75 అన్నారు.. 69 ప్రకటించారు!

      శుక్రవారం నాడు టీఆర్ఎస్ అసెంబ్లీకి పోటీ చేసే 75 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని, ఆ లిస్టు ఆల్రెడీ తయారైందన్న వార్తలు వచ్చాయి. అయితే తీరా కేసీఆర్ 69 మందితో మాత్రమే లిస్టు ప్రకటించాడు. వాళ్ళలో పరకాల ఎమ్మెల్యే బిక్షపతి పేరు లేదు. పరకాల సీటును కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బిక్షపతికి కేసీఆర్ హేండిచ్చాడని, దీంతో బిక్షపతి బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఐదుగురి పేర్లు గల్లంతయ్యాయి. ఆల్రెడీ టిక్కెట్లు ఖరారైనప్పటికీ వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదని ఆరా తీస్తే, ఆ ఐదుగురూ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే ఆలోచనలో వున్నారట. అందుకే లిస్టులో వాళ్ళ పేర్లు ప్రకటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దాసరి చెప్పిన బ్రోకర్ ఎవరు?

      దర్శకుడు దాసరి నారాయణరావు సంచలనాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఒక బ్రోకర్ కారణమని, ఆ బ్రోకర్ ఎవరో త్వరలో వెల్లడిస్తానని దాసరి ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ బ్రోకర్ ఎవరన్న ఆలోచనలు మొదలైయ్యాయి. అలా ఆలోచిస్తున్న కొద్దీ రకరకాల పేర్లు కళ్ళ ముందు కదులుతున్నాయి. దాసరి జగన్ గురించి అన్నాడా, కిరణ్ గురించి అన్నాడా, చిరంజీవి గురించి అన్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు కారణం ఒక బ్రోకర్ కారణం అని చెప్పిన దాసరి ఆ బ్రోకర్ ఎవరో కూడా చెబితే బాగుండేది కదా. అయినా దాసరి స్టైలే అంత. ఎవర్ని తిట్టదలుచుకున్నాడో వాళ్ళని డైరెక్ట్ గా తిట్టడు. ఇలాగే డొంకతిరుగుడుగా తిడతాడు. జనాలు కన్‌ఫ్యూజ్ అయి ‘ఎవరా?’ అని జుట్టు పీక్కుంటారు. మీరు గమనిస్తూ వుండండి.. ఆ బ్రోకర్ ఎవరో, ఆ బ్రోకర్ పేరేమిటో దాసరి ఎప్పటికీ చెప్పడు.

కేసీఆర్‌ని జైల్లో పెడతారట!

      అవసరమైతే కేసీఆర్‌ని జైల్లో పెడతామని కేంద్ర మంత్రి జేడీ శీలం ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆయన ఈ కామెంట్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చేశారు. పోలవరం ప్రాజెక్టు నూటికి నూరు శాతం చట్టబద్ధమైన ప్రాజెక్టు అని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డు పడితే కేసీఆర్‌ని జైల్లో పెట్టి అయినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని జేడీ శీలం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వున్న జేడీ శీలం అమాయకత్వానికి మొదట అందరూ జాలిపడాలి. ఇదిలావుంటే, విభజన వల్ల ఎవరీకి నష్టం లేదని, సీమాంధ్రులు దోచుకుంటున్నారని మొత్తుకుంటున్న మారీచుల బారి నుంచి సీమాంధ్రులు విభజన పుణ్యమా అని తప్పించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్ధుల తొలిజాబితా

      త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బరిలోకి దిగే టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 69 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితలో 55 శాతం సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఏ పార్టీలతో పొత్తులు లేవని...వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోగి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 69 మంది అసెంబ్లీ అభ్యర్ధులు వీరే: గజ్వేల్- కేసీఆర్, హుజూరాబాద్- ఈటెలరాజేందర్, సిద్దిపేట-హరీశ్‌రావు, బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదిలాబాద్-జోగు రామన్న పరిగి- కొప్పుల ఈశ్వర్, బోథ్-జి. నగేశ్, కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, ముథోల్- వేణుగోపాలచారి, తాండూర్-పి. మహేందర్‌రెడ్డి డోర్నకల్- సత్యవతి రాథోడ్, ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, వరంగల్ (వెన్ట్)-దాస్యం వినయ్ భాస్కర్, వేములవాడ- సి.హెచ్ రమేశ్ బాబు కరీంనగర్ - గంగుల కమలాకర్ కోరుట్ల - విద్యాసాగర్ రావు చెన్నూరు- నల్లాల ఓదేలు ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి జుక్కల్ - హన్మంత్ షిండే కామారెడ్డి- గంప గోవర్ధన్ రామగుండం- సోమారపు సత్యనారాయణ స్టేషన్ ఘన్ పూర్ - టీ. రాజయ్య సిర్పూర్ - కావేటి సమ్మయ్య చేవెళ్ల - కే. ఎస్ రత్నం సిరిసిల్ల- కే.టీ. రామారావు మక్తల్ - వై ఎల్లారెడ్డి కల్వకుర్తి- జైపాల్ యాదవ్ సికింద్రాబాద్- టి. పద్మారావు భూపాలపల్లి- ఎస్ మధుసుదానాచారి సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్ వనపర్తి- నిరంజన్ రెడ్డి సత్తుపల్లి- పిడమర్తి రవి నర్సంపేట- సుదర్శన్ రెడ్డి మలుగు- అజ్మీరా చందులాల్ జడ్చర్ల - సి. లక్ష్మారెడ్డి వరంగల్ ( ఈస్ట్)- కొండా సురేఖ బోధన్- షకీల్ అహ్మద్ ఆలేరు - గొంగడి సునీత అచ్చంపేట- గువ్వల బాలరాజు పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి మానకొండూరు- రసమయి బాలకిషన్ హుస్నాబాద్ -వి. సతీష్ కుమార్ ఆలంపూర్ - ఎమ్ శ్రీనాథ్ జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దేవరకొండ- లాలు నాయక్ పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి, వికారాబాద్ -బి. సంజీవరావు గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి నకిరేకల్ - వీరేశం మేడ్చల్ - సుధీర్ రెడ్డి జోగిపేట- బాబుమోహన్ మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి వర్ధన్నపేట- రమేశ్ నిర్మల్ - శ్రీహరిరావు బెల్లంపల్లి- చిన్నయ్య నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి ఖానాపూర్ - రేఖానాయక్ ఆర్మూర్ - ఏ. జీవన్ రెడ్డి ఆసిఫాబాద్ - కోవా లక్ష్మీ బాల్కొండ - వి. ప్రశాంత్ రెడ్డి పటాన్‌చెరు - మహిపాల్‌రెడ్డి సంగారెడ్డి - చింతా ప్రభాకర్

టైటానియం కుంభకోణంలో జగన్ కు వాటా!

      టైటానియం కుంభకోణం కేసులో కేవీపీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా సంబంధం వుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపి౦చారు. డబ్బుల కోసం అంతర్జాతీయ క్రిమినల్స్ తో చేతులు కలిపి దేశం పరువు తీశారని మండిపడ్డారు. బెయిల్ కోసం వెయ్యి కోట్లు చెల్లించిన వ్యక్తులతో బేరసారాలు చేసారని అన్నారు. క్రిమినల్స్‌తో కలిసి ప్రపంచమంతా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారని, ఆ డబ్బు తెచ్చి ఇక్కడ ఓటుకు రూ. వెయ్యి, రెండు వేలు పంచి పెడుతున్నారని, లక్ష కోట్లు సంపాదించి ఎన్నికల్లో ఐదు, పది వేల కోట్లు ఖర్చు చేయడం వీరికి ఒక లెక్క కాదని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని కాపాడతారా లేక అమ్మేస్తారా అని ప్రశ్నించారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని, ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టామని హెచ్చరించారు.

తెరాస తొలి జాబితా విడుదల నేడే

  కాంగ్రెస్ పార్టీ తెరాసతో ఎన్నికల పొత్తుల కోసం చకోర పక్షిలా ఆశగా, బేలగా చూస్తూ నేటికీ తమ తలుపులు తెరిచియేయున్నవి అని చెపుతుంటే, నక్షత్రకుడిలా తనవెంట బడుతున్న కాంగ్రెస్ పార్టీని వదిలించుకోలేక తెరాస తిప్పలు పడుతోంది. అయితే తెదేపా-బీజేపీల పొత్తుల సీరియల్లో బ్రేక్ వస్తే బీజేపీతో కలిసి ఆడిపాడుకొందామనుకొన్న తెరాస నేత కేసీఆర్ కు ఎంతకీ ఆ బ్రేక్ రాకపోవడంతో ఈరోజు తన పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నారు. బహుశః బీజేపీ తెదేపాకే కమిట్ అయిపోయిందని ఆయనకు డిల్లీ నుండి హాట్ లైన్లో కబురు వచ్చెందేమో కూడా!   ఈరోజు మొత్తం 69మంది శాసనసభ అభ్యర్ధుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయబోతున్నారు. దీనితో ఇక తెరాస కటీఫ్ చెప్పేసినట్లే అవుతుంది గనుక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను వెంటనే ప్రకటించేయవచ్చును. కాంగ్రెస్, తెరాసలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించగానే, సహజంగానే తెదేపా, బీజేపీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది గనుక అవి కూడా తమ పొత్తుల ధారావాహికాన్ని తక్షణం ముగించి తమ అబ్యార్ధులను ప్రకటిస్తే, ఇక అన్ని పార్టీ అభ్యర్ధులు పార్టీ జెండాలు, మైలుకు పట్టుకొని ఊర్లమీద పడతారు.

బంతిని అమెరికా కోర్టులో పడేసిన కేవీపీ

  దొరికితే దొంగలు, లేకుంటే దొరలూ..అనే సామెత ఊరకనే పుట్టుకు రాలేదు. మన రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ సూక్తి చక్కగా సరిపోతుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జమానా ఒక స్వర్ణ యుగమని వైకాపా నేతలు ఎంతయినా టాంటాం చేసుకోవచ్చు గాక, కానీ ఆ జమానాలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో అనేక కుంభకోణాలు చాప క్రింద నీరులా పరుచుకుపోయాయి. కానీ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం అవేమీ బయటకు పొక్కలేదు గనుక, ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆయన ప్రజల అభిమానం పొందగలిగారు. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుంభకోణాలను ఇక ఎంతమాత్రం కప్పిపుచ్చలేని పరిస్థితులు ఎదురువడంతో పాముల పుట్టలోనుండి పాములు బయటపడుతున్నట్లు ఆ కుంభకోణాలన్నీ ఒకటొకటిగా వెలుగు చూస్తుంటే, మంత్రులు, ప్రభుత్వాధికారులు, వ్యాపారవేత్తలు అనేకమంది జైలు పాలయ్యారు. చివరికి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాక తప్పలేదు.   కానీ ఏదో మంత్రం చదివిది మాయ జరిగినట్లుగా అకస్మాత్తుగా జగన్, అతనితో పాటు మిగిలిన ముద్దాయిలు అందరూ కూడా ఎలాగ లోపలకి వెళ్ళేరో అలాగే బయటకు కూడా రాగలిగారు. ఆయనపై సీబీఐ మోపిన అభియోగాలు కూడా ఎవరో మంత్రం వేసినట్లు అన్నీ అటకెక్కిపోయాయి. దానితో కధ కంచికి జగన్ ఎన్నికలకి సిద్దమయిపోయారు. కానీ, వైయస్సార్ జమానాలో జరిగిన కుంభకోణాలు రాష్ట్రాలు, సప్త సముద్రాలు దాటుకొని విదేశాలకు విస్తరించడంతో, ఇక్కడ అందరినీ మేనేజ్ చేయగలిగినా, బయట దేశాలలో మేనేజ్ చేయడం కుదరకపోవడంతో టైటానియం గనుల కుంభకోణం ఈరోజు బయటపడింది.   ఏడాదికి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువచేసే ఖనిజ సంపద త్రవ్వేసుకొని అమ్రెఇకాలొని ఒక సంస్థకు ఎగుమతి చేసుకోవడానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావు డైరెక్షన్లో 2006లో వ్యవహారం మొదలయింది. ఈ లక్షల కోట్ల వ్యవహారంలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఏప్రిల్ 28, 2006 నుండి జూలై 13, 2010వరకు విదేశాల నుండి దాదాపు 10.59 మిలియన్ డాలర్ల సొమ్ము డిల్లీ నుండి గల్లీ వరకు వివిధ ప్రభుత్వాధికారుల, రాజకీయ నేతల ఖాతాలలోకి వరదలా వచ్చిచేరింది. ఈవిషయాన్ని స్వయంగా అమెరికా షికాగో కోర్టు, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న అమెరికా పోలీసు అధికారులే దృవీకరించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కేవీపీ రామచంద్రరావని కూడా దృవీకరించారు.   అయితే, మన దేశంలో ఎటువంటి వ్యవహారం కోసమైనా లేదా ఏ అంశంపైనైనా రాజకీయ నేతలు ప్రతిస్పందించేందుకు కొన్ని పడికట్టు స్టేట్మెంట్లు తయారు చేసుకొన్నాము. కనుక కేవీపీ కూడా నీటుగా అదే ఫార్ములా ఫాలో అయిపోతూ “తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కేవలం పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని తనను దోషిగా తేల్చేయడం సబబు కాదని, తానే పాపం ఎరుగనని అన్నారు. అమెరికా న్యాయ స్థానం లేదా సదరు దర్యాప్తు సంస్థ ఏదయినా నివేదిక ఇస్తే అప్పుడు మాట్లాడతానని’ చెప్పవలసిన నాలుగు ముక్కలు పద్దతిగా చెప్పేశారు. అందువల్ల ఇపుడు బంతి అమెరికా కోర్టులో పడేసినట్లే. కానీ నిప్పులేనిదే పొగ రాదని, మన జనాలకే కాదు అమెరికా కోర్టులకి కూడా బాగానే తెలుసు.   అయితే మళ్ళీ ఆ బంతి అణుబాంబులా ఎప్పుడు, ఎవరి మీద పడుతుందో తెలియక, ఈ వ్యవహారంలో బ్యాంకులు నింపుకొన్న వారందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. వారి సంగతెలా ఉన్నపటికీ, సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడిన ఈ భారీ కుంభకోణం తెదేపా అధినేత చంద్రబాబు చేతికి ఏకే-47 రైఫిల్లా దొరికింది. అధిపట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు వైకాపాను, తన ప్రియ శత్రువు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకేసారి చీల్చి చెండాడడం ఖాయం.

బీజేపీ-తెదేపా పొత్తుల కధ కొలిక్కి వచ్చేనా?

  రోజులు గడిచిపోతున్నాపార్టీల మధ్య పొత్తులు మాత్రం కుదరడం లేదు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొందామని ఆత్రపడుతున్న సీపీఐ, బీజేపీతో పొత్తులు పెట్టుకొందామని ఉవ్విళ్ళూరుతున్న తెదేపాలకి సీట్ల బేరం ఎంతకీ తెగకపోవడంతో ఎన్నికల షెడ్యుల్ విడుదలయినప్పటికీ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇక తెదేపా-బీజేపీల పొత్తులు బెడిసికొడితే, బీజేపీతో చేతులు కలుపుదామని తెరాస ఆత్రంగా ఎదురుచూస్తుంటే, తెరాస కరుణిస్తే ఆపార్టీతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. అదేవిధంగా వైకాపా కూడా బీజేపీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అంటే తెదేపా-బీజేపీల పొత్తులను బట్టి ఆంధ్ర తెలంగాణాలలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్నమాట.   ఇక ఈమధ్య కాలంలో తెదేపా రెండు ప్రాంతాలలో కొంచెం బలం పుంజుకోవడంతో చంద్రబాబులో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందువలన బీజేపీ గొంతెమ్మ కోరికలన్నిటినీ తాము అంగీకరించావలసిన అవసరం లేదన్నట్లు కొంచెం బెట్టు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ కూడా తెదేపాతో పొత్తు పెట్టుకోకపోతే తెరాస, వైకాపాలు ఉండనే ఉన్నాయనే ధీమాతో బిగుసుకొని కూర్చొంది. దానివలన రెండు పార్టీల మధ్య పొత్తుల ముచ్చట్లు టీవీ ధారావాహికంలాగ కొనసాగుతూనే ఉన్నాయి.   ఇక ఆ రెండు పార్టీలు ఏదో ఒకటి తేల్చుకొని తమ తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తే, దానిని బట్టి తమ అభ్యర్ధులను కూడా ప్రకటించుకొందామని మిగిలిన పార్టీలు ఓపికగా ఎదురుచూస్తున్నాయి. ముందుగా తమ అభ్యర్ధుల జాబితా విడుదలచేసినట్లయితే పార్టీలో టికెట్స్ దొరకనివారి అసమ్మతికి తోడు, తమ అభ్యర్ధులను బట్టి ప్రత్యర్ధులు బలమయిన అభ్యర్ధులు నిలబెడితే మొదటికే మోసం వస్తుందని అన్ని పార్టీలు అభ్యర్దుల పేర్లు ప్రకటించడానికి మీన మేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించేస్తున్నాయి. ఇక తమకు పార్టీ టికెట్ దొరకకపోతే వేరే పార్టీలోకి జంపైపోదామని ఎదురుచూస్తున్న వారికి కొదవలేదు. వారు కూడా ఆ సుమూహూర్తం కోసం ఆశానిరాశలమాధ్య ఊగిసలాడుతూ బీపీలు పెంచేసుకొంటున్నారు.   ఈవిదంగా అన్ని పార్టీలు కలిసి పొత్తులు, టికెట్స్ అంశాలు పట్టుకొని ఒకదానితో మరొకటి దాగుడు మూతలు ఆడుకొంటున్నాయి. అందువల్ల ఈసమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ముందుగా తెదేపా-బీజేపీల మధ్య వెంటనే పొత్తులయినా కుదరాలి, లేకుంటే పొత్తులు పెటాకులయినా అయిపోవాలి. అప్పుడు గానీ ఈ సమస్య ఒక కొలిక్కి రాదు. కానీ తెలంగాణాలో నామినేషన్స్ వేయడానికి ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమె మిగిలి ఉన్నాయి గనుక మహా అయితే మరో ఐదు రోజులు ఈ పొత్తుల సస్పెన్స్ ధారావాహికం కొనసాగవచ్చును. అంటే ఇక ఏ పార్టీ మరే పార్టీకి అంతకు మించి డెడ్ లైన్స్ ఇవ్వలేవన్నమాట. బహుశః ఇటువంటి పొత్తుల భాగోతం మునుపెన్నడూ చూడలేదేమో.

కాంగ్రెస్‌కి భారీ షాక్!

      ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. షాకంటే ఏదో మామూలు షాక్ కాదు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టిక్కెట్ పొందిన ఒక నాయకుడు దాన్ని విసిరికొట్టి భారతీయ జనతాపార్టీలో చేరిపోయాడు. కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే అవమానం మరొకటి వుంటుందా? ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ నుంచి రమేష్ చంద్ తోమార్ అనే నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. పార్టీ టిక్కెట్ కూడా ఇచ్చేసింది. రమేష్ చంద్ తోమార్ గట్టి అభ్యర్థి కావడంతో ఈ స్థానంలో గెలవటం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కలలు కనడం ప్రారంభించింది. అయితే కలల్లో విహరిస్తున్న కాంగ్రెస్‌కి రమేష్ చంద్ షాకిచ్చాడు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ని కాదని నరేంద్రమోడీ సమక్షంలో బీజేపీలో చేరిపోయాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగిపోయింది. దీంతో ఈ నియోజకవర్గం బీజేపీ అకౌంట్లో చేరిపోవడం ఖాయమైపోయింది. ఈ సీటు పోతే పోయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు (వుందనుకుంటే) దారుణంగా పోయింది.

వైసీపీకి మరో చిల్లు!

      వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దాదాపు ఖాళీ అయిపోయింది. ఒకరిద్దరు నాయకులు మాత్రమే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనిన భయపడుతూ వైసీపీలో వున్నారే తప్ప, ఇంకా వైసీపీలో కొనసాగడానికి వాళ్ళకి మరో కారణం కనిపించడం లేదు. సందు దొరికితే అర్జెంటుగా జంప్ జిలానీ అవతారం ఎత్తడానికి వాళ్ళందరూ సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చిల్లుల జల్లెడలా మారిన వైసీపీ పడవకి మరో పెద్ద చిల్లు పడింది. ఇంతకాలం తెలంగాణలో వైసీపికి అండగా వుండి, వైసీపీని, జగన్‌ని తన భుజాల మీద మోసిన బాజిరెడ్డి గోవర్దన్ గురువారం నాడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ నుంచి కీలక నాయకుడు బయటకి వెళ్ళిపోవడం వైసీపీకి తెలంగాణలో పూర్తిగా గల్లంతు అవడానికి సూచనగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో వైసీపీకి చెట్టులాంటి బాజిరెడ్డి గోవర్దన్ పార్టీలోంచి బయటకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన చిన్నా చితకా మొక్కల్లాంటి నాయకులు జంప్ కావడం ఎంతసేపు?

పోస్టర్ పాలిటిక్స్!

      నరేంద్రమోడీ పార్లమెంట్‌కి పోటీ చేస్తున్న గుజరాత్‌లోని వడోదరలో వాల్ పోస్టర్ల పాలిటిక్స్ ముదిరి పాకాన పడ్డాయి. ఈ నియోజవర్గంలో నరేంద్రమోడీ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా మధుసూదన్ మిస్రీ పోటీ చేస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా నరేంద్రమోడీ పోస్టర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి.   తాను కూడా మోడీ రేంజ్‌లో పబ్లిసిటీ చేయాలంటే హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టే ప్లేస్ లేదనీ, వాటన్నిటినీ నరేంద్రమోడీ బ్యాచ్ నెల రోజుల క్రితమే బుక్ చేసేసుకుందని తెలిసింది. దాంతో బాగా ఆలోచించిన ఆయన గారికి ఒక థర్డ్ క్లాస్ ఐడియా వచ్చింది. అదేంటంటే, వడోదరలో నరేంద్రమోడీ పోస్టర్ ఎక్కడ కనిపిస్తే ఆ పోస్టర్ మీద తన పోస్టర్ అతికించేయాలి. అప్పుడు నరేంద్రమోడీకి పబ్లిసిటీ తగ్గిపోయి, తనకి పబ్లిసిటీ వస్తుంది. ఈ దిక్కుమాలిన ఐడియా రాగానే మధుసూదన్ మిస్రీ దాన్ని అమలులో పెట్టేశాడు. గురువారం ఉదయం తెల్లారగానే ఈ పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఎక్కడ నరేంద్రమోడీ ఫొటో కనిపిస్తే అక్కడ తన ఫొటో వున్న వాల్ పోస్టర్ అతికిచండం మొదలెట్టేశాడు. దీనిన గమనించిన పోలీసులు మధుసూదన్ మిస్రీని, ఆయన వాల్‌పోస్టర్, మైదా బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయినా రామాయణంలో పిడకల వేటలా ఈ కటౌట్ల గొడవేంటో. అయినా కంటెంట్ వున్న తనకి కటౌట్ అవసరం లేదని మోడీ అర్థం చేసుకోలేదు. కంటెంట్ లేని తనకి కటౌట్లు పెట్టినా ఉపయోగం లేదని మధుసూదన్ మిస్రీ అర్థం చేసుకోలేదు. అక్కడొచ్చింది తంటా.  

మీ అభయాలు ఎవడిక్కావాలి?

      ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందో అప్పటి నుంచి ప్రతి వాడికీ సీమాంధ్రులంటే చులకనైపోయింది. రాష్ట్రాన్ని విభజిస్తూ వుంటే వీళ్ళు చవట దద్దమ్మల్లా ఏమీ చేయలేకపోయారన్న ఫీలింగ్ తెలంగాణ వాదుల్లో బాగా వుంది. ఇది సీమాంధ్రులకు బాగా మండేలా చేస్తోంది. దీనికి తోడు తెలంగాణలో, హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రులను కడుపులో పెట్టి చూసుకుంటాం... గుండెల్లో దాచుకుంటాం లాంటి స్టేట్‌మెంట్లు తెలంగాణ వాదులు ఇవ్వడం చూస్తే సీమాంధ్రులకు ఎక్కడ మండకూడదో అక్కడ మండుతోంది.   ఒక్కొకడు మరీ తెలివిగా స్టేట్‌మెంట్ ఇస్తూ వుంటాడు. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. సీమాంధ్రులు కూడా వుండొచ్చు అని ఒకడు అనుమతి ఇస్తాడు. ఇంకోడు సీమాంధ్రులు హైదరాబాద్‌లో వుండొచ్చు పర్లేదని జాలి చూపిస్తాడు. ఇలాంటివన్నీ వింటున్న సీమాంధ్రులు మీ సానుభూతి వచనాలు ఆపండ్రా అని అరవాలని అనుకున్నా. పట్టించుకునేవాడెవడూ లేడని ఊరుకుంటున్నారు. సరే, ఇప్పుడింతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ  ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పాడు. ఇంకా తమ పార్టీ గురించి ఏవేవో చెప్పుకున్నాడు. అంతవరకూ ఓకే.. పక్కా తెలంగాణ వాదుల మాదిరిగా ఈయన కూడా హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఎంతమాత్రం భయపడక్కర్లేదు. సీమాంధ్రులకు అండగా నేనుంటా అని అభయం ఇచ్చేశాడు. అసలు హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రులు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? సీమాంధ్రుల కాలిగోటినైనా కదిలించే దమ్ము ఎవరికుంది? టోటల్‌గా చెప్పాలంటే, ఎవరి సానుభూతి అయినా సీమాంధ్రులు అడిగారా? కాపాడమని ఆక్రోశించారా? అంచేత ఇక ఆపండి.. మీ అభయాలు ఎవడికీ అక్కర్లేదు.

రాహుల్ కి అడ్రస్ లేదు!

      రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గానికి పదేళ్ళ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ, ఆయనగారికి ఇంతవరకు ఆ నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేదు. బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్తే ఇంటి అడ్రస్ తీసుకురా పో అని మేనేజర్ పంపించేశాడు. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం రాహుల్ గాంధీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎన్‌డీఎం)కి అప్లికేషన్ పెట్టుకుంటే, ఆయన ఆ దరఖాస్తుని తిరస్కరించేశాడు.  నువ్వు గతంలో అమేథిలో వున్నట్టుగానీ, ఇకమీదట ఇక్కడే వుంటావని గానీ ఆధారాలు లేవు పొమ్మన్నాడు. దాంతో రాహుల్‌కి ఏం చేయాలో పాలుపోక కంగారుపడిపోతున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో వ్యయం చేసే డబ్బంతా అమేథీ నియోజకవర్గంలో వున్న బ్యాంక్ ద్వారా మాత్రమే చేయాలి. ఆ ఖాతా తెరవాలంటే నివాస ధ్రువీకరణ పత్రం కావాలి. పదేళ్ళ నుంచి అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్న యువరాజు గారికి అక్కడ నివాస ధ్రువీకరణ పత్రం వచ్చే అవకాశం లేదు. నియోజకవర్గంలో అడ్రసే లేని ఇలాంటి ఎంపీని నమ్ముకున్న అమేథీ వాసులని ఎవరు కాపాడతారు? బైదబై మిస్టర్ రాహుల్ గాంధీ... రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సంపాదించడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసినంత ఈజీ కాదు.. మైండిట్! అమేథీలో రాహుల్‌కి ఇప్పుడు అడ్రస్ గల్లంతైంది. ఈ ఎన్నికలలో గెలుపు కూడా గల్లంతవుతుందేమో!

మందకృష్ణ చంపేస్తా నన్నాడు

      ఈమధ్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ప్రాణభయంతో వణికిపోతున్నాడు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాడని అంటున్నాడు. ఎంఆర్‌పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, అందుకే తాను ప్రాణభయంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని ఆకుల రాజేందర్ భయపడిపోతూ చెబుతున్నాడు. మందకృష్ణ బెదిరింపులు చూసి తన కుటుంబ సభ్యులు భయంతో వణికిపోతున్నారని, తనకు మందకృష్ణ ప్రాణహాని వుందని అర్థమైపోయిందని ఆకుల రాజేందర్ అంటున్నాడు. ఈ విషయాన్ని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, మందకృష్ణ నుంచి తనకు ప్రాణభయం ఉన్నందువల్ల తనకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరానని ఆయన చెప్పాడు. తాను బలహీన వర్గానికి చెందిన వ్యక్తి అయినందువల్లే తనను మందకృష్ణ తనను బెదిరిస్తున్నాడని ఆకుల రాజేందర్ అంటున్నాడు. పాపం టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎంత కష్టమొచ్చిపడిందో!

తిరిగి కాంగ్రెస్ లోకే హర్షకుమార్?

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి శాయశక్తులా కృషి చేసిన వాళ్ళలో అమలాపురం ఎంపీ హర్షకుమార్ కూడా ఒకరు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నారు. చివరికి అనుచరులు ‘సమైక్యసింహం’ అని పిలుచుకునే కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీలో చేరారు. ఈ పార్టీలో హర్ష కుమార్ ప్రస్తుతం చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నిన్నటి వరకూ అంతా బాగానే వుందిగానీ, లేటెస్ట్ గా పరిస్థితిలో తేడా వచ్చినట్టు కనిపిస్తోంది.   హర్షకుమార్ మెల్లగా జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి జారిపోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, తనకి దిగ్విజయ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆయన తనను రిక్వెస్ట్ చేశారని హర్షకుమారే స్వయంగా చెప్పారు. అయితే తనంతట తాను కాంగ్రెస్‌లో నుంచి బయటకి రాలేదని, కాంగ్రెసే తనని బహిష్కరించిందని తాను దిగ్విజయ్‌కి చెప్పానని హర్షకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొదట తనమీద వున్న బహిష్కరణను తొలగించాలని తాను దిగ్విజయ్‌కి చెప్పానని హర్షకుమార్ వెల్లడించారు. ఈ వార్త బయటకి రాగానే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. జై సమైక్యాంధ్ర పార్టీలో కలకలం మొదలైంది.  హర్షకుమార్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతున్నారన్న వార్త గుప్పుమంది. దాంతో కంగారు పడిన హర్ష కుమార్ మళ్ళీ మరో ప్రకటన చేశారు. తాను  అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని, అది కూడా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు. అయితే హర్షకుమార్ జై సమైక్యాంధ్ర పార్టీకి బై చెప్పి, కాంగ్రెస్‌కి జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

దగ్గుబాటికి బీజేపీ గాలం?

      సీమాంధ్రలో బలపడుతున్న భారతీయ జనతాపార్టీ అనేకమంది కాంగ్రెస్ నాయకులను ఆకర్షిస్తూ తనలో కలిపేసుకుంటోంది. సీమాంధ్రలో బీజేపీ సాధించిన అచీవ్‌మెంట్స్ లో కేంద్ర మాజీ మంత్రిణి దగ్గుబాటి పురంద్రేశ్వరి పార్టీలో చేరడం ఒకటి. లేటెస్ట్ గా కావూరి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీ వైపు చూస్తుంటే, బీజేపీ మాత్రం కొందరు కీలక నాయకుల వైపు చూస్తోంది. వాళ్ళలో ముందు వరుసలో వుండే నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.   దగ్గుబాటి భార్య ఎలాగూ బీజేపీలోనే వుంది. ఆమెతోపాటు వెంకటేశ్వరరావును కూడా పార్టీలోకి తీసుకుంటే సీమాంధ్రలో బీజేపీ మరింత బలపడే అవకాశం వుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర విభజన విషయంలో అనుసరించిన దుర్మార్గమైన పద్ధతి కారణంగా నొచ్చుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కొంతమంది సన్నిహితులు దగ్గుబాటి మనసు మార్చడానికి ప్రయత్నాలు చేసిన ఆయన తన పట్టు విడవలేదు. అయితే దగ్గుబాటి లాంటి మిస్టర్ క్లీన్ నాయకుడు తమ పార్టీలో వుండటం ఎంతో మంచిదని భావిస్తున్న బీజేపీ దగ్గుబాటిని తిరిగి రాజకీయ రంగప్రవేశం చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఆయనను ఒప్పించే బాధ్యతను పురంధ్రేశ్వరి మీద వేసినట్టు సమాచారం. అయితే దగ్గుబాటి ఒక పట్టాన లొంగే మనిషి కాకపోవడంతో ఆయన్ని ఎలా ఒప్పించాలో తెలియక చిన్నమ్మ కూడా మథనపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దగ్గుబాటి నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోయినప్పటికీ ఒక వారం రోజుల్లో ఆయన తమ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుందని బీజేపీ నాయకులు ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ 'ఇజం' కి ‘సాక్షి’ చురకలు!

      పవన్‌కళ్యాణ్ జగన్ మీద విరుచుకుపడటం, నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడ్డం చూసి జగన్ ఇంటి సంస్థ ‘సాక్షి’కి కోపం వచ్చేసింది. వెంటనే ‘సాక్షి’ పేపర్లో, ‘సాక్షి’ ఛానల్లో పవన్ కళ్యాణ్‌ని భారీ స్థాయిలో తిట్టడం ప్రారంభించింది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద నోరు చేసుకోవడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ మీద అన్ని రకాలుగా మాటల దాడులు మొదలుపెట్టారు. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ మూడు కళ్యాణాల గురించి ఘాటుగా విమర్శిస్తున్నారు. ‘సాక్షి’ ఛానెల్ పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంటే, ‘సాక్షి’ పేపర్లో ‘పచ్చబుట్టలో పవనిజం’ పేరుతో ఒక భారీ ఆర్టికల్ ప్రచురించారు. దీనిలో పవన్ మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. గతంలో యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని ఎలా తిట్టిందీ ప్రస్తావిస్తూ, అప్పటి పేపర్ కటింగ్స్ కూడా మళ్ళీ ముద్రించారు. మొత్తంమీద ‘సాక్షి’ వ్యవహారం చూస్తుంటే పవన్ కళ్యాణ్‌ని ఊరికే వదిలేట్టు లేదు.