రెండుకళ్ళ సిద్దాంతం అంటూ ఇంతకాలం కాలక్షేపంచేసి హటాత్తుగా ప్లేటు పిరాయించి తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇవ్వడాన్ని అయన తప్పు పట్టారు. అయితే తానూ ఆ సభకి వచ్చి తన రెండు రాష్ట్రాల వాదనను వదిలిపెట్టి సమైక్యాంద్రా వైపు ప్లేటు పిరాయిన్చినట్లు మాత్రం అయన బహిరంగంగా ప్రకటించకపోయినా ఆ విషయాన్ని తెలంగాణా వాదులు మాత్రం బాగానే అర్ధం చేసుకొన్నారు. పార్టీ అధ్యక్షపదవిలో ఉంటూ యావత్ రాష్ట్ర పార్టీకి బాద్యత వహించవలసిన అయన సమైక్యాంద్రావాదుల సభకి హాజరవడం తెలంగాణా వాదులు బాహాటంగానే ఖండించారు కూడా.

సందిగ్ధంలో కాంగ్రెస్ నేతలు

  తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం అవసరమన్న గులాం నబీ ఆజాద్ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కిపోయింది. ఇంతవరకు డిల్లీచుట్టూ తిరిగిన రాజకీయాలు మళ్ళీ స్వంత గూటికి చేరుకాగానే కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.   సీమంద్రా కాంగ్రెస్ నేతల పరిస్థతి కొంత బాగున్నపటికీ, తెలంగాణా కాంగ్రెస్ నేతల పరిస్థితి మాత్రం చాల దారుణంగా ఉందిప్పుడు. తెలంగాణా ఉద్యమానికి పూర్తి పేటెంటు హక్కులు పొందినట్లు ప్రవర్తిస్తున్న తెరాస నేతలు, కాంగ్రెస్ నాయకులపై కూడా హక్కులు కలిగిఉన్నట్లు చాలా అవమానకర రీతిలో మాట్లాడుతూ, వెంటనే పదవులకు రాజీనామాలు చేయాలంటూ ఆజ్ఞాపిస్తున్నారు. ఇటువంటి విపరీత ధోరణి అంటురోగంలా సమైక్యాంధ్రకి కూడా పాకిందిపుడు.     అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, సమాజంలో హోదా, పదవులు ఇత్యాదులన్నీ పొందిన కాంగ్రెస్ నేతలు మాత్రం, తమను తమ పార్టీని ఘోరంగా అవమానిస్తూ, బెదిరిస్తున్న ఉద్యమనాయకులకు దీటుగా జవాబు చెప్పకపోగా, కొందరు ఆత్మగౌరవం మరిచి తమ రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని వారిచుట్టూనే తిరుతున్నారు. ఒకవైపు తమ పార్టీ అధిష్టానం నిజాయితీగా సమస్య పరిష్కారినికి చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని తెలిసిఉన్నపటికీ తమను, తమ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా అవమానిస్తూ, బెదిరింపులకి పాల్పడుతున్న ఉద్యమనాయకులను నిలదీయలేక బిత్తర చూపులు చూస్తున్నారు. అది తెలంగాణానా ఉద్యమమా లేక సమైక్యాంధ్ర ఉద్యమమా అన్నదానితో సంబంధం లేకుండా కాంగ్రెస్ వాదులందరూ ఒకే కుటుంబముగా వ్యహరించి, తమ పార్టీపై దాడిచేస్తున్నవారిని సమర్ధంగా ఎదుర్కోనవలసిన తరుణంలో తమలో తామే తిట్టుకొంటూ అందరి ముందూ చుకన అవుతున్నారు..   ఇటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ వాదులు తమ పార్టీని రక్షించుకోలేకపోతే, దానివల్ల అంతిమంగా నష్టపోయేదివారే తప్ప వేరొకరు కారని గ్రహించాలి. ఉద్యమనాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారేబదులు తామే సమస్యకి పరిష్కారం చూపగలమనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయవలసిన తరుణం ఇది. ఎందుకంటే, ఉద్యమనాయకులు ఉద్యామాలు చేయగలరు, ప్రభుత్వం పై ఒత్తిడి తేగలరు తప్ప సమస్యని పరిష్కరించలేరు. ఆ పని చేయవలసింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ తప్ప ఉద్యమనాయకులు మాత్రం కారు.   అందువల్ల డోలాయమానంలో ఉన్న కాంగ్రెస్ వాదులందరూ తమను, తమకు అన్నం పెట్టి ఆదరించిన కాంగ్రెస్ పార్టీని ఉద్యమనాయకుల బారినుండి కాపాడుకోవలసిన బాద్యత తమ మీదే ఉందని గ్రహించాలి. తమను నిర్దేసించవలసింది తమ పార్టీ అధిష్టానం తప్ప ఉద్యమ నాయకులుకారని వారు గ్రహించి పార్టీని తద్వారా తమని తాము కాపాడుకోవాలిసిన తరుణం ఇది.

కాలి నొప్పితో పాదయాత్ర కొనసాగిస్తున్న బాబు

        కాలి నొప్పితో బాధపడుతూనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన ఎడమకాలు చిటికెన వేలుకి వాపు వచ్చింది. అయినా కుంటుతునే నెమ్మదిగా పాదయాత్ర చేస్తున్నారు. బాబును కలిసిన టీడీపీ నేతలు జనవరి 26తో యాత్రను ముగించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర ముగించాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన బాబు యాత్ర ముగించేది లేదని స్పష్టం చేశారు. 'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి 116వరోజుకు చేరుకుంది.  కృష్ణా జిల్లాలో ఐదో రోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నందిగామ శివారులోని అంబారిపేట నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి యాత్రను కొనసాగిస్తానని, ఆపే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. కాలు నొప్పి బాగానే ఉందని, నడుము నొప్పికూడా వస్తుందని, అయినా యాత్ర కొనసాగించాలని ఉందని అన్నారు. కాలి నొప్పి కారణంగా నిదానంగా పాదయాత్ర చేస్తున్నారు. బాబు యాత్రకు మహిళలు, నేతలు, కార్యకర్తలు, చిన్నారులు స్వాగతం పలుకుతున్నారు.

మాకూ చీము నెత్తురుంది, ప్రభుత్వాన్ని కూల్చగలం: కోమటిరెడ్డి

        రాజీనామాల బెదిరింపులతో సీమాంధ్ర నేతలు ఈ నెల 28న తెలంగాణపై ప్రకటన రాకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. మాకూ చీము, నెత్తురు ఉంది. ఈ నెలలో తెలంగాణ రాకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.   ఈ రోజు కేసీఆర్‌తో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మున్ముందు కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. వాయిదాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కేంద్రం తెలంగాణ ఇస్తుందో లేదో అని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటనపై ఎల్లుండి వరకూ వేచి చూస్తామని, ప్రకటన వెలువడకుంటే 28 తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు.

కేసీఆర్ తో కోమటిరెడ్డి భేటీ, టీఆర్ఎస్ లోకి జంప్?

        కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ తో తెలంగాణ ఉద్యమ భవిష్యత్ పరిణామాలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నా, ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. కోమటిరెడ్డి మొదట జగన్ పార్టీలో చేరాలని భావించినా తెలంగాణ పట్ల ఆ పార్టీ వైఖరి స్పష్టంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో టీఆర్ఎస్ లో చేరడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. నల్లగొండ జిల్లాలో గట్టి పట్టున్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ నల్లగొండలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది.  మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం తన లక్ష్యంగా పోరాడుతున్నారు.

బాబు ఆదేసిస్తే పరిటాల శ్రీరామ్ పోటి

      తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటి చేస్తాడని పరిటాల సునీత పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర ఎనిమిదో వర్ధంతి సంధర్బంగా వెంకటాపురంలోని ఆయన సమాధి వద్ద కుటుంబసభ్యులు ఘనంగానివాళులర్పించారు. అటు టీడీపీ జిల్లా కార్యాలయంలో నేతలు పరిటాల రవికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిటాల రవి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడతానన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీరామ్‌ను కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్ని కేసులో ఇరికించారని సునీత ఆరోపించారు.  

రాహుల్ ది ఐరన్ లెగ్గు:మైసూర

  ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేయడం గురించి ముందు మాట్లాడి, ఆ తరువాత పొత్తుల గురించి కాంగ్రెస్ మాట్లాడి ఉంటే వారు కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉండేదేమో. నిన్నజగన్ బెయిలు పిటిషనుపై జరిగిన విచారణలో, ప్రభుత్వం తమకు సహకరించడం లేదనే నెపంతో సిబిఐ జగన్ బెయిలు రాకుండా చేయడంతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ దురుదేశ్యం బయటపడిందని యస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీకి చెందిన మైసూరా రెడ్డి వంటి నేతలు తమ నాయకుడిని జైల్లో బందించి పొత్తుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.   రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూర రెడ్డి స్పందిస్తూ, “వరుసగా మూడు రాష్ట్రాలలో పార్టీని ముంచిన రాహుల్ గాంధీని ఇప్పుడు నాయకుడిగా చేసుకొని, మళ్ళీ ఎన్నికలకి సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఆయనది ఐరన్ లెగ్గని తెలిసీ కూడా కాంగ్రెస్ ఆయనకు నాయకత్వం కట్టబెట్టడం చూస్తుంటే, ఆ పార్టీ తానూ మునగడమే గాకుండా ఏకంగా దేశాన్నికూడా ముంచేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ పరిస్థితికన్నా దారుణంగా ఉందని” మైసూరా అన్నారు.   ఇక మజ్లిస్ పార్టీతో స్నేహం కోరుకొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతల అరెస్ట్ పై సానుభూతిగా స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ఉపసంహరించినందుకే ఇటువంటి వేధింపులకి పాల్పడుతోందని” మైసూరా అన్నారు.

గడ్కారి పాయసం గిన్నెలో పిడక వేసిన కాంగ్రెస్

  మేధోమధనంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే నీతులు అక్కడివరకే పరిమితం అని మరోసారి ఆపార్టీ నిరూపించింది. భారతీయపార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారి ఈరోజు మళ్ళీ రెండోసారి పార్టీ అధ్యక్షపదవి చేపట్టనున్న తరుణంలో, మహారాష్ట్ర ఆదాయపన్ను శాఖ ఆయనకి నోటీసులు జారీచేసింది. ఆయన తన నామినేషను పత్రాలు సమర్పించే రోజునే అంటే బుదవారంనాడే, ఆయనని తమ ముందు హాజరయి ఆయనకు చెందిన పూర్తీ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకల గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిన్న మద్యాహ్నం వరకూ కూడా తానే మళ్ళీ అధ్యక్ష పదవి చేపడతానని కలలుగన్న నితిన్ గడ్కారి కాంగ్రెస్ దెబ్బకి వెనక్కి తగ్గక తప్పలేదు.   అయన రెండో సారి అధ్యక్ష పదవి చెప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నమరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తానూ కూడా బరిలో దిగుతానని ప్రకటించడంతో, పోటీ వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన భారతీయపార్టీ అధిష్టానం, అందరికీ ఆమోదయోగ్యుడయిన మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పేరును నిన్న రాత్రి ప్రతిపాదించడంతో పరిస్థితి సద్దుమణిగింది.   కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత వ్యవహారాలలో ఈవిధంగా వేలు పెట్టి ఆడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిరసించింది. సరిగ్గా సమయం చూసుకొని పావులు కదిపి తమ పార్టీని రచ్చ కెక్కించినందుకు భారతీయపార్టీ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడుతోంది.   అయితే, ఇల్లు కాలుతోందని భారతీయ జనతా పార్టీ ఏడుస్తుంటే, చుట్టకి నిప్పు దొరికిందని సంతోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలు యధావిధిగా ఖండించడమే గాకుండా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టినందుకు చంకలు గుద్దుకొట్టుకొంటోంది.   గడ్కారి మాత్రం తన పాయసం గిన్నెలో కాంగ్రెస్ ఈ విధంగా పిడక వేయడంతో విలవిలలాడుతూ తాను నిర్దోషినని నిరూపించు కోనేంతవరకు పార్టీలో ఏపదవి చేపట్టనని, తన వల్ల పార్టీ ప్రయోజనాలకు భంగం కలగరాదనే ఉద్దేశంతోనే తానూ అధ్యక్షపదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపారు. మొన్న జైపూరులో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పటిన తరువాత ఉద్రేకంగా నీతులు చెప్పిన రాహుల్ బాబు ఇప్పుడు దీనిని ఏ నీతి అంటారో ఆయనే వివరించాలి.