లక్ష్మీ రావే మా ఇంటికి!

లక్ష్మీ అంటే మహావిష్ణువు భార్య, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపదలుంటాయి. ఆమె వెళ్లే ప్రతి చోట డబ్బు తిరగడుతూ ఉంటుంది. అందుకే పెద్దలు ఆంటారు డబ్బును, లకహ్మి దేవిని వేరు వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తారు. డబ్బు అంటే లక్ష్మీదేవినే అని అంటారు. డబ్బు దగ్గరుంటే ఈ కాలంలో ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కమర్షియల్ జీవితాల ప్రపంచంలో డబ్బు లేకుండా బతకడం కష్టమే కదా!! కాదని కొందరు వాదించవచ్చు. కానీ ఇలా బతకడం అలవాటు పడిపోయిన మనిషికి డబ్బు లేకపోతే ఏమీ తోచదు. అందరికీ మనసులో ఉంటుంది బోలెడు డబ్బు దగ్గరుండాలని. ఆ డబ్బుతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలని, ఎన్నో నచ్చినవి, అవసరమైనవి తీసుకోవాలని. కొన్ని కలలను తీర్చుకోవాలని. కానీ డబ్బులు ఏమీ చెట్లకు కాయవు కదా!! మరి డబ్బు మనదగ్గరకు ఎలా వస్తుంది?? కష్టపడినా తగినంత డబ్బు చేతికి రావడం లేదని, కష్టానికి తెగగా ఫలితం లేదని చెప్పేవాళ్ళ కోసం కొన్ని డబ్బులు చేతిలో ఒడిసిపట్టే చిట్కాలు!! అనవసరపు ఆడంబరాలు వద్దు!! కొన్ని విషయాల్లో పిసినారితనంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది. కొన్నిసార్లు లేనిపోని మోహమాటాలతో కొన్ని ఆడంబరాలు చేయాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలను సున్నితంగా ఏదో ఒక పని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఎవరూ రూపాయి కూడా చెయ్యి చాచి ఇచ్చేవాళ్ళు లేరండి. సగటు మధ్య మరియు దిగువ తరగతి మనిషికి ఆడంబరాలు నెత్తిమీద కొండంత బరువులా ఉంటాయి.  సింప్లిసిటీ!! నిజం చెప్పాలంటే ఈ సింప్లిసిటీ మనిషిని కమర్షియల్ గా ఎదిగేలా చేస్తుంది. ప్రతిదాంట్లో అతిగా ఉండకపోవడం ఎన్నో ఖర్చులను అవుతుంది. కట్టు బొట్టు నుండి, తిండి విషయం వరకు. వాడే వస్తువుల నుండి ఎక్పెక్ట్ చేయడం వరకు అన్నింటిలోనూ సింప్లిసిటీ ఉన్నవాళ్లు ఖర్చుపెట్టడంలో కూడా అనవసరమైన వాటికి సున్నితంగా దూరం వెళ్ళిపోతారు. పొదుపు సూత్రాలు!! నిజానికి పొదుపు అనేది భార్యాభర్తలు ఇద్దరూ కలసి చేసే ప్లాన్. అయితే ఒక రిలేషన్ లోకి వెళ్లే ముందు నుంచే పొదుపు ప్లాన్ చేయడం వల్ల రిలేషన్ తరువాత చాలా వరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రస్తుతకాలంలో పని చేయకుండా ఇంటిదగ్గరే ఉండే ఆడవాళ్లు చాలా తక్కువ. కాబట్టి పొదుపు చేయడం కూడా సులభమే. నిజానికి మగవాళ్ల కంటే ఆడవాళ్లే పొదుపు విషయంలో ముందుంటారు. అయితే ఆడవాళ్లు చేసే ఖర్చుల గురించి మాత్రం మాట్లాడకూడదు సుమా!! ఇన్వెస్ట్మెంట్!! చాలామంది బంగారం కొనడం, భూములు కొనడం ద్వారా తమ డబ్బును పెంచుకుంటారు. బంగారం, భూములు ఈ వేగవంతమైన కాలంలో అవి కూడా వేగంగా తమ విలువను పెంచుకుంటూ పోతున్నాయి. బంగారం కేవలం పెట్టుకోవడానికి మాత్రమే కాదు ఆర్థిక స్థాయిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక భూములు కూడా క్రమంగా ధర పెరిగేవే. అపార్టుమెంట్లు తప్ప గతిలేని ఈ కాలంలో భూములు బంగారం పండించకపోయినా డబ్బులను పుష్కలంగా సమకూరుస్తాయి. వ్యాపారాలు!! ప్రజలు ఎక్కువగా ఆధారపడే ఏ విధమైన వ్యాపారం అయినా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపాదించడానికే తమ సమయాన్ని వినియోగిస్తూ కనీసం వండుకోలేని మనుషులున్న కాలంలో చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో మంచి రాబడి పొందుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. ఆడవాళ్లు అయితే తమకు రుచికరంగా వండటం వస్తే ఏదైనా బిజినెస్ గా మార్చేయచ్చు. రుచి దొరకక జనాలు చచ్చిపోతున్నారండి బాబు.  పైన చెప్పుకున్నట్టు కొన్ని పాటిస్తే లక్ష్మీ రావే మా ఇంటికి అని మరీ బతిమలాల్సిన అవసరం లేదు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

యుద్దాలకు, ఘర్షణలకు ముగింపు పలకాలంటే ఇదే మార్గం..

  ఇద్దరు వ్యక్తులు, రెండుకుటుంబాలు, ఇరుగు పొరుగు, గ్రామాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ఏ రెండింటిని గమనించినా ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయ భేదం, లేదా ఏదో ఒక అపార్థం ఉండనే ఉంటుంది. ఈ అపార్థాలు సహజంగా సమసిపోతే సమస్యే లేదు. కానీ అవి కాస్తా క్రమంగా పెద్ద సమస్యలుగా మారితే అన్ని రకాల నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇద్దరు మనుషుల మధ్య సంఘర్షణ మితిమీరితే అది ఘర్షణకు దారితీసినట్టు, రెండు ప్రాంతాలు, దేశాలు మధ్య సంఘర్షణ పెరిగితే అది యుద్దాలకు దారితీస్తుంది.  మొన్నటిదాకా జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్దమైనా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దమైనా దీనికి ప్రధాన కారణం సంఘర్షణే. సమస్యలను ఆరోగ్యకరమైన రీతిలో పరిష్కరించుకుంటే  అవి నష్టాలకు దారితీయకుండా సమసిపోతాయి. ఆరోగ్యకరమైన పరిష్కారాలకు ఎప్పుడూ శాంతి అవసరం అవుతుంది. శాంతి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన సంఘర్షణ పరిష్కార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రాముఖ్యత, దీని చరిత్ర, దీని వెనుక కృషి మొదలైన విషయాలు తెలుసుకుంటే.. చరిత్రలో ఏముంది? సంఘర్షణ పరిష్కార దినోత్సవం అనేది శాంతి మార్గంలో సంఘర్షణలను పరిష్కరించే దిశగా అవగాహన పెంపొందించడం. దీన్ని ప్రపంచం యావత్తు జరుపుకుంటారు. అసోసియేషన్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్  రిజల్యూషన్ దీన్ని 2005లో స్థాపించింది. దీని ప్రధానఉద్దేశం  సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా అహింసా మార్గంలో పరిష్కరించడం. ఈ పద్దతుల మీద అవగాహన పెంచడం. పాఠశాలలు, కార్యాలయాలు, న్యాయవ్యవస్థ, కుటుంబం మొదలైన సాధారాణ జీవనశైలిలో కూడా దీన్ని భాగం చేయడం. కూర్చుని, మెల్లగా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే మాట చాలామంది వినే ఉంటారు. అదే దీనికి అన్వయించవచ్చు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతియుతంగా సమస్యలను పరిష్కరిస్తే ఈ ప్రపంచంలో ఎన్నో పెనుముప్పులను ఆపవచ్చు. ఈ ఆలోచనతోనే మహాత్మాగాంధీ, మేరీ క్యూరీ, హోరేస్ మాన్, డోలోరెస్ హూర్టా వంటి మహోన్నత వ్యక్తులు  అహింసా మార్గంలో సమస్యల పరిష్కారానికై  తమ జీవితాన్ని వెచ్చించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఈ తరహా మార్గం వైపు ప్రజలను ప్రోత్సహించడం, తాము ఆ మార్గంలో ప్రయాణిస్తూ ప్రజలను నడిపించడం ఎంతో అవసరం. ఏం చేయొచ్చు.. సమస్య దేశాల మధ్యా, లేదా మనుషుల మధ్య అనే విషయం కాదు. తమకు దగ్గరలో ఎవరైనా హింసా పద్దతిలో వెళుతుంటే వీలైనవరకు వారి సమస్యను పరిష్కరించడం ద్వారా పెద్దగొడవనే అపవచ్చు. మా సమస్య మాది నీకెందుకు అని చెప్పేవారు కొందరు ఉంటారు. అలాంటి వారికి తమ కుటుంబ సభ్యుల నుండి తమ పిల్లల వరకు ఆయా గొడవల వల్ల కలిగే నష్టం, మానసికంగా ఏర్పడే అభిప్రాయాలు ఎలాంటివో తెలియజెప్పాలి. సామాజిక విషయాలను ఎప్పుడూ వ్యక్తిగత అంశాలలోకి తీసుకుని అర్థం చేసుకోకూడదు. వ్యక్తిగత కోపాలు,  గొడవలు ఏమున్నా వాటిని సమాజం మీద రుద్దకూడదు. దీనివల్ల సమాజం మీద ప్రభావం పడుతుంది. ఎంతో కొంత సమాజంలో నివసించే పౌరులకు కూడా నష్టం కలుగుతుంది. అహింస అనేది నాలుగు వ్యాసాలు, రెండు పుస్తకాలు, పది స్పీచ్ లు వింటే అలవాటు అయ్యేది కాదు. ఆలోచిస్తే వచ్చేది. శాంతి ద్వారానే అహింస స్వభావం మనిషిలో అలవడుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రేమ, జాలి, దయ వంటి గుణాలు శాంత స్వభావాన్ని పెంచుతాయి. కోపం, ద్వేషం, అహంకారం, అసూయ వంటి గుణాలకు దూరంగా ఉండాలి.                                                       నిశ్శబ్ద.

నిన్ను నువ్వే రక్షించుకోవాలంటాడు చాణక్యుడు..!!

ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యక్తి, సలహాదారు, వ్యూహకర్త, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. అతని జ్ఞానం, సామర్థ్యాలు భారతదేశ చరిత్రను మార్చాయి. మానవుల సంక్షేమం కోసం తన విధానంలో ఎన్నో ఆలోచనలను ఇచ్చారు చాణక్యుడు.  అవి నేటికీ ప్రసిద్ధి చెందాయి. మీరు ఈ సూత్రాలను పాటించినట్లయితే మిమ్మల్ని విజయాల మెట్లు ఎక్కకుండా ఎవరూ ఆపలేరు. అంతే కాదు, వారి సూత్రాలను అవలంబించడం ద్వారా మనం రోజువారీ జీవితంలో జరుగుతున్న అన్ని కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మనల్ని మనం రక్షించుకోవడానికి చాణక్యుడి ఎలాంటి సూత్రాలు పాటించాలి..? మీ ప్రసంగం మధురంగా ఉండాలి: చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం, ప్రసంగం మధురంగా ఉండే వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలడు. కఠినమైన మాటలు మాట్లాడే వ్యక్తి జీవితంలో విజయం సాధించడం కష్టమే అంటాడు చాణక్యుడు. డబ్బును ఎప్పుడూ విస్మరించవద్దు: చాణక్యుడి విధానం ప్రకారం, ఏ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పకూడదు. మీరు చాలా డబ్బు సంపాదించి ఉంటే లేదా ఆర్థిక సంక్షోభంలో ఉంటే, అలాంటి ఆలోచనలను మీలో ఉంచుకోండి. పొరపాటున కూడా ఇతరులతో పంచుకోవద్దు. ఇది మీకు మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఈ తప్పు చేయవద్దు: మీరనుకున్న విజయాలను సాధించాలంటే...మీ ప్రణాళికల గురించి ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలని చెబుతాడు చాణక్యుడు.  ఎందుకంటే మీరు మీ ప్లాన్ గురించి ఎవరికైనా చెబితే, వారు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల మీరు విజయవంతం కాకపోవచ్చు. ఎల్లప్పుడూ ఓపికతో పని చేయండి: ఏది జరిగినా సహనం కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, వారు ఎల్లప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటే అది మన వల్ల జరగదు. ఈ పనిని మనం చేయగలమనే పాజిటివ్ ఆలోచనతో మొదలు పెడితే...ఈ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎక్కువ ఖర్చు పెట్టకండి: చాణక్య విధానం ప్రకారం, ప్రతి వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. ఎందుకంటే సంక్షోభ సమయాల్లో, డబ్బు మీ గొప్ప మిత్రుడిగా పనిచేస్తుంది. చేతిలో డబ్బు ఉందని ఫిర్యాదు చేసే బదులు వీలైనంత ఎక్కువ పొదుపు చేసేందుకు ప్రయత్నించండి.

కుటుంబం ఇలా ఉంటే ఆ ఇంటి పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారట..!

  జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా,  విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు.  సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే.. 'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం'              దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః । ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని,  మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే.. యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ । విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం . చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం..  ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో,  ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట. తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః । తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః । చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో,  సంతోషంతో ఉంటుందట. నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః. బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం.  అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి.  వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి.  అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.                         *రూపశ్రీ.  

గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేస్తుంటారా? ఈ నిజాలు  తెలుసా?

సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం.  ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు,  సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది.  అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట.  ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. మెడ నొప్పి.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది.  ఇది కాస్తా వెన్నునొప్పికి,  మెడ నొప్పికి దారితీస్తుంది. భుజాలు.. చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు.  సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ  ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది. ఊబకాయం.. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి.  ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి  బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది. టెన్షన్.. ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది.  ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది.  ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో  టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం. పరిష్కారాలు.. సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు  తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది.  చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి.  బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి.  నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.                                                        *రూపశ్రీ.

మూగజీవాల మనుగడ కోసం మానవుడి స్వరం..

    ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.

గాంధీజి చేసిన ఈ ఉద్యమాలు చూసి బ్రిటీష్ ప్రభుత్వం భయపడిందట..!

    మహాత్మాగాంధీ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా జాతిపిత అని పిలుస్తారు. గాంధీ ఫొటో కానీ గాంధీ గురించి ఉపన్యాసం కానీ లేకుండా ఏ జాతీయ పండుగ ముగియదు. ఇక అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతిని జరుపుకోవడం తప్పనిసరి.  అయితే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన 40 ఏళ్ల పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రధాన ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. ఈ ఉద్యమాలు బ్రిటీష్ పాలకులను, బ్రిటీష్ ప్రభుత్వాలను భయపెట్టడమే కాకుండా భారతదేశంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానలు బలోపేతం చేసిన ఈ ఉద్యమాలు ఏంటంటే.. సత్యాగ్రహం.. 1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా గాంధీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. చంపారన్ ఉద్యమం.. 1917లో బీహార్ లోని చంపారన్ రైతుల దోపిడీకి, నీలిమందు విధానానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఖేడా సత్యాగ్రహం.. 1918లో బ్రిటీష్ ప్రభుత్వం పన్ను వసూలుకు వ్యతిరేకంగా గుజరాజ్ లో గాంధీజి రైతుల ఉద్యమానికి న్యాయకత్వం వహించారు. దీన్నే ఖేడా సత్యాగ్రహం అంటారు. స్వదేశీ ఉద్యమం.. గాంధీజి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది 1920 లో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం.. 1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. చౌరీ చౌరా.. 1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన చోటుచేసుకుంది.  దీని కారణంగా గాంధీజి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముగించారు. ఉప్పు సత్యాగ్రహం.. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పు పన్ను విధించింది.  దీనికి వ్యతిరేకంగా గాంధీజి దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు.   శాసనోల్లంఘన ఉద్యమం.. 1930 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం,  పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి. దళిత ఉద్యమం.. మహాత్మా గాంధీ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని 1933లో చేపట్టారు. క్విట్ ఇండియా.. 1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని గాంధీజి 1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.                                                  *రూపశ్రీ.  

పిల్లలు సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు  ఈ విషయాలలో ప్రవర్తన మార్చుకోవాలి..!

పిల్లల పెంపకం ఓ కళ అని అంటారు.  చాలా మంది పిల్లల పెంపకం విషయంలో ఫెయిల్ అవుతుంటారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను జాగ్రత్తగానే పెంచుతుంటాం అని అనుకుంటారు. కానీ పిల్లలు పెరిగి పెద్దయ్యి వారు బాధ్యతగా మారాల్సిన సమయంలో వారి ప్రవర్తనలో ఉన్న తప్పొప్పులు తల్లిదండ్రుల దృష్టిలో పడుతుంటాయి.  కాలం గడిచిపోయాక పిల్లలను మార్చాలన్నా మార్చలేరు.  పిల్లలు చిన్నతనం నుండే సంస్కారంగా ఉండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. అలా చేస్తే పిల్లలు మంచి విలువలతో పెరుగుతారు. చాలా వరకు పిల్లలు తల్లిదండ్రుల నుండే అన్నీ నేర్చుకుంటారు.  వారికి ఇల్లే తొలి బడి అవుతుంది. తల్లిదండ్రులే మొదటి గురువులు,  మొదటి రోల్ మోడల్స్  అవుతారు.  అందుకే  తల్లిదండ్రులు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. దయ.. తల్లిదండ్రులు ఆధిపత్య దోరణి వదులుకోవాలి.  పిల్లల పట్ల అయినా, బయటి వ్యక్తుల పట్ల అయినా ఆధిపత్య ధోరణిలో ఉండటం మంచిది కాదు.  తల్లిదండ్రులు ఆధిపత్య ధోరణిలో ఉంటే పిల్లలు కూడా దాన్నే అలవర్చుకుంటారు.   అందుకే ఆధిపత్య ధోరణికి బదులు ఇతరుల ముందు దయతో మాట్లాడాలి. ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. ఇతరులకు సహాయం చేయాలి.  పిల్లలు కూడా ఇవే అలవాటు చేసుకుంటారు. షేరింగ్.. తమకు ఉన్నదాన్ని ఇతరులకు పంచడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాల్సిన ముఖ్య లక్షణం. కుటుంబ సభ్యులతో అయినా,  బయటివారితో అయినా  షేరింగ్ అనే అలవాటు ఫాలో అవుతుంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. లేకపోతే పిల్లలు కుటుంబం,  పాఠశాల నుండి పెద్దయ్యే కొద్దీ ఎవరికీ ఏమీ పంచుకోవడం అనేది లేకుండా స్వార్థంగా తయారవుతారు. ఇది వారి జీవితానికి చాలా నష్టం చేకూరుస్తుంది. అందుకే తల్లిదండ్రులు షేరింగ్ ను అలవాటు చేసుకోవడం ద్వారా పిల్లలకు కూడా దాన్ని అలవాటు చెయ్యాలి. ఎమోషన్స్.. తల్లిదండ్రులు కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి భావోద్వేగాలను వదిలేయాలి.  పిల్లల ముందు వీటిని ఎప్పుడూ బయట పెట్టకూడదు. భావోద్వేగాలను ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు బయటపెట్టకుండా వాటిని నియంత్రించుకుంటూ ఉంటే పిల్లలు కూడా భావోద్వేగాల పట్ల నియంత్రణలో ఉండగలుగుతారు.   భావోద్వేగాలను నియంత్రించుకోవడం వల్ల వారి జీవితంలో చాలా విషయాలు సవ్యంగా సాగిపోతాయి.   వినడం.. తల్లిదండ్రులు పిల్లలు అయినా, ఇతరులు అయినా చెప్పేది శ్రద్దగా,  ఓపికతో వినాలి. అలా వింటూంటే పిల్లలు కూడా ఏ విషయాన్ని అయినా శ్రద్దగా వినడాన్ని అలవాటు చేసుకుంటారు.  లేకపోతే తనకు అవసరమైనది, తాను చెప్పాలనుకున్న విషయం పట్ల మాత్రమే పిల్లలు దృష్టి పెడతారు.  ఇది పిల్లలకు మంచిది కాదు. థాంక్స్.. ఇతరులకు కృతజ్ఞత చెప్పడం చాలా గొప్ప గుణం.  చిన్న సహాయం అయినా, పెద్ద సహాయం అయినా ఎదుటివారికి కృతజ్ఞత చెప్పడం వల్ల పిల్లలు కూడా దాన్నే అలవాటు చేసుకుంటారు.  ఇది వారిలో గొప్ప విలువలు పెంచుతుంది.                                                    *రూపశ్రీ.

పనిభారం వల్ల అలసిపోతున్నారా...ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి!

  పనులు మనిషి జీవనశైలిలో భాగం. ఇంటి వద్ద అయినా, బయటకు వెళ్లి అయినా,  వృత్తిలో భాగంగా అయినా ప్రతి ఒక్కరూ పనులు చేసుకుంటారు. ఈ రోజుల్లో విద్య,  ఉద్యోగం,  ఇంటి పనులు, వ్యాపారం.. ఇలా ప్రతి ఒక విషయంలోనూ ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపోయింది.  ఈ ఒత్తిడి కారణంగా చాలామంది డిప్రెషన్, యాంగ్జిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  పని భారం తగ్గితే ఆటోమేటిక్ గా ఒత్తిడి కూడా తగ్గుతుంది.  ఇది మానసిక సమస్యల నుండి బయట పడటంలో సహాయపడుతుంది.  కొన్ని సింపుల్ టిప్స్ తో పనిభారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. పనిని సమయానికి పూర్తీ చేస్తే.. పనిని సమయానికి పూర్తీ చేస్తే ఎలాంటి భారం ఉండదు. అదే పనిని వాయిదా వేసినా ఆలస్యంగా చేసినా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ఇతర కార్యకలాపాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.  ఇవన్నీ కలసి రోజును చాలా గందరగోళం చేస్తాయి. అందుకే ఏ పనిని అయినా ఒక నిర్ణీత సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేసుకోవాలి.   టైం టేబుల్ ఉండాలి.. ప్రతి రోజూ ఉదయాన్నే ఆ రోజు చేయవలసిన పనులేంటో మననం చేసుకోవాలి.  దానికి తగ్గట్టు సమయాన్ని, సమయ ప్రణాళికను,  పనుల విభజనను చేసుకోవాలి. ఇది పనులు పూర్తీ  చేయడాన్ని  సులభతరం చేస్తుంది.  ఒక పని నుండి మరొక పనికి మారడానికి కష్టం ఉండదు. తరువాత ఏం చేద్దాం అని ఆలోచించాల్సిన అవసరం అలలే ఉండదు.  ఒకదాని తరువాత ఒకటి ఒక ప్లో లో పూర్తీ చేయవచ్చు. అయితే మీ పనుల మీద ఇతరుల ప్రభావం, మీ సమయం పట్ల ఇతరుల ఆధిపత్యం లేకుండా చూసుకోవాలి. మార్నింగ్ రొటీస్.. చాలామంది మాకు సమయం సరిపోవడం లేదు అంటూ ఉంటారు.  దీనికి పెద్ద కారణం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం.  ఒకసారి ఉదయాన్నే కనీసం 5 నుండి 6 గంటల లోపు నిద్రలేచి పనులు మొదలు పెట్టి చూడండి.  చాలా పనులు సమయానికి అయిపోతాయి.  ఆఫీసుకు కూడా వేళకు వెళ్లవచ్చు. మొదట్లో ఉదయాన్నే లేవడం వల్ల రోజులో ఏదో ఒక సమయంలో నిద్ర వచ్చినట్టు ఉంటుంది. కానీ ఓ వారం రోజులు అలవాటు అయితే ఉదయాన్నే లేవడం వల్ల  రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు. మానసిక ఆరోగ్యం.. చాలామంది పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోరు. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.  ఎక్కువ సేపు పని మీద ధ్యాస ఉంటే మెదడు, కళ్లు,  మనకు కూడా భారంగా ఫీల్ అవుతుంది. అందుకే ఎక్కువ సేపు పనులు చేసేవారు చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి.  ఆహారం.. శరీరం అలసిపోకుండా ఉండాలంటే ఆహారం కూడా ముఖ్యం.  పనిలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి తినాలి. పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి.  అదే విధంగా రోజుకు 7 నుంి 8 గంటల నిద్ర కూడా ఉండేలా చూసుకోవాలి.   లక్ష్యాలు.. పెద్ద లక్ష్యాలు సాధించాలని అందరూ అనుకుంటారు. తద్వారా గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు.  అయితే చిన్న చిన్న లక్ష్యాలు నిర్థేశించుకుంటూ వాటిని పెద్ద లక్ష్యాలకు దారిగా చేసుకోవాలి.   ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  విజయాన్ని ఒళ్లో వాలేలా చేస్తుంది. సహాయం.. పనులు చేసేటప్పుడు ఎవరి సహాయం అయినా అవసరం అయితే ఎలాంటి మొహమాటం,  మరింకే భయం లేకుండా సహాయం అడగాలి.  తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి.  తెలియని పనిని తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. అది నేర్చుకునే దశను నాశనం చేస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలి.  దీనికోసం వ్యాయామం, యోగా ఫాలో అవ్వాలి.  అలాగే మానసిక  ఆరోగ్యం దెబ్బతినకుండా ధ్యానం,  ప్రాణాయామం వంటివి చేయాలి.  ఒక వేళ ఒత్తిడి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నట్టైతే కౌన్సిలింగ్ అయినా తీసుకోవాలి.                                                *రూపశ్రీ.  

ఇంట్లో ఈ మొక్కలు పెంచితే  డబ్బుకు లోటు ఉండదట..!

డబ్బు మనిషికి తప్పనిసరి అయిపోయింది. మానవ కార్యకలాపాలలో డబ్బుదే కీలకపాత్ర. డబ్బు లేకుంటే మనిషికి గౌరవం లేకపోవడం మాట అటుంచిదే.. జీవనం దుర్బరంగా మారుతుంది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మంచి జీవితం, కన్న కలలు, సమాజంలో ఆర్ధిక హోదా వంటివన్నీ డబ్బుంటేనే నెరవేరుతాయి. అందుకే ప్రతి వ్యక్తి తమకు లోటు లేకుండా డబ్బు ఉండాలని అనుకుంటాడు. అందుకోసం కష్టపడి సంపాదించడమే కాకుండా ఇంట్లో ధనం నిలవడానికి చాలా పరిహారాలు, ప్రయత్నాలు, పూజలు కూడా చేస్తుంటారు. అయితే కొన్ని  మొక్కలు ఇంట్లో పెంచితే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని అంటున్నారు. ఇంతకీ అవేం మొక్కలంటే.. వెదురు మొక్క.. వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందట. ఈ మొక్క ఇంట్లో వారి జీవితాలలో ఆనందాన్ని,  కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచుతుందట.  అందుకే వెదురు మొక్కను పెంచుకోవడం మంచిదంటున్నారు. మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో ఉండే మొక్క. ఈ మొక్క ఇంట్లో ఉంటే పేరుకు తగ్గట్టే ఆర్థికంగా బాగుంటుందని,  ఆ ఇంట్లో ధనం అభివృద్ది చెందుతూ ఉంటుందని అంటారు. అయితే మనీ ప్లాంట్ లో పసుపు రంగు ఆకులు ఉండకుండా చూసుకోవాలి ముదురు ఆకుపచ్చ ఆకులు మాత్రమే ఉండాలి.   పీస్ లిల్లీ.. పీస్ లిల్లీ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.  ఈ మొక్క ఇంటి పరిసరాలలోనూ, ఇంట్లోనూ గాలిని శుద్ది చేస్తుంది.  ఇంటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది.  ఇంటి ఆర్థిక అభివృద్దికి దోహదం చేస్తుంది. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్.. ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ మొక్క ఆకులు పెద్దగా ఏనుగు చెవుల ఆకారంలో ఉంటాయి.  ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి కూడా ఈ మొక్క సహాయపడుతుందట. స్నేక్ ప్లాంట్.. స్నేక్ ప్లాంట్ మొక్క గాలిని శుభ్రపరుస్తుంది.  ఈ మొక్క  ఒకవైపు ఆరోగ్యాన్ని, మరొకవైపు ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ను కూడా ఇస్తుంది. శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు స్నేక్ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకుంటే మంచిది. చైనీస్ మనీ ప్లాంట్.. మనీ ప్లాంట్ భారతీయుల దగ్గర ఒక విధంగానూ, చైనా ప్రజల దగ్గర ఒక విధంగానూ ఉంటుంది.  చైనీస్ మనీ ప్లాంట్ కు ఆకులు గుండ్రంగా ముదురు ఆకువచ్చ రంగులో ఉంటాయి.  ఇవి ధన ఆకర్షణ కలిగి ఉంటాయని అంటారు. అదే విధంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయట. తద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. సిట్రస్ మొక్కలు.. నమ్మరు కానీ సిట్రస్ మొక్కలను ఇంట్లో పెంచుతుంటే అదృష్టం కలిసొస్తుందట. సిట్రస్ పండ్లు ఎలాగో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.  ఇక ఇవి పెరుగుతున్న ఇంట్లో ఆర్థికంగా మంచి అభివృద్ది ఉంటుందట.  సిట్రస్ మొక్కల నుండి వచ్చే సువాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.                                               *రూపశ్రీ.  

ఫోన్లో మాట్లాడే పద్ధతి

సుదూర ప్రాంతాలలో ఉన్నవారు క్షేమ సమాచారాలు తెలుసుకుని, వారితో కనెక్ట్ అవుతారని గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టారు . అయితే ఫోన్ మాట్లాడేటప్పుడు,  ఎటిక్వెట్టే పాటించాలి. Etiquette  అంటే సామాజంలో ఒక సమూహంలో మనం ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు. "పో బోడి నియమాలు పాటించడం అంత అవసరమా"అంటే అవసరమే. ఎందుకంటే మీరు ప్రవర్తించే తీరు అటువైపు మీతో మాట్లాడేవారు మీ పట్ల ప్రతికూల దృక్పథంతో చూసే అవకాశం ఉంది. మీ బంధాలు వీగిపోతాయి. ఏంట్రా బాబు ఈ సోది అని మీతో మాట్లాడాలంటే విసుగు చెందే అవకాశం ఉంది. నిజానికి కొన్ని దేశాల్లో చిన్న వయసు నుండే ఇటువంటి మర్యాదలను నేర్పిస్తారు. అందుకే మా అక్క లాంటివారీ కన్నా అక్కడి చిన్నపిల్లలు ఎంతో మెరుగ్గా, మర్యాదగా మాట్లాడుతారు. ముందుగా ప్రాథమిక మర్యాదల గురించి తెలుసుకుందాం. 1. మొదటి రింగ్ అయినప్పుడే ఫోన్ ఆన్సర్ చెయ్యడానికి ప్రయత్నించండి.  2. నంబర్స్ జాగ్రత్తగా చూసి డయల్ చేయండి.  3. ఒకవేళ రాంగ్ నెంబర్ కు డయల్ చేసినట్టు అయితే, సున్నితంగా మన్నించమని కోరండి. 4. స్పష్టంగా మాట్లాడండి కొందరు ఫోన్లో సరైన సమాధానం ఇవ్వరు. ఆ.. ఊ ల వరకే పరిమితం అవుతారు. వాళ్ళు అవునన్నారో.. కాదన్నారో తెలియక కన్ఫ్యూజన్. మరికొందరు అసలు సమాధానమే ఇవ్వరు. మనం ఎంత సేపు మాట్లాడుతున్నా మౌనంగా వింటూ ఉంటారే కానీ బదులు ఇవ్వరు. 5. ఎంత వీలు అయితే అంత తక్కువ సమయం మాట్లాడడానికి ట్రై చేయండి. 6. అవతలి వ్యక్తి అందుబాటులో, ఫ్రీగా  ఉన్నారా లేదా అని తరచి చూసి మాట్లాడండి.  మీరు ఖాళీగా ఉన్నారని, అందరూ పని పాటా లేకుండా ఉండరు కదా. వారు తమ నిస్సహాయత ను తెలియజేస్తే, నిండు మనస్సుతో అంగీకరించండి. 7. కాన్ఫరెన్స్ కాల్ చేసేటప్పుడు, అవతలి వ్యక్తి నుండి ముందుగా అనుమతి లేకుండా వేరే వ్యక్తులను కలపకండి. అలాగే మీరు కలపబోయే వ్యక్తికి కూడా కాన్ఫరెన్స్ లో ఎవరెవరు ఉన్నారో సూచించండి.  8. రాంగ్ నెంబర్ లకు మొరటుగా సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ సున్నితంగా చెప్పండి. కొన్ని సార్లు పెద్దవారు, చదువుకోని వారు, ఫోన్ ఎలా వినియోగించాలి అని తెలియని వారు, తప్పు నెంబర్లను అనుకోకుండా డయల్ చేస్తారు. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ వస్తె సున్నితంగా సమాధానం ఇచ్చి, సాధ్యమైతే వారికి సహాయం చెయ్యండి. 9. కొత్త నెంబర్లతో ఫోన్ చేస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మాట్లాడండి.  మన వాయిస్ గుర్తుపడతారులే అని మీరేదో మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక నాలంటోల్లు జుట్టు పీక్కుంటారు. 10. మీరెందుకు ఫోన్ చేశారో గ్రహించి, క్లుప్తంగా, సరళంగా మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పండి.  అంతేగానీ మీకు బోర్ కొడుతుందని ఫోన్ చేసి, గంటలు గంటలు అవతలి వ్యక్తి సమయాన్ని తినకండి. వారు ఫ్రీగా ఉంటే మాట్లాడవచ్చు. అదీ వారి అనుమతితో మాత్రమే. ఇంకొందరు వారు చెప్పాలనుకున్న విషయం కాకుండా అన్నీ చెప్పేసి, అసలు విషయం మర్చిపోతారు. వారికోసం ఈ సలహా. 11. ఒక రెండు సార్లు డయల్ చేశాక ఎదుటివారు ఆన్సర్ ఇవ్వకపోతే, మళ్లీ మళ్లీ అదేపనిగా కాల్ చేయకండి. (అత్యవసరం అయితే తప్పదు)  ఇది నేను ఎక్కువగా ఎదుర్కునే సమస్య. నేను ఫోన్ do not disturb mode పెట్టుకున్నా , ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి, డిస్టర్బ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. అదీ పనికిమాలిన కబుర్లు కోసం. 12. చివరగా.. కాస్త బిగ్గరగా, స్పష్టంగా మాట్లాడండి.  మీలో మీరు గొణుక్కుంటూ మాట్లాడితే అవతలి వ్యక్తి మరోలా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు మీరు తర్టీన్ అని చిన్నగా చెప్పారు అది అవతలి వ్యక్తి కి తర్టి అని అర్థం అవ్వొచ్చు.. మీరు సింధు అని చెప్తే వారు హిందూ అనుకోవచ్చు.. అందుకే స్పష్టత అవసరం. కొన్ని రకాల ఫోన్ ముచ్చట్లు..ఇది చదివాక నేను చెప్పిన మర్యాదలు మీకే అర్థమవుతుంది. X: హెల్లో అండి! రాజు గారు ఉన్నారా? Y: లేరు (డబ్ మని వెంటనే ఫోన్ పెట్టేశారు) A: అత్తతో నాకు గొడవ అయ్యింది. రెండు రోజుల నుండి మాట్లాడటం లేదు B: అవునా ఎప్పుడు వెళ్లావ్. నాకూ చెప్తే నేనూ వస్తాగా A:  నేను చెప్పింది విన్నావా? B: sorry!! ఏం చెప్పావు??! X: Hello ఎవరూ? Y:  సమత నిద్ర పోయావా? X:  నేను గ్రీష్మ.. ఈ టైంలో ఎవరైనా పడుకుంటారు కదా అండి.. 🥱 A: Hello రాహుల్ మీతో మాట్లాడవచ్చా? B:  ఆ చెప్పండి.. A:  మొన్న మీరు రాసిన కథ చదివాను..  B:  అది బాలేదు వేరేది తీసుకో (గుసగుసగా).. హా కథల పోటీ ఫలితాలా.. ఎప్పుడు??(గట్టిగా) ఇలా ఉంటాయి అండి..కొన్ని సంభాషణలు.. అందుకే సభ్యత పాటించి, మన ఫోన్ సంభాషణ మర్యాదగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటారు చాణక్యుడు..!!

చాణక్య నీతిలో జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు ప్రస్తావించారు. జీవితంలో  ఏది సరైనది...ఏది తప్పు అని నిర్ణయించుకోవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి.  కానీ కొన్ని పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్య చెప్పారు. అవేంటో చూద్దాం.  ఆచార్య చాణక్యుడు మానవ ప్రవర్తనను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత అతను తన చాణక్య నీతిలో అనేక సూత్రాలను వ్రాసాడు. వీటిని స్వీకరించడం ద్వారా ఒక వ్యక్తి  అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తన నీతి శాస్త్రంలో, ఒక వ్యక్తి ఎవరికీ సమాధానం ఇవ్వకూడదు..వాగ్దానం చేయకూడదు లేదా ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే మూడు పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. లేకుంటే ఆ వ్యక్తి దాని చెడు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఎప్పుడు వాగ్దానం చేయకూడదు? ఆచార్య చాణక్యుడు ప్రకారం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడవచ్చు. ఎందుకంటే  సంతోషంగా ఉన్న సమయంలో, ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలను ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ పరిస్థితిలో ఎవరికీ సమాధానం చెప్పవద్దు: మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల, మీకు కోపం వచ్చినప్పుడు ఓపికపట్టండి.  నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు, దాని వల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి, చాణక్య నీతి ప్రకారం, దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  

పట్టు సాధించాలి అంటే పట్టుకోవడం రావాలి!

ఏ పని అయినా గ్రిప్ వచ్చిందంటే ఆ తరువాత చాలా సులభం అవుతుంది. కొంతమంది ఏదైనా మొదలుపెట్టి ఆ తరువాత నా వల్ల కాదు అని నీరసపడిపోయి వెనకడుగు వేస్తుంటారు. ఇది చాలా తప్పు. అలా చేస్తే అది మిమ్మల్ని మీరు సమస్యలోకి వెళ్ళకుండా చేస్తుందేమో కానీ జీవితంలో గొప్ప ఎదుగుదలను తుంచేస్తుంది.  విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత విషయాలు ఇలా వర్గం ఏదైనా ప్రతి మనిషి కృషి లేనిదే మంచి స్థాయికి వెళ్లలేరు.  కొంతమందికి కష్టపడాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని ఉన్నా ఆ స్థాయికి చేరుకునే సరైన మార్గం తెలిసి ఉండదు. ఒక చెట్టు ఎక్కాలి అంటే దాని మీదకు సూపర్ మాన్ లాగా రాకెట్ స్పీడ్ తో ఎగిరి చెట్టు మీద కూర్చోలేమ్ కదా!! దానికి ఎక్కడ పట్టుకోవాలో, ఏ కొమ్మ మీద అడుగుతూ పెడుతూ ఇంకొంచెం పైకి ఎలా వెళ్ళాలో తెలిసి ఉండాలి. గోల్డ్ స్పూన్ తో పుట్టిన మహామహులు అయినా వాళ్ళ స్థాయిని తగ్గిపోకుండా కొనసాగించాలంటే కొన్ని తెలిసి ఉండాలి.  వాటిని స్కిల్స్ అనచ్చు లేదా ఫార్ములాస్ అనచ్చు అదీ కాకుంటే మనపెద్దోళ్ళు చెప్పినట్టు బుద్ధి ఉపయోగించడం కావచ్చు. కానీ ఖచ్చితంగా కొన్ని అవసరం. విద్యార్థులకు! అవగాహన ఉండాలి. తాము చదువుతున్న వాటిలో తమకు ఇష్టమైన సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ అనేవి మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్నది, జీవితంలో తమకు ఎంతో గొప్ప తృప్తిని ఇవ్వగలుగుతుంది అనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకదానితో సురిపెట్టుకోవాలనేమి లేదు కదా. కాబట్టి ఆల్ రౌండర్స్ అవ్వచ్చు. చదువుతున్నాం అంటే చదువుతున్నాం అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకుని చదివితే అందులో ఉన్న మాటర్ చాలా ఈసీ గా అర్థమైపోతుంది. అలాగే కొన్ని కొండగుర్తులు, షార్ట్ కట్ వేస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎప్పటిదప్పుడు కవర్ చేస్తుంటే ఎక్సమ్స్ టైమ్ లో ఒత్తిడి ఉండదు. ఉద్యోగం! ఉద్యోగంలో ఎదగాలి అంటే అవకాశాలను పట్టుకోవడం రావాలి. యాజమాన్యాలు చెప్పే ప్రాజెక్టు లు, ఇతర పనులలో ఎంప్లాయ్ తన సామర్త్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ ఉన్నవి ఉంటాయి. వాటిని నిరభ్యరంతంగా చేజిక్కించుకోవాలి. టీం వర్క్ లో చురుగ్గా ఉండాలి. వీలైన వరకు వర్క్ ను పెండింగ్ పెట్టకూడదు. ఒత్తిడిని పక్క ఉద్యోగుల మీద చూపించకూడదు. పర్సనల్ విషయాలను ఆఫీస్ లోకి తీసుకురాకూడదు. ఓవరాల్ గా ఎంత ఫ్రెండ్లీ గా అనిపిస్తారో వర్క్ విషయంలో అంతే సీరియస్ గా ఉండాలి. ఇలా ఉన్న వాళ్లే నేడు అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయిలకు చేరినవారు కూడా. వ్యక్తిగత జీవితం! చదువు ఉద్యోగానికి పూర్తిగా వ్యతిరేకమైనది వ్యక్తిగత జీవితం. ఇక్కడ తృప్తి కావాలి కానీ కమర్షియల్ కోణంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ముఖ్యంగా మన అనే ఫీలింగ్ ఉండాలి తప్ప నాది, నేను అనే అహంకారం పనికిరాదు. తల్లిదండ్రులు,  పిల్లలు, జీవిత భాగస్వామి, స్నేహితులు, చుట్టాలు ఇలా అందరికీ తగినంత సమయం అప్పుడప్పుడు ఇచ్చేయ్యాలి. ఫ్యామిలీ గొడవలు ఉన్నపుడు కాంప్రమైజ్ అయిపోవడం మంచిది. అహంతో సాగదీస్తే మనశాంతి పోతుంది. సమస్య ఎక్కువ ఉంటే ఆరోగ్యకరంగా డిస్కస్ చేసుకోవడం బెస్ట్. అంతేకానీ ఆ కొద్ధి సమయంలో ఒకరిమీద ఒకరు కంప్లైంట్ చేసుకోకుండా అందరినీ కలుపుకోవాలి. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వీలైనంత వరకు అటెండ్ అవ్వడం బెస్ట్. ఆఫీస్ లో మీరు బెస్ట్ ఎంప్లాయీ అయితే తప్పకుండా మీకు పర్మిషన్ దొరుకుతుంది. అలాగని నెలకోసారి నాలుగురోజులు లీవ్ అడిగితే ఎవడూ ఇవ్వడు. కాబట్టి దేంట్లో అయినా పట్టు రావాలి అంటే పట్టుకోవడం తెలిసి ఉండాలి మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ.

తృప్తికరమైన రోజు ఎలా సాధ్యమో తెలుసా?

సృష్టిలోని ప్రాణుల్లోకెల్లా మానవ జన్మ అత్యంత మహిమన్వితమైనది. మానవ జన్మ అనేది ప్రతి మనిషికీ ఒకే ఒక్క సారి వచ్చే పరమాద్భుత అవకాశం. ఈ విషయం అంద రికీ తెలిసికూడా ఎందుకు తమ జీవితాలను సార్థకత వైపుకు మళ్ళించలేకపోతున్నారు? ప్రపంచంలో ఉన్న 64 కళలను నేర్పడానికి మనకు రకరకాల విద్యాలయాలు, శిక్షణా శిబిరాలూ ఉన్నాయి. కానీ! జీవితమును జీవించడమనే మహాత్భుతమైన కళను నేర్పించడానికి ఎటువంటి శిక్షణాలయాలూ లేవు. ఎందుకంటే జీవితం ఎవరో ఉదాహరణలతో నేర్పించే పాఠం కాదు. నేర్చుకోవడానికి. ఒకమనిషి జీవితంలో ప్రతి ఒక్క రోజూ ఒక సరికొత్త నూతన అధ్యాయమే. ప్రతి ఒక్కరి జీవితమూఓ సరిక్రొత్త పుస్తకమే. ఎవరి జీవితమూ మరొకరి జీవితంలా ఉండబోదు. ప్రతి పుస్తకమూ మరొక పుస్తకంలా ఉండదు. సరిగ్గా, ఈ విషయాన్నే మనం అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి రోజునూ, ప్రతి నిముషాన్నీ అరుదైన అనుభవాలనూ, అనుభూతులనూ ఆస్వాదించడానికే వచ్చాం. మనం జీవించాలే గానీ ప్రతి నిముషం ఓ సరిక్రొత్త అనుభవాన్ని చవిచూడవచ్చు. మీ ఒక్క రోజు జీవితాన్ని ఓ నాటకం లేదా ఒక సినిమా అని భావించుకుంటే, ఈ చ లన చిత్రంలోని ప్రతి సన్నివేశమూ ఎన్నో మలుపులతోనూ, ఎన్నో గెలుపు ఓటములతోనూ నిండి ఉంటుంది. ఒక చలన చిత్రాన్ని జనరంజకంగానూ. అబ్బురపరిచే కథనంతోనూ తెరకెక్కించడానికి దర్శకుడు ఎంతగానో కృషి చేస్తాడు. ప్రతీ సన్నివేశాన్నీ, కలకలిసిన అనుభవాలతో, ఉత్సాహాలతో, ఉల్లాసాలతో మేళవించి ఓ గొప దృశ్యకావ్యంలా మలుస్తాడు. ఇకపై మీరు మీ జీవితమనే చలన చిత్రానికి దర్శకులు, కథానాయకులుగా ఉండండి. ప్రతి రోజూ మీ చలన చిత్రంలోకి గమ్మతైన దృశ్యాలను తెరకెక్కించండి. ఒక క్షణం కూడా విసుగూ, చిరాకు లేని కథనాన్ని ఆవిష్కరించండి. ప్రతి సన్నివేశాన్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దండి. ప్రతి రోజునూ ఓ అద్భుతమైన చలన చిత్రంలా, ఓ అపురూప దృశ్య కావ్యంలా నిర్మించండి. కానీ! ఈ రోజు మీ చలన చిత్రం ఉన్నట్లు, రేపటి చలన చిత్రం ఉండకూడదు. రోజుకో క్రొత్తకథ, రోజుకో క్రొత్త అనుభూతి, రోజుకో క్రొత్త సంచలనాలతో మీ జీవితాన్ని విలువైన దృశ్య కావ్యాల్లా మార్చుకోండి. ఒక మనిషి రోజులోని 24 గంటల సమయాన్ని సంతృప్తిగా, లాభదాయకంగా జీవించడం నేర్చుకోవడమే జీవించే కళ అంటే.  మీ ప్రతి రోజునీ మీరు క్రొత్త జన్మలా భావించగలిగితే మీరు ఈ పనిని సులభంగా చేయగలుగుతారు. రోజులో ఉదయం పుట్టినట్టు, రాత్రికి మరణించినట్టు భావించాలి. ఇలా చేస్తే   సరిక్రొత్త  చావుపుట్టుకల మధ్యన ఉన్న విలువైన సమయాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతారు. ఇంతటి గొప్ప కాలాన్ని వ్యర్థంగా ఆవిరి చేసుకోకూడదని గ్రహిస్తారు. మనం ప్రతి నిముషాన్నీ  సంపూర్తిగా జీవించడానికే వచ్చామన్న సృహ కల్గి ఉండాలి.  పుట్టిన బిడ్డను పొత్తిళ్ళలోకెత్తుకొని తండ్రి ఆ బిడ్డను చూసి ఎంత మధురానుభూతిని పొందుతూ తన్మయత్వం చెందుతాడో, అలాగే మీ కోసం జన్మించిన మరో రోజును చూసి మీరు అలాంటి తథాత్మ్యాన్నే పొందడి. ప్రతి రోజునూ మీ చంటి బిడ్డగా భావించి, జాగ్రత్తగానూ, ప్రేమతోనూ పెంచిపోషించండి. మనకు ప్రతి దినం ఓ క్రొత్త జన్మ. ఈ 24 గంటల జన్మ కాలంలో మనం గ్రహించగల్గినంత సంవృద్ధిని ఈ ప్రకృతి నుండి గ్రహిద్దాం.. అనుభవించగల్గినంతటి క్రొత్త అనుభవాలను అనుభూతి చెందుదాం. లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించి మరింత జీవితపు ఉత్పాదకతను పెంచుకుందాం. ప్రతి రోజూ సాయంత్రానికల్లా ఓ గొప్ప జీవితాన్ని జీవించామనే మహా తృప్తిని మనం పొందగల్గుదాం.                                                    ◆నిశ్శబ్ద.

రోజూ మనం చూస్తున్న విషయాల్లో దాచిన అద్భుతమైన రహస్యాలు

నిత్యం మనం అనేక వాటిని మన అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కొన్ని ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కానీ అవి మాత్రం అలానే ఉంటాయి. అసలు అవి అలా ఎందుకు ఉన్నాయి అనే ఆలోచనే తట్టదు. అవి మనకు పెద్దగా ఉపయోగపడకపోయినా ప్రతి ఒక్కదాని వెనుక ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అలాంటి నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం. 1. లైన్‌లో సంతకం చేయాలా వద్దా. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు చెక్ బుక్ ను ఉపయోగింస్తాం. చెక్కుపై సంతకం చేసేటప్పుడు చాలా మంది తరచుగా లైన్ పైన సంతకం చేస్తున్నామా లేదా అనే గందరగోళానికి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు భూతద్దం ఉపయోగించి దగ్గరి నుండి చూస్తే మీకు రహస్యం తెలుస్తుంది. సంతకం చేసే చోట ఉంటే లైన్ గురించి అసలు ఆలోచించం. ఈ లైన్స్ ను  పదాలు రిపీట్ అయితే గుర్తించడానికి రూపొందించారు. ముద్రణ చాలా చిన్నగా ఉండటం వల్ల వాటిని కళ్లతో చూస్తే సాధారణ సంతకంలాగే కనిపిస్తుంది కానీ, మైక్రో టెక్నాలజీ అని పిలిచే దాన్ని భద్రతా ప్రయోజనాల కోసం రూపొందించారు. ప్రింటింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకవేళ జిరాక్స్ తెస్తే ఆ లైన్స్ బ్లర్ అయి అస్పష్టంగా కనిపిస్తాయి. 2. ఖాళీ పేజీలు. మీకు చదవడం ఇష్టమైతే, మీరు ఒక నవల లేదా ఏదైనా పుస్తక చదువుతూ ఉంటే పుస్తకాల చివరలో ఖాళీ పేజీలు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.ఆ పేజీలలో ఎక్కువగా పాఠకులు తమ కళాత్మక డ్రాయింగ్‌లతో లేదా ఇతర విషయాలతో నింపి వేస్తారు.  కానీ  వాస్తవానికి ఆ పేజీలు ఎందుకు ఖాళీగా ఉంన్నాయి అన్న విషయం ఎవరూ గమనించరు. ఈ కాలంలో పుస్తకాలు అన్నీ కూడా డిజిటల్‌ ప్రక్రియలో ముద్రిస్తారు. పెద్దగా ఉన్న కాగితపు షీట్లను పేజీలుగా మడిచి ముద్రిస్తారు. అలా ముద్రిస్తున్న వాటిని సిగ్నేచర్ పేపర్ అంటారు. వాటినన్నింటిని కూడా ఒకదానితో ఒకటి జతచేసి బైండ్ చేసి పుస్తకం రూపంలో తీసుకొస్తారు. డిజిటల్‌గా ముద్రించిన వాటిలో ఇలాంటి సిగ్నేచర్ పేపర్లు  2 నుండి 48 పేజీల వరకు ఉండవచ్చు.  ఇదంతా కూడా పుస్తకంలో మ్యాటర్ ఎక్కడితో ముగుస్తుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్ద ప్రచురణకర్తలు తమ పుస్తకాలను ముద్రించడానికి, రచయితలు తన స్వీయ రచనలను ముద్రించడానికి తేడా ఉంటుంది. సాధారణంగా ప్రచురణ కర్తలు పెద్ద కాగితంపైనే అనేక పేజీలను ముద్రిస్తారు. అటువంటి సందర్భాల్లో మీకు కొన్ని ఖాళీ పేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. 3. ట్రామ్ రైలు క్రిస్ - ఓవర్ హెడ్ లైన్ దాటడం. ట్రామ్‌లో లేదా ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్రిస్ క్రాస్ లైన్లను చూడవచ్చు.  ట్రామ్‌లు, కొన్ని రైళ్లు పాంటోగ్రాఫ్ కాటెనరీ వ్యవస్థపై నడుస్తాయి, ఇవి  విద్యుత్తును కాటెనరీ వైర్ నుండి లోకోమోటివ్‌కు మార్చబడుతుంది. స్లైడింగ్ స్ట్రిప్ కాటెనరీ వైర్‌తో విద్యుత్ సంబంధాన్ని ఉత్పత్తి చేస్తుంది. పాంటోగ్రాఫ్ స్ప్రింగ్ సిస్టమ్ ఏ వేగంతో ప్రయాణించినా కూడా దాని సంబంధం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. రాగి తీగలను తాకిన స్లైడింగ్ స్ట్రిప్ కోతకు గురవుతూ పైలాన్‌పై రాపిడీని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ క్రిస్ క్రాస్ లైన్ల అసలు ఉద్దేశం రాపిడి కలిగిస్తూ విద్యుత్ ను వ్యాప్తి చేయడం. 4. స్నార్కెల్స్. స్నార్కెల్స్ అంటే నీటి అడుగున ఈత కొడుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే పైప్ ను స్నార్కెల్స్ అంటారు. వీటికి స్క్యూబా ఎక్విప్మెంట్ కాగా ఆక్సిజన్ టాంకులు ఉండవు. ఈ స్నార్కెల్స్ నీటి బయటి వాతావరణం నుండి గాలిని పీల్చుకోవడానికి శ్వాసక్రియగా పనిచేస్తాయి. చాలావరకు ఈ స్నార్కెల్స్ 30  సెంటీమీటర్ల లోపల వరకు లేదా  40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వరకు పనిచేయవు. ఎందుకంటే ఇవి ఉపరితలానికి దగ్గరగా మనిషి ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఉపరితలానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ నీటిలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసౌకర్యంగా ఉంటుంది. స్నార్కెల్ ద్వారా ఆక్సిజన్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు లంగ్స్ మీద కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ స్నార్కెల్ ఉపయోగించడం వల్ల కార్బన్ డి ఆక్సైడ్‌ను తిరిగి పీల్చుకోవడమే కాకుండా  సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.  

క్రెడిట్ కార్డులతో జర భద్రం తమ్ముడూ!

అప్పు ఆకర్శించని మనిషి ఎవరైనా ఉంటారా ? ఎవరూ ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకుని కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతదే! ఈ ప్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్సిల్ మానేజ్మెంట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనై కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనం క్రెడిట్ కార్డ్ నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని ఔట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవదిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే! ఇక్కడే మనవాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేస్తుంది క్రెడిట్ కార్డ్. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు లాభాలు కూడ ఉన్నాయి అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వేసులుబాటుని కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్ధిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకుల పై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇకనుంచి క్రెడిట్ కార్డ్ వినియోగించే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డుని వినియోగిస్తే మంచిది. డబ్బుని సంపాదించడమే కాదు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్ధిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణల్లో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడో పక్కింటివాడో అయితే కాస్త ఆలస్యం అయినా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధిలు, యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేమీ పట్టవు వాటికి. చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్ట్ నోటీసులు కూడా పంపిస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు కి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దాన్ని వాడండి. ◆వెంకటేష్ పువ్వాడ  

ఆనందమే అందం

హాస్యం-అపహాస్యం!! నవ్వడం ఒక భోగం!! నవ్వించడం ఒక యోగం!! నవ్వలేకపోవడం ఒక రోగం!! అబ్బబ్బా ఏమైనా చెప్పారా జంధ్యాల. కేవలం చెప్పడంతో ఆగిపోలేదే, హాస్యాన్ని జోడించి, ఆ హాస్యంలో కూడా సమాజానికి కాస్తో, కూస్తో సందేశాలు ఇస్తూ సినిమాలు తీసి, నవ్వుల జల్లు కురిపించిన ఘనుడు ఆయన. ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా, ఎంతో ఆరోగ్యవంతమైన హాస్యాన్ని ప్రజలకు సినిమాల ద్వారా అందించినవారు జంధ్యాల. ఇదేమి జంధ్యాల గారి గురించి ఊదరగొట్టడానికి రాస్తున్నది కాదు కానీ ఉత్తమ హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినవారు కాబట్టి చెప్పుకోవలసిందే.  అంతకు ముందు…. పాత సినిమాలు చూస్తే అందులో రేలంగి, రాజబాబు, పేకెటి రంగా, గిరిజ, రమాప్రభ వీళ్ళ నుండి హాస్యాన్ని దోసిళ్ళతో పట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ ఉన్న సినిమాలలో ఎలాంటి భయం లేకుండా హాయిగా నవ్వుకుంటూ సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది. ఆ తరువాత తరువాత తరువాత కాలం మారేకొద్ది కొత్తదనం పేరులో హాస్యాన్ని అపహాస్యం చేయడం  మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా హాస్యం పేరుతో అసభ్య పదజాలన్ని వాడుతున్నారు. వాటిని పిల్లల కోసం ప్రత్యేకం అన్నట్టు కవరింగ్ ఇచ్చి నిజంగా పిల్లల్ని కూడా అసభ్య పదజాలానికి అలవాటు చేస్తున్నారు. షోస్ లో ఏముంది?? టీవీ లో ప్రసారం అయ్యే ప్రతి చానల్ లో ఒక కామెడీ షో తప్పక ఉంటోంది. ఆ షో లలో పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి వాళ్ళతో పెద్ద పెద్ద డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ చూసే ఇంట్లో పిల్లలు కూడా వాటిని అలవాటు చేసేసుకుంటారు. చిన్నా పెద్దా లేకుండా పంచు డైలాగులు వేయడం అన్ని చోట్లా కామన్ అయిపోతోంది. అసలింతకూ అసలైన హాస్యం అంటే ఏమిటి?? అసభ్యత లేకుండా, ఒకరిని నొచ్చుకునేలా చేయకుండా, సరదాగా నవ్వించేది హాస్యం. అలా నవ్వించే వారు నిజంగా నవ్వుల రాజులు, కిలకిల రాణులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడెక్కడుంది అలాంటి హాస్యం. సాడిజంలో హాస్యం ప్రస్తుత టీవీ షోల పుణ్యమా అని ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో, ఒకరి ఇబ్బందిని ఎగతాళి చేయడంలో హాస్యం పాళ్లు పుష్కలంగా నింపేస్తున్నారు. ఫలితంగా ఇళ్లలో పిల్లలు కూడా వాటిలోని హాస్యాన్ని చూస్తూ వాటి ద్వారానే హాస్యాన్ని సృష్టిస్తున్నారు. ఒక అరభై సంవత్సరాల తాతయ్య తన పదేళ్ల మనవడితో ఒరేయ్ నువ్వు ఉద్యోగం చేసి,డబ్బు సంపాదించి నాకు మంచి బట్టలు కొనివ్వాలిరా అని అడిగితే, ఆ పదేళ్ల బుడ్డోడు తన తాతతో  నేను చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుని సంపాదించే వరకు నువ్వు బతికే ఉంటావా?? అప్పుడు నేను బట్టలు కొని నీ సమాధి మీద కప్పుతాలే అంటాడు. ఇలాంటివి ఈ కాలంలో ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు.  పిలల్లో విలువల స్థాయి అంతకంతకూ తగ్గిపోతోంది, వాళ్ళు వయసును మించి మాట్లాడే ప్రతి మాటా బాల్యానికి ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి. ఏమి చేయాలిప్పుడు?? హాస్యం అంటే మనసారా నవ్వుకుంటూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉండాలి. ఆ కోవలోకి చెందినవే అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు మొదలైనవి. ఇవన్నీ పిల్లలకు నవ్వు తెప్పిస్తూనే అందులో నీతిని, విలువలను మెల్లగా మెదడులలోకి జోప్పిస్తాయి. అవన్నీ కూడా పుస్తకాల ద్వారా కాకపోయినా ఆడియో, వీడియో లు అందుబాటులో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి, పిల్లలకు అసభ్య హాస్యాన్ని దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి. పార్కులలో కూర్చుని ఊరికే గట్టిగా నవ్వుతూ నవ్వుతో ఆరోగ్యం అని చెప్పుకునే బదులు, కాసేపు చిన్నపిల్లల్లా మారిపోయి చిన్ననాటి కథల పుస్తకాల్లో పేజీలను తిరిగేస్తూ, వాటిలో నుండి మిమ్మల్ని మీరు వెతుక్కుంటే హాస్యం అపహాస్యం కాకుండా ఆరోగ్యమస్తు అని దీవించడం ఖాయం. కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా??

చాలా మంది జీవితాల్లో భిన్న సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ఒక్కోటి ఒకో విధంగా ఉంటాయి. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒకటి ఆశించే ప్రతి పనీ చేస్తాడు. కొన్ని పనులలో స్వేచ్ఛ ఉంటుంది. అభిరుచి ప్రదర్శించే అవకాశం ఉంటుంది.  అయితే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని నియమాలు లోబడి, కొన్ని పరిధులలో మాత్రమే ఉండి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో చాలా మంది విలువ ఇచ్చే విద్య,  ఉద్యోగం, జీవితాంతం తోడుండే భాగస్వామి, ఇంకా వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ ఎదుగుతూ ఉండే విషయాలు. ఇలా అన్నింటిలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు, అనుకున్నట్టుగా సొంతమవ్వవు అని అంటారు. అందుకే సర్దుకుపోవాలి అనే సూత్రాన్ని అందరి బుర్రల్లో జొప్పించేస్తూ ఉంటారు. అయితే అది నిజమేనా?? జీవితంలో దేన్నీ కోల్పోకుండా, ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా జీవించడం సాధ్యమవుతుందా?? వాస్తవ కోణంలో…. నిజానికి చిన్నతనంలో భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పింది, తల్లిదండ్రులకు నచ్చింది చేసుకుంటూ పోవడంలోనే జీవితాలు సగం అరిగిపోతున్నాయి. ఏమి చదవాలి, భవిష్యత్తులో ఏమి చేయాలి అని నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరు తల్లిదండ్రులు. అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అలా ఉన్నవాళ్లు మంచి విద్యావేత్తలూ, సమాజాన్ని ఎంతో లోతుగా చూసి విశ్లేషించి పరిపక్వత కలిగిన వాళ్ళు అయిఉంటారు. కాబట్టి వాస్తవకోణంలో చూస్తే నీకేం కావాలి అని అడిగే తల్లిదండ్రుల కంటే ఇది తీసుకో, ఇదే తీసుకో అనే వాళ్ళు ఎక్కువ. అభిరుచులు, ఇష్టాలు, ప్రాధాన్యత!! చిన్నతనం నుండి ఏదో ఒక విషయంలో అధిక ఆసక్తి ఉండటం గమనించవచ్చు. అది క్రమంగా పెద్దవుతూ ఉంటే దానిలో నైపుణ్యం కూడా పెంచుకోవచ్చు. కానీ భారతీయ తల్లిదండ్రులలో భవిష్యత్తులో ఉద్యోగాలు చెయ్యాలి. అలా చేయాలంటే చదువే ముఖ్యం. అభిరుచులు గట్రా అన్నీ పనికిమాలినవి అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. దాని కారణంగా ఎంతోమంది సృజనాత్మకతను మొగ్గదశలోనే చంపేసుకుంటున్నారు. అలా ఆకాకుండా సృజనాత్మకతను విద్యకు ఉత్ప్రేరకంగా వాడుకుంటే ఎంతో గొప్ప భవిష్యత్తును చూడవచ్చు.  ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యమే!! కొందరికి కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. ఆ ఇష్టాలు అభిరుచులు చాలా చిన్నవి అయి ఉంటాయి. కానీ వాటిని కాదని పెద్ద వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది జీవితంలో. బహుశా అవి ముఖ్యమైన విషయాలు కూడా కావచ్చు. కానీ ఆత్మతృప్తిని లేకుండా ఎంత పెద్ద పనులు చేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉండనే ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఇష్టమైనవి ఆత్మతృప్తి కోసం చేసుకుంటూ, జీవితంలో ఎదగడానికి అవసరమైనవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినది ఆత్మతృప్తిని, ఆర్థిక ఎదుగుదలను పోల్చి చూడకూడదు. వాటిని మాత్రమే కాదు జీవితంలో ఏ పని ప్రాధాన్యత దానిది అని గుర్తిస్తే ఇది కావాలి ఇది వద్దు అనే ప్రసక్తి లేకుండా ఇష్టమైనవి అన్ని పొందవచ్చు. అవ్వా కావాలా?? బువ్వ కావాలా??  కాదు కాదు  మనసుకు నచ్చింది చేసుకుపోవాలి. నిజమే మరి మనసుకు నచ్చింది ఏదైనా వంద శాతం శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ, ఇష్టంతోనూ చేస్తాము కాబట్టి జయం మనదేరా తృప్తి మనదేరా అనుకోవాలి. అవ్వా, బువ్వా ఒక్కటే తీసుకో అని అంటే ఎలాంటి సందేహం లేకుండా అవ్వతో బువ్వ పెట్టించేసుకోవడం లాంటిదన్నమాట. ◆ వెంకటేష్ పువ్వాడ   

ఆత్మన్యూనత అవసరమా?

  అనగనగా ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడన్న పేరుండేది. ఆ భిక్షువు దగ్గర ఎలాంటి సమస్యకైనా సలహా లభిస్తుందని ప్రజల నమ్మకం. అందుకోసం ఎక్కడెక్కడి నుంచో జనం ఆయన దగ్గర తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చేవారు. ఆ సమస్యలకి భిక్షువు చెప్పే పరిష్కారాలు విని సంతోషంతో తిరిగి వెళ్లేవారు. అలాంటి భిక్షువు ఆశ్రమం ముందు ఒకరోజు రాచరికంతో ఉట్టిపడుతున్న గుర్రపుబగ్గీ ఆగింది. ఆ బగ్గీలోంచి ఆ దేశ సేనాపతులలో ఒకరు దిగారు. సేనాధిపతిని సకల మర్యాదలతో భిక్షువు దగ్గరకు తీసుకువెళ్లారు ఆశ్రమవాసులు.   భిక్షువుకి నమస్కరించిన సేనాపతి తన గోడునంతా ఒక్కసారిగా ఏకరవు పెట్టాడు- ‘స్వామీ! నేను గొప్ప వీరుడినని ఈ రాజ్యమంతా నమ్ముతుంది. ఆ నమ్మకానికి అనుగుణంగా నేను చాలా సాహసకార్యాలే చేశాను. ఎన్నో యుద్ధాలను ఒంటిచేత్తో గెలిపించాను. మరెన్నో ఆక్రమణలను తిప్పికొట్టాను. శత్రుదేశాల వారికి నేనంటే సింహస్వప్నం. రాజుగారికి నా మీద మహా అభిమానం. కానీ ఏం లాభం! నేనెందుకూ పనికిరానివాడినన్న ఆత్మన్యూనత నిరంతరం నన్ను వేధిస్తూ ఉంటుంది. నాకంటే శక్తిసంపన్నులైన రాజుగారిని చూసినా, నాకంటే తెలివితో ఉన్న మంత్రులను గమనించినా..... అంతదాకా ఎందుకు, దైవత్వం ఉట్టిపడే మీవంటి భిక్షువులను చూసినా నేను చాలా అధముడినన్న ఆలోచన బాధిస్తుంటుంది. దీనికి పరిష్కారమే లేదా?’ అంటూ బాధపడ్డాడు. సేనాపతి మాటలను చిరునవ్వుతో విన్న భిక్షువు- ‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. కానీ దీనికి జవాబుని వినేముందు నువ్వు కాస్త ఓపికపట్టాలి. ఇవాళ నాతో తమ బాధలను చెప్పుకొనేందుకు చాలామంది పౌరులు వచ్చారు. వారందరినీ పంపించాక తీరికగా నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఆ అతిథుల గదిలో విశ్రమించు,’ అంటూ సేనానిని పంపారు.   తన సమస్యకు భిక్షువు దగ్గర పరిష్కారం ఉందని తెలుసుకొన్న సేనాని అతిథి గదిలో నిశ్చింతగా విశ్రమించాడు. చుట్టూ ఉన్న ఆశ్రమ వాతావరణం, భిక్షువుల ఆధ్మాత్మిక సాధనలు, నిష్కల్మషమైన మనసుతో అక్కడికి చేరుకుంటున్నా పౌరులు... అతనిలోని అలజడిని కొంతవరకూ ఉపశమింపచేశాయి. ఇంతలో నిదానంగా చీకటి పడింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆశ్రమమంతా వెన్నెల వెలుగుతో నిండిపోయింది. ఆ వాతావరణంతో మైమరచిపోయిన ఉన్న సేనాపతి గదిలోకి భిక్షువు అడుగుపెట్టాడు.   ఉదయం నుంచి అలుపెరగకున్నా కూడా భిక్షువు మొహంలో ఎలాంటి అలసటా కనిపించలేదు. భిక్షువు గదిలోకి అడుగుపెడుతుండగానే ‘నా సమస్య సంగతి ఏం చేశారు స్వామీ!’ అంటూ ఆత్రంగా అడిగాడు సేనాని. ‘ఇవాళ పౌర్ణమి! ఆ నిండు చందమామ ఇచ్చే వెన్నెలతో పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా!’ అన్నారు భిక్షువు.   ‘నిజమే కానీ... ఆ వెన్నెల సంగతి కాస్త పక్కన పెట్టి నా సమస్య సంగతి చూడండి స్వామీ!’ అన్నాడు సేనాని అసహనంగా. ‘ఈ వెన్నెల మహా అయితే నెలకి ఓసారి వస్తుంది. అది కూడా తెల్లవారుజాముకల్లా సూర్యకిరణాల ముందు వెలవెలబోతుంది. చంద్రుడు ఎంత కాంతిని ఇచ్చినా అది సూర్యకాంతి ముందు దిగదుడుపే! అంతమాత్రాన చంద్రుడు పనికిరానివాడంటావా!’ అని అడిగారు.   భిక్షువు ప్రశ్నకి సేనాని నవ్వుతూ- ‘అలా ఎలా సాధ్యం గురువుగారూ! సూర్యడు, చంద్రుడు... రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న గ్రహాలు. దేని అందం దానిదే. దేని లక్షణం దానిదే. సూర్యడు మనకి జీవాన్ని అందిస్తే, చంద్రుడు రాత్రివేళ మనల్ని కాచుకుంటాడు. ఇక ఇలాంటి వెన్నెల రాత్రుల ముందు వంద సూర్యోదయాల అనుభూతి దిగదుడుపే కదా!’ అన్నాడు. ‘చూశావా! నీ సమస్యకి సమాధానం నీ నోటి వెంటే వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరి ప్రత్యేకత వారిదే. ఇతరులతో పోల్చుకుని నీ ఉనికిని చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. మంత్రి నీలాగా కత్తిపట్టలేడు, రాజు నీలాగా సాహసాలు చేయలేడు. కాబట్టి ఇలాంటి పోలికలని కట్టిపెట్టి నీ వ్యక్తిత్వం మీద శ్రద్ధ పెట్టు,’ అంటూ ముగించారు భిక్షవు. సేనాని జీవితంలో అది నిజంగా వెన్నెల కురిసిన రాత్రిగా మారింది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   ..Nirjara