పురుషులు తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోకపోవడానికి కారణం ఇదేనట!

సాధారణంగా మహిళలు తమ ఆలోచనలను అందరితో పంచుకుంటారు. అయితే తమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేది పురుషులు నిరాకరిస్తారట. దీనికి కారణాలేమిటో తెలుసా? తన భావాలను ఇతరులతో బహిరంగంగా మాట్లాడగలిగే వ్యక్తి నిజానికి బలహీనుడనే అభిప్రాయం సమాజంలో ఉంది. పురుషులు ఎప్పటికీ బలహీనంగా ఉండలేరు, అందుకే ప్రతి మనిషి తనను తాను బలంగా నిరూపించుకోవడానికి తన మాటలను తన గుండెలోనే దాచుకుంటాడు.  ఈ కారణంగా తనకు నచ్చినవారి దగ్గర తనకు అవసరమైనప్పుడు మాత్రమే తన భావాలను పంచుకుంటాడు. ఎన్సో వెల్నెస్ వ్యవస్థాపకుడు, వెల్నెస్ కోచ్ అరుబా కబీర్, పురుషులు తమ భావాలను పంచుకోకపోవడానికి అనేక సామాజిక, సాంస్కృతిక,  వ్యక్తిగత కారణాలు ఉన్నాయని వివరించారు. మీ భావోద్వేగాలను చాలా కాలం పాటు అణచివేయడం వల్ల మానసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తికి అవకాశాలు పెరుగుతాయి. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా, పురుషులు హేతుబద్ధత, సంప్రదాయవాదాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే పురుషుల మనస్సు రాయిలా ఉంటుందని అనుకుంటారు. ఎదుటివారి ముందు తమ భావాలను చెబితే బలహీనులుగా కనిపిస్తారని భయపడతారు. కాబట్టి వారు తమ భావాలను దాచడానికి ప్రయత్నిస్తారు. పురుషులు ఇతరుల ముందు బలహీనంగా కనిపించకుండా ఉండటానికి సమర్థవంతమైన మార్గంగా భావిస్తారు. కానీ  మీ భావాల గురించి ఇతరులతో మాట్లాడటం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. తమ భావోద్వేగాలను ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తీకరించగలిగిన పురుషులలో ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు గుర్తించారు.  మీ భావాలను ఇతరులతో పంచుకున్నప్పుడు, ఇది మీ జీవితంలోని అన్ని సంబంధాలను బలోపేతం చేసే కనెక్షన్,  నమ్మకాన్ని సృష్టిస్తుంది. మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి పురుషులలో అవగాహన పెంచడం ముఖ్యం. ఇది మానసిక ఆరోగ్య నిపుణులతో చర్చించాలి. నమ్మకంగా మీ ఆలోచనలను విశ్వసనీయ స్నేహితుడు లేదా బంధువుతో పంచుకోవడం చాలా ముఖ్యం.

తండ్రి కూతుళ్ల బంధం  బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

సోషల్ మీడియాలో ఎక్కడైనా అమ్మాయిల పనులకు సంబంధించి కామెంట్లు వచ్చాయి అంటే అందులో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనే కామెంట్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి తండ్రికి తన కూతురు అంటే యువరాణితో సమానం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తండ్రులు కూతుళ్లను చాలా ప్రేమగా పెంచుతారు. కూతుళ్ల గురించి నెగిటివ్ ఆలోచన లేని కుటుంబంలో గమనిస్తే తండ్రులకు కూతుళ్లకు మధ్య ఉండే బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తండ్రి అందరికంటే ఎక్కువగా తన కూతురును ప్రేమిస్తాడు. చాలామంది తండ్రులు తన కూతురిలో తమ తల్లిని చూసుకుంటారు. తండ్రులు తమ తల్లుల దగ్గర పొందిన ప్రేమను, ఆప్యాయతను తమ కూతుళ్ల దగ్గర చూపిస్తుంటారు. ఇంటికి మహాలక్ష్మి లాగా కళ తీసుకొచ్చిందనే ఆలోచన కూడా తండ్రికి తమ కూతుళ్ల మీద ప్రేమ ఎక్కువ ఉండటానికి కారణం.  అయితే తండ్రికి, కూతురికి మధ్య బంధం బలంగా మారాలంటే కింది పనులు చెయ్యాలి. కూతుళ్లు జీవితంలో దైర్యంగా ముందుకు సాగడానికి తండ్రుల మార్గదర్శనం చాలా సహాయపడుతుంది. తన తండ్రి తనకు తోడు ఉన్నాడనే భరోసా కూతురిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తండ్రి నడవడిక, ప్రవర్తన, మనస్తత్వం ఆడపిల్లకు ప్రేరణ అవుతుంది.  పురుష సమాజం పట్ల ఆడపిల్లలో గౌరవభావం కలగడానికి తండ్రి కారకుడు అవుతాడు. తండ్రి మీద కూతురికి నమ్మకం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే తండ్రి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.  కూతురు ఆసక్తి చూపించే పనులలో తండ్రి కూడా పాలు పంచుకోవాలి.  ఇలా చేస్తే కూతురికి, తండ్రికి మధ్య బంధం చాలా దృఢంగా మారుతుంది. తండ్రులు గౌరవంగా,  మంచి విలువలతో ప్రవర్తిస్తే  కూతుళ్లు కూడా తమ ఆత్మగౌరవం,  మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. తండ్రి గౌరవాన్ని కాపాడే దిశగా ఆరోగ్యకరమైన మార్గాలలో అడుగులు వేస్తారు. తండ్రులకు, కూతుళ్లకు మధ్య బంధం బలపడాలంటే ప్రతి తండ్రి తన కూతురి కలల పట్ల నిరాశ కలిగించకూడదు. కూతురి కల సాకారం అయ్యే దిశగా ప్రోత్సహించాలి. కూతురిని ముందడుగు వేయించాలి. అప్పుడు కూతురి విజయంలో తండ్రి పాత్ర చాలా ఉంటుంది. కూతురికి తన తండ్రి పట్ల గౌరవం పెరుగుతుంది.                                             *రూపశ్రీ.

భార్యాభర్తలు కోపాన్ని మౌనంతో వ్యక్తం చేయడం మంచిదేనా?

ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న తగాదాలు కూడా ఉంటాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచేలా పనిచేస్తాయి. అయితే ఈ చిన్న విషయాలు ఎప్పుడు ఇద్దరి బంధాన్ని పాడుచేస్తాయో కొన్నిసార్లు  గుర్తించలేము. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోపం తెచ్చుకుంటారు. కొందరు కేకలు వేస్తారు,  కొందరు మాట్లాడి  సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కోపం రిలేషన్‌షిప్‌లో విబేధాలను సృష్టిస్తుంది.  అయితే  కొంతమంది తమ  మాటల్లోనో, చర్యల్లోనో చూపించకుండా సింపుల్ గా మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ ఇలా మౌనంగా ఉండటం అనేది కొన్నిసార్లు సంవత్సరాల బంధాన్ని కూడా విచ్చిన్నం చేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు మౌనం బంధం విడిపోవడానికి ఎలా కారణం అవుతుంది? తెలుసుకుంటే.. దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడల్లా ఒకరు మాట్లాడటం మానేయడం తరచుగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో  కోపం ఎంతగానో పెరిగిపోతుంది.  ఇలాంటి వ్యక్తులు గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చెయ్యరు. అలాగని తిరిగి భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి హృదయం గాయపడుతుంది.  వారు ఒంటరితనం అనుభూతి చెందుతారు. దీని ప్రభావం  వైవాహిక బంధం మీద ప్రభావం చూపుతుంది. గొడవ జరిగినప్పుడు కోపాన్ని వ్యక్తం చెయ్యడానికి బదులు మౌనాన్ని ఆశ్రయించడం అనేది భావోద్వేగాలను తారుమారు చేస్తుంది.  ఇది భార్యాభర్తల బంధంలో  చాలా చెడ్డది. గొడవ జరిగిన ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తారేమోనని ఎదుటివారి మనసులో భయాన్ని కలిగిస్తుంది.  ఈ ఆలోచన భాగస్వామిని చాలా బాధపెడుతుంది. రిలేషన్ షిప్ లో గొడవలు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది కాదు. ఇలా సైలెంట్ గా ఉండటం అనేది భాగస్వామిని అవమానపరిచినట్టే.  ఇలా మౌనంగా మాట్లాడకుండా ఉండటం  వల్ల  భాగస్వామి తనను  విడిచిపెట్టేస్తారేమో అనే భావన కలిగే అవకాశం ఉంది. మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల ఎదుటివారి మనసులో అనేక రకాల ఆలోచనలు రావచ్చు.  ఎదుటి వారు కూడా భాగస్వామి మాట్లాడకపోవడం వల్ల అతిగా ఆలోచించి తీవ్రమైన డిప్రెషన్,  అనూహ్య నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి జారుకోవచ్చు. భార్యాభర్తలు ఎప్పుడూ కుటుంబ సభ్యుల కారణంగానో, స్నేహితుల కారణంగానో,  ఆర్థిక విషయాల కారణంగానో, లేదా బయటి విషయాల కారణంగానో గొడవ పడి విడిపోవడం అనే చర్య వరకు వెళ్లకూడదు.  భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సినవారు.  ఒకరి విషయంలో ఒకరికి మనస్పర్థలు ఉన్నా చర్చించి పరిష్కరించుకోవాలి. అలాంటిది ఇతరుల కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం,  ఒకరిని ఒకరు వదులుకోవడం అనే చర్య వరకు వెళ్ళడం మూర్ఖత్వం. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భాగస్వామితో మాట్లాడటం మానేయడం లేదా  మౌనంతోనే తమ నిరసన వ్యక్తం చేయడం వంటివి చేస్తుంటే అలాంటి అలవాటును వదిలేయడం మంచిది. భాగస్వాములు  సుఖ దుఃఖాలలో మీకు తోడుగా నిలిచేవారని గుర్తుంచుకోవాలి.   ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి కారణంగా దూరం పెరుగుతుంటే ఆ వ్యక్తిని దూరంగా ఉంచాలి తప్ప మూడవ వ్యక్తి కోసం ఇద్దరూ గొడవ పడకూడదు. భాగస్వాములు  ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ,  గౌరవం మొదలైనవాటికి అర్హులు.  ఇద్దరూ కలసి మాట్లాడుకోవడం ద్వారా  సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి,  దూరాన్ని తగ్గించుకోవాలి.  ఇద్దరి మధ్య అందమైన బంధాన్ని మరింత బలపరుచుకోవాలి.                                               *రూపశ్రీ.   

భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండాలంటే ఈ పనులు చేయాలట..!

జీవిత ప్రయాణంలో ప్రేమకు, పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా సింగిల్ గా ఉండటం, తల్లిదండ్రులు కుటుంబ తోబుట్టువులుతో కలసి జీవించడం వేరు..  జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చాక ఆ మనిషితో జీవితాంతం ఒక దృఢమైన బంధాన్ని నిర్మించుకోవడం వేరు. వైవాహిక జీవితం ఇద్దరి మధ్య సామరస్యం, విశ్వాసం, పరస్పర గౌరవం, నమ్మకం మొదలైన వాటితో  వృద్ధి చెందుతుంది. కేవలం ఇవి మాత్రమేకాదు..   వాస్తు శాస్త్రం, పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం, ఇంటి వాతావరణం మొదలైనవి కూడా ఇంటిలో సానుకూల వాతావరణాన్ని,  భార్యాభర్తల మధ్య    ప్రేమ, నమ్మకాన్ని, ఇద్దరి సంతోషాన్ని పెంచుతాయి.  భార్యాభర్తల వైవాహిక జీవితం మెరుగ్గా ఉండటానికి శాస్త్రీయంగానూ, భారతీయ వాస్తు పరంగానూ ఎలాంటి టిప్స్ ఫాలో కావాలంటే.. భారతీయ వాస్తు శాస్త్రంలో దిక్కులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  కనీసం భోజనం చేయడం నుండి నిద్రించడం వరకు ఈ దిక్కులను దృష్టిలో ఉంచుకునే చేస్తుంటారు అందరూ. వాస్తు ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఉండే గది ఉత్తరం,  దక్షిణం,  ఈశాన్యం, ఆగ్నేయ దిక్కులలో ఉండకూడదట.  ఈ దిక్కులలో ఉంటే భార్యాభర్తల మధ్య చిన్నవిషయాలలో విభేదాలు, వివాదాలు, గొడవలకు దారితీస్తాయట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత,  సంతోషం, సానుకూల వాతావరణం ఉండాలంటే భార్యాభర్తల గది వాయువ్య దిశలో ఉండాలి. ఈ దిశలలో భార్యాభర్తలు నిద్రించే గది ఉంటే వారిద్దరి మధ్య ఒకరి నుండి మరొకరికి మంచి సహకారం ఉంటుంది. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఇద్దరూ కలసి పరిష్కరించుకోగలుగుతారు. రంగులతో  జరిగే మ్యాజిక్.. రంగులు భావోద్వేగాల మీద ,  మనిషి మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం, ఇద్దరి మధ్య అవగాహన పెరగడానికి పడక గదిలో రంగులు కూడా సహాయపడతాయి.  పింక్,  ఎరుపు,  ఊదా రంగులు భార్యాభర్తల మధ్య ప్రేమను, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.మృదువుగా ఉండే పాస్టెల్ లు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. గదిలో ఇవి ఉంచండి.. భార్యాభర్తలు నిద్రించే గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పడకగది నైరుతి మూలలో ప్రేమను, బంధం మధ్య బలాన్ని తెలిపే విధంగా ఉండే పావురాల జంట బొమ్మలు లేదా ఫొటో ఫ్రేమ్ వంటివి ఉంచవచ్చు.  లేదంటే బాతుల జంటలకు సంబంధించినవి కూడా ఉంచుకోవచ్చు.  ఇవి మాత్రమే కాకుండా గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే పువ్వుల పెయింటింగ్ లు, ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, అందమైన కళాకృతులు ఉంచుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటిని, పడక గదిని చిందర వందరగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోవడం, పడక గదిలో మంచి సువాసన ఉండేలా తాజా పువ్వులు లేదా ఎయిర్ ఫ్రెషర్ లు  ఉపయోగించాలి.  ముఖ్యంగా భార్యాభర్తలు తమ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అయిన మొబైల్ ఫోన్ లను తమ గదిలో ఉంచడం మానేయాలి. నిద్ర లేవాలనే నిబంధన ఉండే అలారం వాచ్ ను ఉపయోగించాలి.                                            *రూపశ్రీ.  

పీరియడ్స్ గురించి పిల్లలకూ అవగాహన కావాలి.. ఎందుకంటే!

మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.  ఈకాలంలో చిన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు మందలించారనో, మొబైల్ ఫోన్ ఇవ్వలేదనో, పరీక్షలు తప్పారనో ఇలా చాలా కారణాలు వింటూనే ఉన్నాం. కానీ మొదటిసారి పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని చూసి,  పీరియడ్స్ సమయంలో నొప్పి భరించలేక  14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పీరియడ్స్ ప్రతి ఆడపిల్ల జీవితంలో ముఖ్యమైన దశ. సాధారణంగా అమ్మాయిలు పీరియడ్స్ ను, పీరియడ్స్ సమయంలో నొప్పిని, ఆ సమయంలో కలిగే ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడం సజహమే.  కానీ మొదటిసారి నెలసరికి లోనయ్యే బాలికలకు దీని గురించి చాలా గందరగోళం ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కు తగినట్టు ఆడపిల్లలతో పాటూ మగపిల్లలకు కూడా పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన ఉండనే ఉంటుంది. కానీ వీటిని స్వయంగా అనుభవించడంలోనే ఇబ్బంది దాగుంటుంది.  దీని గురించి బాలికలకు  అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.  తద్వారా బాలికలలో నెలసరి సమయాల్లో ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవడం వీలవుతుంది. ముంబైలో జరిగిన ఉదంతం గురించి ప్రస్తావనలోకి వెళితే ఆత్మహత్య చేసుకున్న బాలికకు అదే మొదటిసారి పీరియడ్స్ రావడం. అంతకు ముందెప్పుడూ ఆమె తల్లి ఆమెకు పీరియడ్స్ గురించి చెప్పలేదు. పైపెచ్చు వారికి ఆర్థిక స్థోమత లేని కుటుంబం కావడంతో బాలికను పాఠశాలకు కూడా పంపలేదు. దీంతో బాలికకు తల్లి నుండి కానీ, సమాజం నుండి కానీ పీరియడ్స్ అనే విషయం గురించి అవగాహన లేదు.  14ఏళ్ళ బాలికకు మొదటిసారి రక్తస్రావం చూసి భయపడింది.  ఆమె తల్లి ఆ పాపకు అది అందరికీ సాధారణం అని వివరించి చెప్పింది. కానీ ఆ పాప  అప్పటికే రక్తస్రావం గురించి ఆందోళనలో ఉంది. పైగా తన శరీరంపై తనకు అసహ్యం కలుగుతోందని తల్లికి చెప్పింది.  కానీ కూతురు అర్థం చేసుకుంటుందని ఆ పాప తల్లి అనుకుంది. కానీ ఆ పాపకు పీరియడ్స్ వచ్చిన రెండవరోజున దారుణమైన  వార్త వినాల్సి వచ్చింది. ఆ పాప ఒత్తిడి, ఆందోళన,  తన శరీరం మీద తనకు  పుట్టిన అసహ్యం కారణంగా  ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త కారణంగా పీరియడ్స్ గురించి ఆడపిల్లలో అవగాహన పెరగాలని అంటున్నారు. కొందరు పీరియడ్స్ గురించి బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడరని, అది బాలికల జీవితానికి చాలా చేటు చేస్తుందని అంటున్నారు. కాబట్టి బాలికలకు చిన్నవయసులోనే ఈ విషయాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.                                               *నిశ్శబ్ద.  

రిలేషన్ ఏక పక్షంగా సాగుతుంటే మానసిక సమస్యలు వస్తాయా?

మానసిక సమస్యలు ఇప్పట్లో చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికాలం యూత్  మానసిక సమస్యలతో చాలా సతమతం అవుతున్నారు. ప్రేమ, వివాహం లాంటి బంధం ఏర్పడిన తరువాత  ఆ బంధం చాలావరకు ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది.  ముఖ్యంగా వివాహంలో భార్యాభర్తలు ఇద్దరూ తమ బంధం గురించి ఆలోచించాలి. కానీ దీనికి బదులుగా భార్యాభర్తలలో ఒకరు మాత్రమే తమ బంధం నిలబడాలని తాపత్రయ పడుతున్నా,  ఒకరు మాత్రమే ఏ తప్పు జరిగినా దానికి బాధితులుగా మారుతున్నా, ఒక్కరే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఆ బంధంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటారని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. అసలు తమ బంధం నిజంగానే ఏకపక్షంగా ఉందా? దీన్ని గుర్తించడం ఎలా? తెలుసుకుంటే.. భాగస్వామితో సన్నిహితంగా ఉన్న తర్వాత కూడా  ఇద్దరి మధ్య బంధం అంత ఆరోగ్యకరంగా ఉండకపోవడం.   ఇద్దరి మధ్య ఏవైనా మాటలు ఉంటాయి. కానీ ఆ మాటల్లో ప్రేమ గురించి, ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత, అన్యోన్యత గురించి, లేదా భవిష్యత్తు గురించి లోతైన సంభాషణలు ఏమీ ఉండవు. రిలేషన్ లో ఉన్న వ్యక్తి పైకి భాగస్వామిగా ఉన్నా ప్రతిసారీ తన భాగస్వామి హృదయం  గాయపడే విధంగా మాట్లాడటం,  తప్పులు చేయడం జరుగుతుంది.  ఇవన్నీ చేసి ఆ తరువాత   క్షమాపణలు చెప్పడం లాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు. ఏకపక్షంగా సాగుతున్న రిలేషన్ లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఇన్ సెక్యురిటీ ఫీల్ అవుతూ ఉంటారు. లైఫ్ పార్టర్నర్ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇద్దరి మధ్య బంధం పదునవ్వడానికి,  ఇద్దరి మధ్య ప్రేమ పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి తరువాత విఫలమవుతూ ఉంటారు. ఇలా జరిగితే ఏమవుతుంది?  ఏకపక్షంగా సాగే ఈ రిలేషన్ వల్ల  బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే భాగస్వామి ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉంటారు.  వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న తప్పులకు దోషులుగా మారడం వల్ల తమ మీద తమకు నమ్మకం పోవడమే కాదు..  ప్రేమ మీద నమ్మకం కూడా కోల్పోతారు. తమలో లోపాలు వెతుక్కోవడం మొదలుపెడతారు. ఇలాంటి ఏకపక్ష రిలేషన్ లు  వ్యక్తి ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. తమ భాగస్వామి తమతో సంతోషంగా ఉంటే చాలనే  ఆలోచనల వల్ల తమను తాము దోషులుగా నిలబెట్టుకుంటారు.  ఇలా మెల్లిగా వారు బలహీనులుగా మారిపోతారు.  ఆందోళన,  నిద్రలేమి,  కళ్ల కింద నల్లని వలయాలు, ఆహారం, ఆరోగ్యం మీద శ్రద్ద లేకపోవడం వంటి వాటివల్ల ముఖం డల్ గా మారిపోతుంది.  ఇది క్రమంగా వారిని డిప్రెషన్ లోకి నెట్టివేస్తుంది.                                                              *రూపశ్రీ.

ప్రేమలో బ్రేకప్ అయ్యాక బాధపడకూడదంటే ఇలా చేయండి..!

ఈ జనరేషన్ వాళ్లకు ప్రేమ అనేది చాలా కామన్ విషయం. అది కూడా ప్రేమించడం, విడిపోవడం, ఆ తరువాత మళ్లీ ఇంకొక వ్యక్తితో ప్రేమలో పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎంతమందిని ప్రేమించినా, విడిపోయినా ప్రేమలో ఉన్నప్పుడు  ఎన్నో విషయాలు పంచుకుంటారు,  వాళ్లతో సమయం గడపడానికి ఎంతో సాహసం కూడా చేస్తారు. కష్టం, సంతోషం,  బాధ, చేదు సంఘటనలు,  చిలిపి గొడవలు, ఒకరి పట్ల ఒకరు చూపించుకున్న ఆప్యాయత ఇవన్నీ ప్రతి ప్రేమ జంట మధ్య జరిగేవే. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి చాలా ఓపెన్ అయిపోతారు కూడా. కానీ ప్రేమ విఫలం అయ్యాక, ఇద్దరూ దూరం అయ్యాక  జరిగేది చాలా బాధాకరం. ఆ బాధ నుండి బయటపడలేక సతమతం అయ్యేవారు చాలామంది ఉంటారు.  ఈ బాధను అధిగమించడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. అంగీకారం.. విడిపోయిన తర్వాత చాలా మంది తమ భాగస్వామి తమను విడిచిపెట్టారని అంగీకరించలేరు.   పాత విషయాలలోనే చిక్కుకుపోతారు. దీనివల్ల బ్రేకప్ అయిన తరువాత కూడా  విడిపోయిన వ్యక్తి గురించే ఆలోచిస్తూ, బాధపడుతూ ఉంటారు. కానీ బ్రేకప్ అయ్యాక ఇక ఇద్దరి మధ్య  సంబంధం ముగిసిపోయిందని మనస్ఫూర్తిగా అంగీకరించాలి.   అవన్నీ వదిలిపెట్టాల్సిన విషయాలని అర్థం చేసుకుని జరగాల్సిన వాటి గుంరిచి ఫోకస్ పెట్టాలి. స్నేహితులు.. బ్రేకప్ తరువాత బాధ నుండి బయటపడానికి స్నేహితులే గొప్ప మార్గం. బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప  బాధను ఎవ్వరూ అంతగా అర్థం చేసుకోరు. స్నేహితులు అందరూ ఒక్కచోట చేరితే వారితో సమయం గడుపుతూ తమ జీవితంలో బ్రేకప్ లాంటి చేదు దశ ఒకటి ఏర్పడిందనే విషయమే గుర్తుండదు. అబ్బాయిలకు అయినా అమ్మాయిలకు అయినా ఇది చక్కని మార్గం.  అందుకే బ్రేకప్ పెయిన్ మర్చిపోవడానికి స్నేహితులను కలవాలి. భవిష్యత్ లక్ష్యాలు.. ఎంతసేపు ప్రేమించిన వ్యక్తి గురించి, గతంలో వారితో గడిపిన సమయం గురించి,  జరిగిన గొడవల గురించి, విడిపోయిన సంఘటన గురించి పదే పదే తలచుకుని బాధపడటం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప భవిష్యత్తుకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.  ఒక వ్యక్తి జీవితంలో నుండి వెళ్లిపోయారని అర్థం చేసుకుని భవిష్యత్తు మీద, లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది.  ఇది భవిష్యత్తును ఎంతో అందంగా మారుస్తుంది. జీవితంలో ఉన్నతంగా నిలబడేలా చేస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్.. చాలామంది బ్రేకప్ తరువాత ఇక బ్రతికి ఉండటం ఎందుకు అని ఆలోచిస్తారు.  వదిలేసిన వ్యక్తి లేకుండా ఎలా బ్రతకడం అని అనుకుంటారు. ఈ ఆలోచన నుండే సూసైడ్ వైపు వెళతారు. కానీ  విడిపోయిన వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఎప్పటికీ సరైనది కాదు.  జీవితంలో ఎవరున్నా లేకపోయినా తనకు  తాను ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.  తన గురించి తాను కేర్ తీసుకోవాలి. తనని తాను ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కలిగిన వారు ఎవరూ ఇతరుల కారణంగా చావును ఎంచుకోరు.                                  *రూపశ్రీ.

పిల్లలు తండ్రి నుంచి మాత్రమే నేర్చుకోగల 5 విషయాలు ఇవి..!

    ప్రతి పిల్లవాడి దృష్టిలో తన తండ్రి సూపర్ హీరో.  బయట ఏ మహిళను అయినా అమ్మ అని పిలిచే వీలుంటుంది. కానీ నాన్న అని కేవలం కన్న తండ్రిని మాత్రమే పిలుస్తాం.  తల్లిదండ్రులలో ఎప్పుడూ పిల్లలకు దగ్గరగా ఉండేది,  పిల్లల బాగోగులు దగ్గరగా చూసుకునేది తల్లే. అందుకే చాలా మంది పిల్లలు తల్లితోనే చనువుగా ఉంటారు. కానీ తండ్రి బయట ఉద్యోగం చేసి భార్యా పిల్లలకు జీవితం మీద భరోసా ఇవ్వగలిగితేనే ఏ భార్య అయినా తన పిల్లలను ప్రశాంతంగా చూసుకోగలదు.  కాబట్టి ప్రతి కుటుంబం ప్రశాంతంగా ఉండటం వెనుక నాన్న కష్టం, ఆయన త్యాగం చాలా ఉంటుంది.  అయితే పిల్లలు తన తండ్రి నుండి మాత్రమే నేర్చుకోగలిగే విషయాలు కొన్ని ఉన్నాయి.  ఇవి బయట ఎవ్వరినీ చూసి నేర్చుకోలేరు.  అవేంటో ఓ లుక్కేస్తే.. బాధ్యత నుండి పారిపోకుండా ఉండటం.. చాలామంది కష్టం, బాధ,  అసౌకర్యం అనిపించగానే వాటి నుండి దూరంగా పారిపోతారు.  దానివల్ల తాము ప్రశాంతంగా ఉండగలుగుతాం అని అనుకుంటారు. కానీ తండ్రి అలా ఆలోచిస్తే భార్యాపిల్లల జీవితం తలకిందులు అవుతుంది.  తండ్రి బాధ్యతలు, కష్టాలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఒక సైనికుడిలా సిద్దంగానే ఉంటాడు. కాబట్టే భార్యా పిల్లలు ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. బాధ్యతల నుండి పారిపోకుండా.. వాటిని  సమర్థవంతంగా మోసేది తండ్రి మాత్రమే.  ఈ లక్షణాన్ని పిల్లలు తండ్రి నుండి నేర్చుకుంటారు.  ఓ కుటుంబాన్ని మోయడం  బరువు కాదు బాధ్యత అని తండ్రి నుండి తెలుసుకుంటారు. మాట వినడం.. చాలామంది అంటూ ఉంటారు.  అమ్మ చెబుతూ ఉంటే నాన్న వింటూ ఉంటాడు అని.  కొందరు ఈ విషయంలో తండ్రులను చులకన చేయడం, జోకులు వేయడం కూడా చేస్తారు.  అయితే తండ్రి ఇలా కేవలం వినడం వల్ల తల్లిదండ్రుల మద్య రెలేషన్ ఎంత ఆరోగ్యకరంగా ఉందో అర్థమవుతుంది. కొన్నిసార్లు తండ్రి చెప్పే మాటను తల్లి, తల్లి చెప్పే మాటలను తండ్రి ఓపికగా వినడం చూసి  పిల్లలు కూడా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.   ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు వినడం అనే లక్షణం పిల్లలను కూడా గొప్పగా తయారుచేస్తుంది. రోల్ మోడల్.. చాలామంది తల్లిదండ్రులను, తమ అవ్వ తాతలను తమ రోల్ మోడల్స్  అని పేర్కొంటూ ఉంటారు. నిజానికి ప్రతి పిల్లవాడికి తన తండ్రి రోల్ మోడల్ గా ఉండాలి. తండ్రి కుటుంబం బాధ్యత తీసుకుంటాడు. ఎవరికి ఏం కావాలన్నా చూసుకుంటాడు.  ఎవరికీ ఏ లోటు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆర్ఠిక విషయాల నుండి సాధారణ సమస్యల వరకు ప్రతి దాన్ని తండ్రి ఎంతో  ఓపికగా డీల్ చేస్తాడు. అన్నింటినీ హ్యాండిల్ చేస్తాడు కాబట్టే తండ్రి కొడుకు దృష్టిలో రోల్ మోడల్ గా ఉంటాడు. నిస్వార్థం.. ప్రతి తండ్రి తన పిల్లలు గొప్పగా ఉండాలని ఆశ పడతాడు.  చదువు చెప్పించడం నుండి,  పిల్లల  అవసరాలు తీర్చడం వరకు అన్ని విషయాలలో తనకంటే తన పిల్లలు ఎక్కువ సుఖపడాలని అనుకుంటాడు.  కొన్ని సార్లు పిల్లల సంతోషం కోసం డబ్బు కూడా లెక్క చేయడు. తనకు ఏమీ లేకపోయినా భార్య, పిల్లలను సంతోష పెడితే చాలని అనుకుంటాడు. కుటుంబం విషయంలో నిస్వార్థంగా ఉండేది నాన్న మాత్రమే. ఈ లక్షణాన్ని  పిల్లలు తండ్రి నుండే స్పష్టంగా గ్రహించి అలవాటు చేసుకోగలరు. చేయడం, నేర్చుకోవడం.. ఒక మగాడు తన పిల్లల కోసం తనకు తెలియని పనిని కూడా చేయడానికి సిద్దపడతాడు. పనిని చేస్తూ నేర్చుకోవచ్చనే గుండె ధైర్యం,  ఆత్మవిశ్వాసం కేవలం తండ్రికి మాత్రమే ఉంటుంది. ఆ తండ్రి మనసులో కేవలం తన పిల్లలు, భార్యకు లోటు రాకూడదనే ఆరాటం తప్ప తను చేస్తున్నది ఎంత కష్టమైన పని అనే ఆలోచన అస్సలు ఉండదు. ప్రతి పిల్లవాడు తండ్రి నుండి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది వారిని జీవితంలో ఏ పనిని అయినా ధైర్యంగా చేసేందుకు సహాయపడుతుంది.                                        *రూపశ్రీ.  

 ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ గురించి తెలుసా?

నేటి ఇంటర్నెట్ యుగంలో పిల్లల నుండి పెద్ద వారి వరకు ఫోన్ లేకపోయినా, నెట్ కనెక్షన్ లేకపోయినా ఒక్క నిముషం కూడా ఉండలేని స్థితికి దిగజారిపోయారు. ఫోన్ లేకపోతే పిల్లలు అన్నం తినరు, హోం వర్క్ చెయ్యరు,  చివరకు అల్లరి చేయకుండా నిద్రపోవడానికి సిద్దం కారు.   ఇక పెద్దలు అయితే సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి ఫేస్ బుక్, యూట్యూబ్ లో గంటలు గంటలు కాలక్షేపం చేస్తుంటారు. ఇది చాలామందిల వ్యసనంగా మారుతోంది.  ఎప్పుడూ పోన్ కు, ఇంటర్నెట్ కు అతుక్కుని ఉండేవారికి ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడపడం, బాధ్యతలను విస్మరించడం, జీవితం మీద సీరియస్ నెస్ లేకపోవడం,  జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు.  ఈ సమస్య నుండి బయట పడటానికి ఏం చేయాలో వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే.. సమస్యను గుర్తించాలి. ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్ఢర్ ని అధిగమించడంలో మొదటి దశ సమస్య ఉందని అర్థం చేసుకోవడం. మీ ఇంటర్నెట్ వినియోగ విధానాలను గమనించుకోవాలి.   ఇది  దైనందిన జీవితాన్ని, సంబంధాలను, పనితీరును  ప్రతికూలంగా  ఎలా ప్రభావితం చేస్తుందో లేదో అంచనా వేయండి. ఇంటర్నెట్ వినియోగం కోసం కొన్ని రూల్స్ ఏర్పాటుచేసుకోవాలి. ఇంటర్నెట్‌ని ఉపయోగించడం కోసం రోజులో నిర్దిష్ట సమయాలను కేటాయించుకోవాలి.  ఈ పరిమితులకు కట్టుబడి ఉండాలి. ఆన్‌లైన్‌లో  గడిపే  సమయాన్ని ట్రాక్ చేయాలి. దాన్ని నియంత్రించడంలో  సహాయపడే స్మార్ట్‌ఫోన్ యాప్‌లు లేదా బ్రౌజర్ లను ఉపయోగించాలి. ఇంటర్నెట్‌తో సంబంధం లేని హాబీలు,  కార్యకలాపాలను ఎంచుకోవాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, తోటపని చేయడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను  కలుసుకోవడం, వారితో మాట్లాడటం వంటివి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇవి ఆలోమేటిక్ గా  ఆన్‌లైన్‌లో ఉండాలనే ప్రలోభాన్ని తగ్గేలా చేస్తాయి. ఆన్లైన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి  స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా థెరపిస్ట్‌ను సంప్రదించండి. వారి సపోర్ట్ తీసుకోవాలి.  ఇంటర్నెట్ వినియోగం గురించి  ఆందోళనలను,  అది  జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చర్చించాలి. కొన్నిసార్లు, ఎవరితోనైనా మాట్లాడటం వలన  సమయాన్ని ఆన్‌లైన్‌లో సమయాన్ని  సమర్థవంతంగా నిర్వహించడానికి,  కొత్త దృక్కోణాలు,  వ్యూహాలను అమలుచేయడానికి మార్గాలు దొరికే అవకాశం ఉంటుంది. పని లేదా ఏదైనా పరిశోదించడం, విశ్రాంతి, వ్యాయామం, కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. టీవి, ఫోన్, సిస్టమ్ మొదలైనవాటి  నుండి రెగ్యులర్ బ్రేక్‌ తీసుకోవాలి.   ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు వంటి స్వీయ-సంరక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.                                                       *రూపశ్రీ.

భార్యాభర్తలను మరింత దగ్గర చేసే మార్గాలు ఇవే..!

ప్రతి జంట జీవితం పెళ్లితో ఎంతో సంతోషంగా మొదలవుతుంది.  పెళ్లి తరువాత హనిమూన్ జరిగేవరకు అదొక ప్రపంచంలో ఉంటారు. ఆ తరువాత మెల్లగా వృత్తి, కుటుంబ బాధ్యతలలో పడిపోతారు. ఉద్యోగ ఒత్తిడులు, కుటుంబ బాధ్యతల కారణంగా భార్యాభర్తల మధ్య దగ్గరితనం కాస్త తగ్గడం మామూలే. ఇది అలాగే దీర్ఘకాలం కొనసాగితే భార్యభర్తలు ఇద్దరూ వేర్వేరు వ్యక్తులలా  ఫీల్ అయ్యే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు..  ఇద్దరి మద్య ఉండే బంధం బలహీనం అవుతుంది.  అలా కాకుండా భార్యాభర్తలు ఎప్పుడూ కొత్తగా పెళ్లైనవారిలా  సంతోషంగా సంతోషంగా ఉండాలంటే ఈ కింది పనులు తప్పక చెయ్యాలి. టైం స్పెండ్ చేయాలి.. రోజువారీ జీవితం హడావిడిలో భాగస్వామితో  సమయాన్ని గడపడంలో చాలామంది  నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధాన్ని, చనువును పునరుద్ధరించుకోవడానికి ఒకరికొకరు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. సాధారణ రోజుల్లో రాత్రి సమయాలు, వారాంతపు సెలవులు లేదా రాత్రి పూట ఇద్దరూ కలసి వంట చేయడం, ఇద్దరూ కలసి భోజనం చేయడం, ఇద్దరూ కలసి షాపింగ్ చేయడం,  పరధ్యానంగా ఉండకుండా ఒకరిని ఒకరు సంతోష పెట్టడం చేయాలి.   ఆశ్చర్యం.. భాగస్వాములు చేసే చిన్న పనులు ఇద్దరి మధ్య సాన్నిథ్యాన్ని నిలివి ఉంచుతాయి.  ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేస్తాయి.  ఒకరికొకరు సర్ప్రైజ్ ఇచ్చుకోవడం ఇద్దరి మధ్య బందాన్ని చాలా బలపరుస్తుంది.  ఇవి పెద్ద పెద్దవి కానక్కర్లేదు.  భర్త ఆఫీసు నుండి ఇంటికెళ్తూ బార్యకు నచ్చింది తీసుకెళ్లడం,  భార్యకు నచ్చిన వంటకం నేర్చుకుని తయారు చేయడం వంటివి చేస్తే.. భార్య భర్త లంచ్ బాక్స్ లో అతనికి నచ్చిన ఆహారాన్ని పెట్టడం నుండి అతని ఆఫీసు ఒత్తిడిని అర్థం చేసుకుని అతనికి సహకరించడం వరకు చాలా ఉంటాయి. కమ్యూనికేషన్.. చాలామంది మధ్య గొడవలు వచ్చేది, ఇద్దరి మధ్య దూరం పెరిగేది కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లనే.  భార్యాభర్తలు ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏ సమస్యలు అయినా పరిష్కారం అవుతాయి. ఒకరి ఆలోచనలు,  ఒకరి ఆందోళనలు, ఒకరి అభిరుచులు, ఆశయాలు ఇలా ప్రతి ఒక్కటీ ఒకరితో మరొకరు చెప్పుకుని చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని లోతుగా పెంచుతుంది. ప్రయత్నాలు.. కొత్త పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది.  భార్యాభర్తలకు ఇద్దరికీ కొత్తగా ఉన్న పనిని ఇద్దరూ కలసి చేయడం, ఇద్దరూ కలసి దాన్ని నేర్చుకోవడం వల్ల ఇద్దరికీ ఒకరి సహకారం మరొకరికి అందుతుంది.  ఇది ఇద్దరూ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇన్ డైరెక్ట్ గానే చెబుతుంది. అంతే కాదు..  ఏదైనా పనిలో భాగస్వామి తోడైతే ఆ పని చేయడంలో ఉండే వ్యత్యాసం కూడా అర్థమవుతుంది. థ్యాంక్స్ చెప్పాలి.. రోజువారి పనులలో  ఒకరి సహాయం మరొకరు తీసుకుంటూ ఉంటారు.  ఒకరి సమస్యలు మరొకరు ఆలోచించి పరిష్కరించుకుంటూ ఉంటారు. చిన్న విషయమైనా సరే.. థ్యాంక్స్ చెప్పడం, ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం, ఒకరిని మరొకరు పొగుడుకోవడం వంటివి ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ను మరింత దృఢంగా మారుస్తాయి. ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉండేలా చేస్తాయి.                                    *రూపశ్రీ.

ఇలా చేశారంటే చాలు అరటిపండ్లు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటాయ్..!

   అరటిపండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఉండే పండు. ఉపవాసాలు ఉండే వారి నుండి భోజనం తరువాత ఏదైనా పండు తినాలనుకునే వారి వరకు చాలామంది అరటిపండ్లు తినడానికే మొగ్గు చూపుతారు.  రోజూ ఓ అరటిపండు తినాలని చాలామందికి  ఉంటుంది. కానీ అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే నల్లగా మారి కుళ్లిపోతుంటాయి. ఇలాంటి పండ్లు తినబుద్ది కాదు.  కానీ మార్కెట్లో మాత్రం అరడజను నుండి డజను మాత్రమే కొనుగోలు చేయగలం.  అరటిపండ్లు కొన్న తరువాత ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలన్నా..  వాటిని తాజాగా తినాలన్నా ఈ కింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అరటిపండ్లు తాజాగా ఉండాలన్నా,  త్వరగా నల్లబడకుండా ఉండాలన్నా వాటిని కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడా నల్లగా లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.   కొనుగోలు  చేస్తున్న పండ్లలో ఏదైనా ఒక పండు   మెత్తగా లేదా నల్లగా ఉన్నట్టు కనిపించినా  వాటిని కొనకూడదు.  ఎందుకంటే ఇలాంటి పండ్లు ఉంటే ఆ పండ్ల మొత్తాన్ని నిల్వ చేసినప్పుడు అవి త్వరగా పాడైపోతాయి.  అరటిపండ్లను అమ్మేవారు పండ్లను ప్లాస్టిక్ కవర్ లో ఇస్తుంటారు.  వాటిని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే  కొనుగోలు చేసిన ప్లాస్టిక్ కవర్ ను తొలగించాలి. అరటిపండ్లు వచ్చిన సంచిలో  ఇథిలీన్ వాయువు పేరుకుని ఉంటుంది.  పండ్లను కవర్ లోనే అలాగే ఉంచితే..  అరటిపండు పండే ప్రక్రియ వేగం పెంచుతుంది. అందుకే  అరటిపండ్లను ఇంటికి తీసుకువచ్చి వేరొక కవర్ లోకి మార్చాలి. అరటిపండ్లు నల్లగా, మెత్తగా కాకుండా ఉండాలంటే అరటి పండ్ల తొడిమ  భాగాన్ని ప్లాస్టిక్‌ కవర్ తో కవర్ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. . దీనివల్ల అరటిపండు త్వరగా పండదు, తాజాదనం అలాగే ఉంటుంది. అరటి గుత్తి కాండంపై ప్లాస్టిక్ కవర్ ను  కప్పే బదులు ఒక్కో అరటి కాండం విడివిడిగా చేసి వాటిమీద కప్పి ఉంచినా  అరటి పండు పక్వానికి వచ్చే ప్రక్రియ మందగిస్తుంది. అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అరటిపండ్లు మాత్రమే కాకుండా ఇతర పండ్లు కూడా ఎథిలీన్ వాయువును విడుదల చేస్తాయి.  పండ్లు అన్నీ ఒక్కచోట ఉండటం వల్ల చాలా  పక్వానికి గురయ్యేది ఇందుకే. అందుకే అరటిపండ్లను ఇతర పండిన పండ్లతో ఉంచడం మానుకోవాలి. అరటిపండ్లను విడిగా ఉంచితే అవి త్వరగా పండవు,  తాజాగా ఉంటాయి. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచే బదులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఒక గిన్నెలో అరటిపండ్లను తలక్రిందులుగా ఉంచాలి. అరటిపండ్లను ఏ కంటైనర్ లో అయినా పెట్టి గట్టిగా నొక్కి ఉంచకూడదు. దాని బదులు వాటిపై  గాలి ఉండే విధంగా వాటిని నిల్వ చేయాలి. అరటిపండ్లను అంగళ్లలో అమ్మే వారిలాగా హుక్ కు వేలాడదీయబడం వల్ల  అవి తొందరగా పక్వానికి లోను కావు.  వీటికి గాలి బాగా తగులుతూ ఉంటుంది కాబట్టి అవి తొందరగా పక్వం చెందవు.                                            *రూపశ్రీ.

చాణక్యుడు చెప్పిన మాట..  ఇంటి యజమానికి ఈ లక్షణాలుంటే కుటుంబం నాశనమే..!

  ప్రపంచంలోని అన్ని దేశాలలోకి భారతదేశానికి, ఇక్కడి కుటుంబ వ్యవస్థకు చాలా ప్రత్యేకత ఉంటుంది.  భారతదేశ కుటుంబంలో తండ్రిని ఇంటి పెద్దగా భావిస్తారు.  ప్రతి కుటుంబానికి ఇంటి పెద్దనే మార్గనిర్థేశనం చేస్తాడు. కుటుంబ సభ్యుల మంచి చెడులు ఇంటి పెద్దనే చూసుకుంటాడు. ఎవరికీ ఏ లోటు రాకుండా ఇంటి పెద్దనే అందరి పట్లా బాధ్యతగా ఉంటాడు. ఇంటి పెద్దలో మంచి గుణాలు, అలవాట్లు,  మంచి నడవడిక ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఇంటి పెద్దకు కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందట. ఇంతకీ ఇంటి పెద్దకు ఉండకూడని లక్షణాలేంటో తెలుసుకుంటే.. కుటుంబ పెద్ద తన సోదరులతో ఎల్లప్పుడూ మంచి సంబంధాలను కొనసాగించాలట. కుటుంబంలో సోదరభావం ఉంటే కుటుంబం మొత్తం ఒకరికొకరు బలంగా ఉంటారట. ఇది జరగకపోతే, ఇంట్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది.  ఆ ఇల్లు ఏ విషయంలోనూ ఐక్య భావంతో ఉండదు. కుటుంబంలో ఎదుగుదల అనేది ఉండదు. ఇంటి పెద్దలు మొదట నియమాలను పాటించాలి.  ఆ తరువాత కుటుంబ సభ్యులను కూడా నియమాలను పాటించమని చెప్పాలి. అప్పుడే అది కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇంట్లో పెద్దలు ప్రతి ఒక్కరికీ నియమాలు, నిబంధనల గురించి చెప్తారు కానీ వాటిని స్వయంగా పాటించరు. అలాంటి ఇంట్లో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అందుకే సభ్యులతో పాటు ఇంటి పెద్దలు కూడా  నియమాలను పాటించాలి. కుటుంబ సభ్యులకు  స్ఫూర్తిగా ఉండాలి. ఇంటి పెద్ద ఆహారం వృధా చేస్తే ఆ ఇంట్లో శుభాలు ఆగిపోతాయి. చాణక్యుడు చెప్పిన దాని  ప్రకారం ఇంట్లోని అన్ని వస్తువుల విలువను ఇంటి పెద్ద   అర్థం చేసుకోవాలి. ఆహారం, నీరు,  డబ్బు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉంటే దానిని పరిష్కరించే బాధ్యత ఇంటి యజమానిపై ఉంటుంది. ఇంటి పెద్ద ఎవరి పట్లా వివక్ష చూపకూడదు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాలి. ఇలా చేయకుంటే అందరిలో విభేదాలు వస్తాయి. ఇంటి పెద్దలు ఎప్పుడూ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేయాలి.  పిల్లల భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలి. అనవసరంగా ఖర్చు చేస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది.                                                   *రూపశ్రీ.

అబ్బాయిలలో ఈ విషయాలు అమ్మాయిలకు తెగ నచ్చుతాయట..!

  అమ్మాయిలు, అబ్బాయిలు.. ఈ జెండర్ మధ్య బేధమే పెద్ద అట్రాక్షన్. అబ్బాయిల పట్ల అమ్మాయిలు.. అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆకర్షితులవడం చాలా కామన్. వ్యక్తిత్వం వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, స్టైల్ వల్ల కావచ్చు.. ఏదో ఒక విషయానికి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం అనేది మాత్రం జరిగేదే. అయితే అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలను చూసి ఆకర్షితులైతే మనసులో దాచుకోలేరు. ఆ ఆకర్షణ ఎక్కువ రోజులు కొనసాగి అదలా ప్రేమగా మారే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరైనా అబ్బాయి తనకు నచ్చినా, అబ్బాయిలో కొన్ని విషయాలు నచ్చినా అస్సలు బయట పడరు. బయటకు చెప్పరు కూడా. అమ్మాయిలకు అబ్బాయిలలో నచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి వైపు ఓ లుక్కేస్తే.. ఫొటోలంటే చాలా ఇష్టం.. అమ్మాయిలకు ఫొటోలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తనకు నచ్చిన అబ్బాయితో ఫొటో దిగడమంటే ఎక్కడలేని సంతోషం వారిలో ఉంటుంది. అబ్బాయిలు తమకు తాము ఇద్దరికీ కలిసి ఫొటోలు తీయాలని, వీడియోలు తీయాలని  అమ్మాయిలు కోరుకుంటారు. ఇలా ఫొటోలు తీసే అబ్బాయిల పట్ల వారు మరింత ప్రేమతో ఉంటారు. ఓపెన్ గా మాట్లాడటం.. ఓపెన్ గా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.  జీవితం గురించి ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఇద్దరికి సంబంధించిన కలల గురించి ఓపెన్ గా మాట్లాడటం, ఏదైనా విషయం గురించి లోతుగా మాట్లాడటం లేదా చర్చించడం మొదలైనవి చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం చాలా డీప్ గా ఉన్నట్టు వారు ఫీలవుతారు. అంతేనా అమ్మాయి చెప్పే విషయాన్ని శ్రద్దగా వినేవారు అయితే ఇక అమ్మాయిలకు చాలా పిచ్చి ప్రేమ ఏర్పడుతుంది.  అందుకే అమ్మాయిని ప్రేమిస్తే వారు చెప్పేది శ్రద్దగా వినడం ముఖ్యం. కౌగిలి.. ఒక కౌగిలి బోలెడు ధైర్యాన్ని, నీకు నేనున్నా అనే నమ్మకాన్ని, జీవితం మీద భరోసాను  ఇస్తుంది. తన భాగస్వామి తనను కౌగిలించుకోవడం వల్ల అమ్మాయికి తన భాగస్వామి మీద ప్రేమ పెరుగుతుంది. అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు,  ఆమె దిగులుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు దగ్గరకు తీసుకోవడం, కౌగిలించుకోవడం,  ఆమె వీపును ప్రేమగా నిమరడం లాంటివి చేస్తే తన అలసట, బాధ అన్నీ మర్చిపోతుంది.                                          *రూపశ్రీ.

జీవన సౌఫల్యానికి నియమాలు ఎందుకు అవసరం??

జీవితమే సఫలము అంటాడు ఓ కవి. సఫలం అవ్వడం అంటే జీవితానికి సార్థకత చేకూరడం వంటిది అని అర్థం. ప్రతి మనిషికి జీవితంలో చేసిన పనికి సఫలత లభిస్తే అప్పుడే తృప్తి లభిస్తుంది. లేకపోతే జీవితం ఎప్పుడూ చప్పిడి అన్నంగానూ, చేదు మాత్రగానూ అనిపిస్తుంది. అంటే… మనిషికి జీవితంలో లభించే ఫలితమే అతన్ని తరువాత ఇతర పనులకు సన్నద్ధుడిని చేయడంలో కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఈ సఫలత్వానికి ఇంత శక్తి ఉంటుంది. అయితే ఇలా జీవితం సఫలం అవ్వడానికి పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకుని, అవగాహన పెంచుకుని, వాటిని పాటిస్తూ ఉంటే సఫలం దిశగా అడుగులు సులువు అవుతాయి. జీవితం ఫలవంతం కావాలన్నా, సారవంతం, మూల్యవంతం, మాన్యవంతం కావాలన్నా కొన్ని నియమాలకు లోబడి మనుగడ సాగించాలి. నియమావళి జీవితానికి ఒక అనుకూలమైన, రక్షణ కవచంలా పనిచేసే సరిహద్దు. ఆ సరిహద్దులోనే నడుచుకోవాలి. ఇది జీవితానాకి చట్రం (ఫ్రేమ్) లాంటిది. శిల్పి ఒక శిల్పాన్ని తయారు చేయదలచినప్పుడు, దాని పొడవు, వెడల్పు, ఎత్తు ముందుగానే నిర్ణయించి తదనుగుణంగా బొమ్మను మలుస్తాడు. అలా చేసినప్పుడే బొమ్మ అందాన్ని అందుకొని జనాకర్షకంగా వుంటుంది. అలా కాకుండా కాళ్ళ దగ్గర నుంచీ బొమ్మ చెక్కడం ప్రారంభించి తలదాకా వచ్చేసరికి ఆ రాతిలో చోటు సరిపోకపోవచ్చు. అక్కడి నుంచీ చెక్కటానికి ప్రారంభించాలన్నా చట్రం అవసరం. ఆ చట్రం యొక్క మౌలిక కొలతలే బొమ్మ రూపు రేఖలకు ఆధారభూతాలు.  అలాగే మన జీవిత శిల్పాన్ని తయారు చేసుకోవటానికి నియమావళి ఏర్పరచుకోవాలి. నీతి నియమాలు వున్న వాళ్ళ దగ్గరకు ఇతరులు ధైర్యంగా వెళ్ళ గలుగుతారు. అలాగే వారు ఇతరుల దగ్గరకు వెళ్ళినా, వారు కూడా వీరితో నమ్మకంగా, శాంతంగా, ధైర్యంగా వ్యవహరించ గలుగుతారు. నీతి నియమాలు లేని వారితో ఎవ్వరు పొత్తు పెట్టుకోరు. పొత్తు పెట్టుకున్నా ఎప్పుడు ఏమి చేస్తారో అనే అనుమానం అడుగడుగునా వెంటాడుతూనే వుంటుంది. వారి మధ్య నమ్మకం లోపిస్తుంది.. నియమావళి తయారు చేసి దాఖలు చేస్తే కాని, కంపెనీలను కూడా గవర్నమెంటు వారు రిజిష్టరు చేయరు. ఆ నియమావళిని బట్టి ఆ కంపెనీ యొక్క పని తీరును అంచనా వేయగలుగుతారు. వ్యక్తుల విషయంలో ఎవరికి వారే నియమావళి నిర్ణయించుకోవాలి. చిన్న చిన్న నియమాలతో ప్రారంభించి, క్రమేనా పెద్దవి (అనగా ఆచరించటంలో కష్టం వున్నవి) కూడా లిస్టులో చేర్చుకుంటూ వుండాలి. నియమావళిని ఎన్నుకున్న తరువాత, దాని ప్రకారం జీవితాన్ని సాగించటంలో అనేక సాధక బాధకాలు ఎదురవుతాయి. అయినా ధైర్యంగా ముందుకు సాగుతూ వుండాలి. కొన్ని కొన్ని నియమాల్ని తాత్కాలికంగా ఉల్లంఘించవలసి వచ్చినా, మళ్ళీ వెంటనే ఆ నియమాలను అమలు పర్చటానికి ప్రయత్నించాలే గాని శాశ్వతంగా వదిలేయరాదు. మరి నియమాలంటే ఏమిటి? ఒక మంచి గుణము గుర్తించి ఆ గుణమును మన జీవితంలోకి చొప్పించేందుకు కావలసిన నిత్య సాధనను గూర్చిన దృఢ సంకల్పం. ఇదే నియమం అనబడుతుంది.                                         ◆నిశ్శబ్ద.

మీ ప్రేమ జీవితం సక్సెస్ కావాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించాల్సిందే..!

మానవ జీవితానికి సంబంధించి చాణక్యుడు,  మనకు అనేక విషయాలను బోధించాడు ఇవన్నీ కూడా కౌటిల్యుని శాస్త్రంలో పొందుపరిచారు.  మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు చాణక్యనీతి మార్గం చూపిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన విధానాలు ప్రజల మనోధైర్యాన్ని పెంచేలా పనిచేస్తాయి. చంద్రగుప్త మౌర్యుని గురువుగా ఉన్న చాణక్యుడు కూడా ప్రేమ గురించి చాలా విషయాలు చెప్పారు. అందుకు సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకుందాం. భాగస్వామి పట్ల గౌరవం: తన ప్రేయసిని లేదా భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన సంబంధాన్ని ఎప్పటికీ విడగొట్టుకోలేడని చాణక్యుడు తన విధానంలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. ప్రేమలో నిజాయితీ: తన ప్రేమను పూర్తి నిజాయితీతో నెరవేర్చుకునే వ్యక్తి అంటే మరొక స్త్రీ వైపు చూడని వ్యక్తి, అతని సంబంధం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దీనికి విరుద్ధంగా, ఒక వ్యక్తి తన భాగస్వామి కాకుండా మరే ఇతర స్త్రీ గురించి తన మనస్సులో తప్పుగా భావించినా అతని ప్రేమ విజయవంతం కాదు. ఆనందం: చాణక్య నీతి ప్రకారం, తన జీవిత భాగస్వామికి  మానసిక ఆనందాన్ని అందించే వ్యక్తియే శారీరక సంతృప్తిని కూడా అందిస్తాడు. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎప్పుడూ అడ్డంకులు లేవు. భాగస్వామికి భద్రత:  తన భార్యను సురక్షితంగా ఉంచే వ్యక్తితో అతడి ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఒక స్త్రీ తన భర్తలో తన తండ్రి రూపాన్ని చూసుకుంటుంది.  అలాగే స్త్రీ  తన భాగస్వామి  ఒక తండ్రి లాగా రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది.  అంతే కాదు తాను ఎక్కడికి వెళ్లినా తనకు ఎలాంటి పరిస్థితి వచ్చిన తన భర్త తోడు ఉండాలని ఆమె ఆశిస్తుంది.

ఏకాగ్రతకు, ధ్యానానికి ఉన్న సంబంధం ఏంటి?

ఈమధ్య కాలంలో మనిషి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ధ్యానం. మనిషి మెల్లగా యోగ, ధ్యానం వైపుకు మళ్లుతున్నాడు. అన్ని రోజులూ అన్ని విధాల మార్గాలు ప్రయోగించి, వాళ్ళు వీళ్ళు చెప్పినవి విని ప్రయత్నం చేసి, వాటి వల్ల తనకు ఆశించిన ఫలితం కలగక మన మహర్షులు ప్రసాదించిన యోగ, ధ్యానం వైపుకు మళ్ళీ నడక మొదలు పెడుతున్నారు. అయితే ధ్యానానికి, ఏకాగ్రతకు మధ్య ఉండే సంబంధం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి.  ధ్యానం, ఏకాగ్రతలు శబ్దానికి, అర్థానికి మధ్య ఉన్న సంబంధం లాంటి సంబంధం కలవి. కాబట్టి ధ్యానం అలవడాలంటే ఏకాగ్రత పట్టుబడాలి. ఏకాగ్రత సాధించాలంటే ధ్యానం అలవాటవ్వాలి. గమనిస్తే, మనకు ఏకాగ్రత కుదిరే అంశాలన్నీ ఏదో ఒక రకంగా మన మనసుకు నచ్చేవే. అంటే ఏకాగ్రత అనేది మొదటి మెట్టు అవుతుంది.  పాఠం ఎంత విన్నా గుర్తుండని విద్యార్థికి సినిమా పాట ఒకసారి వినగానే గుర్తుంటుంది. సినిమా పాట ఎంత విన్నా గుర్తుండని వ్యక్తికి ఆ పాటకు హీరోహీరోయిన్లు చేసే నృత్యపు కదలికలు ఒకసారి చూడగానే గుర్తుంటాయి. ఇలా, ప్రతి వ్యక్తి తనకు నచ్చిన అంశం త్వరగా గుర్తుంచుకోగలుగుతాడు. నచ్చని అంశాన్ని ఎంత ప్రయత్నించినా గుర్తుంచుకోలేడు. ఇక్కడ ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోగలగటం అన్నది ఏకాగ్రతకు సంబంధించిన విషయం. ఓ విద్యార్థికి గణితశాస్త్రం అంటే భయం. ఎందుకంటే, లెక్కలు అతడికి అర్థం కావు కాబట్టి, అతడు ఎప్పుడూ ఆ విషయం పట్ల ఎంతో అయిష్టతతో ఉండేవాడు. కానీ, హఠాత్తుగా ఆ విద్యార్థికి లెక్కలు నేర్చుకోవటం పట్ల శ్రద్ధ కలిగింది. తోటి తెలివైన విద్యార్థుల వెంటబడి మరీ లెక్కలు చెప్పించుకోవటం ప్రారంభించాడు. రాత్రింబవళ్ళు లెక్కలు సాధన చేయటం మొదలుపెట్టాడు. దాంతో అతడు ఆ తరగతిలో లెక్కల్లో మంచి మార్కులు సాధించటమే కాదు, భవిష్యత్తులో మంచి ఇంజినీరయ్యాడు. అయితే అతడికి హఠాత్తుగా లెక్కలపై ఆసక్తి కలగటానికి కారణం ఏంటి అనిపిస్తుంది అందరికీ…  లెక్కల తరగతికి కొత్త టీచర్ రావటమే అందుకు కారణం. ఎందుకో ఆ టీచర్ అంటే విద్యార్థికి మక్కువ కలిగింది. అతడి మెప్పు పొందాలన్న తపన కలిగింది. మెప్పు పొందాలంటే మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలంటే, లెక్కలు రావాలి... ఇలా లెక్కలపై ఆసక్తి కలిగేందుకు టీచర్ ప్రేరణగా నిలిచాడన్నమాట. అంటే, మన మనసుకు నచ్చని విషయమైనా, ఏదో ప్రేరణ లభిస్తే. మనసు పెట్టే విషయంగా మారుతుందన్నమాట, పై ఉదాహరణలో విద్యార్థికి ప్రేరణ టీచర్ నుంచి లభించింది. ఈ ప్రేరణ వ్యక్తికి తన తల్లిదండ్రుల నుంచి లభించవచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ  నుండి లభించవచ్చు. సమాజం నుంచి లభించవచ్చు. సంస్కృతీ సంప్రదాయాల నుంచి లభించవచ్చు. మొత్తానికి ఇలా లభించిన ప్రేరణను సరైన రీతిలో ఉపయోగించుకుని పైకి ఎదగటంలోనే వ్యక్తి వ్యక్తిత్వం ప్రధానపాత్ర వహిస్తుంది. అంటే ఇక్కడ ఏకాగ్రత కావాలి అంటే ప్రేరణ కూడా ఉండాలన్నమాట.                                       ◆నిశ్శబ్ద.    

ఛాలెంజ్ తీసుకోండి

సాదారణంగా ప్రతి ఒక్కరు ఏదైనా చేయాలని అనుకునేముందు తమ శక్తి సామర్త్యాలు తరచి చూసుకుంటూ ఉంటారు. కొందరు అయితే అది మనకు తగిన పని కాదు అనుకుంటారు. దాని వల్ల జరిగేది ఏమిటి?అనుకున్నది, కాస్త ఆశ పడినది, జీవితంలో కావాలని అనుకున్నది దూరమైపోవడం.  అంతకు మించి ఇంకా ఏమైనా ఉందా? ఎందుకు లేదు!! అలా ఏదో శక్తి సామర్త్యాల పేరుతో దాన్ని వదిలేసుకోవడం వల్ల జీవితంలో ముఖ్యమైన దశ నిస్తేజంగా ఉండిపోవచ్చు కదా!! నిజానికి మనిషి ఏదైనా కావాలని అనుకుంటే అందులో నైతికత అంటూ ఉంటే దాని వల్ల జీవితంలో ఎదుగుదలనే ఉంటుంది తప్ప అదఃపాతాళంలోకి పడిపోవడమంటూ ఉండదు.  మరి ఎందుకు భయం!! భయమంటూ ఉంటే అది శక్తి సామర్త్యాల గురించి కంటే నలుగురు ఏమంటారో, ఎలా అనుకుంటారో అనే మీమాంస అధికశాతం మందిలో ఉండటం బాగా గమనించవచ్చు. ఇకపోతే ఇలా చేయాలని అనుకుంటున్నాని ఇంట్లో కావచ్చు, స్నేహితులతో కావచ్చు ఇతరులతో కావచ్చు చెప్పినపుడు ఎక్కువగా ఎదురయ్యే మాట నువ్వు చేయగలవా?? నీకు అంత సీన్ ఉందా అని. అంటే ఇక్కడ మీలోని సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచేసే సంఘటనలు ఎదురవుతాయి. అందుకే ఎప్పుడూ నిరుత్సాహ పరిచే వాళ్ళ దగ్గర చేయబోయే పనుల గురించి ప్రస్తావించకూడదు.  కష్టే ఫలి!! కష్టానికోక సిగ్నేచర్ ఉంది. కష్టాన్ని చేతుల్లో ఒడిసిపట్టాము అనుకోండి అప్పుడు అది విజయం అనే సంతకంగా మారుతుంది. ఇది నిజం కావాలంటే ఒకసారి దాని రుచి చూడాల్సిందే. ఏ పనిని అలా ఒక రాయేద్దాం అనుకోకూడదు. అక్కడే, ఆ నిర్లక్ష్యపు అడుగే అపజయపు మొదటి మెట్టు అవుతుంది. కాబట్టి చేయాలని నుకుని పనిని సీరియస్ గా తీసుకోవాలి. దానికోసం వంద శాతం శ్రద్ధ పెట్టాలి. అపుడు దాని మీద అవగాహన పెరుగుతుంది. పలితంగా దాన్ని ఎలా చేస్తే సమర్థవంతంగా పూర్తవుతుందో తెలిసిపోతుంది. అప్పుడే చేయాలని అనుకున్న పని తాలూకూ విజయం వినయంగా మీకోసం నడుచుకుంటూ వచ్చేస్తుంది. ట్రస్ట్ యువర్ సెల్ఫ్... మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. చేయాలని అనుకునే ప్రతి పని మీది కాబట్టి దాని కోసం ఎలాంటి మీమాంసలు పెట్టుకోకుండా, దాని గూర్చి పూర్తిగా తెలుసుకుని, దానికి తాగినట్టు మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించి తీరగలుగుతారు.  మీతో మీరే!! నిజం చెప్పాలంటే ఎప్పుడు ఎవరితోనూ పోటీ పెట్టుకోకూడదు. పోటీ పెట్టుకుంటున్నాం అంటే మీ శక్తి సామర్త్యాలు ఇతరులతో కంపెర్ చేస్తున్నట్టే కాబట్టి మిమ్మల్ని ఎవరితోనూ కంపెర్ చేసుకోకండి. మీరు నిర్దేశించుకున్న పనిని, లక్ష్యాన్ని సాధించడానికి మీతో మీరే పోటీదారులుగా ఉండాలి.  విజయీభవ!! విజయానికి మొదటి సూత్రం చేయాలని అనుకున్న పనిని చేయడం. అది కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు సరైన ప్రణాళికతో చేయడం. ఎలాంటి అవగాహన లేకుండా దాని గూర్చి తెలుసుకుని విజయం సాధించిన వారి గురించి, వారి ప్రణాళికలు గురించి తెలుసుకుని వాటి నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. మనసుంటే మార్గం!! కొన్ని సార్లు చాలామంది అది చేయాలి ఇది చేయాలి అని మనసులో ఎన్నో అనుకుంటారు కానీ వాటిని ఆచరణలో పెట్టకుండా కాలక్షేపం చేస్తుంటారు. దానికి ఎన్నో కారణాలు కూడా చెబుతుంటారు. కాబట్టి ముందు చేయాల్సింది అలా కాలక్షేపం చేసే మెంటాలిటీ ని వదిలేయడం. చేయలనుకున్న పనివల్ల జీవితం ఎంత మెరుగవుతుందో అంచనా వేసుకోవడం. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా నెట్ లో బోలెడు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి అన్ని విధాలుగా మంచి దారులు ఉన్నట్టే. కావాల్సింది కేవలం మనసు పెట్టడమే!! ఇట్లా అన్ని విధాలుగా తెలుసుకుని మీతో మీరు ఛాలెంజ్ తీసుకోండి. అందులో విజయం సాదించండి. ఆ కిక్కే వేరప్పా…. దాన్ని అనుభూతి చెందాల్సిందే  తప్ప మాటల్లో ఫీల్ కాలేం!!                                                                                                                               ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ అలవాట్లు ఉంటే ఎంత సంపాదించినా చిల్లిగవ్వ మిగలదు.!

చాణక్య నీతి ఆచార్య చాణక్యుడి మాటలు తప్పు అని రుజువు కాలేదు. ఈ కారణంగానే నేటికీ చాలామంది చాణక్యుడి మాటలను అనుసరిస్తున్నారు. మీరు మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, మీరు అతని విధానాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.ఆచార్య చాణక్యుడి తత్వానికి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రాముఖ్యత ఉంది. ఆచార్య చాణక్యుడి మాటలు ఎప్పుడూ తప్పు కాదంటారు. నేటికీ ప్రజలు దీనిని పాటించడానికి కారణం ఇదే.మీరు మీ జీవితంలో విజయం సాధించాలంటే, మీరు అతని సూత్రాల నుండి కొన్ని చిట్కాలను తీసుకోవచ్చు.అయితే కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తులు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదని చెప్పాడు చాణక్యుడు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. సోమరిపోతుల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, సోమరితనం  ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు. అలాగే లక్ష్మీదేవి కూడా అలాంటి వారిని అనుగ్రహించదు.అలాంటి పరిస్థితిలో లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం కోరుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి. పిసినారితనం: సహాయం చేయడంలో లేదా దానధర్మాలు చేయడంలో కఠోరమైన వ్యక్తి తన జీవితాంతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడని చాణక్యుడి తత్వం చెబుతోంది. ఎందుకంటే దానధర్మాలతో సంపద పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు. దేవుడు కూడా సంతోషిస్తాడు. డబ్బు వృధా : చాణక్య నీతి ప్రకారం, తమ చెడు సమయాల కోసం డబ్బును పొదుపు చేయని, అనవసరంగా ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. అంతేకాదు, అలాంటి వారి జీవితం ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి డబ్బు విలువను గుర్తించాలి. అలాగే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి.  

మానసిక ఆరోగ్య సమస్యలకు ముచ్చటైన వైద్యమిదిగో!

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. వీటిని జయించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి విషయంలో ఫలితాలు మాత్రం కాస్త నిరాశగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా దానిలో సఫలం అయ్యేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితి వల్ల కలిగేది. దీన్ని జబ్బు కింద జమచేసి చాలా కాలమే అయినా దీనికి తగిన మందు మాత్రం కనుగొనలేకపోయారు. అయితే ఒత్తిడి జయించడానికి ఎప్పుడూ చేసే ప్రయత్నాలే కాకుండా దాని గురించి అందరినీ అలర్ట్ చేస్తూ ఒత్తిడి భూతానికి దూరంగా ఉండేందుకూ, ఒత్తిడి సమస్య ఉన్నపుడు దాన్ని జయించడానికి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైన వాటిని చర్చించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. దాన్నే వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన దీన్ని నిర్వహిస్తారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఒత్తిడిలోకి జారుకుని ఎంతోమంది బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నవారు ఉన్నారు. ఎంతోమంది సెలెబ్రిటీస్ జీవితాలు కూడా ఇలాంటి సమస్య వల్ల ముగిసిపోయాయి.  మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది?? బాధ్యతలు ఎక్కువైనప్పుడు, మనిషిని అర్థం చేసుకోనపుడు మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. తగినంత విశ్రాంతి దొరకకపోతే ఆ అలసట కాస్తా ఒత్తిడిగా మారుతుంది. అది పెరుగుతూ వెళ్ళేకొద్ది విశ్వరూపం దాలుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనీసం దాన్ని పంచుకునేవారు లేకపోవడం, వ్యక్తి నలిగిపోతున్నప్పుడు గమనించకుండా వారి మానాన వారిని వదిలేయడం వల్ల మానసిక సమస్య అనేది ప్రమాదకర సమస్యగా రూపాంతరం చెందుతోంది. ఏమి చెయ్యాలి?? మానసిక సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఫాలో అవ్వాలి. వాటి వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు.  మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవాలి!! మనసు భారంగా మారితే ఒత్తిడి తాలూకూ ప్రభావం పెరుగుతుంది. అందుకే మనసును ఎప్పటికప్పుడు తేలికగా మార్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని భరిస్తూ ఉండటం అంటే ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని తిరగడమే. అందుకే ఒత్తిడిని జయించాలంటే మనసును తేలికగా ఉంచుకోవడమే ఉత్తమ పరిష్కారం.  ఇష్టమైన పనులను చేయడం!! ఇష్టమైన పనులు చేయడంలో తృప్తి ఉంటుంది. ఈ తృప్తి మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనిషి ఎన్ని బరువులు మోస్తున్నా తనకు నచ్చిన పని చేస్తున్నాననే సాటిసిఫాక్షన్ మనిషిని హాయిగా ఉంచుతుంది. మంచి నిద్ర!! నిద్ర ఒక గొప్ప ఔషధం. నిద్ర సరిగ్గా ఉంటే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరికేసినట్టే ప్రతి మనిషికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది. రోజు మొత్తం అలసట నుండి శరీరానికి మెదడుకు ఆమాత్రం విశ్రాంతి కచ్చితంగా అవసరం.  ఎమోషన్స్ ని మోయకూడదు!! కొందరు ఏ ఎమోషన్ బయట పెట్టకుండా ఉండటం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం లేదని అనుకుంటూ వుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎమోషన్స్ ని మనిషిలో దాచుకోవడం వల్ల అవి ఒత్తిడిగా మారిపోతాయి. అలాగని అందరి ముందూ కోపం, అసహనం, ద్వేషం వంటివి వ్యక్తం చేయమని అర్థం కాదు. ఎమోషన్ క్రియేట్ అయ్యే వరకు పరిస్థితులను తీసుకెళ్లకూడదు. అలాగే ఎమోషన్స్ ని భూతద్దంతో చూడకూడదు.  భరించకూడదు!! కొన్నిసార్లు కొన్ని పనులను భరిస్తూ చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఎలా ఉంటాయంటే మనిషిని నిమిషం కూడా స్థిమితంగా ఉండనివ్వవు. మీ బాధ్యత కాకపోతే, దాని వల్ల అదనపు ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అనిపిస్తే సున్నితంగా ఆ పనికి నో చెప్పేయచ్చు.  నష్టం కూడా మంచిదే!! కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు వదులుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోవడం మాట నిజమే. కానీ ఆ పనుల వల్ల కలిగే భీకర ఒత్తిడిని సున్నితంగా దూరం చేసినట్టు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కాలం, కాలం చేసే ఒత్తిడి మాయాజలంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒత్తిడి విషయంలో అన్ని రకాల మార్గాలను అన్వేషించి వాటిని అనుసరిస్తే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందులేని జబ్బు అయిన ఈ మానసిక సమస్యలకు మనసుతోను, ఆలోచనలతోనూ వైద్యం చేసుకోవాలి.                                    ◆నిశ్శబ్ద.