సంజయ్ దత్ విడుదల.. అప్పుడే హైకోర్టులో పిటిషన్

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఎరవాడ జైలు నుండి విడుదలయ్యారు. అక్రమాయుధాల కేసులో ఐదేళ్లు జైలు జీవితం గడిపిన ఆయన ఈరోజు  విడుదలయ్యారు. అయితే ఆయన అలా విడుదలయ్యాడో లేదే అప్పుడే అతని విడుదలపై ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  మహారాష్ట్ర సామాజిక ఉద్యమాకారుడు ప్రదీప్ బలేకర్ మున్నాభాయ్ విడుదలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో చాలామంది పేద నేరస్థులు ఉన్నారు.. వాళ్లు కూడా సత్ప్రవర్తనతోనే ఉంటున్నారు.. అయినా కాని వారిని విడుదల చేయడంలేదు.. సంజయ్ దత్ ఒక వీఐపీ అన్న కారణంగానే అతనిని సకల మర్యాతలతో విడుదల చేశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ పిటిషన్ కూడా ఈరోజే విచారణకు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ బలేకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసే అవకాశం ఉందని మహారాష్ట్ర న్యాయవాదులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కడప జిల్లాలో లోకేశ్ రెండో రోజు పర్యటన.. మకాం వేసిన జగన్..

  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్  కడప జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన జిల్లాలోని పలు నియోజక వర్గాల వారితో  సమన్వయ సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతేకాదు లోకేష్‌ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరనున్న్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఊరు పులివెందులలో మకాం వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కీలకమైన నేతలు పార్టీ నుండి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలను కాపాడుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి,  అంజాద్‌ బాషాలు టీడీపీలో చేరతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే జగన్ వారితో చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సంజయ్ దత్ విడుదల.. జైలుకి సెల్యూట్..

  బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలు శిక్ష ముగియడంతో ఈ రోజు విడుదలయ్యారు. ఎరవాడ జైలు నుంచి సంజయ్ దత్ విడుదలయ్యారు.అక్రమాయుధాల కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ దత్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించంగా..42 నెలలపాటు ఆయన జైలు జీవితాన్ని గడిపాడు. సత్ర్పవర్తన కారణంగా కేంద్రంప్రభుత్వం సంజయ్ దత్ శిక్షా కాలాన్ని తగ్గించగా.. 8 నెలల ముందే సంజయ్ దత్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు నుండి బయటకు వచ్చిన ఆయన కారాగారానికి సెల్యూట్ చేశాడు. భుజానికి బ్యాగు, చేతిలో ఫైలుతో 'ఖల్ నాయక్ బయటకు రాగానే  అభిమానులకు అభివాదం చేసి వెంటనే కారులో పుణే ఎయిర్ పోర్టులో చేరుకున్నాడు.

తగలబెడుతుంటే చూస్తూ ఊరుకోం- సుప్రీం ఆగ్రహం

  మన దేశంలో ఏ వర్గంవారికి ఏ విషయంలో కోపం వచ్చినా, తక్షణం తమ ఆగ్రహాన్ని ప్రభుత్వ ఆస్తుల మీద చూపిస్తుంటారు. మొన్నటికి మొన్న తునిలో తగలబడిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ అయినా, ఈ వారంలో హర్యానాలో తగలబడుతున్న ప్రభుత్వ భవనాలైనా దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ తతంగం అంతా చూసిన సుప్రీంకోర్టుకి ఒళ్లు మండినట్లుంది. ‘ఇక మీదట అలాంటి చర్యలకు పాల్పడేవారి మీద తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. దీని కొసం కొన్ని నిబంధనలను రూపొందించాలి’ అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.   గుజరాత్‌లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లను కల్పించాలంటూ గత ఏడాది హార్ధిక్‌ పటేల్ అనే నాయకుడి ఆధ్వర్యంలో అక్కడి ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ధ్వంసం చేశారు. ఆ కేసుని ఇవాళ విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను చేసింది. ‘ప్రభుత్వానికి లేదా పౌరులకు సంబంధించిన ఆస్తులను మీరు ఇలా ధ్వంసం చేస్తూ పోలేరు. ఆందోళనలు చెలరేగినప్పుడు ఇలాంటి విధ్వంసానికి పాల్పడేవారిని మనం తప్పకుండా వారి చర్యలకు బాధ్యులను చేయవలసి ఉంటుంది’ అంటూ సుప్రీం పేర్కొంది. సుప్రీం అన్న మాటలు బాగానే ఉన్నాయి. కానీ తమ మీద కేసులు ఎత్తేయాలంటూ నేతలు మళ్లీ నిరాహారదీక్షకు దిగితే ప్రభుత్వాలు ఏం చేసేది!

రాజ్యసభ రేపటికి వాయిదా..

రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన దగ్గర నుండి రోహిత్ ఆత్మహత్యపై ఇరు పక్షాల మధ్య వాదనలు జరగుతూనే ఉన్నాయి. రోహిత్ ఆత్మహత్యపై విపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఒకపక్క రోహిత్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం కూడా విపక్షాలపై మండిపడ్డాయి. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో సభను రేపటికి వాయిదా పడింది.

దిల్లీ విమానాశ్రయానికి వీధికుక్కల బెడద

  దిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఆషామాషీ కాదు. దేశవిదేశాల ప్రముఖులంతా అక్కడి నుంచే తన ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. అలాంటి ఎయిర్‌పోర్టుకి ఇప్పుడు ఊహించని బెడద వచ్చింది. లెక్కకు మిక్కలిగా ఎయిర్‌పోర్టు రన్‌వే దగ్గర తిరుగుతున్న ఊరకుక్కలే ఆ బెడద! విమానం దిగి ఠీవిగా నడుచుకుంటూ వెళ్లే ప్రయాణికుల వెంట కుక్కలు పడటంతో విమానాశ్రయం పరువు పోతోందని అధికారులు వాపోతున్నారు.   అంతేకాదు! మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తీవ్రవాదులు బాంబులని పేల్చేందుకు ఈ కుక్కలని కూడా వాడుకునే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఈ విషయమై దిల్లీ నగరపాలిక సంస్థకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందట. మారిన జంతురక్షణ చట్టాల ప్రకారం ఒకప్పటిలా కుక్కలను పట్టుకుని వేరేచోటకి తరలించడం సాధ్యం కాదని చేతులెత్తేశారట నగరపాలక అధికారులు. కాకపోతే మరీ తీవ్రవాదులూ, బాంబులూ అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తామని భరోసా ఇచ్చారట!

నాటకంలో కత్తి... నటుడినే చంపేసింది!

  నాటకంలో అపశృతులు దొర్లడం సహజం. కానీ అది నటుల ప్రాణాల మీదకే రావడం చాలా అరుదుగా జరుగుతుంది. దురదృష్టవశాత్తూ ఒకే నెలలో ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. ఈ నెల మొదటివారంలో ఇటలీలోని రాఫెల్ అనే నటుడు ఉరికి వేలాడుతున్నట్లు నటించబోయి తాడు బిగుసుకుపోవడంతో మరణించాడు. తాజాగా జపాన్‌లో ‘డియాగో కసీనో’ అనే నటుడు ఒక నాటకం కోసం జరుగుతున్న రిహార్సల్స్‌లో కత్తిపోటుకు గురై చనిపోయాడు. టోక్యోలోని ఓ స్టుడియోలో జరిగిన ఈ సంఘటనలో ఓ సంప్రదాయ కథకి సంబంధించిన నాటకం కోసం అభినయిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డియోగో తన సహనటుడితో కలిసి కత్తియుద్ధానికి సంబంధించిన సన్నివేశంలో నటిస్తుండగా, ఎదుటి వ్యక్తి చేతిలో ఉన్న కత్తి కాస్తా డియోగో పొట్టని చీల్చుకుపోయింది. దాంతో అతను మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా, లేకపోతే దీని వెనుక ఏదన్నా కుట్ర ఉందా అన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గవర్నమెంటుకి నేనంటే దడ- రాహుల్‌గాంధి!

  పార్లమెంటులోని ఉభయసభలూ రోహిత్‌ వేముల ఆత్మహత్య గురించీ, కన్నయా కుమార్‌ అరెస్టు గురించీ దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈసారి సభలో ఎలాగైనా మాట్లాడి తీరేందుకు రాహుల్‌గాంధి మహా ఉత్సాహంగా ఉన్నారు. ఒకవేళ అధికార పార్టీ తనని మాట్లాడనిస్తుందా అన్న అనుమానం కూడా రాహుల్‌గారి మనసులో బయల్దేరినట్లుంది. ‘నేను తప్పకుండా మాట్లాడి తీరతాను. కానీ నేను చెప్పబోయే విషయాల గురించి ప్రభుత్వం చాలా భయపడుతోంది.   అందుకని వాళ్లు నన్ను మాట్లాడనిస్తారని అనుకోను’ అంటూ ముందుగానే ఓ సూచనను విలేఖరులకు అందించారు. రోహిత్‌ వేముల చనిపోయిన తరువాత హుటాహుటిన రాహుల్ గాంధి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకి చేరకుని, రోహిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో వివాదం మొదలైనప్పుడు కూడా రాహుల్ అక్కడికి చేరకుని విద్యార్థులకి తన నైతిక మద్దతుని అందించారు. తాను కూడా అవసరమైనప్పుడు చురుకుగా పాల్గొనగలననీ, నేర్పుగా వ్యవహరించగలననీ రాహుల్‌ ఈ సందర్భంగా తెలియచేసేందుకు ప్రయత్నించారు. ఈసారి నేరుగా పార్లమెంటులోనే తన తడాఖాని చూపించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. చూడాలి మరి!

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

  రేపు తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28 నుండి మార్చి 28 వరకూ అభ్యర్ధులు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మార్చి 28 వరకూ ఎలాంటి తరువాత ధరఖాస్తు చేసుకుంటే ఫైన్ కట్టాల్సి ఉంది. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ. 5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 10000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 3 నుంచి అదే నెల 13 వరకు అవకాశం హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 24 నుంచి 30 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మే 2న ఎంసెట్ పరీక్ష మే 3న ప్రాథమిక కీ విడుదల మే 12 ర్యాంకుల ప్రకటన

బాబా రామ్‌దేవ్‌కు 600 ఎకరాలు!

  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు 600 ఎకరాల భూమిని అందించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికీ, రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి సంస్థకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ భూమిలో పతంజలి సంస్థ అరుదైన ఔషధులను పెంచనున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా ఉండే గిరిజనులను కూడా భాగస్వాములను చేయనున్నారట. నారింజ తోటలను పెంచడం, అటవీ భూములలో ఇప్పటికే సహజసిద్ధంగా లభిస్తున్న తేనె వంటి ఉత్పత్తులను సేకరించడం, కొత్తగా మరిన్ని ఔషధి మొక్కలను పెంచడం... ఇవీ ఈ 600 ఎకరాలలో రామ్‌దేవ్‌ బాబా తలపెట్టిన కార్యక్రమం!   ఈ ప్రణాళిక కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల కనీసం 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పతంజలి చెబుతోంది. కానీ విపక్షాలు మాత్రం ప్రభుత్వం ఇలా వందలాది ఎకరాలను స్వామీజీవారికి చవక ధరకు ధారాదత్తం చేయడం ఏంటంటూ మండిపడుతున్నాయి. ఇటు మహారాష్ట్రలోనూ, అటు కేంద్రలోనూ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి... రామ్‌దేవ్‌గారికి భూములను కట్టబెడుతున్నారంటూ ఆరోపిస్తున్నాయి.

హీరోయిన్ ని రేపు చేసిన డైరెక్టర్.. ఎక్కడ..?

సినిమాలో ఛాన్స్ లు ఇస్తానని చెప్పి ఓ డైరెక్టర్ పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోడ‌ల్ ను రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం పాకిస్తాన్‌కు చెందిన టాప్ మోడ‌ల్ సినిమా అవకాశాల కోసం ఇండియాకు వచ్చి ముంబైలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె శ్యామ్ చరణ్ అనే భోజ్‌పురి ద‌ర్శ‌కుని క‌లిసి అవకాశం కోసం అతని వెంటపడింది. అయితే ఇదే అదను చూసుకొని అతను ఆమెపై కన్నేసి సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆమె దగ్గర ఉన్న దాదాపు 35 లక్షలను దోచుకోవడంతో పాటు ఆమెను అత్యాచారం కూడా చేశాడు. ఇక అప్పటికి కాని తాను మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది. శ్యామ్ చరణ్ తనను మోసం చేశాడని.. డబ్బులు చెల్లించమని అడిగితే బెదిరిస్తున్నారని.. త‌న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు శ్యామ్‌ను అరెస్టు చేశారు.

జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో ఎమ్మెల్యే జంప్

  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డకి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీ నుండి పలువురు నేతలు టీడీపీ లోకి చేరి ఆయనకు షాకిచ్చారు. అసలే దెబ్బ తగిలి ఉన్న జగన్ కు మరో దెబ్బ తగులుతోంది. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు వైసీపీకి గుడ్ బై చెప్పి.. సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. మరికొంత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఉల్లిని కోస్తే కాదు... అమ్మితే కన్నీళ్లు!

  ఉల్లిగడ్డలు ఈసారి రైతులకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లకు చేరుస్తున్న ఉల్లిగడ్డలని ఒక దశలో కిలో 1.5కి కూడా రైతులు అమ్ముకోవల్సిన పరిస్థితి వస్తోంది. తెలంగాణను ముంచెత్తిన కరువు ఇందుకు ఒక కారణం కాగా, మహారాష్ట్ర నుంచి వెల్లువగా వస్తున్న ఉల్లి దిగుమతులు మరో కారణంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఉల్లికి విపరీతంగా ధరలు లభించడంతో ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి మరీ తెలంగాణ రైతులతో ఉల్లిని సాగు చేయించింది.   కానీ కరువు కారణంగా సాగుకు తగిన నీరు లభించలేదు. దాంతో ఉల్లిగడ్డ పరిమాణం చాలా చిన్నదిగా ఉండిపోయింది. మరోవైపు మహారాష్ట్రలో కూడా ఉల్లిగడ్డలను విపరీతంగా పండించడంతో, అక్కడి మార్కెట్‌లో ఉల్లి ధరలు క్వింటాలుకి 500కి తక్కువగా జారిపోయాయి. వాటన్నింటినీ ఇప్పడు హైదరాబాదుకి తరలించడం మొదలుపెట్టారు మహారాష్ట్ర రైతులు. ఫలితం! నాణ్యత బాగున్న మహారాష్ట్ర ఉల్లి క్వింటాలుకి 1000-1400 పలుకుతుండగా, ఇక్కడ పండించిన ఉల్లిన మాత్రం నాణ్యత బాగోలేదంటూ క్వింటాకు 150-700 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఉల్లిరైతుకి తగిన గిట్టుబాటు ధరని చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. అప్పటిదాకా ఉల్లిరైతుకి కన్నీరు తప్పేట్లు లేదు!

ఉత్తర ప్రదేశ్ సీఎంగా స్మృతీ ఇరానీ..!

  టీవీ నటిగా బుల్లితెర మీద మంచి పేరు సంపాదించుకొని.. అనేక సంచనాలు సృష్టించిని స్మృతీ ఇరానీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అనంతరం నటనకు స్వస్తి చెప్పి రాజకీయ ప్రవేశం చేసి ఎంపీగా పోటీ చేసింది. అయితే ఎంపీగా గెలవకున్నా కానీ ఆమె కేంద్రమంత్రి అయ్యారు. అది కూడా మోడీ కేబినెట్‌లో కీల‌క‌మైన మాన‌వ‌వ‌న‌రుల శాఖ‌కు.. అందులోనూ.. మొదటి ప్రయత్నంలోనే. అయితే గతంలో ఆమె ఆమోధీ నుండి పోటీ చేసి రాహుల్ గాంధీకి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు మరో అవకాశం రానున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెల‌ల్లో ఉత్తర ప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో యూపీ సీఎంగా స్మృతీ ఇరానీని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోందట. ఇప్పటికే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా గెలిచి తమ జెండా ఎగరేయాలని చూస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలకు సుప‌రిచితురాలైన‌, అన‌ర్గ‌ళంగా మాట్లాడే స్మృతిని యూపీ బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌నుంది. మరి అన్ని అనుకున్నట్లే జరిగితే… యూపీలో బీజేపీ గెలిస్తే స్మృతిని దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందనటంలో సందేహం లేదు. ఏం జరుగుతుందో చూడాలి..