పోలీసులకు ఫిర్యాదు చేసిన దిగ్విజయ్ ప్రియురాలు

      కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రియురాలు దిగ్విజయ్ సింగ్ కంటే తెలివైనదిలా కనిపిస్తోంది. ఎంచక్కా దిగ్విజయ్‌సింగ్‌తో సరస సల్లాపాలు ఆడుతూ, వాటిని ఫొటోలు తీసుకుని కంప్యూటర్లో, ఈ మెయిల్స్‌ లో పెట్టింది. మరి ఆ ఫొటోలని బయటకి అమృతే లీక్ చేసిందో మరెవరో చేశారోగాని ఫొటోలు బయటపడ్డాయి. దాంతో దిగ్విజయ్ అమృతని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించక తప్పలేదు. ఎన్నో సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పెళ్ళితో చట్టబద్ధం చేసుకోక తప్పలేదు. సరసపు ఫొటోలు తీసుకుంది దిగ్విజయ్, అమృత జంట. వాటిని కంప్యూటర్‌లో పెట్టుకుంది ఆ జంటే. ఇప్పుడు సదరు ఫొటోలు లీకైతే ఆ విషయాన్ని పరిశోధించే బాధ్యత మాత్రం పోలీసుల మీద పడింది. తన కంప్యూటర్ని, ఈమెయిల్ని హ్యాక్ చేసింది ఎవరో పరిశోధించి చెప్పాలని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయిన దిగ్విజయ్, అమృత బాగానే వున్నారు. పోలీసులకే కొత్త తలనొప్పి వచ్చి పడింది.

రైల్లో పేలుళ్ళ కేసు మేమే పరిశోధిస్తాం.. కేంద్రం సాయం వద్దు: జయ

      చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద గౌహతి ఎక్స్ ప్రెస్ రైల్లో జరిగిన బాంబు పేలుళ్లలో మన రాష్ట్రానికి చెందిన స్వాతి మరణించిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ళలో దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ కేసు విచారణకు సంబంధించి తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదని, తమ రాష్ట్ర పోలీసు అధికారులే ఈ కేసును పరిశోధిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. కేంద్రం అందిస్తానన్న సాయాన్ని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ కేసును విచారించే బాధ్యతను తమిళనాడుకు చెందిన స్పెషల్ వింగ్ పోలీసు అధికారులకు జయలలిత అప్పగించారు. ఈ కేసును పరిశోధించే విషయంలో కేంద్రం తనంతట తానే చొరవ చూపించినా జయలలిత తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయాలు

      పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించడానికి వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.   పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న దరిమిలా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరిస్తుంది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 20వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. అందులో రూ. 18వేల కోట్లు కేంద్రం సమకూర్చనుంది. ప్రాజెక్టు అనుమతులు సంపాదించే బాధ్యతను కూడా కేంద్రమే తీసుకుంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, వారికి నష్టపరిహారం చెల్లించడం కూడా కేంద్రమే చూసుకుంటుంది. ఎస్పీవీ ఏర్పాటు చేయడం ద్వారా వేగంగా అనుమతులు సంపాదించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, పునరావాసం కల్పించడానికి వీలవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

రేపు విజయవాడలో మోడీ సభ

  నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నిన్న ఒకేరోజు సీమాంద్రాలో ఐదు సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంచేసి రెండు పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం కలిగించగలిగారు. మళ్ళీ రేపు అంటే శనివారం వారు ముగ్గురు కలిసి విజయవాడలో మరో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం సభ నిర్వహించే వరకు చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అయన ఈరోజు విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల ప్రచారం చేస్తారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై పూర్తి పట్టు సాధించగలిగిన పార్టీకే సర్వసాధారణంగా విజయావకాశాలు ఉంటాయి గనుక తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఆ మూడు జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.

జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్

      వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ట్ర విభజన జరిగిందని ప్రముఖ నటుడు,జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు దెబ్బతీశారని మండిపడ్డారు. సీమాంద్రులను కేసీఆర్ పదే పదే విమర్శిస్తూ, తిడుతుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించేందుకు జగన్‌కు గొంతు పెగలలేదని అన్నారు. సీమాంద్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయగల సత్తా ఒక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకే ఉందని పవన్ కల్యాణ్ ఉద్ఘటించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేదిలేదని, చీల్చిచెండాడతామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ హఠావో... సీమాంధ్ర బచావో అంటూ పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.

ఇక కెన్యా మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళాడొచ్చు!

      ప్రస్తుతం కెన్యాలో మగాళ్ళందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎందుకంటే కెన్యాలో వున్న మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళి చేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ తాజాగా ఒక బిల్లును ఆమోదించింది. గతంలో కెన్యాలో మగాళ్ళు ఒక్క పెళ్ళి మాత్రమే చేసుకోవాలనే చట్టం అమలులో వుండేది. ఇప్పుడు పాత చట్టాన్ని చించేసి, కెన్యా మగాళ్ళు ఎంతమంది మహిళలనైనా పెళ్ళిచేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మతపెద్దలు ఎంతగానో వ్యతిరేకించారు. అయినప్పటికీ కెన్యన్ పార్లమెంట్ ఈ వ్యతిరేకతని, అభ్యంతరాలని ఎంతమాత్రం పట్టించుకోకుండా కొత్తచట్టాన్ని ఆమోదించేసింది. దాంతో కెన్యా కుర్రాళ్ళు... సారీ... కుర్రాళ్ళేం ఖర్మ.. కాటికి కాళ్ళు చాపుకున్న ముసలోళ్ళు కూడా ఇంకా బోలెడన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని లొట్టలు వేస్తున్నారు. అయితే ఈ చట్టం మహిళలకు మాత్రం మొండిచెయ్యి చూపించింది. కెన్యా మహిళలు కేవలం ఒక్క మగాడిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. ఎంత అన్యాయం?

ములాయంసింగ్‌ని పిచ్చాస్పత్రిలో చేర్పిస్తే బెటరట!

      యు.పి. మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ రకరకాల వెరైటీ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. లేనిపోని సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్‌ని పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే ములాయంసింగ్ యాదవ్ మాయావతి మీద కూడా కొంటె కామెంట్లు చేశాడు. ఫైజాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ములాయం మాట్లాడుతూ, ‘మాయావతిని మిస్ అనాలో, మిస్టర్ అనాలో, సిస్టర్ అనాలో నాకు అర్థం కావడం లేదు’ అని వెటకారంగా మాట్లాడాడు. ఈ కామెంట్లపై మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ములాయం మతి భ్రమించి ఇలా అడ్డమైన కూతలు కూస్తున్నాడని, ఆయన్ని అర్జెంటుగా పిచ్చాస్పత్రిలో చేరిస్తే మంచిదని అన్నారు. ఈసారి ఎన్నికలలో తాను ఓడిపోతాననే భయం ములాయాన్ని పట్టి పీడిస్తోందని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మాయావతి మండిపడింది.

చంద్రబాబు ఓటు చెల్లుతుంది.. భన్వర్‌లాల్‌కి భంగపాటు

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు జూబిలీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పొత్తు ధర్మం ప్రకారం తాను బీజేపీకి ఓటు వేశానని, అటు అసెంబ్లీకి గానీ, ఇటు పార్లమెంట్‌కి గానీ తమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో లేనందున తమ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు భన్వర్‌లాల్‌ని నిలదీశారు. ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నదీ చూపిస్తే తప్పు తప్ప, ఆ తర్వాత ఎవరికి ఓటు వేసిందీ చెబితే తప్పు కాదని వాదించారు. అయినా సరే భన్వర్‌లాల్ తన పట్టు వీడలేదు. ఓటును రద్దు చేసే అధికారం భన్వర్‌లాల్‌కి లేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదు. దాంతో ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు మాట్లాడిన దానిలో తప్పేమీ లేదని, ఆయన ఓటు చెల్లుతుందని ప్రకటించింది. దీంతో చంద్రబాబు ఓటు చెల్లదని ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ భంగపడినట్టు అయింది.

బాంబులు పేలుతున్నాయ్.. మోడీకి భద్రత పెంచండి: బీజేపీ

      చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్ళలో గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ బాంబులు ఆంధ్రప్రదేశ్‌లో పేలడానికి ఉద్దేశించి పెట్టినవేనని, అయితే ట్రెయిన్ గంటన్నర సేపు చెన్నై స్టేషన్‌లోనే ఆగిపోవడం వల్ల అక్కడే పేలుళ్ళు జరిగాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నందున, ఆయనకు హెచ్చరిక ఇచ్చే విధంగా ఈ బాంబు పేలుళ్ళు జరపడానికి తీవ్రవాదులు ప్లాన్ చేసి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన మీద భారతీయ జనతాపార్టీ స్పందించింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ చెందిన యువతి మరణించడం, పలువురు గాయపడటం మీద తన బాధను వ్యక్తం చేసింది. దీంతోపాటు బీజేపీ ఒక ప్రధానమైన డిమాండ్ చేసింది. ఈ సంఘటన మోడీ ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వున్నారో తెలియచెబుతోందని, కాబట్టి మోడీకి భద్రత పెంచాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది.

నా లైఫ్.. నా ఇష్టం: దిగ్విజయ్ సింగ్

      కొన్నేళ్ళుగా టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో చాటుమాటు వ్యవహారం నడుపుతూ, దేశ రాజకీయాల్లో పెద్దమనిషిలా చెలామణి అవుతున్న దిగ్విజయ్ ‌సింగ్ ఇప్పుడు తన గుట్టంతా బయట పడేసరికి సిగ్గంతా వదిలేసి మాట్లాడుతున్నాడు. అమృతతో తన వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఎవరైన కామెంట్ చేస్తే ఊరుకోనని అంటున్నారు. ఈయనగారి రాసలీలల వ్యవహారం విషయంలో ఇంతవరకు బిజేపీ నాయకులెవరూ పల్లెత్తు మాట అనకపోయినా మోడీతో తనని పోల్చుకుంటూ మోడీకంటే తానే ఉత్తముడినని అంటున్నాడు. మోడీ చాలాకాలంగా తన పెళ్ళి విషయాన్ని దాచిపెట్టాడని, తాను మాత్రం తాను ప్రేమించిన మహిళను వివాహం చేసుకోబోతున్నానని దిగ్విజయ్ చెబుతున్నాడు.

డిగ్గీ అఫైర్..అమృతే ఇరికించిందా?

      దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్ మధ్య చాలాకాలంగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారం నాటకీయ పరిణామాల మధ్య బయటపడటం, దొరికిపోయిన దిగ్విజయ్ సింగ్ తాను అమృతని పెళ్ళి చేసుకోబోతున్నానని ప్రకటించడం దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆశ్చర్యంతోపాటు ఎన్నో అనుమానాలను కూడా కలిగిస్తోంది.   అమృతతో దిగ్విజయ్ సింగ్ చాలా సన్నిహితంగా వున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో దిగ్విజయ్‌కి తమ మధ్య వున్న సంబంధం గురించి దిగ్విజయ్ ట్విట్టర్‌లో బహిర్గతం చేసేశాడు. ఆ తర్వాత అమృత కూడా ట్విట్టర్‌లో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించింది. అదేవిధంగా తన కంప్యూటర్ని, ఈ మెయిల్‌నీ ఎవరో హ్యాక్ చేశారని అమృత వాపోయింది. దీనిద్వారా అమృత చెప్పదలుచుకున్నది ఏమంటంటే, దిగ్విజయ్, తాను సన్నిహితంగా వున్న ఫొటోలు నా కంప్యూటర్లో, ఈ మెయిల్లో వున్నాయి. వాటిని ఎవరో సంపాదించి ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. అయితే ఇక్కడ అందరికీ ఒక అనుమానం వస్తోంది. చాలాకాలంగా దిగ్విజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన అమృతే ఇక దిగ్విజయ్‌ని పెళ్ళి చేసుకుంటే బెటరేమో అన్న ఉద్దేశంతో ఆమే ఫొటోలు లీక్ చేసి వుండొచ్చేమో! ఇలాంటి ప్లాన్‌కి ఉపయోగించడం కోసమే దిగ్విజయ్‌, తాను ఏకాంతంగా వున్నప్పుడు కంప్యూటర్ కెమెరా ద్వారా ఆ దృశ్యాలను ఫొటోలు తీసిందేమో. సదరు ఫొటోలను తానే లీక్ చేయడం ద్వారా దిగ్విజయ్ సింగ్‌ని పెళ్ళి ఉచ్చులో ఇరికించేసిందేమో.. ఏమో!

ఆ డబ్బు ఎవడబ్బ సొమ్ము?

  సీమాంధ్ర ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఘాటు పదజాలంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను ఏకిపారేస్తున్నారు. కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, సైకిల్ స్పీడు పెంచి, గేరు మార్చి కేసీఆర్ని తొక్కిపారేస్తానని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అడ్రస్ లేకుండా పోయిందని, భవిష్యత్తులో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ పార్టీ ఈ ఎన్నికలలో డబ్బు వెదజల్లుతోందని, అసెంబ్లీ స్థానానికి 30 కోట్లు, పార్లమెంట్ స్థానానికి 60 కోట్లు ఖర్చుపెడుతోందని, ఈ డబ్బంతా ఎవడబ్బ సొమ్ము అని చంద్రబాబు గట్టిగా ప్రశ్నించారు. జగన్‌కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టేనని, అంటూ ఎన్నికల తర్వాత జైల్లో వుండే జగన్‌కి ఓటేస్తే ప్రజలే నష్టపోతారని చెప్పారు.

రాష్ట్ర విభజనకు చిరంజీవి కారణం కాదన్న పవన్ కళ్యాణ్

  రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం జగన్ అని పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఎలుగెత్తి చాటాడు. కేసీఆర్ సీమాంధ్రులను నోటికొచ్చినట్టల్లా తిడుతుంటే జగన్ నోరు మెదపకుండా ఊరుకున్నారని అన్నాడు. జగన్‌లో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా అని గట్టిగా ప్రశ్నించాడు. దాంతో జగన్ మీడియా పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక కథనాలు వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర విభజనకు కేంద్రమంత్రి చిరంజీవి కూడా కారకుడేనని, మరి చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించడం లేదన్నది ఆ కథనాల సారాంశం. దీనికి గురువారం నాడు పవన్ కళ్యాణ్ ప్రతిస్పందించాడు. రాష్ట్ర విభజనకు చిరంజీవి కారణం కానేకాదని, అందువల్లే చిరంజీవి మీద తాను విమర్శలు చేయడం లేదని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పటికీ అన్నయ్య చిరంజీవి మీద తనకు ఎంతో గౌరవం వుందని పవన్ కళ్యాణ్ చెబుతూ, రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని అన్నారు. వీరిద్దరికి మరో ఇద్దరు జగన్, కేసీఆర్ సహకరించారని చెప్పారు. అసలు కేసీఆర్‌తో జగన్‌కి వున్న సంబంధ బాంధవ్యాలేంటో బయటపెట్టాలని పవన్ అన్నారు.

చెన్నై విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!!

      చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో ఈ రోజు ఉదయం జరిగిన బాంబు పేలుడు పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ పేలుళ్ళలో ఒకరు మృతి చెందగా, 20మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే చెన్నై విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పని తెచ్చిన బాంబులే ఇక్కడ పేలిఉండచ్చుననే ప్రచారం జరుగుతోంది. చెన్నై నగర విధ్వంసానికి పథకం వేసేందుకు వచ్చిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంటును బుధవారం నాడే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పోలీసులు విచారించగా బాంబు పేలుళ్ళతో విధ్వంసానికి కుట్రపన్నినట్లు జాహీర్ హుసేన్ వెల్లడించాడని తెలుస్తోంది. చెన్నైతోబాటు పలు నగరాల్లో బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని జాహీర్ చెప్పినట్టు సమాచారం. పాక్ నుంచి నేరుగా వచ్చేందుకు వీలు కాకపోవడంతో తీవ్రవాదులు శ్రీలంకలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడినుంచి సముద్రమార్గంలో చెన్నైకి వస్తున్నట్టు వెల్లడించారు.

ఎన్నికల తరువాత పొత్తులకి రంగం సిద్దం

  తెలంగాణలో ఖచ్చితంగా తమకే అధికారం దక్కుతుందని కేసీఆర్ పదేపదే చెప్పినప్పటికీ, ముక్కోణపు పోటీ వల్ల అది సాధ్యం కాదనే సంగతి ఇప్పుడు కేసీఆర్ కూడా గ్రహించినట్లున్నారు. అందుకే మళ్ళీ ‘సోనియా దేవత, యూపీఏకి మద్దతు’ అంటున్నారు. ఎన్నికల తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ఆయన ఆవిధంగా మాట్లాడినట్లు అర్ధమవుతూనే ఉంది. అయితే నిన్న తెలంగాణాలో జరిగిన ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లయితే, కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు కూడా ఇక పడవనే ఆలోచనతో “కేసీఆర్ నమ్మకస్తుడు కాదు. ఆయనకీ మాట నిలకడ లేదు” అని మీడియాతో అన్నారు రాహుల్ గాంధీ. అయితే కేసీఆర్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మాత్రం అనలేదు. ఇకపై రాహుల్ సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంది గనుక, కేసీఆర్ పై మరింత తీవ్రంగా విమర్శలు గుప్పించవచ్చును. తద్వారా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు. నిన్న నరేంద్రమోడీ తన ప్రసంగంలో తాను అధికారంలోకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ వెలికితీస్తానని ముందే హెచ్చరించారు. గనుక, సహజంగానే జగన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపవచ్చును. ఇంతకాలం కాంగ్రెస్, వైకాపాలు విమర్శలు చేసుకొన్నపటికీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకొన్నా ప్రజలకి జవాబు చెప్పనవసరం లేదని అందరికీ తెలుసు.

చెన్నై సెంట్రల్ లో బాంబు పేలుళ్లు: గుంటూరు యువతి మృతి

      చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ లో బాంబు పేలుళ్లు సంభవించాయి. గౌహతీ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ లో ఉదయం సరిగ్గా 7.12గంటలకు ఆ రైలులో యస్4 బోగీలో మొదటి ప్రేలుడు జరగగా మళ్ళీ రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే 7.15గంటలకు పక్కనున్న యస్.5 బోగీలో మరో ప్రేలుడు జరిగింది. ఈ పేలుడులో ఓ యువతి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన యువతి గుంటూరు జిల్లాకు చెందిన స్వాతి(22)గా గుర్తించారు. గాయపడినవారిలో విశాఖకు చెందిన యువతి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేలుడు జరిగిన సంగతి తెలుసుకోగానే అక్కడికి చేరుకొన్న రైల్వే పోలీసులు, అధికారులు గాయపడినవారిని హుటాహుటిన స్థానిక రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు.

అమృతారాయ్ ఈమెయిల్ హ్యాక్... అందుకే ఫొటోలు లీక్

      కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో క్లోజ్‌గా వున్న ఫొటోలు మీడియాలోకి లీక్ అయ్యే సరికి ఇద్దరూ బయటపడ్డారు. మొదట దిగ్విజయ్ సింగ్ తనకు అమృతతో సంబంధం వుందని, ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నానని ట్విట్టర్లో ప్రకటించాడు. ఆ తర్వాత కాసేపటికే అమృత కూడా ట్విట్టర్‌లో తనకు దిగ్విజయ్‌తో వున్న సంబంధం గురించి ప్రకటించింది. తాను తన భర్త నుంచి విడిపోతున్నానని, విడాకుల కోసం అప్లయ్ చేశానని, తాను త్వరలో దిగ్విజయ్ సింగ్‌ని పెళ్ళి చేసుకోబోతున్నానని అమృత ట్విట్ పోస్ట్ చేసింది. అదేవిధంగా ఆమె మరో ట్విట్ కూడా పోస్ట్ చేసింది. తన ఈమెయిల్‌ని, కంప్యూటర్ని ఎవరో హ్యాక్ చేశారని ట్వీట్ చేసింది. దీన్నిబట్టి అర్థమవుతున్న పాయింట్ ఏమిటంటే, అమృత కంప్యూటర్లో, ఈమెయిల్లో దిగ్విజయ్‌తో ఆమె సన్నిహితంగా వున్న ఫొటోలు వున్నాయి. ఎవరో హ్యాకర్లు ఆ ఫొటోలని బయటపెట్టారు.

వైకాపా హటావ్ సీమాంద్రా బచావ్: పవన్ కళ్యాణ్

  బుదవారం సాయంత్రం తిరుపతిలో తెదేపా-బీజేపీలు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ చాలా ఉద్వేగంగా, ప్రజలను ఆక్కటుకొనే విధంగా ప్రసంగించారు. “మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్స్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మంత్రులు, కుటుంబ సభ్యులు కలిసి విచ్చలవిడిగా రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలంగాణా ప్రాంతాన్ని , వారి భూములను దోచుకొన్నారు. అప్పటి నుండే తెలంగాణా ప్రజలలో తాము దోచుకోబడుతున్నామనే భావన పెరగసాగింది. ఆ అవకాశాన్ని కేసీఆర్ చాలా తెలివిగా ఉపయోగించుకొని, ప్రజలలో విద్వేషాలు రెచ్చగొడుతూ చివరికి రాష్ట్ర విభజనకి కారకులయ్యారు.   కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ చేస్తున్న అన్యాయం చూస్తున్న నాకు చాలా ఆవేశం కలిగేది. కానీ, నావల్ల ఈ సమస్య మరింత జటిలం కాకూడదనే ఆలోచనతోనే నేను ఇంతకాలంగా నోరు విప్పలేదు. కానీ, అత్యంత అవమానకరంగా తెలుగుజాతిని విభజించిన తరువాత నేను ఇక సహించలేక రాజకీయాలలో ప్రవేశించాను. నాకు అధికారం, పదవులు సంపాదించుకోవాలనే తపన ఎంత మాత్రం లేదు. కేవలం దేశ సమగ్రతను కాపాడుకోవాలనే తపనతోనే నేను రాజకీయాలలోకి వచ్చేను. అందువల్ల ఈ కేసీఆర్, తెరాస నేతల బెదిరింపులకి, వారు నాపై పెడుతున్న కేసులకి బయపడేది లేదు, జైలుకి వెళ్లేందుకు కూడా భయపడను. కేసీఆర్ దేశానికి ప్రధాని కాబోతున్న వ్యక్తి పట్ల చాలా అవమానకరంగా మాట్లాడారు. ముందు ఆయన మోడీ గారికి క్షమాపణ చెపితే అప్పుడు నేనేమి చేస్తానో చెపుతాను.   సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వంటి మహానుభావులు దేశాన్ని సమగ్రంగా నిలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తే, కేసీఆర్, సోనియా, రాహుల్ గాంధీ వంటి వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం దేశసమగ్రతకు భంగం కలిగించడానికి కూడా వెనుకాడటం లేదు.అందుకే ప్రజలు కాంగ్రెస్, తెరాసలకు బుద్ధి చెప్పాలని కోరుకొంటున్నాను. అందుకే ‘కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్’ అని నినదిస్తున్నాను.   ఇప్పుడు ఇక్కడ “వైకాపా హాటావ్ సీమాంధ్ర బచావ్” అని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు పార్టీలు దొందుకు దొందే. కేసీఆర్ సీమాంద్రా ప్రజలను అంత ఘోరంగా అవమానిస్తుంటే, సీమాంద్రాకు ముఖ్యమంత్రి అవుదామని కలలుగంటున్న జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఎందుకు అతనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించలేదు? అతనిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అంటే వారిరువురూ కూడా కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య అవగాహన కలిగినవారే గనుక. అందుకే వారు ఒకరినొకరు విమర్శించుకోరు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారికి ముఖ్యమంత్రి అవుదామని ఆశిస్తున్నారు? అతని ఆ అర్హతే లేదు.   నేను తెలంగాణా పల్లె పల్లెలో కూడా తిరిగి వచ్చాను. కానీ జగన్మోహన్ రెడ్డి దైర్యంగా తెలంగాణాలో తిరగగలరా? అక్కడి ప్రజలకి సీమాంధ్ర ప్రజలపై ఎటువంటి ద్వేష భావనలు లేవు. వారు కేవలం తమను దోపిడీ చేసిన రాజశేఖర్ రెడ్డి వంటి వారిని మాత్రమే వారు ద్వేషిస్తున్నారు. అటువంటి వారికి అధికారం కట్టబెడితే మళ్ళీ భూ కబ్జాలు, దోపిడీ రాజ్యమే వస్తుంది. వైకాపాకి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటే అవుతుంది. సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే దోచేసిన వారికి విడిపోయిన చిన్న రాష్ట్రాన్నిదోచేయడం పెద్ద కష్టమేమీ కాదు. గుడిని మింగిన వారికి ధ్వజస్థంభం మింగేయడం కష్టమా? అందువల్ల వైకాపా ‘హటావ్ సీమాంద్రా బచావ్’ అని పిలుపునిస్తున్నాను.   ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి మనం తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించు కోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపడితే మన రాష్ట్రం దేశం రెండూ కూడా సత్వర అభివృద్ధి సాధిస్తాయని నేను దృడంగా నమ్ముతున్నాను. అందుకే మిమ్మల్ని కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకే ఓటేసి గెలిపించమని కోరుతున్నాను,” అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించారు.

తెలుగు ప్రజలతో విడదీయలేని అనుబంధం మాది: రాహుల్

  ఈరోజు హిందూపురంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం బుగ్గగిల్లి జోకెట్టినట్టుంది. తమ పార్టీకి తెలుగు ప్రజలతో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో చిరకాలంగా విడదీయలేని అనుబంధం ఉందని, కేవలం తమ పార్టీ మాత్రమే ప్రజాభిప్రాయానికి విలువనిస్తుందని అన్నారు. తన తల్లి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, తాను ముగ్గురు కలిసి గట్టిగా పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలా అని తను తీవ్రంగా ఆలోచిస్తున్నానని చెప్పారు. తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రంలో పలు ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.   నేడు తమ పార్టీ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తామని చెపుతున్న రాహుల్, లక్షలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి రెండున్నర నెలలుగా ఆందోళన చేసినప్పుడు ఆయనకు ఈవిషయం గుర్తుకు రాలేదు. తెలుగు ప్రజలతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని చెపుతున్న రాహుల్ గాంధీ, గత పదేళ్లుగా ఉద్యమాలతో రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుంటే, వందలాది విద్యార్దులు ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, ఉద్యమాల కారణంగా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడినప్పుడు, సామన్యుల జీవితం దుర్బరమయ్యి అల్లలాడుతున్నపుడు ఏనాడు కూడా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చింది లేదు, పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేసిందీ లేదు. కానీ నేడు ఉద్యమాల వేడి చల్లారిన తరువాత, రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత ఇప్పుడు తాపీగా వచ్చి తెలుగు ప్రజలతో తమ అనుబంధం గురించి మాట్లాడుతున్నారు.